దేవతలు నడయాడిన నేల‌.. అద్భుత మహిమలు! | Sri Dattatreya Temple at Krishna Bhima Nadula Sangamam | Sakshi
Sakshi News home page

దేవతలు నడయాడిన నేల‌.. అద్భుత మహిమలు!

May 31 2025 7:32 PM | Updated on May 31 2025 8:22 PM

Sri Dattatreya Temple at Krishna Bhima Nadula Sangamam

తెలంగాణ సరిహద్దులో కృష్ణా, భీమా నదుల కలయిక

దేవతలు నడయాడిన స్థలంగా ప్రసిద్ధి 

రుషులు, మునులు తపస్సు ఆచరించిన ప్రాంతం 

సంగమ ప్రాంతంలో స్నానం ఆచరిస్తే పాపాల నివృత్తి

నారాయణపేట/కృష్ణా: నారాయణపేట జిల్లా కృష్ణా మండలం తంగిడి గ్రామ సమీపంలోని కృష్ణా, భీమా నదుల సంగమ ప్రాంతం ఓ విశిష్టమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడే భీమా నది తెలంగాణలోకి ప్రవేశించి.. తంగిడి క్షేత్రంలోనే కృష్ణానదిలో విలీనమవుతుంది. దేవతలు నడయాడిన స్థలంగా, రుషులు, మునులు తపస్సు ఆచరించిన దైవభూమిగా, ఎన్నో అద్భుతాలు, మహిమలు జరిగిన క్షేత్రంగా తంగిడికి ఘన చరిత్ర ఉంది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు (Pilgrims) ఆసక్తి చూపుతున్నారు. 

ఇక్కడే రెండు పుష్కరాలు.. 
తెలంగాణ, కర్ణాటక సరిహద్దులోని కృష్ణా మండలం తంగిడి వద్ద కృష్ణా, భీమా నదులు కలుస్తాయి. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే పుష్కరాలకు కృష్ణా, భీమా సంగమ ప్రాంతం ప్రత్యేకత చాటుతోంది. 2016, ఆగస్టు 12 నుంచి 23 వరకు 12 రోజులపాటు పుష్కరాలు జరిగాయి. 2028లో ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకు జరిగే పుష్కరాలకు సిద్ధమవుతోంది. భీమా పుష్కరాలు 2018, ఆక్టోబర్‌ 11 నుంచి 22వ తేదీ వరకు తంగిడి, కుసుమూర్, శుక్రలింగంపల్లి గ్రామాల్లో జరిగాయి. 2030, అక్టోబర్‌ 11 నుంచి 22వ తేదీ వరకు పుష్కరాలు (Pushkaralu) జరగనున్నాయి. అయితే సంగమ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. 

 

దక్షిణం వైపు ప్రవాహం.. 
భీమానది దక్షిణం వైపు ప్రవహిస్తుంది. ఇది కాశీలోని గంగానదితో సమానం. గయాలోని హోళీ స్థలమైన ప్రజలు పుష్కర స్నానం ఆచరించడం స్వచ్ఛమైనదని, పవిత్రమైన ప్రదేశమని హిందువులు భావిస్తారు. తంగిడి వద్ద కృష్ణా, భీమా నదుల సంగమాన్ని నివృత్తి సంగమం అని పిలుస్తారు. గత చరిత్ర ప్రకారం దత్తాత్రేయ అవతారమెత్తిన స్వామి శ్రీపాదవల్లభ కురువపురం అనే ప్రదేశం ఈ సంగమానికి చాలా దగ్గరగా ఉంది. ఈ ప్రదేశం ప్రత్యేకత కలిగి ఉండటం, తెలంగాణ రాష్ట్రంలోకి కృష్ణానది ప్రవేశ స్థలం కావడంతో ఈ సంగమం ఎంతో విశిష్టతను సంతరించుకుంది.  

ఇక్కడే విద్యుత్‌ శక్తి పుట్టింది.. 
సాక్షాత్‌ జగద్గురు శ్రీదత్తాత్రేయ మహాస్వామి మొదటి అవతార పురుషుడైన శ్రీపాద వల్లభుడు తంగిడి క్షేత్రంలోని కృష్ణా, భీమా నదుల సంగమక్షేత్రంలో స్నానం ఆచరించి తపస్సు చేసినట్లు వేదాల్లో పేర్కొనబడింది. అప్పటి నుంచి ఈ క్షేత్రాన్ని నివృత్తి సంగమంగా పేరు గాంచిందని దత్త పీఠాధిపతులు చెబుతుంటారు. అలాగే ఈ ప్రాంతంలో సంగమేశ్వరుడి ఆలయం ఉంది. ఇది అతి పురాతనమైన దేవాలయం. 

ఇక్కడ కొడెకల్‌ స్వామీజీ చెప్పినట్లు ఈ నది నీటి ద్వారానే ఓ శక్తి పుడుతుంది. ఆ తర్వాత సంగమంలోని రాతి కోడి కూస్తుంది. ఆ కోడి కూసిన రోజు ఈ ప్రపంచం మునిగిపోతుందని ఓ శిలాశాసనం ఉంది. ఆ శాసనంలో చెప్పినట్లే ఇక్కడున్న బురుజుపై రాతి కోడి ఉండేది. అది ప్రస్తుతం శిథిలమైంది. అలాగే శాసనం కూడా శిథిలమైపోయింది. కానీ ఈ మాటలను మాత్రం ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడూ అంటుంటారు. అలాగే ఆ స్వామీజీ చెప్పినట్లు ఈ నీటి ద్వారానే శక్తి పుడుతుందని చెప్పినట్లే కర్ణాటకలోని శక్తినగర్‌లో పవర్‌ ప్లాంట్‌ ద్వారా విద్యుత్‌శక్తి ఉత్పత్తి అవుతోంది.  

సంగమ క్షేత్రం ప్రత్యేకతలివీ..  
కృష్ణా మండలం తంగిడి వద్ద కృష్ణా, భీమా నదులు కలిసే ప్రాంతమే సంగమ క్షేత్రం. ఈ క్షేత్రానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని, అక్కడ దేవతలు, రుషు లు, మునులు తపస్సు ఆచరించినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. ఈ ప్రాంతం ఒకప్పుడు దివ్యక్షేత్రంగా వెలుగొందిందని ప్రసిద్ధి. దత్తాత్రేయ మొదటి మానవ అవతారం ఎత్తిన శ్రీపాద వల్లభుడు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు. ఇప్పటికీ ఆయన జన్మించిన ఇల్లు అక్కడ ఉండటం విశేషం. అక్కడ 16 ఏళ్ల వరకు ఉండి దేశ సంచారం నిమిత్తం వెళ్లిపోయారు. అలా వెళ్లిన వ్యక్తి.. కొన్నేళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా మాయమయ్యారు. ఆ తర్వాత కార్తీక పౌర్ణమి నాడు తంగిడిలోని నివృత్తి సంగమంలో ప్రత్యక్షమయ్యారు. ఇక్కడ కొన్ని సంవత్సరాల పాటు తపస్సు ఆచరించి.. ఇక్కడి నుంచి కర్ణాటకలోని కుర్మగడ్డకు వెళ్లారని చారిత్రక ఆధారాలున్నాయి.

ఇప్పటికీ ఈ సంగమంలో శ్రీపాదుడు తపస్సు చేసిన వినాయక విగ్రహం, ఆయన పాదుకలు, శివలింగం ఉన్నాయి. ఆయన ఇక్కడి నుంచి కుర్మగడ్డకు నడుచుకుంటూ వెళ్లిన మార్గంలో నదిలో నల్లరాయితో రోడ్డు వేసినట్లు ఇప్పటికీ ఇక్కడ ప్రత్యక్షంగా కన్పిస్తాయి. ఇంతటి విశేషమైన ఈ ప్రాంతాన్ని తెలుసుకున్న విఠల్‌బాబా అప్పట్లో దత్త భీమేశ్వర ఆలయం నిర్మించారు. ఈ నివృత్తి సంగమంలో స్నానం ఆచరించిన భక్తులకు పాపాలు నివృత్తి అవుతాయని ప్రసిద్ధి. ఈ స్థానం తెలంగాణకు ఓ వరంలాంటిది. ఇలాంటి క్షేత్రం మరెక్కడా లేదని, ఇది ఓ మానస సరోవరం అని దత్త పీఠాధిపతులు అంటున్నారు. 1557–58లో విజయనగర రాజు రామరాయ బహమన్‌ సుల్తానులను ఓడించి ఈ సంగమం ఒడ్డున కుతుబ్‌షాహీ, ఆదిల్‌షాహీ, నిజాంషాహీ, బరీద్‌ షాహీ సుల్తానులతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

బ్రిడ్జి నిర్మించాలి 
నది అటువైపు కర్ణాటకలో ఉన్న సంగమ క్షేత్రానికి ఇటువైపు ఉన్న భక్తులు వెళ్లేందుకు బ్రిడ్జిని నిర్మించాలి. అప్పుడే అక్కడి భక్తులు ఇక్కడికి, ఇక్కడి భక్తులు అక్కడికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు కృషి చేయాలి. 
– శ్రీకాంత్‌చారి, పురోహితుడు

చ‌ద‌వండి: మ‌త్స్య‌రూపం.. శుభ సంక‌ల్పం

పర్యాటకంగా తీర్చిదిద్దాలి 
తంగిడి వద్ద ఉన్న సంగమ క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కలి్పంచాలి. కృష్ణా, బీమా నదుల సంగమం వద్ద స్నానాల గదులతో పాటు దుస్తులు మార్చుకునేందుకు గదులు నిర్మించాలి.  
– అమర్‌కుమార్‌ దీక్షిత్, కృష్ణా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement