ఈ రోజు జరగనున్న నీట్ రీఎగ్జామ్కు ఎన్టీఏ దేశ వ్యాప్తంగా అత్యంత పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని పేర్కొంది. పరీక్షలు ఎటువంటి అక్రమాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు 1.38 లక్షల సీసీటీవీ కెమెరాలు మానటరింగ్ చేయనున్నట్లు పేర్కొంది.
అదేవిధంగా ఏఐ ఆధారిత సీసీటీవీలు, 51,311 జామర్లతో ఎలక్ట్రానిక్ పరికరాల నియంత్రణ చేపట్టనుంది. మరోవైపు తెలుగురాష్ట్రాల్లో నీట్ రీఎగ్జామ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో 2.95 లక్షల మంది నీట్ పరీక్ష రాయనున్నారు.వీరికోసం ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఏపీలో 65,790 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాయనున్నారు. పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 185 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కాగా దేశవ్యాప్తంగా ఆదివారం జరగనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) రీ-ఎగ్జామ్ కేవలం 22 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారు. కాగా మే 3న జరిగిన పరీక్ష పేపర్ లీక్ కావడం, ఆ తర్వాత పరీక్షను రద్దు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి, నిరసనలకు దారితీసింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. అయితే, ఈ ఘటనపై కేంద్రం విచారం వ్యక్తం చేస్తూనే... తాము పారదర్శకతకే ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేసింది
దీంతో ఈ పరీక్ష వైద్య విద్యార్థులకే కాకుండా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక పెద్ద అగ్నిపరీక్షగా మారింది. మే నెలలో జరిగిన మొదటి విడత పరీక్షలో పేపర్ లీకేజీ వివాదం చెలరేగడంతో, కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి కేంద్రం ఈసారి సర్వశక్తులూ ఒడ్డుతోంది.
పరీక్ష సమయాలు
పరీక్ష సమయం మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష జరగనుంది.
దివ్యాంగులకు మినహాయింపు: అదనపు సమయానికి అర్హులైన దివ్యాంగ విద్యార్థులకు సాయంత్రం 6:20 గంటల వరకు సమయం కేటాయించారు.
రిపోర్టింగ్ సమయం: విద్యార్థులు ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల లోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని NTA స్పష్టం చేసింది.


