నీట్ పేపర్‌ లీకేజ్‌ దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు | Rajasthan brothers leaked NEET paper for years | Sakshi
Sakshi News home page

నీట్ పేపర్‌ లీకేజ్‌ దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు

May 15 2026 1:14 PM | Updated on May 15 2026 1:30 PM

Rajasthan brothers leaked NEET paper for years

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేపర్‌ లీకేజ్‌ వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగీలాల్, దినేష్ బివాల్‌ సోదరులు గత సంవత్సరాలలో సైతం పరీక్ష పత్రాలు లీక్ చేశారని అధికారులు భావిస్తున్నారు. బివాల్ కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలకు పరీక్షకు ముందే నీట్ 2025 ప్రశ్నపత్రం అందినట్లు అధికారులు దర్యాప్తులో గుర్తించారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాంగీలాల్ కుమారుడు వికాస్ బివాల్ ప్రస్తుతం సవాయ్ మాధోపూర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. లీకైన పేపర్‌ను నెట్‌వర్క్‌లో ముందుకు విక్రయించడంలో ఇతని పాత్ర కూడా ఉందని సమాచారం. ఈ ప్రశ్నపత్రాన్ని ముందుగానే సేకరించి పంపిణీ చేయడానికి 65 లక్షల రూపాయలు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు.

మహారాష్ట్రలో అరెస్టు చేసిన ముగ్గురు వ్యక్తులు (ఒక మహిళతో సహా) అడ్మిషన్ కౌన్సెలర్ల ముఠాలో సభ్యులని, వీరు కూడా వైద్య నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచే వచ్చారని తేలింది. లీకైన పేపర్‌కు మూలకర్తగా గుర్తించిన శుభమ్ ఖైర్నార్ స్వయంగా మెడికల్ విద్యార్థని ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ కుమారుడని అధికారులు గుర్తించారు. అయితే గతేడాది లీకైన నీట్ పేపర్ గుర్గావ్‌లో యష్ యాదవ్‌కు లీకైన పేపర్‌ను అందజేశాడని, అక్కడి నుండి యాదవ్ దానిని రాజస్థాన్‌కు చెందిన మాంగీలాల్ బివాల్‌కు పంపాడని సమాచారం. మాంగీలాల్ తన కుమారుడు వికాస్ బివాల్  తన మేనల్లుళ్ల కోసం ఈ పేపర్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. 

ఈ మొత్తం రాకెట్‌ను కోచింగ్ మాఫియానే నడిపిస్తోందని, ఇప్పటి వరకు అరెస్టు అయిన వారు కేవలం ఒక పెద్ద నెట్‌వర్క్‌లో భాగం మాత్రమేనని దర్యాప్తు సంస్థలు నమ్ముతున్నాయి. సికార్‌లోని కోచింగ్ సెంటర్లు సైతం  నిఘాలో ఉన్నాయి. బివాల్ కుటుంబం ఎవరి కోసం పనిచేస్తుందో ఆ ప్రభావవంతమైన వ్యక్తులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నీట్ 2026 పేపర్ లీకేజీ కేసు ఏదో సాధారణ లీక్ కాదని, ఇది ఏళ్ల తరబడి వ్యవస్థీకృతంగా నడుస్తున్న నెట్‌వర్క్ అని అధికారులు భావిస్తున్నారు. 


పేపర్ లీక్ బయటపడిందిలా

రాజస్తాన్‌లోని జామ్వా రామ్‌గఢ్‌కు చెందిన మంగీలాల్, దినేశ్‌ బివాల్‌ సోదరులు ఏప్రిల్‌ 26న గురుగ్రామ్‌లోని ఓ డాక్టర్‌ నుంచి రూ.30 లక్షలకు నీట్‌ పేపర్‌ను కొనుగోలు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరిలో ఒక వ్యక్తి సికార్‌ టౌన్‌లో నీట్‌కు సిద్ధమవుతున్న తన కుమారుడికి పేపర్‌ను చేరవేశాడు. సోదరులిద్దరూ ఏప్రిల్‌ 29న మరికొందరికి ఈ ప్రశ్నపత్రాన్ని విక్రయించి, సొమ్ము చేసుకున్నారు. జామ్వా రామ్‌గఢ్‌ నుంచే పేపర్‌ సికార్‌లోని ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్‌ ఏజెంట్‌ రాకేశ్‌ కుమార్‌కు చేరింది. 

అతడు ఈ పేపర్‌ను రూ.30,000కు కేరళలోని ఎంబీబీఎస్‌ విద్యార్థికి విక్రయించాడు. తర్వాత ఆ విద్యార్థి సికార్‌లో హాస్టల్‌ను నిర్వహిస్తున్న తన తండ్రికి ఇంటర్నెట్‌ ద్వారా చేరవేశాడు. ఆ తండ్రి ద్వారానే ఈ మొత్తం లీకేజీ వ్యవహారం బయటకు వచ్చింది. రాకేశ్‌ కుమార్‌ ఈ పేపర్‌ను 700 మంది నీట్‌ అభ్యర్థులకు విక్రయించినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement