నీట్ రీ ఎగ్జామ్‌కు ముందే భారీ స్కామ్..నలుగురు అరెస్ట్‌ | NEET 2026 Paper Leak Fraud Busted in Bihar, 4 Arrested Ahead of Re Exam | Sakshi
Sakshi News home page

నీట్ రీ ఎగ్జామ్‌కు ముందే భారీ స్కామ్..నలుగురు అరెస్ట్‌

Jun 15 2026 12:22 PM | Updated on Jun 15 2026 12:28 PM

NEET 2026 Paper Leak Fraud Busted in Bihar, 4 Arrested Ahead of Re Exam

ముజఫర్‌పూర్: నీట్ యూజీ రీ ఎగ్జామ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైన వేళ బీహార్‌లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష వివాదం సర్దుమణగక ముందే, అభ్యర్థుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లక్షలు గుంజాలని చూసిన నలుగురు నిందితులను ముజఫర్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘మాకు డబ్బులు అందాయి, నీట్ ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ పంపుతున్నాం’ అంటూ సోషల్ మీడియా ద్వారా అభ్యర్థులను, వారి తల్లిదండ్రులను బురిడీ కొట్టించిన ఈ గ్యాంగ్ నెట్‌వర్క్‌ను పోలీసులు చేధించారు.

సోషల్ మీడియా వేదికగా ఫేక్ పేపర్ల దందా
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో పట్టుబడిన ఈ ముఠా.. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నీట్ అభ్యర్థులను ట్రాప్ చేసినట్లు ఎస్ఎస్పీ కాంతేష్ కుమార్ మిశ్రా వెల్లడించారు. వివిధ పోటీ పరీక్షల నకిలీ ప్రశ్నపత్రాలను చూపిస్తూ, అవే అసలైన పేపర్లు అని నమ్మించి నిందితులు ఆన్‌లైన్ ద్వారా భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ల ద్వారా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేయించుకుని ఆపై చేతులెత్తేయడం ఈ ముఠా ప్రధాన వ్యూహం.

మనీష్ ఇచ్చిన సమాచారంతో గ్యాంగ్ అరెస్ట్
ఈ నెల జూన్ 2వ తేదీన సికింద్‌పూర్ పోలీసులు మనీష్ అనే వ్యక్తిని నకిలీ పేపర్లు విక్రయిస్తున్నాడనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా, ఈ నీట్ ఫేక్ పేపర్ల స్కామ్ వెనుక ఉన్న అసలు రహస్యాలు బయటపడ్డాయి. మనీష్ ఇచ్చిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ముజఫర్‌పూర్ పోలీసులు.. హర్ష్, అమన్ కుమార్, కన్హయ్య కుమార్, హర్ష్ కనేడియా అనే మరో నలుగురు నిందితులను వేటాడి పట్టుకున్నారు.

జూన్ 21న కట్టుదిట్టంగా నీట్ రీ-ఎగ్జామ్
మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కాగా రద్దయిన ఈ పరీక్షను జూన్ 21న తిరిగి నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ), విద్యా మంత్రిత్వ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. పరీక్ష పారదర్శకత కోసం అధికారులు ‘పరీక్ష కర్మయోగి’ అనే ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement