సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించబోయే నీట్ (NEET) రీ-ఎగ్జామ్కు హాజరయ్యే అభ్యర్థులకు టీజీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్ను చూపించి, తమ ఇళ్ల నుండి పరీక్షా కేంద్రాల వరకు, తిరిగి ఇంటికి చేరుకోవడానికి ఉచితంగా రాకపోకలు సాగించవచ్చని ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక ఉచిత ప్రయాణ సదుపాయం సంస్థకు చెందిన ఏసీ సర్వీసులు మినహాయించి అన్ని బస్సులలో అందుబాటులో ఉంటుందని ఆయన వివరించారు.
ఈ పరీక్షకు దాదాపు 73 వేల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల మార్గాలలో తగినన్ని బస్సులను నడిపేందుకు ముందస్తుగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 21వ తేదీ మొదటి సర్వీసు నుంచి అర్ధరాత్రి వరకు ఈ సదుపాయాన్ని అభ్యర్థులు వినియోగించుకోవచ్చని, ఏదైనా ఆటంకాలు ఎదురైనట్లయితే, టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040-2345 0033, 6815 3333లలో సంప్రదించవచ్చంటూ ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షకు సకాలంలో చేరుకోవడానికి అభ్యర్ధులు ప్లాన్ చేసుకోవాలని సూచించారు.


