Narayanpet District News
-
మామిడి క్లస్టర్తో మేలు
కొల్లాపూర్: నాణ్యమైన ఉత్పత్తులు.. ఎగుమతులకు అనుకూలమైన పంటల సాగును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్లస్టర్ విధానం మామిడి రైతులకు ఉపయోగకరంగా మారింది. మామిడి సాగుకు ప్రసిద్ధిగాంచిన గుజరాత్ రాష్ట్రంలోని కచ్, ఉత్తర్ప్రదేశ్లో లక్నో, తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు జిల్లాలను మూడేళ్ల క్రితం కేంద్రం క్లస్టర్ జోన్లుగా గుర్తించింది. పాలమూరు క్లస్టర్లో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, గద్వాల, వనపర్తి ఉండగా.. క్లస్టర్ సేవల్లో భాగంగా జిల్లాకు రూ.200 కోట్లు కేటాయించింది. నాలుగేళ్ల పాటు ప్రణాళికాబద్ధంగా నిధుల విడుదలకు నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో.. ఉమ్మడి పాలమూరులోని కొల్లాపూర్ నియోజకవర్గంలో మామిడి సాగు అధికంగా ఉంటుంది. ఇక్కడ పండే మామిడికి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. కేంద్రం ప్రకటించిన క్లస్టర్ డెవలప్మెంట్ అథారిటీని కేంద్ర, రాష్ట్ర ఉద్యాన శాఖలు సయన్వయంతో నిర్వహిస్తున్నాయి. క్లస్టర్ అభివృద్ధిలో భాగంగా ఈ ఏడాది ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గంలోనే 62 లక్షల మామిడి కవర్లను సబ్సిడీపై రైతులకు అందజేశారు. జిల్లావ్యాప్తంగా కోటికిపైగా కవర్ల పంపిణీ జరిగింది. మామిడి కాయలకు కవర్లు కట్టడం వల్ల ఎలాంటి రసాయనాలు వాటిపై పడవు. చీడపీడలు కూడా ఆశించవు. కాయలు మంచి రంగులో ఉంటాయి. కవర్లు కట్టిన కాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో సాధారణ కాయలకు, కవర్ కాయలకు మధ్య టన్నుకు రూ.30 వేలకు పైగా ధర అధికంగా పలుకుతోంది. దీనివల్ల రైతులు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సాగు ఇలా.. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 62,612 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. మరో 10 వేల ఎకరాల్లో కొత్తగా సాగు చేపట్టారు. అత్యధికంగా కొల్లాపూర్ నియోజకవర్గంలోనే 31,728 ఎకరాల్లో మామిడి సాగు జరుగుతోంది. వీటిలో పంట కాపు వచ్చే తోటలు 30 వేల ఎకరాల మేరకు ఉన్నాయి. సురభి సంస్థానాధీశుల కాలం నుంచి ఈ ప్రాంతంలో మామిడి తోటలు సాగుచేస్తున్నారు. ఇక్కడ పండే బేనిషాన్ రకం మామిడికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. బేనిషాన్ రకం మామిడికి జాతీయస్థాయి గుర్తింపు కూడా ఉంది. బేనిషాన్తోపాటు హిమాయత్, దెషేరీ, కలెక్టర్, బంగారు, జహంగీర్ పసంద్, మోతిమోనీ పసంద్, చిన్నరసాలు, పెద్దరసాలు, మల్గుబా వంటి నోరూరించే మామిడి పండ్లు ఇక్కడ పండుతాయి. క్లసర్ ద్వారా ప్రోత్సాహకాలు.. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం బాధ్యతలను గ్రాండ్ కార్టన్ కంపెనీ, ప్రసాద్ సీడ్స్ కంపెనీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మామిడి సాగు విధానాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. నాణ్యమైన పంట ఉత్పత్తి కోసం సబ్సిడీపై పేపర్ కవర్లు ఇస్తున్నారు. కాయలు కత్తిరించేందుకు, కొమ్మలు నరికేందుకు అవసరమైన సామగ్రిని ఇస్తున్నారు. డ్రిప్ సౌకర్యం, క్లయిమింగ్ ల్యాడర్స్, దపోలి హార్వెస్టర్ పరికరాల పంపిణీ, పండ్లు మాగ బెట్టేందుకు అవసరమైన వసతులను స్థానికంగా కల్పించేందుకు చర్యలు చేపట్టారు. క్లస్టర్ పరిధిలోని మొత్తం 62 వేల ఎకరాల రైతులందరికీ ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించారు. త్వరలోనే ప్రాసెసింగ్ యూనిట్.. పెద్దకొత్తపల్లి మండలంలో రూర్బన్ మిషన్ పథకం కింద రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన మామిడి ప్రాసెసింగ్ యూనిట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం విద్యుత్ లైనింగ్ పనులు జరుగుతుండగా.. మిగతావన్నీ పూర్తయ్యాయి. దీని నిర్వహణ బాధ్యతలు మహిళా సంఘాలు లేదా మామిడి రైతులకు అప్పగించాలని భావిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే గ్రేడింగ్ వారీగా ఇక్కడే ప్రాసెసింగ్ చేసి ఎగుమతులు చేసేందుకు వీలుంటుంది. నాణ్యతలో బెటర్.. కొల్లాపూర్ మామిడికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. కేంద్రం మన ఉమ్మడి పాలమూరు జిల్లాను క్లస్టర్గా గుర్తించడం వల్ల మామిడి సాగుకు అవసరమైన వసతి, సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. ఇందుకోసం నిధులను కూడా కేటాయించింది. మన మామిడి మంచి రంగు, రుచి, వాసన కలిగి ఉంటుంది. నాణ్యతలో ఇది బెటర్గా ఉంది. ఈ ఏడాది క్లస్టర్ ఏజెన్సీలో ఆశించిన ఫలితాలు వచ్చాయి. – లక్ష్మణ్, ఉద్యాన అధికారి, కొల్లాపూర్ రైతులకు అప్పగించాలి పెద్దకొత్తపల్లి మండలంలో ఏర్పాటు చేస్తున్న మామిడి ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణ బాధ్యతలను మామిడి సాగు చేస్తున్న రైతులకే అప్పగించాలి. ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు రెగ్యులర్గా వివరించాలి. దీంతో ఎగుమతులకు ఉపయోగపడేలా మామిడి సాగుకు రైతులు ఆసక్తి చూపుతారు. క్లస్టర్ ఏజెన్సీ ద్వారా అందుతున్న సహకారంతో నాణ్యమైన ఉత్పత్తులు వస్తున్నాయి. – శ్రీనివాసులు, మామిడి రైతు, కొల్లాపూర్మూడేళ్ల క్రితం పాలమూరును క్లస్టర్గా ఎంపిక చేసిన కేంద్రం ఎగుమతులకు ఉపయోగపడేమామిడి ఉత్పత్తి కోసం రూ.200 కోట్ల కేటాయింపు నాలుగేళ్లపాటు ప్రణాళికబద్ధంగా నిధుల విడుదలకు నిర్ణయం నాణ్యమైన కాయలను ఉత్పత్తి చేస్తున్న రైతాంగం -
భూగర్భ జలాలను సంరక్షించాలి
● కలెక్టర్ ప్రతీక్ జైన్ నారాయణపేట: జిల్లాలోని భూగర్భ జలాలను సంరక్షించుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూగర్భజలశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన భూగర్భజలాల వినియోగం–సంరక్షణపై జిల్లా అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. సమావేశంలో భూగర్భజలాల వివరాలు, లభ్యత, వినియో గం, వర్గీకరణ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీటి సేకరణ, నీటి సంరక్షణ నిర్మాణాలు–నిర్వహణపై కలెక్టర్ సమీక్షించారు. భూగర్భ జల వనరు లశాఖ ఏడీ రవి భూగర్భ జలాల లభ్యత, వినియోగం, మండలాల వారీగా వర్గీకరణ, నీటి ప్రాముఖ్యతను వివరించారు. భూగర్భజల వనరులపై ఆధార పడి వ్యవసాయం చేయడం తగ్గించుకోవాలని.. పరిమితంగా వినియోగించుకోవాలని కోరారు. నీ టిని సృష్టించలేం.. సంరక్షించుకోగలం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఇష్టారాజ్యంగా భూ గర్భ జలాల్ని వెలికితీయడం కాకుండా వాన నీటిని సాధ్యమైనంత వరకు భూమిలోకి ఇంకింపజేసే విషయంపై దృష్టి సారించాలని, నీటి సంరక్షణ అందరి సామాజిక బాధ్యతని తెలిపారు. అనంతరం కలెక్టర్ జిల్లా క్రియాశీలక భూగర్భ జల వనరులు పుస్తకం ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్లు ఫణీంద్రరెడ్డి, శ్రీను, సీపీఓ ఖాఘవాహన్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్, పరిశ్రమలశాఖ జీఎం రామలింగేశ్వరగౌడ్, భూగర్భ జల వనరులశాఖ అధికారులు నరేష్, వెంకన్న పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టాలి.. జిల్లాలో గుర్తించిన ఇసుక రీచ్లతో పాటు రెవెన్యూ, వాటర్షెడ్ పరిధిలోని చెక్ డ్యాంల వద్ద నుంచి ఇసుక రవాణా చేసేందుకు అనుమతులు తప్పనిసరి అని.. ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టాల్సిందేనని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి డీఎల్ఎస్సీ (డిస్ట్రిక్ట్ లేవల్ స్యాండ్ కమిటీ) సమావేశం గూగుల్ మీట్ ద్వారా నిర్వహించారు. ఇసుక తరలింపు విషయంలో మైనింగ్, రెవెన్యూ, భూగర్భ జలశాఖ, సర్వే ల్యాండ్, నీటి పారుదల, వ్యవసాయ శాఖల అధికారుల నివేదికలు, అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఇరిగేషన్, జల వనరులశాఖ ఏడీని ప్రశ్నించారు. మాగనూరు మండలంలోని 5 ఇసుక రీచ్లు, ఉట్కూర్ మండలంలో 2, మక్తల్లో రెండు, ధన్వాడలోని గోటూరు, కొత్తపల్లి, లింగాల్చేడ్ రీచ్ల నుంచి ఇసుక రవాణాకు ప్రతిపాదనలు పంపినట్లు మైనింగ్ ఏడీ వివరించారు. గుర్తించిన ప్రాంతాల నుంచి నిబంధనల మేరకు ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాలని, ఆయా ప్రాంతాల్లో సంబంధిత శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలన చేసి, పారదర్శక నివేదికలను ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఒకరిద్దరు తహసీల్దార్ల పనితీరుపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. గూగుల్ మీట్లో అదనపు కలెక్టర్లు ఫణీంద్రరెడ్డి, శ్రీను, కలెక్టరేట్ ఏఓ శ్రీధర్, మిషన్ భగీరథ ఎస్ఈ రంగారావు, ఇరిగేషన్ అధికారి, ఆయా మండలాల తహసీల్దార్లు, సీఐలు, ఎస్ఐలు, కలెక్టరేట్లోని సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఖజానా గలగల..
● పేటలో ప్రధానంగా పత్తి, వరి, కంది, వేరుశనగపైనే మార్కెట్ సెస్ ● మక్తల్, కోస్గి మార్కెట్లకు చెక్పోస్టుల ద్వారా.. ఏటా పెరుగుతున్న మార్కెట్యార్డుల ఆదాయం నారాయణపేట: జిల్లాలో ఏటా వ్యవసాయరంగం పురోగతి సాధిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సకాలంలో కురిసిన వర్షాలతో పంట దిగుబడులు ఆశించిన మేర పెరిగి మార్కెట్యార్డులో జోరుగా క్రయ, విక్రయాలు కొనసాగడంతో ఆదాయం పెరిగింది. కోస్గి, మక్తల్ మార్కెట్యార్డుల్లో క్రయవిక్రయాలు తక్కువగా ఉన్నా.. చెక్పోస్టులు, రైస్మిల్లులు, కాటన్ మిల్లుల ద్వారానే ఆదాయం సమకూరిందని చెప్పవచ్చు. ఆర్థిక సంవత్సరం ముగియడంతో నారాయణపేట, మక్తల్లో లక్ష్యానికి మించి ఆదాయం సమకూరగా.. కోస్గి మార్కెట్యార్డులో లక్ష్యం చేరుకోలేదని వార్షిక ఆదాయం లెక్కల ద్వారా తెలుస్తోంది. చెక్పోస్టులతో ఆదాయం.. చెక్పోస్టులతోనే మార్కెట్లకు అదనపు ఆదాయం సమకూరుతోంది. జిల్లాలోని నారాయణపేట మండలం జలాల్పూర్ దగ్గర, మరికల్లో హైదరాబాద్ రోడ్, మక్తల్ మార్కెట్ పరిధిలోని కృష్ణా మండలం టైరోడ్ దగ్గర, కోస్గిలో ఒకటి చొప్పున చెక్పోస్టులు ఉన్నాయి. ఈ చెక్ పోస్టుల ద్వారా ఏటా రూ.లక్షల ఆదాయం వస్తోంది. నారాయణపేట ప్రాంతానికి యాద్గిర్, కృష్ణాకు శక్తినగర్ కర్ణాటక సరిహద్దులుగా ఉన్నాయి. ఆయా మార్గాల్లో సరుకులు తరలించే భారీ వాహనాలు అనేకం రాకపోకలు సాగిస్తుంటాయి. జిల్లా మీదుగా వెళ్లే ఈ వాహనాల నుంచి భారీగా ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. జిల్లాలోని మక్తల్, కోస్గి మార్కెట్యార్డులో క్రయవిక్రయాలు తక్కువగానే ఉన్నా.. చెక్పోస్టులు, రైస్మిల్లుల నుంచే ఆదాయం సమకూరుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా జిల్లాలో 30కి పైగా రైస్మిల్లులు, 7 కాటన్ మిల్లులు, ఒక దాల్ మిల్, 37 మంది ఖరీదుదారులు, 55 మంది కమీషన్ ఏజెంట్లు నిర్వహించే క్రయ విక్రయాలతో మార్కెట్లకు ఆదాయం సమకూరుతుంది. ఇదిలా ఉండగా.. జిల్లాలోని మరికల్, మద్దూర్ ప్రాంతాల్లో ట్రేడ్ లైసెన్సులు లేకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ అధికారులు తనిఖీలు చేపడితే మరింత ఆదాయం చేకూరే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా పత్తి, వరి పైనే.. జిల్లాలో నారాయణపేట, మక్తల్, కోస్గిలో వ్యవసాయ మార్కెట్లు.. నారాయణపేట వ్యవసాయ మార్కెట్ పరిధి దామరగిద్ద, నారాయణపేట, ధన్వాడ ఉన్నాయి. వ్యవసాయమే జీవనాధారం కావడంతో జిల్లా రైతులు ప్రధానంగా పత్తి, వరి, కంది, వేరుశనగ పంటల సాగుకు మక్కువ చూపుతారు. కృష్ణానది పరీవాహకంలో నీటి వనరులు సమృద్ధిగా ఉండటం, చెరువులు, బోరుబావుల కింద పంటలు పండించారు. యాసంగిలో వేరుశనగ, వరి పంటలు సాగుచేశారు. మరికల్, ఊట్కూర్ మండలాలతో పాటు కర్ణాటకలోని సమీప ప్రాంతాల నుంచి పంట ఉత్పత్తులు వస్తుండటంతో ఎక్కువ మొత్తంలో వ్యాపార లావాదేవీలు కొనసాగుతుండటంతో లక్ష్యానికి మించి ఆదాయం సమకూరుతుంది. ప్రధానంగా పత్తి, వరి, కంది, వేరుశనగ పైనే మార్కెట్సెస్ అధికంగా వస్తోంది. దీంతో పేట మార్కెట్యార్డు ప్రస్తుతం ఉన్న గ్రేడ్–2 నుంచి మూడేళ్లుగా పెరుగుతూ వస్తున్న ఆదాయంతో గ్రేడ్–1 దాటి స్పెషల్ గ్రేడ్గా మారాల్సిన అవసరం ఉంది. లక్ష్యాన్ని అధిగమించాం.. నారాయణపేట వ్యవసాయ మార్కెట్యార్డుకు ఏటా లక్ష్యానికి మించిన ఆదాయం సమకూరుతుంది. ఈ ఏడాది కూడా ఇచ్చిన లక్ష్యాన్ని దాటి క్రయవిక్రయాలు జరిగాయి. ఆ ఆదాయంతో మార్కెట్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. – ఆర్.శివారెడ్డి, మార్కెట్ చైర్మన్, నారాయణపేట -
రహదారి భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత
నారాయణపేట: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని.. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడంతో మాత్రమే ప్రమాదాలను నివారించవచ్చని డీటీఓ మేఘాగాంధీ అన్నారు. అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు బుధవారం జిల్లాకేంద్రంలోని వీర సావర్కర్ (ఓల్డ్ బస్టాండ్) చౌరస్తాలో సీఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు విద్యార్థులతో కలిసి మానవహారం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా డీటీఓ మేఘాగాంధీ హాజరై మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం, వేగం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనతోనే జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే తగ్గించవచ్చన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాణాలను రక్షించే ముఖ్యమైన సాధనాలని.. వీటిని తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. యువత రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండి ఇతరులకు వివరించాలన్నారు. రహదారి నియమాలు పాటించడంతో సమాజాన్ని రక్షించగలమని తెలిపారు. రోడ్డు భద్రత నియమాలు పాటిస్తామని, ఇతరులను కూడా చైతన్యపరుస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణచైతన్య, ఎస్ఐ–2 గాయత్రి, పోలీసు, డీటీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
అందరికీ ఆదర్శం బీఆర్ అంబేడ్కర్
● కలెక్టర్ ప్రతీక్ జైన్ నారాయణపేట: భారత రాజ్యాంగం రచించి దేశ ప్రజలకు దిక్సూచిగా నిలిచిన డా. బీఆర్ అంబేడ్కర్ను ప్రతి ఒక్కరూ ఆదర్శకంగా తీసుకొని ముందుకుసాగాలని కలెక్టర్ ప్రతీక్జైన్ కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలో ఎస్సీ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ఆయనతో పాటు ఎస్పీ డా. వినీత్ హాజరై అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... డా. బీఆర్ అంబేడ్కర్ కష్టపడి చదివి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి భారత రాజ్యాంగాన్ని రచించడానికి తన మేధాశక్తిని వినియోగించారని గుర్తు చేశారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి రాజ్యాంగంలో అన్ని అంశాలను పొందుపర్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఆనాడే విదేశాల్లో విద్యనభ్యసించిన ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనం ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లేంత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఎస్పీ డా. వినీత్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయడంతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి గొప్ప సందేశం, మార్గదర్శకమన్నారు. కులమతాలకు అతీతంగా సంఘటితంగా నిలబడి అన్యాయాలపై పోరాడితేనే సమాజంలో సుస్థిర మార్పు సాధ్యమవుతుందని తెలిపారు. మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తివంతమైన సాధనం చదువు ఒక్కటే అని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకుసాగి తమ లక్ష్యాలను సాధించాలని, సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ కొండ శ్వేత సత్యయాదవ్, సదాశివరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్డీసీ రాజేందర్గౌడ్, ఆర్అండ్బీ ఈఈ.వెంకట్రాములు, షెడ్యూల్డ్ కులాల అధికారి అబ్దుల్ ఖలీల్, పుర కమిషనర్ నర్సయ్య, సీపీఓ కాగవాహన్, డీపీఆర్వో రషీద్, డీటీఓ మేఘాగాంధీ, కౌన్సిలర్ మహేష్, సంఘం నాయకులు శరణప్ప, ఆశప్ప, కృష్ణ, సూర్యకాంత్, ఈశ్వరమ్మ, మాధవ, సోఫీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వసతిగృహాల్లో మౌలిక వసతుల కల్పన.. ఊట్కూర్: వసతిగృహాల్లో మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం స్థానిక ఎస్సీ, ఎస్టీ బాలురు వసతిగృహాన్ని ఎస్పీ డా. వినీత్తో కలిసి ఆయన సందర్శించారు. వంటశాల, నివాస గదులు, పరిసరాలను పరిశీలించారు. మరుగుదొడ్లు సక్రమంగా వినియోగిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న వసతులు, సమస్యనల గురించి ఆరా తీశారు. అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రోజు మెనూ విధిగా పాటించాలని వార్డెన్ను ఆదేశించారు. బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన సినిమాను విద్యార్థులతో కలిసి టీవీలో వీక్షించారు. విద్యార్థులు ప్రభుత్వం అందించే వసతులను సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. చదువుతో పాటు నైతిక విలువలను పెంపొందించుకోవాలని, క్రమశిక్షణ కలిగి ఉండాలని, క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట సర్పంచ్ రేణుక భరత్, ఈడీ ఖలీల్, ఏఎస్డబ్ల్యూ పరమేశ్, వార్డెన్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. రహదారి భద్రతపై ప్రతిజ్ఞ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ డాక్టర్ వినీత్ పాల్గొని వాహన చోదకులతో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రత నిబంధనలు పాటించడం, ఇతరులకు తెలియజేయడం, తోటి చోదకులను గౌరవించడం, ప్రమాదాలను నివారించడం, డిఫెన్స్ డ్రైవింగ్ తదితర అంశాల గురించి వివరించారు. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించి, రోడ్డు భద్రతకు సహకరించాలని వారు సూచించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, పుర చైర్పర్సన్ కొండ శ్వేత, సత్యయాదవ్, సీఐ శివశంకర్, డీటీఓ మేఘాగాంధీ, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, పురుషోత్తం, కృష్ణచైతన్య, పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యత పెరగాలి
పాలమూరు: చట్ట సభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా మంగళవారం సాయంత్రం స్టేడియం గ్రౌండ్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు నారీశక్తి వందన్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ డీకే అరుణ హాజరై మహిళలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ కూడలిలో బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2029 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని చట్టం చేయబోతున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రతి ఒక్క పార్టీ సభ్యులు పాల్గొని ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని, రాజకీయాల్లో రాణించే శక్తి, పాలించే శక్తి మహిళలకు ఉందన్నారు. దేశ పరిపాలనలో మహిళలు భాగస్వామ్యం కావాలన్నారు. మహిళలు రాజకీయాల్లోకి వస్తే తమ కుర్చీలు, ప్రాధాన్యత పోతుందని మహిళ బిల్లును అడ్డుకునే ప్రయత్నం గతంలో కొందరు చేశారన్నారు. 2029లో మహిళా రిజర్వేషన్ 33 శాతం అమలు చేయాలని ప్రధాని కంకణం కట్టుకొని పని చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో కొత్తగా 60 అసెంబ్లీ స్థానాలు పెరిగితే 60 మంది మహిళలు ఎమ్మెల్యేలు అవుతారని వెల్లడించారు. మహిళా బిల్లుకు మద్దతు తెలుపుతూ 9667173333 నంబర్కు మిస్డ్కాల్ ఇవ్వాలన్నారు. -
భూ సారం.. ఫలితం శూన్యం
–8లో uనర్వ: రైతులు భూసార పరీక్షలు చేయించుకొని ఫలితాల ఆధారంగా అనుకూలమైన పంటల సాగు చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కానీ జిల్లా రైతులకు భూసార పరీక్షలు అందని ద్రాక్షగా మారాయి. 2018లో అప్పటి ప్రభుత్వం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 77 క్లస్టర్లకు మినీ భూసార పరీక్ష కేంద్రాలు మంజూరు చేసింది. ఆయా కేంద్రాల్లో కేటాయించిన గ్రామాల్లో మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించి ఫలితాల పత్రాలు అందజేయాలని ఆదేశించింది. కాగా ఆయా కేంద్రాలకు పరీక్షల నిమిత్తం ఉపయోగించే రసాయనాలు పూర్తిస్థాయిలో సరఫరా చేయకపోవడంతో నిరుపయోగంగా మారాయి. భూ సమగ్ర సర్వేలో అధికారులు రైతుల నుంచి సేకరించిన మట్టి నమూనాలను జడ్చర్లలోని భూసార పరీక్ష కేంద్రానికి పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల ఫలితాల కార్డులను నేటికీ అందించలేదని రైతులు చెబుతున్నారు. వృథాగా పరీక్షల కిట్లు.. కేంద్ర ప్రభుత్వం ఒక్కో భూసార పరీక్ష కేంద్రం ఏర్పాటుకు రూ.1.30 లక్షలు మంజూరు చేసింది. అప్పట్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 523 వ్యవసాయ క్లస్టర్లకు భూసార పరీక్షల కిట్లు ఇచ్చారు. వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓ)భూసార పరీక్షలు నిర్వహించాలి. ప్రారంభంలో మన తెలంగాణ.. మన వ్యవసాయం కార్యక్రమంలో భాగంగా కొన్నాళ్ల పాటు భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల కార్డులను ప్రత్యేక కార్యక్రమాల ద్వారా రైతులకు అందించారు. 2020 కంటే ముందు వానాకాలం ప్రారంభంలోగా భూసార పరీక్షలు చేయించుకోవాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తర్వాత ఈ కిట్లు అటకెక్కాయి. నిధులు లేకపోవడంతో పరీక్షలు చేయడం లేదని మండల వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 476, నారాయణపేట జిల్లాలో 77 రైతువేదికలు ఉన్నాయి. వీటిలో భూసార పరీక్షలు నిర్వహించేందుకు ఒక్కో కేంద్రానికి రూ.2 లక్షలు మంజూరుచేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని రైతులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది నిర్వహించాం.. నీతి ఆయోగ్ ద్వారా ఆస్పిరేషన్ బ్లాక్గా ఎంపికై న నర్వ మండలంలో గత ఏడాది ఎంపిక చేసిన గ్రామాల్లో భూసార పరీక్షలు నిర్వహించాం. ఫలితాల కార్డులను ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి రైతులకు అందించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి మూడేళ్లకు ఒకసారి నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. – అఖిలారెడ్డి, మండల వ్యవసాయ అధికారి, నర్వ జడ్చర్లలో మాత్రమే.. రైతులు తాము సాగు చేస్తున్న భూముల మట్టి పరీక్షలను ప్రతి మూడేళ్లకు ఒకసారి చేయించుకోవాలి. ఉమ్మడి జిల్లాలో జడ్చర్లలో మాత్రమే భూసార పరీక్ష కేంద్రం ఉంది. 2018లో ఏఈఓ క్లస్టర్ల వారీగా మినీ కేంద్రాలను మంజూరు చేశారు. ఆయా కేంద్రాలకు కెమికల్స్, సామగ్రి పూర్తిస్థాయిలో సరఫరా గాకపోవడంతో పరీక్షలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. భూసార పరీక్షలు అవసరమైన రైతులు జడ్చర్ల ల్యాబ్లో నామినల్ ఫీజు చెల్లించి చేయించుకోవచ్చు. – నాగేష్కుమార్, ఏడీఏ, మక్తల్ జిల్లాలో 77 క్లస్టర్లకు మినీ కేంద్రాలు మంజూరు ఘనంగా ప్రారంభం.. తర్వాత నిరుపయోగం వృథాగా మారిన కిట్లు పాత పద్ధతిలో సాగు.. రైతులు నష్టాల పాలు -
మాకు న్యాయం చేయాలి..
కంపెనీల నుంచి శుద్ధి చేయకుండా బయటకు వదిలే రసాయనాలు కలిసిన నీరు మూలంగా పంటలు పండవని.. ఆ నీళ్లు తాగడానికి కూడా పనికిరావని అగ్రికల్చర్, గ్రౌండ్ వాటర్ అధికారులు ఎప్పుడో తేల్చారు. మా బోర్లు, భూములు పరిశీలించి.. టెస్టులు చేసి.. సర్టిఫికెట్లు ఇచ్చారు. మేం ఊరి వదిలిపెట్టి పోవాల్నా.. లేకుంటే ఏమైనా తాగి సావాల్నా అర్థమైతలేదు. కాలుష్యపు నీళ్లు వదిలే కంపెనీలపై చర్యలు తీసుకుని.. పరిహారం ఇప్పించాలి. మాలాంటి రైతులందరికీ తగిన న్యాయం చేయాలి. – ముల్గర నారాయణగౌడ్, రైతు, ముదిరెడ్డిపల్లి -
ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదు..
ఫార్మా కంపెనీల పక్కనే మా పొలాలున్నాయి. కలుషిత నీటిని వదులుతున్నప్పుడల్లా ఆ నీటి శాంపిళ్లను తీసుకుపోయి పీసీబీ అధికారులకు ఇస్తున్నాం. లిఖితపూర్వకంగా ఎన్నోసార్లు ఫిర్యాదులు ఇచ్చాం. వాళ్లు వస్తారు.. మమ్మల్ని హైదరాబాద్కు పిలుస్తారు. పరిశ్రమల సిబ్బందిని పిలిచి ఇంకోసారి వదలకండనీ చెబుతారు. ఆ తర్వాత కంపెనీలది మళ్లీ షరామామూలే. మా సమస్యలను ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. – మాధవి లత, మహిళా రైతు -
‘గరళ’కంఠుడే రావాలేమో..!
‘పోలేపల్లి’ పరిసర ప్రాంత వాసుల దీనగాధ విచారణలో తేలినా.. జడ్చర్ల మండలం పోలేపల్లి, రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామాల శివారులో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు కోసం సుమారు 1,100 ఎకరాల్లో భూములను సేకరించారు. ఇందులో పోలేపల్లి సెజ్ కోసం 250 ఎకరాలు కేటాయించారు. దీని పరిధిలో ఇప్పటివరకు 12 ఫార్మా, మరో పది వరకు ఇతర పరిశ్రమలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. 2023లో ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలకు స్పందించిన అప్పటి కలెక్టర్ వెంకట్రావ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించిన అనంతరం విచారణ బృందం శాఖల వారీగా ఆధారాలతో నివేదిక అందజేసింది. పలు ఫార్మా పరిశ్రమలు వర్షాకాలంలో వరద మాటున రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా చెరువులు, కుంటలు, పొలాల్లోకి వదులుతున్నాయని.. దీంతో పంటలు పండడం లేదని, జలాశయాల్లో చేపలు ఎదగకుండా మృతి చెందుతున్నాయని నివేదికలో పేర్కొంది. జడ్చర్ల మండలంలోని పోలేపల్లి, గుండ్లగడ్డ తండా, గొల్లపల్లి, రాజాపూర్ మండలంలోని రాయపల్లి, ముదిరెడ్డిపల్లి, నందిగామకు చెందిన పలువురు చర్మ, కీళ్ల నొప్పులు, శ్వాసకోశ, మూత్రపిండ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. కాగితాలకే పరిమితం.. విచారణ బృందం నివేదిక అందజేసిన క్రమంలో అప్పటి కలెక్టర్ వెంకట్రావ్ ప్రతి నెలా 11న కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని అధికారులను ఆదేశించారు. ఆ రోజు సెలవు దినమైతే మరుసటి రోజున సందర్శించి పరిశ్రమల ప్రతినిధులు, స్థానికులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. కాలుష్య కట్టడిలో భాగంగా వివిధ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని టీజీఐఐసీ అధికారులకు సైతం సూచనలు చేశారు. అయితే ఇవేమీ అమల్లోకి రాకముందే వెంకట్రావ్ సూర్యాపేటకు బదిలీ అయ్యారు. అనంతరం రవినాయక్, ఆయన తర్వాత విజయేందిర బోయి మహబూబ్నగర్ కలెక్టర్లుగా పనిచేశారు. వీరి హయాంలో నెలనెలా తనిఖీల అంశం తెర మీదకే రాలేదు. ఇటీవల ఖుష్బూ గుప్తా కలెక్టర్గా రాగా.. నిబంధనలకు విరుద్ధంగా రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా వదులుతున్న పలు పరిశ్రమలపై కొందరు కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. ఫొటోలతో సహా పలు ఆధారాలు సమర్పించినట్లు తెలిసింది. ‘పోలేపల్లి సెజ్ పరిసర ప్రాంతాల్లోని ఆరు గ్రామాలు కాలుష్యం బారిన పడ్డాయి. ప్రధానంగా ఫార్మా పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. తాగేందుకు, పంటల సాగుకు, జీవచరాల ఉనికికి ఈ నీరు అసలే పనికి రాదు.’ ...పరిశ్రమల కాలుష్యం, ప్రభావిత ప్రాంతాలపై పలు ప్రభుత్వ శాఖలతో ఏర్పాటైన విచారణ కమిటీ 2023 జనవరి 31న అప్పటి కలెక్టర్ వెంకట్రావ్కు అందజేసిన నివేదికలోని అంశాలు ఇవి. మూడేళ్లుగా ఇవి కాగితాలకే పరిమితమయ్యాయి. నిబంధనలు పాటించని ఫ్యాక్టరీలతో పాటు ప్రభావిత పల్లెల్లో సంరక్షణ చర్యలనూ ‘అధికార’ యంత్రాంగం గాలికొదిలేసింది. ఈ క్రమంలో నెలనెలా ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్నా.. అటు పీసీబీ, ఇటు జిల్లా అధికారులెవరూ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ సెజ్లోని ఓ పరిశ్రమ బయటికి వదిలిన కాలుష్యం జలాలు ప్రస్తుతం పీసీబీ ఆడిందే ఆట.. పరిశ్రమల కాలుష్యంపై జిల్లా అధికారిక యంత్రాంగం సీరియస్గా వ్యవహరించిన క్రమంలో హైదరాబాద్లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల్లో కదలిక వచ్చింది. అప్పటివరకు నామమాత్రపు తనిఖీలకే పరిమితమైన వారు వర్షాకాలంలో పలుమార్లు స్వయంగా పర్యటించారు. ఆ తర్వాత మూడేళ్లలో పరిస్థితి తారుమరైనట్లు తెలుస్తోంది. జిల్లాస్థాయిలో వచ్చిన ఫిర్యాదులు చెత్తబుట్టలకే పరిమితం కాగా.. పీసీబీ ఆడిందే ఆటగా మారినట్లు తెలుస్తోంది. ఆధారాలతో సహా అందజేసినా.. కనీసం శాంపిళ్ల సేకరణకూ రాకపోవడంతో ఫిర్యాదుదారుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమల నుంచి నెలనెలా అందుతున్న మామూళ్లతోనే వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత కలెక్టర్ అయినా తమ గోడును పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బీఓఎస్ (బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్) పరీక్ష సైతం చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫార్మా, తదితర పరిశ్రమల పొల్యూషన్తో బతుకులు ఛిద్రం తాగు, సాగుకు ఆ నీరు పనికిరాదని తేల్చిన విచారణ బృందం కలెక్టర్లు మారినా.. మారని బాధిత గ్రామాల ప్రజల తలరాతలు ఉత్తుత్తి మాటలుగానే నెలనెలా తనిఖీలు.. పీసీబీ తీరుపై అనుమానాలు ? ప్రస్తుత కలెక్టర్ అయినా దృష్టి సారించాలని బాధిత రైతుల విజ్ఞప్తి -
పోషక విలువల అక్షయపాత్ర.. మునగ
మదనాపురం: ప్రకృతి మాత తన అక్షయపాత్ర నుంచి మానవాళికి ప్రసాదించిన అపురూప వరప్రసాదం మునగ. ఇది కేవలం పెరటి చెట్టు కాదు.. ప్రాణదాత. వినీల ఆకా శం కింద పచ్చని తోరణంలా విరిసే ఈ మొక్క, మానవ దేహానికి అవసరమైన పోష కాలను తన ప్రతి అణువులోనూ నింపుకొన్న ఒక శాకాహార నిధి. మునగలోని మాధుర్యం, దాని వెనుక ఉన్న ఆరోగ్యం గురించి మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా.అనిత వివరించారు. కనుచూపునకు వెలుగురేఖ.. క్యారెట్ కన్నా పది రెట్లు మిన్నగా విటమిన్ అని నింపుకుని, నయనాలకు కాంతిని ఇస్తుంది. పాల కన్నా పదిహేడు రెట్లు అధికంగా కాల్షియాన్ని అందిస్తూ ఎముకలను దృఢంగా మలుస్తుంది. పాలకూరను మించిన ఐరన్ ధారల తో రక్తహీనతను పారద్రోలుతుంది. నారింజను తలదన్నే విటమిన్–ఈ, అరటిని మించిన పొటాషియంతో దేహానికి నవ చైతన్యాన్ని ఇస్తుంది.తొమ్మిది రకాల ప్రాణధార అమైనో ఆమ్లాలు మునగలో కొలువై ఉన్నాయి. ఇది ఒక పరిపూర్ణ ప్రోటీన్ల కల్పవృక్షమని తెలిపారు. ఆరోగ్య సౌరభం.. జీవన రాగం ఇది కేవలం ఆకలిని తీర్చడమే కాదు.. రోగకారక క్రి ములకు సింహస్వప్నంలా నిలుస్తుంది.రక్తంలో చ క్కెరకు అడ్డుకట్ట వేసి.. మధుమేహ బాధితులకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. కొలెస్ట్రాల్ కల్మషాలను కడిగివేసి, గుండె వేగానికి భరోసా ఇస్తుంది. కాలేయాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడుతుంది. పాలిచ్చే తల్లులకు ఇది గెలాక్టాగోగ్గా మారి, పసిబిడ్డలకు పౌష్టికాహార లోపం లేకుండా చూస్తుంది. ఇందులోని బీటా కెరోటిన్ రేచీకటిని తరిమికొట్టి, కంటి చూపును శరత్కాల చంద్రికలా ప్రకాశింపజేస్తుంది. విలువ ఆధారిత ఉత్పత్తులు.. మునగను కేవలం పంటగా చూడకుండా, ఒక లాభసాటి వ్యాపారంగా మలిచే అద్భుత అవకాశం ఉంది. మునగ ఆకుల పొడి, సుగంధ భరితమైన టీ, చిన్నారుల కోసం న్యూట్రిమిక్స్ రుచికరమైన బిస్కెట్లు, లడ్డూలు.. ఇలా మునగతో తయారయ్యే ప్రతి ఉత్పత్తి ఒక ఆదాయ వనరులాంటిది. గ్రామీణ మహిళా సంఘాలు ఈ విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని చేపడితే వారి ఆర్థిక స్వాలంబనకు ఆకాశమే హద్దని తెలిపారు. -
రోడ్డు కనెక్టివిటీ సౌకర్యం కల్పించాలి
గట్టు: భారత్మాల ఆరు వరుసల జాతీయ రహదారికి గట్టు ప్రాంత వాసుల వాహనదారులకు కనెక్టివిటీ సౌకర్యం కల్పించాలని గట్టు, రాయాపురం, ఆలూరు, మల్లాపురం గ్రామాల ప్రజలు కోరారు. ఆయా గ్రామాల ప్రజలు చేపట్టిన రిలే దీక్షలు సోమవారం నాటికి 57వ రోజుకు చేరుకుంది. మిట్టదొడ్డి, చాగదోన గ్రామాల ప్రజలు వారికి మద్దతు తెలిపారు. రాయాపురం స్టేజీ దగ్గర ఉన్న డబుల్ రోడ్డును మూసి వేయకుండా వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. పాత ఆలూరు రోడ్డులో తక్కువ ఎత్తులో వంతెనను నిర్మించడం వలన భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నట్లు ఆరోపించారు. నేషనల్ హైవే అఽథారిటీ అధికారులు స్పందించి గట్టు మండలానికి రోడ్డు కనెక్టివిటీ ఇవ్వడంతో పాటుగా రాయాపురం డబుల్ రోడ్డు దగ్గర వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు రాముడు, ఆప్కో మాజీ డైరెక్టర్ దోమ వీరన్న, మహాదేవప్ప, అమ్మన్న, వీరేష్, వెంకటన్న, గోవిందు, ఆంజనేయులు, కృష్ణయ్య, సాలే కర్రెప్ప,సుధాకర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. యువతి అదృశ్యంపై కేసు నమోదు వనపర్తి రూరల్: మండలంలోని రాజపేట గ్రామానికి చెందిన యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హృషికేష్ తెలిపారు. గ్రామానికి చెందిన తోకల మహేశ్వరి టైలరింగ్ చేసుకుంటూ కుటుంబానికి తోడుగా ఉండేది. అయితే సోమవారం ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లింది. ఎంతసేపటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల, తెలిసిన వారి ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అభివృద్ధిని అడ్డుకుంటుంది ఎవరో తెలుసు
అమరచింత: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ ప్రజాసంక్షేమానికి పాటుపడుతున్నానని, అభివృద్ధికి తానెప్పుడు అడ్డుపడే వ్యక్తిని కాదని ఇక్కడ జరిగే అభివృద్ధిని అడ్డుకునేది ఎవరో ప్రజలకు తెలుసని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అమరచింత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో సోమవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులు, అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్లను పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి దంపతులకు పట్టువస్త్రాలు అందించారు. ఈసందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ జూరాల వద్ద హైలెవల్ బిడ్జ్రి నిర్మించడం వల్ల అమరచింత, ఆత్మకూర్ పట్టణాలు అభివృద్ది చెందుతాయని నిధులు కేటాయిస్తే వంతెన నిర్మాణాన్ని అడ్డుకున్నది ఎవరో ప్రజలందరికి తెలుసన్నారు. పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ అరుణ కేంద్ర నిధులు అంటూ తమ ప్రమేయం ఉండాలంటూ చెప్పుకురావడం, చేసిన శంకుస్థాపనలకు మళ్ల శంకుస్థాపనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మునుపెన్నడు లేని విధంగా నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధిలో ఎవరెన్ని నిధులు తెచ్చిందో తేల్చుకుందామని దమ్ముంటే చర్చకు రావాలని ఎంపీకు సవాల్ విసిరారు. తాగు, సాగు నీటి అవసరాలను దృష్టిలో పె ట్టుకుని జూరాల ప్రాజెక్టు ఎగువలో బిడ్జ్రిలు, బ్యారేజీలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బీమా నదిపై రెండు బ్యారేజీలు, కృష్ణ నదిపై మినీ జూరాల ప్రాజెక్టు నిర్మాణానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అధికారులతో సమీక్షలు నిర్వహించారన్నారు. ప్రతి వేసవిలో తాగునీటి అవసరాల కోసం ఎగువన ఉన్న కర్ణాటక ప్రభుత్వానికి సాయం చేయ్యమ ని అడిగే వాళ్లమని బ్యారేజీలు, బిడ్జ్రిలు నిర్మించుకుంటే అలాంటి పరిస్థితి ఇకపై ఉండదన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిది కేశం.నాగరాజ్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ సువర్ణ రవి, వైస్ చైర్పర్సన్ రాధ అరుణ్, లోకల్బాడీ కలెక్టర్ ఖీమ్యానాయక్ పాల్గొన్నారు. -
కేజీబీవీలు బాలికల భవిష్యత్కు నిలయాలు
తిమ్మాజిపేట: కేజీబీవీలు బాలికల సమగ్ర అభివృద్ధి, భవిష్యత్కు నిలయాలుగా మారాయని, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో చదివి బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర ప్రాంతీయ విద్యా సంచాలకులు సోమిరెడ్డి ఆకాంక్షించారు. సోమవారం తిమ్మాజిపేటలోని కేజీబీవీని ఆర్జెడీ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. బాలికలకు విద్యతోపాటు ఆరోగ్యం, క్రమశిక్షణ, సృజనాత్మకత అవసరమన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి చదువుకునే బాలికలు విద్యద్వారా జీవితంలో ఉన్నత స్థానాలను సాధించే అవకాశాలు కేజీబీవీలో విస్తతంగా ఉన్నాయన్నారు. క్రమశిక్షణ, సమయస్ఫూర్తి, వంటి లక్షణాలను పెంపొందించుకొని భవిష్యత్లో సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. చదువుతోపాటు క్రీడలు, యోగా, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన కార్యకలాపాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం బలంగా ఉంటేనే విద్యలో మెరుగైన ఫలితాలు సాధించగలమన్నారు. బాలికల విద్యాభివృద్ధి ద్వారా సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం పెరుగుతాయని మహిళలు అన్నిరంగాల్లో మందంజలో ఉండేలా ప్రభుత్వం సమకూరుస్తున్న వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుమందు ఉపాధ్యాయునులతో సమావేశమై పలు విద్యా అంశాలపై చర్చించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. పలు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ప్రంశసా పత్రాలు అందజేశారు. రూ.80వేల పరికరాలు అందజేత మార్చిలో కేజీబీవీని సందర్శించిన ఆర్జేడీ సోమిరెడ్డి సందర్శించిన సమయంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి రూ.80వేల విలువైన పరికరాలను అందజేశారు. 30లీటర్ల సామర్థ్యం గల రెండు చల్లని తాగునీటి విద్యుత్ యంత్రాలను పంపిణీ చేశారు. బాలికల ఆరోగ్య పరిరక్షణకు బీపీ కొలిచే యంత్రం, థర్మామీటరు, స్టెతస్కోప్, బరువు కొలిచే యంత్రం వంటి వైద్య పరికరాలను అందజేశారు. బాలికలకు ప్రత్యేకంగా సిక్రూమ్ ఏర్పాటు చేసి ప్రారంభించారు. త్వరలో 10కంప్యూటర్ బేబుళ్లను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎంఈఓ సత్యనారాయణ, ఎస్ఓ సుజాత, ఉపాధ్యాయులు ఉన్నారు. -
విహారయాత్రలో విషాదం
● గోవాకు వెళ్లి వస్తుండగా ప్రమాదం ● చెట్టును ఢీ కొట్టిన కారు ● ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు గద్వాల క్రైం: నలుగురు స్నేహితులు కలసి గోవా పర్యటనకు వెళ్లి తిరిగొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి గాయాలైన ఘటన గద్వాల మండలం వీరాపురం గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి గ్రామానికి చెందిన ఇంతియాజ్ (24), ముజమ్మిల్ మరో ఇద్దరు హైదరాబాద్కు చెందిన హజీ, ఇర్ఫాన్ నలుగురు స్నేహితులు కలసి ఈ నెల 9న కారులో గోవాకు వెళ్లారు. అక్కడే మూడు రోజుల పాటు పర్యటించి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. సోమవారం తెల్లవారు జామున వీరాపురం శివారులో డ్రైవింగ్ చేస్తున్న ఇర్ఫాన్ నిద్రలోకి జారుకోవడంతో కారు అదుపుతప్పింది. రోడ్డు ఎడమ వైపున ఉన్న భారీ చెట్టును ఢీ కొట్టింది. ప్రమాదంలో నలుగురు స్నేహితులకు తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి క్షత్రగాతులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంతియాజ్ చికిత్స పొందుతూ మృతి చెందగా తీవ్రంగా గాయపడిన ఇర్ఫాన్, ముజమ్మిల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు ముర్తజావలి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అతివేగమే కారణం.. గోవా నుంచి కారులో బయలుదేరిన స్నేహితులు వీలైనంత త్వరగా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో అతివేగంగా కారును డ్రైవ్ చేసినట్లు సమాచారం. మరోవైపు సరైన నిద్రలేకపోవడం గంటల తరబడి రోడ్డు ప్రయాణంతో అలసిపోయి నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో భారీ శబ్ధం రావడంతో గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా స్నేహితులు చెల్లాచెదురుగా పడి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. -
రేషన్ బియ్యం పట్టివేత
మిడ్జిల్: అక్రమంగా నిల్వ ఉన్న బియ్యాన్ని ప ట్టుకున్న ఘటన ఆదివారం మండలంలోని మసిగొండ్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మహ్మద్ సుల్తాన్ ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసినట్లు పో లీసులకు సమాచారం అందింది. ఈ మేరకు సిబ్బందితో కలిసి సుల్తాన్ నివాసంలో సోదా లు నిర్వహించారు. 52 క్వింటాళ్ల రేషన్ బి య్యం బొలెరో వాహనంలో తరలిస్తుండగా గుర్తించారు.వాహనంలో 104 బస్తాలు ఉన్న ట్లు తేలింది. రెవెన్యూ అధికారులకు సమాచా రం ఇవ్వగా, ఎన్ఫోర్స్మెంట్ డీటీ వెంకటేశ్వర్రెడ్డి ఘటన స్థలానికి వచ్చి విచారణ చేసి బియ్యంతో పాటు బొలెరో వాహనాన్ని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.2.66 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ధాన్యం రాశులతో కళకళ దేవరకద్ర: పట్టణంలోని మార్కెట్ యార్డు ధాన్యం రాశులతో కళకళలాడింది. సోమవారం వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్దఎత్తున ధాన్యం అమ్మకానికి తెచ్చారు. కోయిల్సాగర్ ఆయకట్టుతోపాటు చెరువులు, కుంటలు, బోరుబావుల కింద యాసంగిలో సాగు చేసిన వరి పంటలు కోతలు కోస్తుండడంతో రైతులు దిగుబడులను నేరుగా మార్కెట్కు అమ్మకానికి తెస్తున్నారు. సోమవారం మార్కెట్కు దాదాపు 6 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి రావడంతో మార్కెట్ ఆవరణ అంతా ధాన్యం కుప్పలతో నిండిపోయింది. ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.2,150 మార్కెట్లో జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,150, కనిష్టంగా రూ.1,916 ధరలు లభించాయి. హంస ధాన్యం గరిష్టంగా రూ.1,799, కనిష్టంగా రూ.1,736 చొప్పున పలికాయి. ఇసుక ట్రాక్టర్ పట్టివేత పాన్గల్: అక్రమంగా ఇసుకను తరలిస్తూ పట్టుబడిన ఇసుక ట్రాక్టర్ యజమానిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కుర్మయ్య తెలిపారు. మండలంలోని మాధరావుపల్లి గ్రామం నుంచి పాన్గల్కు ఏలాంటి అనుమతులు లేకుండా శివ తన ట్రాక్టర్ ద్వారా ఇసుకను తరలిస్తున్న క్రమంలో సోమవారం తెల్లవారుజామున పోలీసుల తనిఖీల్లో ఇసుక ట్రాక్టర్ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. పట్టుబడిన ట్రాక్టర్ను స్టేషన్కు తరలించి యజమానిపై కేసు నమోదు చేశామన్నారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి నాగర్కర్నూల్ క్రైం: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందిన ఘ టన మండలంలోని కుమ్మెరలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ గోవర్ధన్ కథనం ప్రకారం.. కుమ్మెర గ్రామానికి చెందిన సురేందర్బాబు (39) కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నాడు. ఇతడు గ్రామ సమీపంలోని పల్లె చంద్రశేఖర్ వ్యవసాయ పొలం వద్ద బోరు మో టారు పనిచేయకపోవడంతో మరమ్మతులు చేసి ట్రాన్స్ఫార్మర్ను ఆన్ చేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య చిట్టెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కాల్వలో పడి వృద్ధుడు మృతి ● నారాయణపేట జిల్లావాసిగా గుర్తింపు నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని కందులవారిగూడెం సమీపంలో జాన్పహాడ్ మేజర్ కాల్వలో వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. కందులవారిగూడెం గ్రామ సమీపంలో జాన్పహాడ్ మేజర్ కాల్వలో సోమవారం గుర్తుతెలియని మృతదేహం కొట్టుకువస్తుండగా.. స్థానిక వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అతడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని గుర్తించారు. మృతదేహాన్ని ఫొటో తీసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పోలీసు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయగా.. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామానికి చెందిన నామల్ల రాయప్ప(70)గా గుర్తించారు. రాయప్ప సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో గొర్రెల కాపరిగా పనిచేస్తున్న తన కుమారుడు నామల్లి వెంకటేష్ను కలిసేందుకు ఈ నెల 10న వచ్చాడని, ప్రమాదవశాత్తు కాల్వలో జారిపడి మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై రాయప్ప కుమారుడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్నాయక్ తెలిపారు. -
ఉద్రిక్తంగా కో–ఆప్షన్ ఎన్నిక
పుర కమిషనర్, బీజేపీ కౌన్సిలర్ మధ్య వాగ్వాదం మంత్రి వాకిటి శ్రీహరి ఎక్స్–అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోవడంతో కాంగ్రెస్–2, సీపీఎం–2 కో–ఆప్షన్ స్థానాలు కై వసం చేసుకున్నాయి. కో–ఆప్షన్ ఎన్నికకుగాను పదిమంది కౌన్సిలర్లు సకాలంలో కార్యాలయానికి చేరుకోగా మంత్రి వస్తున్నారనే సమాచారంతో పుర కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు పటిష్టం చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. సీపీఎం నుంచి చిన్నన్న, షాజహాన్, కాంగ్రెస్పార్టీ నుంచి తౌఫిక్, మణెమ్మను కో–ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకున్నారు. అనంతరం మంత్రి ఎన్నికై న సభ్యులను శాలువాలతో సన్మానించి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. రాజకీయలు పక్కనబెట్టి పట్టణాభివృద్ధికి అందరూ కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ జింక సువర్ణ రవి, వైస్ చైర్పర్సన్ రాధ అరుణ్, సీఐ శివకుమార్, ఎస్ఐలు స్వాతి, జయన్న పాల్గొన్నారు. అమరచింత: స్థానిక పుర కార్యాలయంలో సోమవారం జరిగిన కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం 11 గంటల సమయంలో ఎన్నిక జరుగుతుందనే సమాచారంతో బీఆర్ఎస్, బీజేపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు ముందుగానే పుర కార్యాలయానికి చేరుకోన్నారు. ఇచ్చిన సమయం దాటుతున్నా పుర అధికారులు ఎన్నిక నిర్వహించకపోవడం వారికి ఆగ్రహం తెప్పించింది. దీనికితోడు పుర కార్యాలయ ఆవరణ కాంగ్రెస్పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిండుకోవడంతో అసహనానికి గురైన బీజేపీ కౌన్సిలర్ మేర్వ రాజు సమయం దాటిపోయిందని, వెంటనే ఎన్నిక నిర్వహించాలని అక్కడే ఉన్న పుర కమిషనర్ నూరుల్ నదీంతో వాగ్వాదానికి దిగారు. ఒకనొక సమయంలో కౌన్సిలర్ కమిషనర్ కుర్చీ, చెయ్యి పట్టుకొని లాగేందుకు యత్నించగా ఇరువురి మధ్య మాటల యుద్ధం పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే గమనించిన డీఎస్పీ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కౌన్సిలర్ రాజును బయటకు తీసుకొచ్చి అదుపులోకి తీసుకోవడంతో సమస్య సద్దుమణిగింది. కమిషనర్ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదుతో కౌన్సిలర్ మేర్వరాజుపై కేసు నమోదు చేశామని ఎస్ఐ స్వాతి తెలిపారు. కమిషనర్ ఫిర్యాదుతోకౌన్సిలర్పై కేసు నమోదు పోలీసుల జోక్యంతోసద్దుమణిగిన వివాదం మంత్రి ఓటుతో అధికార పక్షం కై వసం చెరో రెండు స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్, సీపీఎం -
జనగణనలో ఓబీసీల లెక్క తేల్చాలి
● ఈ నెల 16న చలో ఢిల్లీ కార్యక్రమం ● మాజీ ఎంపీ వి.హనుమంతరావు స్టేషన్ మహబూబ్నగర్: కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనాభా గణనలో ఓబీసీల లెక్క తేల్చాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు కోరారు. మహబూబ్నగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాహుల్గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్జోడో యాత్రతో దేశంలో ఓబీసీల ఆర్థిక, రాజకీయ స్థితిగతులపై విస్తృతంగా చర్చ జరిగిందన్నారు. ఎవరు ఎంత ఉన్నారో.. వారికి అంతస్థాయిలో వాటా ఉండాలని రాహుల్గాంధీ పిలుపునిచ్చారని గుర్తుచేశారు. రాహుల్గాంధీ ఆలోచన మేరకు ఎన్నికల ముందు కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో కులగణన చేపట్టి 56 శాతం బీసీలు ఉన్నారని లెక్క తేల్చి రాజకీయంగా వారికి అవకాశాలు కల్పించడానికి 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. ఇటీవల సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లోనూ చాలా బీసీలకు అవకాశం దక్కిందన్నారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో జరిగే జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఓబీసీ ప్రధానమంత్రి ఉన్నప్పటికీ ఈ వర్గానికి చేసిందేమిలేదని విమర్శించారు. ఓబీసీల హక్కుల సాధన కోసం ఈ నెల 16న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నామని, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో కాంగ్రెస్ ఓబీసీ రాష్ట్ర కన్వీనర్ కేతూరి వెంకటేశ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, నాయకులు చంద్రకుమార్గౌడ్, లక్ష్మణ్, సీజే బెనహర్, రాములుయాదవ్, ఉషారాణి, పరమేశ్, తిరుపతయ్య, శ్రీనివాసులు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి
మహబూబ్నగర్ కలెక్టరేట్ వద్ద డబుల్ బెడ్రూం ఇళ్ల బాధితులు జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ ఖష్బూ గుప్తాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 900మందికి 60– 75చదరపు గజాల ఇళ్ల స్థలాలు ఇచ్చిందని, అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఇంటి స్థలాలను బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలను నమ్మించి మోసం చేసి అప్పటి కలెక్టర్ రొనాల్డ్ రోజ్, ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ డబుల్ బెడ్ రూమ్స్ ఇస్తామని ఇచ్చిన పట్టాలను వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. ఇచ్చినమాట నిలబెట్టుకోకుండా పేదలను మోసం చేశారని ఆరోపించారు. పట్టాలు తీసుకున్న 900మంది నిరుపేదలు రోడ్డు మీదకు వస్తే దానికి ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కోకన్వీనర్ శ్రీదేవి, టీఎఫ్టీయూ జిల్లా నాయకులు జలాల్ పాషా, గట్టన్న, డబుల్ బెడ్రూమ్ బాధితులు మాధవి, విజయలక్ష్మి, దివ్య, గీత, లలిత, అనిఫాబేగం, లాల్బీ, మహమ్మద్ సద్దాం తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పన
చిన్నచింతకుంట: రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు కృషి చేస్తోందని ఆర్జేడీ సోమిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని లాల్కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రైవేట్కు దీటుగా సర్కారీ బడులను తీర్చిదిద్దుతోందని, నాణ్యమైన విద్యతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు ఆంగ్ల నిఘంటువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం ఆదుకోవాలి..
ఎకరా పొలంలో రూ.70 వేల పెట్టుబడితో ఉల్లి సాగు చేశా. 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్కు తీసుకెళ్తే క్వింటా రూ.800 అడిగారు. తిరిగి తీసుకొచ్చి ఊరూరా తిరిగి విక్రయిస్తున్నా. క్వింటాకు రూ,1,200 వరకు ధర వస్తోంది. ఇలా చేస్తే కనీసం పెట్టుబడినైనా చేతికందే అవకాశం ఉంది. ఈ ఏడాది ఉల్లికి ధర లేక తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. – రాజు, ఉల్లి రైతు, మాధవరం రూ.50 వేల నష్టం.. వాతావరణ మార్పులు ఉల్లి సాగుపై ప్రభావం చూపింది. పంట చేతికొచ్చే సమయంలో కూడా గడ్డ సైజు పెరగలేదు. దీంతో అర ఎకరంలో ఉల్లి సాగుచేస్తే కనీసం 5 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. పెట్టిన పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేదు. ఉల్లి రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలి. – వెంకటయ్య, ఉల్లి రైతు, మరికల్ ● -
సమన్వయంతో పనిచేయాలి..
ఆర్డీఎస్ అంటే గద్వాల జిల్లాకు ఆయువు. దానికి సంబంధించిన పనులు చేసేటప్పుడు అధికారులు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలి. కెనాల్లో మరమ్మతు చేపట్టి చాలా ఏళ్లు అవుతుంది. ఇలాగే నెమ్మదిగా సాగితే ప్రయోజనం ఏముంటుంది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టి వచ్చే వ్యవసాయ సీజన్లోగా మరమ్మతు పూర్తి చేసి రైతులకు సహకరించాలి. – మద్దిలేటి, రైతు, వడ్డేపల్లి రైతులకు ఇబ్బంది కలిగించొద్దు.. పనులు చేసేదే రైతుల కోసం. అలాంటప్పుడు వారికి అనుకూలించేలా చేయాలి. అంతే కానీ కెనాల్లో నీరు ఉన్నప్పుడు, రైతులు సాగులో బిజీగా ఉన్నప్పుడు పనులు చేస్తామంటే దాని వల్ల రైతులకే ఇబ్బంది కలుగుతుంది. 2022లో నిధులు మంజూరు చేస్తే ఇప్పటి వరకు 65 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. అధికారులు వెంటనే పనులు ప్రారంభించేలా చూడాలి. – వడ్డె స్వాములు, రైతు, జిల్లేడుదిన్నె -
ఇంకెన్నాళ్లు.. సాగదీత?
రాజోళి: ‘దేవుడు కరుణించినా.. పూజారి కరుణించలేదు’ అన్న చందంగా మారింది ఆర్డీఎస్ కెనాల్ పరిస్థితి. దశాబ్దాల కాలంగా ఆర్డీఎస్లో ఆధునికీకరణ పనులు చేయకపోగా.. దాన్ని ప్రతిపాదనలు పక్కకు పెట్టి మరమ్మతు చేపట్టేందుకు సిద్ధయమ్యారు. ఇందుకోసం 2022లో రూ.11 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది తాత్కాలిక ఉపశమనమైనప్పటికీ.. కెనాల్ మరింత బలహీనపడిపోతుండటంతో ఈ పనులు ఆర్డీఎస్కు ప్రయోజనకరంగానే మారాయి. కానీ, చేస్తున్న పనులే ఆలస్యమవుతుండటంతో చివరికి ప్రయోజనం ఉండకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. ఆర్డీఎస్ కెనాల్ 65వ కి.మీ., నుంచి 145 కి.మీ., వరకు ఈ పనులు చేపట్టేలా ప్లానింగ్ చేశారు. అందులో భాగంగా సిల్ట్ రెన్యువల్, బ్యాకింగ్ వర్క్స్, సీసీ వర్క్, కాంక్రీట్ పనులు, జంగిల్ క్లియరెన్స్ లాంటివి చేయాల్సి ఉంది. కాగా చేపట్టిన పనులు వేగంగా జరగకపోగా.. చేస్తున్న సమయం అనుకూలించడం లేదని రైతులు అంటున్నారు. రూ.11 కోట్లకు గాను ఇప్పటికే రూ.7.20 కోట్ల విలువ చేసే పనులు పూర్తయ్యాయి. ఈ పనులు చేసిన కాంట్రాక్టర్కు అనుబంధంగా ఉన్న మరో కాంట్రాక్టర్తో అదనంగా మరో రూ.3 కోట్ల పనులు చేపట్టగా.. ఇప్పటికి దాదాపు రూ.2 కోట్ల పనులు చేయాల్సి ఉందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీటిని త్వరగా పూర్తి చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు ప్రారంభించి నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. చేసే పనులు కూడా వర్షాకాలంలో, పంటల సాగు సమయంలో చేస్తే ఎలా ముందుకు సాగుతాయని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వేసవికాలం కెనాల్లో నీరు కూడా ఉండదని, పంటలు కూడా సాగులో ఉండవని, ఈ సమయంలో పనులు వేగంగా సాగుతాయని రైతులు చెబుతున్నారు. కేవలం మరమ్మతు పనులకే నాలుగేళ్లుగా కాలం వెల్లదీస్తున్నారని, ఆధునికీకరణ లాంటి పెద్ద పనులు చేయాలంటే ఇంకెన్నేళ్లు చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటికీ 65 శాతం పనులు మాత్రమే పూర్తయినట్లు తెలుస్తుంది. మిగతా పనులు ఎప్పుడు చేపడతారనేది స్పష్టత లేదనే వాదన వినిపిస్తుంది. ఫిబ్రవరి చివరలోనే కెనాల్లో నీరు తగ్గుముఖం పట్టగా.. అప్పటి నుంచే పనులు ప్రారంభించి ఉంటే.. జూన్లో వర్షాలు కురిసే సమయానికి చాలా వరకు పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉండేదని, అది వదిలేసి ఇప్పుడు పనులు చేయకుండా, మళ్లీ సీజన్ ప్రారంభమయ్యాక పనుల పేరుతో కెనాల్లో నీటిని ఆపే చర్యలు మొదలవుతాయని అంటున్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి పనులను వేగంగా చేపట్టేందుకు సంబంధిత కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో అందించడంతో పాటు పనుల్లో జాప్యం జరిగితే చర్యలు తీసుకోవాలని.. అప్పుడే పనుల్లో వేగం పెరుగుతుందని ఆర్డీఎస్ రైతులు అంటున్నారు. నోటీసులు ఇచ్చాం.. ఆర్డీఎస్ కెనాల్ మరమ్మతు పనులు ఇప్పటికే 65 శాతం పూర్తయ్యాయి. ఇంకా రూ.2 కోట్లకు సంబంధించిన పనులు చేయాల్సి ఉంది. అయితే పనుల్లో ఆలస్యమవుతుందని సంబంధిత కాంట్రాక్టర్కు నోటీసులు ఇచ్చాం. ప్రస్తుతం సాగు సీజన్ కాకపోవడంతో పనులు వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు చెప్పాం. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తాం. – శ్రీనివాసులు, ఈఈ, ఆర్డీఎస్ 2022లో ఆర్డీఎస్ మరమ్మతుకు రూ.11 కోట్ల కేటాయింపు నేటి వరకు నత్తనడకనకొనసాగుతున్న పనులు నాలుగేళ్లు గడిచినా 60 శాతమే పూర్తి.. సీజన్ ప్రారంభానికి ముందే చేపట్టాలంటున్న రైతులు ఇప్పటికిప్పుడు మొదలుపెడితేనే పూర్తయ్యే అవకాశం -
ప్రశాంతంగా ముగిసిన కో–ఆప్షన్ ఎన్నిక
కొత్తపల్లి(మద్దూరు): మద్దూరు పుర కార్యాలయంలో సోమవారం కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మొత్తం 16 వార్డులు ఉండగా 9 వార్డుల్లో అధికార కాంగ్రెస్పార్టీ, 6 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, ఒక స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి కై వసం చేసుకున్నారు. 4 కో–ఆప్షన్ స్థానాలు ఉండగా.. అధికార పార్టీ నుంచి నలుగురు, బీఆర్ఎస్ పార్టీ నుంచి నలుగురు నామినేషన్లు వేశారు. దీంతో ముందస్తుగా అధికార పార్టీ సభ్యులు క్యాంపునకు వెళ్లి సోమవారం ఎన్నిక సమయానికి కౌన్సిల్ కార్యాలయానికి చేరుకొని ఓటింగ్లో పాల్గొన్నారు. అధికార పార్టీకి చెందిన ఎండీ యాసిన్, హబీబా బేగం, కొత్తూరు యాదవరెడ్డి, మాజీ ఎంపీపీ కూనె విజయలక్ష్మి కో–ఆప్షన్ సభ్యులుగా ఎన్నికై నట్లు పుర కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. అనంతరం వారికి పుర చైర్పర్సన్ సరస్వతి జనార్దన్తో కలిసి నియామక పత్రాలు అందజేసి శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్ది భీములు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, నిడ్జింత తిరుపతిరెడ్డి, అల్లీపూర్ మాజీ సర్పంచ్ రమేశ్రెడ్డి, కూనె సంజీవ్కుమార్, జనార్దన్, జంగం బాబు, జీడీ వెంకట్రాములు, గురుగుంట నర్సింహులు, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా పదోతరగతి పరీక్షలు
నారాయణపేట రూరల్: పదోతరగతి వార్షిక పరీక్షలు సోమవారంతో ముగిశాయి. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఏడు పరీక్షలను నెల రోజుల పాటు నిర్వహించారు. ప్రతి పరీక్షకు చదువుకునేందుకు నాలుగు నుంచి ఐదు రోజులు సెలవులు ఇవ్వడంతో ఎక్కువ సమయం పట్టింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగకపోవడంతో ఇటు విద్యాశాఖ, అటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని 43 కేంద్రాలకు 8,319 మంది విద్యార్థులను కేటాయించగా.. సోమవారం జరిగిన సాంఘికశాస్త్రం పరీక్షకు 8,304 మంది హాజరుకాగా, 15 మంది గైర్హాజరయ్యారు. 99.8 హాజరు శాతం నమోదైంది. అదేవిధంగా ఒక ప్రైవేట్ కేంద్రంలో ఇద్దరిని కేటాయించగా.. వందశాతం హాజరు నమోదైంది. సిట్టింగ్స్కాడ్, ఫ్లయింగ్స్కాడ్ బృందాలు పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశాయి. బుధవారం ఒకేషనల్ విద్యార్థులకు పరీక్ష జరగనున్నట్లు డీసీఈబీ కార్యదర్శి శశికుమార్ తెలిపారు. పరీక్ష అనంతరం విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని వీడ్కోలు పలికారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షలు రాసిన విధానంపై ఆరా తీశారు. పలువురు విద్యార్థులు సినిమా థియేటర్ల వైపు వెళ్లగా, మరికొందరు మిత్రులతో కలిసి హోటళ్లలో భోజనాలు చేయడం కనిపించింది. కేజీబీవీ, గురుకుల, ఇతర హాస్టళ్లలో ఉన్న విద్యార్థులకు తమ ఇళ్లకు పయనమయ్యారు. -
రహదారి భద్రత.. అందరి బాధ్యత
● రాష్ట్రంలో ఏటా 5 లక్షల ప్రమాదాలు.. లక్షల సంఖ్యలో మరణాలు ● అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఎస్పీ డా. వినిత్ దామరగిద్ద/కోస్గి రూరల్: రహదారి నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేస్తూ రోడ్డు ప్రమాదాలను నివారిద్దామని ఎస్పీ డా. వినీత్కుమార్ అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం దామరగిద్దలో సర్పంచ్ కన్కిరెడ్డి అధ్యక్షతన, గుండుమాల్లోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగిన అరైవ్–అలైవ్ కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని .. అందులో 1.50 లక్షల మంది మృతి చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదల కంటే రోడ్డు ప్రమాదాలే అధికమని.. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు రోడ్డు భద్రత వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్స్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్, ముఖ్య నాయకులతో రహదారి భద్రత కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామంలోని యువత ప్రమాదాలకు గురికాకుండా రహదారి నిబంధనలు పాటించేలా కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు. అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని ఈ నెల 18 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వంటి చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయని, అలాంటి ఘటనలు కుటుంబాలకు తీరని నష్టాన్ని కలిగిస్తాయని వివరించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్, నాలుగు చక్రాల చోదకులు సీట్బెల్ట్ ధరించాలని, మితిమిరిన వేగం పనికిరాదని, మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు తప్పనిసరిగా వెంటబెట్టుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం ప్రమాదాల నివారణకు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐలు శివశంకర్, సైదులు, డీటీఓ మేఘాగాంధీ, తహసీల్దార్ తిరుపతయ్య, ఎంపీఓ ఉదయ్, ఉప సర్పంచ్ సత్యనారాయణ, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఈదప్ప, ఎస్ఐ రాజు, బాలరాజు, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు బాల్రెడ్డి, రఘు, వెంకట్రామారెడ్డి, నీలి మాణిక్యప్ప, గుండుమాల్లో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ తిరుపతయ్య, సర్పంచ్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణి వినతులు సత్వరం పరిష్కరించాలి
నారాయణపేట: ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలు విని పరిష్కారానికి సంబంధిత అధికారులకు సిఫారస్ చేశారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కాగా ప్రజావాణికి 48 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో ఆర్డీఓ రాంచందర్ నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టిజన్ కార్మికులకు అండగా ఉంటాం
నారాయణపేట: ఆర్టిజన్ కార్మికులకు శాశ్వత ఉద్యోగులతో సమానంగా ఏపీఎస్ఈబీ రూల్స్ సాధించే వరకు 1104 యూనియన్ అండగా ఉంటుందని సంఘం డివిజన్ కార్యదర్శి శ్రీధర్రెడ్డి తెలిపారు. జిల్లాకేంద్రంలో విద్యుత్ ఆర్టిజన్లు చేపట్టిన సమ్మె ఆదివారం ఐదోరోజుకు చేరింది. 1104 యూనియన్ నారాయణపేట డివిజన్ కార్యదర్శి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో సర్కిల్ ప్రెసిడెంట్ గోవిందరాజు, సర్కిల్ అదనపు కార్యదర్శి రవీంద్రాచారి, ఎల్ఎం అచ్యుతారెడ్డి, భీంరెడ్డి, రమేష్, శాంతకుమార్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేటీపీఎస్లో సమ్మె నిర్వహిస్తున్న కార్మికులకు యాజమాన్యం టర్మినేషన్ నోటీసులు వాట్సప్లో పంపించగా యూనియన్ అండగా నిలిచి ప్రభుత్వంతో చర్చలు జరిపి న్యాయం జరిగేలా కృషి చేసిందన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు సంఘం కార్మికుల పక్షాన పోరాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. అవసరమైతే తాము సైతం విధులు బహిష్కరించేందుకు వెనకాడబోమని తెలిపారు. కార్యక్రమంలో టీవీఏఈ జేఏసీ రాష్ట్ర నాయకుడు రాఘవేదర్గౌడ్, ఉమ్మడి జిల్లా కన్వీనర్ దిల్దార్, డివిజన్ చైర్మన్ నర్సింహులు, కో–చైర్మన్ లక్ష్మీకాంత్, రమేష్, కన్వీనర్ జైపాల్, శ్రీధర్, ప్రచారకార్యదర్శి వెంకటేష్, గుండప్ప, మహ్మద్ పాషా తదితరులు పాల్గొన్నారు. -
సత్తాచాటిన బాలికలు
● జిల్లాలో 77.2 శాతం ఉత్తీర్ణత నమోదు ● 46.6 శాతానికేపరిమితమైన బాలురు ● మొదటి సంవత్సరంలో 58 శాతం.. ద్వితీయ సంవత్సరంలో 68 శాతం పాస్ ● రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ దరఖాస్తునకు ఈ నెల 20 వరకు అవకాశం ద్వితీయ సంవత్సరంలో.. రెగ్యులర్ విద్యార్థులు బాలురు 1,312 మందికిగాను 753, బాలికలు 1,927 మందికిగాను 1,511 ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 3,239 మంది విద్యార్థుల్లో 2,264 మంది పాసై 69.9 శాతంతో రాష్ట్రంలో జిల్లా 24వ స్థానంలో నిలిచింది. ● ఒకేషనల్ విభాగంలో బాలురు 128 మందికిగాను 82 మంది, బాలికలు 410 మందికిగాను 383 మంది.. మొత్తం 538 మంది విద్యార్థులకుగాను 465 మంది పాస్ కావడంతో 86.43 ఉత్తీర్ణత శాతం నమోదై రాష్ట్రంలో జిల్లా 2వ స్థానంలో నిలిచింది. నారాయణపేట రూరల్: ఇంటర్మీడియట్బోర్డు ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. జిల్లావ్యాప్తంగా 10 ప్రభుత్వ, 11 కస్తూర్బాగాంధీ, 6 సోషల్ వెల్ఫేర్, 6 బీసీ వెల్ఫేర్, రెండు ఆదర్శ, రెండు మైనార్టీ, ఒక ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలతో పాటు 7 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 8,660 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 5,433 మంది పాస్ కావడంతో 62.73 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక మొదటి సంవత్సరంలో 4,395 విద్యార్థులకుగాను 2,531 మంది పాస్కాగా 57 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదేవిధంగా ద్వితీయ సంవత్సరంలో 4,265 మంది విద్యార్థులకుగాను 2,902 మంది ఉత్తీర్ణత సాధించి 68 శాతంలో నిలిచింది. ఇక మొత్తంగా 3,604 మంది బాలురు పరీక్షలు రాయగా.. 1,680 మంది పాస్ కావడంతో 46.6 శాతం, 4856 మంది బాలికలు పరీక్షలు రాయగా.. 3,753 మంది పాస్ కావడంతో ఏకంగా 77.2 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తంగా జిల్లాలో బాలికల హవా కొనసాగిందని చెప్పవచ్చు. మొదటి సంవత్సరంలో.. జిల్లావ్యాప్తంగా రెగ్యులర్ విద్యార్థులు బాలురు 1,623 మంది పరీక్షలు రాయగా 651 మంది.. బాలికలు 2,070 మందికిగాను 1,537 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 3,893 మంది విద్యార్థులకుగాను 2,188 మంది పాస్ కావడంతో 56.2 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో 26వ స్థానంలో జిల్లా నిలిచింది. ● ఒకేషనల్ విభాగంలో బాలురు 198 మందికిగాను 83 మంది, బాలికలు 304 మందికిగాను 260 మంది .. మొత్తం 502 మందికిగాను 343 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 68.33 శాతంతో 7వ స్థానంలో నిలిచింది. ‘రప్రైవేట్’ విద్యార్థులు.. ప్రైవేట్ జనరల్ విభాగంలో బాలురు 328 మంది విద్యార్థులకుగాను 105 మంది, బాలికలు 138 మంది విద్యార్థులకుగాను 57 మంది.. మొత్తం 467 మంది విద్యార్థులకుగాను 462 మంది పాసై 34.48 శాతంతో రాష్ట్రంలో 12వ స్థానంలో జిల్లా నిలిచింది. ఒకేషనల్ విభాగంలో బాలురు 15 మందికిగాను ఆరుగురు, బాలికల్లో ఆరుగురికిగాను ఐదుగురు మొత్తం 21 మందికిగాను 11 మంది పాసై 52.38 శాతంతో జిల్లా 16వ స్థానంలో నిలిచింది. ప్రతిభ కనబర్చిన గురుకుల విద్యార్థులు.. మద్దూర్ సాంఘిక సంక్షేమ, మక్తల్ బీసీ సంక్షేమ, నర్వ కేజీబీవీ కళాశాలల్లో వందశాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అలాగే ప్రభుత్వ, అనుబంధ కళాశాలల్లో 90 శాతానికి పైగా ఉత్తీర్ణత నమోదైంది. చాలాచోట్ల ఎంపీసీ, బైపీసీలో 900కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఉండటంతో వారికి డీఐఈఓ సుదర్శన్రావు అభినందనలు తెలిపారు. -
ఏడు ఎకరాలు సాగుచేశా..
యాసంగిలో జూరాల ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో 7 ఎకరాల్లో వరి సాగుచేశా. ప్రాజెక్టు ముందు భాగంలో ఉన్న గ్రామం కాబట్టి వారబంది విధానంలో నీటిని వదులుతున్నా సద్వినియోగం చేసుకుంటున్నా. ప్రస్తుతం పంట చేతికి రావాలంటే మరో మూడు తడులైనా నీటిని అందించాలి. – మైను, రైతు, నందిమళ్ల ఐదు తడులు అవసరం.. జూరాల ఎడమ కాల్వ ద్వారా వారబంధి విధానంలో ఆయకట్టుకు సాగునీరు వదులుతున్నారు. కాల్వ వెంట ఉన్న తూములకు షట్టర్లు సరిగా లేకపోవడంతో డి–6 కాల్వకు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు. సాగునీరు అందుతుందనే ఆశతో 11 ఎకరాల్లో వరి సాగుచేశా. అధికారులు ఈ నెల 15 వరకే సాగునీరు వదులుతామంటున్నారు. పంట చేతికి అందాలంటే మరో 5 తడులు ఇవ్వాలి. లేదంటే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. – దేవేంద్రం, రైతు, ఆరేపల్లి (ఆత్మకూర్) సీఎం దృష్టికి తీసుకెళ్తా.. జూరాలలో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో వేసవిలో తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ విషయాన్ని వెంటనే సాగునీటి పారుదల శాఖ మంత్రి, సీఎం దృష్టికి తీసుకెళ్లా. కర్ణాటక నుంచి మనకు 2 టీఎంసీలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతాను. – బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల ఇబ్బంది లేదు.. ప్రస్తుతం ప్రాజెక్టులో ఎంబీ ఎడీడీఎల్ స్థాయికిపైన 1.486 టీఎంసీలు ఉండగా.. లైవ్లో 0.442 టీఎంసీలు ఉన్నాయి. వేసవిలో తాగునీటి కోసం అర టీఎంసీ నీళ్లు అవసరం. ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీటితో తాగునీటి అవసరాలకు సరిపోతాయి. అదేవిధంగా కుడి, ఎడమ కాల్వ పరిధిలోని పంటలకు ఈ నెల 15 వరకు సాగునీటిని విడుదల చేస్తాం. – రహీముద్దీన్, ఎస్ఈ, సాగునీటి పారుదల శాఖ ● -
రేషన్ బియ్యం పక్కదారి?
● అధికారుల పర్యవేక్షణ కరువు ● రైస్మిల్లుల్లో రీ సైక్లింగ్ ? ● రెండేళ్లలో 60 కేసులు నమోదు.. 778 క్వింటాళ్ల బియ్యం పట్టివేత నారాయణపేట: లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్ కోటా రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే గ్రామాల్లో బియ్యం పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలోని 13 మండలాల్లో ఉన్న 301 రేషన్ దుకాణాల్లో 1,70,641 రేషన్ కార్డులు ఉన్నాయి. మూడు నెలలకుగాను 11,972 ఎంటీఎస్ బియ్యం పంపిణీ చేయనున్నారు. పేదల ఆకలి తీర్చేందుకు పంపిణీ చేస్తున్న బియ్యం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. బియ్యం పక్కదారి పట్టకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినా.. ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా తరచూ పట్టుబడుతున్నాయంటే ఈ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతోంది. సంబంధిత శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతోనే అక్రమ దందా జోరుగా కొనసాగుతోంది. అయితే బియ్యం మూడు నెలల కోటా రావడం.. అందులో ఎంతోకొంత పక్కాదారి పట్టించి వాటాలు పంచుకుందామనే ఓ అధికారి లోపాయికారి ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అధికారుల పర్యవేక్షణ కరువు.. చౌకధర దుకణాలపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువవడంతో అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందని చెప్పవచ్చు. రెండేళ్లుగా ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ అధికారులు బియ్యాన్ని పట్టుకున్నారే తప్ప స్థానిక అధికారులు మాత్రం తనిఖీలు చేయడం లేదనిపిస్తోంది. రేషన్ దుకాణాలను తనిఖీ చేసి విక్రయాలు, నిల్వలకు వ్యత్యాసం ఉంటే వెంటనే సదరు డీలర్పై కేసు నమోదు చేయాలి. కానీ అలాంటి పరిస్థితులు కనబడటం లేదు. వ్యాపారులు అధికారులను మచ్చిక చేసుకొని ఈ దందా సాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సరిహద్దులు దాటిస్తూ.. కొందరు వ్యాపారులు రేషన్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని రావల్పల్లి, నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండలం కానుకుర్తి, నారాయణపేట మండలంలో జలాల్పూర్, ఎక్లాస్పూర్, మక్తల్ నియోజకవర్గంలో ఊట్కూర్ మండలంలోని సంస్తాపూర్, మక్తల్, మాగనూర్ మండలాల సరిహద్దులో ఉజ్జెలి, కృష్ణా మండలం టై రోడ్డు తదితర సరిహద్దు మార్గాల్లో బియ్యాన్ని కర్ణాటకకు తరలిస్తున్నారు. అటు రాయిచూర్, ఇటు యాద్గిర్, గుర్మిట్కల్ ప్రాంతాలకు అక్రమ వ్యాపారులు రాత్రి వేళలో బియ్యాన్ని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున టాస్క్ఫోర్స్, నారాయణపేట పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపడుతుందగా 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనం పట్టుబడింది. డీలర్లే దళారులుగా మారి..? జిల్లాలోని చాలామంది లబ్ధిదారులు డీలర్ వద్ద బియ్యం తీసుకొని వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఈసారి మూడు నెలల కోటా బియ్యం రావడంతో బియ్యం బయట ఎందుకు అమ్ముతారు.. ఆ ధర ఎంతో తామే ఇస్తామంటూ పలువురు డీలర్లు సైతం అక్రమ సంపాదనకు తెర తీసినట్లు సమాచారం. ప్రధానంగా దామరగిద్ద, మద్దూర్, ఊట్కూర్, మక్తల్, మాగనూర్, కృష్ణా మండలాలతో పాటు తండాల్లో తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేయడానికి వ్యాపారులు దళారులను పెట్టుకొని దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. చౌక బియ్యం తినని లబ్ధిదారులను గుర్తించి పలువురు డీలర్లే లబ్ధిదారుల నుంచి రూ.15 నుంచి రూ.20 వరకు కొంటున్నట్లు సమాచారం. కొనుగోలు చేసిన బియ్యాన్ని రహస్య ప్రాంతాల్లో ఉంచి ఒకేసారి పెద్దమొత్తంలో బడా వ్యాపారులు, రైసుమిల్లర్లకు కిలో రూ.22 నుంచి రూ.25 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమంగాతరలిస్తే చర్యలు.. రేషన్ బియ్యం అక్రమంగా తరలించిన.. డీలర్లు కొనుగోలు చేసినా.. ఇతరులకు విక్రయించినా.. చట్టరీత్యా చర్యలు తప్పవు. తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ఇకపై నిఘా పెంచుతాం. – సైదులు, సివిల్ సప్లయ్ డీఎం -
రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు: ఎస్పీ
నారాయణపేట: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో రోడ్డు భద్రతపై విస్తృతస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 13 నుంచి 18వ తేదీ వరకు అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో నిర్వహించాలని ఎస్పీ డా. వినీత్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి పోలీస్ అధికారులతో టెలీ కాన్ఫరెనన్స్ నిర్వహించి మాట్లాడారు. రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ఒక్క నిర్లక్ష్యం.. ఒక కుటుంబం నాశనం అనే సందేశంతో ప్రజల్లో బాధ్యత పెంపొందించడమే ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామస్థాయిలో రోడ్ సేఫ్టీ కమిటీల ఏర్పాటు, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన, అంబేడ్కర్ జయంతి సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలపై ప్రమాణ స్వీకారం, బ్లాక్స్పాట్ల గుర్తింపు, ప్రమాదాల నివారణ చర్యలు, పిల్లల కోసం ప్రత్యేక రోడ్ సేఫ్టీ డే నిర్వహణ, హెల్మెట్, సీట్బెల్ట్ ప్రాముఖ్యతపై అవగాహన, గోల్డెన్ అవర్పై పోలీస్, అంబులెన్న్స్ సిబ్బంది, వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ తదితర కార్యకమ్రాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగితే వెంటనే సమాచారం ఇవ్వడానికి ప్రత్యేక హాట్లైన్ నంబర్ 88898 08182 ఏర్పాటు చేశామని, సమాచారం ఇవ్వాలని సూచించారు. శిక్షల కంటే అవగాహనతో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాల పరిసరాల్లో జీబ్రా క్రాసింగ్లు, స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేసి చిన్నారుల భద్రతను బలోపేతం చేయాలని సూచించారు. బాధ్యతగా డ్రైవింగ్ చేస్తే సమాజం మారుతుందని, ప్రతి గ్రామం సురక్షితంగా మారితే జిల్లా సురక్షితం అవుతుందని ఎస్పీ పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములయ్యేలా చూడాలని కోరారు. -
అడుగంటిన జూరాల
గద్వాల: కృష్ణా బేసిన్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే తొలి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల. ఇక్కడి నుంచే ఉమ్మడి పాలమూరులోని సాగునీటి పారుదల ప్రాజెక్టులు, సాగు, తాగునీటి అవసరాలను తీరుస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. అయితే ఇప్పుడు అందరి అవసరాలు తీర్చే పెద్దన్నే.. మరొకరి సాయం కోరే పరిస్థితి వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం జలాశయంలో 0.44 టీఎంసీలు, ఎంబీ, ఎండీడీఎల్ స్థాయిలో 1.486 టీఎంసీలు అందుబాటులో ఉంది. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వ పరిధిలో అధికారికంగా 25వేల ఎకరాలు సాగు చేయగా.. అనధికారికంగా మరో 10వేల ఎకరాల వరకు ఉంటుంది. మొత్తం 35 వేల ఎకరాలకు ఈనెలాఖరు వరకు సాగునీరు అవసరం కాగా ఇప్పటికే పంటలకు వారబంధీ విధానంలో.. కుడి ప్రధా న కాల్వ ద్వారా 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే వేసవిలో తాగునీటి కోసం మూడునెలలపాటు అర టీఎంసీ అవసరం. ప్రస్తు తం జలాశయంలో అందుబాటులో ఉన్న నీరు తా గునీటి అవసరాలు తీర్చడం గగనమే. దీంతో తాగునీటి అవసరాలను తీర్చేందుకు మరోసారి కర్ణాటక రాష్ట్రంపై ఆధారపడ్సాలిన పరిస్థితి నెలకొంది. 35 వేల ఎకరాలు సాగు.. జూరాల ప్రాజెక్టు పరిధిలో వానాకాలంలో 1.09 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తుండగా.. రబీ సీజన్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఎడమ కాల్వ చివరి ఆయకట్టు పరిధిలోని సాగుచేసే సుమారు 50 వేల ఎకరాలకు ప్రభుత్వం క్రాప్హాలిడే ప్రకటించి కేవలం 10 వేల ఎకరాలకు మాత్రమే వదులుతుంది. ఇక కుడి ప్రధాన కాల్వ పరిధిలో 37 వేల ఎకరాలు సాగైతే రబీలో మాత్రం కేవలం 15 వేల ఎకరాలకు కుదించారు. అయితే అధికారికంగా 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుండగా.. అనధికారికంగా మరో 10 వేల ఎకరాల వరకు రైతులు పంటలు సాగుచేశారు. ఈ పంటలు పూర్తిస్థాయిలో చేతికి రావాలంటే ఈ నెలాఖరు వరకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం ఇప్పటికే వారబందీ విధానంలో సాగునీరు అందిస్తున్నారు. కుడికాలువ పరిధిలో 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. ఎడమ, సమాంతర కాల్వలకు మాత్రం నీటిని పూర్తిగా నిలిపివేశారు. ఆందోళనలో అన్నదాతలు.. కుడి, ఎడమ కాల్వల పరిధిలో పంటలు సాగుచేసిన రైతులు పూర్తి స్థాయిలో చేతికి రావాలంటే ఈ నెల 20–25 తేదీల వరకై నా నీరు అందించాలని కోరుతున్నారు. కానీ, అధికారులు మాత్రం ఈ నెల 15 వరకే నీటిని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. దీంతో తర్వాత మరో పదిరోజులపాటు పంటలకు నీటిని ఎలా అందించాలా అని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వమే మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుండగా.. రూ.500 బోనస్ కూడా ఇస్తుండడంతో రైతులు మొత్తం వరిపంట సాగుచేశారు. మార్చి చివరి నుంచే.. జూరాల ప్రాజెక్టు జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. వానాకాలంలో ఈ ప్రాజెక్టు ఉమ్మడి పాలమూరులోని నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్సాగర్, రామన్పాడు ప్రా జెక్టుల పరిధిలో సుమారు 7లక్షల ఎకరాల వరకు సాగునీరు అందిస్తుంది. అయితే ఈసారి వేసవి మొదలైన మార్చి చివరాఖరు నుంచే జలాశయంలో నీటినిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఎగువనున్న కర్ణాటక నుంచి జలాశయానికి ఇన్ఫ్లో లేకపోవడం, కుడి, ఎడమ కాల్వల పరిధిలోని సాగైన పంటలకు సాగునీటిని అందిస్తుండడం, లీకేజీలతో పాటు ఎండలకు ఆవిరి అవుతుండటంతో నీటినిల్వలు వేగంగా పడిపోవడానికి కారణమవుతున్నాయి. తాగునీటికి ఎలా.. వేసవిలో ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు తాగునీటి అవసరాలకు అర టీఎంసీ వరకు అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఎంబీ ఎండీడీఎల్ స్థాయిలో 1.486 టీఎంసీలు అందుబాటులో ఉండగా.. లైవ్లో 0.442 టీంఎసీలు మాత్రమే ఉంది. దీంతో సాగు, తాగునీటి లెక్కలు వేసుకుంటే ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వలు ఏమాత్రం సరిపోవు. దీంతో మరోసారి ఎగువనున్న కర్ణాటక రాష్ట్రంపై ఆధారపడాల్సి వస్తుంది. కర్ణాటక కనీసం 2 టీఎంసీలు విడుదల చేస్తే కానీ.. తాగునీటి గండం నుంచి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నది 0.442 టీఎంసీలే.. కుడి, ఎడమ కాల్వల పరిధిలో 35 వేల ఎకరాలకుపైనే సాగు ఈ నెల 15 వరకు పంటలకు సాగునీరు అందించాలి వేసవిలో తాగునీటి అవసరాలకుఅర టీఎంసీ అవసరం మరోసారి కర్ణాటకను ఆశ్రయించాల్సిన పరిస్థితి -
వరి కొనుగోళ్లకు సిద్ధం కావాలి
● కలెక్టర్ ప్రతీక్ జైన్ నారాయణపేట: జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులతో వరి ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో 82, పీఏసీఎస్ 65, మెప్మా 5, ఎఫ్పీఓఓ ఏడు, ఏఎంసీ ఆధ్వర్యంలో ఒకటి మొత్తం 160 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తరలకుండా ఆరు చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పారు. రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి వరి ధాన్యం సేకరిస్తామన్నారు. క్వింటా గ్రేడ్–ఏ రకానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర నిర్ణయించామని, సన్న రకం వరి క్వింటాకు రూ.500 బోనస్ అదనంగా చెల్లిస్తామని తెలిపారు. కేంద్రాలను కాస్త ఎతైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని, సరిపడా గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచాలన్నారు. రైతుల సౌకర్యార్థం తాగునీరు, నీడ, మూత్రశాలలు తదితర మౌలిక వసతులు కల్పించాలని, ప్రతి కేంద్రంలో కచ్చితంగా 2 ఎలక్ట్రానిక్ తూకపు యంత్రాలు, 30 టార్పాలిన్లు, 1 ప్యాడీ క్లీనర్ అందుబాటులో ఉంచాలని, ప్యాడీ క్లీనర్ లేకుంటే ట్రాక్టర్ మౌంటెడ్ ఫ్యాన్ను ఏర్పాటు చేయాలని సూచించారు. తేమ శాతం 17 వచ్చిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని, కౌలు రైతులు వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా కౌలు రైతు ధ్రువీకరణ పత్రం కచ్చితంగా సమర్పించాలని తెలిపారు. సన్న, దొడ్డురకం ధాన్యాన్ని వేర్వేరు లారీల్లో తరలించాలని.. నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత పూర్తి బాధ్యత నిర్వాహకులదేనని.. కొనుగోలు పూర్తయిన వెంటనే సంబంధిత రైతుకు తూకం వివరాలతో కూడిన కొనుగోలు పత్రం అందజేయాలని తెలిపారు. జిల్లాలో కేటాయించిన రైస్మిల్లులకు మాత్రమే ధాన్యం తరలించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోజు కొనుగోలు కేంద్రాల వారీగా ధాన్యం సేకరణ, రైస్మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలు అందించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఎస్పీ లింగయ్య, డీఆర్డీఓ మొగులప్ప, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం సైదులు, డీసీఓ ప్రసాదరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
అతి పెద్ద క్రీడా మహోత్సవం సంసద్ ఖేల్
● మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ నర్వ: దేశంలోనే అతిపెద్ద క్రీడా మహోత్సవంగా ప్రధానమంత్రి సంసద్ ఖేల్ నిలవబోతోందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో సంసద్ ఖేల్ క్రీడా మహోత్సవాన్ని ఆమె ప్రారంభించి క్రీడాకారులకు క్రీడా సామగ్రి అందజేసిన అనంతరం క్రికెట్ ఆడి అందరిని ఉత్సాహపర్చారు. అంతకుముందు నాగిరెడ్డిపల్లిలో శుద్ధజల కేంద్రం, నర్వలో ఉపాధిహామీ నిధులు రూ.5 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ రహ దారి, లంకాల్లో సీసీ రహదారులు, ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ఆమె ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో గ్రామస్తులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామానికి సీసీ రహదారులు, హైమాస్ట్ లైట్లు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామా ల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. కొత్తపల్లి, లక్కర్దొడ్డి గ్రామస్తులు ఎంపీకి వినతిపత్రం ఇవ్వగా వారితో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా రహదారి లేక ఇబ్బందులు పడుతున్న ఇరు గ్రామాలకు కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.7 కోట్లతో టెండర్లు పూర్తిచేసి త్వరగా పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్రెడ్డి, కొండయ్య, జిల్లా నాయకురాలు లలిత వెంకటరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు అజిత్సింహారెడ్డి, ప్రధానకార్యదర్శి విజయ్రామ్, నాయకులు కుర్వ సత్యం, నీరజ్, వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్రెడ్డి, కృష్ణయ్య, ఆయా గ్రామాల బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
‘ఏదుల’ ఉండగా.. ‘గొల్లపల్లి’ అనవసరం
వనపర్తి/గోపాల్పేట: దశాబ్దాల పాటు ఆంధ్రా పాలకులు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రూ.నాలుగు వేల కోట్లతో నిర్మించి ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని.. కాంగ్రెస్ పాలకులు ఏడు దశాబ్దాల కాలంలో కేవలం 25 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులను నిర్మిస్తే, కేవలం తొమ్మిదేళ్లలో 65 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులు నిర్మించిన ఘటన కేసీఆర్ సర్కార్దేనని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఏదుల మండలం గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణం వద్దంటూ రైతులు 102 రోజులుగా రిలే దీక్షలు చేపడుతుండగా.. గురువారం ఆయన గ్రామానికి వచ్చి రైతుల దీక్షకు మద్దతు తెలిపి మీ వెంట మేముంటామంటూ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభకు ఆయన హాజరై మాట్లాడారు. దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టి మంజూరు చేసిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిన చరిత్ర కాంగ్రెస్దేనని ఆరోపించారు. రైతులు దీక్ష చేస్తున్నదిక్ష రాజకీయాల కోసం కాదని అధికార పార్టీ నాయకులు గుర్తించాలన్నారు. ఏడు టీఎంసీల సామర్థ్యం గల ఏదుల రిజర్వాయర్ ఉండగా.. గొల్లపల్లి రిజర్వాయర్ అవసరం లేదని 2018లోనే నాటి కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. ఏదుల రిజర్వాయర్ నిర్మాణ సమయంలో కేఎల్ఐ ఆయకట్టు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఓటీ (తూము) ఏర్పాటు చేసేలా సప్లిమెంటరీ డిజైన్ చేశామన్నారు. పాన్గల్, వనపర్తి, కోడేరు మండలాల రైతులకు ఉపయోగపడే రామన్నగట్టు ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా రద్దుచేసి అవసరం లేని గొల్లపల్లి రిజర్వాయర్ను కమీషన్ల కోసం రూ.1,300 కోట్లతో నిర్మించ తలపెట్టిందని ఆరోపించారు. నల్లమల పులిని అంటూ డైలాగులు కొట్టే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించారని ప్రశ్నించారు. ఇప్పటికే జూరాల, భీమా సాగునీటి కాాల్వల కింద యాసంగిలో క్రాప్ హాలిడేలు ప్రకటించే పరిస్థితులు ఉన్నాయని.. జూరాల వద్ద మరో ప్రాజెక్టు నిర్మాణం ఎలా సాధ్యమన్నారు. వేసవిలోనూ పంపులు నడిచేందుకు నీరుండే శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రాకు వదిలేసి అతి తక్కువ సామర్థ్యం ఉన్న జూరాల వద్ద ప్రాజెక్టుల నిర్మాణం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఏదుల, వట్టెం, ఉదండాపూర్ వినియోగంలోకి వస్తే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రధానమైన ఏదుల, వట్టెం, ఉదండాపూర్ రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తి చేశామని.. ప్రభుత్వం దృష్టి సారించి సరిగ్గా నెలరోజులు పనిచేస్తే 35 టీఎంసీల నీరు రైతులకు అందుబాటులోకి వస్తుందని మాజీ మంత్రి వివరించారు. ఇప్పటికే మూడు సీజన్లు వృథా అయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అటకెక్కించి కేరళ ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుబంధు, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్ సైతం అసమగ్రంగా అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరోమారు ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. వలసల జిల్లా సస్యశ్యామలం.. వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు తెలంగాణ ప్రభుత్వ హయాంలో సస్యశ్యామలమైందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. వలసలు తగ్గించేందుకు అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే కేసీఆర్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేసిందని, కుల వృత్తులకు జీవకళ వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పాలకులు అక్రమ కేసులతో బీఆర్ఎస్ నాయకులను బెదిరింపులకు గురిచేయలేరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, బీరం హర్షవర్ధన్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.లగచర్లపునరావృతం అవుతుంది.. రైతులు వద్దన్నా.. గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం ముందడుగు వేస్తే లగచర్ల ఘటన పునరావృతం అవుతుందని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. వంద రోజులుగా న్యాయమైన డిమాండ్ల సాధనకు రైతులు దీక్షలు చేపడితే పట్టించుకోని కాంగ్రెస్ పాలకులు.. రైతుల దీక్ష విరమింపజేసేందుకు హరీశ్రావు వస్తున్నారనగానే ఉలిక్కిపడుతున్నారన్నారు. బాలికపై అత్యాచారయత్నం, రైతుల దీక్షలపై జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించకపోవడం శోచనీయమని తెలిపారు. ఏదుల రిజర్వాయర్ నిర్మాణానికి రైతులను ఒప్పించేందుకు 73 సార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించానని, భూములు ఇవ్వాలంటూ రైతులను ఒప్పించేందుకు కాళ్లు మొక్కుతానని ప్రాధేయపడినట్లు చెప్పారు. కమీషన్ల కోసమే రిజర్వాయర్ నిర్మాణానికి ఆసక్తి 8 నెలల్లో తుమ్మిళ్ల పూర్తి చేసి చూపించాం సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం సరిగ్గా నెలరోజులు పనిచేస్తే 35 టీఎంసీల నీరు అందుబాటులోకి.. మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు రైతులతో దీక్ష విరమింపజేసిన బీఆర్ఎస్ నేతలు -
పకడ్బందీగా ‘అరైవ్.. అలైవ్’
● కలెక్టర్ ప్రతీక్ జైన్ నారాయణపేట: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా వారం రోజుల పాటు నిర్వహించనున్న అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్రాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జోంగ్తు, సెక్రటరీ (ప్లానింగ్) గౌరవ్ ఉప్పల్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సీఐపీఆర్ ప్రియాంక హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించగా.. జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రహదారి భద్రతపై అనేక చర్యలు చేపట్టినప్పటికీ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాల సంఖ్య పెరగడం, మెరుగైన రహదారులతో అధిక వేగం, సరైన డ్రైవింగ్ శిక్షణ లోపం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ తదితర కారణాలు ప్రమాదాల పెరుగుదలకు దారి తీస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశాలను తరచూ నిర్వహిస్తూ ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు వారం పాటు జరిగే అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విస్తృత అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన పెంచడం, బాధ్యతాయుత డ్రైవింగ్ను ప్రోత్సహించడమే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. 13న గ్రామస్థాయి రోడ్డు భద్రత కమిటీల ఏర్పాటు, 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహాల వద్ద రోడ్డు భద్రత ప్రమాణ స్వీకారం, 15న ‘చిల్డ్రెన్ రోడ్ సేఫ్టీ డే’ నాలుగేళ్లు పైబడిన పిల్లలకు సీట్బెల్ట్ వినియోగంపై అవగాహన, 16న ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై ప్రత్యేక ప్రచారం, సోషల్ మీడియా ద్వారా అవగాహన, 17న ప్రమాదాల అనంతరం తక్షణ వైద్య సాయం కోసం గోల్డెన్ హవర్ శిక్షణ కార్యక్రమాలు, 18న ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి కౌన్సెలింగ్, ప్రవర్తన మార్పు, ట్రాఫిక్ నియమాలు పాటించడం కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీంద్రారెడ్డి, డీఎస్పీ నల్లపు లింగయ్య, డీటీఓ మేఘాగాంధీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. జయచంద్రమోహన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ.. జిల్లాకేంద్రంలోని ఈవీఎం గోదాం పటిష్ట భద్రత మధ్య ఉందని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈవీఎం గోదాంను నెలవారీ తనిఖీల్లో భాగంగా అదనపు కలెక్టర్లు ఫణీంద్రరెడ్డి, శ్రీనుతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాలు, భద్రత, పోలీసుల బందోబస్తును పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ... ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తనిఖీ చేసి సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తున్నట్లు చెప్పారు. వారి వెంట తహసీల్దార్ అమరేంద్ర కృష్ణ, కలెక్టరేట్ సి–సెక్షన్ అధికారులు జయసుధ, రాణిదేవి ఉన్నారు. -
క్రీడల్లో రాణించి దేశ కీర్తిని చాటాలి
నారాయణపేట: క్రీడలతో మానసికోల్లాసం, శారీరక దారుఢ్యం పెంపొందుతాయని.. క్రీడాకారులు క్రీడల్లో రాణించి భారతదేశ కీర్తిని చాటాలని, అంతర్జాతీయస్థాయి క్రీడల్లో ప్రతిభ చాటేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ను ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం వివిధ మండలాల కో–ఆర్డినేటర్లకు క్రికెట్, వాలీబాల్ కిట్లును పంపిణీ చేశారు. టాస్ వేసి పోటీలను ప్రారంభించడంతో పాటు క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు బ్యాటింగ్ చేశారు. సర్వీస్ చేసి వాలీబాల్ ఆటను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. క్రికెట్, వాలీబాల్, ఖో–ఖో, కబడ్డీ పోటీలు మండల, అసెంబ్లీ నియోజకవర్గ, పార్లమెంట్స్థాయిలో కొనసాగుతాయని చెప్పారు. మండలస్థాయిలో గెలుపొందిన జట్లు నియోజకవర్గస్థాయిలో.. అక్కడ గెలిచిన జట్లు పార్లమెంట్ స్థాయిలో ఆడుతారని, మహిళల విజేత జట్లకు ప్రత్యేక బహుమతులు ఉంటాయన్నారు. మొదటిసారి నాలుగు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని.. వచ్చే ఏడాది నుంచి అన్నిరకాల పోటీలు నిర్వహించుకుందామని చెప్పారు. ఈ నెల 24న ముగింపు వేడుక మహబూబ్నగర్లో ఉంటుందని.. వేడుకకు గవర్నర్ హాజరై విజేత జట్లకు బహుమతులు అందజేస్తారని వివరించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ.. గ్రామాల్లో అభివృద్ధి పనులు కేంద్ర నిధులతో కొనసాగుతున్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకపోవడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. కాంగ్రెస్పార్టీ అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని.. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందన్నారు. నారాయణపేట మండలం సింగారం గ్రామంలో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు, సీసీ రోడ్లును ఆమె ప్రారంభించి మాట్లాడారు. పేదరికాన్ని తగ్గించి, ఆర్థికాభివృద్ధి సాధించాలని ప్రధాని మోదీ ప్రయత్నం చేస్తున్నారని.. కాంగ్రెస్ను గెలిపించి కర్ణాటక ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. భారతదేశ అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రత్యర్థి దేశాలు కుట్రలు పన్నుతున్నాయని.. ప్రజలపై యుద్ధం ప్రభావం లేకుండా పాలన కొనసాగిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమని.. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆరోపించారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే కేంద్ర పథకాలు నేరుగా ప్రజలకు అందుతాయన్నారు. వికాసిత్ భారత్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీఎంఎస్కేఎం పార్లమెంట్ ఇన్చార్జ్ ముచ్చర్లపల్లి జనార్దన్రెడ్డి, పేట జిల్లా కన్వీనర్ తిరుపతిరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు నాగురావు నామాజీ, రాష్ట్ర కార్యవర్గసభ్యులు రతంగ్పాండురెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు కొండయ్య, మున్సిపల్ చైర్మన్ కొండా శ్వేత, వైస్ చైర్మన్ మంజుల జీఆర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్కుమార్, కౌన్సిలర్ సత్య రఘుపాల్రెడ్డి, నాయకులు రఘురామయ్యగౌడ్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. -
పురపాలికల వారీగా ఇలా..
● నారాయణపేట మున్సిపాలిటీలో 9,306 ఆస్తులకుగాను రూ.3.82 కోట్లు పన్ను చెల్లించాల్సి ఉంది. ముందస్తుగా 5 శాతం రాయితీతో చెల్లిస్తే రూ.19.10 లక్షల రాయితీపోను రూ.3.62 కోట్లు ఆదాయం సమకూరుతుంది. ● మక్తల్ పురపాలికలో 7,636 ఆస్తులకు రూ.2.14 కోట్లు వసూలు కావాల్సి ఉంది. 5 శాతం రాయితీతో రూ.10.70 లక్షలు పోను రూ.2.03 కోట్ల ఆదాయం సమాకూరుతుంది. ● కోస్గిలో 6,446 ఆస్తులుండగా.. రూ.2.09 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంది. ఇందులో 5 శాతం రాయితీ రూ.10.45 లక్షలు పోతే రూ.1.98 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ● మద్దూర్లో 3,192 ఆస్తులుండగా.. రూ.53 లక్షలు పన్ను వసూలు చేయాల్సి ఉంది. ఇందులో రూ.2.65 లక్షల రాయితీపోను రూ.50.35 ఆదాయం సమకూరే అవకాశం ఉంది. సద్వినియోగం చేసుకోవాలి.. మున్సిపాలిటీలోని వివిధ సేవలకు సంబంధించిన పన్నులను క్యూఆర్ కోడ్, వాట్సప్ నంబర్తో చెల్లించవచ్చు. పుర ప్రజలు డిజిటల్ విధానంలో పన్ను చెల్లింపులు చేయాలని కోరుతున్నాం. ముందస్తు పన్ను చెల్లింపునకు ఈ నెల 30 వరకు గడువు ఉంది. ఆస్తి పన్ను చెల్లించి పురపాలిక అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాం. – గోల్కొండ నర్సయ్య, పుర కమిషనర్, నారాయణపేట ● -
మద్దూరులో సీఎంఓ ముఖ్య కార్యదర్శి
కొత్తపల్లి(మద్దూరు): మద్దూరు పురపాలికలో గురువారం సీఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు పర్యటించారు. పట్టణంలో శిథిలావస్థకు చేరిన ఆర్టీసీ బస్టాండ్ పునర్నిర్మాణం, ప్రహరీ నిర్మాణానికి హద్దులు ఏర్పాటుచేసి అంచనాలను సిద్ధం చేసి నివేదిక పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కాడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి, ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంకన్న, సృషాఖాన్, ఆర్ఎం సంతోష్కుమార్, తహసీల్దార్ మహేష్గౌడ్, పుర కమిషనర్ శ్రీకాంత్, చైర్మన్ సరస్వతి జనార్దన్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు గూళ్ల నర్సింహులు, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు: ఎస్పీ నారాయణపేట: బాధితుల సౌలభ్యం కోసం తెలంగాణ పోలీసులు ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఎస్పీ డా. వినీత్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విధానంలో బాధితులు పోలీస్స్టేషన్న్కు రావాల్సిన అవసరం ఉండదని.. ఫోన్ ద్వారా సమాచారం అందించిన వెంటనే పోలీసులు బాధితుల నివాసానికి, అనుకూలమైన ప్రదేశానికి వెళ్లి ఫిర్యాదును స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఫిర్యాదు రాయలేని పరిస్థితుల్లో పోలీసులే వాంగ్మూలాన్ని వారి భాషలో రాసి చదివి వినిపించి సంతకం తీసుకొని అక్కడికక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రతిని అందజేస్తారని చెప్పారు. ప్రత్యేకంగా మహిళలు, పిల్లలు, బలహీనవర్గాల వారికి ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని.. లైంగిక నేరాలు, హత్యాయత్నం, గాయపర్చే ఘటనలు, దొంగతనం, దోపిడీ, చోరీ, ఆస్తి సంబంధిత నేరాలు, పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, బాల్య వివాహ నిరోధక చట్టాలకు సంబంధించిన కేసుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని వివరించారు. మహిళలు, పిల్లల కేసుల్లో మహిళా పోలీసు అధికారిని తప్పనిసరిగా పంపిస్తామని.. అవసరమైతే ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయుల సమక్షంలో వాంగ్మూలం నమోదు చేస్తారని చెప్పారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకొని నిర్భయంగా ఫిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు. జిల్లా పోలీసులు ప్రజల భద్రతకు కట్టుబడి పని చేస్తున్నారని పేర్కొన్నారు. 11న భారీ ర్యాలీ పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈనెల 11న డ్రగ్స్ కంట్రోల్ రెగ్యులేటరీ బలోపేతం దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఔషధ నియంత్రణ శాఖ ఏడీ దినేష్కుమార్ వెల్లడించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్ కార్యక్రమంలో భాగంగా గురువారం నగరంలోని సరోజిని రాములమ్మ ఫార్మసీ కళాశాలలో డ్రగ్ అబ్యూస్–డ్రగ్ అడిక్షన్ అనే అంశంపై క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11న క్లాక్టవర్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ ఉంటుందని తెలిపా రు. అనంతరం శివమ్ కన్వెన్షన్ హాల్లో డ్రగ్ దుర్వినియోగం నివారణతో పాటు మరో ఏడు రకాల అంశాలపై అవగాహన సదస్సు ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడైనా నకి లీ మందులు ఉంటే వెంటనే 180059 96969కు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: డీఈఓ
నారాయణపేట రూరల్: బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యాద్గిర్ జనార్దన్రెడ్డి అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన ఉపాధ్యాయుడు ఫయాజుద్దీన్ కుటుంబానికి మంగళవారం సంఘం తరఫున రూ.లక్ష ఆర్థిక సాయాన్ని జిల్లా విద్యాధికారి గోవిందరాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల కుటుంబ రక్షణకు ఏర్పాటుచేసిన సంఘ సంక్షేమనిధి నుంచి డబ్బులను చెక్కు రూపంలో అందించామన్నారు. భవిష్యత్లోనూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ, బాధిత కుటుంబ సభ్యులు కౌసర్ బేగం, ఫసియోద్దీన్, సంఘం నాయకుడు వాణిశ్రీ, జహీరుద్దీన్, రఘువీర్, సత్యనారాయణరెడ్డి, హనీఫ్, నరేష్, శ్రీనివాస్, అరవింద్, బాలాజీ పాల్గొన్నారు. -
జిల్లాలో ఇలా..
యాసంగి సాగు విస్తీర్ణం1.80 లక్షల ఎకరాలు దొడ్డురకం పంట దిగుబడి అంచనా 62,815 మెట్రిక్ టన్నులు దొడ్డురకం కేంద్రాలు48 సన్నరకం కేంద్రాలు 112మెప్మా కేంద్రాలు 4ఎఫ్పీఓ కేంద్రాలు 9సాధారణ రకం రూ.2,300 సన్నరకానికి బోనస్ రూ.500 అవసరమైన గన్నీ బ్యాగులు 61,20,325 -
ధాన్యం కొనుగోళ్లకు కసరత్తు
160 కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు ● జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగు ● 2.45 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణే లక్ష్యం ● 51 రైస్మిల్లులకు ధాన్యం కేటాయింపులు ● రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు –8లో uనర్వ: జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధిత శాఖల అధికారులు సన్నాహాలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి కలెక్టర్ ఆయా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ప్రాథమిక సహకార సంఘం, మెప్మా, పీఏసీఎస్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా మొత్తం 160 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పంట కోతల ఆధారంగా ఈ నెల రెండో వారం నుంచి కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఈ సీజన్లో జిల్లావ్యాప్తంగా 2,44,813 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. కాగా 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లు ప్రారంభం కాగానే మరిన్ని చెప్పించాలని సూచించారు. ప్రైవేట్ను ఆశ్రయించకుండా.. జిల్లావ్యాప్తంగా 1.80 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. పంట నూర్పిళ్లు ప్రారంభించే నాటికి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏ–గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.2,380, సాధారణ రకం క్వింటాకు రూ.2,360 మద్దతు ధర నిర్ణయించారు. 4.37 లక్షల మె.ట. దిగుబడి.. జిల్లాలోని 13 మండలాల్లో 1.80 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు అంచనా ఉండగా 4,37,167 మెట్రిక్ టన్నుల పంట ధాన్యం దిగుబడి రానుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో 1,92,354 మెట్రిక్ టన్నులు బయట మార్కెట్కు వెళ్లే అవకాశం ఉండగా.. మిగిలిన ధాన్యం పౌరసరఫరాలశాఖ ద్వారా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
త్వరలోనే ప్రారంభిస్తాం..
జిల్లాలో 160 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. ఈ నెల రెండో వారంలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైతే మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం. 2.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలే లక్ష్యం. రైతులకు ఇబ్బందులు కలగకుండా సరిపడా గన్నీ బ్యాగులు, లారీలు, హమాలీలు ఉండేలా చర్యలు తీసుకుంటాం. సన్నరకం ధాన్యానికి బోనస్ చెల్లింపులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుకు సాగుతాం. – సైదులు, డీఎం, పౌరసరఫరాల సంస్థ, నారాయణపేట ● -
నైపుణ్యాభివృద్ధికి శిక్షణ
పీయూ పరిధిలో చదువుతున్న విద్యార్థులకు స్కిల్స్ అందించేలా అధికారుల కసరత్తు ● టీసీఐఎల్తో ఒప్పందం, పోటీ పరీక్షలు ఇతర స్కిల్ డెవలప్మెంట్కు ఆన్లైన్ శిక్షణ ● ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 32,892 మంది విద్యార్థులు ● పీఎంఐఎస్ ద్వారా ఇంటర్న్షిప్, స్కాలర్షిప్ పొందే అవకాశం ● డీట్ యాప్లో దరఖాస్తు చేసుకుంటే ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు వారు చదివిన కోర్సులకు అనుగుణంగా ఉద్యోగాలు సాధించేందుకు యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కళాశాల స్థాయిలో ఉన్నప్పుడే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు సాధించేలా ఇంటర్వ్యూ, కమ్యూనికేషన్ స్కిల్స్, కాగ్నిటివ్ స్కిల్ పెంపొందించేలా పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. వీటితో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫార్మ, ఎంబీఏ, ఎంసీఏతో పాటు ఇతర కోర్సుల విద్యార్థులకు కళాశాల స్థాయిలోనే ఇంటర్న్షిప్కు అవకాశం కల్పించనునున్నారు. వీటి ద్వారా స్కాలర్షిప్తో పాటు విద్యార్థి అనుభవం కూడా పొందనున్నారు. డీట్ (డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ తెలంగాణ) యాప్నకు సంబంధించి పీయూ పరిధిలోని వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఆన్లైన్ సమావేశం నిర్వహించగా.. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం.. విద్యార్థులకు ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షలకు సిద్ధమవడంతోపాటు పలు రకాల శిక్షణ అందించేందుకు కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ టీసీఐఎల్ (టెలీకమ్యూనికేషన్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్)తో అధికారులు ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా పీయూ పరిధిలోని 112 కళాశాలల్లో చదువుతున్న 32,892 మంది విద్యార్థులు ఆన్లైన్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థి టెక్నికల్, నాన్ టెక్నికల్ వంటి వివరాలను వెబ్సైట్లో పొందుపరిస్తే వారికి అవసరమైన కోర్సులు చూపిస్తుంది. విద్యార్థి ఏ రకమైన కోర్సు కావాలో ఎంపిక చేసుకుంటే అందుకు సంబంధించి వివరాలు వస్తాయి. ఇలా విద్యార్థికి వచ్చిన స్టడీ మెటీరియల్, కంటెంట్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థి దీన్ని ఖాళీ సమయంలో ల్యాప్టాప్, సెల్ఫోన్లో కూడా చేయవచ్చు. విద్యార్థులు చదువు పూర్తయ్యాక ప్రైవేటు సెక్టార్లో, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం డీట్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యాప్ను డౌన్లోడ్ చేసుకుని పేరు, కోర్సుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కంపెనీలు యాప్లో ఇందులో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండడం ద్వారా విద్యార్థి అర్హతను బట్టి ఏ ఉద్యోగం కావాలో యాప్లో పొందే అవకాశం లభిస్తుంది. ఈ క్రమంలో యాప్లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబు ఆన్లైన్ ద్వారా సమావేశం ఏర్పాటు చేయగా.. పీయూ పరిధిలోని 80 కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. ప్రైమినిస్టర్ ఇంటర్న్షిప్.. విద్యార్థులకు కళాశాల స్థాయిలోనే తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రైమినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో కళాశాల స్థాయిలో చదువుతున్న విద్యార్థులు తాము ప్రాక్టికల్గా సబ్జెక్టు, వృత్తి నైపుణ్యాలు పెంచుకునేలా ఆయా కంపెనీలు, సంస్థల్లో చేరి ఇంటర్న్షిప్ చేసేందుకు ఆస్కారం ఉంది. ఇందులో ఇంటర్న్షిప్ చేసిన వారికి రూ.6 వేల నుంచి రూ.50 వేల వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. దీంతో పాటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లో మార్కులు కూడా వేయనున్నారు. పేద విద్యార్థులు ఇంటర్న్షిప్ చేసి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చదివేందుకు ఇది దోహదపడుతుంది. ఈ స్కీం ద్వారా ఇప్పటికే పలువురు విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీటి ద్వారా నచ్చిన సంస్థల్లో ఇంటర్న్షిప్ చేయవచ్చు. డీట్తో ఉద్యోగాలు.. -
అవకాశాలు మెరుగు..
పీయూ పరిధిలో చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పీఎం ఇంటర్న్షిప్ ద్వారా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు నేరుగా ఇంటర్న్షిప్ చేసేందుకు వీలుపడుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డీట్ యాప్ ద్వారా విద్యార్థుల చదువులు పూర్తయ్యాక వెంటనే ఉద్యోగాలు పొందేలా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తున్నాం. పీయూ పరిధిలో చదువుతున్న వారిని కార్పొరేట్ సెక్టార్కు అవసరమైన విధంగా తీర్చిదిద్దుతాం. – శ్రీనివాస్, వీసీ, పీయూ విద్యార్థులకు సువర్ణావకాశం... పీయూలో తీసుకుంటున్న నిర్ణయాలతో విద్యార్థులు తమ స్కిల్స్ పెంపొందించుకోవడంతో పాటు త్వరగా ఉద్యోగాలు పొందేందుకు ఆస్కారం లభిస్తుంది. అందుకే పీయూలో ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం ఇంటర్న్షిప్తో పాటు టీసీఐఎల్ ద్వారా శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే ఇందులో 32 వేలకు పైగా విద్యార్థులు చేరారు. పలువురు ఆన్లైన్ శిక్షణ పొందుతున్నారు. ప్రతి విద్యార్థి కూడా చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు పొందాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ ● -
నిర్ణీత గడువులోగా సీఎంఆర్ అప్పగించాలి
నారాయణపేట: రైస్ మిల్లర్లు నిర్ణీత గడువులోగా సీఎంఆర్ ప్రభుత్వానికి అప్పగించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ మందిరంలో పౌరసరఫరాలసంస్థ డీఎం సైదులుతో కలిసి రైస్మిల్లర్లు, పౌరసరఫరాలశాఖ డీటీలతో 2025–26 వానాకాలం సీఎంఆర్పై సమీక్ష నిర్వహించారు. 2025–26 యాసంగి వరి ధాన్యం కేటాయింపునకు బ్యాంకు గ్యారెంటీలు, ఒప్పందాలు సమర్పించాలని, అలాగే మిగిలిన గన్నీ బ్యాగులను వెంటనే తిరిగి ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయని వివరించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి బాలరాజు పాల్గొన్నారు. -
అన్నీ అనుకూలిస్తే..
కొల్లాపూర్: గత కొన్నేళ్లుగా మరమ్మతుకు నోచుకోని కేఎల్ఐ మోటార్లకు ఈసారి తప్పనిసరిగా చేపట్టాలనే పట్టుదలతో అధికారులు ఉన్నారు. దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా ఈసారి శ్రీశైలం బ్యాక్వాటర్ మార్చి నెలలోనే భారీగా తగ్గుముఖం పట్టింది. దీంతో మోటార్ల మరమ్మతుకు ఇదే అనువైన సమయం అని నీటిపారుదల శాఖ భావిస్తోంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలో మరమ్మతు చేపట్టే అవకాశం ఉందని, లేదంటే మరో ఏడాది ఆగాల్సిందేనని వారు పేర్కొంటున్నారు. నిధుల కేటాయింపు కేఎల్ఐలో పాడైన మోటార్ల మరమ్మతుకు గతేడాది ప్రభుత్వం రూ.18.80 కోట్లు మంజూరు చేసింది. ఇందులో మూడో నంబర్ మోటార్ మరమ్మతు కోసం రూ.15 కోట్లు కేటాయించగా.. ఐదో నంబర్ మోటార్కు స్పిల్ భీమ్, కాంక్రీట్ వర్క్స్, సర్జిపూల్లోకి నీళ్లు రాకుండా అడ్డుకట్ట ఏర్పాటు కోసం రూ.3.80 కోట్లు కేటాయించింది. మిషన్ భగీరథ కారణంగా.. ఉమ్మడి మహబూబ్నగర్– రంగారెడ్డి జిల్లాలకు ఎల్లూరు సమీపంలోని మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ స్కీంకు కేఎల్ఐ ప్రాజెక్టు నుంచే నీటిని ఎత్తిపోస్తున్నారు. మిషన్ భగీరథ స్కీం లేక ముందు ఎల్లూరు పంపుహౌజ్లోని మోటార్లకు వేసవిలో రెండు నెలలపాటు విరామం ఇచ్చేవారు. మిషన్ భగీరథ స్కీం వచ్చాక విరామం లేకుండా ఏడాది మొత్తం ఎల్లూరు పంప్హౌజ్ ద్వారా నీటి ఎత్తిపోతలు చేపడుతున్నారు. దీంతో పాడైన మోటార్లకు సకాలంలో మరమ్మతు చేపట్టేందుకు వీలు కావడం లేదు. బ్యాక్వాటర్ తగ్గుముఖం.. దశాబ్దకాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది మార్చి నెల నుంచే శ్రీశైలం బ్యాక్వాటర్ భారీగా తగ్గుతూ వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేపట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్ వాటర్ లెవెల్స్ 821 అడుగులుగా ఉండగా.. 805 అడుగుల వరకు కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసుకునే వెసులుబాటు ఉంది. మిషన్ భగీరథ స్కీంకు నార్లాపూర్ రిజర్వాయర్లోని నీటిని మళ్లిస్తే కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలకు విరామం లభిస్తుంది. ఉన్నతాధికారులు అనుమతిస్తే వచ్చే నెలలో నీటి ఎత్తిపోతలు నిలిపివేసి.. మోటార్లకు మరమ్మతు చేపట్టే యోచనలో అధికార యంత్రాంగం ఉంది. వచ్చే నెలలో కేఎల్ఐ మోటార్ల మరమ్మతుకు అధికారుల చర్యలు రూ.18.80 కోట్లు కేటాయించిన ప్రభుత్వం మరోవైపు మిషన్ భగీరథకు కొనసాగుతున్న ఎత్తిపోతలు ప్రస్తుతం 821 అడుగుల ఎత్తులోశ్రీశైలం బ్యాక్వాటర్ బ్యాక్వాటర్ భారీగా తగ్గిపోవడంతోఅనుకూలంగా భావన -
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
● మొర్రం, మట్టి రవాణాకు ఆన్లైన్ అనుమతి ● కలెక్టర్ ప్రతీక్ జైన్ నారాయణపేట: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ‘మన ఇసుక.. మన వాహనం’పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మన ఇసుక మన వాహనం ఆన్లైన్ విధానంలో జిల్లాలో ఇసుక రవాణా జరగాలని స్పష్టం చేశారు. జిల్లాలో గుర్తించిన ఐదు రీచ్ల నుంచి ఇసుక రవాణా జరగాలని, అక్రమంగా తరలిస్తే వాహనాలను సీజ్ చేయాలన్నారు. కోస్గి, మాగనూరు మండలాల్లో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇకపై ఎక్కడా జరగడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. తహసీల్దార్లు, ఎస్ఐలు, ఎంపీడీఓలు సమన్వయంతో ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతి ఇవ్వాలని.. మొర్రం, మట్టి రవాణాకు సైతం ఆన్లైన్లోనే అనుమతి ఇచ్చేలా త్వరలో నిర్ణయం తీసుకుందామని తెలిపారు. ఎస్పీ డా. వినీత్కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి నష్టం కలగకుండా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని వాహనాలను సీజ్ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నిబంధనలను కచ్చితంగా పాటించాలని, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని, అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందితే దాడులు చేసి వాహనాలను సీజ్చేసి పోలీసుస్టేషన్కు తరలించాలన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మన ఇసుక మన వాహనం దరఖాస్తు ప్రక్రియను వివరించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రాంచందర్ నాయక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐలు శివశంకర్, సైదులు, జిల్లాలోని మూడు సర్కిళ్ల సీఐలు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎస్ఐలు, మైనింగ్శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 29 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫణీంద్రరెడ్డి, శ్రీను, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
బ్రిడ్జి కమ్ బరాజ్
జూరాల ఎగువ భాగాన నిర్మించేందుకు నిర్ణయం గద్వాల: కృష్ణాబేసిన్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే తొలి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ భాగాన మరో బరాజ్ నిర్మాణంతో పాటు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించి చేపడుతున్న మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులు బ్రిడ్జి కమ్ బరాజ్ నిర్మాణం చేసే స్థల ఎంపిక, బ్రిడ్జి నిర్మాణం ఎన్ని కిలోమీటర్ల మేర నిర్మించాలి అనే అంశాలపై కసరత్తు మొదలుపెట్టారు. ఈ మేరకు అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం.. జూరాల ప్రాజెక్టుకు సమాంతరంగా సేఫ్టీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ముందు నుంచి ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఉంది. అయితే గతేడాది జూలైలో ప్రాజెక్టు గేట్లు దెబ్బతిని లీకేజీలు ఏర్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జూరాలను సందర్శించారు. ఈ క్రమంలోనే జూరాల ప్రాజెక్టుకు సమాంతరంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు ఇందుకోసం రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ప్రాజెక్టు సమీపంలో 900 మీటర్ల పరిధిలో దిగువ భాగాన ధరూరు మండలం చింతరేవుల, ఆత్మకూరు మండలం అమరచింతల మధ్య బ్రిడ్జి నిర్మాణం చేపట్టేలా సాగునీటి పారుదల శాఖ అధికారులు సర్వే చేశారు. ఇందుకోసం రూ.100 కోట్లపైనే వ్యయం అవుతున్నట్లు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే బ్రిడ్జి నిర్మాణాన్ని ఆర్అండ్బీ శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత బ్రిడ్జి నిర్మాణ స్థల మార్పిడి జరగడం, జూరాల సమీపంలో కాకుండా గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూరు జూరాల మధ్య బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టడంతో వివాదాస్పదంగా మారింది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఇరిగేషన్ శాఖకు చెందిన నిధులు వ్యయం చేయనున్నారు. దీంతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ అనుమతులు ఇవ్వడంలో తాత్సారం జరగడం, ఎన్ఓసీ సర్టిఫికెట్ ఇవ్వడానికి వెనకంజ వేయడంతో గందరగోళంగా మారింది. వాడీవేడిగా చర్చ.. గత నెల ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సాగునీటిపారుదల శాఖ అధికారులతో ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమీక్షించారు. ఈ సమావేశంలో జూరాల సేఫ్టీపై పెద్దఎత్తున వాడీవేడిగా చర్చ జరిగింది. డ్యాం సేఫ్టీని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఎంపీ డీకే అరుణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపీ అరుణకు కౌంటర్గా ప్రెస్మీట్ పెట్టి ఖండించారు. ఈ క్రమంలోనే డ్యాం సేఫ్టీపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో జూరాల ప్రాజెక్టు ఎగువ భాగాన బ్రిడ్జి నిర్మాణంతోపాటు బరాజ్ నిర్మాణం చేపట్టాలని హైదరాబాద్లో ఆదివారం జరిగిన సమీక్షలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. దీంతో బ్రిడ్జి కం బరాజ్ నిర్మాణం చేపట్టాలని ఇందుకు సంబంధించి వెంటనే స్థల ఎంపిక చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశాలు జారీచేశారు. వేగంగా మరమ్మతు.. జూరాల ఎగువ భాగాన బ్రిడ్జి కం బరాజ్ నిర్మాణంతోపాటు ప్రాజెక్టు గేట్లు, రోప్ల మరమ్మతుకు సంబంధించి విడుదల చేసిన నిధులతో యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి పూర్తిచేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా అధికారులు జూరాల ప్రాజెక్టుకు మరమ్మతు ప్రక్రియను వేగవంతంగా చేపట్టేలా చర్యలకు ఉపక్రమించారు. స్థలం గుర్తించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశాలు ఇరిగేషన్ శాఖకు నిర్మాణ పనుల అప్పగింత? తక్షణమే జూరాల గేట్లకు మరమ్మతు చేపట్టాలని సూచన స్థలం ఎంపిక, నది మధ్య నుంచి బ్రిడ్జి నిర్మాణంపై అధికారుల కసరత్తు -
గంపకు రూ.50 వసూలు..
వారాంతపు సంతలో గంపకు రూ.50 తీసుకుంటున్నారు. గంటల తరబడి ఎండలో కూర్చొని కూరగాయలు విక్రయిస్తున్నాం. తాగునీరు, నీడ సౌకర్యం లేక పోవడంతో ఎండకు తట్టుకోలేక డబ్బులు పెట్టి నీళ్లు కొని తాగుతున్నాం. కొనుగోలుదారులు కూడా మాలాగే ఇబ్బందులు పడుతున్నారు. సంతలో కనీస మౌలిక సదుపాయలు కల్పించాలి. – శంకరమ్మ, చిరు వ్యాపారి, తీలేరు తాగునీటి వసతి లేదు.. ఎన్నో ఏళ్లుగా వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ సంతలో కూరగాయలు విక్రయిస్తున్నా. వేసవిలోనైనా తాగునీటితో పాటు నీడ సౌకర్యం కల్పించాలని కార్యదర్శి విన్నవించినా పట్టించుకోవడం లేదు. చేసేది లేక ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడుగు పట్టుకొని వ్యాపారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. – రాములు, కూరగాయల వ్యాపారి, మరికల్ కనీస సౌకర్యాలు కల్పిస్తాం.. వారాంతపు సంతల్లో తాగునీటితో పాటు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించేందుకు కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేస్తాం. నీడ కోసం టెంట్లు వేసే నిబంధన తైబజార్ వేలంలో లేదు. కనీస వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటాం. – సుధాకర్రెడ్డి, డీఎల్పీఓ, నారాయణపేట ● -
ఎల్లూరు పంపుహౌజ్లో..
కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు సమీపంలో కేఎల్ఐ ప్రాజెక్టు నిర్మించారు. ఇక్కడి నుంచే సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ ద్వారా తరలిస్తారు. ఎల్లూరు పంప్హౌజ్లో ఐదు మోటార్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఒక మోటారు 5 ఏళ్ల క్రితం, మరో మోటారు రెండేళ్ల క్రితం దెబ్బతింది. నాటినుంచి మిగిలిన మూడు మోటార్లతోనే ఎత్తిపోతలు చేపడుతున్నారు. ఒక్కో పంపు ద్వారా రోజూ 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో వాటిపై భారం పడుతోంది. -
సమస్యల సంత..!
మరికల్: గ్రామపంచాయతీలకు ఆదాయం సమకూరేందుకు తైబజారు పేరిట ప్రభుత్వం ఏటా బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. కానీ వారాంతపు సంతలు, పశువుల మార్కెట్లో కనీసం మౌలిక వసతుల కల్పనలో పంచాయతీ పాలకవర్గాలు అశ్రద్ధ చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంతలకు ఆదరణ లేదంటూ వేలంపాట దారులు కుమ్మకై ్క తక్కువ పాట పాడుతూ సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నారు. మరోపక్క మేజర్ గ్రామపంచాయతీల్లో కార్యదర్శులు తైబజార్ డబ్బుల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నారు. వారాంతపు సంతలు.. జిల్లాలోని 13 మండలాలు ఉండగా మండల కేంద్రాలతో పాటు మేజర్ గ్రామాల్లో వారాంతపు సంతలు నిర్వహిస్తారు. నారాయణపేట, మక్తల్, మరికల్, కోస్గిలో జరిగే సంతలకు వ్యాపారులు, కొనుగోలుదారులు భారీగా తరలివస్తుంటారు. అందుకు అనుగుణంగానే ఏటా తైబజార్ వేలం నిర్వహిస్తారు. గతేడాది మరికల్ తైబజార్ వేలం జిల్లాలోనే అత్యధికంగా రూ.13 లక్షలు పలికింది. ఈ ఏడాది పాటదారులు కుమ్మకై ్క రూ.8 లక్షలకు దక్కించుకున్నారు. ఈ డబ్బులను సంతలో వసతుల కల్పనకు వెచ్చించాల్సి ఉండగా ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో పక్కదారి పడుతున్నట్లు వ్యాపారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాలు కరువు.. అధికారులు తైబజార్ వేలం నిర్వహణకు చూపుతున్న శ్రద్ధ వసతుల కల్పనపై చూపడం లేదు. సంతలకు వచ్చే చిరువ్యాపారులు, కొనుగోలుదారులకు కనీస సౌకర్యాలైన తాగునీరు, నీడ, మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు. సంతలో కూరగాయలు విక్రయించేందుకు అత్యధికంగా మహిళ ఉంటారు. వీరు ఉదయం వచ్చి రాత్రి వరకు అక్కడే ఉండాల్సి వస్తుంది. కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మరికల్లో వారాంతపు సంత నిర్వహణకు ప్రత్యేక స్థలం లేదు. గతంలో పాత బస్టాండ్ దగ్గర నిర్వహించారు. అక్కడ స్థలం తక్కువగా ఉండటంతో వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతుండగా.. అక్కడి నుంచి జాతీయ రహదారి, మాధవరం రోడ్డుకు మార్చారు. అక్కడ కూడా వాహనాల రాకపోకలతో ఇబ్బందులు కలుగుతుండటంతో బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలోకి మార్చారు. ఈ స్థలంలోనే కూరగాయల మార్కెట్ నిర్మించేందుకు గత ప్రభుత్వ హయంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి భూమి పూజ కూడా చేసినా.. కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. అలాగే ధన్వాడ, దామరగిద్ద, మక్తల్, ఊట్కూర్, కృష్ణా, మాగనూర్, కోస్గి, మద్దూరులో కూడా వారాంతపు సంతలు రోడ్లకు ఇరువైపునే కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా పంచాయతీ కార్యదర్శులు మౌలిక వసతులు కల్పించకపోవడంతో అటూ వ్యాపారులు, ఇటూ కొనుగోలుదారులు ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. కనీస సౌకర్యాల కల్పనలోఅధికారులు విఫలం ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారులు, కొనుగోలుదారులు తైబజార్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ వసతుల కల్పనపై లేదని ఆరోపణ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి -
కాంగ్రెస్లో కోల్డ్వార్!
ముఖ్య నేత వర్సెస్ డీసీసీ వర్గాలు ● కార్పొరేషన్ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయిలో చీలిక ● కాంగ్రెస్ కార్యాలయం మెట్లెక్కని పలువురు నాయకులు ● హైకమాండ్కు పోటాపోటీగా పరస్పర ఫిర్యాదులు ● నేడు టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ రాక ● ఇరువురు నేతలు, వారి వర్గాల మధ్య సయోధ్య కుదిరేనా? ● ‘హస్తం’ శ్రేణుల్లో జోరుగా చర్చ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఒకరేమో జిల్లాస్థాయిలో పార్టీ పరమైన కార్యకలాపాలను పర్యవేక్షించే నేత. మరొకరేమో అదే పార్టీకి చెందిన నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు సర్కారు పథకాలను ప్రజలకు చేరవేయడం, పాలనాపరమైన వ్యవహారాలను చక్కబెట్టే హోదాలో ఉన్న ప్రజాప్రతినిధి. ఇరువురు అధికార కాంగ్రెస్కు చెందిన వారే. అటు పార్టీ, ఇటు ప్రభుత్వ పరంగా ఆ ఇద్దరు కీలకం. కానీ వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు రచ్చకెక్కగా.. నిన్నమొన్నటి వరకు ఇరువర్గాల మధ్య మాటల తూటాలు మంటలు రేపాయి. ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నప్పటికీ.. ఇరు నేతల మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. వర్గాల వారీగా నాయకులు చీలిపోవడంతో పార్టీ కార్యకర్తలు ఎటుపోవాలో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ మంగళవారం తొలిసారిగా మహబూబ్నగర్కు రానుండగా.. ఆయన పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్రమక్రమంగా ఆధిపత్య పోరు.. రాష్ట్రంలో 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులను ప్రకటించిన విషయం తెలిసిందే. మహబూబ్నగర్ జిల్లా అధ్యక్ష పదవిపై పలువురు నేతలు ఆశలు పెట్టుకోగా.. అధిష్టానం సీనియర్ నేత, ముదిరాజ్ వర్గానికి చెందిన సంజీవ్ ముదిరాజ్కు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో పార్టీ ముఖ్యనేతలు పలువురు భిన్నస్వరాలు విన్పించగా.. ఇవే విభేదాలకు ఆజ్యం పోసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత క్రమక్రమంగా ఇరువర్గాల నేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. కార్పొరేషన్ ఎన్నికల్లో బట్టబయలు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన కార్పొరేష న్ ఎన్నికల సమయంలో పార్టీ ముఖ్య నేతలు, వారి అనుచరుల మధ్య అంతర్గ త విభేదాలు రచ్చకెక్కాయి. డివిజన్లలో కా ర్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలు టికెట్ల కేటాయింపు వరకు వర్గాల వారీగా నేతలు తమతమ అ నుచరుల కోసం పోటాపో టీ రాజకీయాలకు తెరలేపారు. ప్రచారపర్వంలో సైతం ఆయా వర్గాల నేతలు వేర్వేరుగానే పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్పొరేషన్ పీఠాన్ని కై వసం చేసుకోగా.. ఆ తర్వాత చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలు ఉత్కంఠ రేపాయి. తొలి నుంచి మేయర్ రేసుల్లో ఉన్న ప్రసన్న ఆనంద్ గౌడ్ను కాదని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన గుమాల మమత శ్రీనివాస్ పేరు తెరపైకి తేవడం పార్టీలో అలజడి సృష్టించింది. చివరకు ఆమెనే మేయర్గా, డిప్యూటీ మేయర్గా మారేపల్లి సురేందర్రెడ్డి ఎన్నిక కావడంతో పార్టీలో ఇరువర్గాల నేతల మధ్యదూరం మరింత పెరిగినట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పోటాపోటీగా ఫిర్యాదులు.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఇరువర్గాల నేతలు ఒకరిపై ఒకరు పార్టీ అధిష్టానానికి పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నారు. దీనిపై పలువురు నేతలు బహిరంగంగానే వెల్లడించారు. ఎన్నికల్లో కొందరు అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నించారని.. పలువురి ఓటమికి వారే కారణమని.. వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యనేత వర్గీయులు పార్టీ పెద్దలను కలిసినట్లు సమాచారం. పార్టీని దెబ్బతీసేలా కొందరు యత్నించారని.. ప్రజల్లో బలం లేదని తెలిసినా వారినే నిలబెట్టి వారి ఓటమికి వారే కారకులయ్యారని...అధిష్టానం సూచించిన వారికి పదవులు ఇవ్వకుండా.. ఆధిపత్య ధోరణితో వ్యక్తిగత ఎజెండాను అమలు చేశారని ఎదుటి వర్గం నేతలు పీసీసీ పెద్దలకు నివేదిక అందజేసినట్లు తెలిసింది. -
‘ఫీజు రీయింబర్స్మెంట్’ రద్దుకు ప్రభుత్వం కుట్ర
మెట్టుగడ్డ: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసేందుకే కుట్రలు చేస్తోందని బీసీ జాగృతిసేన రాష్ట్ర అధ్యక్షుడు బి.కృష్ణయాదవ్ ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలను సకాలంలో విడుదల చేయకపోవడంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై భారం మోపాలనే ఆలోచనకు రావడం దుర్మార్గమైన చర్యన్నారు. మరోవైపు చాలా ప్రైవేటు కళాశాలలను మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నాయని.. అదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్య అభ్యసిస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకుల పేద విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని నిలిపివేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని.. లేనిచో బీసీ జాగృతిసేన ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. తక్షణమే ఫీజు బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో నరేందర్, కేశవులు, శివకుమార్, భాస్కర్, నవీన్, వీరేశ్ ఉన్నారు. -
ఉపాధి పనులను పరిశీలించిన రాష్ట్ర బృందం
ధన్వాడ: మండలంలోని మందిపల్లిలో కొనసాగుతున్న వీబీజీ రాంజీ ఉపాధి పనులను సోమవారం రాష్ట్ర బృందం పరిశీలించింది. ప్రోగ్రాం అధికారి మురళి ఎన్ఎంఎంఎస్లోని ఇబ్బందులను స్వయంగా తెలుసుకొని మస్టర్ డౌన్లోడ్, పని ప్రదేశంలో కూలీల హాజరు, ఫొటో అప్లోడ్ను స్వయంగా చేశారు. అనంతరం కూలీలతో మాట్లాడి హాజరు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కంసాన్పల్లిలో కొనసాగుతున్న సీసీ రహదారి నిర్మాణాన్ని పరిశీలించారు. వారి వెంట డీఆర్డీఓ మొగులప్ప, ఎంపీఓ వెంకటేశ్వర్రెడ్డి, సర్పంచ్ సురేందర్రెడ్డి, ఏపీఓ సిద్ధేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరు కోర్టులో చలివేంద్రం ప్రారంభం
పాలమూరు: వేసవి కాలం నేపథ్యంలో జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ కోర్టుకు వచ్చే ప్రజలు, సిబ్బంది ప్రతి ఒక్కరూ చలివేంద్రం సేవలు వినియోగించుకోవాలన్నారు. తాగునీరు సకాలంలో అందుబాటులో ఉంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నీరు ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు కల్యాణ చక్రవర్తి, ఇందిర, శారదాదేవి, శ్రీదేవి, రాధిక, రాజా రాజేశ్వరి, మమతారెడ్డి, రవిశంకర్, మునవార్ హుస్సేన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్రావు పాల్గొన్నారు. ●జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర సోమవారం కేజీబీవీలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోక్సో చట్టం, బాలల హక్కులతో పాటు బాల్య వివాహాలుపై అవగాహన కల్పించారు. అనంతరం శిశు గృహను సందర్శించి వేసవి నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. చిన్నారుల కోసం ఎలాంటి సౌకర్యాలు కల్పించారు అనే అంశంపై పరిశీలించారు. -
ఉత్సాహంగా ‘అథ్లెటిక్స్’ ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: హనుమకొండలో ఈనెల11, 12 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి ఫెడరేషన్ కప్అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను సోమవారం స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. ఎంపికలను జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా అథ్లెట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికల్లో దాదాపు 50 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. 20 ఏళ్లలోపు బాలబాలికలు, పురుషులు, మహిళలకు ఆయా అథ్లెటిక్స్ అంశాల్లో ఎంపికలు నిర్వహించినట్లు చెప్పారు. ఎంపికై న తుది జట్టును త్వరలో ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో కోచ్లు ఆనంద్కుమార్, సునీల్కుమార్, శ్రీనివాస్, పీడీలు రాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
పాత నేరస్తుడే హంతకుడు..!
నారాయణపేట రూరల్: ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి, హతమార్చిన కామాంధుడు కటకటాలపాలయ్యాడు. వారం రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన బాలిక కేసును పోలీసులు చేధించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ డా.వినీత్ వెల్లడించారు. నారాయణపేట మండలంలోని బసిరెడ్డిపల్లికి చెందిన శిరీష, ఆంజనేయులు దంపతులు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్లో ఉంటుండగా.. వారి కుమార్తె తేజశ్రీ (5) గ్రామంలోనే నాయనమ్మ, తాతతో కలిసి నివాసం ఉంటుంది. గతనెల 31న రాత్రి భోజనం అనంతరం చిన్నారితో కలిసి అవ్వ, తాత ఆరుబయట నిద్రించగా.. అదే గ్రామానికి చెందిన బక్క చిన్న నర్సింహులు మద్యం తాగి అటువైపు వచ్చాడు. నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం గొంతు నులిమి హతమార్చి, సమీపంలోని చెరువు కట్టపై పాడేశాడు. ఈ క్రమంలో కాళ్లకు ఉన్న పట్టీలను తీసుకుని.. ఇది దొంగల పనిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అదే రోజు రాత్రి పొలం పనులు పూర్తిచేసుకుని అటుగా వస్తున్న రైతులు చంద్రప్ప, కేశవులు అచేతన స్థితిలో ఉన్న చిన్నారిని గమనించి.. గ్రామస్తులకు చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన డీఎస్పీ లింగయ్య, సీఐ శివకుమార్, ఎస్ఐ గాయత్రి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఎస్పీ వినీత్.. 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి విచారణను వేగవంతం చేశారు. చిన్నారి మృతదేహానికి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. రిపోర్టు ఆధారంగా లైంగిక దాడి జరిగినట్టు గుర్తించారు. ఈ క్రమంలో విచారణ బృందాలు పాత నేరస్తుల జాబితాను పరిశీలించి.. గ్రామానికి చెందిన బక్క చిన్న నర్సింహులును అదుపులోకి తీసుకొని విచారించారు. అతడు చేసిన తప్పును ఒప్పుకొని జరిగిందంతా పోలీసులకు వివరించారు. అతడి నుంచి కాళ్ల పట్టీలను రికవరీ చేశారు. 48 గంటల్లో నిందితుడిని పట్టుకొని రిమాండ్కు తరలించడంలో కృషిచేసిన పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు. కాగా, నిందితుడు నర్సింహులుకు రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఇద్దరు భార్యలు సైతం ఆయనతో కాపురం చేయకుండా పుట్టింటికి వెళ్లారు. అతడు 2014లో ఓ అమ్మాయిపై అత్యాచార యత్నానికి పాల్పడటంతో పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. బెయిల్పై బయటకు వచ్చిన అతడు.. మార్చి 31న అర్ధరాత్రి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఎస్పీ వివరించారు. నిందితుడిని అరెస్టు చేసి.. కోర్టులో హాజరుపర్చగా రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీలు లింగయ్య, మహేశ్, సీఐ శివకుమార్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, గాయత్రి, సతీశ్కుమార్రెడ్డి ఉన్నారు. ఐదేళ్ల చిన్నారిపై లైంగికదాడి చేసి హతమార్చిన కామాంధుడు 48 గంటల్లోనే నిందితుడినిపట్టుకున్న పోలీసులు చిన్నారి కాళ్ల పట్టీలు స్వాధీనం వివరాలు వెల్లడించిన నారాయణపేట ఎస్పీ డా.వినీత్ -
పారాక్వాట్పై నిషేధం
మహబూబ్నగర్ (వ్యవసాయం): రైతులు, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదకర రసాయన పురుగు మందుగా గుర్తించిన పారాక్వాట్, ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణ ప్రభావంతో 60 రోజుల పాటు పూర్తి నిషేధం విధించింది. అన్ని దశల్లో నిషేధం అమ్మకం, నిల్వ, పంపిణీ, తయారీ, వినియోగం వంటి అన్ని దశల్లో పారాక్వాట్పై ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ఇన్సక్టిసిడ్స్ యాక్ట్– 1968 ప్రకారం అధికారాలను వినియోగించి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.వెంకటేష్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కట్టుదిట్టంగా అమలు వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయనున్నారు. ఇన్పుట్ డీలర్లు, పురుగు మందుల దుకాణాలపై ప్రత్యే క తనిఖీలు నిర్వహించనున్నారు. ఎక్కడైనా ఉల్లంఘనలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సిబ్బందికి సూచనలు జారీ చేశారు. రైతులకు అవగాహన ప్రతి గ్రామంలో రైతులకు పారాక్వాట్ ప్రమాదాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వ్యవసాయ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. రైతులు ఈ రసాయన వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి, భద్రమైన ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాలని సూచించారు. హానికర రసాయనం పారాక్వాట్ మనుషుల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతోంది. శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల దెబ్బతినడం, లంగ్ ఫైబ్రోసిస్ వంటి ప్రమాదాలు ఉన్నట్లు వైద్య నివేదికలు సూచిస్తున్నాయి. అదే విధంగా కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు విష ప్రభావం వల్ల ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంది. పర్యావరణానికి ముప్పు పారాక్వాట్ కారణంగా పశువులు, పక్షులు విష ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉంది. నేల నాణ్యత తగ్గిపోవడం, నీటి కాలుష్యం పెరగడం, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించడం వంటి ప్రతికూల ప్రభావాలు కూడా కనిపిస్తున్నాయి. రైతుల ఆరోగ్యం, పర్యావరణ రక్షణే లక్ష్యం -
పనుల్లో జాప్యం సరికాదు : ఎమ్మెల్యే
మదనాపురం: మదనపురం–కొత్తపల్లి మధ్య ఉన్న ఊకచెట్టు వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులను ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాంట్రాక్టర్లు, ఇంజినీర్లతో నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. పనుల్లో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా సహించేది లేదని.. నిర్దేశిత గడువులోగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు విధిగా పాటించాలని, రాజీ పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల సొమ్ముతో చేపట్టే పనులు వారికి శాశ్వతంగా ఉపయోగపడాలన్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు సంబంధిత శాఖల ఇంజనీర్లు ఉన్నారు. -
అందుబాటులో ఉంటాం..
వేసవికాలం పూర్తయ్యే వరకు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది, ఇతర అధికారులు ఏ ఒక్కరూ అత్యవసరం అయితే తప్ప సెలవు తీసుకోకుండా 80 శాతం మంది సిబ్బందితో పనిచేస్తాం. ప్రతి కేంద్రానికి బోరు ఉంది. పాలమూరు నగరంలో మున్సిపల్ బావి సైతం అందుబాటులో ఉంది. జిల్లాలో నీటి వసతి బాగా ఉండటం వల్ల నీటికి ఇబ్బంది లేదు. జాతీయ రహదారి, పరిశ్రమ లు, ఇతర ప్రమాదకరమైన వాటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టడం జరుగుతుంది. ఎక్కడ ప్రమా దం జరిగినా వెంటనే చేరుకోవడానికి కృషిచే స్తాం. ప్రజలు ఎక్కడ అగ్నిప్రమాదం జరిగినా వెంటనే 101, 112కు సమాచారం ఇవ్వాలి. – కిషోర్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, మహబూబ్నగర్ ● -
‘కో–ఆప్షన్’ సందడి
దరఖాస్తుల స్వీకరణకు నేటితో ముగియనున్న గడువు నారాయణపేట: పురపాలికల్లో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికలకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒక్కో మున్సిపాలిటీలో నలుగురికి అవకాశం ఉంటుంది. నారాయణపేట, మద్దూరు పురపాలికల్లో అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించేందుకు సోమవారం సాయంత్రం గడువు ముగియనుంది. సాయంత్రం 5లోగా పుర కార్యాలయములో సమర్పించాలని మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మక్తల్లో మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో ఎన్నిక పూర్తి చేశారు. మద్దూరులో ఆరుగురు దరఖాస్తు చేసుకోగా ఇద్దరు ఉపసంహరించుకోవడంతో మిగిలిన నలుగురు ఖరారైనట్లే. పేటలో కమలం కసరత్తు.. జిల్లాలోని మూడు పురపాలికలను అధికారంలో ఉన్న కాంగ్రెస్పార్టీ కై వసం చేసుకోగా.. నారాయణపేటలో కమలం పాగ వేసింది. కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపి అవకాశం దక్కని వారికి కో–ఆప్షన్ భరోసానిచ్చి పార్టీ అభ్యర్థుల గెలుపునకు పావులు కదిపింది. ప్రస్తుతం ఆ పదవిని దక్కించుకునేందుకు ఎవరి స్థాయిలో వారు పోటీ పడుతున్నారు. మున్సిపాలిటీలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్, కో–ఆప్షన్ సభ్యులుగా అనుభవం ఉన్న వారే అర్హులనే నిబంధన ఉండటంతో ఆశావహుల సంఖ్య పెరిగిందని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో తమ స్థానాలను త్యాగం చేసిన 1వ వార్డు మాజీ కౌన్సిలర్ అనూష, 4వ వార్డు మాజీ కౌన్సిలర్ జయశ్రీ సైతం తమకు అవకాశం ఇవ్వాలంటూ పట్టుబడినట్లు తెలుస్తోంది. చైర్పర్సన్ కొండ శ్వేత సత్యయాదవ్ నాలుగో వార్డు నుంచి గెలుపొందారు. మున్సిపాలిటీలో దాదాపు అందరూ కొత్తవారే ఉండటంతో బీజేపీ తరఫున 2014లో వైస్ చైర్మన్గా పనిచేసిన నందూనామాజీకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని పార్టీ శ్రేణులు చర్చించినట్లు సమాచారం. ముస్లిం మైనార్టీ కోటాలో జమీర్ పాషా, మాజీ కో–ఆప్షన్ సభ్యుడు తాజుద్దీన్తో పాటు పలువురు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర నేతలు నాగూరావు నామాజీ, రతంగ్పాండురెడ్డి సూచనలతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్కుమార్ అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిథ్యం వహిస్తున్న మక్తల్ మున్సిపాలిటీలో కో–ఆప్షన్ ఎన్నిక పూర్తయింది. మంత్రి తనదైన శైలిలో ఎన్నిక పూర్తి చేయించడంలో సఫలీకృతులయ్యారు. కో–ఆప్షన్ సభ్యులుగా మాజీ కౌన్సిలర్లు లక్ష్మణ్, సరస్వతిబాయి, మాజీ కో–ఆప్షన్ సభ్యులు శంషోద్దీన్, హసీనాబేగం ఉన్నారు. మద్దూరు పురపాలికలో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున కృష్ణయ్య, ఖయ్యూం, రొయ్యల నర్సమ్మ, శంకర్నాయక్, రబియాబేగం దరఖాస్తు చేసుకున్నారు. కాగా కాంగ్రెస్పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి సూచన మేరకు ఆ పార్టీ ఆశావహులు సోమవారం దరఖాస్తు చేసుకోనున్నారు. మంత్రి ఇలాక మక్తల్లో పూర్తి కోస్గిలో అభ్యర్థులు ఫైనల్ నారాయణపేట, మద్దూర్లో కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ సీఎం ఇలాకాలోని కోస్గి పురపాలికలో నలుగురు కో–ఆప్షన్ సభ్యులను సోమ వారం ఎన్నుకోనున్నారు. పుర పాలకలో అనుభవం ఉన్న సభ్యుల నుంచి 4, మైనార్టీ సభ్యుల నుంచి 2 మొత్తం 6 నామి నేషన్లు వచ్చాయి. వాటిలో ఇద్దరు ఉపసంహరించుకోగా గందె ఓంప్రకాష్, వసంతమ్మ, సయ్యద్ అబ్దుల్ సలీం, అష్రఫ్ బేగం మిగిలారు. సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నిక జరపనున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
అందరికీ స్ఫూర్తి బాబు జగ్జీవన్రామ్
నారాయణపేట: దేశ మాజీ ఉప ప్రధాని, సమతా వాది బాబు జగ్జీవన్రామ్ను ప్రతి ఒక్కరూ స్ఫూ ర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కలెక్టర్ ప్రతీ క్ జైన్ కోరారు. ఆదివారం కలెక్టరేట్లోని ప్రజా వాణి సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో అర్ధ శతాబ్ధానికి అగ్రశ్రేణి నేత గా శాసన సభ్యత్వంతో మొదలు దేశ ఉప ప్రధా ని వరకు ఎన్నో పదవులు నిర్వర్తించాలని గుర్తుచేశారు. మొద టి న్యాయ, కార్మికశాఖ మంత్రిగా పనిచేసి చేసిన సంస్కరణలు అనిర్వచనీయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యతోనే తనకు కలెక్టర్గా గుర్తింపు, గౌరవం లభిస్తున్నాయని.. అనుకుంటే ఏదైనా సాధించవచ్చని, విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని సాధనకు నిరంతరం కృషి చేయా లని సూచించారు. తాను కొత్తగా వచ్చానని.. జిల్లాలోని అన్ని వసతి గృహాలను సందర్శిస్తానని చెప్పారు. వసతిగృహాల్లో ప్ర తి వారం విద్యార్థులకు సందేశాత్మక సినిమాలను చూపించాలని, మూవీ క్లబ్ను అమలు చేయాలన్నారు. అనంతరం వసతిగృహ విద్యార్థినులతో జగ్జీవన్రామ్ జీవిత చరిత్ర ఉపన్యాసం చెప్పించారు. అభినందించి రాత పుస్తకాలు, పెన్ను లు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, కలెక్టరేట్ ఏఓ శ్రీధర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్, డీపీఆర్వో రషీద్, కౌన్సిలర్లు మహేష్, రాజేష్, భరత్, ఏఎస్డబ్ల్యూఓ పరమేశ్, సింగిల్విండో డైరెక్టర్ సంక్లాపురం మల్లేష్, దళిత సంఘాల నాయకులు మొచ్చ శరణప్ప, సూర్యకాంత్, పరిగి రమేష్ ఈశ్వరమ్మ, మహదేవ్, ఎస్సీ వసతిగృహాల వార్డెన్లు, ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ -
కృష్ణా జలాలు వినియోగించుకుందాం
కృష్ణా: కృష్ణా జలాలను పంటల సాగుకు సంపూర్ణంగా వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఆదివారం రాయిచూర్లో కర్ణాటక మైనర్ ఇరిగేషన్శాఖ మంత్రి బోసురాజుతో పాటు ఆ శాఖ అధికారులతో మంత్రి చర్చలు జరిపారు. ప్రధానంగా కృష్ణానదిపై కొల్పూర్ గ్రామం వద్ద నీటిని నిల్వ చేసేందుకు చిన్నపాటి బ్యారేజీ, అదేవిధంగా కుసుమర్తి సమీపంలో బ్రిడ్జి కం బ్యారేజీ విషయమై వారితో ప్రాథమిక చర్చలు జరిపినట్లు వివరించారు. భవిష్యత్లో ఈ ప్రాజెక్టుల నుంచి తెలంగాణ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీటి అవసరాలు తీరేందుకు అవకాశం ఉంటుందని, ఇందుకుగాను తమ ప్రభు త్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రాజెక్టుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కూడా సహకరిస్తుందని అధికారులు వివరించినట్లు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్పార్టీ నాయకులు ఆనంద్గౌడ్, శివరాంరెడ్డి, నాగేందర్, శంకర్గౌడ తదితరులు పాల్గొన్నారు. -
అగ్గి.. రాజుకుంటే బుగ్గే
● 13 స్టేషన్లు.. 17 ఫైర్ ఇంజిన్లు మాత్రమే.. ● పలు ప్రాంతాల్లో 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రాలు ● ఘటనా స్థలానికి చేరుకోవడంలో ఆలస్యంతో తీవ్రనష్టం ● కొత్త కేంద్రాల ఏర్పాటుపై కొరవడిన చిత్తశుద్ధి అగ్ని ప్రమాదాలు 112 మహబూబ్నగర్ క్రైం: వేసవికాలం వచ్చేసింది.. రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న వేసవితాపం అగ్ని ప్రమాదాలకు ఆజ్యంలా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు సంభవించే అవకాశాలు రెట్టింపు అవుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల నుంచి ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలాలకు చేరుకొని ఎంతో కొంత వరకు మంటలు అదుపులోకి తెస్తున్నాయి. కానీ, కొన్ని ఫైర్స్టేషన్ల దగ్గర ఫైర్ ఇంజిన్ల పరిధి 40 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. దీనికితోడు ఉమ్మడి జిల్లాలో కొన్ని రోడ్లు సైతం అస్తవ్యస్తంగా ఉండడంతో సమయానికి ఘటనా స్థలానికి చేరుకోవడానికి కష్టంగా మారింది. జనాభా ప్రాతిపదికన చూస్తే ప్రతి 50 వేల జనాభా కోసం ప్రత్యేకంగా ఒక ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉండాలి. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 80 ఫైర్ ఇంజిన్లు ఉండాల్సి ఉండగా.. కేవలం 17 ఫైర్ ఇంజిన్లతోనే నెట్టుకొస్తున్నారు. ఫైర్ ఇంజిన్లు.. బుల్లెట్లు ఉమ్మడి జిల్లాలో 13 అగ్నిమాపక కేంద్రాలు ఉండగా.. రెండు కాంట్రాక్టు పద్ధతిలో నడుస్తున్నాయి. ఇందులో మహబూబ్నగర్, జడ్చర్ల, కొత్తకోట, నారాయణపేట, మక్తల్, గద్వాల, అలంపూర్, వనపర్తి, ఆత్మకూర్, కొత్తకోట, నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, అమ్రాబాద్లో అవుట్పోస్టు కొనసాగుతున్నాయి. ప్రతి కేంద్రానికి ఒక ఫైర్ ఇంజిన్, ఒక బుల్లెట్ ఉండగా మహబూబ్నగర్లో మాత్రం 10 వేల లీటర్లతో ఒకటి, 4,500 లీటర్లు, 2,300 లీటర్ల సామర్థ్యం కలిగిన మూడు వాహనాలు, రెండు బుల్లెట్లు ఉన్నాయి. మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఫైర్ ఇంజిన్లతోపాటు బుల్లెట్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో ఐదు, నాగర్కర్నూల్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఐదు, గద్వాల నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్క టి మాత్రమే ఉంది. అలంపూర్ నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేశారు. అయితే వేసవిలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా సంభవించే ఆస్కారం ఉన్నందున వీటి సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. సకాలంలో చేరుకుంటేనే.. వేసవిలో తరచూ ఏదో ఒకచోట అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. భానుడి భగభగకు గడ్డివాములు, అడవులు, దుకాణ సముదాయాలు, జిన్నింగ్ మిల్లులు, వాహనాలు కాలిపోతుంటాయి. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుండటంతో ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తూనే ఉంటుంది. ప్రమాదాల కారణంగా సర్వస్వం కోల్పోయిన కుటుంబాలు వీధిన పడుతుంటాయి. ఏటా ప్రమాదాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయితే మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖది కీలక పాత్ర. వీరు సకాలంలో వస్తేనే ఆస్తినష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. దూరభారంతో నష్టం.. ఉమ్మడి పాలమూరులో 64 మండలాలు ఉన్నాయి. ఇందులో కొన్ని మండలాల విస్తీర్ణం 100 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. అలాంటి చోట్ల కనీసం ఒక ఫైర్ స్టేషన్ కూడా లేదు. కొన్ని కేంద్రాలు నాలుగైదు మండలాల్లోని గ్రామాలకు సేవలందిస్తున్నాయి. ఉదాహరణకు అచ్చంపేట ఫైర్ స్టేషన్లో ఉన్న ఫైర్ ఇంజిన్ మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా మండలాల్లోని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కూడా అంతంతే. ఈ లెక్కన ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకోవడానికి కనీసం గంటన్నర సమయం పడుతుంది. ఈలోగా ప్రమాదంలో ఆస్తులన్నీ కాలి బూడిదవ్వాల్సిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొత్తగా ఫైర్ స్టేషన్లకు ప్రతిపాదనలు పంపినా ఉమ్మడి జిల్లాలో పొంచి ఉన్న ప్రమాదాలు -
గొప్ప సంఘ సంస్కర్త.. : ఎస్పీ
అణగారినవర్గాల అభ్యున్నతికి పాటుపడిన సంఘ సంస్కర్త, విద్య, వ్యవసాయం, రక్షణ, కార్మిక రంగాల్లో కీలక సేవలందించిన గొప్ప వ్యక్తి, కులరహిత సమాజం, సామాజిక సమా నత్వానికి పోరాడిన ఆదర్శ నేత దేశ మొదటి మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్రామ్ సేవలు మరువలేనివని ఎస్పీ డాక్టర్ వినీత్ కొనియాడారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన బాబు జగ్జీవన్రామ్ జయంతి వేడుకలకు ఆయన హాజరై పోలీసులతో కలిసి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆయన ఆశయాలను స్మరించుకుంటూ సమానత్వం, సోదరభావం కలిగిన సమాజ నిర్మాణానికి ప్రయత్నించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు విజయభాస్కర్, సురేష్, శివశంకర్, శిరీష, ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు పాల్గొన్నారు. -
‘108’కు కృతజ్ఞతలు..
మా పాపకు 2025, ఆగస్టు 20న తీవ్రమైన శ్వాస సమస్యతో బాధపడుతుండటంతో నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించాం. వైద్యుల సూచన మేరకు 108 వాహనంలో మహబూబ్నగర్ ఆస్పత్రికి ప్రథమ చికిత్స అందిస్తూ సకాలంలో తీసుకురావడంతో మా పాప బతికి బయటపడింది. సకాలంలో స్పందించిన 108 సిబ్బందికి, సంస్థకు కృతజ్ఞతలు. – గోవిందు, ముస్తాపేట, దామరగిద్ద 15 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా.. 15 ఏళ్లుగా 108 వాహ నం నడుపుతున్నా. ఈ ప్రాంతంలో రాత్రిళ్లు చా లా ప్రమాదాలు జరుగు తుంటాయి. నిరంత రం విధులు నిర్వర్తిస్తూ అత్యవసర సమయంలో ఎంతో మందికి సేవలంది స్తూ వారి విలువైన ప్రాణాలు కాపాడుతున్నాం. – సి.శ్రీనివాస్, పైలట్, నారాయణపేట ఎందరో ప్రాణాలు కాపాడా.. 108 వాహనంలో టెక్నీషియన్గా 15 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా. రోడ్డు ప్రమాద బాధితుల్ని సకాలంలో ఆస్పత్రులకు తరలించి వారి విలువైన ప్రాణాలు కాపాడా. క్షతగాత్రులను వాహనం వరకు మోసుకొచ్చి ప్రథమ చికిత్స అందిస్తూ దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించిన ఘటనలు చాలానే ఉన్నాయి. – పి.రాజ్కుమార్ , ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, నారాయణపేట సద్వినియోగం చేసుకోండి.. 108 నంబర్కు ఫోన్చేసిన 15 నిమిషాల్లో ఘటనా స్థలానికి వాహ నం చేరుకొని బాధితులను దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నాం.అత్యవసర పరిస్థితిలో ప్రతి ఒక్కరూ 108 వాహన సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాం. – రవి, ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ , మహబూబ్నగర్ ● -
81,546 మంది వినియోగం..
గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఉమ్మడి జిల్లాలోని 71 వాహనాల్లో 81,546 మందిని సకాలంలో ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి ప్రాణాలు కాపాడిన సిబ్బంది ప్రజల మన్ననలు పొందారు. కేసులు బాధితులు ప్రసవాలు 18,739 అత్యవసర వైద్యసేవలు 14,900 రోడ్డు ప్రమాదాలు 8,712 కడుపునొప్పి 8,445 శ్వాసకోస సమస్యలు 6,464 అంతర్గత కారణాలతో 4,740 గుండె సంబంధిత సమస్యలు 4,734 అపస్మారక స్థితి 4,103 పురుగుమందు తాగినవారు 3,515 మూర్చ వ్యాధిగ్రస్తులు 2,638 ఆత్మహత్య 1,790 వన్యప్రాణుల ప్రమాదాలు 1,527 పక్షవాతం 1,003 అగ్నిప్రమాదాలు 230 ఉమ్మడి జిల్లాలో ఇలా.. -
జిల్లాలో శిక్షణ పొందడం అదృష్టం
నారాయణపేట: జిల్లాలో శిక్షణ పొందడం అదృష్టంగా భావిస్తున్నానని శిక్షణ కలెక్టర్ ప్రణయ్కుమార్ అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శిక్షణ కలెక్టర్ వీడ్కోలు సమావేశం నిర్వహించగా.. కలెక్టర్ ప్రతీక్జైన్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఎస్డీసీ రాజేందర్గౌడ్, జిల్లా అధికారులు పాల్గొని పూలమాల, పుష్పగుచ్ఛాలు, శాలువాలతో ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శిక్షణ కాలంలో ప్రణయ్కుమార్ చూపిన నిబద్ధత, చిత్తశుద్ధిని కొనియాడారు. ముఖ్యంగా నర్వ యాస్పిరేషన్ బ్లాక్లో చేపట్టిన కార్యక్రమాలు, ఆలోచనలు, అధికారులకు చేసిన దిశా నిర్దేశం అభినందనీయమన్నారు. భవిష్యత్లో ఎక్కడ, ఏ స్థాయిలో ఉన్నా నారాయణపేటను మరవొద్దని కోరారు. అనంతరం ప్రణయ్కుమార్ మాట్లాడుతూ.. బదిలీపై వెళ్లిన కలెక్టర్ సిక్తా పట్నాయక్, ప్రస్తుత కలెక్టర్ ప్రతీక్జైన్, ఆర్డీఓ, ఇతర అన్నిశాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ శ్రీధర్, సూపరింటెండెంట్ జయసుధ, డీపీఆర్వో రషీద్, ఎస్పీకార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్, డీటీ అఖిల ప్రసన్న, నర్వ తహసీల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, మక్తల్ తహసీల్దార్ సతీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళల భద్రత.. అందరి బాధ్యత
నారాయణపేట: మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడం, తక్షణ సాయం అందించడం పోలీస్శాఖ ముఖ్య బాధ్యతని ఎస్పీ డా. వినీత్ తెలిపారు. శనివారం సఖి బృందం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి మహిళల భద్రత, అవగాహన పెంపునకు రూపొందించిన వాల్పోస్టర్ను విడుదల చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గృహహింస, వరకట్నం, పనిచేసే చోట వేధింపులు, లైంగిక దాడులు, బాలికల అక్రమ రవాణావంటి ఘటనలను అరికట్టేందుకు పోలీస్శాఖ, మహిళా సంక్షేమ విభాగం సమన్వయంతో పని చేస్తోందని పేర్కొన్నారు. అత్యవసర వైద్య సేవతో పాటు బాధితులకు కౌన్సిలింగ్, న్యాయ సాయం, తాత్కాలిక వసతి కల్పిస్తున్నట్లు చెప్పారు. అవసరమైతే సఖి సిబ్బంది బాధితుల వద్దకే చేరుకుంటారన్నారు. 24 గంటలు అందుబాటులో ఉన్న సఖి కేంద్రాన్ని ఫోన్నంబర్ 08506–295181 లేదా టోల్ఫ్రీ నంబర్ 181ను సంప్రదించాలని సూచించారు. మహిళలు, బాలికలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా హెల్ప్లైన్ 181, సఖి (వన్ స్టాప్ సెంటర్) సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ క్రాంతిరేఖ, కేస్ వర్కర్ చంద్రకళ, పారా మెడికల్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ డా. వినీత్ -
క్రీడా ప్రతిభను వెలికి తీయడమే ప్రధాన లక్ష్యం
● ఏప్రిల్ 9 నుంచి 24 వరకు ‘ప్రధాన్మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్’ ● ఎంపీ డీకే అరుణ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏప్రిల్ 9 నుంచి 24 వరకు నిర్వహించనున్న ‘ప్రధాన్మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్’ ద్వారా గ్రామీణ యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ఈ క్రీడా మహోత్సవానికి సంబంధించి శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ మండల, అసెంబ్లీ స్థాయి ఇన్చార్జులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, యువజన క్రీడాశాఖ అధికారులు, పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు తదితరులు సమన్వయంతో పనిచేసి ఈ క్రీడ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవం ఏప్రిల్ 9న నారాయణపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామస్థాయి జట్లు ఏప్రిల్ 6లోగా ఆఫ్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 9 నుంచి 15 వరకు మండల స్థాయి పోటీలు, ఏప్రిల్ 15 నుంచి 20 వరకు అసెంబ్లీ స్థాయి పోటీలు, ఏప్రిల్ 21 మరియు 22 తేదీల్లో పార్లమెంటరీ స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 23న రన్నింగ్రేస్ నిర్వహిస్తామని, ఏప్రిల్ 24న బహుమతుల ప్రదానోత్సవం, ముగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ముగింపు కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రీడా మహోత్సవంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి మండలంలో ప్రతి క్రీడకు ఒక కో–ఆర్డినేటర్ చొప్పున నలుగురిని నియమించి పోటీల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. యువత శారీరక, మానసిక అభివద్ధికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని, డ్రగ్స్ వంటి చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ క్రీడలలో పురుషులతో పాటు సీ్త్రలు, బాలికలకు కూడా ప్రాముఖ్యత ఇచ్చి వారిని పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని ఎంపీ సూచించారు. సమావేశంలో డీఈఓ ప్రవీణ్ కుమార్, డీవైఎస్ఓలు శ్రీనివాస్, వెంకటేష్, సుధీర్రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ తిరుపతిరెడ్డి, డిప్యూటీ సీఈఓ మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు. -
పంటలు పండడం లేదు..
కంపెనీల నుంచి మా పొలాల్లోకి కాలుష్యపు నీళ్లు వదులుతున్నారు. ఉన్న రెండు కుంటలూ కలుషిత నీటితో నిండి.. ఆ నీరు పంట పొలాల్లోకి చేరుతోంది. ప్రతి ఏటా తప్పనిసరిగా మారింది. ఇప్పటికే ఉన్న బోర్లన్నీ కలుషితమయ్యాయి. ఒక్క చుక్క నీరు తాగలేకపోతున్నాం. పంటలు అసలే పండడం లేదు. నష్టపరిహారం ఇప్పించాలి. – కిష్టారం మల్లేష్ గౌడ్, రైతు, రాయపల్లి చేసేది లేక వ్యవసాయం వదులుకున్నా.. మా నాయన వాళ్ల కాలంలో మేం చిన్నగా ఉన్నప్పుడు మా బావుల నీళ్లనే తాగేటోళ్లం. ఇప్పుడు బాయికాడికి వస్తే ఇంటి నుంచి ఫిల్టర్ నీటిని తెచ్చుకుని తాగాల్సిన పరిస్థితి వచ్చింది. పరిశ్రమల నుంచి వచ్చిన కలుషిత నీటిని తాగి పశువులు సచ్చిపోతున్నాయి. మా బాధలు ఎవ్వరికీ పట్టడం లేదు. చేసేది లేక వ్యవసాయం వదులుకున్నా. – పాలెం శ్రీనివాస్ రైతు మా చెరువులోకి కాల్వ తీస్తే ఊరుకోం.. మా గ్రామ శివారులో ఉన్న పరిశ్రమల కారణంగా పల్లె చెరువు కాలుష్యమైపోయింది. చెరువులో చేపలు వదిలితే చనిపోతున్నాయి. గతంలో పొల్యుషన్ బోర్డు వాళ్లు వచ్చి కళ్లారా చూశారు. ఉన్న కాలుష్యంతోనే ఇబ్బందులు పడుతుంటే పోలేపల్లి దిక్కు ఉన్న కంపెనీల నుంచి కాల్వ తీసి మా గ్రామ చెరువులోకి కలిపేందుకు చూస్తున్నారంట. దీన్ని ఎట్టిపరిస్థితిలోనూ అంగీకరించేది లేదు. అవసరమైతే ఊరోళ్లందరం కలిసి సెజ్ గేట్ ముందు ఆందోళన చేస్తాం. – దేవోళ్ల శేఖర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు, ముదిరెడ్డిపల్లి ● -
దొడ్డి కొమురయ్య పోరాటం ఆదర్శనీయం
నారాయణపేట: దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని కలెక్టరేట్ ఏఓ శ్రీధర్ బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, డీపీఆర్ఓ రషీద్ అన్నారు. దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఓ శ్రీధర్ మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అణచివేతలకు వ్యతిరేకంగా ప్రజల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడిగా ఆయన చరిత్రలో నిలిచారన్నారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్ మాట్లాడుతూ.. ప్రజల హక్కులు, సమాన త్వం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాల వార్డెన్లు రేణుక, మంజుల, జ్యోతి, అన్వేష్, ముస్తఫా, శివ పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠానోత్సవం
దామరగిద్ద: మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శిరిడి సాయిబాబ ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన విగ్రహ ప్రతిష్ఠాననోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. సాయి నామస్మరణతో గ్రామం మార్మోగింది. ఆలయ నిర్మాణ దాత వన్నాడ వెంకటప్ప విజయలక్ష్మి దంపతుల సమక్షంలో జరిగిన ఉత్సవాలకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. శుక్రవారం వేదపండితుల సమక్షంలో శిరిడి సాయిబాబ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా పూర్ణాహుతి, మహా మంగళహారతి పూజలు నిర్వహించారు. కాసా మఠం గుర్మిట్కల్ శ్రీ శాంతవీర మృగ రాజేంద్రస్వామి, మల్కేడ్ కోటేశ్వర శివాచార్య స్వాములు, అంద్రికే లింగప్పతాత, శ్రీశైలం రుద్రస్వాములు ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో పాల్గొన్నారు. మహాబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడు సీంజీవ్కుమార్, నారాయణపేటకు చెందిన బీస్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్కుమార్రెడ్డి హాజరై ఆలయ నిర్మాణ దాత వన్నాడ వెంకటప్పను శాలువాతో సత్కరించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. -
విద్యార్థి సామర్థ్యం ఎంత?
నారాయణపేట రూరల్: ప్రాథ మిక స్థాయిలో విద్యార్థుల సామర్థ్యాల పెంపు, చతుర్విధ ప్రక్రియలో రాణించడానికి మూడేళ్లు గా ప్రభుత్వం ఎఫ్ఎల్ఎన్ (తొ లిమెట్టు) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చి న్నారుల్లో తెలుగు, ఆంగ్లం భాష లో చదవడం, రాయడంతో పాటు గణితంలో కూడికలు, తీసివేతలు చేయడం ఎలా ఉందనే విధానాన్ని పరీక్షించేందుకు విద్యాశాఖ ప్రత్యేక సర్వే నిర్వహించింది. ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ (ఎఫ్ఎల్ఎస్) పేరుతో మార్చి 30, 31 తేదీల్లో చేపట్టిన సర్వే చేసేందుకు జిల్లాలో బీఈ డీ, డీఎడ్ విద్యార్థులను ఎంపిక చేశారు. 2022లో సీబీఎస్ఈ ఆధ్వర్యంలో బేస్లైన్ సర్వే పేరిట జిల్లావ్యాప్తంగా 123 పాఠశాలల్లో దీన్ని చేపట్టారు. తాజాగా ఎన్సీఈఆర్టీ పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలో 18 పాఠశాలలను ఎంపిక చేసి మరోసారి సర్వే నిర్వహించారు. ఇందుకుగాను జిల్లా స్థాయిలో డీఆర్పీలను ఎంపిక చేసి హైదరాబాద్లో శిక్షణ సైతం ఇచ్చారు. సామర్థ్యాల పెంపే లక్ష్యం.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాసన సామర్ాధ్యలు అంచనా వేసినందుకు విద్యాశాఖ సమాయత్తమైంది. ప్రతి విద్యార్థి సొంతంగా చదవడం, రాయడం, చతుర్విధ ప్రక్రియలు సాధించేలా కృత్యాధార బోధన కొనసాగేలా పలు కార్యక్రమాలు అమలు చేస్తుంది. ప్రాథమిక పాఠశాలల్లో జరుగుతున్న బోధన, చిన్నారుల చదువులు ఎలా సాగుతున్నాయో గుర్తించేందుకు మూడో తరగతి విద్యార్థులతో సర్వే చేపట్టింది. ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలలో రెండు రోజులపాటు ఈ ప్రక్రియ నిర్వహించారు. సర్వేలు తేలిన అంశాల ఆధారంగా కనీస సామర్థ్యాలు మరింత మెరుగైన బోధనా ప్రక్రియ నిర్ణయించనున్నారు. సర్వే కొనసాగింది ఇలా.. ఈ విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల్లో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ సర్వే నిర్వహించారు. విద్యార్థులు ఇందులో ప్రతిభ చాటేలా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా మాదిరి పరీక్షలు నిర్వహించింది. గత డిసెంబర్లో మొదటిసారి, జనవరిలో రెండోసారి, ఫిబ్రవరిలో మూడోసారి మాదిరి పరీక్షలు నిర్వహించారు. ఇక ఫైనల్ పరీక్షకు గాను అంత సిద్ధం చేసి జిల్లా కేంద్రం సమీపంలో గల బీఈడీ కళాశాల ఛాత్రోపాధ్యాయులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చారు. ఆయా ఛాత్రోపాధ్యాయులు సంబంధిత పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో సర్వే చేపట్టారు. బొమ్మను చూపిస్తూ మాట్లాడించడం, తెలుగు అక్షరాలు, పదాలు, వాక్యాలను గుర్తించి చదవడం, అదేవిధంగా అక్షరాలు, పదాలు రాయించడం, గణితంలో కూడిక, తీసివేత, గుణాకారం, భాగాహారం సంబంధిత సామర్థ్యాలను పరీక్షించారు. తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులలో మౌఖిక సామర్థ్యం, అక్షరాలు, పదాలు, వాక్యాలు ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం వంటి వాటిని పరిశీలించారు. ప్రతి పాఠశాలలో 8 నుంచి 10 మంది విద్యార్థులకు మాత్రమే ఈ పరీక్ష నిర్వహించారు. విద్యార్థులు చెప్పిన సమాధానాలు మొబైల్ యాప్లో నమోదు చేశారు. సర్వే వివరాలు మూడో తరగతి చిన్నారులకు ఎఫ్ఎల్ఎస్ పరీక్షల నిర్వహణ జిల్లాలో రెండు రోజులపాటు కొనసాగిన సర్వే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు ఛాత్రోపాధ్యాయులు ఆన్లైన్ పోర్టల్లో వివరాల నమోదు 18 పాఠశాలల ఎంపిక -
కేంద్రం దృష్టికి తీసుకెళ్తా..
నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో రైల్వే కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు కొత్త రైల్వే లైన్ల ఆవశ్యకత ఎంతో ఉంది. పార్లమెంట్ సమావేశాల్లో రైల్వేలైన్ల గురించి అడగగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ డోర్నకల్– గద్వాల కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తయినట్లు చెప్పారు. అలాగే జడ్చర్ల– నంద్యాల మార్గం సర్వే కూడా పూర్తయిందని, కానీ ఈ మార్గంలో ట్రాఫిక్ అంచనాలు తక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వెల్లడించారు. ఈ రెండు లైన్ల ఏర్పాటుకు కృషి చేస్తా. అలాగే హైదరాబాద్– శ్రీశైలం రైలు మార్గం ఏర్పా టు గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్తా. – మల్లు రవి, ఎంపీ, నాగర్కర్నూల్ -
‘టాస్’ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలి
నారాయణపేట రూరల్: మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు రాసుకునే విద్యార్థుల సౌకర్యార్థం టాస్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డీటీఎఫ్ జిల్లా నాయకులు కోరారు. బుధవారం డీఈఓ గోవిందరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో సుమారు 400 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని, వీరందరూ జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రానికి రావడానికి రవాణా పరంగా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. గతంలో మక్తల్లో పరీక్షా కేంద్రం ఉండేదని, రద్దు చేసిన పరీక్షా కేంద్రాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో సూర్యచంద్ర, హైమావతి, అశోక్ పాల్గొన్నారు. ‘పారాక్వాట్’ కలుపు మందుపై నిషేధం నారాయణపేట: రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన జీఓఎంఎస్ నంబర్ 24 ప్రకారం ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పారాక్వాట్ అనే కలుపు మందును రాష్ట్రంలో నిషేఽ దించినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పారాక్వాట్ అత్యంత ప్రమాదకరమైన రసాయనం అని, పొరపాటున లేదా ఉద్దేశపూర్వకంగా తాగితే ప్రాణాపాయం కలిగిస్తుందన్నారు. ఇందుకు సంబధించి ఇప్పటివరకు ఎటువంటి ప్రత్యేక వైద్యం లేదన్నారు. అదేవిధంగా దీర్ఘకాలికంగా వాడటం వలన క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలుగుతున్నట్లు శాసీ్త్రయంగా నిర్ధారించారని తెలిపారు. ఇప్పటి నుంచి పారాక్వాట్ నిల్వ చేయడం, విక్రయించడం, రవాణా చేయడం, వినియోగించడాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
జాతర ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలి
కొత్తపల్లి: నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో వెలసిన బావోజీ జాతర సందర్భంగా బందోబస్తుకు వచ్చిన పోలీసులు వేడుకలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని అదనపు ఎస్పీ రియాజుల్హక్ సూచించారు. బావాజీ జాతరకు అదనపు ఎస్పీతో పాటు, డీఎస్పీ, ఇద్దరు సీఐలు, 10 మంది ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులు మొత్తంగా 150 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జాతరలో దొంగతనాలు, ఈవ్ టీజింగ్ జరగకుండా మఫ్టీలో పోలీసులు నిరంతరం గస్తీ చేయాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 కు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో కోస్గి సీఐ సైదులు, మద్దూరు ఎస్ఐ విజయ్కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
200 కిలోమీటర్ల దూరం
కనెక్టివిటీల ప్రకారం అలైన్మెంట్ మార్చి కొత్త రైలు మార్గం రూపొందించారు. ఈ రైలు మార్గంలో తెలంగాణలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ కొత్త రైల్వేలైన్ కూసుమంచి, పాలేరు, మోతే, సూర్యాపేట, భీమవరం, నల్లగొండ, నాంపల్లి, కల్వకుర్తి, నాగర్కర్నూల్, వనపర్తి వంటి ముఖ్యమైన పట్టణాలను అనుసంధానించే అవకాశం ఉంది. రాష్ట్రంలో రైలు కనెక్టివిటీని బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ.. రైల్వే మంత్రిత్వ శాఖ 15 కొత్త రైల్వే లైన్ల కోసం ఫైనల్ లొకేషన్ సర్వేను మంజూరు చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన ఈ ముఖ్యమైన ప్రాజెక్టులలో డోర్నకల్– గద్వాల కొత్త రైల్వే లైన్ ఒకటి. ఎట్టకేలకు ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరే అవకాశం లభించింది. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఉమ్మడి పాలమూరు ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. నాలుగు దశాబ్దాలుగా నానుతూ వస్తున్న ఈ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఇప్పటి వరకు రైల్వే లైన్ కనెక్టివిటీ లేని వనపర్తి, నాగర్కర్నూల్, సూర్యాపేట జిల్లాలకు రైల్వే సౌకర్యం కలిగి.. వెనకబడిన ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. ఈ రైల్వేలైన్ ఏర్పాటుతో కాజీపేట– విజయవాడ, సికింద్రాబాద్– గుంటూరు, సికింద్రాబాద్– కర్నూలు వంటి మూడు ప్రధాన రైల్వేలైన్ మధ్య కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇప్పటికే గద్వాల– రాయచూర్, డోర్నకల్– మణుగూరు (మహబూబాబాద్) మధ్య రైల్వే లైన్స్ ఉన్నాయి. కొత్త రైలు మార్గం అందుబాటులోకి వస్తే తెలంగాణలోని తూర్పు నుంచి పడమరకు ప్రయాణం చేయవచ్చు. అదేవిధంగా బెంగళూరు నుంచి విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్కతా రైలు మార్గంలో సుమారు 200 కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే గద్వాల, డోర్నకల్ రైల్వేస్టేషన్లు జంక్షన్లు కాగా కొత్తగా నల్లగొండ రైల్వేస్టేషన్ జంక్షన్ ఏర్పడుతుంది. రైల్వేలైన్, మామిడి క్లస్టర్, జాతీయ రహదారులతో నాగర్కర్నూల్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందనుంది. జడ్చర్ల– నంద్యాల సర్వే పూర్తి జడ్చర్ల– నంద్యాల కొత్త రైల్వేలైన్ మార్గం సర్వే కూడా పూర్తయింది. నాగర్కర్నూల్, కొల్లాపూర్, సోమశిల మీదుగా నంద్యాల వరకు 182 కి.మీ., మార్గం అత్యంత కీలకమైంది. అప్పటి నాగర్కర్నూల్ ఎంపీ మల్లు అనంతరాములు దీని కోసం పట్టుబట్టి సర్వేల వరకు తీసుకొచ్చారు. రూ.340 కోట్ల అంచనాతో 2007లో ప్రతిపాదనలు తయారు చేశారు. డోర్నకల్– గద్వాల రైల్వే మార్గంతో పాటు దీని సర్వే చేసినా.. ఈ మార్గంలో ట్రాఫిక్ అంచనాలు తక్కువగా ఉన్నాయని దక్షిణమఽ ద్య రైల్వే శా ఖ భావిస్తోంది. దీంతో ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు రాకపోకలకు దగ్గర అవుతుంది. 1981లో బీజం.. మార్పులతో ఆమోదం గద్వాలగతంలో ప్రతిపాదించిన మాచర్ల– గద్వాల రైల్వేలైన్ రూట్ మ్యాప్ను మార్చారు. తాజాగా గద్వాల– డోర్నకల్ రైల్ మార్గం సర్వే పూర్తి చేసింది. ఈ రైల్వేలైన్లో 296 కిలోమీటర్లు తెలంగాణ జిల్లాలోనే ఉంది. రాయచూర్, గద్వాల– మాచర్ల (గుంటూరు జిల్లా) రైల్వే లైన్ ప్రతిపాదన నిజాం కాలం నుంచి కొనసాగుతుంది. ఇందుకోసం మూడు సార్లు సర్వే సైతం చేశారు. రాయచూరు– మాచర్ల రైలు మార్గం ఆవశ్యకతను వివరిస్తూ.. 1981లో అప్పటి ఎంపీ మల్లు అనంతరాములు కేంద్రానికి ప్రతిపాదించారు. అప్పట్లో 184.2 కి.మీ., రైల్వేలైన్ కోసం రూ.919 కోట్ల నిధులు కేటాయించారు. 2002లో రాయచూర్– గద్వాల రైలు మార్గానికి శంకుస్థాపన చేయగా చివరికి గద్వాలకే పరిమితమైంది. మరుగున పడిపోయిన రైల్వే అంశం 2007లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డీపీఆర్ను మరోసారి కేంద్రానికి పంపించారు. 2015లో కేంద్రం సర్వేకు రూ.20 కోట్లు కేటాయించింది. పీపీసీ మోడ్లో (పబ్లిక్, ప్రైవేట్ పార్టిసిపేషన్) కొత్త లైన్ను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినా.. సగం, సగం నిధులు ఖర్చు చేసే విషయం తేలకపోవడంతో రైల్వేలైన్కు అడుగులు పడలేదు. ఇప్పుడు అలైన్మెంట్ మార్చి సర్వే పూర్తికావడంతో కొత్తలైన్ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. పరిశ్రమలు, ఉపాధి మెరుగు.. దక్షిణ తెలంగాణలో ఇప్పటి వరకు రైలు సౌకర్యం లేని ప్రాంతాలకు కొత్త రైల్వేలైన్ అనుసంధానం కానుంది. ఈ లైన్ రాష్ట్రంలోని ఆయా జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్, ఢిల్లీకి అనుసంధానించబడుతుంది. అలాగే మొదటిసారి రైలు సౌకర్యం పొందడం వల్ల ఈ ప్రాంత సామాజిక– ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది. వ్యవసాయం, వ్యా పారం, విద్య, పర్యాటకం, వైద్యం వంటి వివిధ రంగాల కోసం రాష్ట్ర రాజధానికి ప్రయాణించే ప్రజలకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఈ లైన్ సిమెంట్, గ్రానైట్ పారిశ్రామిక జోన్ల గుండా వెళ్తుండటం వల్ల ఆ ఉత్పత్తులను దే శంలోని ఇతర ప్రాంతాలకు రవా ణా చేయడానికి ఊ తం లభిస్తుంది. అలాగే సింగరేణి కాలరీస్ నుంచి కర్ణాటక, మహారాష్ట్రలోని థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు రవాణా చేయడానికి ఇది తక్కువ దూరపు మార్గంగా ఉపయోగపడుతుంది. -
జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు
నారాయణపేట: శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లావ్యాప్తంగా నెల రోజుల పాటు 30 పోలీస్ యా క్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డాక్టర్ వినీత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 30 పోలీస్ యాక్ట్ ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉన్నందున జిల్లాలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నా లు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదన్నారు. పోలీస్ హెచ్చరికలను అతిక్రమిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలను, మతాల మధ్య చిచ్చు పెట్టే అంశాల ను వ్యాప్తి చేసిన వారిపై కేసులను నమోదు చేస్తామన్నారు. ఏవైనా కార్యక్రమాలు జరపాలనుకుంటే ముందస్తు దరఖాస్తు చేసుకొని, పోలీసుల నుంచి అనుమతులు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. హనుమాన్ శోభాయాత్రలకు పటిష్ట బందోబస్తు జిల్లా పరిధిలో నిర్వహించనున్న 62 హనుమాన్ శోభాయాత్రల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు. హనుమాన్ శోభాయాత్రల సందర్భంగా ప్రధాన చౌరస్తాలు, సున్నిత ప్రాంతాల్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేశామని, నిరంతర పెట్రోలింగ్ నిర్వహించేందుకు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేస్తామన్నారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, ర్యాలీల సమయంలో వీడియో రికార్డింగ్ నిర్వహించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుని అవసరమైన చోట ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. -
పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని మహబూబ్నగర్ గ్రామర్ స్కూల్లో పదో తరగతి మూల్యాంకనం ప్రారంభమైంది. బుధవారం హిందీ జవాబు పత్రాలకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియ చేపట్టారు. మొత్తం 1,100 మంది సిబ్బంది ఇందులో పాల్గొనున్నారు. డీఈఓ ప్రవీణ్కుమార్, పరీక్షల అడిషనల్ కమిషనర్ కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు సిబ్బందికి పలు సూచనలు చేశారు. మూల్యాంకన ప్రక్రియలో పాల్గొనే వారు సెల్ఫోన్లు ఉపయోగించవద్దని, వ్యాలువేషన్ కోసం డ్యూటీలు కేటాయించిన వారు తప్పకుండా విధులకు హాజరుకావాలని సూచించారు. అయితే పలు పాఠశాలలో సిబ్బందికి అనారోగ్యం, చిన్నపిల్లలు ఉన్న ఉపాధ్యాయులకు సైతం విధులు కేటాయించడంతో.. వారికి విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని పలు సంఘాల నాయకులు డీఈఓను కోరారు. అలాంటి వారికి మినహాయింపు ఇచ్చి, కొత్త వారికి విధులను కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలిపారు. -
ఉత్సాహంగా స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ప్రధాన స్టేడియంలో మంగళవారం జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ ఉత్సాహంగా జరిగాయి. విద్యార్థులకు స్పోర్ట్స్ స్కూళ్లలో 4వ తరగతిలో ప్రవేశాల కోసం జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించగా.. 31 మంది బాలురు, 15 మంది బాలికలు హాజరయ్యారు. విద్యార్థుల పేర్లు నమోదు చేయడంతోపాటు నిబంధనల మేరకు వయస్సు నిర్ధారణ ధ్రువీకరణ, ఇతర పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు శారీరక దారుఢ్య అంశాల్లో పరీక్షలు నిర్వహించారు. ఎత్తు, బరువు, ఫ్లెక్సిబిలిటీ, వర్టికల్ జంప్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, మెడిసన్ బాల్త్రో, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, 6 గీ 10 మీటర్ల షటిల్ రన్, 800 మీటర్ల రన్నింగ్ అంశాల్లో పరీక్షలు కొనసాగాయి. ఎంపికలను డీవైఎస్ఓ శ్రీనివాస్ పర్యవేక్షించారు. జిల్లాస్థాయిలో ఎంపికై న విద్యార్థుల వివరాలను త్వరలో విడుదల చేస్తామని వెల్లడించారు. జిల్లాస్థాయిలో ఎంపికై న విద్యార్థులు హైదరాబాద్లోని హకీంపేటలో వచ్చేనెల 1న జరిగే రాష్ట్రస్థాయి సెలక్షన్స్లో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్లు రాజగోపాల్, కిషోర్కుమార్, సీనియర్ అసిస్టెంట్ రవీందర్రెడ్డి, కోచ్లు సునీల్కుమార్, ఎండీ ఖలీల్, పర్వేజ్పాష, నికేష్, అంజద్ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి ‘పది’ స్పాట్ వ్యాల్యువేషన్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగా.. మరోవైపు పేపర్ల వ్యాల్యువేషన్ ప్రక్రియను చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా జిల్లాకేంద్రంలోని మహబూబ్నగర్ గ్రామర్ స్కూల్లో అధికారులు ఏర్పాటు చేయనున్నారు. జవాబు పత్రాలు 48 వేలకుపైగా ఇప్పటికే ఇక్కడికి చేరాయి. పూర్తిస్థాయిలో వ్యాల్యువేషన్, స్కానింగ్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు డీఈఓ ప్రవీణ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పేపర్ వ్యాల్యువేషన్ కోసం మొత్తం 1,100 మంది ఉపాధ్యాయులను కేటాయించామని, ఈ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఓపెన్ యూనివర్సిటీ ప్రాక్టికల్స్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ సైన్స్ సబ్జెక్టు సెమిస్టర్–1కు సంబంధించి ప్రాక్టికల్స్ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్టికెట్, ఐడీ కార్డు, ఫీజులు చెల్లించిన రశీదుతో రావాలని కోఆర్డినేటర్ సత్యనారాయణగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి సమాచారం కోసం సెల్ నం.73829 29609ను సంప్రదించాలని సూచించారు. కందూర్ హుండీ లెక్కింపు అడ్డాకుల: మండలంలోని కందూర్ రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద మంగళవారం స్వామి వారి హుండీని లెక్కించారు. స్వామివారి బ్రహోత్సవాలు, జాతర ముగిసిన నేపథ్యంలో భక్తులు సమర్పించిన కానుకలు, నగదును లెక్కించారు. ఆలయ నిర్వాహకులు, గ్రామస్తుల సమక్షంలో లెక్కింపు జరిగింది. రూ.5,17,591ల నగదు స్వామివారి హుండీ ద్వారా ఆలయానికి ఆదాయం సమకూరింది. -
మహిళల సంక్షేమానికి పెద్దపీట
● కాంగ్రెస్ పాలనలోనే గ్రామాల అభివృద్ధి ● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నిర్వహించిన కార్యక్రమానికి ఆయనతో పాటు కలెక్టర్ ప్రతీక్జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీకి రూ.10 వేల కోట్ల ఆదాయం సమకూరిందని.. కాంగ్రెస్ ప్రజాపాలనలో పునరుజ్జీవం వచ్చిందన్నారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని, రెండేళ్లలో 290 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేశారని, దీంతో రూ.10 వేల కోట్ల ఆదాయం ఆర్టీసీకి సమకూరిందని పేర్కొన్నారు. జిల్లా మహిళలు రోజు రూ.12 లక్షలు ఆదా చేసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. ఉచిత బస్పు ప్రయాణంతో మహిళలు డబ్బు ఆదా చేసుకుంటున్నారని వివరించారు. ఇంటిని నడిపే శక్తి ఉన్న మహిళలు దేనినైనా సాధించగలరని.. మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతకుముందు కలెక్టర్ మక్తల్కు మొదటిసారి వచ్చిన సందర్భంగా మంత్రి ఆయనకు మొక్క అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీను, ఫణింద్ర, పుర చైర్పర్సన్ వాకిటి మానస, డిపో మేనేజర్ లావణ్య, మార్కెట్ చైర్పర్సన్ రాధమ్మ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, బీకేఆర్ ట్రస్ట్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు రహీం పటేల్, అమరేందర్రెడ్డి, వాకిటి హన్మంతు, వైస్ చైర్మన్ గణేష్కుమార్, గోవర్ధన్, రవికుమార్, రాజేందర్, రింత్రెడ్డి పాల్గొన్నారు. నర్వ: నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇంటిని అందించి ప్రభుత్వం అండగా నిలిచిందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మండలంలోని కుమార్లింగంపల్లిలో నిర్మాణం పూర్తి అయిన ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూంలు అంటూ ఆశ పెట్టి ప్రజలను మోసం చేసిందన్నారు. అదే ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యం అందించే దిశగా సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనువాసులు, ఎంపీఓ రాఘవేందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసం చెన్నయ్యసాగర్, మండల నాయకులు పాల్గొన్నారు. -
లింగమయ్య దర్శనానికి వేళాయె
వస్తున్నాం.. వెళ్లొస్తాం ఎత్తైన కొండలు, దట్టమైన చెట్లు, రాళ్లు రప్పల మధ్య నడిచివెళ్లి.. సహజసిద్ధంగా వెలసిన జలపాతాలను దాటుకొని పున్నమి వెన్నెల్లో సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవడం ఓ మహత్తర ఘట్టం. పేద, ధనిక.. చిన్నాపెద్ద.. ముసలి ముతక.. ఇలా ఎవరైనా సరే ప్రమాదభరితమైన కొండల్లో కాలినడకన గంటల తరబడి నడిచి వెళ్లాల్సిందే. దర్శనానికి వెళ్లే ముందు ‘వస్తున్నాం.. లింగమయ్యా’ తిరిగి వచ్చేటప్పుడు ‘వెళ్తొస్తాం.. లింగమయ్యా’ అంటూ భక్తిపారవశ్యంతో కదులుతారు. సుమారు వెయ్యి అడుగుల లోయలో ప్రతిధ్వనించే లింగమయ్య నామస్మరణ.. దారి పొడవునా పడే నీటి తుంపర్లు.. వెయ్యి అడుగు లపై నుంచి జాలువారే జలపాతం.. ఇలా ఒక్కో దృశ్యం ఒక్కో అద్భతం. ఒక్కసారి ఈ యాత్ర చేస్తే జీవితాంతం గుర్తుండిపోతుంది. -
ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు
బావాజీ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ డా. వినీత్ కొత్తపల్లి: మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో బుధవారం నుంచి జరిగే బావాజీ ఉత్సవాలకు జిల్లా పోలీస్శాఖ పటిష్ట బందోబస్తు కల్పించనున్నట్లు ఎస్పీ డా. వినీత్ తెలిపారు. మంగళవారం సాయంత్రం అధికారులతో కలిసి జాతర ప్రాంగణంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేలాది మంది భక్తులు హాజరయ్యే జాతరను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం పోలీస్శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రథోత్సవం రోజున ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రథానికి నలుదిక్కులా రోప్ పార్టీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్లు, వాహనాల పార్కింగ్కు వేర్వేరు స్థలాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జాతరలో భక్తుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ, దొంతనాలు, ఈవ్టీజింగ్ వంటి ఘటనలను అరికట్టేందుకు మఫ్టీ పోలీసులను మొహరిస్తామన్నారు. మహిళలు, పిల్లల భద్రతకు ప్రత్యేక బృందాలు, అత్యవసర సమయాల్లో స్పందించేందుకు క్యూఆర్టీ టీం, జాతర ప్రాంగణంలో ప్రత్యేక పోలీస్ కంట్రోల్రూం ఏర్పాటు చేసినట్లు వివరించారు. భక్తులకు ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జాతర సమయంలో ప్రజలు పోలీసు అధికారులకు సహకరించాలని, రహదారి నియమాలు పాటించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు గుర్తిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అనంతరం ఆలయంలోని బావాజి, కాళికాదేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట కోస్గి సీఐ సైదులు, మద్దూరు ఎస్ఐ విజయ్కుమార్, ఎస్బీ ఎస్ఐ నరేష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
మహనీయుల జయంతిని ఘనంగా నిర్వహిద్దాం
● కలెక్టరేట్లో జగ్జీవన్రామ్, అంబేడ్కర్ చౌరస్తాలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ● ఏర్పాట్లకు కలెక్టర్ ఆదేశం నారాయణపేట: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బా బు జగ్జీవన్రామ్, రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అధికారికంగా బాబు జగ్జీవన్రామ్ జయంతిని 5న కలెక్టరేట్లో, 14న డా. బీఆర్ అంబేడ్కర్ జయంతిని జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్ కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గతేడాది వేడుకలను ఎలా నిర్వహించారో.. ఈసారి కూడా అలాగే కొనసాగించాలని, ఏర్పాట్లలో ఎక్కడ చిన్న పొరపాటుకు కూడా తావివ్వొద్దని సూచించారు. సమావేశంలో పాల్గొన్న పలువురు దళిత సంఘాల సభ్యులు మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలో బాబు జగ్జీవన్రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో మున్సిపల్ కౌన్సిల్లో కూడా తీర్మానం చేశారని, పట్టణంలోని ఎరగ్రుట్ట వద్ద ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. నిబంధనల మేరకు ప్రభుత్వ అనుమతితో విగ్రహం ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. ఏటా అంబేడ్కర్ జయంతి తర్వాత అంబేడ్కర్ జాతరను అట్టహాసంగా నిర్వహిస్తామని, ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందించాలని అంబేడ్కర్ జాతర కమిటీ సభ్యులు కోరారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ పరంగా జాతరకు ఎలాంటి నిధుల ప్రొవిజన్ లేదని, జయంతిని మాత్రమే అధికారికంగా నిర్వహిస్తున్నామని ఈడీ కలెక్టర్కు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫణీంద్రరెడ్డి, శ్రీను, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ఎంఏ రషీద్, కౌన్సిలర్ మహేష్, జయశ్రీ, దళిత సంఘాల సభ్యులు శరణప్ప, ఈశ్వరమ్మ, మహదేవ్ పాల్గొన్నారు. -
సలేశ్వర క్షేత్రం
కుంచోని మూలచివరి పాయింట్ కార్లు, బైక్ వాహనాల పార్కింగ్ ఆర్టీసీ బస్ పార్కింగ్ షికార్నగర్ ఆటో రూట్ మన్ననూర్టికెట్ కౌంటర్ మెయిన్ ఎంట్రెన్స్కాలినడక ఏరియా రాంపూర్పెంట పుల్లాయిపల్లికురియాల జంక్షన్ మోకాల కుర్వ -
విద్యతోనే నైపుణ్యాల ప్రదర్శన
కోస్గి రూరల్: విద్యతోనే నై పుణ్యాలను ప్రదర్శించవ చ్చని శిక్షణ కలెక్టర్ ప్రణయ్కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలో ని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ హబ్ను పరిశీలించారు. గ్రా మీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని.. వారిలో దాగి ఉన్న నైపుణ్యాలు, మెళకువలను వెలికితీసేందుకు అవసరమవుతుందన్నారు. పెండింగ్ సామగ్రిని సంబంధిత కాంట్రాక్టర్ అప్పగించాకే బిల్లులు మంజూరు చేయాలని ఆదేశించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించకపోవడంతో ఏజెన్సీని మార్చాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు. విద్యార్థులు, ఉపాధ్యాయు ల వివరణ ఆధారంగా నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని జిల్లా విద్యా ధికారి గోవిందరాజు తెలిపారు. కార్యక్రమంలో యాదయ్యశెట్టి, మండల విద్యాధికారి శంకర్నాయక్ పాల్గొన్నారు. -
సమర్థవంతంగా గ్రామసభల నిర్వహణ
● ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ● కలెక్టర్ ప్రతీక్ జైన్ నారాయణపేట: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న అన్ని గ్రామపంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో గ్రామసభల నిర్వహణపై అడిషనల్ కలెక్టర్లు శ్రీను, ఫణీంద్రరెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పురోగతి, రైతుభరోసా, రైతుబీమా, రైతు రుణమాఫీ, సాయిల్ హెల్త్కార్డ్, వ్యవసాయ తదితర పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిన వారి వివరాలను పారదర్శకంగా ప్రదర్శించాలని అధికారులకు సూచించారు. గ్రామసభల నిర్వహణకు ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసి పంచాయతీ కార్యదర్శులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. నిర్దేశించిన ప్రాంతంలో గ్రామసభ నిర్వహణతో పాటు గ్రామంలో ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిన వారి జాబితా చదివి వినిపించాలని ఆదేశించారు. వ్యవసాయ, విద్య, హౌసింగ్, ఇరిగేషన్, విద్యుత్శాఖ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. గ్రామసభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా టెంట్లు, కుర్చీలు, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ప్రత్యేకంగా దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారి నుంచి వినతులు స్వీకరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా మాదక ద్రవ్యాల నిషేధం
నారాయణపేట: జిల్లాలో మాదక ద్రవ్యాల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో మాదక ద్రవ్యాల నిషేధం (యాంటీ నార్కోటిక్)పై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గంజాయి సాగు చేయకుండా వ్యవసాయశాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు వైద్య, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని, ఆయా కమిటీల నేతృత్వంలో మాదక ద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. నెలవారీ సమావేశంలో చర్చించిన అంశాలు.. తీసుకున్న చర్యల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీసు, ఎకై ్సజ్శాఖ అధికారులు డ్రగ్స్ నియంత్రణకు సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ రామచందర్నాయక్, జిల్లా రవాణా అధికారి మేఘాగాంధీ, డీఐఈఓ సుదర్శన్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ జయసుధ, ఎస్ఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను 30 ఎన్ఆర్పిటి 102 ః మాట్లాడుతున్న రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీను -
మహిళల అక్షరాస్యత పెరగాలి
మరికల్: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో అక్షరాస్యత శాతం పెంచేందుకు ప్రభుత్వం ఉల్లాస్ నవభారత్ సాక్షరత కార్యక్రమం చేపట్టిందని జిల్లా విద్యాధికారి గోవిందరాజు అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దచింతకుంట, మాధవరం గ్రామాల్లో ఉల్లాస్ నవభారత్ సాక్షరత ద్వారా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్కు వస్తున్న మహిళలకు పరీక్షలు నిర్వహించారు. డీఈఓ గోవిందరాజుతో పాటు డీపీఎం గోవింద్, ఏపీవో అనిల్ పరీక్షలను పర్యవేక్షించారు. గ్రామీణ మహిళలు అభివృద్ధి చెందాలంటే చదువు నేర్చుకోవడం ఎంతో అవసరమన్నారు. అధికసంఖ్యలో మహిళలు అక్షరాస్యత సాధించాలని కోరారు.ఏపీఎం చెన్నప్ప, హన్మంతు, వీఓఏలు పాల్గొన్నారు. -
కార్పొరేట్ విద్యాసంస్థలను రద్దు చేయాలి
నారాయణపేట రూరల్: కార్పొరేట్ విద్యాసంస్థలను రద్దు చేయాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర బాధ్యుడు ఎంఎన్ కిష్టప్ప, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి కోరారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని భగత్సింగ్ భవన్లో విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి రెడ్డప్ప అధ్యక్షతన జరగగా.. వారు ముఖ్యవక్తలుగా హాజరై మాట్లాడారు. అందరికీ సమానమైన, నాణ్యమైన విద్య కామన్ స్కూల్ విధానంలోనే అందించడం సాధ్యమవుతుందని.. ప్రభుత్వమే బాధ్యతగా ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని కోరారు. ప్రభుత్వాలు మారినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులు వారి గుర్తింపునకు ప్రయత్నిస్తున్నారే తప్ప ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి చొరవ చూపడం లేదని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకుల పాఠశాలలకు ప్రాధాన్యతనిస్తే.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పేరుతో రూ.వేల కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు. గుప్పెడు విద్యార్థులు చదివే పాఠశాలలకు అధిక నిధులు వెచ్చిస్తున్నారు గానీ లక్షలాదిమంది విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రతి బడ్జెట్లో విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించకుండా హేతుబద్దీకరణ పేరుతో యథేచ్ఛగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారని మండిపడ్డారు. పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయకుండా, సరిపడా టీచర్లను నియమించకుండా ఉపాధ్యాయులు పనిచేయడం లేదని నింద వేయడానికి యత్నిస్తున్నారే తప్ప ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు, విద్యా ప్రమాణాలు వేగంగా పడిపోవడానికి కారణాలను అధ్యయనం చేయడం లేదన్నారు. విద్యా ప్రమాణాల్లో అట్టడుగు స్థానంలో ఉన్న తెలంగాణను మెరుగైన స్థానంలో నిలబెట్టడానికి తక్షణమే విద్యారంగానికి కేటాయింపులు పెంచి పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దశల వారీగా కార్పొరేట్ విద్యా వ్యవస్థను రద్దుచేసి ప్రభుత్వ రంగంలోనే విద్యను కొనసాగించాలని.. అప్పుడే నాణ్యమైన విద్య, ఆరోగ్యకరమైన పోటీ అలవడుతుందని వివరించారు. జిల్లా కార్యవర్గం.. విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా టీపీటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి రెడ్డప్ప, ప్రధానకార్యదర్శిగా డీటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శిగా సూర్యచంద్ర, ఉపాధ్యక్షులుగా రామకృష్ణ, ధర్మరాజు, సుదర్శన్, ప్రతాప్, సిద్దు, కార్యదర్శులుగా దశరథ్, భరత్కుమార్, చెన్నయ్య, శేఖర్, సాయికుమార్, వెంకటే ష్, కార్యవర్గసభ్యులుగా దేవేందర్, వెంకటప్ప, హై మావతి, గజలప్ప, ఉదయ్కుమార్, రాము, వాల్యానాయక్, పృథ్వి, అసోసియేట్ అధ్యక్షులుగా వెంకట్రాములు, అసోసియేటర్ ప్రధానకార్యదర్శిగా సూర్యప్రకాష్ ఎన్నికయ్యారు. -
నారాయణపేట
ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు● కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026కొత్తపల్లి: మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో ఏప్రిల్ 1 నుంచి 4వ తేదీ వరకు జరిగే గురు లోకమాసంద్ బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. శనివారం గ్రామంలోని ఆలయ ప్రాంగణంలో సంబంధిత శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులతో కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీంద్రారెడ్డి, కడా ప్రత్యేక అదికారి వెంకట్రెడ్డి సమీక్ష నిర్వహించారు. అంతకుముందు అధికారులు ప్రధాన ఆలయంతో పాటు కాళికామాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి జాతర వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఆర్డీఓ రాంచందర్ నాయక్ను ప్రత్యేక అధికారిగా నియమించామని, సంబంధిత అధికారులు తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. జియో, ఎయిర్టెల్ ఏజెన్సీలతో మాట్లాడి సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని ఆర్డీఓకు సూచించారు. వైద్యసిబ్బంది మందులు నిల్వ చేసుకునేందుకు గదిని కేటాయించాలని దేవాదాయశాఖ అధికారిని ఆదేశించారు. అలాగే పాము కాటు మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. జాతరకు వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్కు తగిన స్థలం సమకూర్చాలని, చోరీలు జరగకుండా పోలీసులు నిరంతర నిఘా ఉంచాలన్నారు. భక్తుల సౌకర్యార్థం కోస్గి, నారాయణపేట ఆర్టీసి డిపోల నుంచి 8 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని.. రెండు పార్కింగ్ స్థలాలను కేటాయించినట్లు ఆర్టీసి డిపో మేనేజర్ లావణ్య కలెక్టర్కు వివరించారు. బస్ పార్కింగ్ స్థలాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని డీఎం కోరగా మొబైల్ టాయిలెట్స్ సమకూరుస్తామని డీపీఓ సుధాకర్రెడ్డి తెలిపారు. జాతరలో దొంగతనాలు, ఈవ్టీజింగ్ జరగకుండా మఫ్టీ పోలీసులతో నిఘా ఏర్పాటు చేస్తామని, 200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తామని సీఐ సైదులు చెప్పారు. సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావున ఎవరుపడితే వారిని అనుమతించొద్దని, ప్రొటోకాల్ విధిగా పాటించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దుకాణాలను దూరంగా ఏర్పాటు చేయించాలన్నారు. సమావేశంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మదనేశ్వర్రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ రంగాారావు, విద్యుత్శాఖ ఎస్ఈ నవీన్కుమార్, డీఆర్డీఓ మొగులప్ప, పీఆర్ ఈఈ అశోక్, తహసీల్దార్ జయరాములు, ఎంపీడీఓ కృష్ణారావు, ఎంపీఓ రామన్న, సర్పంచ్ జ్ఞానేశ్వర్రెడ్డి, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు రమేశ్రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధి
● మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ మరికల్: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం మండలంలోని వెంకటాపూర్లో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర నిధులను సక్రమంగా వినియోగించాలని సర్పంచులకు సూచించారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల గడువు ఈ నెల 31తో ముగియనుండగా.. కేంద్ర మంత్రితో మాట్లాడి పనులు పూర్తి చేయడానికి సమయం సరిపోవడం లేదని ఏప్రిల్ 10 వరకు గడువు పొడిగించినట్లు చెప్పారు. గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఉచితంగా స్థలం ఇచ్చిన మాజీ సర్పంచ్ కళావతమ్మ, ప్రస్తుత సర్పంచ్ విజయ్కుమార్రెడ్డిని ఆమె అభినందించారు. కొత్త భవనంలో సర్పంచ్ను కుర్చీలో కూర్చోబెట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్పార్టీ జిల్లా నాయకులు సూర్యమోహన్రెడ్డి, వీరన్న, కృష్ణయ్య, హరీశ్, రాజేష్, నరేష్, మురళి, కుర్మన్న, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాటర్ ప్లాంట్ ప్రారంభం.. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సూర్యచంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రాన్ని శనివారం ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామస్తులు ఏళ్ల తరబడి ఫ్లోరైడ్ నీటితో ఇబ్బందులు పడుతుండడంతో సూర్యచంద్ర ఫౌండేషన్ అధినేత సూర్యమోహన్రెడ్డి వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందయమన్నారు. ప్రజలందరూ ఈ మంచినీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయ్కుమార్రెడ్డి, వీరన్న, హరీష్ పాల్గొన్నారు. -
రామయ్యకు పట్టాభిషేకం
ఎర్రవల్లి: బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో శనివారం సీతారాముల పట్టాభిషేకం కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు ఉదయం ఆలయంలో అర్చకులు సుప్రభాతసేవ, తిరుప్పావై తోమాల, నైవేద్యం, తీర్థప్రసాదగోష్టి తదనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, కలశపూజ, అభిషేకం, వస్త్ర, ఆభరణ సమర్పన, హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం సామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమాన్ని మంగళవాయిద్యాల మధ్య కనులపండువగా చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, అర్చకులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
బీడీ కార్మికులకు కూలిరేట్లు పెంచాలి
చిన్నచింతకుంట: యాజమాన్యం ఒప్పందం ప్రకారం బీడీ కార్మికులకు కూలి పెంచాలని తెలంగాణ బీడీ సిగర్ వర్కర్స్ యూనియన్ రాష్ట ఉపాధ్యక్షులు ఎండీ మహిమూద్ డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో శనివారం బీడీ కార్మికుల విస్తృత సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్మికులతో కలిసి రెడ్డి బీడీ ఫ్యాక్టరీ యజమాని విఘ్ణువర్ధన్రెడ్డికి డిమాండ్ నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీడీ కార్మికులు చాలీచాలని కూలితో జీవనోపాధికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో ఏమీ కొనలేని పరిస్థితుల్లో కార్మికులు కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యం కూలి రేటు పెంపుపై తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. గతేడాది కూలి రేటు ఒప్పందం ఈనెల 31ముగుస్తుందన్నారు. అందుకు ఈ సంవత్సరం పెరుగుతున్న ధరలకు అణుగునంగా కూలి రేట్లు పెంచి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, నాయకులు ఆర్ఎన్ రమేష్, రాజు, బుచ్చన్నతోపాటు పలువురు ఉన్నారు. లోక్ అదాలత్లో 5,149 కేసులు పరిష్కారం నారాయపేట: జాతీయ లోక్ అదాలత్లో 5,149 కేసులు రాజీమార్గంలో పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో 5 బేంచ్లను ఏర్పాటు చేసి జిల్లా న్యాయసేవాధికాసంస్థ కార్యదర్శి, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సమక్షంలో కేసులను విచారించారు. జిల్లాలోని 14 పోలీస్స్టేషన్లతో పాటు కోస్గి, నారాయణపేట ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ల పరిధిలోని కేసులను న్యాయవాదులు సహకరించి పరిష్కారానికి కృషి చేశారు. కేసుల పరిష్కారంతో రూ.22,99,217 ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. లోక్అదాలత్లో సీనియర్ సివిల్ జడ్జి వింధ్యానాయక్, జూనియర్ సివిల్ జడ్జి సాయిమనోజ్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అవినాష్, సుష్మిత, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. -
శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శం: ఎస్పీ
నారాయణపేట: శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శమని.. సమాజంలో మంచిని స్వీకరించి చెడును వదిలేయాలని ఎస్పీ డా. వినీత్ సూచించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లాకేంద్రంలోని పళ్ల హనుమాన్ మందిర్ వద్ద విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్ సంయుక్తంగా నిర్వహించిన ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాన వీధుల మీదుగా కొనసాగిన ఊరేగింపు చివరకు సుభాష్రోడ్ వరకు కొనసాగింది. అనంతరం బ్రాహ్మణ్వాడి రామాలయంలో సామూహిక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యాయాదవ్, విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి కన్న శివకుమార్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు.. మండలంలోని అప్పిరెడ్డిపల్లి రాందేవునిగుట్టపై నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఎస్పీ డా. వినీత్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ధార్మిక విలువలు పెంపొందాలని ఆకాంక్షించారు. ఎస్పీ దంపతులను మార్కెట్ మాజీ చైర్మన్, మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. -
మన్సూర్పల్లిలో మళ్లీ కనిపించిన చిరుతలు మెడికల్ షాపుల్లో నకిలీ డ్రగ్స్ కట్టడికిబల్క్ ఎస్ఎంఎస్ విధానం
రాష్ట్ర రవాణాశాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే నారాయణపేట: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను శుక్రవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి కలిశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. ఇందుకు మంత్రి సానూకూలంగా స్పందించినట్లు తెలియజేశారు. సమగ్ర అభివృద్ధికి కదలిరావాలి నారాయణపేట: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఆవిర్భాస్తున్న నూతన పార్టీలో చేరి సమగ్ర అభివృద్ధికి కదలిరావాలని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు గౌవినోళ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. కొత్త రాజకీయ పార్టీ బలోపేతానికి జిల్లాలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని.. యువత, రైతులు, తెలంగాణ ఉద్యమకారులు, మహిళలు, నిరుద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అన్నివర్గాల ప్రజలను హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. త్వరలో అన్ని గ్రామాలు, మండల కేంద్రాలు, పురపాలికల్లో సమావేశాలు నిర్వహించి కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు కంకణబద్దులు కావాలని కోరారు. – వివరాలు 8లో.. -
ఉత్సాహంగా సందెరాళ్ల పోటీలు
గట్టు: శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని గండి ఆంజనేయస్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సాహంగా సందెరాళ్ల పోటీలు నిర్వహించారు. పోటీల్లో బండమీది అంజి 100 కేజీ చేతి రాయిని ఎత్తి మొదటి బహుమతి రూ.4,016, ద్వితీయ బహుమతిని గువ్వల పరశురాముడు 95 కేజీల రాయి ఎత్తి రూ.3,016, తృతీయ బహుమతి తెలుగు నల్లారెడ్డి 90 కేజీల రాయి ఎత్తి రూ.2,016, నాల్గవ బహుమతి చాకలి నాగరాజు 88 కేజీల రాయి ఎత్తి రూ.1,016లను దక్కించుకున్నారు. విజేతలకు గండి ఆంజనేయస్వామి ఆలయ కమిటి సభ్యులు బహుమతులను అందజేశారు. మూడుబండ్ల గిరక పోటీలు మూడు బండ్ల గిరక పోటీలను సంతబజారు వేదికగా నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. మొదటి బహుమతి రూ.10,016 గట్టు తెలుగు ఆంజనేయులు ఎద్దులు 257 ఫీట్ల దూరం లాగి దక్కించుకున్నాయి. ద్వితీయ బహుమతి రూ.8,016లను సల్కాపురం మారెప్పకు చెందిన ఎద్దులు 244 ఫీట్ల దూరం గిరకను లాగి దక్కించుకున్నాయి. అంతపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఎడ్లబండి గిరక పోటీలను మాజీ ఎంపీపీ విజయ్కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచు శంకరమ్మ, ఉపసర్పంచ్ హనుమంతు, దానయ్య తదితరులు పాల్గొన్నారు. గట్టులో నిర్వహిస్తున్న సందేరాళ్ల పోటీలు గట్టులో ఉత్సాహంగా మూడు బండ్ల గిరక పోటీలు -
సంత.. తీరని చింత
● ఏళ్లుగా నలుగుతున్న పెబ్బేరు సంత వివాదం ● రూ.కోట్ల ఆదాయం కోల్పోతున్న మున్సిపాలిటీ ● మీడియా వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు ● అయోమయంలో ప్రజానికం జాతీయ రహదారి 44పై పెబ్బేరు సంతను నిర్వహిస్తుండటంతో ఇక్కడి సంతకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి సైతం పశువుల విక్రయదారులు ఇక్కడికి వస్తుంటారు. కూరగాయల నుంచి గృహ నిర్మాణం, వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల పనిముట్లు ఇక్కడ సంత రోజుల్లో విక్రయానికి సిద్ధంగా ఉంటాయి. పెద్ద ఎత్తున పశువులు, గొర్రెలు, మేకల విక్రయాలు జరుగుతాయి. ప్రతి అమ్మకం, కొనుగోలుపై వచ్చే ఆదాయం పెబ్బేరు మున్సిపాలిటీకి చేరాల్సి ఉండగా.. గత కొన్నేళ్లుగా సంత అనధికారికంగా నిర్వహిస్తుండతో ఆదాయం ఎవరి చేతికి వెళ్తుందనే అంశాన్ని పాలకులు, నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణవాసులు మండిపడుతున్నారు. ఈ విషయంపై మున్సిపల్ చైర్మన్ను ఎప్పుడు, ఎవ్వరు ప్రశ్నించిన త్వరలో శాశ్వత పరిష్కారం చూపిస్తామనే మాటచెప్పటం పరిపాటిగా మారింది. ఆ దిశగా నూతన మున్సిపల్ పాలకవర్గం ఇప్పటి వరకు ఎలాంచి చర్యలు చేపట్టకపోవటం గమనార్హం. వనపర్తి: దక్షిణ తెలంగాణలోనే అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే పెబ్బేరు సంత అంశం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సమయంలో ప్రధాన పార్టీల మధ్య ప్రచార అస్త్రంగా మారింది. సంతస్థలంపై విమర్శలు, హామీలు ఎన్నికలను ప్రభావితం చేసినట్లుగా ప్రచారంలో ఉంది. ఎన్నికల ప్రక్రియ ముగిసి సుమారు రెండున్నరేళ్లు కావస్తున్నా.. ఇప్పటి వరకు సంత స్థలం వివాదాన్ని ఎందుకు పరిష్కరించలేదంటూ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అధికార పార్టీ ఎమ్మెల్యేను నిలదీస్తుండగా.. పదేళ్లు అధికారంలో ఉండి మీరేం చేశారని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి.. పెబ్బేరు సంత విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి కేబినేట్లో చర్చించి శాశ్వత పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నామంటూ ఎమ్మెల్యే మేఘారెడ్డి, కాంగ్రెస్ నాయకులు చెప్తుండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కానీ ఏళ్లు గడుస్తున్నా నేతల మధ్య విమర్శలు తప్పా పరిష్కారం వైపు కనీసం ఒక్క అడుగు పడలేదనే ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలకు ఎమ్మెల్యే ఇటీవల స్పందించారు. డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో మాజీ మంత్రిపై ఘాటు విమర్శలే చేశారు. దీనికి ఇంతవరకు మాజీ మంత్రి స్పందించకున్నా.. బీఆర్ఎస్ నాయకులు మీడియాలో మరోసారి ఆరోపణలు గుప్పించడం స్థానికులను అయోమయంలో పడేసేలా చేస్తోంది. పెబ్బేరు సంత అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం రాజకీయ ప్రాబల్యాన్ని చాటుకోవడం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటన్నారే తప్పా.. ఈ వివాదం కారణంగా సంత నిర్వహణ కోసం టెండర్ నిర్వహించకపోవడంతో ఏటా మున్సిపాలిటీకి రావాల్సిన రూ.కోట్ల ఆదాయానికి గండి పడుతుందనే విషయంపై ఎందుకు దృష్టి సారించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రూ.12 కోట్లకుపైగా ఆదాయం మున్సిపాలిటీ కోల్పోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. -
మత్స్యకారుల అభ్యున్నతే లక్ష్యం
నారాయణపేట: మత్స్యకారుల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతామని డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక సీవీఆర్ భవన్లో జరిగిన జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు కాంతుకుమార్ జన్మదిన వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు అందజేసి చేతులు దులుపుకొందని ఆరోపించారు. ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి సహకారంతో మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని రూ.4,500 కోట్లతో చేపట్టి ఈ ప్రాంతంలోని చెరువులను నింపే కార్యక్రమాన్ని చేపడుతున్నామని వివరించారు. చెరువులు నిండితే చేపల ఉత్పత్తి పెరుగుతుందని.. మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం అవుతారని చెప్పారు. ఈసారి బడ్జెట్లో మత్స్యశాఖకు భారీగా నిధులు కేటాయించారని.. వాకిటి శ్రీహరి మత్స్యశాఖకు మంత్రిగా ఉండటం అందరికీ కలిసి వస్తుందన్నారు. జిల్లా మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సొసైటీలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతుకుమార్కు సూచించారు. మార్కెట్ చైర్మన్ సదాశివారెడ్డి, మాజీ చైర్మన్ సరాఫ్ నాగరాజు, మార్కెట్ మాజీ చైర్మన్ బండి వేణుగోపాల్, కోట్ల రవీందర్రెడ్డి, సర్ఫరాజ్ అన్సారీ, న్యాయవాది సతీష్గౌడ్, మాజీ కౌన్సిలర్ మారుతి తదితరులు పాల్గొన్నారు. -
జగమంతా రామమయం
● పేటలో మార్మోగిన శ్రీరామ నామం ● కిటకిటలాడిన ఆలయాలు మక్తల్లో సీతారాముల కల్యాణోత్సవానికి హాజరైన భక్తులు కల్యాణ క్రతువు నిర్వహిస్తున్న అర్చకులు నాారాయణపేట: జిల్లాలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. పట్టణంలోని మూల హనుమాన్ ఆలయ ప్రాంగణంలో శుక్రవారం హనుమాన్ భక్తబృందం ఆధ్వర్యంలో అర్చకులు శ్రీపతిజ్యోషి రఘుప్రేమ్, రవితేజ ఆచార్య మంత్రోచ్ఛారణల నడుమ సీతారాముల కల్యాణం కనులపండుగా నిర్వహించారు. సీతారాముల కల్యాణ ఘట్టాన్ని జ్యోషి రఘుప్రేమ్ భక్తులకు వివరించారు. అంతకుముందు ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో హనుమాన్ భక్తబృందం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. రామాలయంలో డోలారోహణం.. బ్రాహ్మణవాడి రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా అర్చకులు రాఘవేంద్ర సీతారామ లక్ష్మణుల మూల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి డోలారోహణం జరిగింది. మక్తల్ రాంలీలా మైదానంలో.. మక్తల్: పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి దేవాలయం పక్కనున్న రాంలీలా మైదానంలో శుక్రవారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మంత్రి వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి దంపతులు, పుర చైర్పర్సన్ వాకిటి మానస దంపతులు, బీకేఆర్ చై ర్మన్ బాలకృష్ణారెడ్డి దంపతులు ఆలయంలో ప్రత్యే క పూజలు చేశారు. అనంతరం కల్యాణ వేదిక వద్ద కు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకొచ్చారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్రెడ్డి తరఫున మాజీ ఎంపీటీసీ మధు సూదన్రెడ్డి ముత్యాల తలబ్రాలు అందజేశారు. మధ్యాహ్నం 12.30 గంటలకు వేదపండితులు రాఘవేందర్చారి స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా జరిపించారు. సంగంబండకు చెందిన బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి అన్న ప్రసాద వితరణ చేపట్టారు. అంతకుముందు సీతారాముల విగ్రహాలను పట్టణంలో ఊరేగించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, మక్తల్ మార్కెట్ చైర్మన్ రాధమ్మ, శ్రీనివాస్గుప్తా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కొండయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ నర్సింహగౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
పాలనలో రెవెన్యూ వ్యవస్థ కీలకం
● కలెక్టర్ ప్రతీక్ జైన్ నారాయణపేట: జిల్లా పాలనలో రెవెన్యూ వ్యవస్థ అత్యంత కీలకమని.. ఆ శాఖ అధికారులు ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణికి ఎక్కువ శాతం భూ సమస్యల ఫిర్యాదులు వస్తున్నాయని.. మండలస్థాయిలోనే పరిష్కరిస్తే ఇక్కడి వరకు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. అదేవిధంగా సాదాబైనామా దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనల మేరకు పరిష్కరించాలని కోరారు. ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని.. రెవెన్యూ అదనపు కలెక్టర్ అనుమతి లేకుండా సీజ్ చేసిన ఇసుక వాహనాలను వదలొద్దని తేల్చి చెప్పారు. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని, సోలార్ పవర్ ప్లాంట్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని ఆదేశించారు. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తులకు 30 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, కుల ధ్రువీకర ణ పత్రాల జారీలో అలసత్వం సరికాదని తెలిపారు. వీటి తోపాటు లోకాయుక్త , బైండోవర్ కేసులను నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఏప్రిల్లో ఎస్ఐఆర్ ప్రారంభమవుతుందని.. అంతలోగా పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ వ్యవస్థపై ప్రజలకు పూర్తి నమ్మకం కలిగేలా విధులు నిర్వర్తించాలని కోరారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్నాయక్, కలెక్టరేట్ ఏఓ శ్రీధర్, సి–సెక్షన్ అధికారు లు జయసుధ, అఖిల ప్రసన్న పాల్గొన్నారు. -
సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిద్దాం
ఊట్కూర్: సనాతన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిద్దామని స్వామి అనంతానంద భారతి అన్నారు. బుధవారం పట్టణంలోని కళాశాల మైదానంలో హిందూ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వామీజీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హిందూ ధర్మం సనాతనమైందని.. పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎక్కడైతే సీ్త్రలు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారని.. కుటుంబ వ్యవస్థను పటిష్టపర్చాలని కోరారు. పిల్లల్లో చిన్ననాటి నుంచే సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, గురువులపై ఉందని తెలిపారు. హిందూ సమ్మేళనానికి వేలాది మంది కుటుంబాలతో హాజరుకావడం ఆనందంగా ఉందని చెప్పారు. మండలంలోని కొల్లూరు, నాగిరెడ్డిపల్లి, మల్లేపల్లి, సమస్తాపూర్, పెద్దపొర్ల తదితర గ్రామాల నుంచి ప్రత్యేక వాహనాల్లో భారీగా హిందూ బంధువులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన భరత నాట్యం, కోలాటం, డోలు వాయిద్యాలు, చెక్కభజన తదితర సంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు భాగయ్య, సౌభాగ్యలక్ష్మి, సిరిగిరి చందులాల్, కుర్మన్న, గరిడి లింగిరెడ్డి, రేణుక భరత్, శేషప్ప పాల్గొన్నారు. -
పౌరసరఫరాలశాఖ అధికారుల తనిఖీ
నారాయణపేట: పట్టణంలోని పెట్రోల్, డీజిల్ బంక్లను బుధవారం జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు తనిఖీ చేశారు. ప్రస్తుతం జిల్లాలో 44 పెట్రోల్ బంకులు ఉండగా.. 75 శాతం బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని డీఎస్ఓ బాలరాజు పేర్కొన్నారు. మిగతా 25 శాతం బంకుల యజమానులు ఆయిల్ కంపెనీలకు డీడీలు చెల్లించారని.. రాత్రిలోగా ట్యాంకర్లు బంక్లకు చేరుతాయని యజమానులు చెప్పినట్లు తెలిపారు. జిల్లాలోని వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. ప్రస్తుతం జిల్లాలో 8 ఎల్పీజీ ఏజెన్సీలు ఉన్నాయని... ఆయా ఏజెన్సీల్లో సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. -
ఆదర్శ మున్సిపాల్టీగా తీర్చిదిద్దుతా
నారాయణపేట: పురపాలికను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పుర చైర్పర్సన్ శ్వేత సత్యయాదవ్ అన్నారు. బుధవారం స్థానిక పుర కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా ఏర్పాటు చేసిన చాంబర్లో చైర్పర్సన్ దంపతులతో వేద పండితులు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం చైర్పర్సన్ కుర్చీలో కూర్చున్న తర్వాత వేదపండితుల ఆశీర్వదం తీసుకున్నారు. పుర కమిషనర్ నర్సయ్య చైర్పర్సన్తో రిజిస్టర్లో తొలి సంతకం చేయించారు. చైర్పర్సన్తో పాటు వైస్ చైర్మన్ మంజుల రాఘవేందర్రెడ్డిని మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పట్టణంలోని ప్రముఖులు ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాలతో సన్మానించారు. సన్మానించిన వారిలో మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి, మాజీ పుర వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు రతంగ్పాండురెడ్డితో పాటు వివిధ పార్టీల నాయకులు ఉన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
2న యూనివర్సిటీస్థాయి కామర్స్ ఫెస్ట్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో వచ్చే నెల 2న తెలంగాణ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ స్థాయి అంతర్ కళాశాలల కామర్స్ ఫెస్ట్ ప్రేరణ–2026 నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం కార్యక్రమ బ్రోచర్ను వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది కేవలం ఫెస్ట్ మాత్రమే కాదని, కామర్స్ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజన, ప్రతిభను వెలికి తీసేందుకు చేస్తున్న కార్యక్రమం అన్నారు. ఈ నెల 30లోగా విద్యార్థులు తమ పేరును నమోదు చేసుకోవాలని, ఇక్కడ గెలుపొందిన విద్యార్థులు సికింద్రాబాద్లోని అవినాష్ కళాశాలలో వచ్చేనెల 7న జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆడిట్సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కంట్రోలర్ ప్రవీణ, ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, అడిషనల్ కంట్రోలర్ అనురాధరెడ్డి, బీఓఎస్ చైర్మన్ ఆఫ్ కామర్స్ రాజ్కుమార్, రంగప్ప, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పుస్తకం ఆవిష్కరణ పీయూలో అధ్యాపకులు మధు మోటమారి, భారతి సంయుక్తంగా రచించిన నానోఫ్లూయిడ్స్ రంగంలో విశేష పరిశోధన, నూతన గ్రంథం పుస్తకాన్ని వీసీ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధన విద్యార్థులకు ఇది ఒక దిక్సూచిలా పనిచేస్తుందన్నారు. -
పేదల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
కోస్గి రూరల్: గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఆర్థిక భరోసా కల్పించి వారిని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కడా చైర్మన్ వెంకట్రెడ్డి, కాంగ్రెస్పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి అన్నారు. బుధవారం గుండుమాల్లోని రైతువేధికలో మండలంలోని భోగారం గ్రామానికి చెందిన 8 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేసి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం పేదల అభ్యున్నతే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. రైతులకు రైతుభరోసా అందించి పంట పెట్టుబడికి ఆసరాగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్, బోగారం సర్పంచ్ శేఖర్గౌడ్, ఉప సర్పంచ్ సాయప్ప, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు జయప్రకాశ్రెడ్డి, మాజీ ఎంపీపీ మధుకర్రావు, సురేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రూ.85.10 లక్షలు పలికిన సంత కోస్గి రూరల్: పుర పరిధిలోని పశువుల సంత వేలం 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.85.10 లక్షలు పలికిందని పుర కమిషనర్ నాగరాజు, చైర్మన్ నాగులపల్లి నరేందర్ తెలిపారు. బుధవారం పుర కార్యాలయంలో నిర్వహించిన వేలంలో 9 మంది పాల్గొనగా మాటికోటి వెంకటయ్య రూ.85.10 లక్షల పాటపాడి దక్కించుకున్నారని వివరించారు. తైబజార్కు 13 మంది పోటీపడగా రవికుమార్ రూ.34.13 లక్షలకు చేజిక్కించుకున్నట్లు చెప్పారు. పశువుల సంత గతేడాది కంటే ఈసారి రూ.16.06 లక్షలు, తైబజార్ రూ.3,10,500 ఎక్కువ వచ్చిందని తెలిపారు. వేలంలో వైస్ చైర్పర్సన్ సరిత, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్, కౌన్సిలర్లు మాస్టర్ శ్రీనివాస్, అంజిలయ్య, భానునాయక్, మేకల రాజేష్, కోడిగంటి హరి, ఓంప్రకాశ్, తుడుం శ్రీనివాస్, పుర మేనేజర్ అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. విశ్రాంత ఉద్యోగుల నిరసన నారాయణపేట: కేంద్ర ప్రభుత్వం వ్యాలిడేషన్ యాక్ట్ను వెంటనే రద్దు చేయాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్.మనోహర్ప్రసాద్గౌడ్, పట్టణ అధ్యక్షుడు భరత్కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగులు పట్టణంలోని కార్యాలయం నుంచి కలెక్టరేట్కు ర్యాలీగా చేరుకొని ఏఓ శ్రీధర్కు డిమాండ్ల వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వ్యాలిడేషన్ యాక్ట్ ఆమోదించిందని, ఈ చట్టం ప్రకారం 1.1.2026న పదవీ విరమణ పొందిన వారికి భవిష్యత్లో పీఆర్సీలో ఫిట్మెంట్ బెనిఫిట్స్ లేకుండా తీవ్ర నష్టాన్ని కలగజేస్తుందన్నారు. ఈ యాక్ట్ రాజ్యాంగ సూత్రాలతో పాటు సుప్రీంకోర్టుకు వ్యతిరేకమని, పింఛన్ ఉద్యోగుల సంక్షేమానికి అన్యాయం జరుగుతుందని, వెంటనే రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో సత్యనారాయణ, బాలరాజు, రాములు, ఎంఎస్ కుమార్, కృష్ణయ్య, గందె గంగాధర్, ధర్మరాజ్, దశరథ్, నారాయణ, సంగంనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
పురపాలికలో కలహాలు!
–8లో uనారాయణపేట: ఎన్నికల ఖర్చుకు అడిట్ ఉండదనే సాకుతో స్థానిక పురపాలికలో ఏకంగా రూ.79 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతుండటంతో అందరూ పరేషాన్లో పడ్డారు. బిల్లులు సరిగా లేవని చెక్కులు రాయనంటూ అకౌంటెంట్ తేల్చిచెప్పడంతో పుర అధికారులతో కొనసాగుతున్న అంతర్గత కలహం ఆలస్యంగా వెలుగు చూసింది. అకౌంటెంట్ బీరువాకు తాళం వేసుకొని వెళ్లగా.. పగలగొట్టి సరిచేయించడం, అదేరోజు వాట్సప్లో అకౌంటెంట్కు మెమో జారీ కావడంతో పుర అధికార యంత్రాంగంలో ఒకింత చర్చకు దారితీసింది. పుర కార్యాలయం అవినీతి తిమింగళాలకు అడ్డాగా మారిందని అధికారుల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిబంధనలను తుంగలోతొక్కి ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకోవడమే లక్ష్యంగా కొందరు ఉన్నతాధికారులు పావులు కదుపుతున్నారనే చర్చ సాగుతోంది. పుర ఎన్నికల ముసుగులో ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.లక్షల చెక్కులు రాయాలని, లేదంటే అంతు చూస్తామని కిందిస్థాయి సిబ్బందిని బెదిరించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అడ్వాన్సుల పేరిట దోపిడీ..? మున్సిపల్ ఎన్నికల ఖర్చు పేరుతో ఓ వార్డు అధికారికి రూ.12 లక్షలు, ఓ అధికారికి రూ.15 లక్షలు, మరో అధికారికి రూ. 5 లక్షలు.. ఇలా రూ.32 లక్షలు డబ్బులు డ్రా చేయించినట్లు సమాచారం. రూ.24 లక్షల చెక్కులు వెంటనే రాయాలని అకౌంట్స్ విభాగం అధికారిపై ఉన్నతాధికారులు ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. బిల్లులు తర్వాత.. ముందు చెక్కులు రాయంటూ సదరు అధికారి హుకూం వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదని తెలుస్తోంది. చెక్కులు మాయం..? ఈ నెల 18న సాయంత్రం వరకు కార్యాలయంలోనే ఉన్న అకౌంటెంట్ బిల్లులు లేకుండా చెక్కులు రాయడం కుదరదని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన ఇంటికి వెళ్లిన వెంటనే కొందరు అధికారులు సెక్షన్్లోకి చొరబడినట్లు సమాచారం. అధి కారి లేని సమయంలో సెక్షన్న్లోని బీరువాలో ఉన్న చెక్కులను అక్రమంగా తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్యాలయంలో సిబ్బంది లేని సమయంలో ఇలాంటి చొరబాట్లు జరగడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని స్పష్టమవుతోంది. చైర్పర్సన్ రాక ముందే.. పుర చైర్పర్సన్గా ఎన్నికై న కొండ శ్వేత బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆమె బాధ్యతలు చేపట్టకముందే ఖజనా ఖాళీ చేయాలనుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైర్పర్సన్ వస్తే లెక్కలు చెప్పాల్సి వస్తుందని ముందే భావించిన మున్సిపల్ అధికారులు ఎన్నికల ఖర్చుకు సంబంధించి బిల్లులు డ్రా చేసుకోవాలనుకున్నారా అనేది విచారణ జరిపిస్తే తప్పా అసలు విషయం బయటకు రాదని తెలుస్తోంది. అధికారులు వర్సెస్ అకౌంటెంట్ మున్సిపల్ ఎన్నికల వ్యయం రూ.79 లక్షలా? ప్రభుత్వం నుంచి వచ్చింది రూ.20 లక్షలే.. జనరల్ ఫండ్ నుంచి రూ.59 లక్షలుడ్రా చేసేందుకు ప్రయత్నాలు అకౌంటెంట్కు మెమో జారీ -
పోటెత్తిన ఉల్లి
● గరిష్టంగా రూ.1,400,కనిష్టంగా రూ.800 దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం ఉల్లి పోటెత్తింది. వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్దఎత్తున ఉల్లిని అమ్మకానికి తెచ్చారు. దాదాపు 10 వేల బస్తాల ఉల్లి మార్కెట్కు రావడంతో ఎక్కడ చూసినా ఉల్లి కుప్పలే కనిపించాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన వేలం మధ్యాహ్నం వరకు కొనసాగింది. అయితే వచ్చిన ఉల్లిలో అటు ఇటుగా ఉన్న ఉల్లి కుప్పలకు ధరలు నిర్ణయించి వ్యాపారులు కొనుగోలు చేశారు. ఉల్లి వేలంలో క్వింటాల్ గరిష్టంగా రూ.1,400, కనిష్టంగా రూ.8,00 వరకు ధరలు పలికాయి. మార్కెట్ నిబంధనల ప్రకారం 50 కిలోల బస్తాలుగా ఉల్లిని తూకం వేసి అమ్మకాలు సాగించారు. బస్తా ధర గరిష్టంగా రూ.700, కనిష్టంగా రూ.400 వరకు విక్రయించారు. ఇతర మార్కెట్ల నుంచి వచ్చిన వ్యాపారులు పెద్దమొత్తంలో ఉల్లిని కొనుగోలు చేసి తరలించారు. ఇక స్థానిక వ్యాపారులు, చిరు వ్యాపారులు, వినియోగదారులతో మార్కె ట్ అంతా సందడిగా కనిపించింది. -
‘టీబీ రహితరాష్ట్రంగా మార్చుదాం’
ధన్వాడ: తెలంగాణ రాష్ట్రాన్ని టీబీ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని జిల్లా వైద్యాశాఖ అధికారి జయచంద్రమోహన్ పిలుపునిచ్చారు. ప్రపంచ టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన టీబీ క్యాంపును స్థానిక సర్పంచు జ్యోతితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. వైద్యుల సూచన మేరకు మందులు వాడితే టీబీ వ్యాధిని నిర్మూలించవచ్చన్నారు. ఉత్తమ సేవలు అందించిన వైద్య సిబ్బందికి బహుమతులను అందజేశారు. 14 ఏళ్లు పైబడిన మహిళ లకు స్కానింగ్ చేశారు. 50 మంది సస్పెక్ట్ కేసులుగా గుర్తించినట్లు వారు తెలిపారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రోగాం అధికారి సత్యప్రకాష్, డాక్టర్ అనుషా, భీష్మఫౌండేషన్ అధ్యక్షుడు భీష్మరాజ్ తదితరులు పాల్గొన్నారు. కారుణ్య నియామకాలు చేపట్టాలి నారాయణపేట రూరల్: జిల్లాలో నాలుగేళ్లుగా నుంచి కారుణ్య నియామకాలు చేపట్టలేదని, త్వరగా నియమించి న్యాయం చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ మొగులప్పకు తపస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ.. జీపీఎఫ్ చెల్లింపులు వేగవంతం చేసి ఆన్లైన్ త్వరగా పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి షేర్ కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరసింహ, రవీందర్, జిల్లా కోశాధికారి కిషోర్కుమార్, నాయకులు నర్సింలు, రాజు పాల్గొన్నారు. -
వదంతుల హోరు.. బంకుల్లో వాహనాల జోరు
7నారాయణపేట: పెట్రోల్ బంకులు బంద్ అవుతా యనే ప్రచారం, ఇంధన కొరత వార్తలతో ప్రజలు భయాందోళనతో బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. పెట్రోల్ ఉన్న బంకుల వద్ద వాహనాల రద్దీతో పెరగడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం చౌరస్తాలోని జెడ్ఎంఎస్, మక్తల్ రోడ్లో ని మరో బంకు వద్దకు వాహనాలు భారీగా రావడంతో గంట వ్యవధిలోనే వారు సైతం నో స్టాక్ అంటూ చేతులేత్తాశారు. రాష్ట్రంలో కావాల్సినంత పెట్రోల్ నిల్వలు ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నా.. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన సరఫరాలో అంతరాయం కలగవచ్చనే ఆందోళనలు ఈ రద్దీకి కారణమవుతున్నయని అధికారులు అంటున్నారు. -
నారాయణపేట
ఎట్టకేలకు బాధ్యతలు బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026నారాయణపేట: మున్సిపల్ ఎన్నికలు పూర్తయి.. చైర్పర్సన్గా కొండ శ్వేత సత్యయాదవ్ ఎన్నికై నా బాధ్యతలు మాత్రం స్వీకరించలేదు. ఇదిలా ఉండగా నారాయణపేటలో బీజేపీ జిల్లా కార్యాలయ నూతన భవనాన్ని, మున్సిపల్ ఎన్నికల విజయోత్సవ ర్యాలీతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ బాధ్యతల స్వీకరోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 9 గంటలకు మూహుర్తం ఫిక్స్ చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని నైరుతి భాగంలో మున్సిపల్ చాంబర్ ఉండాలనే వాస్తు నిపుణుల సూచనలతో గదిని సిద్ధం చేశారు. 11 స్థానాలతో.. స్థానిక మున్సిపాలిటీలో బీజేపీ 10 కౌన్సిలర్ స్థానాలు సాధించగా.. రెబెల్గా గెలిచిన మరో కౌన్సిలర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమక్షంలో పార్టీలో చేరడంతో బలం 11 సభ్యులకు చేరింది. ఇందుకు జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ ప్రధాన పాత్ర పోషించారు. దీంతో ఎంపీ డీకే అరుణ, బీజేపీ అధిష్టానం సత్యయాదవ్ సతీమణి కొండ శ్వేతను చైర్పర్సన్ నియమించేందుకు మొగ్గుచూపారు. వైస్ చైర్మన్గా మంజుల రాఘవేందర్రెడ్డి ఎన్నికయ్యారు. చైర్పర్సన్, వైస్ చైర్మన్లతో పాటు కౌన్సిలర్లు గత నెల 16న అధికారికంగా ప్రమాణస్వీకారం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్గా కొండా శ్వేత ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
అర్జీలు సత్వరం పరిష్కరించాలి : కలెక్టర్
నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు ప్రాధాన్యతనిస్తూ.. ప్రజల అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన నేరుగా తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 37 ఫిర్యాదులు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి.. పరిష్కార మార్గం చూపాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీంద్ర రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీను పాల్గొన్నారు. ● నూతన కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణలో రోడ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని ఆయన పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధాన రహదారి నుంచి కలెక్టరేట్ భవన సముదాయం వరకు సమాంతరంగా రోడ్డు నిర్మించాలన్నారు. అదే విధంగా భవన సముదాయం సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను అక్కడి నుంచి తొలగించాలని తెలిపారు. భవనం చుట్టూ నాలువైపులా మొక్కలు నాటించి, గ్రీనరీ ఏర్పాటు చేయాలని డీఆర్డీఓ మొగులప్పకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్అండ్బీ డీఈఈ రాములు తదితరులు ఉన్నారు. -
‘పది’ పరీక్షలకు 13 మంది గైర్హాజరు
నారాయణపేట రూరల్: జిల్లాలో సోమవారం పదోతరగతి విద్యార్థులకు ఇంగ్లిష్ పరీక్ష జరిగింది. మొత్తం 43 కేంద్రాల్లో 8,319 మంది విద్యార్థులకుగాను 8,306 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 13 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ పరీక్ష కేంద్రంలో 11 మందికి 11 మంది పరీక్ష రాశారు. ఈ నెల 18న జరిగిన సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష పేపర్ నిజామాబాద్లో లీక్ కావడంతో విద్యాశాఖ సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలో ఉదయం కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించే సమయంలో విస్తృతంగా తనిఖీ చేశారు. పరీక్ష ప్రారంభం నుంచి సిట్టింగ్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు కేంద్రాలను జల్లెడ పట్టాయి. జిల్లా విద్యాధికారి గోవిందరాజు, పరీక్షల విభాగం అధికారి శశికుమార్ కేంద్రాలను తనిఖీ చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ పరీక్ష కేంద్రాలకు వెళ్లి పరిశీలించి సీఎస్, డీఓలకు పలు సూచనలు చేశారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో సెల్ఫోన్లను అనుమతించరాదని సూచించారు. మరోపక్క ఎస్పీ వినీత్ పరీక్షా కేంద్రాల దగ్గర బందోబస్తును పర్యవేక్షించి సిబ్బందికి సూచనలు చేశారు. కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ కేంద్రాలను మూసి వేయించాలని ఆదేశించారు. -
ప్రతి ఫిర్యాదుకు ప్రాధాన్యం ఇవ్వాలి
నారాయణపేట: పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుకు అధికారులు ప్రాధాన్యం ఇచ్చి.. బాధితులకు భరోసాగా నిలవాలని ఎస్పీ డా.వినీత్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో గౌరవంగా వ్యవహరించి, వారి సమస్యలను శ్రద్ధగా వినాలన్నారు. జిల్లాలోని పోలీస్స్టేషన్లలో సమర్పించే ఫిర్యాదులకు సత్వర చర్యలు లభించకపోతే, సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్ను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. సర్కిల్ స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే సంబంధిత డీఎస్పీ లేదా జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవన్నారు. ప్రజలకు అండగా నిలవడం పోలీస్శాఖ ప్రధాన బాధ్యత అని, అందులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టంచేశారు. పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరూ తమ విధులను నిబద్దతతో నిర్వర్తించాలని ఎస్పీ ఆదేశించారు. -
‘చిరు’ సాగుపై అనాసక్తి
● క్షేత్రస్థాయిలో లోపించిన అవగాహన ● ఉమ్మడి జిల్లాలో వంద క్వింటాళ్లు దాటని దిగుబడి ● మార్కెట్లో పెరిగిన డిమాండ్ ●ప్రతి ఏటా మా బంధువులు చిరుధాన్యల సాగుతో అధిక లాభాలు అర్జిస్తున్నారు. వారిని అనుసరించి యాసంగిలో పంటమార్పిడి చేసి రెండు ఎకరాల్లో అరకలు సాగు చేశా. పంట నాటిన నుంచి ఇప్పటి వరకు రూ.25 వేల పెట్టబడి అయింది. మరో నెల రోజుల్లో కోతకు రానుంది. అధిక దిగుబడి వస్తే వచ్చే యాసంగిలో సాగును మరింత విస్తారిస్తా. – కొండాపూర్ వెంకట్రెడ్డి, రైతు, మరికల్ మార్కెట్లో అధిక ధరలున్న చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి. ఇలాంటి పంటలను సాగు చేస్తే రైతులు అధిక లాభాలు పొందవచ్చు. రెండేళ్లుగా అవగాహన కల్పిస్తున్నాం. రైతులు అక్కడక్కడ ముందుకొచ్చి ఎకరా నుంచి రెండు ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. మిగతా రైతులు కూడా ఆసక్తి కనబరిస్తే సాగుపై అవగాహన కల్పిస్తాం. – జాన్ సుధాకర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి మరికల్: రాష్ట్ర ప్రభుత్వం పంట మార్పిడి చేసి కొత్త రకం పంటలను సాగు చేయాలని పదే పదే చెబుతున్నా.. రైతులు మాత్రం మూస పద్ధతిని మాత్రం వీడ టం లేదు. ఉమ్మడి జిల్లాలో చిరుధాన్యాల సాగుకు అన్నదాతలు ఆసక్తి చూపక పూర్తిగా తగ్గింది. ప్ర స్తుతం వీటి వినియోగం భారీగా పెరిగినా.. సాగు మాత్రం తగ్గుతోంది. ఐదేళ్ల కిందట రైతులు ఎంతో కొంత చిరు ధాన్యాలను సాగు చేసేవారు. అయితే కొందరికి ఎక్కడ విక్రయించాలో తెలియక సాగును తగ్గిస్తూ వచ్చారు. ఆయా పంటలను పక్కనబెట్టి వర్షాకాలంలో మాత్రం జొన్న సాగు చేస్తున్నారు. ప్రస్తుత యాసంగిలో ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడ రాగులు, జొన్నలు సాగు చేసినప్పటికీ ఇతర చిరు ధాన్యాలైన కొర్రలు, అరికలు, ఊదలు, సామలు, అడ్డుకొర్రలు కనిపించడం లేదు. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో చిరుధాన్యల సాగుపై రైతులు దృష్టి సారించేలా అవగాహన కల్పించి ఉంటే కొంతమేరకై నా మొగ్గు చూపేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో రైతులు అధిక శాతం వరి, పత్తి, మొక్కజొన్న సాగుపై దృష్టి సారిస్తున్నారు. -
అంగన్వాడీల కలెక్టరేట్ ముట్టడి
నారాయణపేట: తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమ వారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు వెంకట్రామిరెడ్డి, బండమీది బలరాం, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శశికళ, జిల్లా కార్యదర్శి శివకుమారి మాట్లాడుతూ.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కనీస వేతనం రూ.26 వేలుగా ప్రకటించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, మే నెలంతా వేసవి సెలవులు ఇవ్వాలని, కేంద్రం తెచ్చిన ఎన్ఐపి–2020 చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని, 2026 ఎడ్యుకేషన్ పాలసీని సవరించాలని, రాష్ట్రంలో ప్రీప్రైమరీ పీఎంశ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్కు గ్రాట్యుటీ చెల్లించాలనే తదితర డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు, మౌలిక వసతులు కల్పించాలన్నారు. అంతకుముందు మున్సిపల్ పార్క్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. అనంతరం ఏఓ శ్రీధర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జ్యోషి, జిల్లా నాయకులు నరహరి, అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకులు పుష్ప, జ్యోతి, నారాయణమ్మ, రాధ, విజయలక్ష్మి, హారిక, వనమాల, పద్మ, చంద్రకళ, ఉమామహేశ్వరి, పద్మ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. -
మిగిలింది 9 రోజులే..
నారాయణపేటఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో అంతంతమాత్రంగానే పన్నుల వసూళ్లు ● గడువు దగ్గర పడుతుండటంతో వేగం పెంచిన అధికారులు ● ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో స్పెషల్ డ్రైవ్ ● పుర ఎన్నికలు, సిబ్బంది కొరతతోనే జాప్యం సోమవారం శ్రీ 23 శ్రీ మార్చి శ్రీ 2026నారాయణపేట: మున్సిపాలిటీల అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులతోపాటు ఆస్తి పన్ను వసూళ్లు ప్రధాన భూమిక పోషిస్తాయి. మున్సిపాలిటీల్లోని నివాస, వాణిజ్య సముదాయాలకు సంబంధించి 2025– 26 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లపై పుర యంత్రాంగం దృష్టిసారించింది. క్యూఆర్కోడ్ స్కాన్, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాట్సప్ నంబర్, ఏటీఎం ద్వారా నేరుగా ఆయా పురపాలికల ఖాతాల్లో జమ చేయవచ్చని చెబుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు పన్ను వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు పన్ను వసూలు అంతంత మాత్రమే ఉండటం.. లక్ష్యం చేరుకునేందుకు కేవలం 9 రోజులు మాత్రమే గడువు ఉండటంతో అధికారులు, సిబ్బంది వసూళ్లలో వేగం పెంచారు. నారాయణపేటలో ఆస్తి పన్ను వసూలు చేస్తున్న మున్సిపల్ సిబ్బంది (ఫైల్) ఏటా మార్చిలోనే అత్యధికంగా పన్ను వసూళ్లు అవుతాయి. ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది.. ప్రజాపాలన–పట్టణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పన్ను వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. పుర ప్రజలు, వ్యాపారులు ఆస్తి పన్ను సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలి. వారం రోజులుగా పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిసారించాం. ఈ నెల 31 వరకు వంద శాతం పన్ను వసూలు చేసేందుకు కృషి చేస్తున్నాం. – నర్సయ్య, పుర కమిషనర్, నారాయణపేట ● -
గ్రామస్తుల ఇష్టం మేరకే..
●గ్రామస్తుల ఇష్టం మేరకే గంపజాతర నిర్వహించేందుకు అందరం కలిసి నిర్ణయిస్తాం. ప్రతి సంవత్సరం ఆచారంగా వస్తోంది. ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం గ్రామంలో ప్రజలందరూ గంపజాతరకు వెళ్తున్నారు. కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకొంటున్నారు. – శ్రీదేవి, మాజీ సర్పంచ్, షేక్పల్లి, హన్వాడ మండలం, మహబూబ్నగర్ జిల్లా గ్రామంలో గంపజాతర నిర్వహిస్తే అనుకోని విపత్కర పరిస్థితులు ప్రజలకు రావని, దారిద్య్రం, అంటురోగాలు రావని ప్రతి సంవత్సరం ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం నిర్వహిస్తారు. గంపజాతర నిర్వహించడం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని నమ్ముతాం. గంపజాతర నిర్వహించకపోతే గ్రామంలో ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది. – శ్రీకాంత్, నవాబ్పేట, మహబూబ్నగర్ జిల్లా విపత్కర పరిస్థితులు రావు.. -
ప్రతిఏటా నిర్వహిస్తాం..
●గంపజాతర కార్యక్రమం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒకరోజు నిర్వహించడం ఆచారంగా వస్తోంది. ఇలా చేస్తే కొన్నిరకాల రోగాలు దరిచేరవనే నమ్మకం అందరిలో ఉంది. అంతేకాకుండా గంపజాతర నిర్వహిస్తూ చెట్ల కింద ఆనందంగా గడపడానికి కూడా ప్రజలు దీన్ని నిర్వహిస్తున్నారు. – శిర్ప రవి, వేపూరు గ్రామం, హన్వాడ మండలం, మహబూబ్నగర్ జిల్లా ఆ తర్వాతే పొలం పనులు.. గ్రామాల్లో ఆచారంగా వస్తున్న గంపజాతర కార్యక్రమం నిర్వహించిన తర్వాతనే పొలం పనులు మొదలుపెడతారు. వర్షాలు కురువక ముందే గంపజాతర జరుపుకొంటారు. గంపజాతర నిర్వహించిన తర్వాత పంటలు వేసుకునేందుకు పొలాలను సిద్ధం చేసుకుంటారు. వర్షాలు కురిసిన వెంటనే పంటలు వేసుకుంటారు. -
హైలెవల్ వంతెన నిర్మించి తీరుతాం
ఆత్మకూర్: జూరాల–కొత్తపల్లి గ్రామాల మధ్య కృష్ణానదిపై హైలెవల్ వంతెన నిర్మాణం పూర్తిచేసి తీరుతామని.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వెనకడుగు వేసేది లేదని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. శనివారం రంజాన్ సందర్భంగా స్థానిక ఈద్గా వద్ద ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 87 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. ఆత్మకూర్కు గత వైభవం తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, హైలెవల్ వంతెన నిర్మాణాన్ని అడుగడుగున అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పురపాలికలో రెండేళ్ల వ్యవధిలో రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ సాధించడమే తన లక్ష్యమని చెప్పారు. శివాజీ మహరాజ్ విగ్రహావిష్కరణ.. మండలంలోని తిప్పడంపల్లిలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని మంత్రి శనివారం ఆవిష్కరించారు. అలాగే ఆత్మకూర్లో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొని లబ్ధిదారులకు కొత్త దుస్తులు అందజేశారు. మేడేపల్లిలో బీటీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఆయన వెంట మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా, పుర చైర్పర్సన్ నాగమణి, వైస్ చైర్మన్ నల్గొండ శ్రీనివాస్, తహసీల్దార్ జేకే మోహన్, ఎంపీడీఓ శ్రీపాద్, పుర కమిషనర్ శశిధర్, డీసీసీ కార్యదర్శి తులసీరాజ్, పార్టీ మండల అధ్యక్షుడు పరమేష్ పాల్గొన్నారు. పదవులు కాదు.. అభివృద్ధి శాశ్వతం... అమరచింత: పదవులు ముఖ్యం కాదని.. మనం చేసిన అభివృద్ధి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అమరచింత పుర కార్యాలయ ఆవరణలో శనివారం నిర్వహించిన పుర సభ్యుల పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికై న ప్రజాప్రతినిధులు వారి సేవకు పునరంకితం కావాలని సూచించారు. మండలంలో కొత్తగా గోదాంల నిర్మాణాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మండలానికి మొదటి విడత 450 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని.. అవి పూర్తిచేస్తే మరో 500 ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మున్సిపాల్టీకి రూ.15 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. పురపాలికకు పొక్లెయిన్, డోజర్ మంజూరు చేయాలని చైర్పర్సన్ జింక సువర్ణ, వైస్ చైర్పర్సన్ రాధ మంత్రికి విన్నవించగా.. ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ కల్లుగీత సెల్ చైర్మన్ కేశం నాగరాజుగౌడ్, కౌన్సిలర్లు మాధవి, రాములు, పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అరుణ్కుమార్, నాయకులు తౌఫిక్, శ్యామ్, కమలాకర్గౌడ్, నందిమళ్ల సర్పంచ్ రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆదాయం అంతంతే..
నారాయణపేటఆదివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2026తలసరి ఆదాయంలో అట్టడుగునే నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాలు జీడీడీపీ.. (ప్రస్తుత ధరల వద్ద.. రూపాయల్లో)మహబూబ్నగర్ నాగర్కర్నూల్ వనపర్తి జో.గద్వాల నారాయణపేట17,27828,47137,456సాక్షి, నాగర్కర్నూల్: దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. అన్ని రంగాల్లో క్రమంగా వృద్ధి కనిపిస్తోంది. కానీ రాష్ట్రంలో మిగతా జిల్లాల కన్నా ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్ మినహా నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలు తలసరి ఆదాయం విషయంలో అట్టడుగు స్థానంలో కొనసాగుతున్నాయి. నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే 28వ స్థానంలో కొనసాగుతుండగా, జోగుళాంబ గద్వాల జిల్లా 26వ స్థానంలో ఉంది. వస్తు సేవల ఉత్పత్తిలో ప్రామాణికంగా నిలిచే జీడీడీపీ విషయంలోనూ ఈ జిల్లాలు వెనుకంజలో ఉన్నాయి. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ సర్వే 2026లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ● ఏడాదిలో వ్యక్తులకు లభిస్తున్న సగటు ఆదాయం విషయంలో మహబూబ్నగర్ మినహా మిగతా జిల్లాలు అట్టడుగునే కొనసాగుతున్నాయి. మహబూబ్నగర్ తలసరి ఆదాయం రూ. 3.36 లక్షలతో రాష్ట్రంలోనే 6వ స్థానంలో మెరుగ్గా ఉంది. నారాయణపేట జిల్లా రూ.2.59 లక్షల తలసరి ఆదాయంతో 28 స్థానంలో, గద్వాల జిల్లా రూ. 2.66 లక్షలతో 26వ స్థానంలో ఉండగా, వనపర్తి జిల్లా రూ.2.74 లక్షలతో 21వ స్థానం, నాగర్కర్నూల్ జిల్లా రూ. 2.79 లక్షల తలసరి ఆదాయంతో 19వ స్థానంలో నిలిచింది. ● వస్తుసేవల ఉత్పత్తిలోనూ పాలమూరు జిల్లాలు వెనుకంజలో ఉన్నాయి. ప్రస్తుత ధరల వద్ద జీడీడీపీ రూ.37,456తో మహబూబ్నగర్ జిల్లా 11వ స్థానంతో మెరుగ్గా కనిపిస్తుండగా, మిగతా జిల్లాలు వెనుకబడ్డాయి. నారాయణపేట జిల్లా రూ.17,278 జీడీపీపీతో 29వ స్థానంలో ఉండగా, వనపర్తి జిల్లా 27వ స్థానం, గద్వాల 26వ స్థానం, నాగర్కర్నూల్ జిల్లా 19వ స్థానంలో ఉంది. ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆశించినంతంగా పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదు. చిన్న తరహా పరిశ్రమలు, ఉత్పత్తి కేంద్రాల ద్వారా స్థానికులు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. కానీ ఉమ్మడి జిల్లాలో పరిశ్రమలు, ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు తక్కువగా ఉంది. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో 8,165 ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటుకాగా, అతి తక్కువగా నారాయణపేట జిల్లాలో 2,298 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే 29వ స్థానం జీడీడీపీలోనూ పాలమూరు జిల్లాలు వెనుకంజ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ సర్వేలో వెల్లడి -
గంప జాతర..
బయలెల్లుతున్న గ్రామాలు మహబూబ్నగర్ న్యూటౌన్: గ్రామంలో అనుకోని విపత్కర సంఘటనలు, అశుభాలు దరిచేరకుండా.. ఏడాదికోసారి నిర్వహించేదే గంపజాతర. ప్రతి ఏటా ఫిబ్రవరి ప్రారంభం నుంచి మే నెల వరకు ప్రతి ఆదివారం, మంగళవారాల్లో ఏదో ఒకరోజు ఈ గంపజాతర నిర్వహిస్తారు. ఉదయాన్నే లేచి వంట పాత్రలు, వంటకు కావాల్సిన సరుకులు తీసుకొని ఒక గంపలో పెట్టుకొని ఇళ్లకు తాళం వేసి గ్రామాన్ని వదిలిపెడతారు. గంపను నెత్తిపై పెట్టుకొని ఊరు చివర, పంట పొలాల వద్ద చెట్లకిందకెళ్లి అక్కడే వంటలు చేసుకొని పిల్లాపాపలతో గడుపుతారు. ఏడాదిసారి ఇలా చేస్తే అంటురోగాలు రావని, పట్టిన దారిద్య్రం వదులుంతుందనేది ప్రజల్లో గట్టి నమ్మకం. గంపజాతర కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, దేవరకద్ర, జడ్చర్ల, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో జరుపుకొంటున్నారు. ఇళ్లకు తాళాలు.. రోజంతా వనవాసాలు ఫిబ్రవరి నుంచి మే నెల వరకు కొనసాగింపు పిల్లాపాపలు, బంధుమిత్రులతో కలిసి విందులు ప్రతి సంవత్సరం ఆచారంగా జాతర నిర్వహణ అంటురోగాలు, దారిద్య్రం పోతుందనే నమ్మకం -
భక్తిశ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్
బందోబస్తు పర్యవేక్షించిన డీఎస్పీ.. ● ఈద్గాల వద్ద ముస్లింలప్రత్యేక ప్రార్థనలు ● శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు నారాయణపేట: జిల్లావ్యాప్తంగా శనివారం రంజాన్ పండుగ (ఈద్ ఉల్ ఫితర్)ను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. గ్రామాలు, మండల కేంద్రాలు, పుర కేంద్రాల్లోని మసీదులు, ఈద్గాల వద్దకు ఊరేగింపుగా వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిన్నా పెద్దలు పరస్పరం ఆలింగనం చేసుకొని పండగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఈద్గాల వద్ద మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. గొప్ప పండుగల్లో రంజాన్ ఒకటి.. పవిత్ర రంజాన్ మాసం దీక్షలు ప్రేమ, దయ, సౌభ్రాతృత్వ గుణాలను పంచుతాయని.. చెడు భావన, అధర్మం, ధ్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగల్లో రంజాన్ పండుగ ఒకటని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. ముస్లిం చేసే ప్రార్థనలు, అల్లా దీవెనలతో ప్రజలకు సకల సౌభాగ్యాలు, అన్నివర్గాల ప్రజలు రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రముఖుల శుభాకాంక్షలు.. జిల్లాకేంద్రంలోని ఈద్గా వద్ద డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్.శివారెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్లు అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, బండి వేణుగోపాల్, సరాఫ్ నాగరాజు, సుధాకర్, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా ఎస్పీ డా. వినీత్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఈద్గాలు, మసీదులు, ప్రార్థన మందిరాల వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు. డీఎస్పీ ఎన్.లింగయ్య జిల్లాకేంద్రంలోని బువ్వమ్మ గుట్ట ఈద్గా వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కోరారు. డీఎస్పీ వెంట సీఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు. -
క్రమంగా ఆచారంలో మార్పులు
గతంలో ఉన్న గంపజాతర నిర్వహణ ఆచారాల్లో మానవ అభివృద్ధి క్రమంలో మార్పులు చోటు చేసుకున్నట్లు పెద్దలు చెబుతున్నారు. ఇళ్లను వదిలి గ్రామాన్ని దాటి అడవిలో కాకుండా పొలాల్లో చెట్ల కింద గడపడం, ఆహారపు ఆచారంలోనూ ఎవరికి నచ్చిన విధంగా వారు మార్పులు తెచ్చారని అంటున్నారు. చెట్ల నీడలో ఊయల ఊగడం, పిల్లాపాపలు, మిత్రులు, కుంటుంబ సభ్యులతో కలిసి ఆటలు ఆడటం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆహ్లాదకర వాతావరణంలో గడుపుతున్నారు. ● జడ్చర్ల మండలం గంగాపూర్ శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్మామి బ్రహ్మోత్సవాల్లో గంప జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జడ్చర్లతో పాటు కోయిలకొండ, మద్దూరు, దేవరకద్ర, కోస్గి, కొడంగల్, తాండూర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తమ ఇంటి దేవుడు శ్రీ లక్ష్మి చెన్నకేశవస్వామి చిత్రపటంతో పాటు వారు పండించిన పంటలను గంపలో పెట్టుకొని పాదయాత్రగా ఆలయానికి చేరుకుంటారు. అక్కడే దాసంగాలు పెట్టి స్వామివారి మొక్కు తీర్చుకుంటారు. -
సంక్షేమం కోసం కొత్త పథకాలు..
రాష్ట్ర బడ్జెట్లో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈసారి కొత్త పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు అవసరమైన నిధులు కేటాయింపులు చేసింది. ప్రధానంగా విద్యార్థుల కోసం అల్పాహారం పథకం అమలు చేయనుంది. 2026– 27 విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు బ్రేక్ఫాస్ట్ అందించనున్నారు. వారంలో మూడు రోజులపాటు పాలు, మూడు రోజులపాటు రాగిజావతో చేసిన నాణ్యమైన అల్పాహారం అందిస్తారు. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం అల్పాహారంతోపాటు మధ్యాహ్నం భోజన సౌకర్యం కల్పిస్తారు. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ పథకం అమలుకానుంది. ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగ విద్యార్థుల కోసం రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ టూ వీలర్ వాహనాలను పంపిణీ చేయనున్నారు. విదేశాల్లో చదివే విద్యార్థుల కోసం ఉపాధి, భాషా నైపుణ్యాల కోసం ప్రత్యేక పథకాన్ని అమలుచేయనున్నారు. రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకాన్ని మరింత వేగంగా అమలు చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించింది. ఇప్పటికే మొదటి విడత కింద ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టగా, రెండో విడతలోనూ కొత్త లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయనుంది. వాతావరణం ఆకాశం నిర్మానుష్యంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవత్ర పెరుగుతుంది. రాత్రివేళలో చల్లటి గాలులు వీస్తాయి. కొడంగల్కు అధిక ప్రాధాన్యం.. ఈసారి రాష్ట్ర బడ్జెట్లో నారాయణపేట–కొడంగల్–మక్తల్ ఎత్తిపోతల పథకానికి అధిక ప్రాధాన్యం లభించింది. తొలుత రూ.4,350 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ను రెండు విడతల్లో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే మొదటి విడత కోసం రూ.1,126 కోట్లను కేటాయించగా.. రెండో విడత కింద మరోసారి రూ.2,945 కోట్లు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్ట్ను పూర్తిచేసేందుకు తాజాగా రాష్ట్ర బడ్జెట్లో రూ.1,103.28 కోట్ల కేటాయింపులు దక్కాయి. ఈ ప్రాజెక్ట్ కింద పెండింగ్లో ఉన్న భూసేకరణతో పాటు పనులను వేగంగా పూర్తిచేసి సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పెండింగ్లో ఉన్న వాటికి.. ఉమ్మడి జిల్లాలో దశాబ్దాల కాలంపాటు పెండింగ్లోనే ఉన్న సాగునీటి ప్రాజెక్ట్లకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. ప్రధానంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ పనుల కోసం రూ.800 కోట్లు కేటాయించింది. కోయిల్సాగర్ కోసం రూ.56.13 కోట్లు, సంగంబండ రూ.25.23 కోట్లు, ఆర్డీఎస్ రూ.88 కోట్లు, నెట్టెంపాడు ప్రాజెక్ట్కు రూ.232.50 కోట్లు, భీమా ఎత్తిపోతలకు రూ. 119.22 కోట్లు, జూరాల రిజర్వాయర్ గేట్ల మరమ్మతు, ఇతర పనుల కోసం రూ.3 కోట్లు కేటాయించింది. –IIలో u గతేడాది వేతనాలకు రూ.13 కోట్లు, ఈసారి రూ.20 కోట్లు కొత్త ఇంజినీరింగ్, లా కళాశాలల ఏర్పాటు, సిబ్బందికి వేతనాలతో పెరిగిన బడ్జెట్ అభివృద్ధి పనుల కోసం రూ.25 కోట్లు కేటాయింపు – మహబూబ్నగర్ ఎడ్యుకేషన్ -
మంత్రి ఇంటి ఎదుట ఆశాల ధర్నా
మక్తల్: తమ సమస్యలు పరిష్కరించాలంటూ శుక్రవారం పట్టణంలోని రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి నివాసం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఆశా కార్యకర్తలు సంఘం అధ్యక్షురాలు సావిత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 28 వేల మంది ఆశా కార్యకర్తలు 20 ఏళ్లుగా పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. అధికారంలోకి రాగానే రూ.18 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్పార్టీ హామీ ఇచ్చిందని.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించాలని, ఇతర సమస్యల పరిష్కారానికి ఎన్ఎచ్ఎంకు సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే రూ.50 లక్షల ఇన్సూరెన్స్, రూ.5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. కుష్టు సర్వే, ఎన్నికలు, పరీక్షల విధులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నారు. అనంతరం మంత్రి పీఏ యాదయ్యకు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వెంకట్రాంరెడ్డి, బాల్రాం, రాజు, నిక్సన్, గోవిందరాజ్, నరహరి, గోవిందమ్మ, యశోద, ఇందిరమ్మ, సుజాత, లక్ష్మి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీగా ఉంది. గత పాలకుల ఆడంబరాలకు భిన్నంగా, 6 గ్యారంటీలకు సరిపడా నిధులు కేటాయించక మసిబూసి మారేడుకాయ చేసింది. రైతుభరోసాకు రూ.18 వేల కోట్లు, పంట బీమాకు రూ.1,886 కోట్లు, సన్న వడ్ల బోనస్కు రూ.3,500 కోట్లు అంటూ అంతా గారడి చేసింది. మహాలక్ష్మి పథకం తప్పా మహిళలకు నెలకు రూ.2,500 సాయం ఊసే లేదు. నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకుండా నిరుద్యోగులను మళ్లీ మోసం చేసింది. – సత్యయాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు -
ప్రత్యేక నిధుల్లేవ్..!
నారాయణపేటఅంచనాల మేరకు దక్కని ప్రాధాన్యత ● ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు రూ.4,252.53 కోట్లు కేటాయింపు ● మక్తల్– పేట–కొడంగల్ లిఫ్ట్కు పెద్దపీట ● ‘పాలమూరు–రంగారెడ్డి’ ప్రాజెక్టుకు మరోసారి నిరాశే.. ● కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి రూ.800 కోట్లు ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వెచ్చింపు శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉమ్మడి పాలమూరు జిల్లాకు నిరాశే మిగిల్చింది. ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు అధిక మొత్తంలో ప్రత్యేక నిధులు సమకూరుస్తారని భావించగా, కేవలం రూ.1,800 కోట్ల కేటాయింపులు దక్కాయి. గతేడాది బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.2,514 కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.714 కోట్ల తగ్గించారు. కాగా.. జిల్లావ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్ల కోసం మొత్తం రూ.4252.53 కోట్లు కేటాయించగా... మక్తల్– పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి పెద్దపీట వేశారు. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉమ్మ డి జిల్లావాసుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. లక్ష్యం కొండంత.. నిధులు అరకొర ఉమ్మడి జిల్లాకు ఆశాదీపంగా ఉన్న పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తిచేసేందుకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. మరో 20 నెలల్లో ప్రాజెక్ట్ పనులు పూర్తిచేసి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని చెబుతోంది. అయితే ఈ మేరకు నిర్మాణం పూర్తి కావాలంటే ఇంకా కనీసం రూ.22 వేల కోట్లు అవసరమని ప్రభుత్వమే చెబుతోంది. ఈ లెక్కన ప్రాజెక్ట్ను గడువులోగా పూర్తి చేయాలంటే ఈ బడ్జెట్లోనే సింహభాగం నిధులు అవసరం. కానీ, ఇందుకు బదులుగా కేవలం రూ.1,800 కోట్లే కేటాయించడంతో పనుల పురోగతిపై నీలినీడలు అలుముకొన్నాయి. రూ.20 వేల కోట్లకుపైగా నిధులు అవసరం ఉంటే ఇంత తక్కువ కేటాయించడంపై సాగునీటి రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి చేయడం కష్టమేనన్న భావన నెలకొంది. -
అభివృద్ధికి పెద్దపీట..
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసింది. పేద ప్రజల కోసం ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఏర్పాటు చేయడం శుభ పరిణామం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యం. – వాకిటి శ్రీహరి, రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి ప్రజా.. ప్రగతి బడ్జెట్ సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభు త్వం సామాన్యుడి కలలను సాకారం చేసే ప్రజా ప్రగతి బడ్జెట్ ఇది. గత పాలకుల ఆడంబరాలకు భిన్నంగా, క్షేత్రస్థాయిలో ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా 6 గ్యారంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించారు. ఇది అన్నివర్గాలకు అమోదయోగ్యమైన బడ్జెట్. – డా. చిట్టెం పర్ణికారెడ్డి, ఎమ్మెల్యే, నారాయణపేట అన్నివర్గాలకు సమ ప్రాధాన్యం.. మా ప్రభుత్వానిది జనరంజక బడ్జెట్. గతంలో ఏ ప్రభుత్వాలు చేపట్టని విధంగా అన్నివర్గాలకు సమ ప్రాధాన్యతనిచ్చింది. బడ్జెట్ కేటాయింపులతో ప్రజలు ఆనందంగా ఉన్నా రు. – ప్రశాంత్కుమార్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంక్షేమానికి నిధులు పెంచాల్సింది.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భట్టి బడ్జెట్ నో గ్యారంటీలా ఉంది. ఆరు గ్యారంటీలు, ఎన్నికల మ్యానిఫెస్టోలోని 420 హామీల్లో పది శాతం అమలు చేయలేని పరిస్థితి. బడ్జెట్లో విద్య, వైద్యం, వ్యవసాయరంగాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి నిధులు పెంచాల్సి ఉండింది. ప్రజాసంక్షేమం, అభివృద్ధికి నోచుకోలేని బడ్జెట్ ఇది. – ఎస్.రాజేందర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ● -
పక్కాగా పంటల నమోదు
నారాయణపేటశుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026నర్వ: జిల్లా రైతులు యాసంగిలో సాగు చేసిన పంట వివరాల నమోదుకు వ్యవసాయశాఖ డిజిటల్ క్రాప్ ద్వారా సర్వే చేపడుతోంది. వలంటీర్లు ఫిబ్రవరి 27 నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల సాగు వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా యాసంగి సాగు వివరాల నమోదుకు ఆన్లైన్ సర్వే ప్రారంభించారు. ఈసారి సర్వేకు ప్రత్యేకంగా వలంటీర్లను నియమించగా.. ఒక్కొక్కరు గరిష్టంగా 3,550 సర్వేనంబర్ల వరకు చేపడుతున్నారు. ఎక్కువ నంబర్లు ఉన్న గ్రామాలు, పటాలు లేని గ్రామాలు, భూముల హద్దుల లేనిచోట ఏఈఓలు సర్వే చేస్తున్నారు. 45 రోజుల్లో సర్వే పూర్తి చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సేకరించిన పంట వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు ఆన్లైన్ రైతు పోర్టల్లో నమోదు చేస్తున్నారు. యువతకు తాత్కాలిక ఉపాధి.. వలంటీర్లుగా విద్యావంతులైన గ్రామీణ యువతకు ప్రాధానమిచ్చారు. స్మార్ట్ఫోన్ వినియోగంపై అవగాహన ఉండి కనీసం పదోతరగతి చదివిన వారికి అవకాశం కల్పించారు. గ్రామంలోని భూములు, సాంకేతికతపై అవహహాన ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. వారు క్షేత్రస్థాయికి వెళ్లి 50 మీటర్ల రేడియస్ నుంచి సర్వేనంబర్ల వారీగా పంటల నమోదు చేస్తున్నారు. వీరికి ఫొటోకు రూ.7 చొప్పున పారితోషికం అందిస్తారు. శాటిలైట్ మ్యాపింగ్ లేని గ్రామాల్లో మాత్రం ఏఈఓలు పంటల నమోదు చేస్తారు. జిల్లాలో ఇలా.. గ్రామాలు 280 మండలాలు 13ఏఈఓ క్లస్టర్లు 77 రెవెన్యూ గ్రామాలు 239 సర్వేలో పాల్గొనాల్సిన వలంటీర్లు232ఇప్పటి వరకు పాల్గొన్న వలంటీర్లు206నమోదు చేయాల్సిన సర్వేనంబర్లు 4,40,506ఇప్పటి వరకు నమోదు చేసింది92,88021.4%పూర్తయిన శాతంరెండేళ్లుగా పత్తి సాగుకే మొగ్గు.. గతేడాది పత్తికి అధిక డిమాండ్ ఉండటంతో ఈ ఏడాది కూడా రైతులు వానాకాలం, యాసంగిలోనూ అదే పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. అలాగే నీటివసతి ఉన్న ప్రాంతాల్లో వరి సాగవుతుంది. ప్రభుత్వం వరికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించి మద్దతు ధర చెల్లిస్తుండటంతో సాగుకు సిద్ధమవుతున్నారు. వీటితోపాటు పప్పు ధాన్యాలైన కంది సాగుకు కొందరు రైతులు మొగ్గు చూపుతున్నారు. అలాగే నూనెగింజల సాగును పెంచాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించి రైతులను ప్రోత్సహిస్తుండటంతో ఆసక్తి కలిగిన రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రయోజనాలు ఇలా.. జిల్లాలో 77 ఏఈఓ క్లస్టర్లుండగా 4,40,506 సర్వే నంబర్లలో వివిధ రకాల పంటలు సాగుచేస్తున్నారు. వలంటీర్లు, ఏఈఓలు స్మార్ట్ఫోన్ యాప్లో తెలంగాణ భూనక్ష కడస్ట్రాల్ మ్యాప్ను అనుసంధానించి ఉపగ్రహ సాంకేతికతతో అక్షాంశాలు, రేఖాంశాలు, ధరణి చిత్రపటాల ఆధారంగా పంటలు, వాటి వివరాల నమోదు చేయాలి. యాప్లో 50 మీటర్ల పరిధిలోని సర్వేనంబర్లు మాత్రమే కనిపిస్తాయి. దీంతో నమోదు చేసే వారు తప్పనిసరిగా రైతు క్షేత్రానికి వెళ్లాల్సిందే. పొలాలకు వెళ్లి భూ నక్ష మ్యాప్ ఆన్చేసి రైతు పేరు భూ విస్తీరణం, ఆధార్, గ్రామం, గతంలో, ప్రస్తుతం సాగుచేసిన పంట రకం, పెట్టుబడి, చీడపీడలు, నష్టం, ఎరువుల వాడకం, పంట ఫొటోతో సహా యాప్లో అప్లోడ్ చేయాలి. ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయినప్పుడు ఈ వివరాలతో పరిహారం చెల్లింపు, బీమా అమలు, రాయితీల కల్పన తదితరాలు సులువు అవుతాయి. వివరాల నమోదులో కచ్చితత్వంతో ఉత్పత్తుల విక్రయంలో రైతులకు ఇబ్బందులు ఉండవు. నేల స్వభావం, సాగునీటి లభ్యత, గతంలోని చీడపీడలు, వాతావరణం, దిగుబడి తదితరాల అధారంగా వచ్చే సీజన్లో ఏ పంటలు సాగుచేయాలో సూచిస్తారు. చీడపీడల నివారణకు మందుల రూపకల్పన, నూతన వంగడాల ఆవశ్యకత, శాస్త్రవేత్తల ప్రయోగాలకు మార్గదర్శనంగా ఉండనుంది. జిల్లాలో కొనసాగుతున్న యాసంగి డిజిటల్ సర్వే ఈ ఏడాది వలంటీర్లతో.. గరిష్టంగా 3,550 సర్వేనంబర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాల నమోదు 45 రోజుల్లో పూర్తిచేయడమే లక్ష్యంగా.. గ్రామ పటాలు లేనిచోట ఏఈఓలతో.. -
రామలింగేశ్వరస్వామికి విశేషాలంకరణ
అడ్డాకుల: ఉగాది పండుగ, తెలుగు కొత్త సంవత్సరం ఆరంభం సందర్భంగా కందూర్ సమీపంలో స్వయంభూగా వెలిసిన శ్రీరామలింగేశ్వరస్వామికి గురువారం విశేషాలంకరణ చేశారు. స్వామివారి శివలింగాన్ని పూలు, పండ్లతో అందంగా అలంకరణ చేశారు. ఆలయంలో స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి గంటకు పైగా సమయం పట్టడం భక్తుల రద్దీని సూచిస్తోంది. ఆలయం వద్ద జాతర కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. మట్టి కుండలు, గాజుల దుకాణాలు, మిఠాయి షాపుల వద్ద రద్దీ కనిపించింది. ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు. -
వ్యాధుల బారిన పడుతున్నాం..
మరికల్కు సంబంధించిన డంపింగ్ యార్డు ఇబ్రహీంపట్నం శివారులో ఉండటంతో కలుషిత నీరు, ద్వురావాసనతో గ్రామస్తులు వ్యాధుల బారినపడుతున్నారు. దీంతోపాటు గ్రామంలో సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలు, అర్హులకు పింఛన్లు తదితర సమస్యలను మండల సమవేశాలు లేక ఎవరికి చెప్పకోవాలో తెలియడం లేదు. – నాగరాణి, సర్పంచ్, ఇబ్రహీంపట్నం, మరికల్ మండలం అవగాహన పెరుగుతుంది.. మండల సమావేశాలు ఏర్పాటు చేస్తే గ్రామాలు అభివృద్ధి ఎలా చేయాలనే అంశంలో నూతన సర్పంచులకు అవగాహన పెరుగుతుంది. అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు సర్పంచులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. – వెంకటయ్య, సర్పంచ్, మాచన్పల్లి, మహబూబ్నగర్ రూరల్ మండలం -
ప్రభుత్వ విప్గా యెన్నం
● మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డికి అవకాశం ● ఉమ్మడి జిల్లాకు మరో కీలక పదవి సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డికి ప్రభుత్వ విప్గా అవకాశం దక్కింది. ఈమేరకు గురువారం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉత్తర్వులు జారీచేశారు. ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ ఎమ్మెల్యేకు కీలకమైన విప్ పదవి వరించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కాగా, మంత్రులుగా జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలకు అవకాశం దక్కింది. ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జి.చిన్నారెడ్డి ఉన్నారు. తాజాగా మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డికి ప్రభుత్వ విప్గా అవకాశం రావడంతో ఆయన సైతం కేబినెట్ సత్సమాన ర్యాంకులో వ్యవహరించనున్నారు. 2012 ఉప ఎన్నికలో యెన్నం మహబూబ్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ హయాంలో ఇద్దరికి.. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పాలనలో ఇద్దరు మంత్రులతో పాటు మరో ఇద్దరు ప్రభుత్వ విప్లుగా వ్యవహరించారు. బీఆర్ఎస్ హయాంలో గతంలో మంత్రులుగా శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డితో పాటు ప్రభుత్వ విప్లుగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, గువ్వల బాలరాజు వ్యవహరించారు. 2016లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కూచుకుళ్ల అనంతరం బీఆర్ఎస్లో చేరారు. 2019లో బీఆర్ఎస్ ఆయనకు ప్రభుత్వ విప్గా అవకాశం కల్పించింది. -
పేటలో ఏప్రిల్ 3న హిందూ సమ్మేళనం
నారాయణపేట రూరల్: జిల్లాకేంద్రంలోని సింగార్బేస్ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో ఏప్రిల్ 3న సాయంత్రం 6 గంటలకు హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు హిందూ సమ్మేళన కార్యక్రమ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు గుంపు బాలరాజు తెలిపారు. గురువారం కార్యక్రమ నిర్వహణపై కమిటీ సభ్యులు పట్టణంలో ప్రత్యేక సమావేశమయ్యారు. పట్టణంలోని పది ఉప బస్తీల నుంచి ఆధ్యాత్మిక భజన సంకీర్తనలతో కాలినడకన హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో ముందుగా యజ్ఞ కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు, వక్త సందేశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో హిందువులు అధికసంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటాలని కోరారు. అంతకుముందు ఆత్మీయ హిందూ సమ్మేళన కార్యవర్గాన్ని పాలమూరు జిల్లా సహ కార్యవాహ మ్యాడం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గుంపు బాలరాజు, ఉపాధ్యక్షులుగా దత్తు చిల్లాల్, రాజ్కుమార్ దోత్రే, వినోద్, విజయలక్ష్మి, కొండోళ్ల రాములు, కార్యదర్శిగా యశ్వంత్, సహ కారదర్శులుగా ఉదయ్కుమార్, చిన్న రఘు, కిరణ్, మరికొందరిని సభ్యులుగా ఎన్నుకున్నారు. -
ఉగాది సంబురం
● ఆలయాల్లో ప్రత్యేక పూజలు..పంచాంగ శ్రవణాలు ● వ్యవసాయ పనులు ప్రారంభించిన అన్నదాతలు నారాయణపేట: జిల్లా ప్రజలు గురువారం శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సాయంత్రం పంచాంగ శ్రవణం నిర్వహించారు. పండుగ సందర్భంగా ఇళ్ల లోగిళ్లను మామిడి తోరణాలతో అలంకరించారు. కొత్త దుస్తులు ధరించి ఆలయాలను దర్శించుకున్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు ఆలయాల్లో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. జిల్లాకేంద్రంలోని పరిమళాపురం రాఘవేంద్రస్వామి ఆలయం, శక్తిపీఠంలో వ్యవస్థాపకుడు డా. ఊట్కూర్ శాంతానంద్ పురోహిత్, శివలింగేశ్వర ఆలయంలో వీరశైవ సమాజ్ ఆధ్వర్యంలో శివకుమార్స్వామి పంచాంగ శ్రావణం చేశారు. కొత్త సంవత్సరంలో కాలగణన, రాశిఫలాలు, వ్యవసాయ ఫలితాలను వివరించారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో రైతులు వ్యవసాయ సామగ్రి, ఎద్దులకు ప్రత్యేక పూజలు చేసి సాగు పనులు ప్రారంభించారు. శక్తిపీఠంలో ఉగాది పురస్కారాలు.. జిల్లాకేంద్రంలోని శక్తిపీఠంలో ఉన్న శారదాంబ కల్యాణ మండపంలో గురువారం ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ, సంగీత, చిత్రకారులు, నృత్యం తదితర రంగాల్లో సేవలందించిన వారిని గుర్తించి ఉగాది పురస్కారాలు అందజేసి సన్మానించారు. పురస్కారాలు అందుకున్న వారిలో ప్రముఖ అధ్యాత్మిక, సామాజిక, రాజకీయవేత్త కృష్ణాకు చెందిన అమర్ దీక్షిత్, మక్తల్కు చెందిన ప్రముఖ నాట్యాచారుడు హరతి గోపాలచార్య, ప్రముఖ అధ్యాత్మికవేత్త కరణం రాఘవేంద్రచార్య, ప్రముఖ సినీ సీరియల్ నటుడు చింతచెట్టు నారాయణరెడ్డి, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు పవన్శేషు, ప్రముఖ చిత్రకారుడు నీమ్కర్ రమేష్ ఉన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. -
కురుమూర్తిస్వామి ఆశీస్సులు ఉండాలి
చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి ఆశీస్సులు రాష్ట ప్రజలపైన ఎల్లప్పుడు ఉండాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి ఆకాంక్షించారు. గురువారం ఆయన చిన్నచింతకుంట మండలం అమ్మాపురం కురుమూర్తి స్వామిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన పంచాంగ శ్రావణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కురుమూర్తిస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేశారని వివరించారు. స్వామి వారి ఆశీస్సులు ముఖ్యమంత్రి, రాష్ట ప్రజలపైన ఉండాలన్నారు. కార్యక్రమంలోఅరవింద్కుమార్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, మార్కెట్ చైర్మన్లు ప్రశాంత్కుమార్, కథలప్ప, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నరేందర్రెడ్డి, రాఘవేందర్రెడ్డి, సర్పంచ్ రంజిత్, తదితరులు పాల్గొన్నారు. -
మరింత ప్రగతి సాధించాలి..
జిల్లా ప్రజలకు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి డా.వాకిటి శ్రీహరి శ్రీపరాభవ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది మన వారసత్వపు పండుగ అని.. ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు, కళలు జాతిని సజీవంగా నిలుపుతాయన్నారు. రైతన్నల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని.. వ్యవసాయరంగ అభివృద్ధితో అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిమైందన్నారు. జీవితం కష్టసుఖాల సమ్మేళనమని.. ఉగాది పచ్చడి షడ్రుచుల మాదిరిగానే జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తూ, ముందుకు సాగాలన్నారు. శ్రీపరాభవ నామ సంవత్సరంలో తెలంగాణతో పాటు దేశం మరింత ప్రగతి సాధించాలని మంత్రి కాంక్షించారు. పాడిపంటలతో కళకళలాడాలి పరాభవ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు నింపాలని, పాడిపంటలతో కళకళలాడాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకాంక్షించారు. బుధవారం ఆయన జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలకు ఉగాది పండుగ ఎంతో విశిష్టమైనదన్నారు. పండుగ రోజున షడ్రుచులు స్వీకరించడం, దైవంతో భక్తి చాటడం చెప్పుకోదగ్గ విశేషమన్నారు. ప్రతి ఒక్కరి భవిష్యత్లో వివరించే పంచాంగం ఇదే రోజు వెలువరించడం ఈ పండుగ ప్రత్యేకత అన్నారు. కొత్త సంవత్సరంలో జిల్లా అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని.. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలని ఆయన కాంక్షించారు. -
సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం
కోస్గి రూరల్: సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కడా చైర్మన్ వెంకట్రెడ్డి అన్నారు. జాతీయ ఆహార భద్రత మిషన్ 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం కోస్గి పట్టణంలోని ఓ ఫంక్షన్హల్లో నిర్వహించిన మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్లో మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్, ఏడీఏ రామకృష్ణ తదితరులతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సిరిధాన్యాల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రైతులు లాభదాయక పంటల సాగుపై దృష్టిసారించాలని సూచించారు. సిరిధాన్యాల సాగుతో రైతులకు అధిక లాభాలు రావడంతో పాటు మానవళికి పోషకాలతో కూడిన ఆహారం అందుతుందన్నారు. అనంతరం రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, ఇతర సిరిధాన్యాలతో తయారుచేసిన ఆహార పదార్థాలను ప్రదర్శించి.. రైతులందరికీ వాటి రుచి చూయించారు. వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతకుముందు మున్సిపల్ కార్యాలయం నుంచి శివాజీ చౌరస్తా వరకు ఎడ్లబండిపై ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమా లు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమా ర్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, మద్దూర్ మున్సిపల్ చైర్పర్సన్ దీల్లికర్ సరస్వతీ జనార్దన్, ఏఓ రేష్మారెడ్డి, కొత్తపల్లి రమేశ్, మండల అధ్యక్షుడు రఘువర్ధన్రెడ్డి, కౌన్సిలర్ భానునాయక్, మాస్టర్ శ్రీనివాస్, ఓంప్రకాశ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు సుధాకర్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ భీములు పాల్గొన్నారు. -
షడ్రుచుల ఉగాది
నారాయణపేట● నేడు తెలుగువారి తొలి పండుగ ● శ్రీపరాభవ నామ సంవత్సరానికి స్వాగతం ● ఆలయాల్లో పంచాంగ పఠనానికి ఏర్పాట్లు ● సాగు పనులకు శ్రీకారం చుట్టనున్న రైతులు గురువారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2026నారాయణపేట: తెలుగువారి తొలి పండుగ ఉగాదిని జిల్లావ్యాప్తంగా గురువారం ఆనందోత్సాహాలతో నిర్వహించుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. శ్రీవిశ్వావసు నామ సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. శ్రీపరాభవ నామ సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. పండుగ రోజున సంప్రదాయబద్ధంగా ఆలయాలను సందర్శించి.. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం పంచాంగ పఠనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఉగాది పచ్చడికి అవసరమైన మట్టికుండలు, మామిడికాయలు, బెల్లం, వేపపూత, కొత్త చింతపండు, మామిడి తోరణాల విక్రయాలతో మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. పంచాంగ శ్రవణం.. ఉగాది పర్వదినాన దేవాలయాలు లేదా ఇంట్లో పంచాంగం వినడం ద్వారా రాబోయే కాలంలో జరగబోయే శుభ, అశుభాలను తెలుసుకునేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఉగాది.. అన్ని రంగాల్లో శుభాలను చేకూరుస్తుందని ప్రజల నమ్మకం. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన ప్రజలు జిల్లావ్యాప్తంగా ఉండటంతో.. ప్రఽ దానంగా దాతే, సు ర్పూర్, గంటల పంచాంగం, అశ్లీ, ముక్తేశ్వరి, బెంగళూర్ వా రి దార్వాడ్, ఒంటి కొప్పల్, సోలాపూర్ పంచాంగాలను వేద పండితులు వివరించనున్నారు. శక్తిపీఠం ఆధ్వర్యంలో పురస్కారాలు.. జిల్లా కేంద్రంలోని శ్రీసంత్ మఠమూల మహాసంస్థానం శక్తిపీఠం ఆథ్వరంలో స్వామీజీ డా.శాంతానంద్ పూరోహిత్ ప్రతి ఏడాది పెద్ద ఎత్తున సామూహికంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. సమాజంలో ఆధ్యాత్మిక, సామాజిక, సేవా రంగాల్లో విశేష కృషి చేసినవారిని గుర్తించి.. శక్తిపీఠం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు అందిస్తున్నారు. ఉగాది పర్వదినాన సనాతన ధర్మం, భారతీయత, తెలుగుదనాన్ని సంరక్షించే దిశలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేసి.. కళాకారులను సన్మానించి ప్రోత్సహిస్తారు. -
మతసామరస్యాన్ని చాటాలి : ఎస్పీ
నారాయణపేట: ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ఎంతో విశిష్టమైనదని.. అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఎస్పీ డా.వినీత్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జామా మసీదు, హజికన్పేట్ మసీదు వద్ద ఏర్పాటుచేసిన ఇఫ్తార్లో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. జిల్లా ప్రజలందరూ కుల, మతాలకు అతీతంగా సోదరభావంతో పండుగలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, సీఐ శివశంకర్, కౌన్సిలర్ రవికుమార్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు అమీర్రుద్దీన్, దస్తగిరి చాంద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేశ్ గౌడ్, తఖీ పాల్గొన్నారు. అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. జిల్లా ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు ఎస్పీ డాక్టర్ వినీత్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో తీపి, చేదు, కష్టాలు, సుఖాలు సహజమని, వాటిని సమానంగా స్వీకరించి ముందుకు సాగాలని సూచించారు. జిల్లా ప్రజలు శాంతి భద్రతలను పాటిస్తూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరఫున బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
హిందూ ముస్లింలుసోదరభావంతో మెలగాలి
కొత్తపల్లి (మద్దూరు): మున్సిపల్ పట్టణ పరిధిలోని రెనివట్ల గ్రామంలోని జామియా మసీద్లో మున్సిపల్ వైస్ చైర్మన్ భాగ్యశ్రీ శంకర్ రెడ్డి ముస్లింలకు ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. రంజాన్ను పురస్కరించుకొని బుధవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ఉపవాస దీక్షను విరమింపజేశారు. అనంతరం మాట్లాడుతూ హిందూ ముస్లింలు సోదరభావంతో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, 9వ వార్డు కౌన్సిలర్ మహిమూద్, మహేందర్ రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
క్రైస్తవుల భూముల విషయమై ఫిర్యాదు
మక్తల్: పట్టణంలోని క్రైస్తవుల భూములు కొనుగోలు చేసిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్న ప్రసాద్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎంబీ ఫీల్డ్ అసోసియేషన్ చైర్మన్ క్రిష్టఫర్ మీసా కోరారు. ఈ మేరకు బుధవారం కమిషనర్, తహసీల్దార్, సీఐకు వినతిపత్రం అందజేశారు. సదరు భూమిలో 2012లో వందకు పైగా ప్లాట్లను పలువురికి విక్రయించారని, కొనుగోలు చేసిన స్థలాల్లో కొందరు ఇళ్లు, దుకాణాలు కూడా నిర్మించుకున్నారన్నారు. అయితే ఆ భూములపై ప్రస్తుతం ప్రసాద్ అనే వ్యక్తి లేని పోని అపోహలను సృష్టిస్తూ భూములు కొనుగోలు చేసిన వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. అతడిని ఎవరు నమ్మొద్దని కోరారు. ఉడిమిళ్లలోగుప్తనిధులతవ్వకాలు అమ్రాబాద్: పదర మండలం ఉడిమిళ్ల సమీపంలోని వినాయకగుడి మాన్యంలోగల చిన్న వినాయకుడి విగ్రహం ఎదుట గుప్తనిధుల తవ్వకాలు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలసి కొంతమంది స్థానికులు ఈ నెల 13న రాత్రి గుడి ఎదుట జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా అటవీశాఖ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది పరారుకాగా పెబ్బేరుకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించి వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎఫ్ఆర్ఓ వీరేష్గౌడ్ను వివరణ కోరగా తవ్వకాలు రెవెన్యూ భూమిలో ఉండటం వల్ల గ్రామ పంచాయతీ దృష్టికి విషయం తీసుకెళ్లామన్నారు. స్థానికులు ఉండటంతో గ్రామపెద్దల ఒత్తిడితో కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
ఆటో, కారు ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు
మరికల్: ఆటోను వెనక నుంచి కారు ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయలైన ఘటన పట్టణ శివారులోని రైల్వేబ్రిడ్జి దగ్గర బుధవారం చోటుచేసుకుంది. ఆటో మరికల్లో ప్రయాణికులను ఎక్కించుకొని జిన్నారానికి వెళ్తుండగా రైల్వే బ్రిడ్జి సమీపంలో వెనకాల నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోయింది. డ్రైవర్ వాజీద్, ఆటోల్లో ఉన్న కృష్ణమ్మ అనే ప్రయాణికురాలు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. నిధులు మంజూరు చేయడం అభినందనీయం ఊట్కూర్: మండలంలో సీసీ రోడ్ల ఏర్పాటుకు ఎంపీ డీకే అరుణ రూ. 54 లక్షలు మంజూరు చేయడం హర్షనీయమని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఊట్కూర్కు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షలు, వల్లంపల్లి గ్రామానికి రూ.5 లక్షలు, పెద్దజట్రం గ్రామానికి రూ.5 లక్షలు, లక్ష్మిపల్లి గ్రామానికి రూ.5 లక్షలు, పెద్దపొర్ల గ్రామానికి రూ.5 లక్షలు, కొత్తపల్లి గ్రామానికి రూ.5 లక్షలు, బిజ్వార్ గ్రామానికి రూ.5 లక్షలు, ముగ్దుంపూర్ గ్రామానికి రూ.5 లక్షలు మొత్తం రూ.45 లక్షలు మంజూరు చేశారన్నారు. ఆయా గ్రామాల సర్పంచులు వెంటనే పనులను ప్రారంభించి నాణ్యతతో సీసీ రోడ్లు వేయాలని కోరారు. సమావేశంలో సర్పంచ్లు వాకిటి వెంకటేష్, అర్జున్కుమార్, నాయకులు కిరన్, బాలాంజనేయులు, శ్రీకాంత్రెడ్డి, అశోక్గౌడ్ పాల్గొన్నారు. ఆడబిడ్డల తల్లులకు వరం ‘కల్యాణలక్ష్మి’ దామరగిద్ద: ఆడబిడ్డలు అంటే భారం కాదు వరమని తెలిసేందుకు ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాలను అమలు చేస్తుందని ఏఎంసీ చైర్మన్ సదాశివరెడ్డి, సర్పంచ్ కన్కిరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తిరుపతయ్య సమక్షంలో లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని అన్ని గ్రామాల పరిధిలో 207 మందికి చెక్కులను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కన్కిరెడ్డి, విండో మాజీ అద్యక్షుడు ఈదప్ప మండల పార్టీ అద్యక్షుడు బాల్రెడ్డి, వెంకట్రామరెడ్డి, ఖాజా, రఘు, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. నేటి నుంచి మన్యంకొండలో వసంత నవరాత్రి ఉత్సవాలు మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఈనెల 19 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి అభిషేకాలు, నూతన వస్త్రాలంకరణలు నిర్వహించనుండగా, మధ్యాహ్నం 11 గంటలకు పంచాంగ శ్రవణం నిర్వంచనున్నారు. రాత్రి స్వామివారికి నిర్వహించే ప్రత్యేక సేవలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించనున్నారు. ఈనెల 23, 24వ తేదీల్లో సుందరకాండ పారాయణం ప్రత్యేకంగా చేపట్టనున్నారు. 28న శ్రీరామ నవమి సందర్భంగా స్వామివారికి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం అఖండ భజన ప్రారంభమవుతుంది. ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కటాక్షాన్ని పొందాలని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు కోరారు. -
బస్టాండ్లో వృద్ధురాలు మృతి
మరికల్: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ధన్వాడకు చెందిన లలిత (65) భర్త ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి మరికల్లో యాచిస్తూ బస్టాండ్లోనే ఉండేది. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు. జూరాల కాల్వలోకి దూసుకెళ్లిన కారు వనపర్తి రూరల్: పెబ్బేరు పట్టణ శివారులోని జూరాల కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటన బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మహబూబ్నగర్ చెందిన షకీల్ కారులో పెబ్బేరు మండలంలోని సూగూరుకు వస్తుండగా మార్గ మధ్యలో పెబ్బేరు శివారులోని జూరాల కాల్వ వద్ద బైక్ అడ్డు రావడంతో వాహనం అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. కారులో ఉన్న షకీల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారు వెనుక అద్దాలు పగులగొట్టి బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. -
ఇఫ్తార్ 6–34 ( గురువారం సాయంత్రం)
సహర్ 5–00 (శుక్రవారం తెల్లవారుజామున) ఉద్యాన పంటల సాగుపై దృష్టి పెట్టాలి మరికల్: రైతులు ఉద్యాన పంటలను సాగు చేసేందుకు ముందుకు రావాలని సర్పంచ్ కల్యాణి, ఉద్యాన శాఖ అధికారి లింగారాజ్ అన్నారు. మండలంలోని అప్పంపల్లిలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేసిన కూరగాయల విత్తనాలను సర్పంచ్ రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి మార్గదర్శకాల మేరకు ఉద్యాన సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాలే దామోందర్రెడ్డి, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు దామోందర్రెడ్డిలు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ పనుల్లో వేగం పెంచండి
● మూడు నెలల్లో నిర్మాణం పూర్తికావాలి ● కలెక్టర్ ప్రతీక్ జైన్ నారాయణపేట: జిల్లా కేంద్రం సమీపంలో రూ. 55కోట్లతో చేపట్టిన కలెక్టరేట్ సముదాయం నిర్మాణ పనుల్లో వేగం పెంచి.. త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్ జైన్.. ప్రస్తుత కలెక్టరేట్ నుంచి నేరుగా కొత్త భవన సముదాయం వద్దకు వెళ్లి నిర్మాణ పనులను పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన భవన నిర్మాణం పురోగతిని ఆర్అండ్బీ అధికారులతో తెలుసుకున్నారు. కలెక్టరేట్ భవన సముదాయం వెంటనే నిర్మాణం పూర్తి చేయడంతో పాటు రోడ్లు, ఇతర పనులను వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మూడు నెలల్లోగా పనులన్నీ పూర్తిచేయాలన్నారు. అయితే ప్రధాన రహదారి నుంచి కలెక్టరేట్ భవన సముదాయం వరకు మొర్రం మట్టి చదును చేయాల్సి ఉందని ఆర్అండ్బీ ఈఈ వెంకటరమణ కలెక్టర్కు తెలిపారు. కాగా, కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్ జైన్ను అదనపు కలెక్టర్ ఫణీందర్రెడ్డి, ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్, కలెక్టరేట్ ఏఓ శ్రీధర్తో పాటు జిల్లా అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి.. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు ప్రాధాన్యతనిస్తూ.. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి.. పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. -
‘రైతు భరోసా’ ఏకకాలంలో చెల్లించాలి
నారాయణపేట: యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఏకకాలంలో చెల్లించాలని ఏఐయూకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.యాదగిరి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఏఓ శ్రీధర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం సకాలంలో రైతు భరోసా అందించకపోవడంతో రైతులు పంట పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. యాసంగి సీజన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని విడతల వారీగా విడుదల చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విడతలు పూర్తి కావడానికి పుణ్యకాలం గడిచి.. మళ్లీ వానాకాలం పంటల సాగు మొదలవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో రైతుభరోసా చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. కేంద్ర వ్యవసాయ ధరల నిర్ణయ కమిషన్ కేవలం ధరలు నిర్ణయించి.. చేతులు దులుపుకోవడం వరకే పరిమితమవుతందని విమర్శించారు. కార్యక్రమంలో ఏఐయూకేఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నారెడ్డి, కృష్ణయ్య, కొండ నర్సింహులు, బి.నారాయణ, బాలకృష్ణ, ఎ.రాములు, సిరిదస్తప్ప, ఎడ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.


