అవి ప్రతి యేటా జరిగే బ్రహ్మోత్సవాలు కాదు... సనాతనంగా నిర్వహించుకునే నవరాత్రులూ కాదు తరతరాలుగా చేసుకునే పండుగలో పర్వదినాలో కాదు అలాగని అది మునుపెన్నడూ చేయని క్రతువు కాదు. వేదాలు.. పురాణేతిహాసాలు అందించిన ఒక చిన్న వెలుగుకు కోటికాంతులు అద్దిన ఉత్సవం. కార్తికమాసానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన అద్భుతం. సుమారు పుష్కరకాలం క్రితం కార్తికమాసానికి నూతన వైభవాన్ని తీసుకువచ్చిన సంరంభం. అదే భక్తిటీవీ కోటి దీపోత్సవం.
కార్తికమాసం వస్తోందనగానే ఆస్తికులందరికీ గుర్తుకువచ్చే అపురూప సంరంభం. భక్తిటీవీ కోటిదీపోత్సవం. చరిత్రలో మునుపెవ్వరూ చేయని విధంగా భక్తిటీవీ చేపట్టిన విశిష్ట కార్యక్రమం కోటిదీపోత్సవం. 2012లో లక్షదీపోత్సవంగా ప్రారంభమైన ఈ దీపయజ్ఞం.. 2013లో కోటిదీపోత్సవమై... పుష్కరకాలానికి పైగా భక్తుల మదిలో అఖండజ్యోతిగా వెలుగొందుతోంది. ఎప్పటిలాగే భక్తుల నుంచి ఎలాంటి రుసుములు, కానుకలు తీసుకోకుండా.. ప్రాంగణంలో ప్రమిదలు, నూనె, వత్తులు, శివలింగాలు, దేవతాప్రతిమలు, పూలు, పూజాసామాగ్రి ఇలా ప్రతీది ఉచితంగా సిద్ధం చేస్తారు.
సుమారు పుష్కరకాలం క్రితం... పదమూడేళ్లక్రితం
శృంగేరీ దక్షిణామ్నాయ పీఠ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారు విజయ యాత్రలో భాగంగా భాగ్యనగరానికి విచ్చేశారు. ఈ సందర్భాన్ని రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత తుమ్మల నరేంద్రచౌదరి, రమాదేవి దంపతులకు ఓ సంకల్పం కలిగింది. భక్తులందరి సమక్షంలో వారికి గురువందనం చేయాలని భావించారు. దానితోపాటు కార్తికమాసంలో శివస్వరూపమైన జగద్గురువులు స్వయంగా విచ్చేశారు గనుక.. వారి సమక్షంలో కార్తికదీపోత్సవం నిర్వహించాలని సంకల్పించారు. ఆ చిన్న సంకల్పానికి ప్రతిరూపమే 2012లో జరిగిన లక్షదీపోత్సవం. భక్తిటీవీ చేపట్టిన దీపయజ్ఞానికి నాంది అది. ఎన్టీఆర్స్టేడియం వేదికగా కైలాసాన్ని తలపించే సభావేదికను ఏర్పాటు చేశారు. ఆ వేదికపై శృంగేరి జగద్గురువులు దీపారాధన చేసి భక్తులను ఆశీర్వదించారు.
ముక్కోటి దేవతలు ఒక్కటైనారు...
కార్తికమాసంలో శంకరనారాయణులనే కాదు.. సమస్త దేవతలను కోటిదీపోత్సవ వేదికపై దర్శించుకోవచ్చు. వారికి జరిగే కల్యాణోత్సవాలను, విశేష పూజలను వీక్షించవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూతలింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, శ్రీవైష్ణవ దివ్యదేశాలు ఇలా అనేకానేక విశిష్టధామాల నుంచి కోటిదీ΄ోత్సవ వేదికపై ఉత్సవమూర్తులు కొలువుదీరతాయి. ఆ ఉత్సవర్లను దర్శించడం సాక్షాత్తూ ఆ క్షేత్రాలకు వెళ్లడంతో సమానం. ఉజ్జయిని, అరుణాచలం, వేములవాడ, కాళేశ్వరం వంటి శైవ క్షేత్రాలు.. యాదాద్రి, శ్రీరంగం, కొండగట్టు తదితర వైష్ణవ క్షేత్రాలు... అలంపురం, కంచి, వారణాసి వంటి శక్తిపీఠాలు. ఇలా ఒకటేమిటి దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ దేవతామూర్తులు కోటిదీ΄ోత్సవ వేదికపై కొలువుదీరతారు. కోటిదీపోత్సవం అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు... పాల్గొనే ప్రతీ భక్తుడికి ఎన్నో అద్భుత ఆధ్యాత్మిక అనుభవాలు పదిలపర్చుకునే మహాపర్వం. ఎన్నో పూజలు – పరిణయోత్సవ వైభవ సమాహారం.
గురుర్దేవో మహేశ్వరః
ప్రతి ఏటా దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ జగద్గురువులు, పీఠాధిపతులు తరలి వస్తుంటారు. శివైక్యం చెందిన కంచికామకోటి పీఠాధిపతి శ్రీజయేంద్రసరస్వతి, పుష్పగిరి పీఠాధిపతి శ్రీవిద్యానృసింహ భారతిస్వామి, ఉడిపి పెజావర్ మఠం పీఠాధిపతి శ్రీవిశ్వప్రసన్నతీర్థస్వామి, ఆర్షవిద్యాగురుకులం శ్రీదయానందసరస్వతి వంటి మహామహులు కోటిదీపోత్సవానికి విచ్చేసి భక్తులను అనుగ్రహించడం వీక్షకుల అదృష్టం.
శృంగేరి శంకరాచార్య భారతీ తీర్థమహాస్వామి, పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి, జ్యోతిర్మఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానందస్వామి, ఈశా ఫౌండేషన్ సద్గురు జగ్గివాసుదేవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ, సమతామూర్తి స్థాపకులు త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైసూరు దత్తపీఠం పీఠాధిపతి శ్రీగణపతి సచ్చిదానందస్వామి, కుర్తాళం పీఠాధిపతి శ్రీవిద్యాశంకరభారతిస్వామి, ధర్మస్థల క్షేత్రాధికారి వీరేంద్రహెగ్డే, అక్షయ΄ాత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీమధుపండితదాస, ఇస్కాన్ అంతర్జాతీయ అధ్యక్షులు జయపతాకస్వామి, పతంజలి యోగ బాబారామ్ దేవ్, కుర్తాళం పీఠాధిపతి శ్రీసిద్ధేశ్వరానంద భారతిస్వామి, రుషికేశ్ పరమార్థ్నకేతన్ చిదానంద సరస్వతి, కాశీ – శ్రీశైల జగద్గురువులతో పాటు ఎందరెందరో యోగీశ్వరులు, పీఠాధిపతులు, జగద్గురువులు, మాతాజీలు భక్తిటీవీ కోటిదీపోత్సవానికి విచ్చేసి భక్తులను అనుగ్రహించారు. గురుదేవులే మహేశ్వరులై భక్తకోటిని అనుగ్రహించారు. ఈ ఏడాది సైతం శృంగేరి జగద్గురు విధుశేఖరభారతిస్వామివారు.. కంచి జగద్గురు విజయేంద్రసరస్వతి స్వామివారు విచ్చేయడం కోటిదీపోత్సవానికి సూర్యచంద్రుల ఆగమనం లాంటి శుభతరుణం.
సువర్ణాక్షరాల ఘట్టాలు
కోటిదీపోత్సవ చరిత్రలోనే కాదు... భక్తిటీవీ ప్రస్థానంలో సైతం సువర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుత ఘట్టాలు. కోటిదీపోత్సవం – 2023. కోటిదీపోత్సవం – 2024. రెండేళ్ల క్రితం మహాదేవునికి కోటిదీపాల నీరాజనం అర్పించేందుకు తుమ్మల నరేంద్రచౌదరి – రమాదేవి దంపతుల ఆహ్వానం మేరకు.. సాక్షాత్తూ దేశప్రధానమంత్రి నరేంద్రమోది విచ్చేయడం... దీపారాధన కార్యక్రమాన్ని ఆద్యంతం గమనించి.. తాను సాక్షాత్తూ కాశీలోనే ఉన్న భావన కలుగుతోందని ప్రశంసించడం ఓ అపూర్వ జ్ఞాపకం. గతేడాది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేయడం మరో మరపురాని ఘట్టం. దేశ ప్రథమ ΄ పౌరురాలి చేతులమీదుగా కార్తికదీపం వెలిగింది. భక్తుల ఆనందం కోటిదీపాల కాంతులై మెరిసింది. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా అదృష్టమని ద్రౌపది ముర్ము పేర్కొనడం అద్వితీయం.

