
దుఃఖానికి మూలకారణం ఏది? అని ఆలోచిస్తే సాంసారిక విషయాలపై స్నేహభావం, ఆసక్తి, మోహం కలిగి ఉండడం అని అర్థమవుతుంది. జీవకోటి మొత్తం ఈ ఆసక్తిని, మోహ భావాన్ని ప్రదర్శించడం వలననే దుఃఖాన్ని పొందుతున్నది. కాల్చబడిన లోహపు ముద్దను ఒక కుండలోని చల్లని నీటిలో వేసినంతనే ఎలాగైతే ఆ చల్లని నీరు మొత్తం ఒక్కసారిగా వేడెక్కుతాయో అలా, మనస్సు దుఃఖంతో నిండి ఉన్నపుడు ఆ దుఃఖం ప్రభావం శరీరంపై కూడా పడి మనిషినిమొత్తంగా డీలా పడిపోయేలా చేస్తుంది.
ధన పిపాసకు అంతం లేదు. ఆ కోరిక ఎన్నటికీ పూర్తిగా తీరేది కాదు. ఎల్లవేళలా సంతృప్తభావంతో సంతోషంగా ఉండ డాన్ని మించిన సుఖవంతమైనది మరొ కటి లేదు. ఆ కారణంగానే సంతోషాన్ని అన్నిటి కంటే ఉత్తమమైన గుణంగా విజ్ఞులు చెప్పారు.
జలంతో అగ్నిని శాంతపరిచినట్లుగా జ్ఞానజలంతో మనిషి తన మానసిక దుఃఖాలను శమింపజేసి శాంతపర చాలి. మనస్సులో దుఃఖం ఎప్పుడైతే మాయమైపోతుందో, అప్పుడే మనిషికి శారీరక అస్వస్థత కూడా తగ్గడం ఆరంభమై, కొంతకాలానికి పూర్తి స్వస్థత చేకూరుతుంది. ఎలాగైతే తన లోనే నిక్షిప్తమై ఉండే అగ్ని రాజుకోవడం వలన పుట్టినమంటలో, కట్టె దహించుకుపోయి మండి బూడిదై మిగులు తుందో; ఆ విధంగానే, ఎవని ఆలోచనలు, మనసు అదు పులో ఉండవో ఆ వ్యక్తి తన శరీరం నుంచి ఉత్పన్నమయ్యే లోభత్వం, ఆకాంక్ష కారణంగా తన వినాశాన్ని తానే కొని తెచ్చుకుంటాడు.
విప్రయోగే న తు త్యాగీ దోషదర్శీ సమాగమే
విరాగం భజతే జన్తుర్నిర్వైరో నిరవగ్రహః
‘కోరుకున్న విషయ సుఖాలు దక్కని కారణంగా ఆ సుఖాలను త్యాగం చేసేవాడు విరాగి కాలేడు. విషయ సుఖాలు దొరుకుతున్నవాటిని కూడా త్యాగం చేసేవాడే నిజమైన త్యాగి అవుతాడు. అతడికి మాత్రమే వైరాగ్యభావం దక్కుతుంది. మనసులో ద్వేషభావం లేని కారణంగా బంధన ముక్తుడై ఎవరితోనూ వైరం లేనివాడు అవుతాడు’ అని వ్యాస మహర్షి విరచిత మహాభారతంలో ఉంది. శోకమగ్నుడై ఉన్న ధర్మరాజుకు శౌనకాది మహామునులకు మధ్య జరిగిన సంభా షణలోని పై శ్లోకం ఈ తత్త్వాన్ని బోధించింది.
– భట్టు వెంకటరావు