
నిత్య అభిషేకాలు.. సామూహిక పూజలు
శతాబ్దాలుగా కొనసాగుతున్న నిత్య హారతులు
ఆలయ పరిసరాల్లో ఆంజనేయస్వామి నామస్మరణ
భక్తుల కొంగు బంగారం కొండగట్టు అంజన్న క్షేత్రం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతోంది. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తుండటంతో నిత్య కల్యాణం.. పచ్చ తోరణంలా ఆలయ పరిసరాలు ఆంజనేయ స్మరణతో మార్మోగుతున్నాయి. ప్రతి మంగళవారం, శనివారాల్లో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలతో విరాజిల్లుతోంది. హైందవ సంప్రదాయాన్ని అనుసరించి ప్రతి పండగ స్వామివారి సన్నిధిలో నిర్వహిస్తుండటంతో ఆలయానికి వచ్చే భక్తులు పండుగలో పాలుపంచుకుంటూ తరిస్తున్నారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలోని శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు తెలంగాణలోని నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. వివిధ రకాల ఔషధ మూలికలతో కూడిన ఏపుగా పెరిగిన చెట్లు, నల్లని బండరాళ్లు, వర్షాకాలంలో నల్లని బండరాళ్ల మధ్య నుంచి పారే జలపాతాలు, ప్రకృతి ఒడిలో సేదతీరుతూ, భక్తులు పరవశించిపోతున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన ప్రతి మంగళవారం, శనివారాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
ఏటా చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతులతో సుమారు నాలుగు నెలలపాటు లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ ఏడాది నిర్వహించిన చిన్న జయంతికి సుమారు రెండున్నర లక్షలకుపైగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి, స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన సౌకర్యాల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు.
ఆగని నిత్య హారతులు..
గ్రహపీడితులు, దీర్ఘకాలిక, మానసిక వ్యాధిగ్రస్తులు, సంతానం లేని మహిళలు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో 11 రోజులు, 21 రోజులు నిద్రిస్తే సమస్యలు దూరం అవుతాయని భక్తులు స్వామివారి సన్నిధిలో నిద్రిస్తుంటారు. నిత్యం ఉదయం, సాయంత్రం వేళ్లలో భక్తులు స్వామివారి భజనలు చేసి, హారతులు ఇస్తుంటారు. శతాబ్దాలుగా నిత్య హారతులు కొనసాగుతున్నాయి. కరోనా సమయంలో కూడా నిత్య హారతులు కొనసాగాయి.

నిత్య సామూహిక అభిషేకాలు.. సత్యనారాయణ వ్రతం
ఆంజనేయస్వామి ఆలయంలో నిత్యం సామూహిక ఆంజనేయస్వామి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ప్రతి మంగళవారం, శనివారాల్లో దంపతులు ఆంజనేయస్వామి చిన్న విగ్రహానికి సామూహికంగా స్వామివారి ప్రతిమకు అభిషేకం నిర్వహిస్తారు.

కొబ్బరి ముడుపులు ప్రత్యేకం..
సహజంగా హనుమాన్ దీక్షాపరులు స్వామివారికి, భక్తులు తమ కోరికలు నెరవేరడం కోసం ముడుపులు కడుతుంటారు. తమ మానవ ప్రయత్నంతోపాటు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో కొబ్బరి ముడుపులు కడితే తమ కోరిక నెరవేరుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రత్యేకంగా ఎన్నికల వేళల్లో రాజకీయ నాయకులు స్వామివారిని దర్శించుకొని, ముడుపులు కట్టడం ఆనవాయితీగా మారింది.
ఓం శ్రీ ఆంజనేయాయ నమః
కొండగట్టు ఆలయానికి వచ్చే భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయేలా ఆలయ అధికారులు మైకులు ఏర్పాటు చేశారు. కొండగట్టు (Kondagattu) ఆలయ పరిసరాల్లో ఆంజనేయస్వామి నామస్తోత్రం ఓం శ్రీ ఆంజనేయాయ నమః ఆలయానికి వచ్చే భక్తుల్లో ఆధ్యాత్మిక పరిమళాలు పెంపొందిస్తోంది. ప్రధాన ద్వారం మొదలుకొని, ఘాట్ రోడ్డు వెంట స్వామి వారి నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆంజనేయస్వామి నామస్మరణతో మార్మోగిపోతోంది.
కొండగట్టులో దర్శనీయ స్థలాలు..
ఆంజనేయస్వామి ఆలయానికి పశ్చిమాన బేతాళ స్వామి ఆలయంతోపాటు సీతారామ ఆలయాన్ని సందర్శించి, భక్తులు పూజలు చేస్తుంటారు. బేతాళస్వామిని క్షేత్రపాలకుడిగా పూజిస్తారు. స్వామివారి ఆలయ పొలిమేరల్లో బొజ్జ పోతన్న ఆలయం కలదు. భక్తులు తైలాభిషేకం, ఫలపుష్పాభిషేకం నిర్వహిస్తుంటారు.
రామావతార సమయంలో సీతామాత తన కష్టాలు తలచి, విలపించగా, రాలిన కన్నీరు గుంటలుగా మారి, సీతమ్మ గుంటలుగా ప్రసిద్ధి చెందినట్లుగా భక్తులు విశ్వసిస్తారు. సంతానం లేని దంపతులు స్వామి వారిని పూజిస్తే జన్మించిన బిడ్డకు కొండల రాయుడిగా నామకరణం చేయగా, ఆలయానికి ఈశాన్యంలో పెద్ద పెద్ద బండరాళ్లను కోటమాదిరిగా ఏర్పాటు చేశారు. కొండల్రాయుడి గుర్రలు డెక్కల ముద్రలు, బండరాళ్లపై చిన్న జలాశయం ఆనవాళ్లు దర్శనమిస్తాయి.
చదవండి: డయాబెటిస్ని చిటికెలో నయం చేసే గుడి.. ఎక్కడుందంటే?
నూతనంగా నిర్మించిన కోనేరు సమీపంలో పెద్ద పెద్ద బండరాళ్లతో ఏర్పాటు చేసిన గుహలో మునులు తపస్సు చేసుకునేవారని ప్రసిద్ధి. భక్తులు ఒక్కరు మాత్రమే వెళ్లగలిగేంత దారి నుంచి గుహలోకి వెళ్లి, గుహలో వెలుగుతున్న దీపాన్ని భక్తులు దర్శిస్తుంటారు.
భక్తుల కొంగు బంగారం ఆంజనేయస్వామి
కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయి. ప్రకృతి ఒడిలోని కొండగట్టులో వివిధ రకాల ఔషధ మూలికల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి, ఆలయంలో నిర్వహించే నిత్య హారతులు, అభిషేకాలు చేస్తూ ఆధ్యాత్మికతతో స్వామివారి సన్నిధిలో నిద్రించిన వారి కోరిన కోర్కెలు తీర్చే ఆంజనేయస్వామి భక్తుల పాలిట కొంగుబంగారం.
– తిరుకోవెల కపీందర్, కొండగట్టు ఆలయ స్థానాచార్యులు