
భగవంతుడు సర్వాంతర్యామి అనేది భారతీయుల విశ్వాసం. అందుకే భారతీయులకు నదీనదాలూ, కొండలూ, గుట్టలూ, జంతువులూ, పక్షులూ... ఒకటేమిటి– అన్నీ పూజనీయాలే. పండుగలూ పబ్బాలలో ప్రకృతితో మమేకమై తన్మయత్వంతో పూజలు చేయడం అందుకే! అయితే వివిధ రూపాల్లో ఉన్న దేవుని గుర్తించడంలో మాత్రం చాలామంది విఫలమవుతూ ఉంటారు. ఇందుకు దైవాన్ని గుర్తించగలిగిన జ్ఞానం వారికి లేకపోవడమే కారణం. దేవుణ్ణి దర్శించుకోవడానికి గుడి లోపలికి చాలా భక్తిప్రపత్తులతో వెళతారు. కానీ గుడి మెట్లపై కూర్చునే యాచకులు, దీనులను చాలామంది పట్టించుకోరు. వారితోనే నిజంగా దేవుడు కూర్చున్నా గుర్తించలేరు. అయితే భగవంతుని గుర్తించడానికి శోధన అవసరం.
ఇదీ చదవండి: బొక్కలిరుగుతాయ్.. అమెరికా టూరిస్ట్కు చేదు అనుభవం, వీడియో వైరల్
అన్వేషించే కొద్దీ భగవంతుణ్ణి ఏదో ఒకరోజు తెలుసుకోవచ్చు. ఆరాధనా పద్ధతులతోపాటు అన్వేషణా జ్ఞానాన్నీ సముపార్జించాలి. ఆ జ్ఞానం లేకపోతే ఆ నారాయణుడే మన ముందుకొచ్చి నిల్చున్నా తెలుసుకోలేం. పైపెచ్చు అనుమానిస్తాం. అతను నిజంగా నారాయణుడేనా అని ఆలోచనలో పడతాం. నారాయణుడేదో మన అవసరాలను తీర్చడానికొస్తే ఎదురు మనమే అవీ ఇవీ అడిగి అనుమానిస్తాం. అప్పుడు ‘నేను సాక్షాత్తూ ఆ నారాయణుడినే నయ్యా’ అని భగవంతుడు చెప్పినా సరే... మన మనసు ఒప్పుకోవడానికి ససేమిరా అంటుంది. ‘అదేంటీ, నాకంత సులభంగా పరమాత్మ ప్రత్యక్షమవుతాడా’ అని సందేహిస్తాం. ఇటువంటి స్థితిలోనైనా మనకు ప్రహ్లాదుడి మాట గుర్తుకు రావాలిగా... ఆ హరి నారాయణుడు లేని చోటేది? అతను సర్వాంతర్యామి అనేది తెలిసుండాలిగా! అలాకాక ‘నీకు శంఖం, చక్రం లేవేమిటీ? నీ వాహనమైన గరుత్మంతుడేడీ?’ అని ప్రశ్నిస్తే ఆ నారాయణుడిని ఎలా చూడగలం?
చదవండి: Miracle Sea Splitting Festival: గంట సేపు సముద్రం చీలుతుంది
మనకు మన మీదే అపనమ్మకం. అటువంటప్పుడు సాక్షాత్తూ ఆ వైకుంఠవాసుడైనా ఏమీ చేయలేడు. కనుక మనకు ఉండాల్సింది నమ్మకం. అన్నింట్లోనూ ఆ భగవంతుడు ఉంటాడనేది తెలియాలి.
– యామిజాల జగదీశ్