
సమాజంలో నెలకొన్న దురాచారాలను, మూఢ విశ్వాసాలను సమూలంగా నిర్మూలించి జనులను సన్మార్గంలో నడి పించి ఉద్ధరించాలని తపించి ఆ ప్రయత్నంలోనే తనువులను బాసిన మహనీయులెందరో! వారిలో బసవేశ్వరుడు ఒకరు. బసవేశ్వరుడు క్రీ.శ. 1131లో కర్ణాటకలో జన్మించాడు. ఆయనకు ఎనిమిదేళ్ళ వయసులో ఉపనయనం చేయదలచిన తల్లితండ్రులతో, ‘అక్కకు లేని ఉపనయనం నాకెందుకు?’ అని ప్రశ్నించాడు. సదాచారం, సత్ప్రవర్తన లేని జీవితం వ్యర్థమనీ, చిత్త శుద్ధి దైవ సాక్షాత్కారాన్ని కల్గి స్తుందనీ చాటి చెప్పాడు. బస వేశ్వరుని అపారమైన మేధను గమనించి కల్యాణ కటకాన్ని పాలించే ఆనాటి రాజు బిజ్జ లుడు ఆయనను తన రాజ్యంలో మహామంత్రిగా నియ మించాడు. కేవలం శాసించటానికే పరిమితమైన రాజ సభను ప్రజాసమస్యలను పరిష్కరించే వేదికగా ‘అనుభవ మంటపం’గా ఆయన తీర్చిదిద్దాడు. ‘కాయకమే కైలాసం’ అనే సిద్ధాంతాన్ని బోధించి ప్రజలను కార్యకర్తలుగా, కార్య దక్షులుగా మలిచాడు. తాము చేసే పనిని శ్రద్ధతో చేయ టమే అసలైన పూజ అని తెలియజెప్పాడు.
మానవులంతా సమానమే, శివుడే సత్యం, ఆయన నిరాకారుడు, ఖరీదైన ఆలయాలు, అలంకారాలు వద్దు, వాస్తు – జ్యోతిషాలు అసత్యాలు, భక్తి కన్నా సత్ప్రవర్తన మిన్న అని పదేపదే గొంతెత్తి చెప్పాడు. వేటగాడైన కన్నప్ప, పారిశుద్ధ్యపు పని చేసిన మేదర చెన్నయ్య, అంటరాని వాడైన సిరియాళుడు ఎలా ముక్తి పొందగలిగారో వివరించాడు. కులాంతర వివాహాలను, సహపంక్తి భోజనాలను బసవేశ్వరుడు ఆనాడే ప్రోత్సహించి సంఘ సంస్కరణకు పూనుకొన్నాడు. ఇలాంటివి నచ్చని సంప్రదాయవాదులు కుట్ర పన్నారు. అయినా వాటిని ఎదుర్కొంటూ ఆయన తన కార్యక్రమాలను కొనసాగిస్తూనే శివైక్యం చెందాడు.
– రాచమడుగు శ్రీనివాసులు