కోయంబత్తూర్: దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల పరీక్ష ‘నీట్’ చుట్టూ ముసురుకున్న వివాదాలు మరో నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. తమిళనాడులోని కోయంబత్తూర్లో 19 ఏళ్ల నీట్ అభ్యర్థిని అనుకీర్తన బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇటీవలి నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం, ఆపై తిరిగి పరీక్ష రాయాల్సి వస్తుందనే తీవ్ర మానసిక ఒత్తిడి తట్టుకోలేకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషాద ఘటనతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వైఖరిపై దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీసింది.
ప్రశ్నపత్రం లీక్తో..
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. మృతురాలు అనుకీర్తన ఇప్పటికే రెండుసార్లు నీట్ పరీక్ష రాసింది. మెడిసిన్ సీటు సాధించాలనే పట్టుదలతో మూడో ప్రయత్నం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే, దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీ దుమారం రేగడం, బాధితులకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తారనే వార్తలు రావడంతో ఆమె తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఈ పరీక్షల గందరగోళం తన భవిష్యత్తును ఎటు తీసుకెళ్తుందోనన్న ఆందోళనతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం. దేశ రాజధాని ఢిల్లీతో పాటు డెహ్రాడూన్లోనూ ఇటీవలే ఇద్దరు విద్యార్థులు ఇదేవిధంగా పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం.
రగులుతున్న కోయంబత్తూర్..
అనుకీర్తన మృతి వార్త తెలియగానే కోయంబత్తూర్లోని ఈఎస్ఐ (ఈఎస్ఐ) ఆస్పత్రి ప్రాంగణంలో సీపీఐ(ఎం) నాయకులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తమిళనాడు అధికార పక్షం డీఎంకే తీవ్రంగా స్పందించింది. నీట్ పరీక్ష నుంచి తమ రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలనే సుదీర్ఘ డిమాండ్ను మరింత ఉధృతం చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.
‘నీట్’ వర్సెస్ తమిళనాడు
మొదటి నుంచి తమిళనాడు ప్రభుత్వం నీట్ పరీక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రవేశ పరీక్ష కేవలం ఖరీదైన కోచింగ్ సెంటర్లకు వెళ్లగలిగే ఆర్థిక పటిష్టత ఉన్న విద్యార్థులకే లాభం చేకూరుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలలు, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్లస్-టూ లో మంచి మార్కులు సాధించినప్పటికీ వైద్య విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. గతంలో 12వ తరగతి మార్కుల ఆధారంగానే మెడికల్ సీట్లు ఇచ్చేవారని, ఆ విధానమే పేదలకు న్యాయం చేసిందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: New York: భారతీయుడి ప్రాణాలు తీసిన గుర్రపు బగ్గీ


