న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ 2026) పరీక్ష మే మూడవ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ ప్రవేశ పరీక్ష దేశవ్యాప్తంగా ఒకే షిఫ్టులో మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు తప్పనిసరిగా మధ్యాహ్నం ఒకటిన్నర గంటల లోపు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకొని రిపోర్ట్ చేయాలి. ఆ తర్వాత గేట్లు మూసివేస్తారు. అందుకే ఎలాంటి ఆలస్యం చేయకూడదు. అడ్మిట్ కార్డు లేకుండా ఎవరినీ పరీక్షకు అనుమతించరు. అడ్మిట్ కార్డుతో పాటు పాన్ లేదా ఓటర్ ఐడి లాంటి ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును ఖచ్చితంగా వెంట తీసుకురావాలి.
డ్రెస్ కోడ్ రూల్స్
నీట్ అభ్యర్థులు సరైన డ్రెస్ కోడ్ పాటించడం తప్పనిసరి. అబ్బాయిలు ప్యాంట్లు, ట్రౌజర్లు లేదా జీన్స్ మాత్రమే ధరించాలి. బూట్లకు బదులుగా చెప్పులు వేసుకోవడం మంచిది. టోపీలు, మఫ్లర్లు, తలను కప్పే వస్త్రాలు ధరించకూడదు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే, వారు సింపుల్ లెగ్గింగ్స్ లేదా ట్రౌజర్లు వేసుకోవాలి. వీరు కూడా సాధారణ శాండల్స్ వేసుకోవాలి. చేతులకు మెహందీ పెట్టుకోకూడదు. పరీక్షా కేంద్రం లోపలికి హ్యాండ్బ్యాగులు, పర్సులు తీసుకురాకూడదు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే, పరీక్షకు అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది
పరీక్షా కేంద్రంలోకి స్మార్ట్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ ఫోన్లు, పేజర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. నిషేధిత వస్తువులను భద్రపరచడానికి పరీక్షా కేంద్రంలో ఎలాంటి లాకర్ సౌకర్యం ఉండదు. ఎవరైనా ఇటువంటివి తెస్తే, వాటిని తమ సొంత రిస్క్ మీద బయట దాచుకోవాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం విద్యార్థులు నీట్ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in ను సందర్శించి, తాజా వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: షాక్ మీద షాక్: ఫలితాలను తిరగతోడిన సట్టా బజార్


