నీట్లో ప్రశ్నలన్నీ మా క్వశ్చన్ బ్యాంకులోనివే
నాసిక్లోని ఆర్సీసీ బ్రాంచి నిర్వాహకుడి గొప్పలు
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న ఆర్సీసీ బ్రాంచి నిర్వాహకుడు తమ ఇన్స్టిట్యూట్ ఇచ్చే మెటీరియల్ నుంచే నీట్లో ప్రశ్నలు వస్తాయని ధీమాగా చెప్పాడు. ఒక్కో సబ్జెక్టులో ఉండే 180 ప్రశ్నలకుగాను ఏకంగా 180 ప్రశ్నలు తామిచ్చే మెటీరియల్ నుంచే ఉంటాయంటూ గొప్పలు చెప్పుకున్నాడు. తమ కోచింగ్తో మెడికల్ సీటు గ్యారెంటీ అంటూ భరోసా ఇచ్చాడు.
నీట్–2026 ముందు ఎన్డీటీవీ చేపట్టిన పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. ఓ అభ్యర్థి సోదరుడినంటూ ఎన్డీటీవీ ప్రతినిధి ఒకరు కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిని కలిశారు. కోచింగ్తో ర్యాంకు గ్యారెంటీపై ఆయన అనుమానం వ్యక్తం చేయగా అతడు చెప్పిన విషయాలన్నీ రహస్య కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దేశంలోనే ఏ ఇన్స్టిట్యూట్లోనూ తమ మాదిరి కోచింగ్ ఇవ్వరంటూ అతడు గొప్పలు చెప్పాడు.
ఎయిమ్స్ సహా దేశంలోని ఏ మెడికల్ కాలేజీకి వెళ్లి చూసినా తమ కోచింగ్ తీసుకున్న కనీసం ఒక్క స్టూడెంటయినా కనిపిస్తారన్నాడు. 2025 నీట్లోనూ తామిచి్చన మెటీరియల్లోని ప్రశ్నలే వచ్చాయని తెలిపాడు. రిజల్టు పక్కా అని చెప్పగలిగేది దేశం మొత్తమ్మీద కేవలం తమ ఇన్స్టిట్యూట్ మాత్రమేనన్నాడు. ఏ ఇతర కోచింగ్లోనూ ఇప్పటి వరకు ఇలాంటి ఫలితాలు రాలేదని ధీమా వ్యక్తం చేశాడు.
నీట్–2025లో వచ్చిన ప్రశ్నలు అచ్చుగుద్దినట్లుగా తమ మెటీరియల్లో ఎక్కడున్నదీ కచ్చితంగా చెప్పగలనన్నాడు. ‘పరీక్షలో అడిగిన 180 ప్రశ్నలకు గాను 180 ప్రశ్నలు ఇప్పటికే మా స్టడీ మెటీరియల్లో ఎక్కడో ఒకచోట వచ్చాయని మేం నిరూపించగలం. యాదృచ్ఛికంగానే ఈ క్వశ్చన్ బ్యాంకులోని ఏదైనా ఒక పేజీని తెరిచి మరీ ఇలాంటి ప్రశ్నలను చూపించగలను..’అంటూ బల్లగుద్ది చెప్పడం గమనార్హం. ఈ కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకుడు శివరాజ్ రఘునాథ్ మోటెగావొంకర్ను లాతూర్లో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోవడం తెల్సిందే.


