సీతారామచంద్ర స్వామికి కాసుల పంట | Bhadrachalam temple earns more than Rs 1 crore in hundi offerings | Sakshi
Sakshi News home page

Bhadrachalam: భ‌ద్రాద్రి రామ‌య్య‌కు కాసుల పంట

Feb 7 2025 5:17 PM | Updated on Feb 7 2025 5:17 PM

 Bhadrachalam temple earns more than Rs 1 crore in hundi offerings

36 రోజులకు రూ.1.13 కోట్ల ఆదాయం

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో స్వామి వారికి కాసుల పంట పండింది. ఆలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం దేవాదాయ శాఖ, దేవస్థాన అధికారుల సమక్షాన చిత్రకూట మండపంలో లెక్కించారు. ఈ సందర్భంగా 36 రోజులకు రూ.1,13,23,178 ఆదాయం నమోదైంది. ఇవికాక 0.109 గ్రాముల బంగారం (Gold), 0.895 గ్రాముల వెండితో పాటు యూఎస్, సింగపూర్, ఆస్ట్రేలియా, యూఏఈ దేశాల కరెన్సీ వచ్చిందని ఈవో రమాదేవి తెలిపారు. జనవరిలో స్వామి వారి అధ్యయనోత్సవాలు, ఉత్తర ద్వారదర్శనం, తెప్పోత్సవం, సంక్రాంతి (Sankranti) సెలవులు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు రావడం వల్ల కూడా ఆదాయం పెరిగిందని భావిస్తున్నారు.  

నేత్రపర్వంగా  రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

పూర్వగిరిలో బ్రహ్మోత్సవాలు నేటి నుంచి
యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఆలయాన్ని రంగులతో తీర్చిదిద్దారు. శ్రీస్వామి వారు ఊరేగే వాహన సేవలను, ఆలయంలో యాగశాలను సైతం సిద్ధం చేశారు. ఈనెల 7వ తేదీ (శుక్రవారం) నుంచి.. ఈ నెల 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఏడు రోజులు మొక్కు పూజలు రద్దు చేస్తున్నట్లు ఈవో భాస్కర్‌రావు వెల్లడించారు. పూర్వగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు శుక్రవారం ముగిశాయి.

కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం 
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం దేవస్థానంలో మహాకుంభాభిషేకం సంప్రోక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి ఆదివారం వరకు నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నా యి. ఈ మేరకు దేవస్థానంలో దేవాదా యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆలయం, గోపురాల పైకి ఎక్కి కలశాలకు సంప్రోక్షణ జరిపేందుకు పరంజాలతో మెట్ల మార్గం నిర్మించారు. ప్రధాన ఆలయంతోపాటు గోపురాలకు తుని తపోవనం పీఠా ధిపతి సచ్చిదానందసరస్వతితో కుంభాభిషేకం నిర్వహించనున్నారు. మూడు రోజు లు భక్తులకు ఉచిత ప్రసాదం, అన్నదానం నిర్వహిస్తారని ఈవో మహేశ్‌ తెలిపారు. 

చ‌ద‌వండి:  పవిత్రం... ఫలప్రదం భీష్మ ఏకాదశి  

Advertisement
 
Advertisement
Advertisement