శుభమ్ ఖైర్నార్ను ప్రశ్నిస్తున్న అధికారులు
ఐదుగురిని అరెస్టు చేసిన సీబీఐ
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు
న్యూఢిల్లీ: నీట్(యూజీ)–2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. జైపూర్లో మంగీలాల్ బివాల్, వికాస్ బివాల్, దినేశ్ బివాల్ను, గురుగ్రామ్లో యశ్ యాదవ్ను, నాసిక్లో శుభమ్ ఖైర్నార్ను అరెస్టు చేసినట్లు అధికారులు బుధవారం చెప్పారు. వేర్వేరు ప్రాంతాల్లో మరికొందరు అనుమానితులను ప్రశ్నిస్తున్నామని, వారిని త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉందని వెల్లడించారు.
పేపర్ లీకేజీ వెనుక మాస్టర్మైండ్గా భావిస్తున్న 30 ఏళ్ల శుభమ్ ఖైర్నార్ను నాసిక్ నుంచి ఢిల్లీకి తరలించారు. అంతకుముందు నాసిక్ మేజి్రస్టేట్ కోర్టు అతడిని సీబీఐ ట్రాన్సిట్ రిమాండ్కు తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం శుభమ్ ఖైర్నార్ను ప్రశ్నిస్తున్నారు. రాజస్తాన్ పోలీసుల సూచన మేరకు నాసిక్ పోలీసులు మంగళవారం ఖైర్నార్ను అరెస్టు చేశారు.
సోదాల్లో భాగంగా అనుమానితుల నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు సహా పలు డిజిటల్ పరికరాలను సీబీఐ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపించనున్నారు. వాటిలోని మెసేజ్ యాప్లను క్షుణ్నంగా తనికీ చేయబోతున్నారు. పేపర్ లీక్ కేసులో సమగ్రమైన, నిష్పక్షపాతమైన దర్యాప్తు నిర్వహించడానికి కట్టుబడి ఉన్నట్లు అధికార వర్గాలు స్పష్టంచేశాయి. రద్దు చేసిన నీట్(యూజీ) పరీక్షకు సంబంధించిన పత్రాలను సేకరించేందుకు బుధవారం సీబీఐ అధికారులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. పరీక్షల ప్రక్రియలో పాలుపంచుకున్న సిబ్బందితో మాట్లాడారు.
గురుగ్రామ్ డాక్టర్ ద్వారా రాజస్తాన్ సోదరులకు..
నీట్ పేపర్ లీక్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజస్తాన్లోని జామ్వా రామ్గఢ్కు చెందిన మంగీలాల్, దినేశ్ బివాల్ సోదరులు ఏప్రిల్ 26న గురుగ్రామ్లోని ఓ డాక్టర్ నుంచి రూ.30 లక్షలకు నీట్ పేపర్ను కొనుగోలు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరిలో ఒక వ్యక్తి సికార్ టౌన్లో నీట్కు సిద్ధమవుతున్న తన కుమారుడికి పేపర్ను చేరవేశాడు. సోదరులిద్దరూ ఏప్రిల్ 29న మరికొందరికి ఈ ప్రశ్నపత్రాన్ని విక్రయించి, సొమ్ము చేసుకున్నారు. జామ్వా రామ్గఢ్ నుంచే పేపర్ సికార్లోని ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏజెంట్ రాకేశ్ కుమార్కు చేరింది.
అతడు ఈ పేపర్ను రూ.30,000కు కేరళలోని ఎంబీబీఎస్ విద్యారి్థకి విక్రయించాడు. తర్వాత ఆ విద్యార్థి సికార్లో హాస్టల్ను నిర్వహిస్తున్న తన తండ్రికి ఇంటర్నెట్ ద్వారా చేరవేశాడు. ఆ తండ్రి ద్వారానే ఈ మొత్తం లీకేజీ వ్యవహారం బయటకు వచ్చింది. రాకేశ్ కుమార్ ఈ పేపర్ను 700 మంది నీట్ అభ్యర్థులకు విక్రయించినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరోవైపు పేపర్ లీక్కు సంబంధించి రాజస్తాన్ పోలీసులు 150 మంది అభ్యర్థులను ప్రశ్నించారు. ఇందులో కోచింగ్ సెంటర్ల పాత్ర ఇప్పటిదాకా బయటపడలేదని పేర్కొన్నారు.
నిందితుడు బీజేపీ సభ్యుడే: కాంగ్రెస్
రాజస్తాన్లో అనుమానితుల అరెస్టు వ్యవహారం రాజకీయంగా దుమారం సృష్టిస్తోంది. నిందితుల్లో ఒకరికి అధికార బీజేపీతో సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపించారు. అరెస్టయిన దినేశ్ బివాల్ బీజేపీ సభ్యుడేనని బుధవారం పేర్కొన్నారు. ఈ మేరకు ఒక పోస్టర్ను కూడా షేర్ చేశారు. అందులో దినేశ్ బివాల్ బీజేపీ యువమోర్చా జిల్లా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, అశోక్ గహ్లోత్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. దినేశ్ బివాల్తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది.


