
నిర్మల వాణి
మనలోని ఏడుపొరలలోని భవసాగరం, నాభి రెండూ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ధర్మ సంరక్షణలో మనం ఆనందాన్ని పొందుతాం. మనం ఎవరితోనైనా మంచిగా ఉన్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. ఈ ధర్మ బద్ధత అనేది మనలోని భవసాగరం పరిశుభ్రంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఉదయం 4 గంటలకే నిద్రలేచి పెద్దగా హారతిపాటలు పాడుతూ, గంధంచెక్క అరగదీస్తూ పెద్ద పెద్ద స్తోత్రాలు పాడుతూ స్నానమాచరించి ఇంటిల్లిపాదికీ నిద్రాభంగం చేసినంత మాత్రాన అది సదాచార పరాయణత్వం కాక పోవచ్చు. పిల్లల్ని నిద్రపుచ్చి తల్లి బహుశా ఎప్పుడో ఆలస్యంగా పడుకుని ఉండవచ్చు. ఈ ధర్మం అనేది అంతర్గతమైనది.
ఉదాహరణకు మీరు ఏదైనా ఎవరికైనా దానం చేయాలనుకున్నారనుకోండి. అది మీకు, పరమాత్మునికి మధ్య విషయం మాత్రమే. దానిని బాహ్యంగా ప్రకటించ వలసిన పని లేదు. ధర్మమంటే మిమ్మల్ని మీరు అంతర్ముఖంగా పరిశుభ్రపరచుకోవటం ముఖ్యం. అంతే కానీ వేరెవరినో కాదు. మీ హృదయాన్నుండి వచ్చే ఆ ధర్మానందాన్ని, ఆ రసాన్ని మీరే ఆస్వాదించాలి. మీ పవిత్రతను మీరే ఆస్వాదిస్తారు. ఆనందిస్తారు. ధర్మం అనేది మీ హృదయంలో ఎంతవరకు ఉన్నదనేది ముఖ్యం.
అనాహత చక్రం
ఇది చాల ముఖ్యమైన చక్రం. అదే హదయ(అనాహత) చక్రం ‘‘ ఉదార చరితానామ్ వసుధైక కుటుంబం’’ అంటే ఉదార స్వభావులైన వారు ప్రపంచమంతా వారి కుటుంబమే అని భావిస్తారు. ప్రతి ఒక్కరిపట్ల ప్రేమ ప్రవహిస్తూంటుంది. ప్రతి ఒక్కరి సమస్య తమ సమస్యగానే భావిస్తారు. ప్రతి ఒక్కరికీ తానొక తల్లిగా ఉండాలి అని భావించుకోవటం అనే గుణం మధ్య హృదయం నుండి వస్తుంది. ప్రప్రథమంగా హృదయ చక్రం విశిష్టత భద్రత. మీలోని భద్రతా భావాన్ని మీరు అనుభూతి చెందటం. ఆత్మ సాక్షాత్కారం పొందిన వారు ఆ భద్రతాభావాన్ని అనుభూతి చెందగలరు.
మీ సంపూర్ణ భద్రత అనేది మీలోని ఆత్మ మాత్రమే. అంతేగాని వేరే ఏవీ ముఖ్యం కావు. మీరు అలాంటి భద్రతాభావం కలిగి ఉన్నవారైతే మీ పిల్లలు కూడా ఆ భద్రత అనేది తమలోనే ఉన్నదని గ్రహిస్తారు. అటువంటి పిల్లలు నిజమైన ధైర్యవంతులుగా ఉంటారు.
చదవండి: Murugan పళని మురుగన్కి ప్రణామాలు!
మీలోని మీ భద్రతాభావాన్ని మీరు ఆస్వాదించండి. భద్రతాభావం వలన కలిగే ఆనందమే మిమ్మల్ని అధ్యాత్మిక లోతులకు తీసుకుని వెళుతుంది. ఎవరిలో అయితే భగవంతుడు ఉంటాడో, ఎవరికైతే భగవంతుని ఆశీర్వాదాలు ఉంటాయో వారికి అంతకన్నా ఇంకేమి కావాలి? ఎందుకంటే భగవంతుడు సర్వ శక్తిమంతుడు. ఎవ్వరిశక్తీ ఆ భగవంతుని శక్తి కన్నా ఎక్కువకాదు. కాబట్టి మొదటగా మీ మీరు విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఆ విశ్వాసాన్ని మీ హృదయ చక్రంలో పదిల పరచుకోండి. ఆ విశ్వాసమే మీకు రక్షణ ఆనందాన్నిస్తుంది. ప్రపంచంలోని అభద్రతా భావాలన్నింటికీ విశ్వాసమే సమాధానం. మన హృదయంలో జగదంబ అయిన దుర్గామాతను స్థిరపరచుకోవాలి.
– డా. పి. రాకేష్
(మన అంతర్గత సూక్ష్మ శరీర నాడీ వ్యవస్థ గురించి శ్రీ మాతాజీ నిర్మలాదేవి
ప్రవచనం ఆధారంగా)
ఇదీ చదవండి: Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత