శబరిమల అయ్యప్పస్వామి అనగానే నోరూరించే అరవణ ప్రసాదమే గుర్తొస్తుంటుంది. ఆ ప్రసాదం ఇష్టపడని భక్తులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ ఒక్క ప్రసాదమే కాదు నాలుగు రకాల పాయసాలను ఆ హరిహరసుతుడికి నివేదిస్తారు. అవన్నీ ఆయుర్వేద పరంగా ఔషధ గుణాలు కలిగినవి. తక్షణ శక్తిని ఇచ్చేవి. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి అరవణ పాయసంతోపాటు సమర్పించే ఇతర నైవేద్యాల వివరాలు, వాటి ప్రత్యేకత గురించి సవివరంగా తెలుసుకుందాం.
⇒ ఉషః కాలంలో ఉదయం 7.30 గంటల సమయంలో కొబ్బరి పిండితో చేసిన పాయసాన్ని నివేదిస్తారు. దీని పేరుకు తగ్గట్టుగా ఈ పాయసం కొబ్బరికాయను చూర్ణం చేసి.. ఆ పిండికి, రెండు గ్లాసుల కొబ్బరి పాలకు బెల్లం జోడించి తయారు చేస్తారు.
⇒ మధ్యాహ్నం 12 గంటల పూజ కోసం అరవణ పాయసాన్ని నివేదిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. ఇది రైస్, ఎండు కొబ్బరి ముక్కలు, నెయ్యి, ఎండు ద్రాక్ష, తాటిబెల్లం, శొంఠిపొడి, యాలకుల పొడి, పచ్చ కర్పూరంతో తయారవుతుంది.
⇒ ఇక మిగతా పూజాసమయాల్లో తెల్ల నైవేద్యాన్ని నివేదిస్తారు. రాత్రి 9.15 గంటలకు సాయంత్రం పూజ కోసం నువ్వుల పాయసం నివేదిస్తారు. ఈ మేరకు శబరిమల తంత్రి కంఠరార్ మహేష్ మోహనార్ మాట్లాడుతూ.. ‘‘నువ్వుల పాయసం నిజానికి పాయసం రూపంలో ఉండదు.. నువ్వులే’’ అని చెప్పుకొచ్చారు. సాయంత్రం పూజ కోసం అయ్యప్పకు పానకం, అప్పం, అడ అనే పానీయం నివేదిస్తారు. ఇక్కడ పానకం అనేది జీలకర్ర, బెల్లం, పసుపు, నల్ల మిరియాలు కలిపిన ఔషధ మిశ్రమం.
అత్యంత స్పెషల్ పంచామృతం..
తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం తెరిచినప్పుడు అభిషేకానికి ఈ పంచామృతాన్ని వినియోగిస్తారు. స్పటికబెల్లం, బెల్లం, అరటి పండు, ఎండు ద్రాక్ష(కిస్మిస్), నెయ్యి, తేనె, యాలకుల పొడి, లవంగాల పొడి, తదితర ఎనిమిది పొడులను కలిపి పంచామృతం తయారు చేస్తారు. పాయసాలలో అరవణ తర్వాత పంచామృతం అత్యంత రుచికరమైన ప్రసాదంగా భక్తులు చెబుతుంటారు.
అంతేాకాదు శబరిమలలో ఈ అరవణ ప్రసాదంతోపాటు అచ్చం అరవణ టన్ మాదిరి సగం సీసాలో ఈ పంచామృతాన్ని విక్రయిస్తారు. దీని ధర వచ్చేసి దగ్గర దగ్గర రూ.125లు పలుకుతుంది. అయ్యప్ప స్వామి పూజా విధానాలే కాదు నివేదించే నైవేద్యాలు కూడా అత్యంత ప్రత్యేకమే కదా..!.
(చదవండి: దేవస్వం బోర్డు మైదానంలో పార్కింగ్పై ఫిర్యాదులు..!)


