సాక్షి, ఢిల్లీ: దేశంలో టెలిగ్రామ్ సేవలు మళ్లీ పునఃప్రారంభమయ్యాయి. జూన్ 21న జరిగిన నీట్ రీఎగ్జామ్ రీత్యా భద్రతా కారణాలతో టెలిగ్రామ్ సేవలను జూన్ 22వరకూ టెలిగ్రామ్ యాక్సెస్ తాత్కాలికంగా కేంద్రం నిలిపివేసింది. ఎగ్జామ్ ముగియడంతో సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అదే విధంగా ఈ నెల 30 వరకు టెలిగ్రామ్లోని ఎడిట్ ఆఫ్షన్ తొలిగింపు కొనసాగనుంది. పేపర్ లీక్ మోసాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
జూన్ 21న నీట్ ఎగ్జామ్ ప్రశాతంగా ముగిసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక గణాంకాల ప్రకారం పునఃపరీక్షకు దేశవ్యాప్తంగా 20 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులు హజరైనట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో నీట్ పరీక్షను దాదాపు 3.65 లక్షల మంది విద్యార్థులు రాశారు. కొన్ని ప్రాంతాలలో విద్యార్థులు సమయానికి రాకపోవడంతో విద్యార్థులను పరీక్ష కేంద్రాలలోకి అనుమతించలేదు. దీంతో వారు పరీక్షకు అనుమతించాలని తీవ్రంగా విలపించారు. ఇలాంటి చిన్న చిన్న ఘటనలు మినహా ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది


