‘అయోధ్య’ విరాళాల్లో గోల్‌మాల్‌: ‘సిట్’కు షాకిచ్చిన ఫుటేజ్! | Ayodhya Ram Mandir Donation Scam SIT Probe Nails Big Irregularities | Sakshi
Sakshi News home page

‘అయోధ్య’ విరాళాల్లో గోల్‌మాల్‌: ‘సిట్’కు షాకిచ్చిన ఫుటేజ్!

Jun 21 2026 11:51 AM | Updated on Jun 21 2026 11:54 AM

Ayodhya Ram Mandir Donation Scam SIT Probe Nails Big Irregularities

అయోధ్య: అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకల నిర్వహణలో భారీ అక్రమాలు జరిగినట్లు వెల్లడయ్యింది. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సీట్‌) విరాళాల సొమ్ము చోరీకి గురైనట్లు బలమైన ఆధారాలను కనుగొంది. దీనికి సంబంధించిన  ప్రాథమిక నివేదికను త్వరలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సిట్ సమర్పించనుంది.

సీసీటీవీ ఫుటేజ్ ట్యాంపరింగ్
గడిచిన ఆరు రోజులుగా అయోధ్యలో సిట్ బృందం ముమ్మరంగా విచారణ జరిపింది. ఆలయ హుండీల నుంచి సేకరించిన నగదును లెక్కించే సమయంలో సీసీటీవీ ఫుటేజ్‌పై చేతివాటం ప్రదర్శించినట్లు దర్యాప్తులో తేలింది. కొన్ని కీలకమైన సీసీటీవీ దృశ్యాలను కావాలనే డిలీట్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు సమర్పించిన బంగారం, వెండి, వజ్రాభరణాలను నకిలీ వాటితో మార్చేసారనే ఆరోపణలపై సిట్ లోతుగా విచారించింది. నిర్లక్ష్యంతో పాటు దీని వెనుక పెద్ద కుట్ర కోణం దాగి ఉందనే దిశగా అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు.

ట్రస్ట్ పెద్దలపై అనుమానాలు
ఈ భారీ అక్రమాలకు సంబంధించి సిట్ ఇప్పటివరకు ట్రస్ట్ అధికారులు, మేనేజ్‌మెంట్ సిబ్బంది, బ్యాంక్ ఉద్యోగులతో సహా దాదాపు 150 మందిని ప్రశ్నించింది. ట్రస్ట్ కార్యనిర్వాహకుడు అనిల్ మిశ్రా, కన్స్ట్రక్షన్ ఎయిడ్ గోపాల్ రావు పాత్రలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కూడా ప్రస్తుతం నిఘా నీడలో ఉన్నారు. లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న ఎస్‌బీఐ, టీసీఎస్‌లకు చెందిన ఆరుగురు ఉద్యోగులను కూడా ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో తిన్ను యాదవ్ అనే వ్యక్తితో పాటు కొందరు బ్యాంక్ సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యే అవకాశం ఉంది.

ఆలయ ట్రస్ట్‌లో భారీ మార్పులకు సిట్ సిఫార్సులు
ట్రస్ట్‌కు చెందిన కీలక అధికారులు దర్యాప్తు పూర్తయ్యే వరకు అయోధ్య విడిచి వెళ్లకూడదని సిట్ ఆదేశించింది. ఆలయ నిర్వహణలో పారదర్శకత కోసం కాశీ విశ్వనాథ్ ఆలయం తరహాలోనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను నియమించాలని, ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణను పెంచాలని సిట్ సూచించనుంది. అలాగే విరాళాల లెక్కింపునకు బ్యాంకులు కేవలం రెగ్యులర్ ఉద్యోగులను మాత్రమే నియమించాలని, క్రమం తప్పకుండా ఆడిటింగ్ నిర్వహించాలని నివేదికలో సిఫార్సు చేయనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement