త్వరలో కౌన్సెలింగ్ షెడ్యూల్.. తొలుత ఎంసీసీ ఏఐక్యూ
ఆ తర్వాత కాళోజీ వర్సిటీ కౌన్సెలింగ్
రాష్ట్రంలో 10 వేలకుపైగా సీట్ల భర్తీకి సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: నీట్ యూజీ–2026లో అర్హత సాధించిన వేలాది మంది విద్యార్థులు ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా 15 శాతం అఖిల భారత కోటా (ఏఐక్యూ) సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఆ వెంటనే తెలంగాణలో 85 శాతం రాష్ట్ర కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్యూహెచ్ఎస్) నోటిఫికేషన్ జారీ చేయనుంది. దీంతో అడ్మిషన్ల ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది.
తెలంగాణ ప్రస్తుతం దేశంలో అత్యధిక ఎంబీబీఎస్ సీట్లు కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్, కేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాలలను కలిపి ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 10 వేలకుపైగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. సీట్లు పెరిగినా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పోటీ మాత్రం ఏమాత్రం తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.
హైదరాబాద్ కాలేజీలకు జాతీయ స్థాయిలో పోటీ
గత ఏడాది కౌన్సెలింగ్ను పరిశీలిస్తే ఉస్మానియా, గాంధీ, బీబీనగర్ ఎయిమ్స్, కాకతీయ వంటి ప్రముఖ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకే సీట్లు లభించాయి. ఈ కళాశాలల్లో సీట్ల కోసం జాతీయ స్థాయిలో పోటీ ఉంది. కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఆన్లైన్ దరఖాస్తులు, ధ్రువపత్రాల పరిశీలన, రాష్ట్ర మెరిట్ జాబితా, వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది.
అందువల్ల విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా అవసరమైన అన్ని ధ్రువపత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నీట్ ర్యాంక్ కార్డు, అడ్మిట్ కార్డు, టెన్త్, ఇంటర్మార్కుల మెమోలు, బదిలీ ధ్రువపత్రం, స్టడీ, నివాస ధ్రువపత్రాలు, కులం, ఆదాయం, ఈడబ్ల్యూఎస్ తదితర రిజర్వేషన్ పత్రాలు వర్తిస్తే వాటిని స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకోవడం మంచిదని చెబుతున్నారు.


