
అంతర్ముఖ ప్రేమానందం
అంతర్ముఖ ప్రేమానందం: భగవంతుడంటే ప్రేమ అని మనం ఎన్నోసార్లు విన్నాం. ప్రేమ అంటే ఏమిటో ఎందరో అవతార మూర్తులు, అవతార పురుషులు వారి వారి మార్గాలలో విశదీకరించారు. దానిని ఎంతగా వర్ణించి విశదీకరించినప్పటికీ ప్రేమను అనుభూతి చెందకుండా దాని ఆనందాన్ని పొందలేరు. ఆ ప్రేమను అనుభూతి చెందడం, దానిని అర్థం చేసుకోవడమే ఉత్తమమైన మార్గం. మనలో ఆ ప్రేమను ఆస్వాదించి ప్రకటించగల యంత్రాంగాన్ని భగవంతుడే మనలో పొందుపరిచాడు. ఇది మనలో ఉన్న మిక్కిలి సూక్షమైన, సున్నితమైన యంత్రాంగం. అటువంటి ప్రేమప్రకాశమే ఆనందం. మిగిలినది ఏదీ మనకు ఆనందాన్ని ఇవ్వలేదు. హృదయాల్లో అనుభూతి చెందుతున్న ప్రేమ మాత్రమే ఆనందాన్ని ఇవ్వగలదు. కాబట్టి ఒక ప్రేమించే వ్యక్తి ఒక ఆలోచించే వ్యక్తికన్న వెయ్యిరెట్లు ఉన్నతుడు.
మన అంతర్గత సూక్ష్మ శరీర వ్యవస్థ లేక యంత్రాంగం మనలో ఏడు పొరలుగా పనిచేస్తుంది. ఈ పొరల ఉపరితలం మీద ఆనంద తరంగాలు ఉప్పొంగి మెదడు అనే ఒడ్డుకు చేరుకొని ఆనందమనే బుడగలుగా ఏర్పడతాయి. కాని అక్కడ మన మెదడు హేతుబద్ధమైన శిలలా ఉంటే ఈ బుడగలు ఎందుకూ పనికి రాకుండా కరిగిపోయి ఆ రాయి మీద ఏ ప్రభావాన్నీ చూపలేవు. ఈ ఏడు పొరలే మనలోని శక్తి కేంద్రాలు. వాటినే చక్రాలు అని అంటాము. అదే మన శరీరంలో మన కంటికి కనపడని కేంద్రీయ నాడీ వ్యవస్థ. ఇప్పుడు మనలోని ఈ అంతర్గత సూక్ష్మ వ్యవస్థ లోని ఈ శక్తికేంద్రాలను గురించి కొంత విశదంగా తెలుసుకుందాం.
మొదటిది మూలాధార చక్రం
మొట్టమొదటి శక్తి కేంద్రమైన మూలాధార చక్రం మనలోని విసర్జనావయవాల మీద ప్రభావం చూపుతుంది. మనలో విసర్జనప్రక్రియ సరిగా జరిగినపుడు మనం ఎంతో ఉపశమనం పొందుతాం. ఇది చాలా ప్రాథమికమైన విషయం. అయితే ఆ ఉపశమనం మనకి ఒక రకమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ఇది చాలా స్థూలమైన చిన్న విషయంగా చెప్పబడుతుంది కానీ ఆ ఆనందం పొందడం చాలా ముఖ్యమైనది. కానీ ఈ ఆనందం మిగిలిన ఎన్నో లోతైన, సున్నితమైన వాటివలన కలిగే ఆనందాన్ని అధిగమించకుండా ఉండాలంటే మనం అ స్వచ్ఛతను కలిగి ఉండాలి. అదే మనలో వుండాల్సిన మొట్టమొదటి గుణం. స్వచ్ఛత అనేది ఎవరిలోనైనా కావాలనుకుంటే వచ్చేది కాదు. అది అంతర్గతంగా నిర్మితమై ఉండాలి. కానీ సహజయోగ సాధనతో మూలాధారాన్ని శుద్ధి చేసుకోవడం ద్వారా స్వచ్ఛతను వృద్ధి చేసుకోవచ్చు.
స్వాధిష్టాన చక్రం
ఇక రెండవ పొర సృజనాత్మకత వలన కలిగే ఆనందం. అదే స్వాధిష్టాన చక్రం. కొంతమంది దేనినైనా సృష్టించాలని చాలా ఆరాట పడుతూంటారు. ఏదో ఒక పుస్తకాన్నో, లేక ఏదైనా కళాత్మకమైన దాన్నో సృష్టించడం చాలా ముఖ్యమని వారు అనుకుంటారు. ఈ సృజనాత్మకతకు కనుక హేతుబద్ధమైన మెదడు తోడైతే అప్పుడు అలాంటి వారు తామే అందరికన్నా గొప్పవారమని గర్వపడుతూ వుంటారు. ఎందు చేతనంటే వారు తాము చేసే పనులన్నింటి సత్ఫలితాలు వస్తున్నాయని, తన గొప్పతనం వలననే విజయం చేకూరుతోందని భావిస్తారు. ప్రతిదాన్నీ హేతువాదంతో చూస్తారు. అయితే అది సరైన ఆలోచన కాదు. ఈ రెండవపొరని అధిగమించాలంటే నిర్విచార స్థితిలోనికి వెళ్ళాలి. మీ అవగాహన ప్రకాశవంతమైనపుడు మీరు నిర్విచార స్థితిలోకి వెళతారు. అపుడు మీరు ఏమి సృష్టించినా దానిని కేవలం గమనిస్తారంతే. నిర్విచారమైన ఎరుకలో మీరు దేన్ని చూసినా, ఏమి సృష్టించినా దాన్ని ఆనందించ గలుగుతారు. ఎటువంటి ఆలోచనలూ లేని స్థితికి వెళతారు. ఈ గుణం మనలోనే వున్న శ్రీ బ్రహ్మ దేవ సరస్వతి తత్త్వాన్ని జాగృత పరచడం వల్లే సాధ్యమవుతుంది.
– డా. పి. రాకేష్
(అంతర్గత సూక్ష్మ శరీర నాడీ వ్యవస్థ గురించి శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనం ఆధారంగా)