
భక్తుడు తన జీవితంలో అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది!!... భగవంతుడు తనకు సన్నిహితంగా ఉన్నవారిని అనేక రకాలుగా పరీక్షిస్తుంటాడు!!... ’కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, అవమానాలు... ఇవన్నీ ఆ పరీక్షలో భాగాలే! వాటిని ఒకటి తరువాత మరొకటి ఇస్తూ ఉంటాడు ‘నన్ను అట్టే అంటిపెట్టుకుని ఉంటాడా! లేదా విసుగుతో నన్ను దూరం చేసుకుంటాడా?’ అని అయన చూస్తూ ఉంటాడు!!... ఒకసారి పరీక్షలో ఉత్తీర్ణులం అయ్యాక మరొక పరీక్ష ఉండటం... లేకపోవడం ఆయన ఇష్టం...!
కానీ ఒకసారి విఫలం అయ్యాక మాత్రం మళ్ళీ పరీక్ష పెట్టడం జరగదు! ఎందుకంటే అప్పటికే మన సామర్థ్యం అయనకు తెలిసిపోతుంది కనుక, ఈ విషయం మనం చక్కగా గ్రహించి కష్ట నష్టాలు వచ్చినపుడు దైవాన్ని నిందించక, మరువక, విడువక ఆయనపై విశ్వాసంతో సహనం వహించాలి. అప్పుడే అయన తన అనుగ్రహాన్ని పుష్కలంగా అందిస్తాడు!!...
ఎలా వచ్చిన కష్ట నష్టాలు అలా పోతాయి. అయితే మన విశ్వాసం, సహనం ఎలా ఉండాలంటే పరీక్ష పెట్టీ పెట్టీ ఆయనే విసుగు చెందిపోవాలి...అంతేకానీ నేను రోజూ పూజలు, అభిషేకాలు చేస్తున్నాను, నాకు ఈ పని కావాలి, ఆ పని జరగాలి, లేకపోతే ఎందుకు అని అనుకోరాదు. అంతా బాగున్నప్పుడు అదంతా మన వల్లే అనుకుని పొంగిపోయి, సౌఖ్యాలు కలుగనపుడు మాత్రం దైవాన్ని నిందించటం తగదు, దానికంటె మనలో విశ్వాస లోపం ఎక్కడైనా ఉందేమో చూసుకోవాలి.
ఇదీ చదవండి: ప్రేమించే వ్యక్తి.. ఆలోచించే వ్యక్తికన్న వెయ్యిరెట్లు ఉత్తమం! ఎలా?
కొన్నిసార్లు అంతా బాగానే ఉన్నట్లు అనిపించవచ్చును, కానీ ఎక్కడో ఏదో మూలన చిన్న సందేహం మిగిలిపోయిందేమో అని చూసుకోవాలి. పాత్రలో నీరంతా బయటకు పోవడానికి పాత్రంత రంధ్రం అవసరం లేదు... చిన్న రంధ్రం ఉంటే చాలు పాత్రలో నీరంతా బయటకు పోవడానికి, కనుక ఆ చిన్న రంధ్రం ఎక్కడుందో కనుక్కుని దానిని మూసివేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని నిందిస్తూ కూర్చోకూడదు. దైవనింద వల్ల మరింత పాపం చుట్టుకుంటుంది తప్ప సమస్యలు తీరిపోవు! విశ్వాసమే అసలైన పరిష్కారాన్ని ఇస్తుంది.