పచ్చదనానికి అడుగులు..
వన మహోత్సవాన్ని విజయవంతం చేసేలా ప్రణాళిక
● నర్సరీల్లో మొక్కల పెంపకానికి చర్యలు
● 272 గ్రామపంచాయతీల్లో ప్రారంభమైన పనులు
నర్వ: రగామాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు వీబీజీ రాంజీ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ప్రతి గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో కవర్లలో మట్టి నింపే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షాకాలంలో నిర్వహించే వన మహోత్సవంలో నాటేందుకు మొక్కలను సిద్ధం చేస్తున్నారు. గతేడాది చిన్న గ్రామపంచాయతీల్లో 3 నుంచి 5 వేలు, పెద్ద గ్రామపంచాయతీల్లో 10 వేల మొక్కలు నాటారు. కానీ కొన్ని నర్సరీల్లో నామమాత్రపు పనులు చేపట్టి వదిలేయడంతో నిర్వహణ కొరవడి మొక్కలు ఎండిపోయాయి. ఈ ఏడాది నిబంధనలు మారుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది కనీసం 5 వేల మొక్కలకు తగ్గకుండా పెంచాలని నిర్ణయించారు.
సమన్వయం కొరవడి..
నర్సరీల నిర్వహణ, కూలీలకు వేతనాల చెల్లింపునకు ప్రభుత్వాలు రూ.కోట్లు వెచ్చిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ కొరవడి లక్ష్యం ఆదిలోనే దెబ్బతింటోంది. ఓ వైపు వీబీజీ రాంజీ అధికారులు మొక్కలు నాటుతుండగా.. మరోవైపు ట్రాన్స్కో అధికారులు పెరిగిన మొక్కలను యథేచ్ఛగా తొలగిస్తున్నారు. విద్యుత్ తీగల కింద ముందుచూపు లేకుండా నాటడం కూడా తప్పిదమే. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తుగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను ఎంపిక చేస్తే సత్ఫలితాలు వస్తాయి.
అడవుల శాతం పెంచేందుకు
రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఇందులో భాగంగా పల్లె వనాలుగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ఊరికో నర్సరీ సత్ఫలితాలిస్తోంది. ఈ ఏడాది కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు నిర్ణయించి ప్రత్యేక ప్రణాళిక రూపొదించారు. పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధిహామీ పథకం సంయుక్తంగా నిర్వహిస్తున్న నర్సరీల్లో మొక్కలు పెంచి నిర్ణీత ప్రాంతాల్లో నాటేందుకు వివిధ శాఖలకు బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది లక్ష్యాన్ని ఖరారు చేసుకొని షేడ్నెట్లను ఏర్పాటు చేసి మొక్కలు సంరక్షిస్తున్నారు.


