బెంగాల్ పీఠంపై సస్పెన్స్.. ‘హంగ్’ వస్తే ఎవరికి ఛాన్స్? | West Bengal Exit Polls 2026 Hung Assembly Looms in a Close Contest | Sakshi
Sakshi News home page

బెంగాల్ పీఠంపై సస్పెన్స్.. ‘హంగ్’ వస్తే ఎవరికి ఛాన్స్?

Apr 30 2026 1:39 PM | Updated on Apr 30 2026 2:06 PM

West Bengal Exit Polls 2026 Hung Assembly Looms in a Close Contest

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ముగిసింది. మే 4న వెలువడనున్న ఫలితాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాజకీయ వర్గాల్లో  కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొనడంతో, అక్కడ ‘హంగ్ అసెంబ్లీ’ ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని మెజారిటీ సర్వేలు అంచనా వేస్తున్నాయి. అసలు ఈ హంగ్ అసెంబ్లీ అంటే ఏమిటి? మెజారిటీ రాకపోతే బెంగాల్ రాజకీయాల్లో జరగబోయేది ఏమిటి?

హోరాహోరీ పోరు: ఎగ్జిట్ పోల్స్ అంచనాలు
అస్సాం, పుదుచ్చేరిలలో బీజేపీ, తమిళనాడులో డీఎంకే, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అయితే, అందరి దృష్టీ పశ్చిమ బెంగాల్ పైనే పడింది. ఇక్కడ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి స్వల్ప ఆధిక్యం వస్తుందని అంచనా వేస్తుండగా, రెండు పార్టీల మధ్య నరాలు తెగే ఉత్కంఠ పోరు సాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తీవ్రమైన పోటీ కారణంగా, పశ్చిమ బెంగాల్‌లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితి తలెత్తవచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

హంగ్ అసెంబ్లీ అంటే ఏమిటి?
ఏదైనా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి లేదా ఎన్నికల ముందు ఏర్పడిన కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్పష్టమైన మెజారిటీ రాకపోవడాన్ని ‘హంగ్ అసెంబ్లీ’ అంటారు. నిబంధనల ప్రకారం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మొత్తం సీట్లలో సగానికంటే కనీసం ఒక్క సీటు అయినా అదనంగా (సింపుల్ మెజారిటీ) గెలుపొందాలి. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ సాధించి అధికార పీఠం దక్కించుకోవాలంటే ఏ పార్టీ అయినా కనీసం 148 సీట్లు కైవసం చేసుకోవాల్సి ఉంటుంది.

ఎవరికీ మెజారిటీ రాకపోతే ఏమవుతుంది?
హంగ్ అసెంబ్లీ ఏర్పడిన పక్షంలో రాష్ట్ర గవర్నర్ పాత్ర అత్యంత కీలకంగా మారుతుంది. అత్యధిక స్థానాలు గెలుపొందిన అతిపెద్ద పార్టీని లేదా కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించి, అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి 10 రోజుల గడువు ఇస్తారు. ఒకవేళ ఆ పార్టీ మెజారిటీ నిరూపించుకోలేకపోతే, అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. అయితే, గడువులోపే చిన్న పార్టీల మద్దతు కూడగట్టడం, పోస్ట్-పోల్ (ఎన్నికల అనంతర) పొత్తులు పెట్టుకోవడం వంటి వ్యూహాలకు పార్టీలు పదును పెడతాయి. బయటి మద్దతుతో ఏర్పడే ఇలాంటి మైనారిటీ ప్రభుత్వాలు చాలా అస్థిరంగా ఉంటాయి. అవి ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానం ద్వారా కూలిపోయే ప్రమాదం ఉంటుంది.

ఇది కూడా చదవండి: Bihar: ఎన్‌కౌంటర్‌తో సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Advertisement
 
Advertisement
Advertisement