‘మాస్టర్‌ ప్లాన్‌’ మారేనా..? | - | Sakshi
Sakshi News home page

‘మాస్టర్‌ ప్లాన్‌’ మారేనా..?

Mar 2 2026 8:41 AM | Updated on Mar 2 2026 8:41 AM

‘మాస్

‘మాస్టర్‌ ప్లాన్‌’ మారేనా..?

పట్టణం విస్తరిస్తున్నా..

పట్టణం విస్తరిస్తున్నా మాస్టర్‌ ప్లాన్‌ పాతదే కొనసాగుతోంది. 20 ఏళ్ల కిందట ఇండస్ట్రియల్‌ జోన్‌గా ఉన్న ప్రాంతం నేడు రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ భవనాలు నిర్మించే పరిస్థితి నెలకొంది. దీంతో మున్సిపాలిలీకి సైతం ఆదాయం తగ్గుతుంది. మాస్టర్‌ ప్లాన్‌ మార్చితే నారాయణపేట రూపురేఖలు మారుతాయి. – పీవీ సాగర్‌,

పుర లైసెన్స్‌డ్‌ ఇంజినీర్‌, నారాయణపేట

రివైజ్డ్‌ చేయొచ్చు..

పేట పురపాలిక మాస్టర్‌ ప్లాన్‌ను రివైజ్డ్‌ చేసుకోవచ్చు. గతంలో శాటిలైట్‌ ద్వారా సర్వే చేశారు. పుర పాలకవర్గం తీర్మానం చేసి పంపితే పూర్తిస్థాయిలో నిబంధనలతో మాస్టర్‌ ప్లాన్‌ రూపుదిద్దుకొని ప్రజల ముందుకు తీసుకురావచ్చు. – గజానంద్‌,

ఆర్‌డీ, టౌన్‌ప్లానింగ్‌, హైదరాబాద్‌

నారాయణపేట: పాలకులు, ప్రభుత్వాలు మారుతున్న పట్టణ రూపురేఖలు మార్చాలనే తపన కనిపించడం లేదా. సీఎం ఇలాఖాగా చెప్పుకొంటున్న జి ల్లాలోని నాలుగు పురపాలికల్లో మాస్టర్‌ ప్లాన్‌లు అధికారులు, పాలకులకు గుర్తుకురావడం లేదా అనే సందేహాలు నగరవాసుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

23 ఏళ్లు గడిచినా..

నారాయణపేట 1945లో నగరపంచాయితీగా ఏర్పాటైంది. జీఓఎంఎస్‌ నంబర్‌ 487 మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ 06.11.2002లో మాస్టర్‌ప్లాన్‌ను అమలులోకి తీసుకొచ్చారు. 23 ఏళ్లుగా అదే మాస్టర్‌ప్లాన్‌ అమలవుతోంది. పట్టణంలోని బాహర్‌పేట, సరాఫ్‌బజార్‌, బ్రహ్మణ్‌వాడి, కుమ్మరివాడి, కలాల్‌వాడి, పళ్ల, హజీఖాన్‌పేట తదితర వీధులు ఇరుకుగా ఉండి ఇబ్బందులు తప్పడం లేదు. గృహ నిర్మాణాలు 1745.79 ఎకరాలు, కమర్షియల్‌ కోసం 51.35 ఎకరాలు, ఇండస్ట్రీయల్‌కు 210.89 ఎకరాలు, పబ్లిక్‌ అండ్‌ సెమీపబ్లిక్‌ యూజ్‌కు 250.46 ఎకరాలు, పార్క్‌లు, ప్లేగ్రౌండ్స్‌కు 88.35 ఎకరాలు, పబ్లిక్‌ యూటిలిటీ (నీరు, విద్యుత్‌ సరఫరా), గ్రేవ్స్‌కు 19.38 ఎకరాలు, ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ కమ్యూనికేషన్‌కు 8.16 ఎకరాలు, రోడ్లు 410.63 ఎకరాలు, వాటర్‌ కోర్సేస్‌ 61.46, హిల్‌లాక్స్‌ 37.92 ఎకరాలు మొత్తం ప్లానింగ్‌ ఏరియా 2,889.15 ఎకరాలు, అర్బన్‌ యూజబుల్‌ ల్యాండ్‌ 1677.29 ఎకరాలు మొత్తం 4566.44 ఎకరాలు (18.48 చదరపు కిలోమీటర్లు) మాస్టర్‌ ప్లాన్‌లో చూపించారు. ప్రస్తుతం కొలువుదీరిన పాలకవర్గం కొత్త మాస్టర్‌ప్లాన్‌పై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.

● 2019, ఫిబ్రవరి 17న అప్పటి సీఎం కేసీఆర్‌ జన్మదిన కానుకగా నారాయణపేట జిల్లా ఏర్పాటైంది. ఢిల్లీకి చెందిన డీడీఎఫ్‌ కన్సలెన్సీ మార్చి 1, 2019న పుర మాస్టర్‌ప్లాన్‌లో కాస్త మార్పుచేర్పులు చేస్తూ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. నాటి ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డితో పాటు కలెక్టర్‌గా పదోన్నతిపై వచ్చిన ఎస్‌.వెంకట్‌రావు మొదటి సమావేశంలో పాల్గొని గ్రేడ్‌–3లో ఉన్నప్పుడు శాటిలైట్‌ ద్వారా సేకరించిన మాస్లర్‌ప్లాన్‌ వద్దని.. జిల్లాకేంద్రంతో పాటు గ్రేడ్‌–2 మున్సిపాలిటీగా మారిందని, భవిష్యత్‌ తరాలకు విద్య, ఆరోగ్యం, ఇండస్ట్రీయల్‌, రింగ్‌ రోడ్‌ తదితర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించాలని వారితో పాటు నాటి మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులు, వ్యాపారులు, ప్రజల ముక్తకంఠంతో వ్యతిరేకించారు. తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన డా. చిట్టెం పర్ణికారెడ్డి సైతం ఈ విషయంపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. జిల్లాకేంద్రంలో 2011లో 41,752 జనాభా ఉండగా.. ప్రస్తుతం సుమారు 55 వేలకు చేరింది. పెరుగుతున్న జనాభా దృష్ట్యా పట్టణం విస్తరించాల్సి ఉంది.

ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నా..

నారాయణపేటలో పాత మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం ఇండస్ట్రియల్‌, పబ్లిక్‌, సెమీ పబ్లిక్‌ ప్రాంతాల్లో సైతం భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇండస్ట్రియల్‌ జోన్‌లో 50 శాతం గృహ నిర్మాణాలు కొనసాగడం.. అనుమతుల కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి పదేళ్లకోసారి మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాల్సి ఉంటుంది. కానీ గత పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో 2002 నుంచి ఉన్న మాస్టర్‌ప్లాన్‌నే కొనసాగిస్తున్నారు. దీంతో కొత్త ఇళ్ల నిర్మాణాలు చేపడదామనుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

కోస్గి, మక్తల్‌, మద్దూరులో..

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో కోస్గి, మక్తల్‌లో పలు గ్రామాలను విలీనం చేస్తూ మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో 2023, డిసెంబర్‌లో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చింది. కొడంగల్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మద్దూర్‌ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. అటు సీఎం ఇలాఖాలోని మద్దూర్‌, కోస్గి.. ఇటు మంత్రి ఇలాఖాలోని మక్తల్‌లో కొత్త మాస్టర్‌ ప్లాన్‌ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

పేట పురపాలికలో 2002లో రూపకల్పన

23 ఏళ్లుగా అదే కొనసాగింపు

డీడీఎఫ్‌ కన్సల్టెన్సీ సవరణలు చేసి మార్చి 1తో ఏడేళ్లు

మక్తల్‌, కోస్గి, మద్దూర్‌లోసైతం అదే తీరు

ఆదాయానికి భారీగా గండి..

మాస్టర్‌ ప్లాన్‌ మారకపోవడంతో పేట మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండి పడుతోందని చెప్పవచ్చు. సెంటర్‌చౌక్‌ బజార్‌, సరాఫ్‌ బజార్‌, కొత్తబస్టాండ్‌, సత్యనారాయణ చౌరస్తాలో రోడ్డుకు ఇరువైపులా వాణిజ్య సముదాయ భవనాలు నిర్మించబడ్డాయి. యాద్గిర్‌ రోడ్‌లో సత్యనారాయణచౌరస్తా నుంచి ఎర్రగుట్ట సమీపం వరకు ఎడమవైపు భాగంలో 210 ఎకరాల వరకు కేటాయిస్తూ అప్పట్లో ఇండస్ట్రియల్‌ జోన్‌గా మాస్టర్‌ప్లాన్‌లో చూయించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో నివాస, వాణిజ్య వ్యాపార సముదాయాలు నిర్మిస్తున్నారు. కోస్గి, మక్తల్‌, మద్దూర్‌ మున్సిపాలిటీల్లో సైతం ఇండస్ట్రియల్‌ ఏరియా పెరుగుతుండటంతో అక్కడ సైతం ఆదాయానికి భారీగా గండిపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

‘మాస్టర్‌ ప్లాన్‌’ మారేనా..? 1
1/3

‘మాస్టర్‌ ప్లాన్‌’ మారేనా..?

‘మాస్టర్‌ ప్లాన్‌’ మారేనా..? 2
2/3

‘మాస్టర్‌ ప్లాన్‌’ మారేనా..?

‘మాస్టర్‌ ప్లాన్‌’ మారేనా..? 3
3/3

‘మాస్టర్‌ ప్లాన్‌’ మారేనా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement