సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజుకు సంబంధించిన పరిణామాలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. కేసు విచారణ కొనసాగుతున్న వేళ ఆయన గత మూడు రోజులుగా ఓ కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ఉంటున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సీఐ నాగరాజు అరెస్ట్కు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
అయితే, సీఐ నాగరాజును ఈరోజు పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా, సాయికృష్ణ కేసులో టాస్క్ఫోర్స్ అధికారులు లత కుమారి, సీఐ శ్రీధర్ విచారణ ఎదుర్కొంటున్నారు. కాగా, కేసులో నిందితుడిగా ఉన్న ఓ పోలీసు అధికారి.. కోర్టు సిబ్బంది ఇంట్లో ఆశ్రయం పొందడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాగరాజు అక్కడ ఎందుకు ఉంటున్నారు? ఆయనకు ఎలాంటి సహకారం అందుతోంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా.. సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణకు ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్గా ఐజీ రవి ప్రకాశ్, సభ్యులుగా పశ్చిమగోదావరి, అల్లూరి జిల్లా, బాటప్ల అదనపు ఎస్పీలను ప్రభుత్వం నియమించింది. మరోవైపు.. ఈ కేసులో రెండు రోజుల నుంచి దర్యాప్తు బృందాలు టాస్క్ఫోర్స్, కృష్ణలంక స్టేషన్ సిబ్బందిని విచారిస్తున్నారు. వీరి నుంచి స్టేట్మెంట్ల రూపంలో వివరాలు రాబడుతున్నట్లు తెలిసింది. ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం శనివారం కూడా కృష్ణలంక స్టేషన్లో స్టేట్మెంట్లు నమోదు చేశారు.


