
ఆత్మదర్శనం
సమస్యలు అనేవి ప్రత్యేకంగా ఉండవు. నీవు శరీరం–మనస్సులతో కలిసిపోయినపుడే సమస్యలనేవి కనిపిస్తాయి. ఆత్మతత్వంలో ఉన్నప్పుడు, సాక్షీభావనతో ఉన్నప్పుడు సమస్యలతో కలిసిపోవు. నీ మనస్సు నీ సంస్కారాలు ఎల్లప్పుడూ నిన్ను ఆత్మపథం నుండి దారిమళ్ళిస్తూనే ఉంటాయి. మనస్సు నిన్ను అత్మతత్వం వైపు వెళ్ళనివ్వదు. మనస్సుతో నీవు కలిసిపోతే సమస్యల్లో మునిగి ఆత్మకు దూరమవుతావు. లేదా శరీర సంబంధమైన సుఖాలు లేదా దుఃఖాలు, ఉద్రేకాలు, ఉద్వేగాలు, ఇష్టాలు, అయిష్టాలు, జబ్బులు, భయాలు మొదలైన వాటిల్లో కూరుకునిపోయి నీ నిజతత్వానికి దూరమయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అత్మపథంలో ఇన్నిరకాల అవరోధాలు తప్పవు. ఐనప్పటికీ దైవ కృప వల్ల ఆత్మదర్శనం పొందుతావు. నీ సంస్కారాలు నశించి ఆత్మ ఉత్తేజితమైనప్పుడు ఆత్మదర్శనం జరుగుతుంది. నీవే ఆ చైతన్యమైపోతావు. ఇదే దైవకృప అంటే. ఆత్మ సహకారమే దైవకృప.
ఆత్మదర్శనం అంత సులభంగా జరిగిపోదు. మనస్సు నిన్ను ఎన్నిరకాలుగా బందీ చేయవచ్చునో అన్ని రూపాల్లోనూ నీకు ఆటంకాలు కల్పిస్తూనే ఉంటుంది, నీ సంస్కారాలకు అనుగుణంగా. ఎన్ని ఆటంకాలు కల్గినా నేను ఆత్మను అనే ఎరుక నిరంతరంగా ఉండాలి. కీర్తి, అపనింద, అధికారం, రకరకాల ఆకర్షణలు, వ్యసనాలు, ఆందోళనలు మొదలైనవి కుటుంబం రూపంలో, పిల్లల రూపంలో భార్యభర్తల రూపంలో, తల్లిదండ్రుల రూపంలో నిన్ను కిందికి లాగటానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఐనప్పటికీ వీటికి అంటకుండా సాక్షీతత్వంలో ఉన్నప్పుడే సత్యాన్ని తెలుసుకోగలవు.
చదవండి: Kerala Tour అరేబియా తీరం, హౌస్బోట్ విహారం
అందుకే భగవద్గీతలో కష్ణుడు అంటాడు. కోటిమందిలో ఒక్కరు మాత్రమే ఆత్మదర్శనాన్ని పొందగలరని. నిజానికి ఇక్కడ గెలుపు ఓటములనేవే ఉండవు. కేవలం సంఘటనలు జరుగుతుంటాయి. మనమే వాటితో కలిసిపోతూ ఉంటాము. నేను సాక్షీచైతన్యాన్ని అని తెలుసుకున్నప్పుడు ద్వంద్వాలు నీకు అంటనే అంటవు. జీవితంలో వచ్చే గెలుపు ఓటములు, లాభనష్టాలు, శరీరానికి వచ్చే వ్యాధులు మొదలైన వాటికి అతీతంగా ఎదగాలి. మన సంస్కారాల వల్లనే ఇవన్నీ ఏర్పడతాయి. శరీరం–మనస్సు నిత్యం మనల్ని ఆత్మతత్వం నుండి మళ్ళిస్తూ ఉంటుంది. ఇవన్నీ రకరకాల బంధనాలే. వేటికి చిక్కినా మళ్ళీ రాగద్వేషాల్లో పడి దుఃఖంలో కూరుకుపోతావు. అందుకే ఆత్మదర్శనం పొందడం అంత సులభం కాదంటారు. శరీరానికి కష్టం కల్గినపుడు లేదా ఏదైనా జబ్బు వచ్చినపుడు శరీరంతో మరింతగా కలిసిపోయి వ్యథలో కూరుకుపోయే అవకాశాలెక్కువ. శరీరానికి నొప్పి కల్గినప్పుడు ఈ శరీరం నేను కాదు, దీని వెనుక సాక్షిగా చూస్తున్న చైతన్యాన్నే నేను అనే ఎరుకను నిత్యం తీసుకురావాలి. అప్పుడే ఆ సంస్కారం నుండి బయటపడగలవు.
ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ బర్త్డే బాష్, ఇదే హైలైట్!
అలాగే శత్రువులు, మిత్రులు, నీ పిల్లలు, భార్య/భర్త, తల్లిదండ్రులు, వృత్తి, సౌకర్యాలు మొదలైన వాటికి సంబంధించిన ఆలోచనలు వచ్చినప్పుడు కూడా వాటిని దూరం నుంచి సాక్షిగా చూడగలగాలి. ఈ సాక్షీ తత్వం నిరంతరంగా ఉన్నప్పుడే శరీరం–మనస్సుల నుండి బయటపడగలవు. వాటికి అతీతుడివి కాగలవు.
– స్వామి మైత్రేయ
ఆధ్యాత్మిక బోధకులు