NEET UG Re-Exam 2026 ప్రతిష్టాత్మక నీట్ యూజీ రీ ఎగ్జామ్కు సంబంధించి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమార్తె 23 ఏళ్ల రియా కుమారి థాపా తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.
ఇంటర్లో 97 శాతం, విషాదం
జూన్ 21న జరగబోయే నీట్ పునఃపరీక్ష (re-examination) కోసం రియా సిద్ధపడుతోంది. వైద్య విద్యలో ప్రవేశం కోసం రాసే NEET-UG పరీక్షలో మొదటి ప్రయత్నంలో ఆమె ఉత్తీర్ణత సాధించలేకపోయింది. అయితే ఈ సారి ఫలితం ఎలా ఉంటుందో అనే ఒత్తిడి మధ్య ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. తన మరణానికి ఎవరూ కారణం కాదంటూ ఒక సూసైడ్ నోట్ కూడా రాసింది. అందులో హిందీలో "ఐ లవ్ యూ, మమ్మీ, పాపా. ఇందులో ఎవరి తప్పూ లేదు" అని పేర్కొనడంతో తల్లిదండ్రుల శోకాన్ని ఆపడం ఎవరి తరమూ కావడంలేదు. రియా గతంలో 12వ తరగతిలో 97 శాతం మార్కులతో స్కూల్ టాపర్గా నిలవడం గమనార్హం.
ఇదీ చదవండి: షాకింగ్ : ఐఏఎఫ్ ఆఫీసర్ భార్యపై అఘాయిత్యం, మత మార్పిడి..!

రాత్రంతా చదువుకుని ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం రియాకు అలవాటు. మంగళవారం మధ్యాహ్నం భోజనానికి పిలవడానికి తల్లి ఆమె గది తలుపు తట్టింది. ఎంతకీ తలుపు తీయకపోవడంతో, తండ్రి సహాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా రియా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. అయితే, చదువుల్లో ఆశించిన విజయం సాధించలేకపోతున్నాననే తీవ్ర నిరాశ, తనను తాను తక్కువగా అంచనా వేసుకోవడమే ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రాథమిక కారణాలని సీనియర్ పోలీస్ అధికారి అంకిత్ కండారీ తెలిపారు.
ఇదీ చదవండి : రూ. 14 వేల నుంచి రూ. 10 లక్షల స్కాం : ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వార్నింగ్
నోట్ : చదువుల ఒత్తిడి, పరీక్షల భయం వల్ల ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నప్పుడు నిపుణుల లేదా కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవడం ఎంతో అవసరం.
ఇదీ చదవండి: ఆమెకు 36, అతనికి 24 : ఇదో విచిత్రమైన పెళ్లి


