ప్రస్తుత పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరిత, రసవత్తర పోటీకి వేదికగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రెండు దశల పోలింగ్లో నమోదైన రికార్డు స్థాయి ఓటింగ్ శాతం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ప్రజల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది. ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతున్న వేళ ‘ఫలోడి సట్టా బజార్’ తన అంచనా ఫలితాలను మరోమారు తిరగతోడింది. ఈ నేపధ్యంలో ఊహకందని పలు షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి.
తీవ్రమైన పోటీ తప్పదు
రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో ఉన్న ‘ఫలోడి’ అనే పట్టణం దేశవ్యాప్తంగా అక్రమ బెట్టింగ్లకు ప్రధాన కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. దీనిని భారతదేశపు ‘బెట్టింగ్ రాజధాని’ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ ప్రధానంగా దేశంలో జరిగే ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లు జరుగుతాయి. వీరు ఇచ్చే అంచనాలు చాలా వరకు నిజమవుతాయని ఒక నమ్మకం ఉంది. అందుకే దేశీయ మీడియాతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా ఈ బజార్ లెక్కలను గమనిస్తుంటారు. ఇటు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, అటు ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ రెండూ కూడా గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మొదట్లో వెలువడిన ప్రాథమిక అంచనాలు ఒక పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని సూచించినప్పటికీ, తాజాగా నవీకరించిన ‘ఫలోడి సట్టా బజార్’ అంచనాలు గెలుపు ఎవరిదైనా సరే తీవ్రమైన పోటీ తప్పదని తేల్చి చెబుతున్నాయి.
తారుమారైన లెక్కలు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాత ఫలోడి సట్టా బజార్ తన పాత అంచనాలను భారీగా సవరించింది. ప్రారంభంలో వచ్చిన నివేదికల ప్రకారం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సునాయాసంగా గెలిచే అవకాశం ఉన్నట్లు కనిపించింది. కానీ తాజా మార్పుల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి స్వల్ప ఆధిక్యం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. తాజా అంచనాల ప్రకారం బీజేపీ మ్యాజిక్ ఫిగర్ సాధించే దిశగా లేదా అంతకంటే కొద్దిగా ఎక్కువ సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ కూడా చాలా దగ్గరి పోటీ ఇస్తూ వెనుబడే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తం 294 స్థానాలున్న అసెంబ్లీలో మెజారిటీ కోసం 148 సీట్లు ఖచ్చితంగా అవసరం.
ప్రభుత్వ వ్యతిరేక పవనాలు?
పశ్చిమ బెంగాల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ ఓటింగ్ శాతం నమోదు కావడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రెండు దశల ఎన్నికల్లోనూ పోలింగ్ ఏకంగా 92 శాతం దాటడం విశేషం. ఈ భారీ ఓటింగ్ శాతాన్ని చూసిన తర్వాత ఫలోడి సట్టా బజార్ తన అంచనాలను వెంటనే మార్చుకుంది. ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు బయటకు రావడం అనేది బహుశా అధికార పార్టీపై ఉన్న తీవ్ర వ్యతిరేకతకు ప్రబల సంకేతం కావచ్చని, లేదా ఓటర్ల ఆలోచనా విధానంలో వస్తున్న పెను మార్పులకు ఒక ప్రత్యక్ష నిదర్శనం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి దశ పోలింగ్ ముగిసిన వెంటనే వచ్చిన అంచనాలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీదే పైచేయి అని స్పష్టంగా చెప్పాయి. కానీ రెండవ దశ పోలింగ్ ముగిశాక బెట్టింగ్ ధోరణుల్లో పెను మార్పులు వచ్చాయి. అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ బలపడిందని, రెండు పార్టీల మధ్య ఉన్న అంతరం బాగా తగ్గిపోయిందని చెబుతున్నారు.
ఈ ఒక్క అంశమే కీలకం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఒక అత్యంత కఠినమైన ఎన్నికల యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అసాధారణ స్థాయిలో బలపడి అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు సవాలు విసురుతోంది. ఒకపక్క తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అట్టడుగు స్థాయిలో బలమైన సంస్థాగత నిర్మాణం, ప్రజల ఆదరణ ఇప్పటికీ స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ, తాజాగా వస్తున్న ఎగ్జిట్ పోల్స్, అలాగే సట్టా మార్కెట్ ధోరణులు చూస్తుంటే, రెండు పార్టీల మధ్య నరాలు తెగే హోరాహోరీ పోరు తప్పదని స్పష్టమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే, పట్టణ ప్రాంతాల్లో విస్తరిస్తున్న బీజేపీని మమతా బెనర్జీ ఏ మేరకు అడ్డుకోగలరనేదే అంతిమ విజేతను నిర్ణయించే ప్రధానాంశం కానుందని విశ్లేషకులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: బెంగాల్ పీఠంపై సస్పెన్స్.. ‘హంగ్’ వస్తే ఎవరికి ఛాన్స్?


