
ద్వైతం కానిది అద్వైతం. అంటే రెండు అనే భావన పోయి ఉన్నది ఒకటే అని భావించగలగటం అద్వైతమవుతుంది. అయితే ఉపాధులన్నీ సమానమని అర్థం కాదు. పాపపుణ్య కర్మ ఫలితంగా వచ్చిన ఉపాధులు పరస్పరం భిన్నమైనవే. అవి పూర్తిగా నశించిపోయేవే. నశించనిది, నిత్యసత్యమైనది ఉపాధి గతమైన ఆత్మ ఒక్కటే. ఈ విషయం గ్రహించటమే సమదర్శి స్వభావం.
నిత్యసత్యం, వ్యవహార సత్యం అనేవి రెండున్నాయని గ్రహించాలి. మనకు కనబడే ప్రపంచమంతా వ్యవహారంలో సత్యం. కాని నిత్యసత్యము మాత్రం కాదు. ప్రపంచం నిత్యసత్యమని తెలిస్తే అది భ్రాంతి అనక తప్పదు. ఈ అద్వైత జ్ఞానం వల్ల తానంటూ వేరే ఉండక అంతట తననే చూడటం, తనలోనే సర్వాన్ని చూడటం జరుగుతుంది. ‘ఆత్మ వత్సర్వభూతాని సర్వభూతాని చాత్మని’ అనే దాని కర్థం అదే. ఈ జ్ఞానం ఒక్క గురుబోధ, గురుసేవ వల్లనే లభ్యం. కేవలం గ్రంథ పఠనం చాలదు.
ఒక గురువు గారు తన శిష్యుడికి ‘అద్వైతం’ గురించి పాఠం ప్రారంభించారు. ‘భగవంతుడు ఒకడే. ఆయన సర్వాంతర్యామి. ఆయన సంకల్పంతో సృష్టి జరిగింది. ఆయనొక్కడే నిత్య సత్యం. ఈ కనబడేది అంతా భ్రాంతి వల్ల కనబడు తున్నది కాని నిజానికి ఇదేదీ లేదు. అని మొదట్లో బోధించటం జరిగింది. ఈ జ్ఞానం శిష్యులలో స్థిరపడటానికి ఇంకా సమయం కావాలి. గురువిచ్చే అనుభవం సంపాదించాలి. అప్పుడుగాని అర్థమైనట్లు కాదు. ప్రాథమిక దశలోనే ఉన్న ఈ శిష్యుడు ఒక సారి అడవికి వెళ్ళి వస్తూ ఉన్నాడు. దారిలో ఒక మదపుటేనుగు ఎదురుగా వస్తున్నది. దానిపై ఉన్న మావటివాడు, ఈ ఏనుగు ఇది పూర్తిగా మచ్చిక కాని మదపుటేనుగు పక్కకు తప్పుకో అని అరిచాడు. ఆ శిష్యునికి అద్వైతం పాఠం గుర్తుకొచ్చింది. ‘ఈ కనబడేదంతా బ్రహ్మమే. రెండవదంటూ లేదు.’ కాబట్టి ఈ కన బడే ఏనుగు భ్రాంతి జన్యమైంది. కనుక నేను తప్పుకోవలసిన పని లేదని ముందుకు నడిచాడు. ఏనుగు రానే వచ్చింది, తొండంతో అతణ్ణి విసిరి అవతల పారవేసింది. అప్పుడు ఆ శిష్యుడికి అర్థమైందో లేదో కాని మనకు మాత్రం బాగా అర్థమవ్వాల్సింది ఏమిటంటే... ‘ఉపాధులన్నింటిలోనూ ఉన్న అంతర్యామి ఆత్మ ఒక్కటే అయినా, ఉపాధి గత భేదం భేదమే’అని!