లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి గోరఖ్పూర్ ఎంపీ, సినీ నటుడు రవి కిషన్పై సరదాగా వ్యాఖ్యలు చేశారు. విమాన కనెక్టివిటీ మెరుగ్గా ఉండడంతో రవి కిషన్ ఏ రోజు గోరఖ్పూర్లో ఉంటారో, ముంబైలో ఉంటారో, ఢిల్లీలో ఉంటారో ఎవరికీ తెలియదని చమత్కరించారు. దీంతో అందరి ముఖాల్లో నవ్వులు పూశాయి. ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు.
గోరఖ్పూర్లో మెరుగైన విమాన కనెక్టివిటీ గురించి మాట్లాడిన యోగి.. నగరంలో భారీ మార్పు వచ్చిందన్నారు. 10 ఏళ్ల క్రితం రోజుకు ఒక్క విమానం మాత్రమే నడిచేదని, ప్రస్తుతం నగరం నుంచి 14 విమానాలు నడుస్తున్నాయని చెప్పారు.
ఆ తర్వాత ప్రేక్షకుల్లో కూర్చున్న రవి కిషన్ వైపు తిరిగి మాట్లాడుతూ.. “రవి కిషన్ గురించి నేను ఎప్పుడూ చెబుతుంటాను. ఆయన గోరఖ్పూర్లో ఎప్పుడు ఉంటారో, ముంబైలో ఎప్పుడు ఉంటారో ఎవరికీ తెలియదు. ముంబైలో బ్రేక్ఫాస్ట్ చేస్తే, గోరఖ్పూర్లో లంచ్ కూడా చేసేస్తారు. ఇక్కడ ముఖం చూపించి మళ్లీ ఢిల్లీకి వెళ్లిపోతారు” అన్నారు. విమాన అనుసంధానం లేకపోతే ఇలాంటి షెడ్యూల్ నిర్వహించడం కష్టమయ్యేదని అన్నారు. యోగి వ్యాఖ్యలపై రవి కిషన్తో పాటు అక్కడ ఉన్నవారు కూడా గట్టిగా నవ్వారు.
గతంలోనూ ఓ సారి ఇలాగే..
ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల ఒకే వేదికపై కనిపించినప్పుడల్లా ఇటువంటి సరదా సంభాషణలు జరుగుతుంటాయి. 2025 జూలైలో గోరఖ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యక్రమంలో, రామ్ఘర్ తాల్ ప్రాంతంలో కాలువపై రవి కిషన్ ఇల్లు కట్టారని యోగి సరదాగా ప్రస్తావించారు. నీరు నిలిస్తే ఆయనపైనా చర్యలు తప్పవని చమత్కరించారు. మురుగు నీటి ప్రవాహం సజావుగా సాగాలంటే కాలువకు కొంత దూరంగా ఇల్లు కట్టాలని సూచించారు. మరో సందర్భంలో అదే ఇంటిని ప్రస్తావిస్తూ, రామ్ఘర్ తాల్ ఒడ్డున ఒక “షీషే మహల్” ఉందని వ్యాఖ్యానించారు. అది రవి కిషన్ ఇంటినే ఉద్దేశించి చేసిన వ్యాఖ్య.