సప్తహారతులు... మహానీరాజనాలు
ఈ అపూర్వ వేడుకలో అన్నింటికీమించిన ప్రధాన ఘట్టం దీపారాధన. ప్రధాన వేదికపై పీఠాధిపతులు, అతిరథ మహారథుల సమక్షంలో తొలి దీపారాధన జరిగిన వెంటనే.. కైలాస ప్రాంగణమంతా కాంతులీనుతుంది. అప్పటిదాకా విద్యుత్ దీపాల వెలుగులతో ఉన్న ప్రాంగణం నిజమైన దీపకాంతులతో మెరిసిపోతుంది. ప్రాంగణంలోని భారీ శివలింగానికి నిర్వహించే మహానీరాజనం మరో ఎత్తు. ప్రమథ గణాలు తరలివచ్చి మహాదేవునికి మహానీరాజనం చేస్తున్నారా అనేంతలా ఉంటుందా అద్భుత దృశ్యం. ఇలాంటి అనేక ఘట్టాలను వీక్షించే భక్తులకు శివుడు ఎక్కడో కాదు.. ఈ కోటిదీపోత్సవ ప్రాంగణంలోనే ఉన్నాడని అనిపించక మానదు.
లక్ష కాదు.. కోటి
2013లో... మళ్లీ కార్తికమాసం రానే వస్తోంది. 2012లో జరిగిన వైభవం ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది. లక్షదీపోత్సవం కంటే మించినది ఏదైనా చేయాలని తుమ్మల నరేంద్రచౌదరి, రమాదేవి – వారి కుమార్తె రచనా చౌదరిల సంకల్పం. ఆ సంకల్పానికి ప్రతిరూపమే అంతవరకూ ఎవరూ చేయని మహోత్సవం. నూతన ఆధ్యాత్మిక యుగానికి పునాదులు వేసిన భక్తిటీవీ కోటిదీపోత్సవం. ఆనాడు వెలిగిన దీపజ్యోతి ఇంతింతై అన్నట్లుగా... పుష్కరకాలంగా కొనసాగుతోంది. అఖండదీపమై ప్రకాశిస్తోంది. ప్రతి ఏటా కొత్త కొత్త హంగులతో వెలుగొందుతోంది. కోటిదీ΄ోత్సవానికి వస్తే సమస్త క్షేత్రాలకు వెళ్లినట్లే అనే భావన ప్రతీ భక్తుడికీ కలిగేలా కార్యక్రమ రూపకల్పన జరిగింది.

నటరాజుకు కళాంజలి: జానపద కళలకు సైతం కోటిదీపోత్సవం పెద్దపీట వేస్తుంది. కథకళి, కైకుట్టి, మోహినిఆట్టం, ఒడిస్సీ, మణిపురి, లావణి వంటి సంప్రదాయ నృత్యాలతో పాటు.. డోలుకుణిత, భాంగ్రా, కోలాటం వంటి అనేకానేక విభిన్న పదనర్తనలు కోటి దీ΄ోత్సవ వేదికపై కదం తొక్కనున్నాయి. ఇందుకోసం ప్రసిద్ధ కళాకారులు సైతం తరలివస్తారు. సద్గురు జగ్గీవాసుదేవ్ ఆధ్వర్యంలోని ఈశా ఫౌండేషన్ తరఫున బ్రహ్మచారులు చేసే అగ్నినృత్యం భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి ఎన్నో అద్భుత ప్రదర్శనలు ప్రతిఏటా చోటుచేసుకుంటాయి.
ఆ అపూర్వ యజ్ఞంమరోమారు...కార్తికమాసాన్ని పురస్కరించుకునినవంబరు1 నుంచి 13 వరకుహైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో...


