హైదరాబాద్‌లో నేడు కాక్రోచ్ పార్టీ ఆందోళన | Cockroach Janata Party protest in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో నేడు కాక్రోచ్ పార్టీ ఆందోళన

Jun 14 2026 9:10 AM | Updated on Jun 14 2026 9:26 AM

Cockroach Janata Party protest in Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు ( ఆదివారం) హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టనుంది. నీట్‌ పేపర్‌ లీకేజ్‌పై ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద  ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ శాంతియుత పద్ధతిలో  నిరసన చేపట్టనున్నట్లు సీజేపీ ప్రకటించింది. ఈ మేరకు పోలీసులను అనుమతించడంతో ధర్నాచౌక్‌ వద్ద నిరసన కార్యక్రమం జరగనుంది.

నీట్, సీబీఎస్‌ఈ పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ‘కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ)’ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతుంది. ఇటీవలే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ మాస్కులు ధరించి, చేతుల్లో పుస్తకాలు, జాతీయ జెండాలతో యువత భారీ ఎత్తున నిరసన చేపట్టారు.  విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.

అనంతరం పుణేలోని  సావిత్రిబాయి ఫూలే పుణే యూనివర్సిటీ  క్యాంపస్‌లో వేలాది మంది విద్యార్థులు, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ మద్దతుతో భారీ నిరసన ప్రదర్శన చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద నిరసన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సోనమ్‌ వాంగ్‌ చుక్‌ పాల్గొంటుండగా పెద్ద ఎత్తున యువత హాజరయ్యే అవకాశం ఉంది.

ఓ కేసులో భాగంగా దేశంలోని నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పోల్చిన విషయం తెలిసిందే. దాంతో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. సీజేపీ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నాయకత్వంలో మొదటిసారి దిల్లీలో భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు చేపడుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement