‘నీట్’ మరో షాక్: ఒడిశా విద్యార్థినికి 1500 కి.మీ దూరంలో సెంటర్! | Odisha Student Assigned Exam Centre 1,500 Km Away in Dehradun | Sakshi
Sakshi News home page

‘నీట్’ మరో షాక్: ఒడిశా విద్యార్థినికి 1500 కి.మీ దూరంలో సెంటర్!

Jun 20 2026 12:17 PM | Updated on Jun 20 2026 12:31 PM

Odisha Student Assigned Exam Centre 1,500 Km Away in Dehradun

భువనేశ్వర్‌: నీట్-యూజీ (NEET-UG) రీటెస్ట్ రాయబోతున్న ఒక ఒడిశా విద్యార్థినికి ఊహించని షాక్ తగిలింది. జూన్ 21న పరీక్ష జరగనుండగా, కేవలం ఒక్క రోజు ముందు ఆమెకు దాదాపు 1,500 కిలోమీటర్ల దూరంలోని ఉత్తరాఖండ్‌కు చెందిన డెహ్రాడూన్‌లో పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. మొదట భువనేశ్వర్‌లో సెంటర్ ఇచ్చిన అధికారులు, ఇప్పుడు రీటెస్ట్ అడ్మిట్ కార్డ్‌లో డెహ్రాడూన్ అని మార్చడంతో ఆ విద్యార్థిని, ఆమె కుటుంబం తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఈ గందరగోళం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, విద్యార్థిని భవిష్యత్తును కాపాడాలంటూ అధికారులకు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.

భువనేశ్వర్ టు డెహ్రాడూన్
ఈ తప్పిదాన్ని ‘వెటరన్స్ క్లబ్ ఒడిశా’ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చింది. సదరు విద్యార్థిని మొదట రాసిన నీట్ పరీక్షకు భువనేశ్వరే కేంద్రంగా ఉంది. కానీ, రీటెస్ట్ కోసం జారీ చేసిన కొత్త అడ్మిట్ కార్డ్‌ను చూసి ఆ కుటుంబం నిర్ఘాంతపోయింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలో అంత దూరం ప్రయాణించడం ఆర్థికంగా, ప్రాక్టికల్‌గా అసాధ్యమని, దీనివల్ల విద్యార్థిని పరీక్షకు హాజరయ్యే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

న్యాయం కోసం మాజీ సైనికుడి పోరాటం
బాధిత విద్యార్థిని తండ్రి, మాజీ సైనికుడు సంజయ్ బిస్వాల్ ఈ తప్పిదంపై ఇండియన్ ఎక్స్-సర్వీసెస్ లీగ్ ఒడిశా విభాగంతో పాటు ఇతర ఉన్నతాధికారులకు అత్యవసర అప్పీళ్లు సమర్పించారు. తన కుమార్తెకు స్వరాష్ట్రంలోనే లేదా ఇంటికి దగ్గరగా ఎక్కడైనా పరీక్షా కేంద్రాన్ని మార్చాలని ఆయన అభ్యర్థించారు. పరీక్ష సమయం ముంచుకొస్తున్న తరుణంలో, ఈ ఆకస్మిక మార్పు విద్యార్థులను, తల్లిదండ్రులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది.

ఒకవైపు ఉచిత రవాణా.. మరోవైపు అందని స్పందన
మరోవైపు, ఒడిశా ప్రభుత్వం నీట్ రీటెస్ట్ రాసే అభ్యర్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉచిత రవాణా సౌకర్యాలను ప్రకటించింది. ఖుర్దా జిల్లాలోనే 26 కేంద్రాలకు గానూ 108 బస్సులను ఏర్పాటు చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇంతగా సాయం అందిస్తున్నా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేసిన ఈ పొరపాటు కారణంగా ఒక విద్యార్థిని ప్రయాణం ప్రశ్నార్థకంగా మారింది. పరీక్షకు కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, ఈ వ్యవహారంపై నేషనల్  టెస్టింగ్‌ ఏజెన్సీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement