
రాచరికాలు నడిచిన ప్రాచీన కాలంలో కూడా సమర్థులైన పాలకులెవరూ నిరంకుశులుగా, నియంతలుగా, కేవలం తమ ఇచ్చ వచ్చినట్టు పరిపాలించటం ఉండేది కాదు. మన పురాణేతిహాసాలలో ప్రసిద్ధులైన రాజులందరూ, రాజ్య పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలను, మేధావులయిన తమ మంత్రుల బృందాలతోనూ, ఇతర నిపుణులతోనూ, అవసరమయితే పౌర ప్రముఖులతోనూ, సామంతులతోనూ, జానపదులతోనూ విస్తృతంగా చర్చించిన తరవాతే తీసుకొనేవాళ్ళని కనిపిస్తుంది. అల్పబుద్ధులూ, ఆసురీ స్వభావులు మాత్రమే అధికార మదాంధకారంతో ధర్మాధర్మ విచక్షణ లేకుండా, నిరంకుశంగా, ఇష్టారాజ్యంగా పాలించి, అందరినీ అవస్థలు పెట్టి, అపయశస్సు కూడగట్టుకొని, ఆయువు తీరగానే కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళు.
దశరథుడు అరవయి వేల సంవత్సరాలపాటు ధర్మబద్ధంగా, ప్రజారంజకంగా పాలన చేశాడని రామాయణం చెబుతుంది. ఏ కీలక నిర్ణయమైనా, ఆయన సంబంధితులందరితో విస్తృతంగా చర్చించిగానీ తీసుకొనేవాడు కాదు అని వాల్మీకి వక్కాణించాడు. దశరథుడికి ఒక సమర్థమైన మంత్రిమండలి ఉండేది. వాళ్ళలో ప్రధానమైన మంత్రులు ఎనిమిది మంది: ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. వీళ్ళుగాక, దశరథుడికి వసిష్ఠుడు, వామదేవుడు ముఖ్య పురోహితులుగా, ధర్మ నిర్దేశకులుగా, గురువులుగా ఉండేవాళ్ళు. వాళ్ళ వాళ్ళ నేపథ్యం గురించి ఎంతో పరిశోధన జరిపించిన తరవాతే, దశ రథుడు తన మంత్రులను నియమించుకొనేవాడు. వాళ్ళు ఎన్నో పరీక్షలు నెగ్గవలసి ఉండేది. అందుకే ఆ మంత్రులందరూ పరువు ప్రతిష్ఠలు కలవారుగా, సంస్కా రులుగా, శాస్త్ర జ్ఞాన నిష్ణాతులుగా ఉండేవారు. వాళ్ళు కుశాగ్ర బుద్ధులు, విద్యావంతులు, లోకజ్ఞులు, నీతి వేత్తలు. ఎప్పుడూ రాజు శ్రేయస్సునూ, రాజ్య శ్రేయస్సునూ కాంక్షించే నిస్వార్థపరులు, నిజాయతీపరులు. అపరాధులయితే, సొంత పుత్రుల నయినా నియమానుసారం దండించే నిష్పక్షపాతులు. ఇంతటి నిపుణులతో, నీతిమంతులతో, ధర్మజ్ఞులతో అన్ని విషయాలూ కూలంకషంగా చర్చించిన తరవాతే అన్ని ముఖ్యమైన నిర్ణయాలూ తీసుకోవటం జరిగేది. కనకనే దశరథుడి సుదీర్ఘ పాలనలో ప్రజలంతా ధర్మమార్గంలో తృప్తిగా, సుఖశాంతులతో జీవించారు అని వాల్మీకి రామాయణం వర్ణిస్తుంది.
– ఎం. మారుతి శాస్త్రి