చెన్నై: జూన్ 21న జరగబోయే ‘నీట్’ రీ టెస్ట్ కోసం కేంద్ర విద్యాశాఖ ఏర్పాటు చేసిన అసాధారణ భద్రతా చర్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఐఏఎఫ్ ఎయిర్లిఫ్ట్, సీఆర్పీఎఫ్ ఎస్కార్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిఘా వంటి కఠిన నిబంధనలపై మాజీ బీజేపీ నేత కె అన్నామలై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ నేత వినోజ్ పి సెల్వం తిప్పికొట్టారు. ఈ భేదాభిప్రాయాలు చర్చనీయాంశంగా మారాయి.
మిలిటరీ స్థాయి భద్రత.. విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి
నీట్ రీటెస్ట్ కోసం కేంద్రం ప్రకటించిన నిబంధనలు మిలిటరీ తరహాలో ఉన్నాయని అన్నామలై విమర్శించారు. ఎయిర్ఫోర్స్ విమానాల ద్వారా ప్రశ్నపత్రాల రవాణా, ఏఐ నిఘా, 4 లేయర్ల సీసీటీవీలు, పీఎంవో ప్రత్యక్ష పర్యవేక్షణ వంటి చర్యలు రక్షణ సాఫ్ట్వేర్ కొనుగోలును తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. పేపర్ లీకేజీలను అరికట్టే ప్రయత్నాలను స్వాగతిస్తున్నప్పటికీ, గంటల తరబడి తనిఖీలు చేయడం, పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుండి 195 నిమిషాలకు పెంచడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది జాతీయ విద్యా విధానం ఆశయాలకు విరుద్ధమని అన్నారు.
చైనా పరీక్షతో పోలిక: బీజేపీ నేత స్ట్రాంగ్ కౌంటర్
అన్నామలై విమర్శలపై తమిళనాడు బీజేపీ నేత వినోజ్ పి. సెల్వం సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ప్రతి ఏటా చైనాలో 1.3 కోట్ల మంది విద్యార్థులు రాసే ‘గావోకావో’ ప్రవేశ పరీక్షను ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన భద్రతా ప్రోటోకాల్స్ మధ్య చైనా ఈ పరీక్షను నిర్వహిస్తుందని, దాన్ని ఎవరూ 'మిలిటరైజేషన్' అనరని, కేవలం ప్రతిభను రక్షించే చర్యగా భావిస్తారని కౌంటర్ ఇచ్చారు. బయోమెట్రిక్ వెరిఫికేషన్, సీసీటీవీ నిఘా అనేవి ఇంత పెద్ద పరీక్షకు సాధారణ రక్షణ చర్యలని ఆయన పేర్కొన్నారు.
వ్యవస్థపై నమ్మకం ముఖ్యం
భారతదేశం ప్రపంచ అగ్రరాజ్యాలతో పోటీపడుతూ దూసుకుపోతున్న తరుణంలో, పరీక్షల్లో విశ్వసనీయత, పారదర్శకత అత్యంత కీలకమని సెల్వం పేర్కొన్నారు. నిబంధనలను కఠినతరం చేసిన ప్రతిసారీ రాజకీయ భయాందోళనలు సృష్టించడం సరికాదన్నారు. మే 3న జరిగిన నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో రద్దు కాగా, లక్షలాది మంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జూన్ 21న ఈ రీటెస్ట్ నిర్వహిస్తున్నారు. అయితే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ సమస్యలు వంటివి కొత్త సవాళ్లను తెచ్చిపెడుతున్నాయని అన్నామలై హెచ్చరించారు.


