నీట్‌ దుమారం.. పుణె టీచర్‌ అరెస్టు | Pune Teacher Behind NEET Biology Question Paper Leak Arrested | Sakshi
Sakshi News home page

నీట్‌ దుమారం.. పుణె టీచర్‌ అరెస్టు

May 16 2026 5:18 PM | Updated on May 16 2026 5:41 PM

Pune Teacher Behind NEET Biology Question Paper Leak Arrested

న్యూఢిల్లీ:  నీట్‌-యూజీ-2026 బయోలజీ క్వశ్చన్‌ పేపర్‌ను లీక్‌ చేశారని ఆరోపణల నేపథ్యంలో పుణెకు చెందిన బోటనీ టీచర్‌ అరెస్టు చేశారు. పుణెకు చెందిన మనీషా గురునాథ్‌ మంధారే అనే బోటనీ టీచర్‌ను అరెస్ట్‌ చేసిన విషయాన్ని సీబీఐ ఈరోజు( శనివారం, మే 16వ తేదీ) స్పష్టం చేసింది.సీబీఐ విచారణ అనంతరం ఢిల్లీలో సదరు బోటనీ టీచర్‌ను ఆ సంస్థ పేర్కొంది.  దాంతో నీట్‌ పేపర్‌ను లీక్‌ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుమానితుల సంఖ్య 9కి చేరింది. 

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆమెను నిపుణురాలిగా నియమించిన తర్వాత, ఆమె నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్ గ్రాడ్యుయేట్) ప్రక్రియ కోసం పనిచేసిందని సీబీఐ తెలిపింది. ఏప్రిల్‌లో అరెస్టయిన పూణేకు చెందిన మరో నిందితురాలు మనీషా వాగ్మారే ద్వారా ఆమె నీట్ అభ్యర్థులతో పరిచయం ఏర్పరచుకుని, తన ఇంట్లో ఆ విద్యార్థులకు కోచింగ్ తరగతులు ఇచ్చినట్లు గుర్తించారు. 

ఆమె వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం నుంచి ముఖ్యమైన ప్రశ్నలను బయటపెట్టి, వాటిని విద్యార్థుల నోట్‌బుక్‌లలో రాసుకునేలా, అలాగే పాఠ్య పుస్తకాలలో గుర్తించుకునేలా చేసిందని సీబీఐ తెలిపింది. ఈ ప్రశ్నలలో చాలా వరకు మే 3న జరిగిన నీట్-యూజీ అసలు ప్రశ్నపత్రంలోని ప్రశ్నలతో సరిపోలాయని దర్యాప్తు సంస్థ పేర్కొంది.

కాగా, నీట్‌-యూజీ 2026 పేపర్‌ లీకేజీ వెనుక మాస్టర్‌ మైండ్‌ను సీబీఐ అధికారులు నిన్న(శుక్రవారం, మే 15వ తేదీ) అరెస్టు చేశారు. నీట్‌ పేపర్‌ తయారీలో కీలక పాత్ర పోషించిన పూణేకి చెందిన  ప్రొఫెసర్‌ పీవీ కులకర్ణీని అదుపులోకి తీసుకున్నారు.

తన ఇంట్లోనే ఇనిస్టిట్యూట్‌ నడుపుతున్న పీవీ కులకర్ణి .. ఎన్‌టీఏ ఏర్పాటు చేసిన క్వశ్చన్‌ పేపర్‌ కమిటీలో సబ్జెట్‌ ఎక్స్‌పర్ట్‌గా ఉన్నారు. నీట్‌ ఎగ్జామ్‌కు ముందే క్వశ్చన్‌ పేపర్‌ ఆయనకు అందింది. ఆ క్వశ్చన్‌ పేపర్‌ను తాను ఇంట్లో నడిపే ఇనిస్ట్యూట్‌ విద్యార్థికి లీక్‌ చేశాడు. లీకైన ప్రశ్నపత్రాలు, వాటి సమాధానాలను కాపీ చేసి గుర్తుంచుకునేలా తన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు.

మరోవైపు నీట్‌ యూజీ పరీక్ష పేపర్‌ లీకేజీతో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్‌ 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్‌ నిర్వహిస్తుమని కేంద్రం ప్రకటించింది. పేపర్‌ లీకేజీ దుమారం తర్వాత ఈనెల 3వ తేదీనాటి పరీక్ష రద్దయింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement