నర్వ.. ప్రగతి బావుటా
నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్కు ఎంపికతో మహర్దశ
సౌరశక్తి ఆధారిత వంటశాల..
సంపూర్ణ అభియాన్ ద్వారా ఆరు విభాగాల్లో చేపట్టిన పనులపై గతేడాది డిసెంబర్ 27న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ ప్రాంతంలో పర్యటించి కేంద్రానికి నివేదిక అందించారు. ఇందుకు యాస్పిరేషన్ బ్లాక్ ప్రగతి కోసం నర్వ కేజీబీవీలో సౌరశక్తి ఆధారిత వంటశాల (సోలార్ ఫర్ హెల్తీ రినివబుల్ అండ్ ఈకో ఫ్రెండ్లీ ఈటింగ్) స్థాపన కోసం రూ.62.15 లక్షలు మంజూరు చేసింది. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద మొదటి విడతగా రూ.15,53,750 మంజూరు చేశారు. ఈ నిధులతోపాటు పీఎంశ్రీ పెద్దకడ్మూర్ ఉన్నత పాఠశాల, మండల ప్రాథమిక పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, ప్రాథమిక పాఠశాలల్లో ఏఎక్స్ఎల్ డిజిటల్ ల్యాబ్ల ఏర్పాటు కోసం రూ.58,13,070 మంజూరు చేశారు. దీంతోపాటు 6 నెలలుగా నర్వ మండలంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపించి రూ.8 లక్షలు విడుదల చేయించి అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు కూర్చునేందుకు ప్రీ స్కూల్ బల్లలు, కుర్చీలు, గోడలపై పేయింటింగ్స్, మ్యాపులు, మంకీ బార్స్, బెడ్షీట్స్ వంటి పరికరాలను మండలంలోని 33 అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేశారు. దీంతోపాటు మోడల్ అంగన్వాడీ కేంద్రాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
నర్వ: దేశంలో అత్యంత వెనకబడిన ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసేందుకు నీతి ఆయోగ్ జూలై 4, 2022న సంపూర్ణ అభియాన్ అనే ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి గాను దేశంలో 500 వెనకబడిన ప్రాంతాలను గుర్తించగా.. ఉమ్మడి పాలమూరులోని జోగుళాంబ గద్వాల జిల్లాలో గట్టు మండలం, నారాయణపేట జిల్లాలో నర్వ మండలాన్ని ఎంపిక చేసింది. ఇందులో సమగ్ర అభివృద్ధి సాధించేలా.. ఆరోగ్యం, పోషణ, విద్య, పారిశుద్ధ్యం, నీటి వసతి, వ్యవసాయం వంటి ఆరు ముఖ్యమైన సూచికలపై దృష్టిసారించింది. ఈ మేరకు మొదటి మూడు నెలలపాటు చేపట్టిన న్యూట్రీషణ్ (పోషణ), అగ్రికల్చర్ (వ్యవసాయం), విద్య (ఎడ్యుకేషన్, నీటి వసతి, సోషల్ సెక్టార్) విభాగాల్లో మెరుగైన పనితీరుపై ఇటీవల జాతీయ స్థాయిలో ర్యాంకింగ్ విడుదల చేశారు. ఇందులో జాతీయ స్థాయిలో దక్షిణ భారతదేశంలో ప్రథమ స్థానం, మొత్తం జాతీయ స్థాయిలో నర్వ మండలం యాస్పిరేషన్ బ్లాక్ 3వ ర్యాంకు సాధించినట్లు అధికారులు గణంకాలు విడుదల చేశారు. అలాగే దేశవ్యాప్తంగా నీటి కొరతతో అల్లాడుతున్న అనేక ప్రాంతాలకు నర్వ బ్లాక్ దిక్సూచిగా నిలిచింది. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన వాటర్ బడ్జెటింగ్ ఇన్ యాస్పిరేషనల్ బ్లాక్స్ నివేదికలో నర్వ బ్లాక్ పనితీరుపై ప్రశంసలు కురిపించింది.
2024–25లో యాస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమానికి ఎన్నిక
ఆరు విభాగాల్లో
ఉత్తమ పనితీరుపై ప్రశంసలు
దక్షిణ భారతంలో ప్రథమ, జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు
కేంద్ర ప్రభుత్వం నుంచి సమకూరనున్న మరిన్ని నిధులు
నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎంపికై న 10 జిల్లాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ గతేడాది డిసెంబర్లో పర్యటించారు. ఈ సందర్భంగా నర్వ మండలంలోని రాయికోడ్లో డిసెంబర్ 27న పర్యటించి సంపూర్ణ అభియాన్ ద్వారా అమలవుతున్న పథకాలను లబ్ధిదారులు, చిన్నారులను అడిగి తెలుసుకొని కేంద్రానికి నివేదిక అందించారు. దీంతో జాతీయ స్థాయిలో నర్వ మండలానికి అభివృద్ధి పరంగా ప్రత్యేక నిధులు రాబట్టేందుకు ఈ కార్యక్రమం దోహదపడింది.


