Murugan పళని మురుగన్‌కి ప్రణామాలు! | Palani Murugan Swamy Temple Interesting Facts | Sakshi
Sakshi News home page

Murugan పళని మురుగన్‌కి ప్రణామాలు!

Jun 19 2025 9:54 AM | Updated on Jun 19 2025 10:34 AM

Palani Murugan Swamy Temple Interesting Facts

తమిళనాడులో శివమహాదేవునికి, ఆ స్వామి మహితపరివారమైన అర్థాంగి   పార్వతీదేవి, పెద్దకుమారుడు గణేశుడు,  చిన్న కుమారుడు సుబ్రహ్మణ్యులకు ఉన్న  ప్రాచుర్యం, ప్రాధాన్యం, ప్రసిద్ధి అత్యంత విశిష్టమైనవి.. ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి విషయానికి వస్తే చిన్న స్వామి అయిన ఈ ముద్దు మురిపాల ముగ్ధమోహన స్వామికి ఘనమైన చరిత్రే ఉంది. సుబ్రహ్మణ్యుని పేర్ల విషయానికి వస్తే... కుమార, కుమరన్, కుమార స్వామి, స్కంద, షణ్ముఖ, షణ్ముగం, శరవణ, శరవణన్, గుహ, గుహన్‌ మురుగ, మురుగన్‌ – ఇలా ఎన్నో పేర్లున్నాయి. తమిళనాడులో సుబ్రహ్మణ్యస్వామికి గల వైభవ ఆలయాలలో’పళని’   (Arulmigu Dhandayuthapani Swamy) ప్రముఖమైంది. 

ఈ పుణ్యనామానికి ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. శివదేవుడు ఒక సందర్భంలో తన కుమారులైన గణేశుని, కుమారుని పిలిచి, యావత్తు విశ్వాన్ని ఎవరు ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో, వారికి ఒక అద్భుతమైన ఫలాన్ని ఇస్తానని చెప్పాడు. వెంటనే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి విశ్వాన్ని చుట్టి రావడానికి బయల్దేరుతాడు. తన వాహన వేగం ఏమిటో బాగా తెలిసిన వినాయకుడు కొద్దిసేపు ఆలోచించి, విశ్వరూపులైన తన తల్లి, తండ్రుల చుట్టూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ గావించి ఆ అద్భుత ఫలాన్ని  పొందుతాడు. త్వరత్వరగా విశ్వప్రదక్షిణం పూర్తి గావించుకొని వచ్చిన సుబ్రహ్మణ్యస్వామి జరిగిన సంగతి తెలుసుకొని అలుగుతాడు. అది చూసి శివదేవుడు జాలిపడి ’అన్నయ్యకు ఇచ్చిన ఫలం గురించి నీకెందుకు చింత! నీవే ఒక అద్భుత ఫలానివి ‘ఫలం – ని’ నీ పేరిట ఒక సుందర మహిత పుణ్యక్షేత్రం ఏర్పడేటట్లు అనుగ్రహిస్తున్నాను, అది నీ స్వంత క్షేత్రం, అక్కడికి వెళ్లి నివాసం ఉండు’ అంటూ కుమారుని బుజ్జగించాడు. దీంతో వైభవమైన ‘పళని’ రూపుదిద్దుకుంది. అది కుమారుని విశిష్ట నివాస క్షేత్రమయింది!

మురుగన్‌ కొండ
పళనిలోని మురుగన్‌ ఆలయం సహజ సిద్ధమైన ప్రకృతి శోభలతో విలసిల్లే కన్నుల పండుగైన కొండపై నిర్మితమైంది! దీనిని ‘మురుగన్‌ కొండ’ అని కూడా అంటారు. ఆలయ సందర్శనకు 659 మెట్లను ఎక్కవలసి ఉంది. అంత శక్తి లేని వారి కోసమై ‘ఏరియల్‌ రోప్‌ – వే’ ఏర్పాటు చేయబడింది. గిరి ప్రదక్షిణ కోసమై కొండ చుట్టూరా చక్కని రోడ్డు వేయబడింది. సాధారణంగా భక్తులు ముందు గిరిప్రదక్షిణ చేసి ఆ తర్వాత కొండ ఎక్కుతారు!

ఇదీ చదవండి: Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత

ప్రకృతి దృశ్యాలు
మెట్లన్నీ ఎక్కి కొండపై భాగం చేరగానే చుట్టూరా కనిపించే సుందర ప్రకృతి దృశ్యాలు మనసును పులకింపజేస్తాయి. మొట్టమొదట మనకు మనోహరమైన రాజగోపురం దర్శనమిస్తుంది. గోపుర ద్వారం గుండా కాస్త ముందుకు వెలితే వరవేల్‌ మండపం కనిపిస్తుంది. ఈ మండప స్తంభాలు అత్యంత సుందరమైన శిలాచిత్రాలతో మంత్రముగ్ధులు గావిస్తాయి. ఈ మండపం తర్వాత నవరంగ మండపం ఉంది. ద్వారం వద్ద ద్వార΄ాలకుల విగ్రహాలు ఆకర్షణీయంగా మలచబడ్డాయి.

విశిష్టమైన విగ్రహం
గర్భగుడిలో ప్రతిష్టితమైన కమనీయ కుమారస్వామి విగ్రహం 18 మంది సిద్ధులలో ప్రముఖుడైన భోగార్‌ పర్వవేక్షణంలో రూపొందింపబడిందని, ఇది ఔషధ గుణాలు కలిగిన అపురూప విగ్రహమని చెబుతారు. దీనిని ’నవ పాషాణం’ అనే విశేషమైన శిలను మలచి తయారు చేశారని, ఇందులో శక్తిమంతమైన మూలికా పదార్థాలను నిక్షిప్తం గావించారని అంటారు. ఈ విగ్రహం విశిష్టత ఏమంటే, స్వామి పూజల సందర్భంగా ధూప, దీప సమర్పణల సమయాలలో వెలువడే ఉష్ణానికి విగ్రహంలోని సునిశితమైన మూలికా పదార్థం క్రియాశీలమై ఒక విధమైన వాయువులను వెలువరిస్తుందని, వాటిని పీల్చిన వారికి కొన్నివ్యాధులకు సంబంధించిన దోషాలు హరించుకు  పోతాయని ఆరోగ్యవంతులవుతారని చెబుతారు!.

మూలస్థానంలో కొలువు దీరిన కుమారస్వామి భక్తజన సంరక్షకుడుగా, కోరిన వరాలు ప్రసాదించే కొండంత దేవుడుగా అపురూప దివ్య దర్శనభాగ్యాన్ని అందజేస్తారు. కృత్తికా సూనుడైన కుమారునికి ప్రతి నెల కృత్తికా నక్షత్రం నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆషాఢ కృత్తిక సందర్భంగా విశేష వైభవ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.

బోగర్‌ సిద్ధుని సమాధి
ఈ పళని కొండలో బోగర్‌ సిద్ధుని సమాధి, ప్రత్యేక గర్భగుడి ఉన్నాయి. ఇక్కడి స్వామివారి విగ్రహం చిలుక బొమ్మను కలిగి ఉంటుంది. ఇక్కడి స్వామిని కీర్తిస్తూ ‘‘తిరుపుగళ్‌’’ అనే పాటలను అరుణగిరినాథుడు రచించాడు. అంతేకాదు, తన  పాటలతో చిలుక రూపంలో కుమారస్వామితో ఉండే వరం పొందాడని భక్తుల విశ్వాసం. పళని కొండకు వెళ్లే దారిలో ఇడుంపన్‌ మందిరం ఉంది. తెల్లవారుజామున ఇక్కడ  పూజలు చేసిన తర్వాతే, కొండపై ఉన్న కుమారస్వామికి పూజలు చేస్తారు. 
– డి.వి.ఆర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement