breaking news
Narayanpet District Latest News
-
మెడికల్ సీట్లు పెరిగే అవకాశం?
పాలమూరు: తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మొదటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను పాలమూరులోనే ఏర్పాటు చేశారు. 2016లో 150 ఎంబీబీఎస్ సీట్లతో మొదలైన కళాశాల ప్రస్తుతం 175 సీట్లతో కొనసాగుతోంది. పదేళ్ల కాలంలో నాలుగు ఎంబీబీఎస్ బ్యాచ్లు కోర్సు పూర్తి చేసుకొని బయటకు వెళ్లాయి. ఒక్కో బ్యాచ్లో 150 విద్యార్థుల చొప్పున 600 మంది విద్యార్థులు పూర్తి చేసుకున్నారు. అలాగే కళాశాలలో 34 పీజీ సీట్లు ఉండటం విశేషం. తాజాగా మరో 25 సీట్లు పెంచడానికి శనివారం పాలమూరు మెడికల్ కళాశాలను, జనరల్ ఆస్పత్రిని ఎన్ఎంసీ(జాతీయ మెడికల్ కౌన్సిల్) బృందం సభ్యులు డాక్టర్ మల్లిఖార్జున్, డాక్టర్ అనిల్ బాబు సందర్శించారు. ఉదయం వారు మెడికల్ కళాశాలకు వెళ్లి స్థానికంగా బోధకుల సంఖ్య, పరిపాలన సిబ్బంది, తరగతి గదులు, ఇతర వసతులపై ఆరా తీశారు. అక్కడి నుంచి జనరల్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో రోజు వారీగా వచ్చే ఓపీ రోగులు, ఐపీ రోగుల సంఖ్య, క్యాజువాలిటీ, అన్ని రకాల ఆపరేషన్ థియేటర్స్, వార్డులు, ఐసీయూ, మాతా శిశు విభాగం ఇలా ప్రతి వార్డును సందర్శించి స్థానికంగా ఉన్న వసతులపై నివేదిక తయారు చేశారు. ఎన్ఎంసీ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా సీట్ల పెంపు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఎన్ఎంసీ పర్యటన పూర్తయిన నేపథ్యంలో పాలమూరు మెడికల్ కళాశాల అధికారులు ఈ నెల 28 వరకు 200 ఎంబీబీఎస్ సీట్లు ఏర్పాటు చేయాలనే అంశంపై ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్ఎంసీ ఈ ప్రతిపాదనలు పరిశీలించి మరోసారి పర్యటిస్తారా? లేదా ఆన్లైన్లో అనుమతులు మంజూరు చేస్తారా? అనేది ఈ నెల చివరి నాటికి తెలుస్తుంది. ఎన్ఎంసీ బృందం వెంట కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేష్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరా పాల్గొన్నారు. 150 సీట్లతో 2016లో పాలమూరు ప్రభుత్వ కళాశాల ప్రారంభం ఇప్పటి వరకు నాలుగు ఎంబీబీఎస్ బ్యాచ్లు పూర్తి తాజాగా 25 సీట్ల కేటాయింపు కోసంఎన్ఎంసీ బృందం పర్యటన -
వేరుశనగ క్వింటా రూ.9,500
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో శనివారం వేరుశనగ క్వింటాకు గరిష్టంగా రూ. 9,500, కనిష్టంగా రూ. 5,050 ధర పలికింది. అలసందలు గరిష్టంగా రూ. 6,195, కనిష్టంగా రూ. 4,809, వడ్లు (సోన) గరిష్టంగా రూ. 2,669, కనిష్టంగా రూ. 2,040, ఎర్రకందులు గరిష్టంగా రూ. 8,209, కనిష్టంగా రూ. 6,452, తెల్లకందులు గరిష్టంగా రూ. 8,361, కనిష్టంగా రూ. 6,336 ధరలు వచ్చాయి. మున్సిపాలిటీలకు ఇన్చార్జిల నియామకం సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీలకు బీఆర్ఎస్ ఇన్చార్జిలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం నియమించారు. మహబూబ్నగర్ కార్పొరేషన్ ఇన్చార్జిగా ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, భూత్పూర్ మున్సిపాలిటీకి ఏఎంసీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, దేవరకద్రకు మాజీ చైర్మన్ పల్లె రవి, కొత్తకోటకు పార్టీ సీనియర్ నేత పటేల్ విష్ణువర్ధన్రెడ్డిలను నియమించారు. అలాగే జోగుళాంబ జిల్లా పరిధిలోని గద్వాల మున్సిపాలిటీ ఇన్చార్జిగా శాట్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, అలంపూర్, అయిజ, వడ్డేపల్లి మున్సిపాలిటీల ఇన్చార్జిగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి నియామకం అయ్యారు. నాగర్కర్నూల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఇన్చార్జిగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కల్వకుర్తి మున్సిపాలిటీకి రాజీవ్సాగర్, కొల్లాపూర్ మున్సిపాలిటీకి ఉప్పల వెంకటేష్గుప్తాలను నియమించారు. -
మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
మద్దూరు: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ శ్రీను అన్నారు. మద్దూరు మున్సిపాలిటీలోని 16 వార్డులకు నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ సామగ్రి పంపిణీ, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయంలోనే 6 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని.. ఇందుకోసం పాత, కొత్త భవనాలను ఉపయోగించుకోవాలని కమిషనర్ శ్రీకాంత్ను ఆదేశించారు. అదే విధంగా ఎన్నికల సామగ్రి పంపిణీ, కౌంటింగ్ కేంద్రాలను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం జూనియర్ కళాశాల భవనాన్ని అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ మహేశ్గౌడ్ ఉన్నారు. ముంబై మారథాన్లో డీఎస్పీకి పతకాలు నారాయణపేట: ముంబై మారథాన్ 2026లో జిల్లా నుంచి పాల్గొన్న డీసీఆర్బీ డీఎస్పీ మహేశ్ అత్యుత్తమ ప్రతిభకనబరిచారు. టాటా ముంబై మారథాన్ (42.197 కి.మీ.) లాంగ్ రన్లో ఆయన పాల్గొని ఉత్తమ టైమింగ్ (5 గంటల 21 నిమిషాలు 30 సెకండ్లు)తో మారథాన్ విజయవంతంగా పూర్తిచేసి రెండు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డా.వినీత్ ఆయనను మెడల్స్తో సత్కరించి అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు విధులతో పాటు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, పట్టుదలతో క్రీడల్లోనూ అత్యుత్తమ ప్రతిభకనబరచడం డీఎస్పీ మహేశ్ ప్రత్యేకత అని అన్నారు. ఆయన సాధించిన విజయం యువత, పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అదే విధంగా డీఎస్పీ నల్లపు లింగయ్య డీసీఆర్బీ డీఎస్పీ మహేశ్కు శుభాకాంక్షలు తెలిపారు. అనాథలకు బాలసదన్ ఓ ఇల్లు: ఎంపీ మహబూబ్నగర్ రూరల్: మహిళల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని ఎంపీ డీకే అరుణ అన్నారు. మహబూబ్నగర్ మెట్టుగడ్డలోని స్టేట్హోమ్ ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.34 కోట్ల నిధులతో బాలికల కోసం నూతనంగా నిర్మించిన బాలసదన్ భవనాన్ని ఎంపీ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బేటీ బచావో– బేటీ పడావో పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పిల్లలకు నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. అనాథ పిల్లలకు బాలసదన్ ఒక ఇంటిలా మారుతుందని, ఇక్కడ వారికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా బాలికలు పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని, బాలసదన్ల ద్వారా వారికి సమతుల్యమైన ఆహారం, ఆరోగ్య పరీక్షలు, విద్య అందిస్తూ భవిష్యత్కు బలమైన పునాది వేస్తున్నామని అన్నారు. అనాథ పిల్లల దత్తత ప్రక్రియను సక్రమంగా నిర్వహిస్తూ వారికి కొత్త కుటుంబాలు లభించేలా కృషి చేస్తున్న జిల్లా సంక్షేమశాఖ సిబ్బందిని ఎంపీ అభినందించారు. తల్లిదండ్రులు లేని పిల్లలను గుర్తించి బాలసదన్లో చేర్చి, వారికి ఆహారం, ఆరోగ్యం, విద్య అందించి వారి స్వర్ణ భవిష్యత్కు బాటలు వేయాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మాట్లాడుతూ బాలసదన్లోని పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా అన్ని విధాలుగా సంరక్షణ అందించాలని ఆదేశించారు. అనంతరం జాతీ య బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపీ డీకే అరుణ బాలసదన్ పిల్లలతో కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, జిల్లా సంక్షేమశాఖ అధికారి జరీనాబేగం, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ రామచంద్రం, శిశుగృహ మేనేజర్ గణేష్బాబు, బీజేపీ జాతీయ కౌన్సిల్మెంబర్ పద్మజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అచ్చంపేటలో మోస్ట్ వాంటెడ్..
ఆంధ్ర, ఒడిశా, చత్తీస్ఘడ్ సరిహద్దుల్లో కీలకంగా పనిచేస్తున్న దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు, కేంద్ర మిలటరీ కమిటీ సభ్యుడిగా ఉన్న మీసాల సాలోమాన్తోపాటు ఆయన భార్య సన్బట్టిని పోలీసులు అచ్చంపేటలో అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన సాలోమాన్ 32 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. కేంద్ర మిలటరీ కమిటీ సభ్యుడిగా అగ్రనేతలు తిప్పరి తిరుపతి, దేవ్జీ, హిడ్మా వంటి వారితో పనిచేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సంచరిస్తూ అక్కడి మావోయిస్టు దళాలకు గెరిల్లా యుద్ధ విద్యల్లో శిక్షణ ఇస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆయన భార్య సైతం దండకారణ్యం డీవీసీఎం కేడర్, పీఎల్జీ బెటాలియన్ సభ్యురాలిగా కీలకంగా పనిచేస్తున్నారు. ఈ దంపతులు దండకారణ్యాన్ని వదిలి నల్లమల ప్రాంతానికి చేరుకోవడం.. ఈ క్రమంలోనే అరెస్ట్ కావడం స్థానికంగా అలజడి సృష్టించింది. -
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు
● వేసవిలో ఎక్కడా నీటి ఎద్దడి ఏర్పడొద్దు ● కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. తాగునీటి వేసవి ప్రణాళికపై శనివారం కలెక్టరేట్లో డీఆర్డీఓ, డీపీఓ, మిషన్ భగీరథ అధికారులు, ఎంపీడీఓలు, ఏఈలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని గ్రామాల వారీగా తాగునీటి సమస్యలను గుర్తించి, వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మండలస్థాయిలో ఎంపీడీఓలు, మిషన్ భగీరథ ఏఈలతో కమిటీ వేసి వచ్చే నెల 1 నుంచి 20 వరకు గ్రామాల్లో తాగునీటి సరఫరా సక్రమంగా జరుగుతుందా.. లేదా అనేది పరిశీలించాలన్నారు. సమస్య ఉన్న చోట స్థానికంగా ఉన్న నీటి వనరులను వినియోగించుకోవాలని సూచించారు. మద్దూరు, కొత్తపల్లి, గుండుమల్, కోస్గి మండలాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కడా నుంచి నిధులు తెచ్చుకోవాలని తెలిపారు. అన్ని గ్రామాల్లో తాగునీటి పైపులైన్ల మరమ్మతు ఇతర పనులకు పంచాయతీ నిధులు లేదా జనరల్ ఫండ్, ఎస్ఎఫ్సీ నిధులు వినియోగించుకోవాలని సూచించారు. వేసవిలో ఏ ఒక్క పంచాయతీలో తాగునీటి సమస్య ఉందనే ఫిర్యాదులు రావొద్దన్నారు. కాగా, జలశక్తి అభియాన్ అమలు తీరు జిల్లాలో సంతృప్తిగా లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇతర జిల్లాలతో పోలిస్తే నారాయణపేట 31వ స్థానంలో ఉందని, వచ్చే నెల వరకు జిల్లా ర్యాంకింగ్ పెంచాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ మొగులప్ప, డీపీఓ సుధాకర్రెడ్డి, మిషన్ భగీరథ ఎస్ఈ జగన్మోహన్, ఈఈలు రంగారావు, శ్రీనివాస్ ఉన్నారు. ● ఆలిండియా సర్వీసెస్ మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ విలేజ్ విసిట్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలుపై సోషల్ ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ స్కీం సర్వే నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎంపికచేసిన ఊట్కూర్, దామరగిద్ద, నారాయణపేట మండలం సింగారం, మద్దూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీల్లో ఆలిండియా సర్వీసెస్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ బృందం సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా 29 నుంచి 31వ తేదీ వరకు నారాయణపేట మున్సిపాలిటీలోని నాలుగు వార్డుల్లో సర్వే చేయనున్నట్లు పేర్కొన్నారు. సర్వేకు నోడల్ అధికారిగా డీఆర్డీఓ మొగులప్ప వ్యవహరిస్తారన్నారు. బాలికా సాధికారత సాధిద్దాం.. జిల్లాలో బాలికా సాధికారత సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్లో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాలికా విద్యకు ప్రాధాన్యత ఇచ్చి.. వారిని అన్నివిధాలుగా ప్రోత్సహించాలన్నారు. బాల్యవివాహ రహిత జిల్లాగా నారాయణపేటను మార్చాలని కోరారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జిల్లా ఇన్చార్జి సంక్షేమశాఖ అధికారి రాజేందర్గౌడ్, డీపీఆర్ఓ రషీద్, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ నర్సింహులు, జెండర్ స్పెషలిస్టులు అనిత, నర్సింహ, ఇన్చార్జి డీసీపీ కరిష్మా, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ నర్సింహులు, తిరుపతయ్య, వెంకట్, సాయి పాల్గొన్నారు. -
యముడి వేషంతో వినూత్న ప్రచారం
జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని పోలీసుశాఖ చేపట్టిన అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం నారాయణపేట పోలీసులు వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. హోంగార్డు లింగం యముడు వేషధారణ ధరించి.. వాహనదారులకు హెల్మెట్ ధరించడం, డ్రంకెన్ డ్రైవ్ నివారణ, సీట్ బెల్టు వినియోగం, ట్రిపుల్ రైడింగ్, డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ వినియోగం, రాష్ డ్రైవింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కళాత్మకంగా, భావోద్వేగంగా అందించిన సందేశం ప్రజల మనసుల్లో బలమైన ప్రభావం చూపిందని పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. – నారాయణపేట -
నల్లమలలో అలజడి
కలకలం రేపిన మవోయిస్టుల అరెస్టు సాక్షి, నాగర్కర్నూల్: దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమాలు, తుపాకీ చప్పుళ్లతో దద్దరిల్లిన నల్లమల మరోసారి ఉలిక్కిపడింది. నల్లమలకే చెందిన ముగ్గురు మావోయిస్టు సానుభూతిపరులతోపాటు ఇద్దరు మావోయిస్టు కీలక నేతలను అచ్చంపేటలో అరెస్ట్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. నల్లమలలో సుమారు 20 ఏళ్లుగా మావోయిస్టు కార్యకలాపాలు తెరమరుగు పడుతూ రాగా.. తాజాగా మావోయిస్టుల అరెస్ట్ నేపథ్యంలో మళ్లీ అలజడి సృష్టించింది. ఆంధ్ర, ఒడిశా, చత్తీస్ఘడ్ సరిహద్దు, దండకారణ్యంలో కేంద్ర బలగాల ముమ్మర కూంబింగ్, వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో అక్కడి నుంచి మావోయిస్టులు ఆశ్రయం కోసం నల్లమల ప్రాంతానికి చేరుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే వీరు ఆశ్రయం కోసమే వచ్చారా.. లేక ఈ ప్రాంతంలో మావోయిస్టు పునరుజ్జీవం కోసం ప్రయత్నం చేస్తున్నారా.. అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిశిత పరిశీలన.. మావోయిస్టు పార్టీలో కీలక నేతలకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు అన్నిరకాలుగా మద్దతుగా నిలుస్తున్నట్టుగా నల్లమల ప్రాంతానికి చెందిన వ్యక్తులపై పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే పౌరహక్కుల నేతలు, మాజీ మావోయిస్టులు, ప్రజా సంఘాల నేతలపై పోలీసులు నిఘా ఉంచి నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే నల్లమల ప్రాంతంలోని పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎడ్ల అంబయ్య ఇప్పటికే పలుమార్లు చత్తీస్ఘడ్ వెళ్లి మావోయిస్టులతో సంప్రదింపులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. ఆయన తెలంగాణ ప్రజాఫ్రంట్ కో కన్వీనర్గా పనిచేస్తున్నారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్కు చెందిన జక్క బాలయ్య పౌర హక్కుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. స్థానికంగా పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. అలాగే లింగాల మండలం క్యాంపురాయవరం గ్రామానికి చెందిన మన్శెట్టి యాదయ్య గతంలో మావోయిస్టుగా పనిచేసి పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం వ్యవసాయం చేస్తూ గ్రామంలో ఉంటున్నాడు. నల్లమల ప్రాంతానికే చెందిన ఈ ముగ్గురు అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి పాలమూరులో.. రెండు దశాబ్దాల కిందట నల్లమల దళం కేంద్రంగా ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమం ఉధృతంగా సాగింది. అనేక మెరుపుదాడులు, ఎన్కౌంటర్లు, పరస్పర దాడులకు ఉమ్మడి జిల్లా సాక్ష్యంగా నిలిచింది. నాగర్కర్నూల్ జిల్లా సోమశిల సమీపంలో 1993 నవంబర్ 13న పోలీసులు ప్రయాణిస్తున్న బస్సుపై మావోయిస్టులు దాడి చేయడంతో ఏకంగా ఎస్పీ పరదేశినాయుడితో పాటు ఇద్దరు ఎస్ఐలు, ఆరుగురు పోలీసులు మరణించారు. అలాగే 2005 ఆగస్టు 15న ధన్వాడలో అప్పటి ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డిపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఆయన మృతి చెందారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మావోయిస్టుల ప్రాబల్యం తీవ్రస్థాయిలో కొనసాగింది. తాజాగా మావోయిస్టుల అరెస్ట్ నేపథ్యంలో మళ్లీ అలజడి రేగింది. ఉమ్మడి జిల్లాలో మళ్లీ మవోయిస్టు పార్టీ పునరుజ్జీవం కోసం ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా ముమ్మరంగా విచారణ చేపడుతున్నారు. అచ్చంపేటలో కేంద్ర మిలటరీ కమిటీ సభ్యుడు సాలోమాన్తో పాటుమరో ముగ్గురు స్థానికులు అదుపులోకి.. ఆశ్రయం కోసం వచ్చారా.. పునరుజ్జీవం చేసేందుకా? ఉమ్మడి జిల్లాలో బలోపేతానికియత్నించినట్లు పోలీసుల వెల్లడి -
బాలికల సంరక్షణ అందరి బాధ్యత
నారాయణపేట రూరల్: రాబోయే రోజుల్లో భవిష్యత్ అంతా బాలికలదేనని.. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కోర్టు జూనియర్ సివిల్జడ్జి బి.సాయిమనోజ్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయ బాలికా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బేటీ బచావో.. బేటీ పడావో వంటి ప్రభుత్వ పథకాలు బాలికల రక్షణ, విద్యకు ఎంతగానో తోడ్పడుతున్నాయన్నారు. బాలికల ఉజ్వల భవిష్యత్కు కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు సహకరించాల్సిన అవసరముందన్నారు. బాలికలకు విద్య, ఆరోగ్యం, సాధికారత అందించడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి సిద్ధంగా ఉండేలా చేయవచ్చని అన్నారు. అనంతరం బాలల సంరక్షణ చట్టాలు, చైల్డ్ హెల్ప్లైన్ 1098 నంబర్పై అవగాహన కల్పించారు. టోల్ఫ్రీ 15100 నంబర్ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కె.లక్ష్మీపతిగౌడ్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నందు నామాజీ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కరిష్మ, చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ నర్సింహ పాల్గొన్నారు. -
ఓటే వజ్రాయుధం..
పగిడ్యాల్లో ‘కృష్ణతాత’ గండేడ్ మండలంలోని పగిడ్యాల్ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన కృష్ణతాత ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. –8లో uహక్కు.. బాధ్యతలపై అవగాహన భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించిన జనవరి 25న ఏటా జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. ఈ ఏడాది 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఓటర్లుగా తమకున్న హక్కులు, బాధ్యతలను ప్రజలకు తెలియజేసేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలతో పాటు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించేందుకు రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
‘పేట’ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం
● పదవులు శాశ్వతం కాదు.. ప్రజాసేవకే ప్రాధాన్యం ● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట: పురపాలికతో పాటు నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల అభివృద్ధి తన బాధ్యతని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం సాయంత్రం పురపాలికలోని 24 వార్డుల్లో రూ.16.40 కోట్ల అభివృద్ధి పనులకు కాంగ్రెస్పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కుంభం శివకుమార్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం సెంటర్చౌక్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జీవితంలో పదవులు శాశ్వతం కాదని.. ప్రజల కోసం చేసే మంచి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. పేటను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని, మైదానం అభివృద్ధికి రూ.30 కోట్లు మంజూరు చేస్తానని చెప్పారు. తనకున్న మిగతా శాఖల నుంచి కూడా రూ.5 కోట్లు కేటాయిస్తానని, ప్రతి వార్డుకు రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే పుర ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించాలని కోరారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టు పూర్తితో జిల్లాకు బిహార్ కూలీలు వలస వచ్చి ఇక్కడి పొలాల్లో నాట్లు వేస్తారన్నారు. 60 ఏళ్ల కల అయిన కృష్ణా–వికారాబాద్ రైల్వేలైన్ కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్రంతో మాట్లాడి మంజూరు చేసుకొచ్చారని, ఇటీవలే క్యాబినెట్లో చర్చించి రూ.423 కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. దేశ చరిత్రలో ముందుగానే 96 శాతం రైతులను ఒప్పించి వారి భూములకు పదింతల నష్టపరిహారం ఇచ్చిన ఘనత రేవంత్రెడ్డికే దక్కుతుందన్నారు. సీఎం, మంత్రుల ఇంట్లో తినే సన్న బియ్యం ఇస్తున్న రాష్ట్రం మనదేనని చెప్పారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సరిత హరినారాయణభట్టడ్ను చైర్పర్సన్ను చేసి ప్రజాసేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. రూ.వంద కోట్లు తీసుకొచ్చి పురపాలికను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సామాజిక సేవకుడిగా పార్టీ కండువా తీసి ఓటు అడిగేందుకు మీ ముందుకు వస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొనంగేరి హన్మంతు, మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు సుధాకర్, బండి వేణుగోపాల్, సరాఫ్ నాగరాజు, కాంగ్రెస్పార్టీ పట్టణ అధ్యకుడు సలీం, పార్టీ పట్టణ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మికులకు రూ.లక్ష రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష చేనేత రుణమాఫీ వర్తింపజేయడంతో అందుకు సంబంధించిన చెక్కులను శుక్రవారం మంత్రి వాకిటి శ్రీహరి, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, కాంగ్రెస్పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కుంభం శివకుమార్రెడ్డి చేనేత కార్మికులకు అందజేశారు. 8 బ్రాంచ్లలో 106 మంది కార్మికులకు సంబంధించి రూ.65,93,854 మంజూరయ్యాయి. చెక్కులు అందుకున్న చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. చేనేత, జౌళిశాఖ అధికారులు విజయ్కుమార్, బాబు, లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
యువజన కాంగ్రెస్ బలోపేతానికి కృషి
నారాయణపేట: రాబోయే రోజుల్లో ఏఐసీసీ అధినేత రాహుల్గాంధీ నేతృత్వంలో దేశంలో కాంగ్రెస్పార్టీ అధికారంలోకి రాబోతుందని.. యువజన కాంగ్రెస్ను మరింత బలోపేతం చేసేందుకు కదం తొక్కాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట్ల మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన యూత్ కాంగ్రెస్ జిల్లా సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్పార్టీ మరింత బలోపేతం కావాలంటే యువత ధైర్యంగా రాజకీయాల్లోకి రావాలని.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే బాధ్యత యూత్ కాంగ్రెస్ నాయకులదేనన్నారు. అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు రానున్న రోజుల్లో ప్రజాప్రతినిధులుగా అవకాశాలు దక్కుతాయని, అందుకు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ యువతకు అధికసంఖ్యలో స్థానాలు కేటాయించిందని.. రానున్న పురపాలిక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తారన్నారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యవర్గాన్ని ప్రకటించారు. అంతకుముందు పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి, పీసీసీ సభ్యులు చిట్టెం అజయ్రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ శివకుమార్రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ విజయ్కుమార్, యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శివంత్రెడ్డి, కోట్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మికులకు రుణమాఫీ వర్తింపు కోస్గి: తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేనేత రుణమాఫీ వర్తింపజేసిందని జిల్లా చేనేత, జౌళిశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాబు, ఏడీఓ లావణ్య తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఉన్ని సహకార సంఘంలో పని చేస్తున్న రెండు సొసైటీలకు రుణమాఫీ చెక్కులను అందజేసి మాట్లాడారు. పోతిరెడ్డిపల్లి సిల్క్ సంఘంలోని 17 మంది సభ్యులకు రూ. 8,24,454 లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. నేడు ఉచిత వైద్య శిబిరం నారాయణపేట రూరల్: జిల్లాకేంద్రంలోని వీరసావర్కర్ చౌరస్తాలో శనివారం మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు ఉచిత చర్మ సంబంధిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మెడికల్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గందె ఉమాకాంత్ తెలిపారు. ప్రముఖ డర్మటాలజిస్ట్ డా. శృతిశ్రీ పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారని చెప్పారు. ఉదయం 11 గంటలకు శ్రీసాయి ఆస్పత్రి దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. -
తాజాగా మల్లు రవి వర్సెస్ విజయుడు..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. అలంపూర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్కు చెందిన విజయుడు ఉన్నారు. అయితే కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు అంతా తానై అధికారం చెలాయిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేనే అయినప్పటికీ అధికారిక కార్యక్రమాలతో పాటు నిత్యం జరుగుతున్న ఇసుక, మట్టి, మొరం, అసైన్డ్ భూముల దందాల్లో చక్రం తిప్పతున్నారు. ఏ పని అయినా ఆయనకు కమీషన్, వాటా ముట్టనిదే ముందుకు కదలడం లేదనే టాక్ ఉంది. తన మాట వినని అధికారులను బెదిరిస్తున్నట్లు ఇటీవల ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ఒక్క నియోజకవర్గమే కాదు.. గద్వాలలో సైతం ఖాకీలు, ఇతర అధికార యంత్రాంగాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని చక్రం తిప్పుతున్నారని.. తనను లెక్కచేయని ఓ జిల్లా స్థాయి అధికారి బదిలీ వెనుక ఆయన ‘హస్తమే’ ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పైపాడులో ఈ నెల 20వ తేదీన ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే విజయుడి మధ్య ప్రొటోకాల్ రగడ చోటుచేసుకుంది. వివిధ అభివృద్ధి పనులకు టెంకాయ కొడుతున్న సమయంలో ఇరువురితో పాటు వారి వారి అనుచరుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఎంపీ మల్లు రవి తోసివేస్తూ దుర్భాషలాడినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్గా మారగా.. రాజకీయ రచ్చకు తెరలేసినట్లయింది. దీనిపై ఎమ్మెల్యే విజయుడిని దూషిస్తూ అవమానం చేసిన ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత న్యూఢిల్లీ వేదికగా మల్లు రవి ‘నేను ఎమ్మెల్యేను తిట్టింది గానీ, కొట్టింది గానీ లేదు. కానీ నేను ఎమ్మెల్యేపై భౌతిక దాడి చేశానని కేటీఆర్ ట్వీట్ చేశారు. తప్పుడు ప్రచారం చేసిన వారు నాకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే నిరాహార దీక్షకు కూర్చుంటా’ అని ప్రతిస్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు గద్వాల జిల్లాలో ఏం జరుగుతోందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
లీడర్ల ‘లడాయి’..!
దూకుడు పాలి‘ట్రిక్స్’ కేరాఫ్ నడిగడ్డ ● ‘ఆధిపత్య’మే హద్దుగాఅసమాన రాజకీయాలు ● అటు అధికార, ప్రతిపక్షాలు.. ఇటు స్వపక్షంలోనే విపక్షం ● నాగర్కర్నూల్ ఎంపీ, అలంపూర్ ఎమ్మెల్యే మధ్య రగడతో మళ్లీ తెరపైకి.. ● హాట్టాపిక్గా ఉమ్మడి జిల్లాలోని పలువురు నేతల వ్యవహార శైలి –IIలో uసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్రంతో పాటు పాలమూరులో విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు గద్వాల, అలంపూర్ పెట్టింది పేరు. ఇటు కృష్ణా, అటు తుంగభద్ర నది మధ్య నడిగడ్డ (జోగుళాంబ గద్వాల)గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఒకవైపు ఏపీ, మరోవైపు కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ నియోజకవర్గాలు రాజకీయ చైతన్యానికి ప్రతీకగా నిలుస్తాయి. ఆధిపత్యమే హద్దుగా అసమాన రాజకీయాలకు కేరాఫ్గా నిలిచిన ఈ జిల్లాలో ఆ ఒరవడి ఇప్పటికీ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాలతో పాటు స్వపక్షంలోని విపక్ష నేతల మధ్య వార్ నడుస్తోంది. ఇటీవల నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి మధ్య ప్రొటోకాల్ చిచ్చు రాజకీయ రగడకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పలువురు లీడర్ల లడాయి, వారి వ్యవహార శైలి హాట్టాపిక్గా మారింది. గద్వాల: పెద్దల వద్దకు ‘వార్డుల’ లొల్లి గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గ పోరు తీవ్రమైంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత మధ్య తొలి నుంచీ ఆధిపత్య యుద్ధం కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో పలు స్థానాల్లో ఆయా వర్గాల మధ్య పోటాపోటీ నడిచింది. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఇరువర్గాలు కసరత్తు మొదలుపెట్టాయి. మున్సిపాలిటీలో మొత్తం 37 వార్డులు ఉండగా.. తమకు 16 వార్డులు కేటాయించాలని ఓ వర్గం వారు పార్టీ ముఖ్య నేతలకు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదని.. లేకుంటే మీ ఇష్టమంటూ మరో వర్గ నేత సమాధానమిచ్చినట్లు సమాచారం. స్వపక్షంలో విపక్షంలా ముదిరిన పంచాయితీ కీలక నేతలను బెంబేలెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ లొల్లి రాష్ట్ర పెద్దల వద్దకు చేరినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. -
రేపు ఉమ్మడి జిల్లా మహిళా క్రికెట్ జట్టు ఎంపిక
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ క్రికెట్ మైదానంలో ఈనెల 25వ తేదీన ఉమ్మడి జిల్లా మహిళా క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలో జరిగే హెచ్సీఏ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలో పాల్గొనే ఉమ్మడి జిల్లా మహిళా క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారిణులు ఆధార్కార్డు, రెండు ఫొటోలతో ఉదయం 10 గంటలకు మైదానంలో రిపోర్టు చేయాలని ఆయన సూచించారు. -
దేశం గర్వించదగ్గ మహానేత నేతాజీ
నారాయణపేట: స్వాతంత్య్ర పోరాటంలో కీలక భూమిక పోషించిన మహానేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతీయులందరికీ ఆదర్శప్రాయుడని ఎస్పీ డా. వినీత్ అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లాకేంద్రంలోని సుభాష్ రోడ్లో ఉన్న ఆయన విగ్రహానికి ఎస్పీ పూలమాల వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేతాజీ చూపిన మార్గంలో పయనించి ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐ శివశంకర్, పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోనంగేరి హన్మంతు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ నాగరాజు, శ్యాంసుందర్గౌడ్, బండి శివరాంరెడ్డి, సిద్ధి వెంకట్రాములు, లక్ష్మీకాంత్, మో హన్, ప్రశాంత్కుమార్, అనుపూర్ సునీల్కుమార్, మన్నె జయప్రకాష్, బండి రాజు, హన్మంతు, గజ్జలి గిరన్న, యువత తదితరులు పాల్గొన్నారు. -
వేరుశనగకు రికార్డు ధర
● బాదేపల్లి, కల్వకుర్తి మార్కెట్లో క్వింటా రూ.10వేలకు పైనే.. ● ఈ సీజన్లో ఇదే అత్యధిక ధర జడ్చర్ల/నారాయణపేట/కల్వకుర్తి రూరల్/దేవరకద్ర: ఉమ్మడి జిల్లాలో తొలిసారిగా క్వింటా వేరుశనగ రూ.10 వేలు దాటింది. శుక్రవారం బాదేపల్లితో పాటు కల్వకుర్తి మార్కెట్లో ఈ ధరలు పలకడం విశేషం. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం క్వింటా కు రూ.411 పెరిగింది. మార్కెట్కు 1,679 క్వింటాళ్ల విక్రయానికి రాగా.. గరిష్టంగా రూ.10,280, కనిష్టంగా రూ.7,560 ధరలు లభించాయి. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.7,263గా ఉంది. గతేడాది కనీసం మద్దతు ధర కూడా లేదని, త్వరలోనే క్వింటా ధర రూ.11 వేలు పలకవచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,752, కనిష్టంగా రూ.2,649, కందులు గరిష్టంగా రూ.7,801, కనిష్టంగా రూ.5,766, మొక్కజొన్న రూ.1,921 ధరలు పలికాయి. కల్వకుర్తి మార్కెట్లో వేరుశనగా గరిష్టంగా రూ.10,200, కనిష్టంగా రూ.9,369 ధర లభించింది. కందులు క్వింటాల్కు రూ.7,009 ధరకు కొనుగోలు చేసినట్లు మార్కెట్ కార్యదర్శి శివరాజ్ తెలిపారు. ● నారాయణపేట మార్కెట్లో వేరుశనగ గరిష్టంగా రూ.8,935, కనిష్టంగా రూ.6,930, ఎర్ర కందులు గరిష్టంగా రూ.8,308, కనిష్టంగా రూ.6,369, తెల్ల కందులు గరిష్టంగా రూ.8,270, కనిష్టంగా రూ.6,422గా దేవరకద్రలో కందులు గరిష్టంగా రూ.7,059, కనిష్టంగా రూ.6,959గా ధరలు నమోదయ్యాయి. -
ఎన్నికల నిర్వహణలో ఆర్ఓల పాత్ర కీలకం
● కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట: పురపాలికల ఎన్నికల నిర్వహణలో ఆర్ఓల పాత్ర కీలకమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నారాయణపేట, మద్దూరు పురపాలికలకు సంబంధించిన ఆర్ఓ, ఏఆర్ఓల శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా వెలువడే అవకాశం ఉందని.. నిర్వహణకు సిద్ధంగా ఉండాలని సూచించారు. శిక్షణలో చెప్పిన అన్ని అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. నామినేషన్ల స్వీకరణ మొదలు స్క్రూటినీ, నామపత్రాల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా, పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల సంఘం నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆదేశించారు. అసెంబ్లీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో పని చేశాం.. అన్ని తెలుసనే ధీమాలో ఉండకుండా మాస్టర్ ట్రైనర్లు చెప్పినవన్నీ శ్రద్ధగా వినాలని, సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలని కోరారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇచ్చిన హ్యాండ్బుక్ను పూర్తిగా చదవాలని, అప్పుడే అన్ని విషయాలపై అవగాహన వస్తుందన్నారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్ నాయక్, డీపీఓ సుధాకర్రెడ్డి, పుర కమిషనర్ నర్సయ్య పాల్గొన్నారు. కలెక్టరేట్లో ఓటరు ప్రతిజ్ఞ.. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్, ఏఓ శ్రీధర్ పాల్గొని జిల్లా అధికారులు, కలెక్టరేట్లోని వివిధ విభాగాల సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. -
ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం
స్టేషన్ మహబూబ్నగర్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ సంస్థ ప్రత్యేక అదనపు బస్సు సర్వీసులను నడిపింది. మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఈ నెల 9 నుంచి 13 వరకు హైదరాబాద్ నుంచి పది డిపోలకు 430 బస్సులు, తిరుగు ప్రయాణంలో ఈ నెల 17 నుంచి 20 వరకు ఆయా డిపోల నుంచి హైదరాబాద్ వైపు 364 బస్సులు నడిపారు. ముఖ్యంగా ప్రయాణికులు హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లాలోని స్వస్థలాలకు వెళ్లడానికి అధికంగా బస్సులు తిప్పారు. వీటిలో సెలవులు ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. అత్యధికంగా 109 శాతం.. మహాలక్ష్మి పథకం కింద ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణంలో జీరో టికెట్ ఉన్నప్పటికీ అందులో వారు తిరిగిన రూట్ ఆధారంగా టికెట్ చార్జీ కూడా పొందుపరిచారు. సాధారణ, మహిళల ఆదాయాన్ని కలుపుకొని సంక్రాంతి పండుగ రోజులకు సంబంధించి ఈ నెల 9 నుంచి 20 వరకు (14, 15, 16 తేదీలు మినహా) మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో అదనపు బస్సు సర్వీసులు నడపగా రూ.22,69,54,338 కోట్ల ఆదాయం వచ్చింది. 9 నుంచి 20 వరకు రీజియన్లోని బస్సులు 34,47,623 కిలోమీటర్లు తిరిగాయి. మహాలక్ష్మి పథకం ప్యాసింజర్లు, టికెట్ చార్జీ ప్రయాణికులతో కలిపి 39,20,918 మంది బస్సుల్లో ప్రయాణించారు. ఆక్యుపెన్షి రేషియాలో మహబూబ్నగర్ రీజియన్ రాష్ట్రంలో అత్యధికంగా 109 శాతం సాధించి అగ్రస్థానంలో నిలవడం విశేషం.డిపో కిలోమీటర్లు ఆదాయం ప్రయాణికులు మహబూబ్నగర్ 5,40,780 3,38,01,857 5,14,321 వనపర్తి 4,57,678 3,09,42,056 5,33,909 గద్వాల 4,06,181 2,46,20,151 4,95,360 అచ్చంపేట 3,34,898 2,44,05,169 3,39,395 కల్వకుర్తి 3,65,956 2,38,98,638 4,23,531 నారాయణపేట 3,66,405 2,37,08,913 3,66,638 షాద్నగర్ 3,18,770 2,24,55,052 4,09,820 నాగర్కర్నూల్ 3,17,478 2,09,87,807 4,39,589 కొల్లాపూర్ 2,71,300 1,81,41,848 3,05,620 కోస్గి 68,177 39,92,947 92,735 ఈ నెల 9 నుంచి 20 వరకు రూ.22 కోట్లు ఆర్జన 34 లక్షల కి.మీ. ప్రయాణం, 39 లక్షల ప్రయాణికుల వినియోగం ఓఆర్లో రాష్ట్రంలోనే మహబూబ్నగర్ రీజియన్ అగ్రస్థానం -
కన్నడతో ప్రయోజనం లేదు..
కన్నడ మీడియం చదవడంతో విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం లేదు. తెలంగాణలో ఉంటూ తెలుగు మీడియానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. తెలుగు మాధ్యమాన్ని ప్రోత్సహించాలి. – నాగప్ప, సర్పంచ్, కృష్ణా రెండో భాషగా తీసుకోవాలి.. ఒకేసారి కన్నడ మీడియం పాఠశాలలను రద్దు చేయడం కుదరదు. మొదట తల్లిదండ్రులు తమ పిల్లలను తెలుగు మీడియంలో చేర్పించాలి. అలాగే కన్నడను రెండోభాషగా తీసుకుంటే ఆ ప్రాంతంలో ఉద్యోగాలు సాధించేందుకు అవకాశం ఉంటుంది. – జనార్దన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ రెండు భాషలు రెండు కళ్లు.. కన్నడ, తెలుగు నాకు రెండు కళ్లలాంటివి. నేను రెండు భాషల విద్యార్థులకు న్యాయం చేస్తా. నేను మొదట కన్నడ మీడియంలోనే చదివి ఉపాధ్యాయుడినయ్యా. పుట్టకముందు నుంచే ఇక్కడ కన్నడ మీడియం పాఠశాలలు ఉన్నాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు సమయంలోనే ఇక్కడి ప్రజల మాతృభాష కన్నడం కావడంతో అప్పట్లో కన్నడ పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ప్రాంత విద్యార్థులకు ఏ ఇబ్బంది వచ్చినా అన్నిరకాలుగా అండగా ఉండి సహాయ సహాకారాలు అందిస్తా. – నిజాముద్దీన్, ఎంఈఓ, కృష్ణా పాఠశాలల అస్థిత్వం కాపాడాలి.. మండలంలో కన్నడ, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఉన్నాయి. పేద ప్రజలకు ఏది ఉపయోగమో వాటినే కొనసాగించాలి. సమాజంలో డబ్బు ఉన్న వారు వారి పిల్లలను ప్రవేటు పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలొ చదివిస్తున్నారు. కేవలం పేద ప్రజల పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారు. వారికి ఉపయోగపడే విధ్యను అందించడం మన కర్తవ్యం.ప్రబుత్వ పాఠశాలలను కాపాడుకోవడంతో పాటూ అస్థిత్వంను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలలు చాల సమస్యలను ఏదుర్కోంటుంది. – శేఖర్, ఉపాధ్యాయుడు, ముడుమాల్ ఇరు రాష్ట్రాలు ఆలోచించాలి.. కన్నడ మీడియం విద్యార్థుల భవిష్యత్ను అటు కర్ణాటక, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కేవలం 10వ తరగతి వరకే కన్నడ మీడియం పాఠశాలలు ఉండటంతో ఉన్నత చదువులకు కర్ణాటకకు వెళ్లాల్సి వస్తోంది. ఈ సమయంలో అక్కడి ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులపై సవతి తల్లి ప్రేమ చూపడం తగదు. అందుకే మన ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి తగిన న్యాయం చేయాలి. – కృష్ణా, జిల్లా ఉపాధ్యక్షుడు, కేఎన్పీఎస్, గుడెబల్లూర్ -
ఎగబడి పోవాలె..!
‘ఆటో’.. ఇటో నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని చెన్నారం, బిజ్జారం గ్రామాల విద్యార్థులకు ఈ ప్రమాదకర ఫీట్లు నిత్యకృత్యంగా మారాయి. ఆయా గ్రామాల విద్యార్థులు సుమారు 60 మంది మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఆ పల్లెలకు బస్సు సౌకర్యం ఉన్నా.. పాఠశాలల సమయానికి రాకపోవడంతో వారికి తిప్పలు తప్పడం లేదు. నాగర్కర్నూల్: 85 గ్రామాలు.. జిల్లాలో మొత్తం 360 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో నాలుగు డిపోలు ఉండగా.. 275 గ్రామాలకు సర్వీసులు నడుస్తుండగా.. మరో 85 పల్లెలకు బస్సు సౌకర్యం లేదు. సుదూర ప్రాంతాల్లోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ప్రధానంగా 50 గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని ఈ విద్యాసంవత్సరంలో ఆర్టీసీకి 16 దరఖాస్తులు రాగా.. 12 గ్రామాలకు పునరుద్ధరించారు. ఇబ్బంది పడుతున్న గ్రామాలు..: మర్రిపల్లి (ఉప్పునుంతల), జమిస్తాపూర్ (నాగర్కర్నూల్), చెన్నంపల్లి, పద్మనపల్లి, కొత్త చెరువు, ఎంసీతండా (లింగాల), మైలారం, లక్ష్మీపల్లి, బాణాల, అంబగిరి, నర్సాయిపల్లి (బల్మూరు), ఖానాపూర్, గుడ్ల నర్వ, నెల్లికొండ (బిజినేపల్లి). జిల్లాలో 423 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో ఒక ఆర్టీసీ డిపో ఉండగా.. దీని పరిధి 45 రూట్లలో బస్సులు నడుస్తున్నాయి. నాలుగు గ్రామాలకు బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. టంకర మినహాయించి మూడు గ్రామాలకు చెందిన వారు బస్సులు నడపాలని విజ్ఞప్తులు చేసినా.. అమలు కాలేదు. ఇబ్బంది పడుతున్న గ్రామాలు..: టంకర, కిష్టారం (హన్వాడ), కొత్తపల్లి (మిడ్జిల్), రామచంద్రపూర్ (మహబూబ్నగర్ రూరల్) ఫీట్లు.. పాట్లునో బస్.. నో సర్వీస్ మహబూబ్నగర్: 4 పల్లెలకు.. ఉమ్మడి జిల్లాలో బస్సు సౌకర్యం లేక విద్యార్థుల అగచాట్లు అనేక గ్రామాల్లో కిక్కిరిసిన ఆటోల్లోనే పాఠశాలలకు.. కొన్నిప్రాంతాల్లో ఎడ్ల బండ్లు, కాలినడకే శరణ్యం నిత్యం కిలోమీటర్ల కొద్దీ ప్రమాదకర ప్రయాణం అరకొరగా ఆర్టీసీ సర్వీస్లు.. సమయానికి రాక.. వచ్చినా ఆపక ఇబ్బందులు పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు -
విద్యార్థులకు సహకారం అందిస్తాం..
కన్నడ మీడియం విద్యార్థులకు కర్ణాటక ప్రభుత్వం నుంచి తమవంతు సహకారం అందిస్తున్నాం. మన విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని అక్కడి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. రిజర్వేషన్లు, ఉద్యోగాలు ఇప్పించేందుకు ఎలాంటి అధికారం లేదు. – నాగభూషణ్, నాయకుడు, గడినాడ కన్నడ సంఘం, గుడెబల్లూర్ భాషపై రాద్ధాంతం వద్దు.. మేము ఈ ప్రాంత విద్యార్థుల అభ్యున్నతికి కొన్నేళ్లుగా కర్ణాటక ప్రభుత్వంతో పోరాడుతున్నాం. ఈ ప్రాంతంలోని కన్నడ పాఠశాలలకు గతంలో కొన్ని నిధులు అందించారు. కృష్ణా ఉన్నత పాఠశాలలో ఓ భవనం కూడా కర్ణాటక ప్రభుత్వం నిర్మించింది. అయినా మేము కన్నడ మీడియం చదవాలని బలవంతం చేయడం లేదు. ఇప్పటికే చదువుతున్న విద్యార్థుల భవిష్యత్కు పోరాడుతున్నాం. – రాంలింగప్ప, గౌరవ అధ్యక్షుడు, గడినాడ కన్నడ సంఘం, కున్సీ రిజర్వేషన్లు మా చేతుల్లో లేవు.. కన్నడ మీడియం చదువుతున్న విద్యార్థులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నాం. నాతో పాటు కొందరు ఉపాధ్యాయులు కలిసి పలుమార్లు కర్ణాటక ప్రభుత్వానికి వినతిపత్రాలు అందించాం. ఆ రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులను కలిసి గడినాడ ప్రాంత విద్యార్థుల సమస్యలు వివరించాం. ఇందుకు నా సొంత డబ్బులు రూ.లక్షలు ఖర్చు చేశా. అయినా మాపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము రిజర్వేషన్లు, ఉద్యోగులు ఇచ్చే వాళ్లం కాదు. ఇక్కడి విద్యార్థుల తరఫున చాకిరి చేసేవాళ్లం. – అమర్కుమార్ దీక్షిత్, మాజీ సర్పంచ్, కన్నడ సంఘం నాయకుడు, కృష్ణా ప్రభుత్వం చొరవ చూపాలి.. కన్నడ మీడియం విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వంతో పాటు మనం కూడా చొరవ తీసుకోవాలి. గ్రామా ల్లోని పేద ప్రజలకు భాషపై అవగాహన కల్పించాలి. ప్రజల్లో మార్పు తీసుకురావాలి. అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది. – నల్లె శివరాజ్, ఉపాధ్యాయుడు, కున్సీ సమన్వయం పాటించాలి.. ఇరు భాషా ప్రేమికులు సమన్వయంతో ముందుకెళ్లాలి. అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక్కడి ప్రజలు కలిసి ఉండాలేగాని విడిపోకూడదు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. – రమేష్, మండల అధ్యక్షుడు, తపస్ సంఘం -
ఎత్తిపోతలకు గ్రహణం
కొల్లాపూర్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గ్రహణం వీడటం లేదు. ప్రాజెక్టు ద్వారా నీటి పంపింగ్కు తరచుగా బ్రేకులు పడుతున్నాయి. ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెబుతున్న అధికారులు.. నీటి ఎత్తిపోతలు మాత్రం ఇప్పట్లో జరగవని తేల్చి చెబుతున్నారు. రెండేళ్లుగా ఇదే తంతు కొనసాగుతుండటంతో నీటి ఎత్తిపోతలపై అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వం అరకొరగా బడ్జెట్ కేటాయిస్తుండటంతో పనులు ముందుకు సాగడం లేదనే ప్రచారం కూడా ఉంది. మూడేళ్ల క్రితం మొదటి పంపుతో.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2023 సెప్టెంబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఎల్లూరు సమీపంలోని పంప్హౌజ్లో ఒక మోటారు ఆన్చేసి.. నీటి ఎత్తిపోతలు చేపట్టారు. రెండు టీఎంసీల నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి ఎత్తిపోశారు. మరుసటి ఏడాది తాగునీటి అవసరాల కోసం నాలుగు టీఎంసీల వరకు నీటిని ఎత్తిపోసుకునేందుకు అనుమతులు లభించాయి. కానీ పంప్హౌజ్లో మోటార్ల బిగింపు, సివిల్ వర్క్స్, విద్యుత్ సరఫరా పనులు పెండింగ్లో ఉన్నాయనే కారణాలతో నేటి వరకు రెండో దఫా ఎత్తిపోతలు జరగడం లేదు. నాలుగు మోటార్ల బిగింపు.. ప్రాజెక్టులోని మొదటి లిఫ్ట్ అయిన ఎల్లూరు పంపుహౌజ్లో ఇప్పటివరకు నాలుగు మోటార్లు బిగించారు. మూడు మోటార్ల పనులన్నీ పూర్తయ్యాయి. మరో మోటారు ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంది. లిఫ్టులో మరో నాలుగు మోటార్ల బిగింపునకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. సివిల్ వర్క్స్ దాదాపుగా పూర్తిచేశారు. మెకానికల్, సిస్టమ్ వర్క్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. డెలివరీ మెయిన్స్ పనులు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. ప్రాజెక్టు వద్ద నిర్మించిన 400/11 కేవీ సబ్స్టేషన్కు విద్యుత్ సరఫరా పనులు నత్తనడకన సాగుతున్నాయి. విద్యుత్ పనులు ఆలస్యం అవుతుండటమే నీటి ఎత్తిపోతలు జరగకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కేఎల్ఐ ద్వారా రిజర్వాయర్లోకి నీరు.. పాలమూరు ప్రాజెక్టులో నార్లాపూర్ రిజర్వాయర్ మొదటిది కాగా.. నీటి నిల్వ సామర్థ్యం 6.4 టీఎంసీలు. ప్రాజెక్టు ప్రారంభ సమయంలో 2 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్లోకి ఎత్తిపోశారు. తర్వాతి కాలంలో పాలమూరు ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు సాగకపోవడంతో కేఎల్ఐ ద్వారా ఎత్తిపోసే నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి మళ్లిస్తున్నారు. కేఎల్ఐలోని ఎల్లూరు రిజర్వాయర్ నుంచి నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీటి మళ్లింపునకు వీలుగా ప్రత్యేకంగా తూము ఏర్పాటు చేశారు. తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఏర్పడొద్దనే ఉద్దేశంతోనే నీటి మళ్లింపు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నార్లాపూర్ రిజర్వాయర్లో 4 టీఎంసీల మేరకు నీటి నిల్వ ఉంది. కొలిక్కిరానినిర్వాసితుల సమస్యలు.. నార్లాపూర్ రిజర్వాయర్లో అంజనగిరి, వడ్డెగుడిసెలు, సున్నపుతండా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వీరిలో కొంతమందికి సరైన పరిహారం అందలేదు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పూర్తిస్థాయిలో పరిహారం ఇస్తేనే.. తాము ఇళ్లు ఖాళీ చేస్తామని కొందరు నిర్వాసితులు మొండికేశారు. ఈ సమస్యను రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. వారికి పరిహారం ఇప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. నిర్వాసితులు ఇళ్లు ఖాళీ చేసేవరకు నార్లాపూర్ రిజర్వాయర్లో 4 టీఎంసీల కన్నా ఎక్కువ నీటిని నింపలేమని.. నీటిని అధికంగా నింపితే నిర్వాసితుల ఇళ్లు ముంపునకు గురవుతాయని అధికారులు చెబుతున్నారు. సీజన్ ముగిసేలోగా.. నార్లాపూర్ రిజర్వాయర్లో 4 టీఎంసీల మేరకు నీరు నిల్వ ఉంది. ఈ రిజర్వాయర్లోకి మరిన్ని నీళ్లను ఎత్తిపోస్తే నిర్వాసితుల ఇళ్లు మునిగిపోతాయి. తమకు పరిహారం సమస్య పరిష్కారమైతేనే ఇళ్లు ఖాళీ చేస్తామంటున్నారు. ఈ సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఒకవేళ ఎత్తిపోసే నీళ్లను ఏదుల రిజర్వాయర్కు తరలించాలంటే కాల్వ పనులు పూర్తికావాలి. ఇందుకు కొంత సమయం పడుతుంది. ఆయా సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎత్తిపోతలను వాయిదా వేస్తూ వస్తున్నాం. ఈ ఏడాది సీజన్ ముగిసేలోగా కచ్చితంగా ఎత్తిపోతలు చేపడతాం. – శ్రీనివాసరెడ్డి, ఈఈ, నీటిపారుదలశాఖ అసంపూర్తి కాల్వలతో.. నార్లాపూర్ రిజర్వాయర్లో ప్రస్తుతం ఉన్న నీటిని ఏదుల రిజర్వాయర్కు పారించేందుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. నార్లాపూర్ రిజర్వాయర్ సమీపంలోని కుడికిళ్ల, తీర్నంపల్లి శివార్లలో ప్రధాన కాల్వ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. నిధుల లేమి కారణంగా కాల్వ నిర్మాణం మధ్యలోనే నిలిచింది. ఈ క్రమంలో కాల్వ పనులను పూర్తిచేసేందుకు కొన్ని నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం రూ. 100కోట్లకు పైగా నిధులను కేటాయించింది. కానీ పనులు మాత్రం ఇప్పటికీ నత్తనడకనే సాగుతున్నాయి. ఈ కాల్వ పనులు పూర్తయితేనే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్కు నీటిని తరలించవచ్చు. అప్పటివరకు పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. పాలమూరు ప్రాజెక్టులో వాయిదా పడుతున్న నీటి పంపింగ్ పెండింగ్ పనులతోనే సమస్య కేఎల్ఐ ద్వారా నార్లాపూర్ రిజర్వాయర్కు నీటి మళ్లింపు అక్కడి నుంచి ఏదులకు నీటిని తరలించేందుకు అడ్డంకులు -
‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
నారాయణపేట: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయుల నిరంతర కృషి, పాఠశాల స్థాయి పర్యవేక్షణ కీలకమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖపై కలెక్టర్ నేతృత్వంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎఫ్ఎల్ఎన్ పనితీరును తెలుసుకున్న కలెక్టర్.. బేస్లైన్ నుంచి మిడ్లైన్ వరకు ఫలితాల్లో జిల్లా ర్యాంకు 5వ స్థానానికి పడిపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎంఈఓలు, జీహెచ్ఎంలు టార్గెట్ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎఫ్ఎల్ఎన్ మార్క్ టెస్ట్కు సంబంధించి మండలాల వారీగా సమాచారాన్ని సేకరించి.. తదుపరి సమీక్షలో అంశాల వారీగా విశ్లేషణ చేయనున్నట్లు తెలిపారు. ఎల్ఐపీ డేటాను పాఠశాలల వారీగా వెంటనే వందశాతం పూర్తిచేయాలని ఆదేశించారు. అవసరమున్న పాఠశాలల్లో వలంటీర్లను వినియోగించుకోవచ్చని సూచించారు. కొన్ని పాఠశాలల్లో వలంటీర్ల సహకారం మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. జిల్లాలో అమలవుతున్న యంగ్ రోటరీ క్లబ్, ఫైనాన్స్ లిట్రసీ, ఇన్ క్వాలియాబ్ ఫౌండేషన్, ఫ్యూచర్ డాట్స్, వేదిక్ మ్యాస్ వంటి కార్యక్రమాలను మరింత ఉత్సాహంగా కొనసాగించాలని సూచించారు. నూతన పద్ధతులు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయన్నారు. ఖాన్ అకాడమీ రిజిస్ట్రేషన్లు వందశాతం పూర్తి చేయాలని.. ఇంటి ప్రాక్టీస్పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో ఫలితాల మెరుగుదలకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఎఫ్ఎల్ఎన్ – ఏఎక్స్ఎల్ ప్రోగ్రాం కొడంగల్ నియోజకవర్గంలోని పాఠశాలల్లో విజయవంతంగా అమలవుతున్నందున.. కంప్యూటర్ వినియోగాన్ని పెంచి అభ్యసన సామర్థ్యం మెరుగుపర్చాలని కలెక్టర్ సూచించారు. ఫిబ్రవరి 26న రాష్ట్రస్థాయి ఎఫ్ఎల్ఎన్లో జిల్లా మొదటి స్థానం సాధించేందుకు లక్ష్యం నిర్దేశించారు. సమావేశంలో డీఈఓ గోవిందరాజులు, ఏఎంఓ విద్యాసాగర్, సీఎంఓ రాజేంద్రకుమార్, ఏఎస్సీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
రూ.వెయ్యి కోట్లతో మక్తల్ అభివృద్ధి
మక్తల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలోనే మక్తల్ నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం మక్తల్ పట్టణంలోని చందాపూర్లో సీసీరోడ్లు, డ్రెయినేజీ నిర్మా ణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకారంతో మక్తల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తా నని అన్నారు. ఇప్పటికే ప్రారంభించిన పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని అధికారులకు మంత్రి సూచించారు. అనంతరం స్థానిక 5వ వార్డుకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్లో చేరగా.. ఆయ న పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషిచేయాలని సూచించారు. ● ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వాకి టి శ్రీహరి అన్నారు. మక్తల్లో రూ. 70కోట్లతో ఏ ర్పాటు చేయనున్న 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్కు అవసరమైన స్థలాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పట్టణ సమీపంలోని హైవే లైన్ వద్ద సబ్స్టేషన్ నిర్మాణానికి స్థల పరిశీలన చేశామని.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమాల్లో బీకేఆర్ చైర్మన్ బాలకిష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గణేశ్కుమార్, ఏఈ నాగశివ, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్, ఫయాజ్, శ్రీనివాసులు, రంజిత్కుమార్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ నర్సింహులు, గోవర్ధన్, కట్టా సురేశ్, రవికుమార్, రాజేందర్, రహీం పటేల్, శంషొద్దీన్, ఎండీ సలాం, భాస్కర్ పాల్గొన్నారు. -
కన్నడ మీడియంపైనేడు ‘సాక్షి’ చర్చావేదిక
కృష్ణా: జిల్లాలో కన్నడ మీడియం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై గురువారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో కృష్ణా రైతువేదికలో చర్చావేదిక జరగనుంది. గడినాడ కన్నడ సంఘం నాయకులతో పాటు విద్యార్థి, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు చర్చావేదికలో పాల్గొననున్నారు. మండలంలో కన్నడ మీడియం చదువుతున్న విద్యార్థుల భవిష్యత్కు సంబంధించి ‘సాక్షి’ ఓ మంచి వేదికను ఏర్పాటు చేయడంపై మండల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. నేడు డయల్ యువర్ డీఎం నారాయణపేట రూరల్: జిల్లాలోని కోస్గి, నారాయణపేట ఆర్టీసీ డిపోల పరిధిలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు గాను గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్థానిక ఆర్టీసీ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు 73828 26293 నంబర్ను సంప్రదించి.. సమస్యలను తెలియజేయడంతో పాటు ఆర్టీసీ అభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని వారు కోరారు. వేరుశనగ క్వింటా రూ.8,262 నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో బుధవారం వేరుశనగ క్వింటాకు గరిష్టంగా రూ. 8,262, కనిష్టంగా రూ. 6,509 ధర పలికింది. ఉలవలు రూ. 3,191, అలసందలు రూ. 5వేలు, వడ్లు (సోన) రూ. 2,240, ఎర్రకందులు గరిష్టంగా రూ. 8,036, కనిష్టంగా రూ. 4,050, తెల్లకందులు గరిష్టంగా రూ. 7,856, కనిష్టంగా రూ. 4,111 ధరలు పలికాయి. మున్సిపల్ కమిషనర్ల బదిలీ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో బుధవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పలువురు మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. ఇందులో భాగంగా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో గ్రేడ్–1 కమిషనర్గా పనిచేస్తున్న టి.ప్రవీణ్కుమార్రెడ్డిని జీహెచ్ఎంసీకి.. అక్కడి నుంచి పి.రామానుజులరెడ్డి పాలమూరుకు వస్తున్నారు. భూత్పూర్ మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న నూరుల్నజీబ్ వనపర్తి జిల్లాలోని అమరచింతకు వెళ్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్లో కమిషనర్గా పనిచేస్తున్న పి.చంద్రశేఖర్రావు భూత్పూర్కు వస్తున్నారు. నందికొండలో పనిచేస్తున్న సీహెచ్ వేణును నాగర్కర్నూల్ జిల్లాలోని అచ్చంపేటకు పంపిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న డి.మురళిని నందికొండకు బదిలీ చేశారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరు నుంచి బి.యాదగిరి నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్కు వస్తున్నారు. వైభవంగా ధ్వజారోహణం జడ్చర్ల టౌన్: మండలంలోని గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం ధ్వజారోహణం వైభవంగా ని ర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణాలు, మేళతాళాల మధ్య ధ్వజస్తంభం వద్ద పతాకావిష్కరణ చేశారు. అనంతరం ప్రాణప్రతిష్ఠ చేసి బలిహరణం జరిపించారు. గురువారం రెండు మనోహరమైన సేవలు జరిపించనున్నారు. భక్తిశ్రద్ధలతో వార్షిక బ్రహ్మోత్సవాలు అలంపూర్: శ్రీజోగుళాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం మూడో రోజు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా అమ్మ వారి ఆలయంలో కుంకుమార్చన పూజలు, త్రిశతి అర్చనలు ప్రత్యేకంగా నిర్వహించారు. అదేవిధంగా విశేష అర్చనలు, చండీ హోమా లు, పవమాన సూక్త పారాయణ, పవమాన సూక్త హోమాలు, అవాహిత దేవతా హోమా లు, మండప ఆరాధన, బలిహరణ, నీరాజన మంత్రపుష్పములు తదితర పూజలు చేశారు. మరో రెండు రోజుల పాటు వార్షిక బ్రహోత్సవాలు కొనసాగుతాయని ఆలయ ఈఓ దీప్తి తెలిపా రు. ఈ నెల 23వ తేదీ ఉత్సవాల చివరి రోజు బ్రహోత్సవాల్లో భక్తులకు అమ్మవారు నిజరూప దర్శనం కలుగుతుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు. -
రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం
నారాయణపేట: రహదారి భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఎస్పీ డా.వినీత్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను నివారించి.. ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో ఆరైవ్.. అలైవ్ కార్యక్రమం చేపట్టామన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా గ్రామస్థాయిలో ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్లాక్ స్పాట్స్ వద్ద రోడ్డు ప్రమాద బాధితులు, వారి కుటుంబాలతో కలిసి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం, హెల్మెట్. సీటు బెల్ట్ ధరించకపోవడం, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడమేనని అన్నారు. ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటించినప్పుడే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని స్పష్టం చేశారు. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. విద్యార్థులు, యువత రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకొని బాధ్యతాయుత పౌరులుగా మెలగాలని సూచించారు. జిల్లాలో నేషనల్ హైవే 81 కి.మీ., స్టేట్ హైవే 38 కి.మీ., ఇతర రహదారులు 411 కి.మీ. ఉన్నాయని.. అందులో జిల్లావ్యాప్తంగా 4 బ్లాక్ స్పాట్స్ గుర్తించినట్లు ఎస్పీ వివరించారు. పెద్ద చింతకుంట గ్రామ శివారు, దండు ఎక్స్రోడ్డు, నాచారం శివారు, ధన్వాడ మండల శివారులో బ్లాక్స్పాట్స్ గుర్తించి.. అక్కడ ప్రత్యేకంగా బారీకేడ్లు, సైన్ బోర్డ్స్, స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. 2024లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 106 మంది చనిపోగా, 2025లో 99 మంది చనిపోయారన్నారు. ఈ సంవత్సరం ఇంకా తగ్గించేందుకు ఆరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా ఏడాది పొడవునా ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు, వాహనాల తనిఖీలను ముమ్మరం చేస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, ఎస్ఐ నరేశ్ ఉన్నారు. -
అనుకున్నదొకటి.. అయ్యిందొకటి!
నారాయణపేట: ‘‘గతంలో ఉన్న పార్టీలోనే ఉండి ఉంటే తమను కాదని ఇతరులకు అవకాశాలు వచ్చేవి కావు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చేరాం.. తమకు సిట్టింగ్ స్థానాల్లో అవకాశాలు ఇవ్వాలి.. రిజర్వేషన్ అనుకూలించకపోతే ఇతర వార్డుల్లో అవకాశాలు కల్పించాలి’’ అంటూ బీఆర్ఎస్ నుంచి హస్తం గూటికి చేరిన తాజా మాజీ కౌన్సిలర్లు అధికార పార్టీ నేతలతో పట్టుబడుతున్నారు. అయితే సిట్టింగ్ స్థానం రిజర్వేషన్ అనుకూలంగా ఉంటే సరేనని.. ఇతర వార్డులో అవకాశం ఇచ్చేందుకు మొదటి నుంచి ఉన్న పార్టీ నాయకులు ఒప్పుకోవడం లేదని అధినేతలు తేల్చిచెబుతున్నారు. దీంతో పార్టీ మారి తప్పుచేశామంటూ పలువురు నాయకులు మదనపడుతున్నారు. తాము అనుకున్నదొకటి.. అయ్యిందొకటి అంటూ చర్చించుకుంటున్నారు. ఇదీ పరిస్థితి.. నారాయణపేట మున్సిపాలిటీ చైర్మన్ గిరి జనరల్ స్థానానికి రిజర్వు అవుతుందని అందరూ భావించారు. తీరా జనరల్ మహిళకు రిజర్వు కావడంతో ఆశావహుల ఆశలపై నీళ్లు చలినట్లయ్యింది. మరికొన్ని వార్డుల రిజర్వేషన్లు సైతం ఆశావహులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. కొత్తగా ఏర్పడిన మద్దూర్ మున్సిపాలిటీ బీసీ జనరల్ రిజర్వు అయ్యింది. ఇక్కడ 2011 జనాభా ప్రాతిపదికన 50 శాతం వార్డులు జనరల్ స్థానాలకు రిజర్వు అయ్యాయి. మక్తల్లో చైర్మన్ కావాలనుకుంటున్న ఓ అభ్యర్థి తన వార్డు రిజర్వేషన్ అనుకూలంగా రాకపోవడంతో వేరే వార్డుకు వలస వెళ్లే పరిస్థితి వచ్చింది. కోస్గిలో ఒకటి అనుకుంటే.. మరొకటి అయ్యిందంటూ చర్చ సాగుతోంది. చైర్మన్ స్థానంతో పాటు వార్డులు సైతం ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్ కావాలో లాజిక్గా ఎక్కడ తప్పులకు తావులేకుండా జరిగాయంటూ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మైనార్టీలకు కో‘ఆప్షన్’.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ముస్లిం మైనార్టీల ఓట్లు కూడా కీలకం కానున్నాయి. ఏ వార్డులో చూసినా ముస్లిం ఓట్లు ప్రభావితం చేస్తాయంటూ రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన బలమైన నాయకులకు కోఆప్షన్ పదవులు ఇస్తామంటూ హామీలు ఇస్తున్నారు. నారాయణపేట 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి తాజా మాజీ కౌన్సిలర్ మహ్మద్ సలీం మళ్లీ పోటీచేయాలని ఆశించారు. తీరా ఆ వార్డు ఎస్సీ రిజర్వేషన్ కావడంతో పోటీచేసే అవకాశం లేకుండాపోయింది. ఆయన పార్టీ పట్టణ అధ్యక్షుడు కావడంతో మున్సిపాలిటీని హస్తగతం చేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు. మరో వార్డులో మజ్లీస్ పార్టీ టికెట్ ఆశిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ ఆశావహులు పరేషాన్లో పడ్డారు. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న సీనియర్ మైనార్టీ కాంగ్రెస్ నాయకులకు కోఆప్షన్ ఇస్తామని భరోసానిచ్చినట్లు తెలుస్తోంది. మద్దూర్లో సైతం తమకు చైర్మన్ పదవి ఇవ్వాలని బీఆర్ఎస్కు చెందిన ముస్లిం మైనార్టీ నాయకుడు పట్టుపడుతున్నారు. కాగా, అక్కడ లోకల్ లొల్లి నడుస్తోంది. మద్దూర్ పట్టణానికి చైర్మన్, విలీనమైన గ్రామాల్లో గెలిచే వారికి వైస్చైర్మన్ పదవి కట్టబెడుతామని కాంగ్రెస్, బీఆర్ఎస్ పెద్దలు సూచించినట్లు సమాచారం. గెలుపు గుర్రాల కోసం జల్లెడ.. మున్సిపల్ వార్డుల్లో గెలుపు గుర్రాల కోసం ప్రధాన పార్టీలు జల్లెడ పడుతున్నాయి. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థుల ఎంపికకు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. పోటాపోటీగా ఉన్న వార్డుల్లో పార్టీ అధినేతలు తమదైన శైలిలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఒక్కొక్క వార్డును క్లియర్ చేస్తున్నారు. ప్రధానంగా సీఎం ఇలాకాలోని మద్దూర్, కోస్గి మున్సిపాలిటీల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని.. అన్ని వార్డులను క్లీన్చిట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. నారాయణపేట మున్సిపాలిటీలో మాత్రం రసవత్తర రాజకీయం కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లు సీట్ల కేటాయింపు అంతా రహస్యంగా కొనసాగిస్తున్నాయి. బీఆర్ఎస్ మాత్రం తమకు అనుకూలంగా ఉన్న వార్డుల్లో అభ్యర్థులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అసంతృప్తుల మద్దతు ఎవరికో.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆశావహులు పోటాపోటీ పడుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో ఒక్కో వార్డుకు ఇద్దరు నుంచి ముగ్గురు పోటీపడుతుండగా.. అధికార కాంగ్రెస్ పార్టీలో నలుగురు నుంచి ఐదుగురు పోటీపడుతున్నారు. ఆయా పార్టీల అధినేతలు ఆశావహులను ఒక్కొక్కరిని సంప్రదించి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎవరికి మద్దతు ఇస్తారని ఆశావహులను అడుగుతుండటంతో ఖంగుతింటున్నారు. పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేస్తామని కొంతమంది.. తమకే టికెట్ ఇవ్వాలని మరికొంత మంది ఆశావహులు చెబుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆశావహులందరూ కలిసి చర్చించుకొని ఎవరిని నిర్ణయిస్తే వారికే అవకాశం కల్పిస్తామని.. ఆ అభ్యర్థి గెలుపు బాధ్యతలు ఆశావహులదే అంటూ చెబుతుండటంతో కొందరు అంతర్మథనంలో పడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుకూలించని రిజర్వేషన్లు పార్టీ మారి తప్పుచేశామంటూ తాజా మాజీ కౌన్సిలర్ల మనోవేదన అభ్యర్థుల ఎంపికలో తలలు పట్టుకుంటున్న ప్రధాన పార్టీలు ఆశావహులకు నచ్చజెప్పే పనిలో నేతలు -
నిర్దేశిత లక్ష్యాలు సాధిద్దాం
నారాయణపేట: నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ పథకాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసే విధంగా లబ్ధిదారులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. గతేడాది మంజూరైన ఇళ్లు పూర్తయితేనే వచ్చే సంవత్సరానికి మళ్లీ టార్గెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలోని 13 మండలాలకు ఐదుగురు మాత్రమే హౌసింగ్ ఏఈలు ఉండేవారని.. ప్రస్తుతం మరికొందరు ఏఈలు జిల్లాకు వచ్చి విధుల్లో చేరారన్నారు. పంచాయతీ కార్యదర్శులతో ఏఈలు సమన్వయం చేసుకుని గ్రామాల వారీగా ఇళ్ల నిర్మాణాల లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు 100 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. వేసవి సమీపిస్తున్నందున ఉపాధి హామీ పథకం లక్ష్య సాధనకు తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం మండలాల వారీగా పనుల వివరాలపై డీఆర్డీఓ మొగులప్పతో సమీక్షించారు. అదే విధంగా ఉల్లాస్ పథకం అమలు తీరును డీఈఓ గోవిందరాజులుతో తెలుసుకున్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ శంకర్ నాయక్ ఉన్నారు. ● మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ. 20లక్షల నష్టపరిహారం ఇస్తోందన్నారు. ఇప్పటివరకు సేకరించిన భూమి, అందించిన పరిహారం తదితర విషయాలపై తహసీల్దార్లతో కలెక్టర్ చర్చించారు. మిగిలిన భూ సేకరణ ప్రక్రియను పూర్తిచేసేందుకు యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్, కలెక్టరేట్ ఏఓ శ్రీధర్ ఉన్నారు. ● జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న నిర్వహించే ర్యాలీలో అధికారులు, ఓటర్లు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. కలెక్టరేట్లో అధికారులతో ఏర్పాటుచేసిన సమావే శంలో ఆమె మాట్లాడుతూ.. ఓటర్లను చైతన్యం కలిగించడమే ఓటరు దినోత్సవ ముఖ్య ఉద్దేశమన్నా రు. 25న ఆదివారం సెలవుదినం అయినందున 23న అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థులతో సామూహి క ప్రతిజ్ఞ చేయించాలని ఆదేశించారు. 25న మై ఇండియా – మై ఓటు నినాదంతో నిర్వహించే ర్యాలీలో అన్ని ప్రభుత్వశాఖలు పాల్గొనాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లోవేగం పెంచాలి ఉపాధి హామీ కూలీలకు వంద రోజుల పని కల్పించాలి కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
భూ నిర్వాసితులందరికీ నష్టపరిహారం
దామరగిద్ద: మక్తల్–పేట– కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులందరికీ ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని అదనపు కలెక్టర్ శ్రీను అన్నారు. మంగళవారం మండలంలోని కాన్కుర్తి, గడిమున్కన్నల్లి, మల్రెడ్డిపల్లి గ్రామాల్లో పునరావాస– పునరాశ్రయం పేరుతో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. కోర్టు కేసులు ఉన్న భూములను రైతులు ప్రభుత్వానికి ఇచ్చేందుకు సుముఖంగానే ఉన్నప్పటికీ చట్టబద్ధం కాదన్నారు. కోర్టు క్లియరెన్స్ తర్వాతే భూములు సేకరించి.. రైతులకు నష్టపరిహారం అందించడం జరుగుతుందన్నారు. ఎత్తిపోతల పథకంలో వ్యవసాయ భూములను పాక్షికంగా లేదా పూర్తిగా కోల్పోయినా, ఆయా భూముల్లో ఉన్న నిర్మాణాలు, వ్యవసాయ బోర్లు, బావులు ఇతర ఎలాంటి నిర్మాణాలు ఉన్నా పరిహారం కోసం వారం రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామచందర్, ఇరిగేషన్ ఈఈ బ్రహ్మానంద, తహసీల్దార్ తిరుపతయ్య, ఆర్ఐ బాల్రాజ్, కాన్కుర్తి సర్పంచ్ నారాయణ తదితరులు ఉన్నారు. -
ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా సీఎం వ్యాఖ్యలు
నారాయణపేట: సీఎం హోదాలో ఉన్న రేవంత్రెడ్డి ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి అన్నారు. సీఎం చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ లింగయ్యకు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో అత్యంత చౌకబారు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ఉద్యమనేత, తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును దెబ్బతీయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టాలి.. ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలి అంటూ సీఎం వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరును ఉపయోగించి రాజకీయ కక్ష సాధించడం సరైంది కాదన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటమే ఎన్టీఆర్కు నిజమైన నివాళి అని అన్నారు. అదే విధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్రావుకు సిట్ నోటీసులు జారీ చేయడం సరైందికాదన్నారు. కోర్టు నుంచి క్లిన్ చిట్ వచ్చినప్పటికీ సిట్ పేరుతో వేధింపులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు విజయసాగర్, చెన్నారెడ్డి, సుదర్శన్రెడ్డి, ప్రతాప్రెడ్డి, గురులింగం, బోయ లక్ష్మణ్, సురేందర్రెడ్డి పాల్గొన్నారు. -
క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి
నారాయణపేట రూరల్: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి 35వ సబ్ జూనియర్ ఖోఖో పోటీలు మంగళవారం ముగిశాయి. హోరాహోరీగా కొనసాగిన టోర్నీలో బాలుర విభాగంలో ఆదిలాబాద్ ప్రథమ, పెద్దపల్లి జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. మహబూబ్నగర్ తృతీయ స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో ఆదిలాబాద్ మొదటి, మహబూబ్నగర్ ద్వితీయ, నల్లగొండ తృతీయ స్థానంలో నిలిచాయి. విజేతలకు ఓబేదుల్లా కొత్వాల్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడా పోటీల్లో గెలుపోటములు సహజమన్నారు. ఓడిపోయిన క్రీడాకారులు నిరుత్సాహపడొద్దని.. మరోసారి గెలిచేందుకు పట్టుదలతో ప్రయత్నించాలని సూచించారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ వెంకటేశ్ శెట్టి, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు విలియమ్స్, టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ నర్సింహులు, తఖి, సర్ఫరాజ్ హుస్సేన్ అన్సారి, ఎస్జీఎఫ్ సెక్రెటరీ శ్రీనివాసరెడ్డి పీడీలు నర్సింహులు, రత్నయ్య బాలరాజు, సాయినాథ్, నర్సింహారెడ్డి, రవికుమార్, వెంకటేశ్, రాజశేఖర్, మౌలాలి, వేణుగోపాల్, పర్విన్, తిరుమలేష్, గణేశ్, చక్రవర్తి, హారికాదేవి పాల్గొన్నారు. -
దరఖాస్తు చేసుకోండి
నారాయణపేట: జిల్లాలోని దివ్యాంగులు తమకు అవసరమైన సహాయ ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్, జిల్లా సంక్షేమశాఖ ఇన్చార్జి అధికారి శ్రీను మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర దివ్యాంగుల, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్స్ సంక్షేమశాఖ, తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకు 14 మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిళ్లు, 8 ల్యాప్టాప్లు, 9 ట్యాబ్లు, 2 5జీ స్మార్ట్ఫోన్లు కేటాయించినట్లు తెలిపారు. దరఖాస్తుదారులు పూర్తి అవగాహనతో, జాగ్రత్తగా తమ అర్హతలకు అనుగుణంగా ఈ నెల 30వ తేదీలోగా https://tgobmms.cgg. gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అర్హులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ నారాయణపేట: జిల్లాలోని నిరుద్యోగ యువతకు మహబూబ్నగర్ ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని తన చాంబర్లో కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్లో గ్రూప్స్తో పాటు బ్యాంకింగ్, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ తదితర పోటీ పరీక్షలపై 5 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డిగ్రీ అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా www.tsstudycircle.co.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులకు వచ్చే నెల 8న అర్హత పరీక్ష ఉంటుందని.. ఎంపికై న అభ్యర్థులకు భోజన, హాస్టల్ సదుపాయం ఉంటుందన్నారు. శిక్షణకాలంలో 600 సెషన్లు, 900 గంటల నాణ్యమైన తరగతుల బోధన ఉంటుందని, స్టడీ మెటీరియల్, పర్సనల్ అలవెన్స్ అందించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 89773 40006, 83096 57774 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, డీపీఆర్ఓ.రషీద్, డీవైఎస్ఓ వెంకటేశ్ శెట్టి, సీపీఓ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీతోనే వ్యవసాయ పథకాలు నర్వ: రైతులు ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వ్యవసాయ పథకాలు వర్తిస్తాయని డీఏఓ జాన్సుధాకర్ అన్నారు. మంగళవారం నర్వలోని పెస్టిసైడ్స్, సీడ్స్ దుకాణాలను తనిఖీ చేశారు. అనంతరం రైతులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రికార్డుల్లో ఫార్మర్ ఐడీ కలిగిన రైతులకు సంక్షేమ పథకాలతో పాటు రాయితీలు, రుణాలు, బీమా సౌకర్యం పొందగలుగుతారని తెలిపారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్నిధి, పీఎం ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు తదితర పథకాలకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి అని అన్నారు. రైతులు ఏఈఓలను సంప్రదించి ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని సూచించారు. మీసేవ కేంద్రాల్లోనూ నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. డీఏఓ వెంట ఏఓ అఖిలారెడ్డి, ఏఈఓలు శ్వేత, కథలప్ప, హర్షియా ఉన్నారు. రాష్ట్ర సాఫ్ట్బాల్ పోటీలకు గురుకుల విద్యార్థులు ధన్వాడ: నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు జరిగే ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్–17 సాఫ్ట్బాల్ పోటీలకు పీఎంశ్రీ కొండాపూర్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఉదయ్కుమార్, ఓంకార్, సైదులు ఎంపికయ్యారు. మంగళవారం గురుకుల పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను ప్రిన్సిపాల్ రాజారాం, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు అభినందించారు. రాష్ట్రస్థాయి టోర్నీలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జట్టు విజయానికి కృషి చేయాలని వారు సూచించారు. కార్యక్రమంలో జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ సాంబియా నాయక్, పీఈటీ ఆంజనేయులు, కోచ్ రామ్మోహన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి
● పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగాకార్యకర్తలు పనిచేయాలి ● రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్: మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. మంగళవారం మక్తల్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్పార్టీ ముఖ్య నా యకులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ము న్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సమస్య ల పరిష్కారానికి ముందుండి పనిచేసే వారికే టికె ట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. మక్తల్ మున్నిపాలిటీలోని 16 వార్డుల్లో పార్టీ టికెట్ ఆశించే అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్హులందరికీ రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తోందన్నారు. మున్సిపాలిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు. మక్తల్ పట్టణంలో ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నా రు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు మంత్రి సూచించారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్, మార్కెట్ కమి టీ వైస్చైర్మన్ గణేశ్కుమార్, కట్టా సురేశ్, రవికుమార్, రాజేందర్, వెంకటేశ్, నాగరాజు, శ్యామ్, గోవర్ధన్, ఎండీ సలాం, ఫయాజ్, రంజిత్కుమార్రెడ్డి, బీకేఆర్ చైర్మన్ బాలకిష్ణారెడ్డి ఉన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి.. మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. పట్టణంలోని 5వ వార్డులో రూ. 40లక్షలతో నిర్మించతలపెట్టిన సీసీరోడ్డు పనులకు ఆయన భూమిపూజ చేశారు. అనంతరం మైనార్టీ కాలనీలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. కాలనీలో రోడ్డు సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు మంత్రి దృష్టికి తీసుకురాగా.. ఆయన వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతు చేయించారు. అదే విధంగా రూ. 43కోట్లతో నిర్మిస్తున్న 150 పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటిస్తూ త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. రూ. 3.70కోట్లతో చేపట్టిన మినీ ట్యాంక్బండ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. -
మహిళా సంక్షేమానికి పెద్దపీట
● కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం ● రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసి అనేక పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మక్తల్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఇందిరా మహిళాశక్తి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు రూ. 45లక్షల వడ్డీ లేని రుణాల చెక్కులతో పాటు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందులో భాగంగా ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా స్వయం ఉపాధి రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తోందన్నారు. ప్రభుత్వం అందించే రుణాలతో ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని మంత్రి సూచించారు. మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. తాను మంత్రి పదవి చేపట్టిన అనతి కాలంలోనే రూ. వెయ్యి కోట్లకు పైగా నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. నియోజకవర్గ ప్రజలకు 10వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి పేద కుటుంబం సొంతింటి కలను సాకారం చేస్తామన్నారు. మక్తల్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు. అబివృద్ధికి ఎవరు అడ్డు పడినా ఇక ఆగదని.. గతంలో ఓ లెక్క, ఇప్పుడు మరో లెక్క అని మంత్రి అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసులు, బీకేఆర్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు, తహసీల్దార్ సతీశ్కుమార్, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గణేశ్కుమార్, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్, ఫయాజ్, శ్రీనివాసులు, రంజిత్కుమార్రెడ్డి, కావాలి ఆంజనేయులు, తాయప్ప తదితరులు పాల్గొన్నారు. -
సాగునీటి వృథా!
అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ప్రధాన ఎడమ కాల్వ షట్టర్లకు మూడేళ్ల కిందట మరమ్మతు చేపట్టారు. షట్టర్లు మూసినా లీకేజీల కారణంగా నీటి ప్రవాహం నిలువరించలేని పరిస్థితి నెలకొంది. కాల్వ వెంట వారంలో మూడు రోజుల పాటు సుమారు 60 క్యూసెక్కుల నీరు వృథాగా పారుతోంది. దీంతో ప్రాజెక్టులోని నిల్వ నీటిమట్టం రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం జలాశయంలో 4.264 టీఎంసీల నీరు మాత్రమే ఉండటంతో 20 వేల ఎకరాల ఆయకట్టుతో పాటు ఉమ్మడి జిల్లాలోని తాగునీటి పథకాలకు నీటిని అందించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జలాశయం ప్రధాన గేట్లతో పాటు కుడి, ఎడమ కాల్వల షట్టర్ల లీకేజీలతో నీరు మరింత వృథా అవుతోందని ఆయకట్టు రైతులతో పాటు ప్రాజెక్టు సమీప గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. వారబందీ విధానంలో.. జూరాల ఎడమ కాల్వ ఆయకట్టుకు వారబందీ విధానంలో రోజుకు 500 క్యూసెక్కుల చొప్పున వారంలో 4 రోజుల పాటు సాగునీటిని వదులుతున్నారు. మిగిలిన మూడు రోజులు పూర్తిస్థాయిలో మూసి నీటి సరఫరాను నిలిపివేస్తారు. కాని ఆ సమయంలోనూ లీకేజీలతో రోజుకు 60 క్యూసెక్కుల నుంచి 70 క్యూసెక్కుల వరకు నీరు వృథాగా కాల్వలో పారుతుండటంతో జలాశయంలో నీటిమట్టం తగ్గి వేసవిలో ఆయకట్టుకు సాగునీటి కష్టాలతో పాటు ఉమ్మడి జిల్లా ప్రజలకు తాగునీటి కష్టాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. రూ.5 లక్షల వ్యయంతో.. సుమారు రూ.5 లక్షలతో జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ షట్టర్ల మరమ్మతుతో పాటు రబ్బర్ల బిగింపు పనులు మూడేళ్ల కిందట చేపట్టారు. సదరు కాంట్రాక్టర్ రెండేళ్ల పాటు పనులు చేపట్టగా షట్టర్ల మరమ్మతు పూర్తయిందని చేతులు దులుపుకొన్న అధికారులు లీకేజీలు ఎందుకు ఏర్పడ్డాయన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. షట్టర్లకు చిన్నపాటి కప్లింగ్ జాయింట్ బోల్ట్ను బిగిస్తే నీటి వృథాను నిలువరించవచ్చని అధికారులకు తెలిసినా నేటి వరకు ఆ పనులు చేపట్టడం లేదు. చిన్న బోల్ట్ బిగించాలని.. అదికూడా కార్యాలయంలో ఉందని త్వరలోనే బిగిస్తామని చెప్పడమే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి నీటిలీకేజీ నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జూరాల ప్రధాన ఎడమకాల్వషట్టర్లకు లీకేజీలు మూసినా ఆగని ప్రవాహం మూడేళ్ల కిందట మరమ్మతులుచేసినా ఫలితం శూన్యం జలాశయంలో రోజురోజుకు తగ్గుతున్న నీటిమట్టం సిబ్బంది నిర్లక్ష్యం.. జూరాల ఎడమ కాల్వకు సాగునీటి సరఫరాను నిలిపిన రోజుల్లో నీటి వృథాను అధికారులు అరికట్టలేక పోతున్నారు. కళ్ల ముందే రోజు 60 క్యూసెక్కులకు పైగా వృథాగా పారుతున్నా సిబ్బంది చూసీచూడనట్లు మౌనం వహిస్తున్నారు. షట్టర్లకు బోల్టా బిగించడంలో అలసత్వం చూపుతున్నారు. – వెంకటేష్, నందిమళ్ల చర్యలు తీసుకుంటాం.. జూరాల ఎడమ కాల్వ షట్టర్ల లీకేజీలతో నీరు వృథాగా కాల్వలో పారుతోంది. వారబందీ విధానంలో వారంలో 4 రోజుల పాటు 2 వేల క్యూసెక్కుల సాగునీరు ఆయకట్టుకు వదులుతున్నాం. లీకేజీల నియంత్రణకు చర్యలు చేపడతాం. – జగన్మోహన్, ఈఈ, జూరాల జలాశయం ఎడమకాల్వ విభాగం -
హోరాహోరీగా రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు
నారాయణపేట రూరల్: జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి 35వ సబ్ జూనియర్ ఖోఖో పోటీలు సోమవారం హోరాహోరీగా కొనసాగాయి. టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ నర్సింహులు రెండో రోజు పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. క్రీడల్లో గెలుపోటములను ప్రతి క్రీడాకారుడు సమానంగా స్వీకరించాలని సూ చించారు. కాగా, రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుతురులో టో ర్నీ కొనసాగింది. బాలబాలికలకు వేర్వేరుగా జరిగిన పోటీల్లో ప్రతిభకనబరిచిన జట్లను అభినందించారు. డీవైఎస్ఓ వెంకటేశ్ శెట్టి, ఎస్జీఎఫ్ సెక్రెటరీ శ్రీనివాసరెడ్డి, పీడీలు రత్నయ్య, బాలరాజు, సాయినాథ్, నర్సింహారెడ్డి, రవికుమార్, వెంకటేశ్, రాజశేఖర్, మౌలాలి, వేణుగోపాల్, ఫర్విన్, తిరుమలేష్, గణేశ్, చక్రవర్తి హారికాదేవి పాల్గొన్నారు. -
జిల్లా నుంచే సంక్షేమ పథకాల అమలు
● మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ముందుకు.. ● ఇందిరా మహిళాశక్తి సంబరాల్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట/కోస్గి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన సంక్షేమ పథకాల అమలుకు జిల్లా నుంచే శ్రీకారం చుట్టడం జరిగిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట మున్సిపల్ కార్యాలయం, కోస్గి పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి సంబరాల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా మహిళా సమాఖ్య ద్వారా మొదటి పెట్రోల్ బంక్ను జిల్లాలోనే సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు. కోస్గిలోనూ పెట్రోల్బంక్ కావాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారని చెప్పారు. ఒక పెట్రోల్ బంక్ మాత్రమే కాకుండా ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్, రైస్ మిల్లులు, ఇతర చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అవసరమైన రుణాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాల్లోని ప్రతి సభ్యురాలిని ఆర్థికంగా శక్తివంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలను కలెక్టర్ పంపిణీ చేశారు. కోస్గిలో 187 మహిళా సంఘాలకు రూ. 65,76,674 వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు. నారాయణపేట మున్సిపాలిటీలోని మహిళా సంఘాలకు రూ. 1.41కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరైనట్లు తెలిపారు. 7వేల ఇందిరమ్మ చీరలు వచ్చాయని.. వాటిని వెంటనే అర్హులందరికీ పంపిణీ చేయాలని మున్సిపల్ కమిషనర్ నర్సయ్యను కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో రూ. 35లక్షలతో నిర్మించిన మహిళా సంఘాల మీటింగ్ హాల్ను ప్రారంభించారు. కార్యక్రమాల్లో కడా కమిషనర్ వెంకట్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్, జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కుంభం శివకుమార్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కాంత్కుమార్, ఆర్టీఏ మెంబర్ పోషల్ రాజేశ్, మున్సిపల్ కమిషనర్లు నర్సయ్య, నాగరాజు, మేనేజర్ అజీమ్, మండల అధ్యక్షుడు రఘువర్ధన్రెడ్డి, నరేందర్, మాస్టర్ శ్రీనివాస్, బాలేష్, శ్రీనివాస్, బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు కొత్తగా ఎన్నికై న సర్పంచులు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి పరిపాలన అందించాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంతో జిల్లా కేంద్రం సమీపంలోని వృత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో ఏర్పాటుచేసిన సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. 5 రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో సీనియర్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు 2018 పంచాయతీరాజ్ చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారని తెలిపారు. అదే విధంగా సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల విధులు, బాధ్యతలు, అధికారాలను వివరిస్తారన్నా రు. శిక్షణ తరగతుల్లో చెప్పే ప్రతి అంశాన్ని శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలని సూచించారు. పంచాయ తీ కార్యదర్శుల విధులు, అనుమతులు, ఉపాధి హామీ పథకం కింద ఏ పనులు చేపట్టాలనే విషయా లను పూర్తిస్థాయిలో తెలుసుకోవాలన్నారు. కాగా, శిక్షణలో పోలీసు, వ్యవసాయ, ఉద్యాన, విద్య, హౌసింగ్ కార్పొరేషన్ శాఖలకు చెందిన సీనియర్ అధికారులచే ప్రత్యేక తరగతులు నిర్వహించాలని డీపీఓ సుధాకర్రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. కాగా, మొదటి బ్యాచ్ శిక్షణకు దామరగిద్ద, ధన్వాడ, కోస్గి, గుండుమల్, మద్దూరు మండలాలకు చెందిన సర్పంచులు హాజరయ్యారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
నారాయణపేట: గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీను అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకల నిర్వహణపై శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. 26న ఉదయం 9 గంటలకు పరేడ్ మైదానంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ జాతీయ జెండా ఆవిష్కరిస్తారని.. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిభింబించేలా సమగ్ర వివరాలతో జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని తెలిపారు. గణతంత్ర వేడుకల సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులకు సూచించారు. దేశభక్తిని చాటేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డీఈఓ గోవిందరాజులు ను ఆదేశించారు. అదే విధంగా ఆయా శాఖల అధికారులకు పలు బాధ్యతలు అప్పగించారు. సమావేశంలో డీఎస్పీ లింగయ్య, ఆర్డీఓ రామచందర్ తదితరులు ఉన్నారు. -
ఖర్చుకు తగ్గేదేలే..!
నారాయణపేట: మున్సిపల్ చైర్మన్ గిరి కావాలా నాయనా.. అయితే రూ. 3కోట్ల నుంచి రూ.5 కోట్లు ఖర్చు పెట్టాలని అంటూ అధికార, ప్రతిపక్షాల పార్టీల బడా నేతలు ఆశావహులకు నేరుగా చెప్పేస్తున్నారు. ఆశావహులు సైతం డబ్బుకు కొదవలేదు.. ఎంతైనా ఖర్చు పెడతామంటూ స్పష్టంచేస్తూ.. బడా నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఖర్చుకు ఏమాత్రం వెనుకడుగు వేయమంటూ స్థిరాస్తి వ్యాపార, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రధాన పార్టీల నుంచి పోటీచేసి చైర్మన్ అయ్యేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది. తెరవెనక చక్రం.. మద్దూర్ మున్సిపాలిటీలో ఓ వ్యక్తి తనను చైర్మన్ చేస్తే రూ.5 కోట్లు ఖర్చు చేసేందుకు వెనుకడుగు వేయనని తేల్చిచెప్పినట్లు తెలిసింది. అధికార పార్టీని సైతం తాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని.. పార్టీ నుంచి బీ–ఫాం ఇవ్వడమే ఆలస్యమని చెప్పినట్లు తెలుస్తోంది. ఓ నాయకుడు ప్రతి వార్డుకు రూ. 10లక్షలు కౌన్సిలర్గా పోటీచేసే తన ప్యానల్కు ఇస్తానంటూ చెప్పుకుంటూ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ మాత్రం చాపకింద నీరులా ఎవరిని రంగంలోకి దింపాలో.. చైర్మన్ గిరిని కై వసం చేసుకునే దిశగా తెరవెనక చక్రం తిప్పుతోంది. డబ్బు ఉన్నోళ్లకే అందలం.. సీఎం ఇలాకాలోని కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీలు ఒక ఎత్తయితే.. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాకాలో మరో విధంగా పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రమైన నారాయణపేట మున్సిపాలిటీ మాత్రం అత్తా కోడళ్లకు సవాల్గా మారనుంది. నారాయణపేటలో అధికార పార్టీ కాంగ్రెస్తో పాటు బీజేపీ బలంగా ఉంది. బీఆర్ఎస్ సైతం తక్కువేమీ కాదనే పరిస్థితి కనిపిస్తుంది. అయితే జిల్లా కేంద్రంలో అందలం ఎక్కాలంటే ఏ పార్టీ ఆశావహులైనా రూ. 4కోట్ల వరకు ఖర్చుచేస్తే తప్ప చైర్మన్ అయ్యే పరిస్థితి లేదంటూ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. చైర్మన్గా అవకాశం ఇవ్వాలంటూ గత 10, 15 ఏళ్ల నుంచి పార్టీ జెండా మోసిన వారికి సైతం రూ. 3కోట్ల నుంచి రూ. 4కోట్లు ఉంటే చెప్పడి అంటూ బడా నేతలు నిర్మోహమాటంగా చెబుతుండటంతో నివ్వెరపోతున్నారు. పొత్తులో రెండు సీట్లు ఇస్తే రూ. 50లక్షలు ఇచ్చేందుకు సైతం ఓ పార్టీ మాజీ కౌన్సిలర్ అధికార పార్టీకి ఆఫర్ ఇచ్చినట్లు చర్చ కొనసాగుతోంది. అందులో పార్టీని నమ్ముకున్న వారికి టికెట్ ఇస్తారా.. లేక ఆఫర్ ఇచ్చిన వారికి టికెట్ ఇస్తారా అనే విషయం చర్చనీయాంశంగా మారింది. కోస్గి, మద్దూర్లో పోటాపోటీ సీఎం ఇలాకాలో కౌన్సిలర్ కావడం చాలా కాస్ట్ గురూ అంటూ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి చైర్పర్సన్ అయ్యేందుకు దాదాపు రూ. 5కోట్లు ఖర్చయ్యాయని బహిరంగంగానే చర్చ కొనసాగింది. ఈ సారి సైతం అంతకు తగ్గదని.. ఏ వార్డులో చూసినా రూ. 30లక్షల నుంచి రూ.40 లక్షల ఖర్చు చేసేందుకు తగ్గేదేలేదంటూ ఆశావహులు పేర్కొంటున్నారు. అధికార పార్టీలోనే అధికంగా పోటీపడుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారు సైతం తామేమీ తక్కువ కాదని.. తమ సిట్టింగ్ స్థానాల్లో తమకే అవకాశం కల్పించాలని పట్టు బడుతున్నట్లు తెలుస్తోంది. మక్తల్లో ‘మంత్రా’ంగంపైనే ఆశలు.. మక్తల్ మున్సిపాలిటీకి సంబంధించి మంత్రి వాకిటి శ్రీహరి మనసులో ఎవరున్నారనేది ఇప్పటి వరకు బయటికి రాలేదు. మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవాలని ‘మంత్రా’ంగంతో తెరవెనుక రాజకీయం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎత్తుగడలను పసిగడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్లు వ్యూహాలు రచిస్తున్నాయి. కౌన్సిలర్ కావాలంటే కనీసం రూ. 10లక్షల నుంచి రూ. 20లక్షలు కావాల్సిందేనంటూ చర్చ కొనసాగుతోంది. పుర పోరులో వ్యయానికివెనకాడని ఆశావహులు ఒక్కో మున్సిపాలిటీలో రూ. 3కోట్ల నుంచి రూ. 5కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం మంద బలం.. మనీ ఉన్నోళ్లకే ప్రాధాన్యం ఇస్తున్న పార్టీల నేతలు రోజురోజుకు వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం -
వడ్డీ చెల్లించాలంటూ ఒత్తిడి..
అమరచింత యూనియన్ బ్యాంక్లో రూ.75 వేల చేనేత రుణం తీసుకున్నా. ఏటా వడ్డీ చెల్లిస్తూ రుణాన్ని పునరుద్ధరించుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వం చేనేత రుణమాఫీ వర్తింపజేస్తామని ప్రకటించడంతో చెల్లించలేదు. ఇప్పుడు ఏడాది అవుతుందని.. వడ్డీ చెల్లించి పునరుద్ధరించుకోవాలని మేనేజర్ ఒత్తిడి చేస్తున్నారు. డబ్బులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాం. – కొంకతి శకుంతలమ్మ, చేనేత కార్మికురాలు, అమరచింత రాష్ట్ర ప్రభుత్వం చేనేత రుణమాఫీపై ప్రకటన చేసి ఏడాదిన్నర గడుస్తున్నా.. నేటికీ సగం నిధులు మాత్రమే మంజూరు చేసింది. వాటిని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న చేనేత కార్మికులపై బ్యాంకు మేనేజర్ వేధింపులు అధికమవుతున్నాయి. ప్రభుత్వం త్వరగా రుణమాఫీ ప్రక్రియ పూర్తిచేసి నేతన్నలను ఆదుకోవాలి. – వగ్గు రామలింగం, ఉపాధ్యక్షుడు, చేనేత సహకార సంఘం, అమరచింత -
గణనకు సిద్ధం
● పక్కాగా వన్యప్రాణుల లెక్క ● నల్లమలలో నేటినుంచి 25వ తేదీ వరకు లెక్కింపు ● 214 బీట్లలో జంతు సర్వేకు అటవీశాఖ సన్నాహాలు ● ఈసారి కొత్తగా ఔత్సాహిక వలంటీర్లకు అవకాశం ● ఎప్పటికప్పుడు ఏఐటీఈ యాప్లో నమోదు అచ్చంపేట: పులులు, జంతువుల లెక్క తేల్చేందుకు అటవీశాఖ సిద్ధమైంది. నాలుగేళ్లకోసారి జనవరి నెలలో వన్యప్రాణి గణన నిర్వహించనుండగా.. సోమవారం నుంచి ఈ నెల 25 వరకు ప్రక్రియ కొనసాగనుంది. జిల్లాలోని అమ్రాబాద్ అభయారణ్యంలో లెక్కింపునకు రంగం సిద్ధం చేశారు. డెహ్రాడూన్ వైల్డ్లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) ఆధ్వర్యంలో గణన చేపడుతున్నారు. పులులతోపాటు శాకాహార, మాంసాహార జంతువులు ఎన్ని ఉన్నాయనే వివరాలు సైతం సేకరిస్తారు. ఎంపిక చేసిన టీంలలో ఇద్దరు చొప్పున సభ్యులు ప్రతిరోజు ఐదు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో పర్యటించి జంతు గణన చేపడుతారు. ఇందుకు గాను అడవిలో మార్కింగ్, డైరెక్షన్స్, మ్యాపులను అధికారులు ప్రకటించారు. గణన నిర్వహించే బయటి సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. కాగా మొదటి విడతగా 19 నుంచి మూడురోజుల పాటు మాంసాహార జంతువుల గణన కొనసాగనుంది. ఇందులో కేవలం జంతువుల వివరాలు, పాదముద్రలు సేకరిస్తారు. 23 నుంచి మూడు రోజులపాటు శాకాహార జంతువుల గణన ఉంటుంది. ఈ మేరకు గుర్తించిన వాటి వివరాలను ఎప్పటికప్పుడు ఏఐటీఈ (ఆలిండియా టైగర్స్ ఎస్టిమేషన్) యాప్లో నమోదు చేస్తారు. ఆ తర్వాత ఆన్లైన్లో పొందుపరుస్తారు. సర్వే సిబ్బందికి టీషర్టులు, క్యాప్లతోపాటు ఓ కిట్ బ్యాగ్ ఇస్తారు. అందులో పేపర్, పెన్ను, జిప్లాక్ (ఆనవాళ్ల సేకరణకు ఉపయోగించే పదార్థం) ఉంటాయి. అమ్రాబాద్ అభయారణ్యంలో జీవ వైవిధ్యంతోపాటు జంతువుల వృద్ధికి అనుకూల వాతావరణం ఉండటంతో వాటి సంతతి పెరుగుతోంది. గత జంతుగణన సమయంలో వేల సంఖ్యలో వన్యప్రాణులు ఉన్నాయి. పులులు, చిరుతలతోపాటు ఎలుగుబంట్లు, తోడేళ్లు, జింకలు, నక్కలు, రేసు కుక్కలు, కొండ గొర్రెలు, చుక్కల దుప్పులు, కణతులు, కుందేళ్లు, మూషిక జింకలు, అడవి పందులు పెద్దమొత్తంలో మనుగడ సాగిస్తున్నాయి. బీట్కు ఇద్దరు చొప్పున కావాల్సిన సిబ్బంది 428 -
నారసింహుడి రథోత్సవం
● కనులపండువగా సాగిన లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం ● సంప్రదాయబద్ధంగా వేడుక నిర్వహించిన సురభి రాజవంశీయులు ● వేలాదిగా తరలివచ్చిన భక్తజనం ● జనసంద్రంగా మారిన శ్రీవారి సముద్రకట్ట, జాతర ప్రాంగణం ఉత్సవమూర్తులు రథోత్సవానికి పోటెత్తిన భక్తజనం – కొల్లాపూర్/ కొల్లాపూర్ రూరల్– వివరాలు 8లో.. -
చేనేత రుణమాఫీకి బ్రేక్!
● పూర్తిస్థాయిలో మంజూరయ్యే వరకు నిలిపివేయాలని ఆదేశాలు ● ఉమ్మడి జిల్లాలో 2,321 మంది కార్మికులు ● డబ్బులు చెల్లించాలంటూ బ్యాంకర్ల ఒత్తిడి ● ఆందోళనలో నేతన్నలు ●అమరచింత: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా గతేడాది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేనేత కార్మికులకు రూ.లక్ష రుణమాఫీ వర్తింపజేస్తామని ప్రకటించారు. 16 నెలలు గడుస్తున్నా.. నేటి వరకు సగం నిధులు మాత్రమే విడుదల చేసి వాటిని కూడా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయొద్దని ఆదేశాలిచ్చింది. పూర్తిస్థాయిలో విడుదల చేసిన తర్వాతే కార్మికుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో చెల్లించాలని చెప్పడంతో చేనేత రుణమాఫీ ప్రక్రియ నిలిచిపోయింది. రుణమాఫీకి అర్హులైన వారి వివరాలను చేనేత జౌళిశాఖ అధికారులు బ్యాంకర్ల నుంచి సేకరించి నివేదికను రాష్ట్ర కమిటీకి అందజేసినా.. నిధులు మాత్రం జమకాలేదు. అప్పుడు.. ఇప్పుడంటూ ఏడాదిన్నరగా కాలం వెళ్లదీస్తున్నారని, బ్యాంకర్లు మాత్రం తీసుకున్న రుణం చెల్లించాలని ఒత్తిడి పెంచడంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. చేనేత రుణాలు తీసుకున్న వారి ఖాతాల లావాదేవీలను అమరచింత యూనియన్ బ్యాంక్ మేనేజర్ నిలిపివేయడంతో ఆయన తీరును తప్పుబడుతూ బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రుణమాఫీ నిధులు వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,321 మంది చేనేత కార్మికులు రుణమాఫీకి అర్హులని జిల్లా అధికారులు గుర్తించి రూ.15.36 కోట్లు అవసరమని రాష్ట్ర జౌళిశాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం మాత్రం మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాలకు మొత్తం నిధులు.. జోగుళాంబ గద్వాల, వనపర్తికి సగం నిధులు మాత్రమే మంజూరు చేసింది. ఇలాంటి సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా ఉండటంతో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని భావించి అన్ని జిల్లాలకు మొత్తం నిధులు మంజూరయ్యే వరకు రుణమాఫీ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించినట్లు సమాచారం. జిల్లా కార్మికుల మంజూరు సంఖ్య కావాల్సిన నిధులు (రూ.కోట్లలో..) జో. గద్వాల 1,792 11.79 వనపర్తి 338 2.50 నారాయణపేట 122 0.70 మహబూబ్నగర్ 54 0.27 నాగర్కర్నూల్ 15 0.09 ఏడీ ఖాతాలో సగం నిధులు మాత్రమే వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో చేనేత రుణాలు తీసుకున్న కార్మికుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించాం. వీటికి సంబంధించి ప్రభుత్వం సగం నిధులు మాత్రమే మంజూరు చేసింది. పూర్తిస్థాయి నిధులు మంజూరైన వెంటనే నేత కార్మికుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమచేస్తాం. – గోవిందయ్య, ఏడీ, చేనేత జౌళిశాఖ, గద్వాల -
జిల్లా రద్దుచేస్తే అగ్నిగుండమే.. : బీఆర్ఎస్
నారాయణపేట: సకల జనుల ఉద్యమాలు.. పోరాటాలు...ఆందోళనలతో సాధించుకున్న నారాయణపేట జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తే అగ్నిగుండమే అవుతుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి హెచ్చరించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం 2019, ఫిబ్రవరి 17న నారాయణపేట జిల్లా ఏర్పాటు చేశారన్నారు. దీంతోనే మెడికల్, నర్సింగ్ కళాశాలలు, సమీకృత కలెక్టరేట్ తదితర అభివృద్ధి పనులు కొనసాగాయని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల విషయంలో విశ్రాంత న్యాయమూర్తితో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు కమిటీ వేస్తామని ప్రకటించిందని.. పుర ఎన్నికల్లో ఎక్కడ దెబ్బపడుతుందోనని కొత్త నాటకానికి తెర తీసిందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని తమతో పంచుకున్నారని, బడ్జెట్ సెషన్లో కమిటీ వేస్తే నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాలను తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. డీలిమిటేషన్ తర్వాత ఎంపీ స్థానాలు ఎన్ని ఉంటే అన్ని జిల్లాలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని. రాష్ట్రంలో 12 జిల్లాలు రద్దయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. జిల్లా ఏర్పాటుకు ఎలా పోరాటం చేశామో.. నిలుపుకోవడానికి అంతకు రెట్టింపు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కోర్టు, ఎస్పీ కార్యాలయ నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదని, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల తరలివెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. వైద్య కళాశాల ఇప్పటికీ ప్రభుత్వ ఆస్పత్రి భవనంలో కొనసాగుతోందని తెలిపారు. 90 శాతం పూర్తయిన పాలమూరు ప్రాజెక్టును జూరాల నుంచి నిర్మించి ఉంటే బాగుండేదని ఎంపీ అరుణ అంటుంది కానీ.. 12 ఏళ్ల కింద పీఎం వచ్చి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని చెప్పి వెళ్లారన్నారు. ఈ విషయాన్ని ఇప్పటి వరకు పార్లమెంట్లో ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్పార్టీలు ఒక్కటే అనడానికి పాలమూరులో జరిగిన సీఎం సభ అని మరోసారి రుజువైందని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు విజయ్సాగర్, వేపూరి రాములు, సుదర్శన్రెడ్డి, కన్నా జగదీశ్, హన్మంత్రెడ్డి, దస్తగిర్ చాంద్, సురేందర్రెడ్డి, మహిమూద్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
నారాయణపేట రూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో 35వ సబ్ జూనియర్ ఖో–ఖో పోటీలను వారు ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో స్నేహభావంతో పాటు మానసికోల్లాసం, దేహ దారుఢ్యం పెంపొందుతాయని తెలిపారు. పోటీల్లో గెలుపోటములు సహజమని.. ఓటమిని స్ఫూర్తిగా తీసుకుంటే గెలుపు వరిస్తుందని చెప్పారు. జిల్లామంత్రి చొరవ చూపితే రెండేళ్లలో అద్భుతమైన స్టేడియాన్ని నిర్మిస్తారని తెలిపారు. ఈ ఏడాది రెండు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. రాబోయే రోజుల్లో క్రీడల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రయత్నించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సదాశివారెడ్డి, ఖో–ఖో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, ఉమ్మడి జిల్లా కార్యదర్శి మిలియన్, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ హరినారాయణ భట్టడ్, డీవైఎస్ఓ వెంకటేష్ శెట్టి తదితరులు పాల్గొన్నారు. పురందరదాసుల ఆరాధనోత్సవాలు నారాయణపేట: పట్టణంలోని రాఘవేంద్రస్వామి ఆలయంలో ఆదివారం పురుందరదాసుల ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిమజ్జనం ఎరగని వినాయకుడు, అనంతసేన ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాల్లో పూజలు చేశారు. అనంతరం హరిదాసుల సంకీర్తనలతో పురవీధుల్లో గోపాల కార్యక్రమం నిర్వహించారు. రాఘవేంద్రస్వామి ఆలయంలో పల్లకీసేవ, సర్వసేవ కార్యక్రమాలు జరిగాయి. ప్రముఖ జ్యోతిష్య పండితుడు విద్వాన్ అనిల్ దేశాయి పురందరదాసుల జీవిత చరిత్రను భక్తులకు వివరించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకుడు నర్సింహచారి, సేవాసమితి సభ్యులు రఘుప్రేమ్ జ్యోషి, నర్సింహ, మంజునాథ జ్యోషి, నారాయణరావు, సీతారామారావు, శ్రీహరి, ప్రహ్లాద, నరహరి, రాఘవేంద్ర, శేషు, భరత్, ప్రభంజన్రావు, దరణీధర్, ధీరజ్ దీక్షిత్, గురురాజ్, అనిరుధ్, ప్రదీప్, రవితేజ, రామ్మోహన్రావు, రాఘవేందర్రావు, మహిళా భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా నిర్వహిస్తాం..
జిల్లాలో సోమవారం నుంచి జంతుగణన పకడ్బందీగా చేపడుతాం. ఇందుకు గాను 214 బీట్లలో తమ సిబ్బందితోపాటు వలంటీర్లను నియమించాం. వీరికి తోడుగా బేస్ క్యాంపు సిబ్బంది, వాచర్లు ఉంటారు. డీఆర్ఓలు, బీట్ అధికారులు, వలంటీర్లు బీట్కు ఇద్దరు చొప్పున లెక్కిస్తారు. మొదటి మూడు రోజులు మాంసాహార, తర్వాత మూడు రోజులు శాకాహార జంతువుల గణన ఉంటుంది. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు లెక్కించి ఆ తర్వాత యాప్లో నమోదు చేస్తారు. – రేవంత్చంద్ర, జిల్లా అటవీశాఖ అధికారి● -
పుర చైర్మన్ పీఠంపై గురి!
నారాయణపేట: త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల బరిలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు క్యాడర్ను సమాయత్తం చేస్తున్నాయి. తమకే టికెట్ ఇవ్వాలంటూ ఆశావహులు ప్రధాన నేతలను అభ్యర్థిస్తున్నారు. ● జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 72 వార్డులున్నాయి. నారాయణపేట పుర పరిధిలోని 24 వార్డుల్లో అధికార పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డితో తమకు టికెట్ ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. బీఆర్ఎస్లో సైతం తమకు టికెట్ ఇవ్వాలంటూ ఆ పార్టీ ఆశావహులు మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డిని అభ్యర్థిస్తున్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్కు ఆశవాహులు దరఖాస్తులు సమర్పించారు. ● నారాయణపేట పుర చైర్మన్ జనరల్ మహిళకు కేటాయించారు. బీఆర్ఎస్లో మార్కెట్ మాజీ చైర్మన్ మసటి జ్యోతి, మాజీ కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ, మాజీ కౌన్సిలర్ అమ్మపల్లి శీరిష పేర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలోనూ పోటీ ఉండటంతో కౌన్సిలర్గా గెలుపొందిన తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తామనే సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ మాజీ చైర్మన్లు బండి వేణుగోపాల్, సరాఫ్ నాగరాజు, పుర మాజీ వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు కృష్ణ కోర్వర్, కాంట్రాక్టర్ గొల్ల రవికుమార్ సతీమణులను రంగంలోకి దింపి చైర్పర్సన్ చేయాలని అధికార పార్టీ శ్రేణులు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, మాజీ కౌన్సిలర్ రఘురామయ్యగౌడ్, మాజీ కౌన్సిలర్ సత్యరఘుపాల్రెడ్డి, బిల్డర్ వెంకట్రాములు సతీమణుల పేర్లు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల వేటలో ప్రధాన పార్టీలు పేటలో పాగవేసేందుకు కాంగ్రెస్ కసరత్తు ఎత్తుగడలో బీఆర్ఎస్, బీజేపీలు సీఎం, మంత్రి ఇలాఖాలో సవాల్గా తీసుకుంటున్న ప్రతిపక్షాలు ఊపందుకున్న ఆశావహుల ప్రయత్నాలు మంత్రి ఇలాఖాలో.. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలోని మక్తల్ పుర చైర్మన్ స్థానం జనరల్ కావడంతో అధికారపార్టీ అందలం ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా.. బీజేపీ మరోసారి పాగా వేయాలని ఎత్తుగడ వేస్తోంది. ఈసారి ఎలాగైనా పట్టు సాధించి గులాబీజెండా ఎగరరేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఎంపీటీసీ మాజీ సభ్యుడు కోళ్ల వెంకటేశ్ ముదిరాజ్, మాజీ ఉప సర్పంచ్ కట్టా సురేశ్ పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీలో మాజీ చైర్పర్సన్ పావని భర్త మల్లికార్జున్, మాజీ వైస్ చైర్మన్ అఖిలరెడ్డి భర్త రాజశశేఖర్రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఆనంపల్లి కొండయ్య ముదిరాజ్, బీఆర్ఎస్ నుంచి మార్కెట్ మాజీ చైర్మన్ నర్సింహగౌడ్ సతీమణి ధనలక్ష్మి, పి.విష్ణువర్దన్రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కాగా ఆయా పురపాలికల్లో ఎవరిని చైర్మన్ పీఠం వరిస్తుందో వేచి చూడాలి మరి. -
రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి
నారాయణపేట: నూతన సంవత్సరంలో వ్యవసాయ అధికారులు రైతుల సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. తెలంగాణ వ్యవసాయశాఖ అధికారుల సంఘం నారాయణపేట జిల్లా, తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ నారాయణపేట జిల్లా సంఘాల ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ను శనివారం ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్, తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం చైర్మన్ నగేశ్ కుమార్ , అధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి సుదర్శన్గౌడ్, కోశాధికారి హరిత, తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మిథున్ చక్రవర్తి, జనరల్ సెక్రటరీ రమేష్, కోశాధికారి నవీన్, ఇరు సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
దళారుల పత్తి దందా!
మరికల్: పత్తి క్రయ విక్రయాలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం రూపొందించిన సాంకేతికతను వినియోగించుకొని దళారులు అక్రమాలకు తెర లేపారు. రైతు పత్తి సాగుచేసి ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు ధ్రువీకరణ ఉంటుంది. రైతే కపాస్ యాప్లో స్లాట్ బుక్ చేసుకుంటారు. వచ్చి వేలిముద్ర వేసి పత్తి తనదేనని ధ్రువీకరిస్తారు. అధికారులకు సైతం అంతుపట్టని విధంగా దళారులు రైతుల పేరిట సాగిస్తున్న దందా ఇది. జిల్లాలో సాగు.. జిల్లావ్యాప్తంగా 6.23 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పత్తి విక్రయాల్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సీసీఐ కపాస్ కిసాన్యాప్ ద్వారా బుకింగ్ విధానం అమలు చేస్తోంది. దీని ప్రకారం జిల్లాలోని ఏ కేంద్రంలోనైనా స్లాట్ బుక్ చే సుకొని పత్తి విక్రయించుకునే వీలుంది. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు దళారులు దందా సాగిస్తున్నారు. మరికల్, మక్తల్, ఊట్కూర్, నర్వ తదితర మండలాల్లో అధిక శాతం రైతుల పేరిట రాజమార్గంలో సీసీఐకి పత్తి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. విక్రయిస్తున్నారు ఇలా.. గ్రామాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసిన పత్తిని ఒకేసారి పెద్ద మొత్తంలో భారీ వాహనాల్లో నింపుతున్నారు. పత్తి సాగు చేసిన రైతులను ఎంపిక చేసుకొని వారి పట్టాదారు పాసు పుస్తకాల జిరాక్స్లు తీసుకొని వారికి సంబంధించిన ఒకరి పేరున స్లాట్ బుక్ చేస్తారు. పట్టాదారు రాలేరని లేదా కౌలు తీసుకొని సాగు చేస్తున్నట్లు ఏఈఓల నుంచి ధ్రువీకరణపత్రాలు తీసుకొని సీసీఐలో సంబంధిత రైతు పేరున విక్రయిస్తున్నారు. రెండు, మూడు స్లాట్లు ముందే బుక్ చేసుకొని వేర్వేరు రైతుల పేరున విక్రయిస్తారు. అధికారులు విచారణ చేసినా ఎక్కడా ఆధారాలు లభించే అవకాశం లేదు. ఒకవేళ అనుమానం వచ్చి నిలదీసినా పత్తి సాగు చేశామని, దొంగ దందా చేసేందుకు తమకు ఏం కర్మంటూ ఏఈఓలతో గొడవకు దిగుతున్నారు. కర్ణాటక నుంచి కూడా.. కొందరు రాష్ట్ర సరిహద్దులోని కర్ణాటక నుంచి పత్తి కొనుగోలు చేసి స్థానిక రైతుల పేరున విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెక్పోస్టు వద్ద ఎంతోకొంత ముట్టజెప్పి వాహనాలను జిల్లా లోని సీసీఐ కేంద్రాలకు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. రైతుల ఇళ్లల్లో నిల్వలు లేవని.. సీజన్ చివరిలో ఇంత పెద్దమొత్తంలో పత్తిని ఎలా తెస్తారని ఇతర రైతులు ప్రశ్నిస్తున్నారు. భారీ వాహనాల్లో వస్తున్న పత్తికి సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలించకపోవడంతో దళారుల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. రైతుకు క్వింటాకు రూ.250 స్లాట్బుక్ చేసి సీసీఐలో విక్రయిస్తే రైతుకు క్వింటాకు రూ.250 చొప్పున దళారి చెల్లిస్తున్నారు. సీసీఐ దగ్గర ఫొటో దిగడానికి వస్తే మద్యంతో పాటు బిర్యాని ప్యాకెట్ ఇస్తారు. అనుమానం వచ్చి ఆరా తీసిన ఏఈఓలతో రైతులతో పాటు దళారులు కూడా గొడవలకు దిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. నిబంధనలు ఇలా.. పత్తి విక్రయించే రైతు కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. తప్పనిసరిగా కేంద్రానికి వచ్చి వేలిముద్ర వేయాలి. ఎకరాకు ఏడు క్వింటాళ్ల చొప్పున ఒకరోజు 35 క్వింటాళ్లకు మించి విక్రయించడానికి లేదు. రైతుల పేరిట స్లాట్ బుకింగ్ ‘కపాస్’ సాక్షిగా అక్రమాలు క్వింటాకు రూ.250 చొప్పున రైతులకు చెల్లింపు అధికారులకు సైతం అంతుచిక్కని అక్రమ వ్యాపారం -
కేంద్రం నుంచి పూర్తి సహకారం..
పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి ఎలాంటి ఎలాంటి కృషి చేయలేదని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.పాలమూరు అభివృద్ధి దిశగా పయనించేందుకు సీఎం రేవంత్రెడ్డిపై గురుతర బాధ్యత ఉందన్నారు. అందుకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయన్నారు. కేంద్ర, రాష్ట్ర వాటా నిధులతో వివిధ పథకాల పూర్తికి కృషి చేస్తామన్నారు.విద్యపరంగా పీయూ అభివృద్ధికి రూ.120 కోట్లు ఇచ్చామన్నారు. పాలమూరులో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, వెంటనే బాగు చేయించాలని కోరారు. -
కంప్యూటర్ హబ్ పనుల్లో వేగం పెంచాలి
కోస్గి రూరల్: అటల్ టింకరింగ్ కంప్యూటర్ హబ్ ఏర్పాటుకుగాను పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలోని కోస్గి బాలికల ఉన్నత పాఠశాల ఎంపికై ంది. శనివారం నిర్మాణ పనులను జిల్లా విద్యాధికారి గోవిందరాజులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణ పనులకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.14 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. వీటితో 8 లాప్టాప్లు, పెద్ద టీవీతో పాటు ఇతర సామగ్రి కొనుగోలు చేయనున్నామని చెప్పారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఉపాధ్యాయులకు సాఫ్ట్వేర్ సమస్యలు, ఏఐ ఆధారిత విద్యపై శిక్షణ సైతం ఇక్కడే ఇవ్వనున్నట్లు వివరించారు. అనంతరం బీసీకాలనీలో రూ.5 కోట్లతో చేపడుతున్నట్లు సైన్స్ మ్యూజియం నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన వెంట మండల విద్యాధికారి శంకర్నాయక్, యాదయ్యశెట్టి తదితరులు ఉన్నారు. -
పాలమూరు, రాష్ట్ర సరిహద్దు వరకూ దాన్ని తరిమికొట్టాలి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘ఎన్నికల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడగట్టాం. 2024లో గుండుసున్నా ఇప్పించినం. కాంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బొందపెట్టినం. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 66శాతం సర్పంచ్లను గెలిపించుకున్నం. అంతే నాకు శత్రువులు ఎవరూ లేరు. పేదరికం, మహిళలకు అన్యాయం చేసేవాళ్లు, విద్యార్థులకు నష్టం చేసేవాళ్లు మాకు శత్రువులు. పేదరికాన్ని పాలమూరు నుంచి, రాష్ట్ర సరిహద్దు దాటే వరకూ తరిమి కొట్టాలన్నదే మా లక్ష్యం.’ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్లో రూ.1,284 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంవీఎస్ మైదానంలో జరిగిన బహిరంగసభలో ప్రజనుద్దేశించి మాట్లాడారు. ఉచితంగా ఏది ఇచ్చినా శాశ్వతం కాదని.. విద్య ఒక్కటే శాశ్వతం. విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత తీరాలను చేరాలని ఆకాంక్షించారు. దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ స్ఫూర్తితో విద్య, సాగునీటికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. చదువే మన భవిష్యత్ను మారుస్తుందని.. పాలమూరులో పంటలు పండి రైతుల కళ్లల్లో ఆనందం నిండాలని ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేసే బాధ్యత తనదన్నారు. ఇది వేగంగా సాగేలా ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ భూసేకరణ, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పెండింగ్లకు సంబంధించి బాధితులకు నష్ట పరిహారం ఇప్పించాలని సూచించారు. రేవంత్రెడ్డి ఇంకేమన్నారో ఆయన మాటల్లోనే.. పర్యాటక ప్రాంతాలుగా మార్చి ప్రాజెక్ట్లు చూపించాలి.. గతంలో టోనీబ్లెయర్, బిల్గేట్స్ వంటి వారు దేశంలో పర్యటనలు చేసేవారు. పాలమూరు పేదరికాన్ని చూపెట్టేందుకు ఆనాటి ముఖ్యమంత్రులు వారిని మన ప్రాంతానికి తీసుకొచ్చేవారు. ఇక్కడ ప్రజలు వలసపోతున్నారు.. బట్టలు లేవు.. తిండి లేదంటూ వారికి చూపించి బిచ్చం వేయాలని కోరేవారు. ఇది ఎంత బాధాకరం. అందుకే మన అభివృద్ధిని చూపించేలా మార్పురావాలి. పర్యాటక ప్రాంతాలుగా మార్చి మన ప్రాజెక్ట్లను చూపాలి, ట్రిపుల్ ఐటీ, ఐఐఎంలు చూపించాలి. పాలమూరు నుంచి దేశానికి సేవలు అందించాలి. అదే లక్ష్యంగా కృషి.. విద్య, సాగునీటికే మా మొదటి ప్రాధాన్యం త్వరలో 35 లక్షల మంది పట్టణ మహిళలకు ఇందిరమ్మ చీరలు బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి రూ.1,284 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలు
నారాయణపేట: మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన ప్రచార కరపత్రాలను శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని ఒక బాలుర, ఒక బాలికల గురుకులంలో 5వ తరగతిలో ప్రవేశాలకు అన్నివర్గాలకు, అలాగే 6, 7, 8వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకు మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అలాగే మక్తల్లోని టీజీఎంఆర్జేసీ (బాలికలు) ఎంపీసీ, బైపీసీలో, నారాయణపేటలోని బాలుర కళాశాలలో ఎంపీసీ, బైపీసీలో ప్రవేశాలకు tgmries telangana.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు సమీపంలోని పాఠశాల, కళాశాలలలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో అధికారులు షమీం, జమీర్ఖాన్, మసూద్, ప్రిన్సిపాల్స్ జగదీశ్వర్, ఖాజా మహబూబ్ఖాన్, ఎలిజబెత్రాణి పాల్గొన్నారు. -
నేడు కోర్టు ప్రారంభం
మక్తల్: పట్టణంలో ఏర్పాటు చేసిన జూనియర్ మున్సిఫ్ కోర్టును శనివారం హైకోర్టు న్యాయవాదులు అనిల్కుమార్ జూకంటి, మాధవీదేవిప్రారంభించనున్నట్లు మక్తల్ న్యాయవాదుల కమిటీ శుక్రవారం తెలిపింది. కార్యక్రమానికి న్యాయవాదులు, పట్టణవాసులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 104 ఉద్యోగుల పెన్డౌన్ నారాయణపేట: బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలంటూ జిల్లాలోని 104 ఉద్యోగులు శుక్రవారం పెన్డౌన్ నిర్వహిస్తూ జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్కు నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం 8 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, దీంతో తమ కుటుంబాలు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పెన్డౌన్ చేపట్టామని, తమ సేవల్ని గుర్తించి వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో 104 ఉద్యోగులు ప్రకాష్గౌడ్, శ్రీనివాస్, సత్యకుమార్, కృష్ణయ్య, రేణుక, స్వామి, రవికుమార్, వెంకటేష్, భాగ్యరేఖ తదితరులు పాల్గొన్నారు. పురపాలికపై బీజేపీ జెండా ఎగరాలి నారాయణపేట: రాబోయే పుర ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అధికసంఖ్యలో గెలిపించాలని.. మున్సిపాలిటీపై జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగూరావు నామాజీ పిలుపునిచ్చారు. గురువారం జిల్లాకేంద్రంలోని 19వ వార్డుకు చెందిన 50 మంది యువకులు పార్టీ పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు నాగూరావు నామాజీ, రతంగ్పాండురెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ సమక్షంలో పార్టీలో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ యువత పెద్దసంఖ్యలో పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. పుర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని.. అందుకే పార్టీలో చేరినట్లు యువకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా, పట్టణ నాయకులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన
నారాయణపేట: జిల్లాకేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో శుక్రవారం ఆర్టీసీ డ్రైవర్లు, వాహనదారులకు ‘అరైవ్.. అలైవ్’ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రైవర్లు బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడపరాదని, వేగ నియంత్రణ పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనాలు నడిపేవారు విధిగా సీట్ బెల్ట్ ధరించాలన్నారు. వాహనాలు నడిపే సమయంలో సెల్ఫోన్ వినియోగించరాదని, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. రహదారి భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాలను తగ్గించి ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చని తెలిపారు. ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య, ఏఎంవీఐ సాయితేజారెడ్డి రోడ్డు భద్రత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి హాజరైన డ్రైవర్లు, వాహనదారులు పోలీసుల సూచనలు, నియమాలు పాటిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని ఎస్ఐ చెప్పారు. -
తెగ తాగేశారు..!
● ఉమ్మడి జిల్లాలో 4 రోజుల్లో రూ.64.9 కోట్ల మద్యం విక్రయాలు మహబూబ్నగర్ క్రైం: సాధారణ రోజుల్లోనే మద్యం దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. దానికి తోడు పండుగలు కలిసి వస్తే ఇంకా రెట్టింపు స్థాయిలో అమ్మకాలు పెరుగుతాయి. సంక్రాంతి నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న 227 మద్యం దుకాణాల్లో నాలుగు రోజుల్లో భారీ స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. అలాగే మటన్, చికెన్, నాటుకోడి అమ్మకాలు గణనీయంగా జరిగా యి. ప్రధానంగా నగరంలో శుక్రవారం ఉదయం నుంచే రోడ్లపై ప్రత్యేకంగా తాత్కాలికంగా అడా ్డలు ఏర్పాటు చేసుకుని మటన్, చేపల విక్రయా లు అధికంగా చేశారు. తిమ్మాజిపేట డిపో పరిధి లో రూ.39.9కోట్ల మ ద్యం, కొత్తకోట డిపో నుంచి రూ. 25 కోట్ల వరకు లిఫ్ట్ చేసి దుకాణాలకు తరలించారు. -
పాలమూరు అస్త్రంగా..
నేడు మహబూబ్నగర్కు సీఎం రేవంత్రెడ్డి రాక –IIలో uఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ముస్తాబైన సీఎం బహిరంగ సభ ప్రాంగణం సాక్షి ప్రతినిధి మహబూబ్నగర్: జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి శనివారం మహబూబ్నగర్ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు సుమారు రూ.1,284 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగసభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీరందించే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు పుర పాలక ఎన్నికల ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా.. ముఖ్యమంత్రి సభలోఏం మా ట్లాడుతారోననే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రూ.883 కోట్లతో యూజీడీ, శాశ్వత తాగునీరు.. కార్పొరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, శాశ్వత తాగునీటి సరఫరా, పైపు లైన్లు తదితర సమస్యల పరిష్కారం కోసం రూ.883 కోట్లు ఇదివరకే మంజూరైన విషయం తెలిసిందే. ఇందులో రూ.603 కోట్లతో మురుగు నీటిని నగరం బయటకు తరలించే సీవర్ లైన్ కాల్వ ఏర్పాటు చేయనున్నారు. ● నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీకి అనుబంధంగా క్యాంపస్ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. గతేడాది మేలో మంజూరు కాగా.. ఈ విద్యాసంవత్సరం నుంచే క్లాసులు ప్రారంభమయ్యాయి. ట్రిపుల్ ఐటీ కోసం సొంత భవనాన్ని నేషనల్ హైవేకు సమీపంలో ఉన్న దివిటిపల్లి–ఎదిర, జడ్చర్ల మండలం చిట్టబోయిన్పల్లి, మల్లెబోయిన్ పల్లి వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడ 44 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండడంతో.. అక్కడ పనులు మొదలు పెట్టేందుకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపింది. ట్రిపుల్ ఐటీ భవనాల నిర్మాణం కోసం రూ.600 కోట్లను అవసరం కాగా.. రూ.200 కోట్ల చొప్పున మొత్తం మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేయనుంది. తాజాగా మొదటి విడత కింద రూ.200 కోట్లు మంజూరు చేయగా.. భవన నిర్మాణ పనులకు నేడు ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్నారు. సీఎం పర్యటనపై సర్వత్రా ఆసక్తి.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతేఏడాది డిసెంబర్ ఒకటిన నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో పర్యటించారు. రూ.4,500 కోట్లతో చేపట్టనున్న కొడంగల్ – నారాయణపేట – మక్తల్ ఎత్తిపోతల పథకానికి భూమి పూజ చేశారు. అనంతరం సభలో త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయని సూచన ప్రాయంగా చెప్పారు. ఈ మేరకు రెండు రోజులకే ఎన్నికల షెడ్యుల్ విడుదల అయింది. ఆ తర్వాత అదే నెల డిసెంబరు 24న తన సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గికి వచ్చారు. నూతనంగా గెలుపొందిన నియోజకవర్గ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొని మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షలు ప్రకటించారు. తాజాగా శనివారం ఆయన మహబూబ్నగర్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో పుర ఎన్నికల షెడ్యూల్ వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మహబూబ్నగర్లో పర్యటించిన క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి తీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. దీనిపై సైతం సీఎం స్పందించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సుమారు రూ.1,284 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ట్రిపుల్ ఐటీ భవన నిర్మాణానికి భూమిపూజ నగరంలో యూజీడీ, తాగునీటి పనులకు.. ఎంవీఎస్ మైదానంలో బహిరంగ సభ ముఖ్యమంత్రి సభపై సర్వత్రా ఆసక్తి -
సంక్రాంతి సందడి
● రంగుల్లులతో శోభిల్లిన లోగిళ్లు ● ఇంటింటా కలకూరగాయ.. సద్ద, నువ్వుల రొట్టెలు నారాయణపేట: సరదాల సంక్రాంతి సంబరాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు భోగి పండగను జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో నిర్వహించుకున్నారు. తెల్లవారుజామునే మహిళలు ఇంటి ముంగిళ్లలో కల్లాపి చల్లి రంగవల్లులతో సుందరంగా అలంకరించారు. వాటిలో కొత్తగా పండించిన ధాన్యం, గొబ్బెమ్మలను పెట్టి పూజలు చేశారు. భోగభాగ్యాలు కలగాలని భోగి మంటలు వేయగా.. యువత, చిన్నారులు సందడి చేశారు. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులకు భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు. అక్కడక్కడా బొమ్మల కొలువులను ఏర్పాటుచేశారు. మహిళలు వాయినాలను ఇచ్చి పుచ్చుకున్నారు. ఇంటింటా సద్ద, నువ్వుల రొట్టెలు, కలకూరగాయలతో ప్రత్యేక వంటకాలను తయారుచేసి ఇంటిల్లిపాది ఆనందంగా ఆరగించారు. చిన్నారులు పతంగులను ఎగరవేస్తూ సంతోషంగా గడిపారు. ఏ పల్లెలో చూసినా యువకుల ఆటపాటలు, బంధుమిత్రుల రాకలతో సందడిగా కనిపించాయి. ఇక గురువారం సంక్రాంతి పండగను ఘనంగా నిర్వహించుకోనున్నారు. మూడోరోజు శుక్రవారం కనుమ సందర్భంగా పశువులకు పూజలు చేసి.. విందు, వినోదాలతో సంబరాలు జరుపుకోనున్నారు. పండగ సందర్భంగా పలు గ్రామాల్లో యువతులు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి.. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. వాయినం ఇచ్చి పుచ్చుకుంటున్న మహిళలు -
‘పుర’ రిజర్వేషన్లు ఖరారు
నారాయణపేట: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు బుధవారం సీడీఎంఏ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని కోస్గి, మద్దూరు, మక్తల్, నారాయణపేట మున్సిపాలిటీల్లో 2011 జనాభా ప్రాతిపదికన ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ స్థానాలకు ఎన్ని సీట్లు కేటాయించాలనే దానిపై మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఏ వార్డుకు ఏ రిజర్వేషన్ కేటాయిస్తారనేది స్పష్టత రానుంది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ స్థానాల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంది. అయితే మూడు మున్సిపాలిటీల్లో ఒక్కొక్క స్థానాన్ని ఎస్టీ జనరల్కు కేటాయించారు. మద్దూర్ మున్సిపాలిటీలో ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళకు రెండు వార్డులను రిజర్వు చేశారు. నాలుగు మున్సిపాలిటీల్లో 72 వార్డులకు గాను ఎస్టీ జనరల్ 4, ఎస్టీ మహిళ 1, ఎస్సీ జనరల్ 6, ఎస్సీ మహిళకు 4, బీసీ జనరల్కు 12, బీసీ మహిళకు 9, జనరల్కు 14, జనరల్ మహిళకు 22 స్థానాలు కేటాయించారు. 72 స్థానాల్లో మహిళలకు 36 స్థానాలు దక్కనున్నాయి. అత్యధికంగా జనరల్ మహిళ స్థానాల్లోనే 22 మందికి అవకాశం కల్పించనున్నారు. -
డూడూ.. బసవన్న
అయ్య వారికి.. అమ్మవారికి దండంపెట్టు ● గంగిరెద్దులతో సంక్రాంతికి కళ ● పండగకు ముందు నుంచే సందడి ● ఉమ్మడి జిల్లాలో వంద కుటుంబాలపైగా గంగిరెద్దులోళ్లు జడ్చర్ల టౌన్: డూడూ బసవన్న అనగానే సంక్రాంతి సంబరాల్లో గంగిరెద్దు గుర్తుకు వస్తుంది. పండగ భోగి మొదలు కనుమ వరకు మూడు రోజుల పాటు గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ యాచిస్తూ గంగిరెద్దుల వాళ్లు చేసే విన్యాసాలు అలరిస్తుంటాయి. రెండు మూడు దశాబ్దాల కిందటి వరకు నాలుగైదు ఊర్లలో మూడు నాలుగు వందల కుటుంబాలు ఉండే గంగిరెద్దుల వాళ్లు ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 105 కుటుంబాలు మాత్రమే మిగిలాయి. గంగిరెద్దులను ఆడించే వారు యాదవ కులంకు చెందిన వారే అయినప్పటికీ వారితో సంబంధాలు అంతంత మాత్రమే. వీరిది అంతా సంచార జీవనమే. యాచక వృత్తి ప్రధానంగా జీవిస్తుంటారు. పండగలు, పర్వదినాలతో పాటు ఎవరైనా మరణిస్తే అక్కడ ప్రత్యక్షం అవుతుంటారు. ముఖ్యంగా పంటలు చేతికి వచ్చే సమయానికి గంగిరెద్దులతో వీరు ప్రత్యక్షం అవుతుంటారు. అప్పటి వరకు ఊరూరా సంచరిస్తూ జీవనం గడుపుతుంటారు. గంగిరెద్దు అలంకరణ ఎద్దుకు వారు చెప్పినట్లుగా ఆడేలా శిక్షణ ఇచ్చి అలంకరిస్తారు. మూపురం నుంచి తోక వరకు ఎంతో అందంగా రంగు రంగులతో కుట్టిన బొంతలు, పాత పట్టు చీరలను అలంకరిస్తారు. కొమ్ములను రింగులతో అందంగా తీర్చిదిద్ది వాటికి గొట్టాలను ధరింపజేసి రంగురంగుల ఊలు ధారాలను కడతారు. వీటిని కుప్పెలుగా పిలుచుకుంటారు. నొసటిభాగంలో తోలుతో అలంకరించి పైన గవ్వలు వేలాడదీస్తారు. కాళ్లకు గజ్జెలు కట్టి ఆడిస్తుంటారు. సన్నాయి, బూర గంగిరెద్దును ఆడించే వారి వేషాధారణ సైతం ప్రత్యేకంగానే ఉంటుంది. వారి చేతిలో సన్నాయి, బూర, చిన్న గంట పట్టుకుంటారు. ఎవరైనా పాతకోటు ఇస్తే అది వేసుకుని తిరుగుతుంటారు. ఏకాలనీలోకి అడుగుపెట్టినా సరే సన్నాయి బూర శబ్దం వచ్చిందంటే గంగిరెద్దులోళ్లు వచ్చారని అట్టే అర్థం అవుతుంది. ఆదరణ తగ్గింది మా గ్రామం చర్లపల్లి అయినా పెద్దలనుంచి వచ్చిన గంగిరెద్దులను ఆడించటం కోసం సంచార జీవనం గడుపుతున్నా. భార్య ఇద్దరు పిల్లలతో గంగాపూర్లో గుడారాలు వేసుకొని జీవిస్తున్నాను. నా చిన్నతనం నుంచి ఇదే వృత్తిలో ఊరూరా తిరుగుతుంటాను. ఏడాదిలో ఈ మూడు రోజులే జడ్చర్లలో తిరిగి యాచకం చేస్తా. ఇంతకుముందు అయితే ధనం, ధాన్యం, గడ్డి అన్ని దానం చేసేవారు. ఇప్పుడు పూర్తిగా ఆదరణ తగ్గిపోయింది. – రాములు, గంగిరెద్దులను ఆడించే వ్యక్తి ఎద్దులే సాకుతాయి.. ఎద్దులను మంచిగా చూసుకుంటే అవి మా కుటుంబాలను సాకుతున్నాయి. వాటినే నమ్ముకుని ఏళ్ల తరబడి బతుకుతున్నాం. ఎద్దులు మంచిగా ఉంటేనే మా కుటుంబాలు చల్లగా ఉంటాయి. మారుతున్న సమాజంతో పొటీ పడేలా మాకు ప్రత్యేకమైన సదుపాయలు కల్పిస్తే మానుగడ సాగిస్తాం. తాతల నుంచి వస్తున్న ఆచారాన్ని కొనసాగించేలా నెట్టుకొస్తున్నాం. – రాములు, నవాబుపేట ● -
అభివృద్ధి దిశగా పాలమూరు
దేవరకద్ర/ భూత్పూర్: వెనకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాను ఈ ప్రాంత బిడ్డ, సీఎం రేవంత్రెడ్డి అభివృద్ధిగా నడిపిస్తున్నారని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మాత్రం పాలమూరు ప్రాజెక్టు పనులు 10 శాతమే మిగిలి ఉన్నాయని, వాటిని సీఎం రేవంత్రెడ్డి పూర్తి చేయడం లేదని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బుధవారం దేవరకద్ర, భూత్పూర్ పురపాలికల్లో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డితో కలిసి కోమటిరెడ్డి శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో జిల్లాను దత్తత తీసుకుని వివక్ష చూపించారని విమర్శించారు. దేవరకద్ర నియోజవవర్గ అభివృద్ధి కోసం ఇక్కడి ఎమ్మెల్యే కురుమూర్తి ఘాట్ రోడ్డుకు రూ.110 కోట్లు మంజూరు చేయించుకున్నారని, అలాగే కోయిల్సాగర్ రోడ్డుకు, డ్యాం డెవలప్మెంట్ పనులకు నిధులు కేటాయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సర్పంచ్ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్, రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కార్యకర్తలే నాయకులుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ విజయేందిర, జెడ్పీ మాజీ చైర్పర్సన్ స్వర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలపై కేసీఆర్వి పచ్చి అబద్ధాలు మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టండి రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
వైభవంగా క్షీరలింగేశ్వరుడి రథోత్సవం
క్షీరలింగేశ్వరస్వామి రథోత్సవంలో పాల్గొన్న భక్తజనం కృష్ణా: మండల కేంద్రంలో బుధవారం శ్రీక్షీరలింగేశ్వరస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం నిర్వహించిన రథోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది భక్తులు తరలివచ్చారు. ఆలయంలో స్వామివారి మూలవిరాట్ కు క్షీరాభిషేకం, మహా మంగళహారతి, బిల్వార్చన నిర్వహించారు. అనంతరం ప్రధాన ఆల యం నుంచి ఆలయ ధర్మకర్త ఎంకణ్ణగౌడ్ మంగళవాయిద్యాల మధ్య కలశంతో ఊరేగింపుగా రథం వద్ద చేరుకొని ప్రత్యేక పూజలు చేసి.. ఉత్సవమూర్తిని రథపై కొలువుదీర్చగా.. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. రథోత్సవం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ని ర్వహించారు. కార్యక్రమంలో మఠం పీఠాధిపతి బంతనల్ శ్రీవృశభలింగేశ్వర మహాస్వామి, నేరడగం పీఠాధిపతి శ్రీసిద్దలింగ మహాస్వామి, శ్రీక్షీరాలింగ మహాస్వామి పాల్గొన్నారు. -
సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్
మక్తల్: మున్సిపల్ ఎన్నికలను సజావుగా పూర్తిచేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మంగళవారం మక్తల్ మున్సిపల్ కార్యాలయంలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు ఎన్నికల నిర్వహణ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తూ.. ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. కాగా, మక్తల్ మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయని, ఇప్పటికే తుది ఓటరు జాబితా విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. జూనియర్ కళాశాల భవనంలో స్ట్రాంగ్రూం ఏర్పాటుచేసి.. ఎన్నికల సామగ్రి భద్రపర్చనున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు, తహసీల్దార్ సతీష్కుమార్, ఎంపీడీఓ రమేశ్కుమార్ తదితరులు ఉన్నారు. ● మక్తల్లో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరిని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కలిసి పూలమొక్క అందజేసి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై చర్చించారు. -
సంబరాల పండగొచ్చే..
పిండి వంటల ఘుమఘుమలు.. భోగిమంటల కాంతులు.. ముంగిళ్లలో ముచ్చటైన రంగవల్లులు.. పతంగుల కోలాహలం.. గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసుల కీర్తనలు.. వెరసి మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం సంక్రాంతి పర్వదినాన్ని ఘనంగా జరుపుకొనేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. బుధవారం భోగభాగ్యాల భోగి, గురువారం సంక్రాంతి, శుక్రవారం కనుమను కుటుంబంతో కలిసి నిర్వహించుకునేందుకు గాను ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు సొంతూళ్లకు చేరుకున్నారు. బంధుమిత్రుల రాకతో సందడి నెలకొంది. పల్లె, పట్టణాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. – నారాయణపేట/నారాయణపేట రూరల్ ఆనందంగా నిర్వహించుకోవాలి.. జిల్లా ప్రజలకు ఎస్పీ డా.వినీత్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్కృతీ సంప్రదాయానికి ప్రతీక సంక్రాంతి అని.. ఈ పండగ అందరిలో స్నేహభావం, సంతోషం, శ్రేయస్సు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరూ పండగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవడంతో పాటు స్వీయ భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా అందరూ కలిసిమెలిసి సంతోషంగా పండగ నిర్వహించుకోవాలని తెలిపారు. ముగ్గులు వేసే సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని.. అపరిచితులు అడ్రస్ అడుగుతూ, మాట కలిపి ఏమార్చి మెడలో నుంచి బంగారు ఆభరణాలు దొంగలించే అవకాశం ఉందన్నారు. అనుమానితులు కనిపిస్తే స్థానిక పోలీసులు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. జీవితంలో కొత్తదనాన్ని స్వాగతిస్తూ.. పాత వస్తువుల్ని మంటల్లో వేయడంతో భోగి పండుగ ప్రారంభమవుతుంది. మూడు రోజుల పండుగలో ఇది మొదటిది. సూర్యోదయానికి ముందే నిద్రలేచి భోగి మంటలు వేస్తారు. చిన్నారులను సాక్ష్యాత్తు శ్రీమన్నారాయణుడిగా భావించి.. తలపై రేగిపండ్లు, పూలు, అక్షింతలు, చిల్లర నాణాలు పోసి, హారతి ఇచ్చి ఆశీర్వదిస్తారు. ఇలా చేస్తే దిష్టి పోతుందని, ఆయు వృద్ధి కలుగుతుందని నమ్మకం. భోగి మంటలతో వచ్చిన బూడిదను పిల్లలు, పెద్దలు నుదుటన ధరిస్తారు. కాగా, కొన్ని గ్రామాల్లో మంగళవారమే భోగి వేడుకలు జరుపుకొన్నారు. తెల్లవారుజామునే ఇంటి ముంగిళ్లలో కల్లాపి చల్లి రంగవల్లులతో తీర్చిదిద్దారు. దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. నువ్వుల రొట్టెలు ప్రత్యేకం.. భోగి రోజు అందరి ఇళ్లల్లోనూ నువ్వుల రొట్టెలు చేయడం ప్రత్యేకత. కొందరు బియ్యంపండి, మరికొందరు జొన్నపిండిలో నువ్వులను వేసి రొట్టెలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. చలికాలం కావడం వల్ల నువ్వులు వంటికి వేడిని అందిస్తాయని భోగి రోజున వాటిని ఆరగిస్తారు. అలాగే చిక్కుకాయ లేదా వివిధ రకాల కూరగాయలను కలిపి వండుతారు. సిరిసంపదలు కలగాలని.. రైతులు ఆరుగాలం శ్రమించగా చేతికి వచ్చిన పంటలతో సంతోషంగా నిర్వహించుకునే పండగ సంక్రాంతి. రెండవ రోజు సంక్రాంతి పర్వదినాన పాలు పొంగించి పొంగళి అనే తీపిపదార్థం తయారు చేస్తారు. వచ్చే ఏడాది పాటు తమ ఇళ్లల్లో సిరిసంపదలు కలగాలని కోరుకుంటూ ఇళ్లల్లో పాలు పొంగించడం ఆనవాయితీగా వస్తోంది. ఇంటిముందు రంగవల్లులతో తీర్చిదిద్దుతారు. లోగిళ్లన్నీ ఇంద్రధనుస్సు తలపిస్తూ కొత్త కాంతిని ప్రసరింపజేస్తాయి. మూడో రోజు కనుమ పండగ సందర్భంగా పశువులను అలంకరించి, వాటికి పూజలు చేసి విందు, వినోదాలతో గడుపుతారు. జిల్లాలో మొదలైనసంక్రాంతి సందడి నేడు భోగభాగ్యాల భోగి పల్లెల్లో ఉట్టిపడుతున్న పండగ శోభ -
వీబీ–జీ రామ్జీ చట్టంపై తప్పుడు ప్రచారం
● కేంద్రం నిధులిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పుకోవడం సరికాదు ● ఎంపీ డీకే అరుణ పాలమూరు: వికసిత్ భారత్ రోజ్ గార్ ఔర్ ఆజివిక మిషన్ గ్రామీణ్ (వీబీ–జీ రామ్జీ)చట్టంపై కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ముందుకు వెళుతోందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వికసిత్ భారత్ కావాలంటే వికసిత్ గ్రామం కావాలని జీ రామ్జీ పథకం తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. యూపీఏ హయాంలో ఎంఎన్ఆర్ఈజీఏ కింద రూ.2 లక్షల కోట్ల పై చిలుకు ఖర్చు చేస్తే మోదీ ప్రభుత్వం రూ.8.53 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. గతంలో ఈ పథకం అధికార పార్టీల నేతల జేబులు నింపుకోవడానికి ఉపయోగపడిందన్నారు. ఈ పథకం ద్వారా గ్రామ సభలలో అభివృద్ధి పనులను తీర్మానం చేసి ప్రణాళిక రూపొందించాలని దీని ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక అభివృద్ధి నిధులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు.. ఈనిధులు ఎక్కడివో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు సీఎం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వీబీ–జీ రామ్ జీ పథకానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏమి తగ్గడం లేదని రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు అదనంగా కేటాయిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.600 కోట్లకు పైగా నిధులు వచ్చాయని వాటిని రాష్ట్ర ప్రభుత్వ నిధులు చెప్పుకోవడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, పద్మజారెడ్డి, బాలరాజు, వీర బ్రహ్మచారి, పాండురంగారెడ్డి, అంజయ్య, రమేష్, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుత్సరఫరాకు చర్యలు
నారాయణపేట: జిల్లాలోని రైతులు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఎస్ఈ నవీన్కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సింగార్ బేస్, శ్రీనగర్ కాలనీ, శ్యాసన్పల్లి రోడ్డు, సరస్వతీ నగర్ కాలనీల్లో విద్యుత్శాఖ అధికారులు ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి విద్యుత్ సరఫరా, ఓల్టేజీ తదితర సమస్యలను తెలుసుకున్నారు. అయితే సరస్వతీ నగర్లో సుమారు 130 ఇళ్లు ఉన్నాయని.. విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కాలనీలో 45 స్తంభాలు అవసరమని.. వెంటనే కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో డీఈ నర్సింహారావు, ఏఈ మహేశ్కుమార్గౌడ్, లైన్ ఇన్స్పెక్టర్ వెంకటన్న, జిల్లా విద్యుత్ కాంట్రాక్టు అసోసియేషన్ అధ్యక్షుడు పోలేమోని కృష్ణ, కాలనీవాసులు లక్ష్మీకాంత్, వెంకట్రామారెడ్డి, శివారెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. సత్తాచాటినదివ్యాంగ విద్యార్థులు ఆత్మకూర్: గోల్బాల్ జాతీయ స్థాయి పోటీల్లో ఆత్మకూర్కు చెందిన దివ్యాంగ విద్యార్థులు సత్తాచాటి మొదటి బహుమతి సాధించారు. ఈ నెల 10 నుంచి బిహార్ రాష్ట్రం పాట్నాలో జరుగుతున్న 5వ నేషనల్ గోల్బాల్ పోటీలు మంగళవారం రాత్రి ముగిశాయి. ఈ క్రమంలో ఆత్మకూర్ సమ్మిలిత ఫౌండేషన్కు చెందిన విద్యార్థి పవన్కల్యాణ్ రాష్ట్ర జట్టుకు కెప్టెన్గా వ్యవహరించగా ఇక్కడి దివ్యాంగ విద్యార్థులు రాజేష్, వేణు, కిరణ్, మధు, సాయిరాంవర్మ ప్రతిభ కనబర్చి ఫైనల్లో ఏపీ జట్టుపై విజయం సాధించారని కోచ్, సంస్థ డైరెక్టర్ శివకుమార్ తెలిపారు. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆర్థిక సహకారంతోనే తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని పేర్కొన్నారు. 18న రాష్ట్రస్థాయి షూటింగ్బాల్ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: తాండూర్లో ఈనెల 18వ తేదీన రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ ఎంపికలు జరుగుతాయని జిల్లా షూటింగ్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆక్యపోగు ఆడమ్స్, బి.పుష్ప మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో ప్రతిభను కనబరిచిన వారిని సౌత్జోన్ జాతీయ స్థాయి షూటింగ్బాల్ పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈనెల 17న సాయంత్రం 4గంటలకు తాండూర్లోని సెయింట్ మార్క్స్ హైస్కూల్లో క్రీడల నిర్వహణ కార్యదర్శి రాములు (9951343432) రిపోర్టు చేయాలని కోరారు. ఎర్రకందులు క్వింటా రూ.7,705 నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో మంగళవారం ఎర్ర కందులు క్వింటా గరిష్టంగా రూ. 7,705, కనిష్టంగా రూ. 5,800 ధర పలికింది. తెల్ల కందులు గరిష్టంగా రూ. 7,718, కనిష్టంగా రూ. 6,666, వడ్లు (సోన) గరిష్టంగా రూ. 2,640, కనిష్టంగా రూ. 2,290 ధరలు వచ్చాయి. వేరుశనగ క్వింటా రూ.8,661 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.8,661, కనిష్టంగా రూ.3,056 ధరలు లభించాయి. ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,759 కనిష్టంగా రూ.2,569, హంస రూ.1,869, పత్తి గరిష్టంగా రూ.7,439, కని ష్టంగా రూ.5,659, కందులు గరిష్టంగా రూ.6,959, కనిష్టంగా రూ.4,100, మొక్కజొ న్న గరిష్టంగా రూ.1,973, కనిష్టంగా రూ.1,666, ఉలువలు రూ.4,342, మినుము లు గరిష్టంగా రూ.7,882, కనిష్టంగా రూ.7,669 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్లో కందులు రూ.6,719గా ఒకే ధర లభించింది. కాగా.. సంక్రాంతి సందర్భంగా దేవరకద్ర మార్కెట్కు మూడు రోజులపాటు సెలవు ప్రకటించారు. తిరిగి 17వ తేదీ మార్కెట్లో లావాదేవీలు జరుగుతాయని మార్కెట్ కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. -
మహిమగల దేవుడు..
మా పూర్వీకుల నుంచి చింతలకుంట ఆంజనేయస్వామిని కొలుస్తున్నాం. ఈ స్వామివారు చాలా మహిమ గల దేవుడు. మా కుటుంబం ఆలయ అభివృద్ధిలో కొద్దిమేర భాగస్వాములయ్యాం. ప్రజాప్రతినిధులు, భక్తులు, దాతలు ముందుకొచ్చి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సహకరించాలి. – వెంకటస్వామి, భక్తుడు, సూగూరు, పెబ్బేరు మండలం భక్తుల రాక పెరుగుతోంది.. కోరిన కోరికలు తీరుతుండటంతో ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతుంది. పెద్దసంఖ్యలో భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని ఆలయం, పరిసరాలను అభివృద్ధి చేసేందుకు భక్తులు, దాతలు ముందుకు రావాలి. ఇక్కడ ప్రతి అమావాస్య రోజు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. – వెంకటేశ్వర్లు, ఆలయ పూజారి -
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
● నేటి నుంచి ‘అరైవ్ అలైవ్’పై అవగాహన కార్యక్రమాలు : ఎస్పీ డా.వినీత్ నారాయణపేట: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసుశాఖ అరైవ్ అలైవ్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఎస్పీ డా.వినీత్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డ్రైవింగ్లో నిర్లక్ష్యం, అతివేగం, అజాగ్రత్తతోనే రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం కేవలం ఒక నినాదం కాకుండా.. రోడ్డు ప్రమాదాలను నివారించే ఉద్యమంలా ముందుకు సాగాలన్నారు. ప్రతి వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరాలనే వారి కుటుంబ సభ్యుల ఆశను తీర్చే కార్యక్రమం కావాలన్నారు. రోడ్డు ప్రమాదాలకు గురయ్యే బాధితుల బాధ, మరణం సంభవించిన వారి కుటుంబ సభ్యుల మనోవేదనను ఎస్పీ స్వయంగా తెలియజేశారు. అలాంటి పరిస్థితి మరో కుటుంబంలో జరగకుండా.. అందరూ రహదారి భద్రత నియమాలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. హెల్మెట్ ధరించడం కేవలం చలానా, చట్టం నుంచి తప్పించుకోవడానికి కాదని.. అది తమ ప్రాణాన్ని కాపాడే ఆయుధమని ప్రతి వాహనదారుడు గ్రహించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాద మరణాలు జరిగి, ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడుతున్నాయన్నారు. ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చే బాధ్యతను గుర్తుంచుకోవాలన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంపై ఈ నెల 24వ తేదీ వరకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతకుముందు రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు, క్షతగాత్రులతో స్వయంగా మాట్లాడించారు. అదే విధంగా డాక్టర్లతో రోడ్డు ప్రమాదానికి గురైతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనే వివరాలను తెలియజేశారు. అనంతరం రోడ్డు భద్రత నియమాలపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, డీటీఓ మేఘాగాంధీ, ఆర్తోఫెడిక్ ప్రసాద్ శెట్టి, ప్రభుత్వ మార్చురీ డాక్టర్ తవ్ సిఫ్, ఆర్టీఓ జిల్లా మెంబర్ పోషల్ రాజేశ్ పాల్గొన్నారు. -
రూ.1,035 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి
మక్తల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలోనే రూ. 1,035 కోట్లతో మక్తల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మక్తల్లో పట్టణంలోని 1, 11, 14 వార్డుల్లో ఆయన పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అంతకుముందు పలు కాలనీల్లో సీసీరోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత పాలకులు మక్తల్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. తాను మంత్రి పదవి చేపట్టిన కొన్ని రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకారంతో రూ.కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. మక్తల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా రూ. 80లక్షలతో పైపులైన్ నిర్మిస్తున్నట్లు చెప్పా రు. 1, 11, 14 వార్డుల్లో రూ. 2.50కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటి స్తూ.. త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. రాష్ట్రంలో నిధుల కొరత లేదని.. అభివృద్ధి కార్యక్రమాలకు వెనకాడేదిలేదని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గణేశ్కుమార్, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఫయాజ్, శ్రీనివాసులు, రంజిత్కుమార్రెడ్డి, ఏఈ నాగశివ, గోవర్ధన్, కట్టా సురేశ్, రవికుమార్, రాజేందర్, రహీం పటేల్, శంషొద్దీన్, ఎండీ సలాం, భాస్కర్ పాల్గొన్నారు. -
‘డయల్ యువర్ ఎస్పీ’కి అనూహ్య స్పందన
నారాయణపేట: జిల్లా ప్రజలకు పోలీస్శాఖ మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తుందని ఎస్పీ డా.వినీత్ తెలిపారు. సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహించగా.. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 19 మంది స్వయంగా ఎస్పీని ఫోన్లో సంప్రదించి తమ సమస్యలను తెలియజేశారు. ప్రధానంగా తమ ప్రాంతాల్లో చోరీల నివారణకు పెట్రోలింగ్ పెంచాలని, భూ వివాదాలు, కుటుంబ తగాదాలు పరిష్కరించాలని, గతంలో జరిగిన చోరీ కేసుల్లో నిందితులను ఇప్పటివరకు పట్టుకోలేదని, దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న కానిస్టేబుళ్లను బదిలీ చేయాలని, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి.. సంబంధిత పోలీస్ అధికారుల ద్వారా తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని.. పోలీస్శాఖ ఎల్లప్పుడు ప్రజల పక్షానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు జిల్లాలో ఎవరైనా పేకాట, కోడిపందాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వినీత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై జిల్లావ్యాప్తంగా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిరంతర వాహన తనిఖీలు, సరిహద్దు ప్రాంతాల్లో గుర్తించబడిన కొన్ని ప్రదేశాలలో గస్తీని ముమ్మరం చేశామన్నారు. రాష్ట్ర సరిహద్దులోని పోలీస్స్టేషన్లలో పనిచేసే అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే స్థానిక పోలీసులు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు. -
మహిళలే కీలకం..!
పురుషులతో పోలిస్తే 10,891 మంది అధికం ఓటర్ల తుది జాబితా ఖరారు సోమవారం రాత్రి వరకు కొనసాగింది. దీంతో ఫొటోల వారీగా డివిజన్లు/వార్డుల ఓటర్ లిస్ట్ను మంగళవారం ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మిగిలింది డివిజన్లు/వార్డులు, పురపాలికల పీఠాల వారీగా ఎస్టీ, ఎస్టీ మహిళ, ఎస్సీ, ఎస్సీ మహిళ, బీసీ, బీసీ మహిళ, అన్రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్కు అనుగుణంగా ఆయా సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసేలా ఆయా జిల్లాల అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈనెల రెండో వారంలో పురపాలికల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వచ్చే నెల రెండో వారంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పురపాలికల ఓటర్ల లెక్క తేలింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పదవీ కాలం పూర్తి కాని జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మరో 18 పురపాలికలకు సంబంధించి సోమవారం తుది ఓటర్ల జాబితాను ఖరారు చేశారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల జయాపజ యాల్లో వారి కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. పురుషులు 3,03,839.. మహిళలు 3,14,730 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ కార్పొరేషన్లోని 60 డివిజన్లు.. మరో 18 మున్సిపాలిటీల్లోని 316 వార్డుల పరిధిలో మొత్తం 903 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఫైనల్ చేశారు. ఈ మేరకు పురుష ఓటర్లు 3,03,839 మంది, మహిళా ఓటర్లు 3,14,730 మంది, ఇతర ఓటర్లు 35 మంది ఉన్నారు. ఈ లెక్కన పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 10,891 మంది అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్, దేవరకద్ర, భూత్పూర్ పురపాలికల్లో మొత్తంగా పురుషుల కంటే 2,921 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. వనపర్తి జిల్లాలోని వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, అమరచింత, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో 2,409.. జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి పురపాలికల్లో 2,807.. నారాయణపేట జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల్లో 2,053.. నాగర్కర్నూల్ జిల్లాలోని నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ పురపాలికల్లో మొత్తంగా 701 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. శాతాల వారీగా గమనిస్తే గద్వాల జిల్లాలో 2.58 శాతం మంది మహిళలు అధికంగా ఉన్నారు. అదేవిధంగా నారాయణపేట జిల్లాలో 2.24 శాతం, వనపర్తిలో 2.05 శాతం, మహబూబ్నగర్లో 1.33 శాతం, చివరగా నాగర్కర్నూల్ జిల్లాలో అత్యల్పంగా 0.87 శాతం మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లోనూ అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఇంటి నంబర్ల ప్రకారం ఓటు హక్కు కల్పించలేదని.. ఇతర వార్డుల్లో ఓట్లు నమోదయ్యాయని.. వేరే జిల్లాలు, గ్రామాలు, ఇతర ప్రాంతాల ఓటర్లు తమ వార్డుల్లో నమోదైనట్లు వందలాది మంది ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈ నెల పదో తేదీనే తుది ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉండగా.. మరో రెండు రోజులు పొడిగించారు. ఈ మేరకు సోమవారం అధికారులు ఫైనల్ ఓటర్ల జాబితాను వెల్లడించగా.. ఇందులోనూ పలు అభ్యంతరాలకు పరిష్కారం చూపలేదని రాజకీయ పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. ప్రధానంగా మహబూబ్నగర్ కార్పొరేషన్, అయిజ, పెబ్బేరు, అమరచింత, మద్దూరు పురపాలికల్లో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఫిర్యాదులు పరిష్కరించి.. తుది జాబితాను వెల్లడించినట్లు చెబుతున్నారు. మున్సిపాలిటీ/ డివిజన్లు/ పోలింగ్ ఓటర్లు.. కార్పొరేషన్ వార్డులు కేంద్రాలు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం మహబూబ్నగర్ 60 279 97,636 1,00,191 14 1,97,841 దేవరకద్ర 12 12 4,909 5,161 0 10,070 భూత్పూర్ 10 11 5,975 6,089 0 12,064 వనపర్తి 33 95 31,655 32,527 8 64,190 కొత్తకోట 15 30 8,822 9,370 0 18,192 పెబ్బేరు 12 24 7,076 7,257 0 14,333 అమరచింత 10 18 4,364 4,783 0 9,147 ఆత్మకూరు 10 20 5,624 6,013 0 11,637 గద్వాల 37 78 31,730 33,630 10 65,370 అయిజ 20 26 11,233 11,790 0 23,023 అలంపూర్ 10 20 4,681 4,940 1 9,622 వడ్డేపల్లి 10 19 5,256 5,347 1 10,604 నారాయణపేట 24 54 17,244 18,216 0 35,460 మక్తల్ 16 35 11,407 11,938 0 23,345 కోస్గి 16 32 10,028 10,219 1 20,248 మద్దూర్ 16 20 6,171 6,530 0 12,701 నాగర్కర్నూల్ 24 48 17,460 17,918 0 35,378 కల్వకుర్తి 22 44 12,975 13,048 0 26,023 కొల్లాపూర్ 19 38 9,593 9,763 0 19,356 జిల్లాలవారీగా పురపాలికల ఓటర్లు ఇలా.. మున్సిపాలిటీ డివిజన్లు/ పోలింగ్ ఓటర్లు.. వార్డులు కేంద్రాలు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం మహబూబ్నగర్ 82 302 1,08,520 1,11,441 14 2,19,975 వనపర్తి 80 187 57,541 59,950 08 1,17,499 జోగుళాంబ గద్వాల 77 143 52,900 55,707 12 1,08,619 నారాయణపేట 72 141 44,850 46,903 01 91,754 నాగర్కర్నూల్ 65 130 40,028 40,729 00 80,757 మొత్తం 376 903 3,03,839 3,14,730 35 6,18,604 పురపాలికల్లో తేలిన ఓటర్ల లెక్క ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో వెల్లడి జడ్చర్ల, అచ్చంపేటకు పూర్తి కాని పదవీ కాలం ఉమ్మడి జిల్లాలో పట్టణ ఓటర్లు 6,18,604 మంది పలు మున్సిపాలిటీల్లో పరిష్కారం కాని అభ్యంతరాలు? పురపాలికల వారీగా ఓటర్ల వివరాలు.. -
పాలమూరుకు నీళ్లు
కేసీఆర్ వస్తేనే సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పాలమూరు అభివృద్ధి చెందాలంటే మళ్లీ కేసీఆరే రావాలి. ఐటీ హబ్ పునర్ వైభవం పొందాలంటే, ఉద్యోగాలు రావాలంటే, అమర్ రాజా కంపెనీ మళ్లీ రావాలన్నా, రైతులు, మహిళల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నా, భూముల ధరలు పెరగాలన్నా మళ్లీ కేసీఆర్ రావాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం మహబూబ్నగర్లో ఎస్వీఎస్ మెడికల్ కళాశాల నుంచి ఎంబీసీ మైదానం వరకు బీఆర్ఎస్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎంబీసీ మైదానం నిర్వహించిన బీఆర్ఎస్ నూతన సర్పంచులు, ఉపసర్పంచుల సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొడంగల్తో సహా 14 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురుతుందని చెప్పారు. అభ్యర్థిగా ఎవరున్నా గులాబీ జెండాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్దే పాలమూరు బిడ్డనంటూ రేవంత్ గద్దెనెక్కారు రెండేళ్లయినా ఒక్క పనీ చేయలేదు పాలమూరు నుంచే మున్సిపల్ ఎన్నికల జైత్రయాత్ర మహబూబ్నగర్లో సర్పంచుల సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమం
నారాయణపేట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టినట్లు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండమీది బాల్రాం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్యగౌడ్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలో 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. కార్మిక, కర్షక, కూలీల హక్కులను కాలరాయడమే కాకుండా రాష్ట్రాల హక్కులను హరించేలా కొత్త చట్టాలు చేస్తుందని విమర్శించారు. కార్మికులను కట్టుబానిసత్వంలోకి నెట్టేలా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని విమర్శించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో మోదీ ప్రభుత్వం వీబీజీ రాంజీ చట్టం తీసుకొచ్చి గ్రామీణ కూలీల పొట్ట కొట్టేందుకు కుట్రలు చేస్తోందన్నారు. ప్రజావ్యతిరేక చట్టాలతో పాటు జాతీయ విత్తన, విద్యుత్ సవరణ బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా ఈ నెల 17న జిల్లావ్యాప్తంగా జీపుజాతా నిర్వహించనున్నట్లు తెలిపారు. 19న కార్మిక, కర్షక ఐక్యత దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్మికులు రైతులు, వ్యవసాయ కూలీలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 28 నుంచి మన్యంకొండ జాతర జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఈనెల 28 నుండి మార్చి 5 వరకు నిర్వహించనున్న మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్హాల్లో వివిధ శాఖల అధికారులతో కలిసి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన తాగునీరు, శానిటేషన్, టాయిలెట్లు, బందోబస్తు రద్దీ నియంత్రణ వంటి సౌకర్యాలను కల్పించాలన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ముఖ్య శాఖల అధికారులతో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ ఏర్పాటు చేసి ప్రతి శాఖ నుంచి ఒక అధికారిని నియమించి ఏర్పాట్ల పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం ఫిబ్రవరి 1న స్వామి వారి గరుడ వాహనసేవ, రథోత్సవం ఉంటాయని ఈ సందర్భంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్శాఖ తరఫున అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ తగినన్ని బస్సులు నడపాలని, కొండపైకి మినీ బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
నారాయణపేట: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి మున్సిపల్శాఖ కార్యదర్శి శ్రీదేవితో కలిసి సీఎస్ రామకృష్ణారావు జిల్లా ఎన్నికల అధికారులు – కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఫొటో ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటన, ఎన్నికల నిర్వహణ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం తుది ఓటరు జాబితా ప్రకటించడం జరిగిందన్నారు. 13న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రకటన అనంతరం అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరిస్తామని.. 16న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటిస్తామన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. నోడల్, జోనల్, సెక్టోరియల్ అధికారుల నియామకం, ఫ్లయింగ్, స్టాటిస్టిక్ సర్వేలైన్స్ బృందాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు. అదే విధంగా నామినేషన్ స్వీకరణ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్రూంల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వీసీలో అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్, మున్సిపల్ కమిషనర్లు గోల్కొండ నర్సయ్య, శ్రీరాములు, నాగరాజు, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు ప్రాధాన్యతనిచ్చి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 20 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించి అర్జీలు సమర్పించారు. -
అన్ని బల్దియాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
నారాయణపేట: ప్రతి గ్రామం, పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్రెడ్డి నేతృత్వంలో ఏఐసీసీ అధినేత రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్కుమార్రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన మరోసారి నియామకం కాగా.. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రశాంత్కుమార్ మాట్లాడుతూ.. రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో దేశ యువత ఒక్కసారిగా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపడం మొదలెట్టారన్నారు. ఇందుకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే నిదర్శనమన్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు, నాయకులతో కలిసి పనిచేస్తామన్నారు. పాత, కొత్త కాంగ్రెస్ అంటూ ఏమీ ఉండదని.. అందరూ సమానమేనని అన్నారు. మరో 15ఏళ్లు అధికారంలో ఉండే విధంగా పార్టీని పటిష్టం చేస్తామన్నారు. తన తండ్రి దివంగత వీరారెడ్డి బాటలో పయనిస్తూ ప్రజలకు సేవ చేయాలన్నదే తన లక్ష్యమని అన్నారు. తనకు మరోసారి అవకాశం కల్పించిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి, కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ● డీసీసీ మాజీ అధ్యక్షుడు శివకుమార్రెడ్డి మాట్లాడుతూ.. నారాయణపేట మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సీఎం రేవంత్రెడ్డిని ఒప్పించి వార్డుకు రూ. కోటి చొప్పున రూ. 24కోట్లు తీసుకొస్తానని.. లేనిపక్షంలో మరోసారి ఓట్లు అడగనని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి నేతృత్వంలో మున్సిపాలిటీని హస్తగతం చేసుకొని సీఎంకు కానుకగా ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ కోఆర్డినేటర్ నూమాన్, టీపీసీసీ నాయకులు ఏపీ మిథున్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీనుబాబు, చరణ్ జోషి, నంగి దేవేందర్రెడ్డి, ఉమ్మడి జిల్లాలోని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, రాజీవ్రెడ్డి, మార్కెట్ కమిటీల చైర్మన్లు శివారెడ్డి, బెక్కరి అనిత, యువజన నాయకులు శివాంత్రెడ్డి, సత్తూర్ చంద్రకుమార్గౌడ్, జహీర్ అక్తర్, జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు కాంతకుమార్, జిల్లా ఆర్టీఏ మెంబర్ పోష్ రాజేశ్కుమార్ పాల్గొన్నారు. -
లక్ష్యం.. గ్రీన్ గంగాపురం
జడ్చర్ల టౌన్: స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకుని మండలంలోని గంగాపురం గ్రామంలో 6 మంది సభ్యులతో 2013 ఏడాదిలో హెల్పింగ్ హార్ట్స్ ఫర్ గంగాపూర్ (స్వామి వివేకానంద యూత్) పేరిట ఏర్పాటైనన యువజన సంఘం నేడు 222 మంది సభ్యులకు చేరింది. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సంఘం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రతిఒక్కరిలోనూ సేవాభావం పెంపొందిస్తున్నారు. ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం గ్రామంలో విరాళాలు సేకరించి అప్పటి కలెక్టర్కు అందజేశారు. తొలి అడుగు విజయవంతం కావడంతో హెల్పింగ్ హార్ట్స్ ఫర్ గంగాపూర్ సంఘం నమోదు చేయించారు. 6 మందితో ప్రారంభమైన సంఘంలో ప్రస్తుతం 222 మంది సభ్యులు చేరారు. ఎన్నో భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా గ్రీన్ గంగాపురంగా మార్చడానికి కృషిచేస్తున్నారు. -
వసూళ్లలో తగ్గిన దూకుడు
● లక్ష్యం చేరుకోవడంలో వెనకబడిన ఉమ్మడి జిల్లా ఆర్టీఏ శాఖ ● జీవితకాల ఫీజు, త్రైమాసిక పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం ● సిబ్బంది కొరతతో నామమాత్రంగా తనిఖీలు ● మూడు నెలల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరం 2025–26లో కేటాయించిన లక్ష్యంలో డిసెంబర్ 31 వరకు చేరుకున్నది ఇలా.. (రూ.కోట్లలో..) పాలమూరు: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆర్టీఏ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం చేరుకోవడానికి సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో మూడు నెలల గడువు ఉన్న క్రమంలో అప్పటి వరకు ఇచ్చిన లక్ష్యం కంటే అధిక మొత్తంలో పూర్తి చేయాలని చూస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో వాహనాలకు జరిమానాలు, అధిక లోడ్, పత్రాలు లేకుండా, డ్రైవర్కు లైసెన్స్ లేకుండా తిరిగే వాహనాలకు జరిమానాలు విధించడానికి తనిఖీలు పూర్తిస్థాయిలో జరగడం లేదు. జిల్లా ఆర్టీఏ శాఖ జీవిత కాల పన్నుతోపాటు ఫీజుల వసూలులోనూ పూర్తిగా వెనుకబడి ఉంది. ప్రధానంగా త్రైమాసిక పన్నులు అయితే పూర్తిగా తగ్గిపోవడంతో సమస్యగా మారింది. దీంతోపాటు తనిఖీల వల్ల వచ్చిన ఆదాయం కూడా తగ్గింది. ప్రతిరోజు తనిఖీలు చేయాలని లక్ష్యం ఉన్నా.. సిబ్బంది కొరత వల్ల అది సాధ్యం కావడం లేదు. అరకొరగా ఉన్న అధికారులు రోడ్ల మీద వాహన తనిఖీలకు వెళ్తే కా ర్యాలయంలో పనులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. అధిక లోడ్.. పత్రాలు.. జిల్లాలో జాతీయ రహదారి–44 ఉండటంతో అధిక లోడ్ కలిగిన వాహనాలు అధిక సంఖ్యలో వెళ్తుంటాయి.. అలాంటి వాహనాలపై ఆర్టీఏ శాఖ కొరడా ఝులిపిస్తుంది. అదేవిధంగా పత్రాలు లేకుండా కూడా అధిక సంఖ్యలో వాహనాలు తిరుగుతున్న నేపథ్యంలో వాటిపై కూడా పన్నులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాహనాల కోసం ఆర్టీఏ శాఖ వారు జాతీయ రహదారిపై చెక్పోస్టులు ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు పత్రాలు లేకుండా అధిక మొత్తంలో పన్నులు వసూలు చేయడం జరుగుతుంది. ఇందులో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి సర్వీస్ ఫీజు, డిటెక్షన్, గ్రీన్ట్యాక్స్ వసూలులో లక్ష్యానికి మించి సాధించారు. మహబూబ్నగర్ జిల్లాలో వసూలు చేసిన పన్నుల వివరాలు పన్ను రకాలు లక్ష్యం వసూలు చేసింది శాతం (రూ.లక్షల్లో..) మూడునెలల పన్ను 1,735.01 1,639.03 94.46 జీవితకాల పన్ను 5,301.00 4,230.19 79.79 ఫీజులు 990.00 798.84 80.69 సర్వీస్ ఫీజు 243.00 295.46 121 డిటెక్షన్ 207.00 338.68 163 గ్రీన్ట్యాక్స్ 117.00 119.28 101 జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం చేరుకోవడానికి ప్రత్యేక కార్యాచరణతో వెళ్తున్నాం. ప్రత్యేక టీంల ద్వారా ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేసి ఆదాయం పెరిగే విధంగా చూస్తాం. జీవిత కాల బీమా, నూతన వాహనాల ట్యాక్స్ ఇతర ఆదాయ మార్గాల్లో లక్ష్యం పూర్తి చేస్తాం. మరో మూడు నెలల గడువు ఉన్న నేపథ్యంలో అన్ని రకాల వాహనాల ధ్రువపత్రాలపై తనిఖీలు చేసి జరిమానాలు విధిస్తాం. – రఘుకుమార్, ఆర్టీఓ, మహబూబ్నగర్ -
నేడు డయల్ యువర్ ఎస్పీ
నారాయణపేట: సమస్యల పరిష్కారానికిగాను సోమవారం డ యల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎస్పీ డా. వినీత్ తెలిపారు. ప్రజలు, ఫిర్యాదుదారులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఎస్పీ కార్యాలయ నంబర్ 08506281182కు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయాలని సూ చించారు. ఫిర్యాదులు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపడతామని.. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హామీల అమలులో ప్రభుత్వం విఫలం: బీఆర్ఎస్ కోస్గి రూరల్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన పుర ఎన్నికల సన్నాహాక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న కోస్గిని 2018లో పురపాలికగా అప్గ్రేడ్ చేశామని, రూ.8 కోట్లతో సయ్యద్ పహాడ్ దర్గా నుంచి ఏబీకే ఫంక్షన్హాల్ వరకు రహదారి విస్తరణ చేపట్టామని, నాటి మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి భూత్పూర్–చించోలి డబుల్ రోడ్డు పనులు చేయించామన్నారు. కోస్గిలో కూరగాయల మార్కెట్, పార్కులు ఏర్పాటు చేశామని, తమ హయాంలో 50 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేస్తే రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 30 పడకలకు తగ్గించారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు కొనుగోలు చేసిన భూముల విలువ పెంచుకోవడానికే ఇంజినీరింగ్, మహిళా డిగ్రీ కళాశాలను హకీంపేటకు తరలించారని ఆరోపించారు. రేవంత్ అబద్దపు హామీలపై ఇంటింటా ప్రచారం చేపడతామన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని రైతులే స్వయంగా కోర్టుల్లో కేసులు వేస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వెంకట్నర్సింహులు, జనార్దన్, సాయిలు, బందెప్ప, సాయిలు, ఉసెనప్ప, మధుసూదన్రెడ్డి, నీలప్ప, వెంకట్రాములు పాల్గొన్నారు. ‘నారాయణపేటహస్తగతం కావాలి’ నారాయణపేట: పురపాలిక ఎన్నికలపై కాంగ్రెస్పార్టీ నారాయణపేట నియోజకవర్గ ఇన్చార్జ్ కుంభం శివకుమార్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించా రు. ఆదివారం జిల్లాకేంద్రంలో 24 వార్డుల ముఖ్యనాయకులు, కార్యకర్తలతో వార్డుల వారీగా అభిప్రాయసేకరణ చేపట్టడంతో పాటు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించా రు. ఇప్పటి వరకు 150కిపైగా దరఖాస్తులు అందాయి. స్థానిక పురపాలికను హస్తగతం చేసుకునేందుకు ప్రతి కార్యకర్త కంకణబద్దులై నడవా లని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ఆధ్వర్యంలో పురపాలికను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కా ర్డులు, సన్నబియ్యం, మహిళలకు ఉచిత ప్ర యాణం తదితర పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు గెలిచే వారికే టికెట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్కుమార్రెడ్డి, ఆర్టీఓ సభ్యుడు రాజేశ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ సలీం పాల్గొన్నారు. నేడు డీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం నారాయణపేట: డీసీసీ అధ్యక్షుడిగా కె.ప్రశాంత్కుమార్రెడ్డి సోమవారం జిల్లాకేంద్రంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు కాంగ్రెస్పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ సలీం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని మెట్రో ఫంక్షన్హాల్లో మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, నియోజకవర్గ ఇన్చార్జ్లు ఏనుముల తిరుపతిరెడ్డి, కుంభం శివకుమార్రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షులు, గ్రంథాలయ చైర్మన్లు తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. -
బాలికలను అన్నిరంగాల్లో తీర్చిదిద్దాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: బాలికలను అన్నిరంగాల్లో తీర్చిదిద్దాలని హైదరాబాద్ ప్రాంతీయ విద్యా సంచాలకులు ఎం.సోమిరెడ్డి అన్నారు. జాతీయ విద్యా ప్రణాళిక, పరిపాలన సంస్థ (ఎన్ఐఈపీఏ– నీపా) ఆధ్వర్యంలో మహబూబ్నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు చెందిన కేజీబీవీల ప్రత్యేకాధికారులకు సాధికారతపై నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ తరగతులు ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల అభ్యున్నతికి నాణ్యమైన విద్యతోపాటు జీవన నైపుణ్యాలు, క్రీడలు, కళలు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తల్లిదండ్రుల వద్ద కంటే విద్యార్థినులు ఎక్కువ సమయం ఉపాధ్యాయులు, వార్డెన్లతోనే గడుపుతారని వారి భవిష్యత్ కేజీబీవీల ప్రత్యేకాధికారులు, ఉపాధ్యాయులపైనే ఆధారపడి ఉంటుందన్నారు. విద్యార్థినులకు ఉత్తమ విద్య, అవసరమైన సౌకర్యాలు కల్పించడమే గాక సత్ప్రవర్తనతో ఆదర్శంగా మెలగాలన్నారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను కేజీబీవీలలో తప్పక అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జీసీడీఓలు అర్షాఖాద్రీ, సంగీత, మాస్టర్ ట్రైనర్లు నాయుడు, పల్లవి, శివలీల, నర్మద తదితరులు పాల్గొన్నారు. -
సేవాతత్పరులు
స్వామి వివేకానంద.. తన జీవన విధానంలో ఎందరికో స్ఫూర్తినిచ్చిన మహనీయుడు. లక్ష్యం లేకుండా పయనించే యువతకు ఆయనే ఓ దిక్సూచి. మానవ సేవయే.. మాధవసేవగా భావించి సామాన్య ప్రజలపై అసామాన్య సానుభూతిని కనబరిచిన మానవతావాది. ఈయనను స్ఫూర్తిగా తీసుకొని కొంతమంది యువకులు ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఆశించకుండా మనల్ని మనమే సంస్కరించుకోవాలని ముందడుగు వేస్తున్నారు. రక్తదానం, అన్నదానం, విద్యాదానం, విద్యార్థులకు పుస్తకాలు, ప్యాడ్లు పంపిణీ, మొక్కల పెంపకం, శ్రమదానంతోపాటు.. సామాజిక, ఆర్థిక అసమానతలపై చైతన్యం కల్పిస్తూ ఇతరుల్లోనూ స్ఫూర్తిని రగిలిస్తున్నారు. ఏటికేడాది తమ లక్ష్యాలను మార్చుకుంటూ.. వాటి సాధన కోసం అవిశ్రాంతగా శ్రమిస్తూ ముందుకు సాగుతున్నారు. సోమవారం స్వామి వివేకానందుడి జయంతి (జాతీయ యువజన దినోత్సవం)ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్న యువజన సంఘాలపై ప్రత్యేక కథనం.. ముందుండి.. రక్తదానం నవాబుపేట: సేవా కార్యక్రమాల్లో అతి ముఖ్యమైన రక్తదానాలకు పెట్టింది పేరు నవాబుపేట స్వామి వివేకానంద సేవాసమితి. మరికొందరు యువత తమ తల్లిదండ్రుల పేరుతో సంస్థలను స్థాపించి.. పేదలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. రక్తదాన శిబిరాలు ఒకరు ఏర్పాటు చేస్తుంటే.. మరొకరు అన్నదాన కార్యక్రమాలు, పేదలకు ప్రతినెలా కొంత ఆర్థిక సాయం అందిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సామాజిక సేవలో యువతరం రక్తదానం, అన్నదానంతోపాటు ప్రగతిలో మమేకం సామాజిక, ఆర్థిక అసమానతలపై చైతన్యం స్వామి వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు.. నేడు జాతీయ యువజన దినోత్సవం -
సేవ చేయడం అదృష్టం..
ఆత్మకూర్లో వివేకానంద సేవాసమితిని నెలకొల్పిన నాటి నుంచి యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నాం. రక్తదాన, వైద్యశిబిరాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. పారిశుద్ధ్య కార్యక్రమాలు, విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. పేదలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. – బాలు, సేవాసమితి అధ్యక్షుడు, ఆత్మకూర్ ఆత్మకూర్: పట్టణానికి చెందిన డాన్స్మాస్టర్ బాలు, మ్యాడం శ్రీను, ల్యాబ్ టెక్నీషియన్ రాజేశ్ తదితరులు ఎనిమిదేళ్ల క్రితం స్వామి వివేకానంద సేవాసమితిని నెలకొల్పి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం క్లాత్ సంచులను పంపిణీ చేస్తున్నారు. తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ.. ఇప్పటివరకు 275 మందితో రక్తదానం చేయించారు. నేత్రం ఫౌండేషన్ సహకారంతో విద్యార్థుల్లో కంటి లోపాలను గుర్తించి.. చికిత్స అందేలా చూస్తున్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు. ●తలసేమియా బాధితులకు అండగా.. -
మున్సిపోల్స్కు కసరత్తు..!
72 వార్డుల మ్యాప్లు సిద్ధం.. 150 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ● మూడు పురపాలికల్లో పాత వార్డులే.. ● కొత్తగా ఏర్పాటైన మద్దూర్లో 16 వార్డుల విభజన ● ఆర్ఓల నియామకానికి ఆదేశాలు నారాయణపేట: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ముసాయిదా ఓటరు జాబితాను పుర అధికారులు ఇటీవల విడుదల చేయగా.. తుది జాబితా రూపకల్పనకు కసరత్తు చేస్తున్నారు. 4 పురపాలికలు.. 72 వార్డులు... జిల్లాలోని నారాయణపేట, కోస్గి, మక్తల్ మున్సిపాలిటీలు పాతవే కావడంతో వార్డుల మార్పు జరగలేదు. నారాయణపేటలో 1,800 ఓట్లున్న వార్డులో మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఒక్కో వార్డుకు ఒకటి లేదా రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు మక్తల్, కోస్గి విలీన గ్రామపంచాయతీలు, శివారు ప్రాంతాలు కలిగిన వార్డుల్లో రెండు, మూడు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేస్తారా లేక 1,600 ఓట్లలోపు ఉండటంతో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారా అనేది అధికారులు నిర్ణయించాల్సి ఉంది. ఫొటో ఓటరు జాబితాతో పాటు వార్డు, పోలింగ్ కేంద్రాలపై ఫిర్యాదులు, అభ్యంతరాలను సంబంధిత కమిషనర్కు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అందజేయడంతో వాటిని పరిశీలించి పరిష్కారం చూపినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ జాబితాపై రాజకీయ నాయకులతో పట్టణ, జిల్లాస్థాయిలో చర్చించి తుది ఓటరు జాబితాను ప్రచురించేందుకు కసరత్తు చేస్తున్నారు. అధికారుల నియామకానికి ఆదేశాలు.. రిటర్నింగ్ అధికారులు (ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తి చేయాలని ఇప్పటికే కలెక్టర్లకు సీడీఎంఏ నుంచి ఉత్తర్వులు అందాయి. ప్రతి రెండు, మూడు వార్డులను ఓ క్లస్టర్గా ఏర్పాటుచేసి వాటికి ఆర్ఓ, ఏఆర్వోను నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ● మద్దూర్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పాటు కావడంతో వార్డుల విభజన చేసి మ్యాపులను రూపొందించారు. మొత్తం 16 వార్డులు కాగా.. పట్టణంలో 9 వార్డులు, విలీన గ్రామాలైన రెనివట్ల, భీంపురం, నాగంపల్లి, సాపన్చెరువుతండా, ఎర్రగుంటతండాలతో 7 వార్డులుగా మ్యాపులను ఏర్పాటు చేశారు. ప్రతి వార్డులో రెండు పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 72 వార్డుల్లో వార్డుకు రెండు చొప్పున, నారాయణపేటలో అదనంగా ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పుర అధికారులు కేంద్రాలను పరిశీలించి ఫైనల్ చేస్తున్నారు. రిజర్వేషన్లపై ఉత్కంఠ.. అధికారులు 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఇతర సామాజిక వర్గాల వివరాలు సేకరించారు. వీటి ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతుండటంతో.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలు పురపాలికల్లోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయా పార్టీల ప్రతినిధులు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రిజర్వేషన్ ఏ విధంగా వస్తుందోననే ఉత్కంఠ ఆశావాహుల్లో కనిపిస్తుంది. ఆశావహులు వార్డుల్లో తిరుగుతూ రిజర్వేషన్ అనుకూలిస్తే బరిలోకి దిగుతామని.. ఆశీర్వదించాలని ప్రచారం చేసుకుంటున్నారు. -
సీఎంకు రుణపడి ఉంటాం..
గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్ మండలం కొత్తపల్లి మధ్యనున్న కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారని చిన్నతనం నుంచి వింటున్నా. ప్రస్తుతం నిర్మాణానికి అడుగులు పడగా.. తాత్కాలిక రోడ్డు పనులు పూర్తయి గ్రామం మీదుగా రాకపోకలు కొనసాగుతుండటంతో ఆనందంగా ఉంది. ఏళ్లనాటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రుణపడి ఉంటాం. – మహేశ్వర్రెడ్డి, మాజీ సర్పంచ్, కొత్తపల్లి (గద్వాల) మండలంలోని జూరాల వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి ఎంతో శ్రమించారు. కొందరు కావాలని అడ్డంకులు సృష్టించి ఇబ్బందులకు గురిచేసినా సీఎంను ఒప్పించి రూ.123 కోట్లు మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. – పరమేష్, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు, ఆత్మకూర్ మా ఊరి మీదుగా ఆత్మకూర్, గద్వాలకు వాహనాలు తిరుగుతుంటే సందడిగా మారింది. గతంలో మా గ్రామంవైపు కన్నెత్తి చూడనివారు సైతం ఊరి మీదుగా ప్రయాణం చేస్తున్నారు. ఊరి రూపురేఖలు మారడం ఖాయం. – నర్సింహ, సర్పంచ్, జూరాల (ఆత్మకూర్) ● -
పరవశించే మది
ప్రకృతి ఒడి..ఆక్టోపస్ వ్యూపాయింట్ సఫారీ టూర్ కోసం పర్యాటకులు (amrabadtigerreserve.com) వెబ్సైట్నుసందర్శించి ముందస్తుబుకింగ్ చేసుకోవచ్చు. ఒకవైపు చుట్టూ దట్టమైన నల్లమల.. మధ్యలో కృష్ణమ్మ సెలయేరు.. చీమ చిటుకుమన్నా వినిపించేంత నిశ్శబ్దం.. మరోవైపు పెద్ద పులుల గాండ్రింపు.. చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, దుప్పుల చప్పుళ్లు.. ఇక ఎటువైపు చూసినా వివిధ రకాల పక్షుల కిలకిలరావాల మధ్య.. ప్రకృతితో మమేకమై సాగే నల్లమల జంగిల్ సఫారీ టూర్ పర్యాటక ప్రియులకు మరచిపోలేని అనుభూతినిస్తోంది. అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన టైగర్ స్టే ప్యాకేజీ, టైగర్ సఫారీలకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తూ నల్లమల అందాలు, వన్యప్రాణులను కనులారా వీక్షిస్తున్నారు. 24 గంటలపాటు రణగోనుల ప్రపంచానికి దూరంగా.. ప్రకృతితో మమేకమవుతూ.. రోజంతా ఆనందంగా గడుపుతూ మైమరిచిపోతున్నారు. – సాక్షి, నాగర్కర్నూల్ నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో అటవీశాఖ చేపట్టిన టైగర్ స్టే ప్యాకేజీ, టైగర్ సఫారీలకు విశేష స్పందన లభిస్తోంది. సాధారణం కన్నా శని, ఆదివారాలతోపాటు సెలవు రోజుల్లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత రెండు నెలల వ్యవధిలో సుమారు 8 సార్లు పెద్ద పులి కనిపించడం విశేషం. జంగిల్ సఫారీలో నిత్యం పర్యాటకులకు పులులతోపాటు చిరుతలు, వన్యప్రాణులు తారసపడుతూ కనువిందు చేస్తున్నాయి. దీంతో అటవీశాఖ అమలుపరుస్తున్న టైగర్ స్టే ప్యాకేజీతోపాటు జంగిల్ సఫారీ కోసం పెద్దసంఖ్యలో సందర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు.రెండు రోజులపాటు.. పర్యాటక ప్రియులను ఆకర్షిస్తున్న నల్లమల టూరిజం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఫర్హాబాద్, ఆక్టోపస్ వ్యూపాయింట్లు జంగిల్ సఫారీలో పెద్ద పులులు, ఇతర వన్యప్రాణుల కనువిందు వారాంతాలు, సెలవు రోజుల్లో విశేషంగా పెరుగుతున్న ఆదరణ రెండు రకాల ప్యాకేజీల్లో అవకాశం కల్పిస్తున్న అటవీశాఖ -
పెద్ద పులులు.. వన్యప్రాణులు
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో అటవీ అధికారులు టైగర్ సఫారీ ద్వారా పెద్ద పులులు, చిరుతలు, ఇతర వన్యప్రాణులు, అడవి అందాలను వీక్షించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. నల్లమలలో 34 వరకు పెద్ద పులులు, వందకుపైగా చిరుతలు, ఎలుగుబంట్లు, వందల సంఖ్యలో జింకలు, దుప్పులు, మనుబోతులు, అడవి పందులు, అడవి కుక్కలు తదితర వన్యప్రాణులు ఉన్నాయి. టైగర్ సఫారీ వాహనంలో ప్రయాణించే సందర్శకులకు తరచుగా వన్యప్రాణులు కనిపిస్తున్నాయి. ఇటీవల 20 రోజుల వ్యవధిలోనే సందర్శకులకు మూడుసార్లు పెద్ద పులులు కనిపించాయి. ఎలుగుబంట్లు, జింకలు, మనుబోతులు ఇక్కడికి వస్తున్న సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. నల్లమలను సందర్శించాలనుకునే పర్యాటకులు అటవీశాఖ టైగర్ స్టే ప్యాకేజీతోపాటు జంగిల్ సఫారీ ట్రిప్ను అందిస్తోంది. సఫారీ వాహనంలో ప్రయాణించాలనుకునే సందర్శకులు హైదరాబాద్– శ్రీశైలం రహదారిలో ఉన్న ఫర్హాబాద్ గేటు వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. -
వెట్టి నుంచి విముక్తి
నారాయణపేట: పాఠశాలలకు వెళ్లాల్సిన చిన్నారులు పని బాట పడుతున్నారు. కొందరు తల్లిదండ్రులు తెలిసో తెలియకో తమ పిల్లలను పనులకు పంపించి బాలకార్మికులుగా మారుస్తున్నారు. బడిఈడులో బాధ్యతలు మీదేసుకొని ఆ పనుల్లోనే మగ్గిపోతున్నారు. అలాంటి బాలల భవిష్యత్ అంధకారం కాకుండా ప్రభుత్వం ఏటా ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తప్పిపోయిన, బాలకార్మికులుగా పనిచేస్తున్న వారి ని గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తూ పాఠశాలలో చేర్పిస్తున్నారు. చిన్నారులతో పనులు చేయిస్తే యజమానులపై కేసులు సైతం నమోదు చేసేందుకు పోలీసులు వెనుకాడటం లేదు. స్పెషల్ డ్రైవ్.. ఎస్పీ డా. వినీత్ దిశానిర్దేశంలో ఈ ఏడాది పోలీసు, కార్మిక, ఐసీడీఎస్ శాఖలు సంయుక్తంగా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్–12 కార్యక్రమం నిర్వహిస్తూ బాల కార్మికులను గుర్తించేందుకు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ చేపట్టి 1,125 మంది బాలకార్మికులను గుర్తించారు. బాలలను పనుల్లో పెట్టుకున్న 59 మంది యజమానులపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. ప్రత్యేక బృందాలతో.. బాలకార్మికులను గుర్తించి పని నుంచి విముక్తి కల్పించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఎస్ఐతో పాటు పోలీస్ సిబ్బంది, కార్మికశాఖ, చిల్డ్రన్, 1098, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ, బాలరక్ష భవన్, సఖి, ఐసీడీసీ అధికారులు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. బాలల హక్కులు కాపాడేందుకు పోలీసు, ఇతర విభాగాలు కలిసి బృందాలుగా ఏర్పడి బస్టాండ్లు, ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థలు, హోటళ్లు ఇతర ప్రదేశాలపై నిఘా ఉంచి ఆకస్మిక దాడులు చేసి బాల కార్మికులను గుర్తించారు. 9 రోజుల్లో 21 మంది.. బాలకార్మికులకు వెట్టి నుంచి విముక్తి కల్పిస్తూ వారి ముఖాల్లో చిరునవ్వు నింపడమే ధ్యేయంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్లో భాగంగా తొమ్మిది రోజుల్లో 21 మంది బాలలను గుర్తించి.. 16 మందిపై కేసులు నమోదు చేశారు. 12వ విడత ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం 31వ తేదీ వరకు కొనసాగనుంది. జిల్లాలో ఏడేళ్లుగా ఆపరేషన్ స్మైల్ కింద 604 మందికి, ఆపరేషన్ ముస్కాన్ కింద 521 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. అయితే ఈ ఏడాది చేపట్టిన ఆపరేషన్ స్మైల్లో 21 మంది చిన్నారులకు విముక్తి కల్పించడంతో 625 మందికి చేరినట్లయింది. జిల్లాలో కొనసాగుతున్నఆపరేషన్ స్మైల్ ఇప్పటి వరకు 21 మంది చిన్నారుల గుర్తింపు ఏడేళ్లలో 1,125 మంది బాలకార్మికులు -
అప్రమత్తతతోనే చోరీల నియంత్రణ : ఎస్పీ
నారాయణపేట: ప్రస్తుత సంక్రాంతి సెలవుల్లో చాలామంది కుటుంబాలతో కలిసి స్వగ్రామాలకు వెళ్తుంటారని.. ఇదే అదనుగా భావించి దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తూ చోరీలకు పాల్పడతారని, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డా. వినీత్ పేర్కొన్నారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని.. సిబ్బంది రాత్రిళ్లు గస్తీ నిర్వహిస్తారని చెప్పారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఇంటి చిరునామా, ఫోన్న్నంబర్ సంబంధిత పోలీస్స్టేషన్లో నమోదు చేయిస్తే నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. ఇరుగు పొరుగు వాళ్లకు తరచూ గమనిస్తూ ఉండాలని చెప్పడంతో పాటు ప్రజలు తమ కాలనీలు, ఇళ్లు, పరిసరాలు, షాపింగ్ మాల్స్లో సీసీ కెమెరాలు అమర్చుకోవాలన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లను ఇంటి ఆవరణలో నిలపాలని సూచించారు. బీరువా తాళం చెవులను వెంట తీసుకెళ్లాలని, ఇళ్లకు వేసిన తాళం కనిపించకుండా డోర్ కర్టెనన్ వేయాలని, ఇంట్లోని ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలన్నారు. ఇంటి ఎదుట చెత్తా చెదారం, పాల ప్యాకెట్లు జమకాకుండా చూడాలని, ప్రయాణం చేస్తున్నప్పుడు బంగారు నగలు, డబ్బు దగ్గరలో పెట్టుకోవాని సూచించారు. కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, సభ్యులు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ సెల్నంబర్ 87126 70399 సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి ధన్వాడ: ప్రతి రైతు ప్రత్యేక గుర్తింపు నంబర్ కోసం ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ కోరారు. శనివారం మండలంలోని కిష్టాపూర్, మందిపల్లి గ్రామపంచాయతీల్లో కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే పథకాల కోసం ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తుందన్నారు. ఇందుకోసం ఆధార్కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్కు లింక్ ఉన్న మొబైల్ నంబర్తో ఏఈఓ లేదా సమీప మీసేవా కేంద్రానికి వెళ్లి నమోదు చేయించుకోవాలని సూచించారు. ప్రతి రైతువేదికలో నమోదు కార్యక్రమం కొనసాగుతోందని.. సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయశాఖ అధికారి నవీన్కుమార్, సర్పంచ్ కొండయ్య, సురేందర్రెడ్డి, ఏఈఓలు జైన్సింగ్, రాజు ఉన్నారు. కేటీఆర్ సభ ఏర్పాట్ల పరిశీలన జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 12న పాలమూరుకు వస్తున్నారని.. పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఎంబీసీ మైదానంలో బహిరంగసభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సభా వేదిక, పార్కింగ్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డుమెంబర్లను కేటీఆర్ సన్మానిస్తారని పేర్కొన్నారు. సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, పట్టణ అధ్యక్షుడు శివరాజు, మున్నూరు రాజు, ప్రభాకర్ పాల్గొన్నారు. నేడు పాలమూరులో బీసీ న్యాయసభ మెట్టుగడ్డ: 42శాతం బీసీ రిజర్వేషన్ల సాధన – 9వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్తో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం బీసీ సామాజిక న్యాయసభను నిర్వహిస్తున్నట్లు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు రమేశ్గౌడ్ ప్రకటనలో తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఫౌండర్ చైర్మన్ చిరంజీవులు, మాజీ సుప్రీం కోర్టు జడ్జి జస్టీస్ ఈశ్వరయ్య, వి శారదన్ మహారాజ్, సంగెం సూర్యారావు పా ల్గొంటున్నట్లు తెలిపారు. కావున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. -
చదువును మించిన ఆయుధం లేదు
కోస్గి: జీవితంలో విజయం సాధించాలంటే చదువును మించిన ఆయుధం ఏదీ లేదని.. శ్రద్ధగా చదివి ఉన్నతంగా ఎదగాలని జిల్లా న్యాయమూర్తి వింద్యానాయక్ అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ఆధ్వర్యంలో ‘రోడ్డు భద్రత, విద్యశ్రీపై నినాదాల తయారీ, పోస్టర్ మేకింగ్ జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. మండలంలోని మీర్జాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చగా.. శుక్రవారం జిల్లా న్యాయస్థానంలోని తన చాంబర్లో విజేతలు నవ్యశ్రీ, మమత, అక్షితకు బహుమతులు అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జనార్దన్, ఉపాధ్యాయుడు వార్ల మల్లేషం తదితరులు పాల్గొన్నారు. సీఎం కప్ టార్చ్ ర్యాలీ కోస్గి రూరల్: గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు సీఎం కప్ పోటీలు చక్కటి అవకాశమని జిల్లా స్పోర్ట్స్ అధికారి వెంకటేష్శెట్టి అన్నారు. సీఎం కప్ పోటీల్లో భాగంగా శుక్రవారం గుండుమాల్ మండల కేంద్రంలో టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 18 నుంచి 26 వరకు పాఠశాల స్థాయిలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ మొదలైన క్రీడలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఎం కప్ ఇన్చార్జి సాయినాథ్, ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్రీనివాస్రెడ్డి, మండల తహసీల్దార్ భాస్కర్స్వామి, ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డి, మండల విద్యాధికారి శేఖర్రెడ్డి, సర్పంచ్ శ్రీశైల, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఊమెఆస్రా, మండల అధ్యక్షులు విక్రంరెడ్డి తదితరులు ఉన్నారు. వరి క్వింటా రూ.2,703 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో శుక్రవారం వరి ధాన్యం (సోన రకం) క్వింటా గరిష్టంగా రూ.2,703, కనిష్టంగా రూ.1,500 ధర పలికింది. అదేవిధంగా తెల్ల కంది గరిష్టంగా 7,659, కనిష్టంగా 5,550, ఎర్ర కంది గరిష్టంగా రూ.7,625, కనిష్టంగా రూ.5,551 ధరలు లభించాయి. ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.2809 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,809, కనిష్టంగా రూ.1,729 ధరలు పలికాయి. అలాగే హంస రూ.1,871, కందులు గరిష్టంగా రూ.6,876, కనిష్టంగా రూ.5,056, వేరుశనగ గరిష్టంగా రూ.8,733, కనిష్టంగా రూ.6,903, ఉలువలు రూ.3,610, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,975, కనిష్టంగా రూ.1,777 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో కందులు రూ.5,720గా ఒకే ధర లభించింది. పార్టీ బలమున్న స్థానాల్లో పోటీ : సీపీఎం వనపర్తి రూరల్: రాబోయే పుర ఎన్నికల్లో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బలమున్న స్థానాల్లో పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో బాలస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు అవకాశం ఇవ్వాలని, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు తదితర వర్గాల అభ్యున్నతికి పార్టీ పని చేస్తోందన్నారు. నేటి రాజకీయాలు వ్యాపారంగా మారాయని.. డబ్బు, మద్యం తదితర తాత్కాలిక ప్రయోజనాలను చూయించి ఓట్లు దండుకొంటున్నారని చెప్పారు. అభివృద్ధిని మరిచే రాజకీయాలు నేడు ఉన్నాయని.. నీతి, నిజాయితీతో ప్రజల కోసం పాటు పడుతున్న పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శులు పుట్టా ఆంజనేయులు, ఎండీ జబ్బార్, కార్యదర్శివర్గ సభ్యులు బాల్రెడ్డి, ఎం.రాజు, ఎ.లక్ష్మి, పట్టణ కార్యదర్శి పరమేశ్వరాచారి, సీపీఎం నాయకులు కురుమయ్య, రమేష్, గట్టయ్య, బీసన్న, గంధం మదన్, బాలరాజు, ఉమా, సాయిలీల, రాబర్ట్ తదితరులు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణకు చర్యలు
నారాయణపేట: జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్పీ వినీత్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణ, గ్రేవ్, నాన్ గ్రేవ్, పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. దర్యాప్తులో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి త్వరగా కేసులు పరిష్కరించాలన్నారు. పెండింగ్ కేసులు తగ్గించేందుకు న్యాయ, వైద్య అధికారులతో సమన్వయంతో పని చేయాలని సూచించారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తు 60 రోజుల్లో పూర్తిచేసి చార్జ్షీట్ దాఖలు చేయాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ప్రత్యేక చొరవ చూపాలని, షీటీం, స్థానిక పోలీసులు, ప్రజలకు సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. కేసుల దర్యాప్తులో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సంక్రాంతి పండుగకు ప్రజలు ఊర్లకు వెళ్తుంటారని, చోరీలు జరగకుండా నిరంతరం గస్తీ నిర్వహించాలని సూచించారు. నీతి నిజాయితీగా విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా డీటీఓ అధికారులతో కలిసి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించి భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించాలని, పాత నేరస్తులపై నిఘా ఉంచి నిరంతరం తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన డీఎంహెచ్ఓ, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, రెవెన్యూ అధికారులను ఎస్పీ శాలువాలతో సత్కరించి పూల మొక్కలు అందించి అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, డీఎంహెచ్ఓ డా. జయచంద్రమోహన్, ఆర్టీఓ మెగాగాంధీ, రిటైర్డ్ రెవెన్యూ అధికారి బాలాజీ సఫారీ, సీఐలు శివశంకర్, రాజేందర్రెడ్డి, రాంలాల్, సైదులు, ఎస్ఐలు వెంకటేశ్వ ర్లు, రాజు, రాముడు, విజయ్కుమార్, బాలరాజు, రాజశేఖర్, అశోక్బాబు, రమేష్, రాము, నవీద్, సు నీత, గాయత్రి, రేవతి, మహేశ్వరి పాల్గొన్నారు. -
సిబిల్ సప్లయ్..!
ఉమ్మడి పాలమూరు జి ల్లాలో 2020 నుంచి న వంబర్ వరకు 148 మంది మిల్లులను డీఫాల్ట్గా గుర్తించి.. 52 మిల్లులపై కేసులు నమోదు చేశారు. వీటి పరిధిలో రూ.566 కోట్ల విలువైన ధాన్యం ఉంది. ఇందులో రూ.450 కోట్ల విలువైన ధాన్యాన్ని రాబట్టాల్సి ఉండగా..ఈ ప్రక్రియ సక్రమంగా సాగడం లేదు. పైగా ఆయా రైస్ మిల్లర్ల చేతిలోని మిల్లులు సహకరించే అధికారులు, నేతలకు అక్షయపాత్రగా మారాయి. దీనిపై విజిలెన్స్, ఎన్ఫోర్మెంట్ అధికారులు సైతం సందర్భాన్ని బట్టి దాడులు నిర్వహించి.. చేతులు తడుపుకొని పోతారనే విమర్శలూ ఉన్నాయి. రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న క్రమంలో ప్రభుత్వ పెద్దలు ఆ శాఖపై సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లాలోనే మిల్లర్ల అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గ్రహించిన విజిలెన్స్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: అవినీతికి కేరాఫ్గా నిలిచిన సివిల్ సప్లయ్ శాఖపై ముప్పేట దాడులు కొనసాగుతున్నాయి. ఒకవైపు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, మరోవైపు అవినీతి నిరోధకశాఖ దూకుడు పెంచడంతో అధికార యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రధానంగా ఇటీవల వనపర్తి జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం జగన్మోహన్ రెడ్హ్యాండెడ్గా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం.. ఆ తర్వాత ఆ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), డీఎస్ఓలను సైతం విచారించడం చర్చనీయాంశంగా మారింది. కలెక్టరేట్ వేదికగా చోటుచేసుకున్న ఈ పరిణామాలు ఉమ్మడి పాలమూరులో సంచలనం సృష్టిస్తున్నాయి. కింది స్థాయి సిబ్బంది నుంచి మొదలు పైస్థాయి దాకా లంచాల్లో వాటాల పంపకాలు నిత్యకృత్యంగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిల్లర్లతో ‘దోస్తాన్’ దందాతోనే.. మర ఆడిచేందుకు ప్రభుత్వం మిల్లులకు కేటాయించిన సీఎమ్మార్ ధాన్యంలో మిల్లర్ల అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. పెట్టుబడి పెట్టకుండా అవకతవకలకు పాల్పడుతూ బహిరంగ మార్కెట్లో విక్రయిస్తూ అప్పనంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమాలను అరికట్టాల్సిన సివిల్ సప్లయ్ శాఖ మిన్నకుండిపోయింది. ప్రధానంగా మిల్లర్ల నుంచి ఆ శాఖకు చెందిన పలువురు సిబ్బంది, అధికారులు కుమ్మకై ్క నెల నెలా లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సహకరించని మిల్లర్లను నానా తిప్పలు పెట్టి దారికి తెచ్చుకున్న ఘటనలు కూడా వెలుగుచూశాయి. ఇలా మిల్లర్లతో పౌర సరఫరాల శాఖ అధికారులు దోస్తాన్ దందాకు తెగబడడంతో ప్రధానంగా వనపర్తిలో పరిస్థితులు మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్.. ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఏ‘సీ’బీ.. చిక్కిన డీఎం వనపర్తి జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. కొత్తకోట మండలంలోని ఓ రైస్ మిల్లుకు సంబంధించి సీఎమ్మార్ అనుమతి కోసం రూ.1.70 లక్షలు డిమాండ్ చేశాడు. గురువారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కలెక్టరేట్లోని తన కార్యాలయం నుంచి బయటకు వెళ్తూ కారులో మిల్లు నిర్వాహకులను ఎక్కించుకుని తొలి విడతగా రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ ఘటనతో పౌర సరఫరాల శాఖలో వేళ్లూనుకున్న అవినీతి పర్వం, అధికారుల ధనదాహం మరోసారి వెలుగుచూసినట్లయింది. ముందుగావిజి‘లెన్స్’.. డీఎస్ఓ, అడిషనల్ కలెక్టర్పై విచారణతో.. పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్ను వల పన్ని పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు తాజాగా శుక్రవారం డీఎస్ఓ కాశీనాథం, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కీమ్యానాయక్ను విచారించడం సంచలనం సృష్టిస్తోంది. ఉదయం కలెక్టరేట్లోని డీఎం కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు వారిని పిలిపించుకున్నారు. సుమారు ఏడు నుంచి పది గంటల వరకు ఇద్దరు జిల్లాస్థాయి అధికారులను విచారించడం ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. పౌర సరఫరాల శాఖలో లంచావతారులు కింది స్థాయి నుంచి పైదాకా వాటాల పంపకాలు? రూ.50 వేలతో రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కిన వనపర్తి డీఎం తాజాగా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), డీఎస్ఓలపై విచారణతో కలకలం ఓ వైపు విజిలెన్స్, మరోవైపు అవినీతి నిరోధక శాఖ దాడులు ఉమ్మడి పాలమూరులో అధికారులఉక్కిరిబిక్కిరి -
మక్తల్ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా
● రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్: స్థానిక పురపాలికను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం పట్టణంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించి మాట్లాడారు. ట్యాంకుబండ్పై రూ. 3.70 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని.. సుందరీకరణకు నిధుల కొరత లేదని, వేగంగా పూర్తి చేయాలని ఏఈ నాగశివను ఆదేశించారు. చెరువు దగ్గర బోటింగ్, ఈదమ్మ ఆలయం దగ్గర ఘాట్ నిర్మించాలని, వీధిదీపాలు అమర్చాలని సూచించా రు. పర్యాటకులు కూర్చోడానికి కట్టపై సిమెంట్ కు ర్చీలు ఏర్పాటు చేయాలని, కట్టపై కిలోమీటర్ పొడవునా సీసీ రోడ్డు వేయాలని కోరారు. వినాయక నిమజ్జనానికి ప్రత్యేకంగా ఘాట్ నిర్మించాలన్నారు. అదేవిధంగా 16వ వార్డులో సీసీ రహదారి నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. రూ.25 కోట్లతో నిర్మిస్తున్న క్రీడా మైదానం పనులు, రూ.43 కోట్లతో నిర్మాణంలో ఉన్న 150 పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణాన్ని పరిశీలించారు. పట్టణాభివృద్ధికి పార్టీలకతీతంగా అందరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్కుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కోళ్ల వెంకటేశ్, మార్కెట్ డైరెక్టర్లు ఫయాజ్, శ్రీనివాసులు, రంజిత్కుమార్రెడ్డి, గోవర్ధన్, రవికుమార్, రాజేందర్, రహీం పటేల్, శంషోద్దీన్, ఎండీ సలాం, కట్టా సురేశ్, భాస్కర్ తదితరులు ఉన్నారు. -
ఊట్కూరును ముంపు గ్రామంగా ప్రకటించాలి
ఊట్కూరు: ముంపు గ్రామంగా ప్రకటించాలని మండలకేంద్ర ప్రజలు శుక్రవారం రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. శుక్రవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఊట్కూరు, దంతన్పల్లి శివారులో భూములు కోల్పోతున్న రైతుల వివరాలు చదివి వినిపించారు. ఎవరికై నా అభ్యంతరాలుంటే ఫిర్యా దు చేయాలని అధికారులు సూచించారు. ఎత్తిపోతల పథకం డీపీఆర్ను ఇంతవరకు విడుదల చేయలేదని, పెద్ద చెరువు రిజర్వాయర్గా మారితే భవిష్యత్లో గ్రామానికి ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు గ్రామస్తులు ఆయనకు వివరించారు. అలుగుపారే సమయంలో చిన్న గుంత తీసినా ఊటనీరు వస్తుందని, గ్రామం జలమయంగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. రిజర్వాయర్ కట్ట ఎత్తు, పొడవు, విస్తీర్ణం తదితర వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నీటిపారుదలశాఖ అధికారులతో మాట్లాడి పూర్తి సమాచారం తీసుకొని ఉన్నతాధికారులకు నివేదిస్తానని గ్రామస్తులకు హాహీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామచందర్, తహసీల్దార్ చింత రవి, విండో అధ్యక్షుడు బాల్రెడ్డి, ఉపసర్పంచ్ రమేశ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అరవింద్కుమార్, నాయకులు భరత్, శివారెడ్డి, రమేష్, మోనప్ప తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నది ఉన్నట్లు సమర్పిస్తాం
పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో 28 మంది మాట్లాడిన అభిప్రాయాలన్నింటిని నమోదు చేసుకున్నాం. వీడియో చిత్రీకరణ చేశాం. మీటింగ్ మినిట్స్తో పాటు వీడియోను కాలుష్య నియంత్రణ మండలికి ఉన్నది ఉన్నట్లు సమర్పిస్తాం. – సురేష్, ఈఈ, పీసీబీ హైదరాబాద్ ఏ గ్రామం ముంపునకుగురికాదు ఈ ప్రాజెక్టులో ఏ గ్రామం ముంపునకు గురికావడం లేదు. 163 గ్రామాలకు తాగునీరు అందించేందుకు డిజైన్ అయింది. ఈ ప్రాజెక్టులో ఊట్కూర్ గ్రామం ముంపునకు గురయ్యే ఆస్కారమే లేదు. ఊట్కూరు మండల పరిసరాలలో సంచరించే జింకలను సంరక్షణ కేంద్రానికి తరలించేందుకు బడ్జెట్ కేటాయించడం జరిగింది. – శ్రీధర్, ఎస్ఈ, నీటి పారుదల శాఖ ప్రాజెక్టుతో ఆర్థిక వ్యవస్థ మెరుగు ఈ ప్రాజెక్టు చిట్టెం నర్సిరెడ్డి కన్న కల. చిట్టెం వెంకటేశ్వర్రెడ్డి దీనికోసం పాదయాత్ర చేశారు. ఈ ప్రాంతంలో రాళ్లు తేలిన భూములు కనిపిస్తాయి. వన్యం లేదు.. వన్యప్రాణులు లేవు. నీళ్లు ఉంటే వన్యప్రాణులు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టుతో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. పర్యావరణ అనుమతులు త్వరగా ఇస్తే ప్రాజెక్టు ఈ నెలలోనే ప్రారంభించుకునే అవకాశం ఉంది. అనుమతులు ఇవ్వాలని కోరుతున్నాం. – కుంభం శివకుమార్రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు ● -
ముంపు గ్రామంగా ప్రకటించాలి
ఈ ప్రాజెక్టుతో ఎంతో మేలు జరుగుతుంది. కానీ ఊట్కూర్ గ్రామం చెరువు కట్ట కింద ఉంది. పునాదులు వేస్తే ఊట నీరు వస్తుంది. కాబట్టి ఈ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలి. లేని పక్షంలో మా ప్రాణాలకు తెగించి అడ్డుపడతాం. ఊట్కూర్ చెరువు శివారు ప్రాంతంలో జింకలు, నెమళ్లు సంచరిస్తుంటాయి. వాటిని సంరక్షించేందుకు వన్యప్రాణుల కేంద్రాలకు తరలిస్తారా.. కేంద్రాలను ఏర్పాటు చేస్తారా స్పష్టం చేయాలి. – ఎం.భరత్, రైతు, ఊట్కూర్ వేటికీ ముప్పు లేదు జీఓ 69ను 2014 తర్వాత మూలకు పడేశారు. బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాజెక్టు ఊసేత్తలేదు. అయినా పోరాటాలు.. ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే ఈ ప్రాంత రైతుల కలను సాకారం చేయాలని ఈ ప్రాజెక్టుకు సీఎం రేవంత్రెడ్డి పునాది వేశారు. ఈ ప్రాజెక్టులో ఎలాంటి పర్యావరణ ముప్పులేదు. అనుమతులు ఇవ్వాలి. – నర్సింమ, జలసాధన సమితి కో కన్వీనర్, పేట -
ప్రయాణికులకు సౌకర్యాలు
హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలు, బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా, అదనపు వలంటీర్లను అందుబాటులో ఉంచుతున్నారు. అదేవిధంగా తాగునీటి వసతి, కూర్చోవడానికి కుర్చీలు, బస్సుల వివరాలు, సూచనలను ఎప్పటికప్పుడూ ప్రయాణికులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. సద్వినియోగం చేసుకోండి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అన్ని డిపోల నుంచి అదనపు బస్సులు నడపనున్నాం. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. సురక్షితమైన ప్రయాణానికి ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలి. – సంతోష్కుమార్, ఆర్టీసీ ఆర్ఎం -
గురుకులాల్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
మరికల్: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత పెంచే లక్ష్యంతో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పని చేయాలని ఏడో జోనల్ ఆఫీసర్ విద్యులత అన్నారు. విద్యార్థుల వంద శాతం ఉతీర్ణత సాధించడం కోసం ప్రభుత్వం తీసుకవచ్చిన మార్క్ కార్యక్రమంలో భాగంగా మరికల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల్లో గురువారం ఉమ్మడి జిల్లాలోని 32 ప్రిన్సిపాల్స్కు, 150 మంది ఉపాధ్యాయులకు ఈ విషయంపై ఒకరోజు శిక్షణ తరగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని 32 బాలుర, బాలికల గురుకుల పాఠశాలల్లో పదో తరగతి నుంచి 2432 మంది విద్యార్థులు, ఇంటర్ మొదటి సంవత్సరం 1906, రెండో సంవత్సరంలో 1756 మంది విద్యార్థులు వార్షీక పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. అందరు ఉతీర్ణత సాధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్క్ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇందుకు గాను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్థులకు గతంలో నిర్వహించిన త్రైమాసిక పరీక్షల జవాబు పత్రాలను పరిశీలించడం జరుగుతుందన్నారు. పరిశీలించిన జవాబు పత్రాల ఆధారంగా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను ఎలా ప్రోత్సాహించాలి, వారిలో మెరుగైన ఫలితలను ఎలా రాబట్టెందుకు తీసుకోవాల్సిన అంశాలను ఆమె వివరించారు. విద్యార్థులు వందశాతం ఉతీర్ణత సాధించడం కోసం ప్రణాళిక ప్రకారం వారికి ప్రత్యేకంగా మెటీరియల్ రూపొందించి అందజేసి అర్థవంతమైన పద్ధతిలో బోధన ఉండాలన్నారు. విద్యార్థులకు విద్య పరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
భూములిచ్చిన రైతులకు సాష్టాంగ సమస్కారం
దామరగిద్ద: మక్తల్ –పేట– కొడంగల్ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులకు ఊట్కూర్ మండలం బిజ్వార్ గ్రామానికి చెందిన జలసాధన సమితి నాయకుడు నర్సిములు వేదిక నుంచి సాష్టాంగ నమస్కారం చేశారు. పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత రైతుల సంక్షేమం కోసం తరతరాల బాగు కోసం తమ సొంత భూములను ఇవ్వడానికి ముందుకు రావడంతోనే ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం చేపట్టే అభివృద్దికి సహకారం అందిందన్నారు. కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ అనుమతులు ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర వాటాను అందించి ఈ ప్రాంత ప్రజల కల నెరేవేరేందుకు సహకరించాలని కోరారు. కాలినడకన వచ్చిన రైతులు.. దామరగిద్ద తండాలో జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి మండలంలోని గడిమున్కన్పల్లి గ్రామ రైతులు కాలినడక తరలివచ్చారు. దామరగిద్ద నుంచి తండా వరకు ఎలాంటి వాహన సదుపాయం లేకపోవడంతో రైతులు కాలినడకన అక్కడికి చేరుకున్నారు. ఆటోలు, జీపులు, ఇతర వాహనాలు తండాకు వెళ్లవని, అందుకే కాలినడకన వెళ్లినట్లు ఈ సందర్భంగా రైతులు తెలిపారు. -
వైద్యసేవల్లో నిర్లక్ష్యం వద్దు
మక్తల్: వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించొద్దని, ప్రధానంగా డయాలసిస్ రోగులకు మెరుగైన సేవలు అందించాలని నిమ్స్ నెప్రాలజీ బృందం సూచించింది. గురువారం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలోని డయాలసిస్ సెంటర్ను డాక్టర్లు నిరంజన్, గణేష్, పార్వతి, సౌత్ డీఎస్ అసోషియెటెడ్ మేనేజర్ సిబ్దతుల్లా సందర్శించారు. డయాలసిస్ పరికరాలు ఎలా పనిచేస్తున్నాయని ఆరా తీశారు. రోగులను కలిసి సేవలు ఎలా అందుతున్నాయని, ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా అని అడిగారు. వైద్యం విషయం ఏమైనా ఇబ్బంది అనిపిస్తే రోగులను వెంటనే నిమ్స్కు పంపించాలన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి ఎస్హెచ్ఓ వినూత, తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణానికి ముప్పులేదు..
నారాయణపేట: మక్తల్– నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపడితే ఈ ప్రాంతంలో ఎలాంటి పర్యావరణ ముప్పు.. విఘాతం కలగడం లేదని, వీలైనంత త్వరగా ఆ పథకానికి పర్యావరణ అనుమతులు ఇచ్చి ప్రారంభించాలని ప్రజలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం మక్తల్ –నారాయణపేట –కొడంగల్ ఎత్తిపోతల పథకంపై జిల్లాలోని దామరగిద్ద తండాలో గురువారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(పిసిబి) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం నుంచి ఈఈ సురేష్ హాజరు కాగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్ నాయక్, నీటి పారుదల శాఖ ఎస్. ఈ శ్రీధర్ సమక్షంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోని 7 మండలాల నుంచి ప్రజా ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, విశ్రాంత ఉద్యోగులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఏకాభిప్రాయాన్ని బృందం ముందు వెల్లడించారు. వందలాది మంది సమక్షంలో 28 మంది తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పనులను త్వరగా ప్రారంభించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని, ఆ పథకం పూర్తి చేసి సాగు, తాగునీరు అందించాలని ఆకాంక్షించారు. ఈ పథకంతో పర్యావరణానికి వచ్చే నష్టం ఏమీ లేదని, గాలి, నీరు, వాతావరణ కాలుష్యం ఏమీ జరగదని తేల్చి చెప్పారు. ఆ పథకం పూర్తి అయితే పర్యావరణం ఇంకా మెరుగు అవుతుందన్నారు. వెంటనే పథకం ప్రారంభించేందుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని అధికారి సురేష్ ను వారు కోరారు. కార్యక్రమంలో నారాయణపేట మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు పుట్టి ఈదప్ప, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కుంభం శివకుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఈఈ బ్రహ్మానందరెడ్డి, పర్యావరణ కన్సల్టెన్సీ కరీముల్లా, దామరగిద్ద తహసిల్దార్ తిరుపతయ్య, ఎంపీడీఓ జయలక్ష్మి, దామరగిద్ద తండా సర్పంచ్ శరణ్ నాయక్, దామరగిద్ద సర్పంచ్ అద్దన్ కనికిరెడ్డి, బాపన్పల్లి శ్రీను, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, రైతులు, రైతు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. మక్తల్– పేట– కొడంగల్ప్రాజెక్టుకు అనుమతివ్వాలి ఉద్యమాలు, పోరాటాలతో ప్రాజెక్టు సాధించుకున్నాం పర్యావరణ శాఖ నుంచి అనుమతులిచ్చి త్వరగా పూర్తి చేయండి ఈ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించాలి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడించిన ప్రజలు మూడు నియోజకవర్గాల్లోని ఏడు మండలాల నుంచి హాజరు -
రోడ్డు భద్రత నియమాలు పాటించండి
నారాయణపేట: దేశంలో ప్రతి సెకండ్ కు ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందని, భద్రతా నియమాలు పాటిస్తే చాలా వరకు ప్రమాదాల నుంచి తప్పించుకోగల్గుతామని, తల్లిదండ్రులు డ్రైవింగ్ చేసేటప్పుడు పిల్లలను.. యువకులు డ్రైవింగ్ చేసేటప్పుడు తల్లిదండ్రులను గుర్తు పెట్టుకోవాలని రాష్ట్ర క్రీడా, పశుసంవర్ధక, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈమేరకు విద్యార్థులచే మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల వల్ల తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ను, దేశ జట్టులో ఆడే అవకాశం కోల్పోయానని తన స్వీయ అనుభవాలను పంచుకున్నారు. మన శరీరంలో ప్రతీ అవయవం ముఖ్యమని అందుకే వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ పెట్టుకోవడం వంటి నియమాలు పాటించాలన్నారు. బైక్ స్పీడో మీటర్లపై అమ్మానాన్న అని ఉండేలా స్టిక్కర్లను అంటించాలని రవాణా అధికారులకు సూచించారు. లక్ష స్టిక్కర్లకు తానే స్వయంగా డబ్బులు ఇస్తానని, వాటిని ప్రింట్ తీయించి ప్రతి బైక్కు అంటించాలని ఆదేశించారు. యువకులు బైక్ లపై స్టంట్లు చేయడం మానుకోవాలని, ఎంతో మంది రోడ్డు ప్రమాదాల వల్ల ఆత్ములను కోల్పోయారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ పోషల్ రాజేష్, మాజీ మార్కెట్ చైర్మెన్ సరఫ్ నాగరాజు , మాజీ కౌన్సిలర్ బోయ రమేష్, నాయకులు దొడ్డి కార్తీక్ వకీల్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి సమస్య తీరనుంది
ఈ ప్రాజెక్టు చేపట్టడంతో పర్యావరణానికి నయా పైసా నష్టం లేదు. అడవి జంతులు, చెట్లు సమతుల్యత దెబ్బతనవు. పశు, మత్స్య సంపద అభివృద్ధి చెందుతుంది. తాగునీటి సమస్య తీరుతుంది. ఈ ప్రాజెక్టుతో పర్యావరణం మెరుగుపడుతుంది. వ్యవసాయం నిర్వీర్యం అవుతున్న సమయంలో పునరుజ్జీవం పోసినట్లవుతుంది. బోర్లు ఫెయిల్ అయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు, ముంబాయికి వలస వెళ్లి మృత్యువు చెందిన సంఘటనలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు చేపట్టడంతో ఎలాంటి పర్యావరణ సమస్యలు లేవు. – వెంకట్రామరెడ్డి, భూ నిర్వాసితుల సంఘం గౌరవ అధ్యక్షుడు -
సాగునీటి కోసం మరో ఉద్యమం
నారాయణపేట రూరల్: సాగునీటి సాధన కోసం బీజేపీ మరో ఉద్యమం చేపడుతుందని.. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్, కాంగ్రెస్కు చిత్తశుద్ది లేదని, మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి ఇద్దరూ తోడుదొంగలని, వారి నిర్లక్ష్యంతో ఉమ్మడి పాలమూరు జిల్లా సర్వనాశనం అయిందని బీజేపీ రాష్ట్ర క్రమ శిక్షణ సంఘం సభ్యుడు నాగురావు నామాజీ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నారాయణపేట సరిహద్దు తంగిడి నుంచి కృష్ణానది పాలమూరు జిల్లాలో 300 కిలోమీటర్ల దూరం తరలిపోతుంటే మన నీటిని మనం వాడుకోని దుస్థితి కల్పించారని అన్నారు. 2014 కన్నా ముందు ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, డిండి, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులు మాత్రమే ఇచ్చి నీటి కేటాయింపులు చేయకుండా కాంగ్రెస్ పచ్చి మోసం చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను డీపీఆర్ లేకుండా పనులు మొదలుపెట్టి రూ.30 వేల కోట్ల నిధులు ఖర్చు పెట్టి పంపిణీ కాల్వలు లేకుండా కమిషన్లు మెక్కి పాలమూరును ఎడారి చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విబీజిరాంజీ పతాకంపై కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తుందని ప్రజలు నమ్మొద్దని జిల్లా అద్యక్షుడు సత్య యాదవ్ ప్రజలను కోరారు. సిద్ది వెంకట్ రాములు, పోశాల్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. -
‘సంక్రాంతి’కి ఆర్టీసీ సన్నద్ధం
స్టేషన్ మహబూబ్నగర్: పల్లె సంస్కృతి ప్రతిబింబించే సంక్రాంతి పండుగకు ఎక్కడున్న వారి స్వస్థలాలకు రావడం పరిపాటిగా మారింది. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, శ్రామికులు ఈ పండుగకు ఇళ్లకు వచ్చి మూడు రోజులు జరిగే పండుగ సంబరాలను ఆస్వాదిస్తారు. అయితే ఈ ఏడాది పండుగను పురస్కరించుకొని ఆర్టీసీ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని 10 డిపోల నుంచి అదనపు బస్సులను నడపనున్నారు. శుక్రవారం నుంచి 13 వరకు హైదరాబాద్ నుంచి రీజియన్లోని పది డిపోలకు 430 బస్సులు నడపనున్నారు. పండుగ తిరుగు ప్రయాణంలో ఈ నెల 17 నుంచి 21 వరకు ఆయా డిపోల నుంచి హైదరాబాద్ వైపు 364 బస్సులను నడపడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రజలు సంక్రాంతి పండుగకు ఎక్కువ సంఖ్యలో వారి స్వస్థలాలకు వచ్చే అవకాశం ఉండడంతో హైదరాబాద్కు అదనపు సర్వీసులు నడపడానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అన్ని డిపోలకు హైదరాబాద్ రూట్లో ఎక్కువ ఆదాయం వస్తుండడంతో ఈ రూట్లోనే ఎక్కువగా అదనపు బస్సులు నడపనున్నారు. రీజియన్ నుంచి అదనపు బస్సులు హైదరాబాద్ నుంచి డిపోల వైపు 430 సర్వీసులు నేటినుంచి ప్రారంభం కానున్న రాకపోకలు -
డయాలస్ట్రెస్!
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ‘కిడ్నీ’ బాధితులు ● వనపర్తి, గద్వాల, మహబూబ్నగర్ జిల్లాల్లో అధికం ● అధునాతన పరికరాలున్నా.. వైద్యులు కరువు ● గతేడాది 7,270 మందికి డయాలసిస్.. ప్రస్తుతం 900 మందికి చికిత్స పాలమూరు: రోజురోజుకు మూత్రపిండ సంబంధిత వ్యాధులు విస్తరిస్తున్నాయి. ఏటా పదుల సంఖ్యలో బాధితులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో నెలకొన్న విభిన్న పరిస్థితులు, అలవాట్లు, భూగర్భజలాలు కలుషితం కావడం వంటివి కూడా బాధితుల పెరుగుదలకు కారణమవుతున్నాయి. గతేడాది 7,270 మందికి డయాలసిస్ చేయగా.. ప్రస్తుతం ప్రభుత్వ సెంటర్లలో 550 మంది, ప్రైవేటులో మరో 350 మందికి పైగా బాధితులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రధానంగా మక్తల్, నారాయణపేట, వనపర్తి ప్రాంతాలతో పాటు భూత్పూర్ మండలంలోని గ్రామాల్లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బాధితులు అధికమవుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 12 సెంటర్లు ఉండగా.. కొత్తగా మళ్లీ ప్రతి 20 కి.మీ. పరిధిలో ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో.. ఉమ్మడి జిల్లా నుంచి 20 సెంటర్లు నూతనంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించారు. ● రెండు నెలల్లో గద్వాలలో అత్యధికంగా డయాలసిస్ చేయించుకున్న బాధితులున్నారు. ఉమ్మడి జిల్లాలో గద్వాల సెంటర్లో 12 మిషన్లు ఉండగా.. నవంబర్లో 963, డిసెంబర్లో 976 మందికి డయాలసిస్ సేవలు అందించారు. కాగా.. అధునాత కేంద్రాలున్నా.. పాలమూరులో రోగులకు సలహాలు, సూచనలు అందించేందుకు ఒక్క నెఫ్రాలజిస్టు అందుబాటులో లేకపోవడం గమనార్హం. -
కందిపోతున్నారు..
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ని‘బంధనాలు’ దౌల్తాబాద్ మండలం చెల్లాపూర్కు చెందిన రైతు రాజప్ప తన రెండు ఎకరాల్లో 6 బస్తాల కందులు పండించారు. వాటిని విక్రయించేందుకు కోస్గిలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రానికి శాంపిల్ తీసుకెళ్లగా.. 17 శాతం తేమ వచ్చింది. దీంతో కందులను ఆరబెట్టుకొని తీసుకురావాలని చెప్పడంతో చేసేదేమి లేక వెళ్లిపోయారు. నారాయణపేట మండలం శాసన్పల్లికి చెందిన రైతు శ్రీనివాస్ 16 బస్తాల కందులను విక్రయించేందుకు స్థానికంగా ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రానికి నాలుగు రోజుల క్రితం తీసుకొచ్చారు. తేమ శాతం ఎక్కువగా ఉందని.. ఆరబెట్టాలని.. జల్లెడ పట్టించాలని చెప్పడంతో అక్కడే కందులను ఆరబెట్టి శుభ్రం చేశారు. అయినా మళ్లీ జిన్నింగ్ మిషన్కు వేయాలని చెప్పడంతో ఎన్నో అవస్థలు పడి జిన్నింగ్ మిషన్కు కందులను వేయాల్సి వచ్చింది. ఊట్కూర్కు చెందిన రైతు రాము తనకున్న 4 ఎకరాల పొలంలో పండించిన 33 బస్తాల కందులను పేట మార్కెట్ యార్డులో విక్రయించారు. ధర క్వింటాకు రూ. 7,831 వచ్చింది. పంట పండించేందుకు పెట్టిన పెట్టుబడి రూ. 60వేలు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్ముకునేందుకు వెళ్తే వారు చెప్పే నిబంధనలకు గిట్టుబాటు కాదని ప్రైవేటులో అమ్ముకున్నారు. ● -
రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరి
నారాయణపేట: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులు తప్పనిసరిగా రహదారి భద్రత నియమాలు పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు సూచించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి తన చాంబర్లో రోడ్డు సురక్ష అభియాన్–2026 కరపత్రం విడుదలచేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో మెలిగి ప్రమాదాలను నివారించాలన్నారు. అధిక వేగంతో వాహనాలను నడిపి ప్రాణాలను కోల్పోవద్దని.. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడపరాదన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లిన తమ కోసం తమ కుటుంబ సభ్యులు ఎదురుచూస్తూ ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్జడ్జి వింధ్యా నాయక్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్జడ్జి బి.సాయిమనోజ్, అదనపు జూనియర్ సివిల్జడ్జి కె.అవినాష్, ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణచైతన్య పాల్గొన్నారు. -
పకడ్బందీగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ
నారాయణపేట: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్ కలెక్టర్ శ్రీను అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా తుది ఓటరు జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటన, నామినేషన్ కేంద్రాలు, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూరు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించి.. అభ్యంతరాలు స్వీకరిస్తున్నట్లు వివరించారు. మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్ కేంద్రాలు, ఫొటో ఓటరు జాబితాలను ప్రకటిస్తామన్నారు. నామినేషన్ల స్వీకరణ, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. వీసీలో ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్, డిప్యూటీ కలెక్టర్లు శ్రీరామ్ ప్రణీత్, ఫణికుమార్, మున్సిపల్ కమిషనర్లు గోల్కొండ నర్సయ్య, శ్రీరాములు, నాగరాజు, శ్రీకాంత్ పాల్గొన్నారు. చదువు, క్రీడలకు సమప్రాధాన్యం ఇవ్వాలి నారాయణపేట: విద్యార్థులు చదువు, క్రీడలకు సమప్రాధాన్యత ఇచ్చి ఆకాశమే హద్దుగా ముందుకుసాగాలని డీఎస్పీ నల్లపు లింగయ్య అన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సీఎం కప్ 2025– 26 క్రీడా పోటీల సందర్భంగా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి డా.వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీని స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డితో కలిసి ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి.. వారిని అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేలా చేయడమే లక్ష్యంగా సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా, సీఎం కప్ టార్చ్ ర్యాలీ మినీ స్టేడియం నుంచి సత్యనారాయణ చౌరస్తా, పాతబస్టాండ్ సెంటర్ చౌక్ మీదుగా దామరగిద్దకు చేరుకుంది. కార్యక్రమంలో డీవైఎస్ఓ వెంకటేశ్శెట్టి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శరణప్ప, ఎస్ఐ వెంకటేశ్వర్లు, పీడీ గొడుగు నర్సింహులు, వ్యాయామ ఉపాధ్యాయులు సాయి, అనంతసేన, బాల్రాజ్, రమణ, రత్నయ్య, అక్తర్ పాషా తదితరులు పాల్గొన్నారు. పాడి పశువుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి దామరగిద్ద: పాడి పశువుల ఆరోగ్యంపై పెంపకందారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఈశ్వర్రెడ్డి సూచించారు. బుధవారం దామరగిద్ద మండలం ఉడ్మల్గిద్దలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి పశువులకు గర్భకోశ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి.. చికిత్స అందించారు. అనంతరం కృత్రిమ గర్భదారణ, గర్భకోశ వ్యాధి లక్షణాలు, గర్భస్థ పశువుల ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ సత్యమ్మ, పశువైద్యుడు శ్రీనివాస్, సూపర్వైజర్ ఉత్తేజ్కుమార్, గోపాలమిత్ర భీంషప్ప, కనకప్ప, నర్సింహులు పాల్గొన్నారు. తెల్లకందులు క్వింటా రూ.8,211 నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో బుధవారం తెల్లకందులు క్వింటా గరిష్టంగా రూ. 8,211, కనిష్టంగా రూ. 6,500 ధర పలికింది. ఎర్రకందులు గరిష్టంగా రూ.7,865, కనిష్టంగా రూ.6,200, వడ్లు (సోన) గరిష్టంగా రూ. 2,690, కనిష్టంగా రూ. 2,489 ధరలు వచ్చాయి. -
గ్రామాల్లో క్రీడల సందడి
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోంది. గ్రామీణస్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది కూడా సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. గ్రామస్థాయి, మండల–అర్బన్, అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు సీఎం కప్ పోటీలు జరగనున్నాయి. ఈ నెల 17, 22 వరకు గ్రామస్థాయి, 28 నుంచి 31 వరకు మండల/అర్బన్, వచ్చేనెల 3 నుంచి 7 వరకు అసెంబ్లీ స్థాయి, 10 నుంచి 14 వరకు జిల్లాస్థాయి, వివిధ ప్రాంతాల్లో 19 నుంచి 26 వరకు రాష్ట్రస్థాయిలో సీఎం కప్ క్రీడాపోటీలు జరగనున్నాయి. ముఖ్యంగా గ్రామస్థాయిలో క్రీడలతో ఒక నూతన ఉత్సాహం నెలకొనే అవకాశం ఉంటుంది. ఈసారి చిన్నారులు, ఇతరులకు కూడా రీక్రియేషన్ క్రీడలు జరగనున్నాయి. సీఎం కప్ సందర్భంగా జనవరి 8 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక టార్చ్ ర్యాలీ నిర్వహించనున్నారు. వివిధ క్రీడాంశాల్లో పోటీలు సీఎం కప్లో 44 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, స్విమ్మింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్, షూటింగ్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, సెపక్తక్రా, చెస్, బేస్బాల్, నెట్బాల్, కిక్బాక్సింగ్, సైక్లింగ్, రోయింగ్, స్క్వాష్ రాకెట్, కనోయింగ్–కయాకింగ్, వుషు, అత్యపత్య, పవర్ లిఫ్టింగ్, సాఫ్ట్బాల్, తైక్వాండో, బిలియర్డ్స్ స్నూకర్స్, జూడో, కరాటే, యోగా, స్కేటింగ్, ఫెన్సింగ్, పికిల్బాల్, సెయిలింగ్, బాల్బ్యాడ్మింటన్, మల్లకంబ్, పారా గేమ్స్, రీక్రియషనల్ క్రీడలులకు పోటీలు నిర్వహిస్తారు. గతేడాది 90 పతకాలు.. సీఎం కప్ క్రీడాపోటీలు క్రీడాకారుల ప్రతిభకు వేదికగా నిలుస్తున్నాయి. 2024 డిసెంబర్ నుంచి 2025 జనవరి 2 వరకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మొదటి సీఎం కప్ పోటీలను విజయవంతంగా నిర్వహించారు. మహబూబ్నగర్లో రాష్ట్రస్థాయి కబడ్డీ, నెట్బాల్ పోటీలు జరిగాయి.రాష్ట్రస్థాయిలో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు 90 పతకాలు సాధించారు. వీటిలో 26 బంగారు పతకాలతో సత్తాచాటారు. మహబూబ్నగర్ క్రీడాకారులు 9 బంగా రు, 15 రజతం, 11 కాంస్య పతకాలతో మొత్తం 35 పతకాలు సాధించారు. వనపర్తి జిల్లా 8 బంగారు, 6 రజతం, 5 కాంస్య పతకాలు మొత్తం 19 పతకాలు, నారాయణపేట జిల్లా 6 బంగారు, 6 రజతం, 2 కాంస్యంతో 14 పతకాలు, జోగుళాంబ గద్వాల జిల్లా 2 బంగారు, 2 రజతం, 5 కాంస్య పతకాలతో మొత్తం 9 పతకాలు, నాగర్కర్నూల్ జిల్లా ఒక బంగారు, 2 రజతం, 10 కాంస్యంతో 13 పతకాలు సొంతం చేసుకున్నారు. ఔత్సాహికులకు మంచి అవకాశం సీఎం కప్ క్రీడలు ఔత్సాహిక క్రీడాకారులకు మంచి అవకాశం. గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభ బయటికి వస్తుంది. గ్రామస్థాయి నుంచి ప్రపంచస్థాయి వరకు క్రీడాకారులను తీర్చిదిద్దడమే సీఎం కప్ ప్రధాన ఉద్దేశం. అధికారులు, క్రీడాసంఘాలు, పీడీ, పీఈటీలు, సీనియర్ క్రీడాకారుల సహకారంతో జిల్లాలో సీఎం కప్ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తాం. ఆసక్తిగల క్రీడాకారులు https://satg.telangana.govi.in/ cmcup వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. – ఎస్.శ్రీనివాస్, డీవైఎస్ఓ, మహబూబ్నగర్ సీఎం కప్ కోసం సన్నాహాలు గ్రామ, మండల, అసెంబ్లీ, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు పోటీలు 17 నుంచి వచ్చేనెల 26 వరకుసీఎం కప్ క్రీడలు -
ఓటరు జాబితా రూపకల్పనకు సహకరించండి
నారాయణపేట: ఎలాంటి తప్పిదాలు లేని తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని అదనపు కలెక్టర్ శ్రీను అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో మున్సిపల్ తుది ఓటరు జాబితా రూపకల్పనపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముసాయిదా ఓటరు జాబితాకు సంబంధించిన అభ్యంతరాలపై చర్చించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు జాబి తా స్వచ్ఛత, కచ్చితత్వం ప్రజాస్వామ్యానికి కీలకమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా.. అర్హత లేని పేర్లు తొలగించే ప్రక్రియలో రాజకీయ పార్టీలు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాల ని కోరారు. ఓటరు నమోదు, మార్పులు, తొలగింపులపై అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా సమర్పించాలని.. క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని నారాయణపేట మక్తల్, కోస్గి, మద్దూరు మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించడం జరిగిందన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని.. ఏ చిన్న పొరపాటు లేని తుది ఓటరు జాబితాను రూపొందించేందుకు అన్ని పార్టీల నాయకులు సహ కరించాలని ఆయన కోరారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు గోల్కొండ నర్సయ్య, శ్రీరాములు, నాగరాజు, శ్రీకాంత్, కలెక్టరేట్ సీ సెక్షన్ అధికారులు జయసుధ, రాణిదేవి తదితరులు ఉన్నారు. -
పురం.. ఉత్కంఠభరితం
నారాయణపేట: త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. గత రిజర్వేషన్లు మారుస్తారా.. లేక పాత వాటిపైనే నిర్వహిస్తారా అనే దానిపై చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు విడుదల చేసి.. అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. తప్పులను సరిచేసి వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను సిద్ధంచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెల 9వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి.. 10న పోలింగ్ బూత్ల వారీగా తుది జాబితాను ప్రకటించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. కొత్తగా మద్దూర్.. జిల్లాలో ఇదివరకు నారాయణపేట, మక్తల్, కోస్గి మున్సిపాలిటీలు ఉండగా.. కొత్తగా మద్దూర్ మున్సిపాలిటీగా ఏర్పాటైంది. ఈ సారి నాలుగు పురపాలికలకు ఎన్నికలు జరుగుతుండటంతో రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో మారితే.. ఏ మున్సిపాలిటీ ఏ రిజర్వేషన్ అవుతుందోననే ఉత్కంఠ నెలకొంది. మక్తల్ మున్సిపాలిటీ గతంలో బీసీ మహిళగా రిజర్వు అయింది. ఈ సారి జనరల్ లేదా బీసీ జనరల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నారాయణపేట, కోస్గి రెండు మున్సిపాలిటీలు దాదాపుగా జనరల్ లేదా జనరల్ మహిళ రిజర్వు అయ్యే అవకాశం కనిపిస్తోంది. మద్దూర్ విషయానికి వస్తే.. తొలిసారిగా బీసీ లేదా ఎస్సీ, ఎస్టీ రిజర్వు అయ్యే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ రిజర్వేషన్లు కేవలం రాజకీయ పరిశీలకుల ఊహాగనాలు మాత్రమే. చేర్పులు, మార్పులు సైతం జరగొచ్చని చెబుతున్నారు. ● 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మూడు చైర్పర్సన్ పదవులను మహిళలే దక్కించుకున్నారు. నారాయణపేటలో బీఆర్ఎస్ తరఫున 5వ వార్డు కౌన్సిలర్గా విజయం సాధించిన గందె అనసూయ (బీసీ మహిళ) చైర్పర్సన్ పీఠాన్ని రెండో సారి కై వసం చేసుకున్నారు. ఆమె ఎంపీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. కోస్గి మున్సిపాలిటీలోనూ బీసీ మహిళకు రిజర్వు కాగా.. 15 వార్డులో బీఆర్ఎస్ కౌన్సిలర్గా శిరీష గెలుపొంది చైర్పర్సన్ అయ్యారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. మక్తల్ మున్సిపాలిటీ బీసీ మహిళకు రిజర్వు కాగా.. బీజేపీ నుంచి 13వ వార్డు కౌన్సిలర్గా గెలుపొందిన పావని చైర్పర్సన్ అయ్యారు. ఆమె ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఆద్యంతం..ఉత్సాహం రెండు రోజుల పాటు ఉత్సాహభరితంగా సాగిన పిల్లలమర్రి బాలోత్సవం నాలుగో పిల్లల జాతర మంగళవారం ముగిసింది. –8లో uముగిసిన రాజకీయ ప్రతినిధుల సమావేశాలు.. ముసాయిదా ఓటరు జాబితాపై ఈ నెల 5న జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో పుర కమిషనర్లు సమావేశాలు నిర్వహించి.. వారి నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించారు. మంగళవారం జిల్లాస్థాయిలో అడిషనల్ కలెక్టర్ శ్రీను సమక్షంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది. రిజర్వేషన్లపై ఆశావహుల్లో టెన్షన్ 2020లో మూడు మున్సిపాలిటీల్లోనూ బీసీ మహిళలే చైర్పర్సన్లు తుది ఓటరు జాబితా రూపకల్పనలో అధికారుల నిమగ్నం -
దరఖాస్తుల ఆహ్వానం
మద్దూరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిన కంప్యూటర్ సైన్స్ బోధించేందుకు గాను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి.కృష్ణారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పీజీలో 55 శాతం మార్కులు, సెట్ లేదా నెట్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ వరకు డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జాతీయ నెట్బాల్ టోర్నీకి గురుకుల విద్యార్థి ధన్వాడ: మండలంలోని కొండాపూర్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి హరీశ్ జాతీయస్థాయి నెట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల నల్లగొండ జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో అతడు అత్యంత ప్రతిభ చాటడంతో రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ రాజారాం తెలిపారు. ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలో జరిగే 69వ జాతీయస్థాయి ఎస్జీఎఫ్ అండర్–17 బాలుర నెట్బాల్ పోటీల్లో హరీశ్ పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని కోచ్ డా.రామ్మోహన్గౌడ్, పీఈటీ ఆంజనేయులు, హౌస్ మాస్టర్ తిమ్మప్ప, సంజీవ్ అభినందించారు. ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వండి నారాయణపేట రూరల్: ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులతో పాటు ఇంటర్ అధ్యాపకులకు రాబోయే మున్సిపల్ ఎన్నికల విధులు కేటాయించకుండా మినహాయింపు ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జనార్దన్రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్, పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. అదే విధంగా గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులు, పదవీ విరమణ చేరువలో ఉన్నవారు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వారికి విధులు కేటాయించకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని.. కేడర్ స్ట్రెంత్ అప్డేట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు రఘువీర్, రాంరెడ్డి, కృష్ణ పాల్గొన్నారు. అలసందలు క్వింటా రూ.5,611 నారాయణపేట/జడ్చర్ల/దేవరకద్ర: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో మంగళవారం అలసందలు క్వింటా రూ. 5,611 ధర పలికింది. అదే విధంగా వరిధాన్యం (సోన) గరిష్టంగా రూ. 2,683, కనిష్టంగా రూ. 2,603, ఎర్రకందులు గరిష్టంగా రూ. 8,011, కనిష్టంగా రూ. 4,506, తెల్లకందులు గరిష్టంగా రూ. 8,181, కనిష్టంగా రూ. 6,516 ధరలు వచ్చాయి. ● బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో మంగళవారం ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,739, కనిష్టంగా రూ.1,781 ధరలు లభించాయి. హంస రూ.1,866, కందులు గరిష్టంగా రూ.7,060, కనిష్టంగా రూ.3,561, వేరుశనగ గరిష్టంగా రూ.8,840, కనిష్టంగా రూ.6,886, మినుములు రూ. 8,401, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,956, కనిష్టంగా రూ.1,630 ధరలు పలికాయి. దేవరకద్రలో కందులు గరిష్టంగా రూ. 6,759, కనిష్టంగా రూ.6,159 ధర లభించింది. -
రైతుల సౌకర్యార్థమే కొనుగోలు కేంద్రాలు
కోస్గి రూరల్: పండించిన పంటను విక్రయించేందుకు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్ అన్నారు. మంగళవారం కోస్గిలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నాఫేడ్ ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన మక్కలను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి మద్దతు ధర రూ. 8వేలకు విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం సాయన్న, పీఏసీఎస్ మాజీ చైర్మన్ భీంరెడ్డి, మండల మహిళా సంఘం అధ్యక్షురాలు అంజమ్మ, కార్యదర్శి సువర్ణ, కోశాధికారి మంగమ్మ, సీసీ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరును ఎడారి చేసేందుకు కుట్ర
అమరచింత/ కొల్లాపూర్/ కొల్లాపూర్ రూరల్: కేవలం 9 టీఎంసీల సామర్థ్యం గల జూరాల నుంచి కొడంగల్, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలకు కృష్ణా నీటిని తరలించి పాలమూరును ఎడారిగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ జలపోరులో భాగంగా జూరాల, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను మంగళవారం ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందర్శించారు. ముందుగా జూరాల వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టులపై అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలు ముందుకు సాగలేదని విమర్శించడం సరికాదన్నారు. జూరాలలో నీటి నిల్వలను కాపాడుకునే ప్రయత్నం చేయలేని సీఎం రైతులు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ ప్రచారం తెరపైకి తెచ్చారన్నారు. వేసవి రాక ముందే జూరాలలో నీటి నిల్వలు అడుగంటాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జూరాల ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు రెండు పంటలకు సాగునీరు ఇవ్వలేక క్రాప్ హాలీడే ప్రకటించడమే ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అన్నారు. కేవలం 9 టీఎంసీల సామర్థ్యం కలిగిన జూరాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి తరలించేలా పనులు ప్రారంభించి 90 శాతం పూర్తిచేశారని చెప్పారు. ప్రస్తుతం మిగులు పనులు చేస్తే ఆంధ్ర రాష్ట్రానికి నీటి కొరత ఉంటుందనే సాకుతో ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటి తరలింపు దండగని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పాలమూరు జిల్లా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత నష్టపోయిందని అలాంటి జిల్లాలో సాగునీటితోపాటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కృష్ణానది జలాలు వందశాతం వాడుకునే హక్కు పాలమూరుకే ఉందన్నారు. ఆయా కార్యక్రమాల్లో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, అంజయ్యయాదవ్, పట్నం నరేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఎస్.రాజేందర్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, జైపాల్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 90 శాతం పూర్తయినప్రాజెక్టుపై నిందలా జూరాల నుంచి కొడంగల్కు నీటి పంపింగ్ ఎలా సాధ్యమవుతుంది సీఎం, మంత్రులకు ‘పాలమూరు’పై కనీస అవగాహన లేదు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనలో మాజీ మంత్రుల ధ్వజం -
భళా బాలోత్సవం
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రంలోని బృందావన్ గార్డెన్స్లో సోమవారం పిల్లలమర్రి బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలోత్సవం నాలుగో పిల్లల జాతర అలరించింది. జిల్లావ్యాప్తంగా పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన వేలాదిమంది విద్యార్థులు బాలోత్సవానికి తరలివచ్చి జాతర జరుపుకున్నారు.అకాడమిక్ అంశాల్లో సీనియర్, జూనియర్ విభాగాల్లోని తొమ్మిది వేదికల్లో చిత్రలేఖనం, వ్యాసరచన, కథారచన, కవితారచన, దేశభక్తి గీతాలు, స్పెల్బీ, క్విజ్లు, సాంస్కృతిక అంశాల్లో జానపద, శాసీ్త్రయ నృత్యాలు, బతుకమ్మ వేషధారణ, ఏకపాత్రాభినయం, లఘు నాటికలు, ఫ్యాన్సీ డ్రెస్ అంశాల్లోనూ, సైన్స్ఫెయిర్ విభాగాల్లో విద్యార్థులు చురుగ్గా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఫ్యాన్సీ డ్రెస్లో వచ్చిన చిన్నారులకు నిర్వాహకులు అప్పటికప్పుడే మెడల్స్ను బహుకరించారు. పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయవచ్చు పిల్లలమర్రి బాలోత్సవంతో పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయవచ్చని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత అన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడు తూ చిన్నారులు మట్టిలో మాణిక్యాలు అని, వారిని చదువుతో పాటు ఆటల్లో ప్రోత్సహించాలన్నారు. చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పిల్లలమర్రి బాలోత్సవం చక్కటి కార్యక్రమం అని కొనియాడారు. అంతకుముందు బాలోత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బెక్కం జనార్దన్, డాక్టర్ పి.ప్రతిభ జాతీయ జెండా, బాలోత్సవ జెండాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి వీరాంజనేయులు, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, వీణ శివకుమార్, సువర్ణలత, రాజేంద్రకుమార్, నాగేష్, ప్రమోద్కుమార్, వేణుగోపాల్వర్మ, వెంకటస్వామి, అశోక్గౌడ్, లక్ష్మణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు -
సమగ్రంగా పరిశీలించాలి
మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితా అంతా గందరగోళంగా ఉంది. 10వ వార్డులో మొత్తం 1129 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ మా వార్డుకు సంబంధం లేని పట్టణం చివర ఉన్న పలు వార్డుల ఓటర్ల పేర్లను మా వార్డులో చేర్చారు. అధికారులు సమగ్రంగా పరిశీలించి సరియైన ఓటరు జాబితా తయారు చేసి ఎన్నికలు నిర్వహించాలి. – హన్మంతు, మాజీ ఎంపీటీసీ, 10వ వార్డు, కోస్గి అభ్యంతరాలు స్వీకరిస్తున్నాం ఓటరు జాబితా సవరణపై అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయాలి. ఈ నెల 9 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తున్నాం. ఇందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశాం. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తుది జాబితాను విడుదల చేస్తాం. – నర్సయ్య, మున్సిపల్ కమిషనర్, నారాయణపేట ● -
అటు సీఎం.. ఇటు మాజీ సీఎం!
● ‘పాలమూరు’ వేదికగా ఎన్నికల శంఖారావం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ప్రస్తుతం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభకు సన్నద్ధమవుతోంది. ఈ సభకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి పాలమూరుకు చెందిన ఆ పార్టీ ముఖ్య నేతలు మంగళవారం ప్రాజెక్టుల బాట పట్టారు. సంక్రాంతి తర్వాత కేసీఆర్ సభ ఉండనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం మహబూబ్నగర్నే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తొలుత వచ్చేనెల మూడో తేదీన జడ్చర్ల నియోజకవర్గంలో ట్రిపుల్ ఐటీ ప్రారంభోత్సవానికి రానున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అయితే అంతకన్నా ముందుగానే మహబూబ్నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నగరంలో సుమారు రూ.1,200 కోట్లతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, తాగునీటి శుద్ధీకరణ తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఈనెల 10న ఓటర్ల తుది జాబితా ప్రకటించనుండగా.. ఆ తర్వాత పురపాలికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు నుంచే ఇటు కాంగ్రెస్.. అటు బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం మోగించనున్నట్లు తెలుస్తోంది. -
కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి
నర్వ: మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టే కంది కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ట్రైనీ కలెక్టర్ ప్రణయ్కుమార్ అన్నారు. సోమవారం నర్వ మహిళా సమాఖ్య భవనం వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ప్రారంభం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం క్వింటాకు రూ.8 వేలు అందజేస్తుందని, రైతులు ధాన్యాన్ని 12 శాతంలోపు తేమ ఉండేలా తీసుకురావాలన్నారు. తక్కువ ధరకు దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలతోనే లబ్ధి పొందాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనువాసులు, ఏపీఎం చంద్రశేఖర్, మహిళా సమాఖ్య కోశాధికారి సంతోష, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కృష్ణారెడ్డి, నర్వ సర్పంచు హన్మంతురెడ్డి, ఉప సర్పంచు అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
వేధింపులపై నిర్భయంగా ఫిర్యాదు చేయండి
నారాయణపేట: ఆకతాయిలు, ఇతరులు ఎవరైనా మహిళలు, యువతులు, బాలికలను వేధింపులకు గురిచేస్తే.. నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ వినీత్ ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలు, పాఠశాలల విద్యార్థినులు బస్టాండ్లు, గ్రామాలు, కాలనీల్లో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్కు గురైనప్పుడు, ఉద్యోగులు పని చేసే ప్రదేశాల్లో వేధింపులకు గురైనప్పుడు, అలాగే బాలికలపై లైంగిక వేధింపులు జరిగినప్పుడు వెంటనే షీ టీమ్ పోలీసులను సంప్రదిస్తే సత్వర న్యాయం అందిస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా షీ టీమ్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మహిళలు సోషల్ మీడియా వినియోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఫొటోలు, వీడియోలు పోస్టు చేసే వేళ వ్యక్తిగత భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నేరుగా ఫిర్యాదు చేయలేని వారు షీ టీమ్ ఫోన్ నెం.8712670398 కు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచి, నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. -
వ్యూహరచన..!
‘పుర’ పోరుపై ముమ్మర కసరత్తు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పుర’ పోరుపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. కార్పొరేషన్/మున్సిపల్ పీఠాలను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో విజయం నేపథ్యంలో కాంగ్రెస్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో చతికిలపడినప్పటికీ సం‘గ్రామం’లో బీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకోవడం.. శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపింది. గతంతో పోల్చితే మెరుగైన పంచాయతీ స్థానాలను సాధించడంతో బీజేపీలోనూ జోష్ నెలకొంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్తో పాటు విపక్ష పార్టీలు పోటాపోటీగా పోరు సన్నాహాలకు శ్రీకారం చుట్టాయి. పుర పాలికల ఎన్నికల్లో పాగా వేసేలా వ్యూహాలు పన్నుతున్నాయి. వెలసిన ఫ్లెక్సీలు.. విందులు పురపాలిక ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించిన క్రమంలో ఆయా డివిజన్లు/వార్డుల్లోని ఆశావహ అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రయత్నాలను ప్రారంభించారు. యువతను ఆకట్టుకునేందుకు విందులకు తెర లేపారు. తాము బరిలో నిలుస్తామనే సంకేతాలను వార్డు ప్రజలకు తెలిసేలా ప్రచారం ప్రారంభించారు ఈ క్రమంలో దాదాపుగా అన్ని వార్డుల్లోనూ నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి, ఉగాది శుభాకాంక్షలు చెబుతూ భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. రిజర్వేషన్లు అనుకూలంగా వస్తే తమకే అవకాశం ఇవ్వాలని ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన పెద్దలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీల కార్యాలయాలతో పాటు వార్డుల్లో రాజకీయ సందడి నెలకొంది. ప్రధానంగా మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా ఆవిర్భవించిన మహబూబ్నగర్ పీఠంపై అన్ని రాజకీయ పార్టీలు కన్నేశాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులతో పాటు పార్టీల నాయకుల మధ్య కూడా పోరు రసవత్తరంగా సాగనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీలసన్నాహకాలు షురూ అభ్యర్థుల జల్లెడకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ఆశావహుల నుంచి వ్యక్తిగత సమాచార సేకరణ బీఆర్ఎస్, బీజేపీ సైతం రంగంలోకి.. ఎత్తులకు పైఎత్తులతో ముందుకు.. -
ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర
కృష్ణా: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందని డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి ఆరోపించారు. ఆదివారం మండల కేంద్రంలో ఉపాధిహామీ పథకం కూలీలతో క్షీరాలింగేశ్వర మఠంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యవర్గ సభ్యుడు రాజమల్లేష్ సిద్ధార్థతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వం పేదలకు వేసవిలో 100 రోజులు ఖచ్చితమైన పని కల్పించి వారికి కూలి చెల్లించేవారని, ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం రోజురోజుకు ఉపాధిహామీ పథకాన్ని నీరుగారుస్తూ గ్రామాల్లో పనులు లేకుండా చేస్తుందని అన్నారు. అలాగే పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రస్తుతం గ్రామాల్లో ఉపాధిహామీ పథకంలో పనులు కూడా కల్పించడంలేదని, ఇదివరకు చేసిన పనులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని అన్నారు. గతంలో ఈ పథకానికి కేంద్రం 90 శాతం నిధులు ఇచ్చేదని, ఇప్పుడు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40శాతం భరించాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్రం నుంచి జీఎస్టీ రూపంలో నిధులు తీసుకెళ్తుంది కాని మనకు రావాల్సిన వాటా మాత్రం ఇవ్వకుండా వేధిస్తుందని అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉండి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి,సర్పంచ్ నాగేష్,నాయకులు రవిగౌడ,సబ్జీర్ ఆలీ,సర్ఫరాజ్,బీమ్సీ, నారాయణ,బాబు,తిమ్మప్ప,బొల్ల మహాదేవ్ తదితరులు పాల్గొన్నారు. కోయిల్సాగర్ నీటిని సద్వినియోగం చేసుకోండి దేవరకద్ర: కోయిల్సాగర్ నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి అన్నారు. ఆదివారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా యాసంగి పంటలకు నీటిని వదిలిన అనంతరం ఆయన మాట్లాడారు. రైతులకు ఇబ్బంది లేకుండా పంటలు వేసుకునే అనువైన సమయంలోనే నీటిని వదులుతున్నామన్నారు. ప్రాజెక్టులో ఉన్న నీటిని యాసంగి పంటలకు అందించాలని ఇటీవల జిల్లాస్థాయిలో జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. రైతులు నీటి వృథాను అరికట్టి కిందిస్థాయిలో ఉండే రైతులకు నీటిని వదలాలని సూచించారు. అయిదు విడతలుగా నీటిని వదలడం జరుగుతుందని, ప్రతి విడత పది రోజులు ఉండేలా ప్రణాళికలు చేశారన్నారు. రైతు సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని గుర్తుచేశారు. పాలమూరు– రంగారెడ్డి పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రూపకల్పన చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. 2013లో జూరాల సోర్స్గా పాలమూరు ప్రాజెక్టు నిర్మించాలని ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. -
యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
నారాయణపేట: యోగా సాధన ద్వారా వృత్తి జీవితంలో ఏర్పడే ఒత్తిడిని తగ్గించుకోవచ్చని, మానసిక–శారీరక ప్రశాంతతతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం నారాయణపేట జిల్లా కేంద్రంలోని కొండారెడ్డిపల్లి చెరువు గట్టు వద్ద పతాంజలి యోగ సమితి ఆధ్వర్యంలో, యోగ గురువు శ్రీ సురేష్ మార్గదర్శకత్వంలో ప్రకృతి ఒడిలో యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగాభ్యాసకులు, దామరగిద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా డీఎస్పీ నల్లపు లింగయ్య, డీఎంహెచ్ఓ జయచంద్ర మోహన్, బీజేపీ నాయకులు నాగురావు నామాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రకాల యోగాసనాలు, ప్రాణాయామాలు నిర్వహించగా, నిత్య యోగాభ్యాసం వల్ల శరీరానికి ఆరోగ్యం, మనసుకు ప్రశాంతత లభిస్తుందని యోగ గురువు సురేష్ వివరించారు. యోగాను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా అనేక రకాల రోగాల నుంచి దూరంగా ఉండవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ నల్లపు లింగయ్య మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ ఒత్తిడి ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుందని, అలాంటి పరిస్థితుల్లో యోగ సాధన మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తుందన్నారు. డీఎంహెచ్ఓ జయచంద్ర మోహన్ మాట్లాడుతూ... యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా జీవన శైలిగా మారాలని, రక్తపోటు, షుగర్ వంటి జీవనశైలి వ్యాధులను నియంత్రించవచ్చని వివరించారు. నాగురావు నామాజీ మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప సంపద యోగా అని, వ్యక్తిగత ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా సమాజంలో సానుకూల మార్పు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఆర్ఐ నరసింహ, రాజు లహోటి, క్యాతన్ రఘు, అశోక్, వెంకటేష్, యశ్వంత్, సుదర్శన్, బాలాజీ, మల్లికర్జున్, నర్సింహులు, పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వ్యవసాయ రంగంలో మార్పులు జరగాలి
● నూతన విధానంతో పంటల సాగు చేయాలి ● కేంద్ర నోడల్ అధికారి రమణ్కుమార్ ● మరికల్లో ఎర్రచందనం, ఆయిల్పాం పంటల పరిశీలన మరికల్: అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టేందుకు కేంద్రం అమలు చేసిన దన్ ధాన్య కృషి యోజన పథకం ద్వారా వ్యవసాయ రంగంలో మార్పులు వస్తున్నాయని కేంద్ర జాయింట్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ కో ఆపరేషన్, పీఎండీడీకేవై సెంట్రల్ నోడల్ అధికారి రమణ్కుమార్ అన్నారు. దేశా వ్యాప్తంగా 100 జిల్లాలను ధన్ ధాన్య కృషి యోజన పథకం కింద ఎంపిక చేయగా, అందులో నారాయణపేట జిల్లా ఉండటంతో ఆదివారం కేంద్ర బృందం మరికల్లో వ్యవసాయ పంటలు, తోటలను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా కుర్వ శరణప్ప అనే రైతు పంట మార్పిడి చేసి యాసంగిలో సాగు చేసిన ఆముదం, నారాయణరెడ్డి రైతు 28 ఎకరాల్లో సాగు చేసిన ఎర్రచందనం, శ్రీగంధం, మామిడి, నిమ్మ తోటలను పరిశీలించారు. ప్రస్తుతం పండిస్తున్న పంటల లాభ నష్టాలపై రైతుల నుంచి కేంద్ర అధికారులు అభిప్రాయాలను సేకరించారు. అనంతరం జోనల్ అధికారి మాట్లాడుతూ ఈ పథకం ద్వారా నారాయణపేట జిల్లాలో 6 ఏళ్లలోపు వ్యవసాయ రంగంలో మార్పులను తీసుకురావడం, రైతుల బలోపేతం కోసం కేంద్రం రూ. 1.11 కోట్లను ప్రతిపాదించిందన్నారు. దీని ద్వారా వ్యవసాయ గిడ్డంగులు, పాడి పరిశ్రమ, హార్టీకల్చర్, రైతు సంఘాల బలోపేతం, వ్యవసాయ పరికరాలు, భూసార పరీక్షలు, తదితర వంటిని చేర్చడంతో వ్యవసాయంలో మార్పులు జరిగే అవకాశం ఉందన్నారు. కాలానుగుణంగా వ్యవసాయంలో వస్తున్న మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చూట్టడంతో రైతుల తలరాత మారుతుందన్నారు. పాత పద్దతితో వ్యవసాయం చేస్తే కుటుంబం గడవడమే కష్టంగా ఉంటుందని, కొత్త పద్ధతితో పంటలను సాగు చేయించి, రైతుల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. నూతన విధానాలతో వ్యవసాయం చేస్తే రైతులకు లాభదాయం ఉంటుందన్నారు. ఇందుకు సంబందించి రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలతో పాటు సలహాలు, సూచనలు అధికారులు అందజేస్తారన్నారు. రైతులకు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందంకు రైతులు సూచించారు. కేంద్ర నోడల్ అధికారి రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటుచేయగా.. రైతులు తమ సమస్యలను విన్నవించారు. మరికల్లో ప్రధానంగా మార్కెట్యార్డు లేకపోవడం ఇబ్బందులు పడుతున్నామని, యాసంగి పంటలకు కోయిల్సాగర్ నీటిని కాల్వల ద్వారా మళ్లించాలని, పత్తి కొనుగోలులో ప్రాధాన్యత ఇవ్వాలని, ధాన్యం అరబెట్టేందుకు ప్లాట్ఫాంలు ఏర్సాటు చేయాలని విన్నవించారు. ఇందుకు స్పందించిన ఆయన సీసీఐ కేంద్ర మేనేజర్తో ఫోన్లో మాట్లాడి పత్తి కొనుగోళ్లలో జిల్లా రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిల్లాలో గొర్రెల షెడ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని పశు సంవర్ధక శాఖ అధికారికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఉమా శంకరప్రసాద్, శిక్షణ కలెక్టర్ ప్రణయ్కుమార్, వికారాబాద్ ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి, డీఆర్డీవో మెగులప్ప, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, పశుసంవర్ధక శాఖ అధికారి ఈశ్వర్రెడ్డి, నాబార్డు అధికారి షణ్ముఖ చారి, ఎల్డీం విజయ్కుమార్, డీపీఓ సుధాకార్రెడ్డి పాల్గొన్నారు. -
అంతటా అంతేగా..!
మున్సిపాలిటీ వార్డులు ఫిర్యాదులు మ.నగర్ (కా) 60 98 భూత్పూర్ 10 20 దేవరకద్ర 12 03 నాగర్కర్నూల్ 24 51 కొల్లాపూర్ 19 05 కల్వకుర్తి 22 32 నారాయణపేట 24 – మక్తల్ 16 07 కోస్గి 16 03 మద్దూర్ 16 03 గద్వాల 37 06 అలంపూర్ 10 – అయిజ 20 06 వడ్డేపల్లి 10 01 వనపర్తి 33 18 కొత్తకోట 15 01 అమరచింత 10 – ఆత్మకూర్ 10 06 పెబ్బేరు 12 31 మొత్తం 376 291 మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వెల్లడించిన ఓటర్ల ముసాయిదా జాబితాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరులో జడ్చర్ల, అచ్చంపేట మినహా ఎన్నికలు జరిగే మహబూబ్నగర్ కార్పొరేషన్.. మిగిలిన 18 మున్సిపాలిటీలు అన్నింటిలోనూ చోటుచేసుకున్న తప్పిదాలు నివ్వెరపరుస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎత్తిచూపుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ఉమ్మడి పాలమూరులోని ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల పరిధిలో గురువారం పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించారు. అదేరోజు నుంచి అభ్యంతరాలు స్వీకరణ ప్రారంభించారు. ఈ మేరకు అన్ని పురపాలికల్లో కలిపి ఆదివారం వరకు మొత్తం 291 ఫిర్యాదులు వచ్చాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా 98 రాగా.. ఆ తర్వాత నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో 51 అభ్యంతరాలు వచ్చాయి. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పరిష్కారం గడువును ఆదివారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది ముసాయిదా జాబితా మాత్రమేనని.. అన్నింటినీ పరిష్కరించి ఈ నెల 10న తుది జాబితా వెల్లడించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రహసనంగా మారడం.. సర్దుబాటు చేయడంతో.. ప్రధానంగా మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. కార్పొరేషన్గా ఆవిర్భవించిన క్రమంలో డివిజన్ల వారీగా తీసిన లెక్కలతో పోలిస్తే ప్రస్తుతం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో ఓటర్ల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఈసీ ఆదేశాల మేరకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల ఓటరు జాబితా ప్రకారం.. ఆయా పురపాలికల్లో డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా రూపొందించారు. ఇంటి నంబర్ల ఆధారంగా సంబంధిత డివిజన్లు/ వార్డుల్లో పోలింగ్ బూత్ల వారీగా ఓటర్లను చేర్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రక్రియ ప్రహసనంగా మారగా.. తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. పలు డివిజన్లు/ వార్డుల్లో ఇంటి నంబర్లు లేకుండా.. కొన్నిచోట్ల ఇంటి నంబర్లకు బై నంబర్లు చేర్చి జాబితా వెల్లడించినట్లు అభ్యంతరాలు వ్యక్తం కావడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఉన్న ఓట్లను తొలగించే అధికారం లేకపోవడం కారణంగా పలు వార్డుల్లో ఆయా ఓట్లను సర్దుబాటు చేయడంతో సమస్యలు ఉత్పన్నమైనట్లు సీనియర్ రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. అభ్యంతరాలు ఇలా.. ● ఒకే పురపాలికలో పలు డివిజన్లు/ వార్డుల్లో అటు ఇటుగా ఓటర్లు తారుమారు ● ఒకే జిల్లా ఒక మున్సిపాలిటీలోని వార్డుల్లో వేరే పురపాలిక పరిధిలోని ఓటర్లు చేరిక ● ముసాయిదా జాబితాలో ఓటర్లు పేర్లు ఉండి, ఫొటోలు లేకపోవడం.. ● ఉమ్మడి పాలమూరులోని ఒక జిల్లా పురపాలికలో వేరే జిల్లా ఓటర్లు ఉండడం.. ● ఓ పురపాలికలో వికారాబాద్, మెదక్ జిల్లాల ఓటర్లు ఉండడం.. ● వందలాది పేర్లు ఇంటి నంబర్లు లేకుండా ఉండడం.. ● మున్సిపాలిటీల్లో గ్రామాలకు సంబంధించిన ఓటర్ల పేర్లు దర్శనమివ్వడం.. ● జాబితాలో ఇంటి నంబర్లు వరుసగా లేకపోవడం.. తప్పులతడకగా ముసాయిదా ఓటర్ల జాబితా మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఇతర జిల్లాల ఓటర్లు ఉమ్మడి పాలమూరులోని అన్ని పురపాలికల్లోనూ గందరగోళం ఇప్పటివరకు మొత్తం 291 ఫిర్యాదులు.. అత్యధికంగా మహబూబ్నగర్ కార్పొరేషన్లో 98 అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విమర్శల వెల్లువ బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలు సేకరించి రెవెన్యూ అధికారులకు సమర్పించారు. ఆ తర్వాత వాటిని ఆన్లైన్లో నమోదు చేసే క్రమంలో తప్పిదాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగంలో ఈ చర్చ జరిగినట్లు తెలిసింది. దీనిపై ఏ ఒక్క అధికారి కూడా నేరుగా సమాధానం ఇవ్వడం లేదు. ఇది ముసాయిదా జాబితానే.. ఫిర్యాదులు స్వీకరిస్తున్నామంటూ కొట్టిపారేస్తూనే.. గడువులోపు పరిష్కరిస్తామని చెబుతున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్య వైఖరితోనే ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లాయంటూ రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు. నారాయణపేట మున్సిపాలిటీలో విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో ఓటర్ల ఫొటోలు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్లను గుర్తించడం ఎలా అంటూ వివిధ రాజకీయ పార్టీలు నాయకులు ప్రశ్నిస్తున్నారు. మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో జాజాపూర్, కొల్లంపల్లి, ఊట్కూర్, ఒల్లంపలి, అవుసలోనిపల్లి, కోటకొండ గ్రామాలకు సంబంధించి ఓటర్లను చేర్చినట్లు ఆయా పార్టీల పరిశీలకులు గుర్తించారు. ఈ మేరకు సోమవారం మున్సిపాలిటీలో జరిగే రాజకీయ పార్టీల సమావేశంలో అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
చాలా సంతోషంగా ఉంది
ప్రాజెక్టులో మూడు ఎకరాల భూమి కోల్పోయాను. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూమి ఇవ్వడంతో ఎకరాకు రూ.14 లక్షలు మొదట ఇచ్చారు. ఇప్పుడు పెరిగిన రూ.6 లక్షల చెక్కును ఇవ్వడంతో చాలా ఆనందంగా ఉంది. – నామ్యానాయక్, భూనిర్వాసితుడు, దామరగిద్ద మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టులో రైతులకు రూ.20 లక్షలు ఎకరానికి భూ పరిహారం ఇచ్చేందుకు సీఎం రేవంత్రెడ్డి మాటా ఇచ్చారు. ఈ రోజు నిలబెట్టుకున్నారు. కలెక్టర్, ఎస్పీ ఎంతో సహకరించారు. ఇరిగేషన్, రెవెన్యూ, సర్వే అధికారులు సమన్వయం, అఖిల పక్షం పార్టీల సహాకారంతో రైతులకు ఎకరాకు రూ.20 లక్షల భూ పరిహారం తీసుకోగలిగాం. అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు. – కుంభం శివకుమార్రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు -
రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తాం : మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్– నారాయణపేట– కొడంగల్ ప్రాజెక్ట్ను రూ. 4500 కోట్లతో రెండేళ్లలో పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం పోరాటం చేసిన అన్ని పార్టీలకు, భూమి ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. దేశ చరిత్రలో ఏ ప్రాజెక్ట్కు ఇంత నష్ట పరిహారం ఇవ్వలేదని, సీఎం మన ప్రాంతం బిడ్డ కాబట్టే భూనిర్వాసితులకు రూ.14 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచి రూ.20 లక్షల నష్ట పరిహారం ఇచ్చారన్నారు. జీవో 333 మిగతా ప్రాంత రైతులకు వరప్రదాయిని అయ్యిందన్నారు. ఈ ప్రాజెక్ట్ లో భూములు కోల్పోయిన రైతులు డబ్బులు వృధా చేయకుండా మళ్లీ భూమి కొనుక్కోండని వారికి సలహాఇచ్చారు. ఆంధ్రాలో సర్ ఆర్డర్ కాటన్లాగా ఈ ప్రాజెక్టుతో సీఎం రేవంత్రెడ్డి పేరు ఈ ప్రాంతంలో నిలిచిపోతుందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం పోరాటం చేసిన తనకు భూ నిర్వాసితులకు చెక్కులు ఇచ్చే గొప్ప అవకాశం దక్కిందన్నారు. గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి అన్నారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వరి వేస్తే సిరి అని నిరూపించామన్నారు. విద్య, ఉద్యోగం, అభివృద్ధి, సంక్షేమంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ రామచంద్రనాయక్, నీటి పారుదల శాఖ సీఈ ఎఎస్ఎన్ రెడ్డి, ఎస్ఈ హెచ్టీ శ్రీధర్, ఈఈ బ్రహ్మానంద రెడ్డి, రాజేష్, మత్స్య సహకార సంఘం శాఖ జిల్లా అధ్యక్షుడు కాంత్ కుమార్, మక్తల్ మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్, సలీం, కోణంగేరి హనుమంతు తదితరులు పాల్గొన్నారు. -
సృజనాత్మకతను వెలికితీసేందుకు దోహదం
నారాయణపేట రూరల్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని డీఈఓ గోవిందరాజు అన్నారు. మండలంలోని జాజాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు తరగతి గదిలో సమర్థవంతమైన బోధన చేసినప్పుడే విద్యార్థుల్లో నేర్చుకోవాలనే జిజ్ఞాస పెరుగుతుందన్నారు. సైన్స్ అంటేనే నిత్య ప్రయత్నం అని, ఓటమికి కుంగిపోకుండా, గెలుపునకు పొంగిపోకుండా రెండింటిని సమానంగా ఆస్వాదించాలన్నారు. విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలన్నారు. కామారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ లోనూ ప్రతిభ చాటాలని విద్యార్థులకు సూచించారు. ఉపాధ్యాయుల చక్కటి బోధనతోనే విద్యార్థులు గొప్ప శాస్త్రవేత్తలుగా తయారు కాగలరని అన్నారు. సైన్స్ ఫెయిర్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని శాసీ్త్రయ దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. ప్రస్తుత సమాజంలో సైన్స్ ముఖ్యం అని, సైన్స్ లేనిదే జీవితం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఎస్ఓ భాను ప్రకాష్, సూపరింటెండెంట్ నరసింహ రెడ్డి, సెక్టోరియల్ అధికారులు విద్యాసాగర్, రాజేంద్రకుమార్, శ్రీనివాస్, నాగార్జునరెడ్డి, యాదయ్యశెట్టి, ట్రాస్మా రాష్ట్ర కార్యదర్శి రాజేష్ కుమార్, ఉపాధ్యాయ సంఘం నాయకులు జనార్దన్ రెడ్డి, నరసింహ, రెడ్డప్ప, హైమావతి, యశ్వంత్, షేర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఏడు అంశాలకు సంబంధించి సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు అందించారు. అదేవిధంగా ఇన్ స్పైర్ పోటీల్లో అరుణ్ (జడ్పీ స్కూల్ గోటుర్), అనిత (జడ్పీ స్కూల్ ముశ్రిఫా) రాష్ట్రస్థాయికి ఎన్నికయ్యారు. ఇక సెమినార్ నిర్వహణలో ప్రవీణ్ (గిరిజన పాఠశాల, కొండాపూర్) విజేతగా నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. -
శాఖల సమన్వయంతోనే వ్యవసాయరంగ అభివృద్ధి
నారాయణపేట: వ్యవసాయం, దాని అనుబంధ రంగాలతోపాటు రైతుల అభ్యున్నతికి ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) కమిటీ సభ్యులు సమన్వయంతో కృషి చేయాలని జాయింట్ సెక్రెటరీ మినిస్ట్రీ ఆఫ్ కో ఆపరేషన్/పీఎండీడీకేవై సెంట్రల్ నోడల్ అధికారి రమణ్ కుమార్ ఆదేశించారు. రెండు రోజుల జిల్లా పర్యటనకు శనివారం ఢిల్లీ నుంచి కలెక్టరేట్కు వచ్చిన ఆయనకు ఇన్చార్జి కలెక్టర్ ప్రతీక్జైన్ స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్లోని వీసీ హాల్లో అదనపు కలెక్టర్ శ్రీను, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్కుమార్తో కలిసి పీఎండీడీకేవై సమితి సభ్యులతో రమణ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో వచ్చే ఆరేళ్లలో వ్యవసాయంతోపాటు ఉద్యానవన, మత్స్య పరిశ్రమ, పశుపోషణ పెంచేందుకు కృషిచేయాలని, మొత్తం 36 పథకాలను ఆయా మంత్రిత్వ శాఖల సహకారం తీసుకుని పురోగతి సాధించాలన్నారు. ఇకపై ప్రతీ మూడు నెలలకు ఒకసారి వచ్చి సమీక్ష చేస్తానని, పథకం సెంట్రల్ నోడల్ అధికారిగా తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. రైతులకు సకాలంలో రుణాలివ్వాలి ప్రతీ నెల కలెక్టర్ నేతృత్వంలో సభ్యులు పీఎండీడీకేవై పురోగతిపై చర్చించి సమస్యలను అదిగమించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో పంటల మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, రైతు వేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వాలని, ఆయా పథకాల అభివృద్ధికి నాబార్డు సహకారం తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలోని అనుగొండ గ్రామంలో ఆక్వా పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని జిల్లా మత్స్య శాఖ అధికారి రహమాన్ తెలిపారు.ఆయా శాఖల అభివృద్ధి ప్రణాళికలను ఈశ్వర్రెడ్డి, డీఏఓ సుధాకర్, నోడల్ అధికారి సాయిబాబా వెల్లడించారు. కాగా పీఎండీ డీకేవై ఆరేళ్ల వార్షిక ప్రణాళిక పై తయారు చేసిన పూర్తిస్థాయి నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సెంట్రల్ నోడల్ అధికారికి చూపించారు. కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ట్రైనీ కలెక్టర్ హర్స్ చౌదరి, డిప్యూటీ కలెక్టర్లు శ్రీరామ్ ప్రణీత్, ఫణి కుమార్, నీటిపారుదల శాఖ ఈఈ బ్రహ్మానందరెడ్డి, నాబార్డ్ ఏజీఎం షణ్ముఖ చారి, ఎల్డీఎం విజయకుమార్, డీఎం ఓ బాలమణి పాల్గొన్నారు. -
‘పేట’ చేనేత చీరలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
నారాయణపేట: నారాయణపేట చేనేత చీరలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, మరింత నైపుణ్యంతో తక్కువ సమయంలో ఎక్కువ చీరలను నేసి వ్యాపారం పెంచుకొని ఆర్థికాభివృద్ధి చెందాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాల్లో నారాయణపేట చేనేత క్లస్టర్ అభివృద్ధి పథకంలో భాగంగా 72 మంది చేనేత కార్మికులకు మగ్గలు, చేనేత అధునాతన యంత్రాలు, పరికరాలు జక్కడ్స్, ఫ్రేమ్ లూన్, వైడింగ్ మిషన్, ఫిర్కం డబ్బా,ఫిట్లను శనివారం ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. నారాయణపేటలో నేసిన చేనేత చీరలకు మహారాష్ట్రలో డిమాండ్ ఎక్కువగా ఉందని, ఎక్కువ ఆదాయం పెంచుకోవాలన్నారు. తొందరగా స్కీమ్ అమలు చేస్తే.. మరో విడత తొందరగా మంజూరు అవుతుందని, లబ్ధిదారులు 10 శాతం వాటా చెల్లిస్తే.. మిగతా 90శాతం వాటా కేంద్రం అందిస్తుందని ఆమె తెలిపారు. ఎప్పటికప్పుడు అధికారులు, చేనేత కార్మికులకు చేనేత పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వర్క్ షెడ్లు వస్తాయని, వర్క్ షెడ్ అనేది హౌసింగ్ స్కీమ్లో భాగమన్నారు. ఎంతమందికి వర్క్ షెడ్లు అవసరమో అధికారులు గుర్తించి కేంద్రానికి పంపాలని ఆదేశించారు. చేనేత కార్మికులకు పని ఒత్తిడి తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. యంత్రాల ఉపయోగంతో శారీరక శ్రమ తగ్గుతుందనీ చెప్పారు. నారాయణపేట చీరలకు మంచి డిజైన్ జోడిస్తే.. మరింత డిమాండ్ పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, ఆర్డీఓ రామచందర్ నాయక్, అధికారి విజయ్ కుమార్, పగుడాకుల శ్రీనివాసులు, ఆంజనేయులు, బత్తుల సతీష్, క్లశ్రీనివాస్, నవిలే విజయ్ కుమార్ ల్గొన్నారు. -
సావిత్రిబాయి స్ఫూర్తితో ముందుకు సాగాలి
నారాయణపేట: సావిత్రిబాయి ఫూలే జీవితం అందరికీ ఆదర్శప్రాయం అని, వారి స్ఫూర్తితో మహిళలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని, మహిళా సాధికారత దిశగా ముందుకు సాగాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను అన్నారు. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో నిర్వహించగా ముఖ్యఅతిథిగా ఆయన హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. మహిళలు సావిత్రిబాయి ఫూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా వాటన్నిటిని అధిగమించి చదువుకోవడంతో పాటు మొదటిసారిగా సమాజంలో మహిళలు చదువుకోడానికి ప్రోత్సహించి పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, జిల్లా మత్స్య శాఖ అధికారి రహమాన్, డీపీఆర్ఓ రషీద్, డీపీవో సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళా టీచర్ల సేవలు వెలకట్టలేనివి నారాయణపేట రూరల్: మహిళా ఉపాధ్యాయుల సేవలు విద్యారంగంలో వెలకట్టలేనివి డీఈఓ గోవిందరాజు అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మహిళా టీచర్లకు సన్మానించారు. అనంతంర ఆయన మాట్లాడుతూ.. నిరంతరం కుటుంబ బాధ్యతలను మోస్తూ ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించడంలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర ప్రముఖమైనదని అన్నారు. పిల్లల మానసిక ప్రవర్తనను అంచనా వేసి అన్ని రంగాలలో విద్యార్థులను సుశిక్షితులుగా చేయడంలో మహిళా టీచర్లు ముందంజలో ఉన్నారని అన్నారు. అంతకుముందు పూలే చిత్రపటానికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు వై. జనార్దన్ రెడ్డి, నాయకులు వరలక్ష్మి, వాణిశ్రీ, హనీఫ్, జహీరోద్దీన్, రఘువీర్, జనార్దన్, రమేష్, నర్సింహా రెడ్డి, నర్సింగ్ రావు, నరేష్, అరవింద్, భాగ్యరాజు, ప్రసాద్, సాయిలు, వెంకటప్ప, శ్రీనివాస్ పాల్గొన్నారు. నేడు కోయిల్సాగర్ నీటి విడుదల దేవరకద్ర: యాసంగి పంటల సాగుకు గాను కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి ఆదివారం నీటిని విడుదల చేస్తున్నారు. గతంలో అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 5 తడులు విడుదల చేయడానికి నీటి పారుదల శాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఒక్కో తడి కింద 10 రోజులపాటు నీటిని విడుదల చేసి మధ్యలో విరామం ఇస్తారు. యాసంగి సీజన్లో భాగంగా ప్రాజెక్టు పాత ఆయకట్టు కింద ఉన్న 12 వేల ఎకరాల వరకు సాగునీరు అందిస్తారు. కుడి కాల్వ కింద 8 వేలు, ఎడమ కాల్వ కింద 4 వేల ఎకరాల మేర నీటిని అందించే అవకాశం ఉంది. ఈ క్రమంలో మొదటి తడి ఆదివారం విడుదల చేస్తారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 32.2 అడుగుల వద్ద 2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఉన్న రెండు టీఎంసీల నీటిలో ఒక టీఎంసీ సాగునీటికి.. మరో టీఎంసీని వేసవిలో తాగునీటికి వినియోగిస్తారు. ఈ మేరకు ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి కోయిల్సాగర్ నీటిని విడుదల చేస్తారని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు అంజిల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్ఎన్ఆర్ క్వింటాల్ రూ.2,749 జడ్చర్ల: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,749, కనిష్టంగా రూ.2,289 ధరలు లభించాయి. అలాగే హంస రూ.1,811, కందులు గరిష్టంగా రూ.6,810, కనిష్టంగా రూ.5,610, వేరుశనగ గరిష్టంగా రూ.8,791, కనిష్టంగా రూ.6,269, మినుములు రూ.7,881, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,971, కనిష్టంగా రూ.1,856, పత్తి గరిష్టంగా రూ.7,129, కనిష్టంగా రూ.4,500, ఉలువలు రూ.3,900 చొప్పున వచ్చాయి. ● వామ్మో రక్తపింజర ● తల్లి మందలించిందని యువతి ఆత్మహత్యాయత్నం ● రూ.17 లక్షల పత్తి విత్తనాలు చోరీ – వివరాలు 8లో.. -
కలెక్టర్ చొరవ.. ప్రధాని ప్రశంసలు
నారాయణపేట: నారాయణపేట జిల్లాకేంద్రంలో నిరాదరణకు గురైన బారంబావి.. కలెక్టర్ హరిచందన చొరవతో భావితరాలకు అందుబాటులోకి వచ్చింది. ముళ్లపొదలు, చెత్తాదారం పేరుకుపోయి దుర్గంధభరితంగా మారిన బారంబావిని చూసిన 2021లో అప్పటి కలెక్టర్ దాసరి హరిచందన ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పునరుద్ధరించి ఇటు ప్రజల మన్ననలతోపాటు మన్కీబాత్లో ప్రధాని నరేంద్రమోదీచే ప్రశంసలు అందుకుంది. అలాగే 2021 నుంచి అక్కడే బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బావి చుట్టూ విద్యుద్దీపాలు అలంకరించడంతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. బారంబావి పునరుద్ధరణకు చొరవ తీసుకున్న అప్పటి కలెక్టర్ దాసరి హరిచందన, ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థను ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు. చారిత్రకమైన మెట్లబావి పునరుద్ధరణపై స్థానిక ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. -
ఇన్స్ట్రాగాంలో వచ్చి..వాట్సప్లో మెరిసి
కల్వకుర్తి రూరల్: ఒకానొక సందర్భంలో కల్వకుర్తి పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించిన సుభాష్నగర్లోని గచ్చుబావి కాలక్రమేణా శిథిలావస్థకు చేరింది. ఈ బావి దుస్థితిని పట్టణానికి చెందిన యువకుడు కల్వ కార్తీక్ ‘కల్వకుర్తి డైరీ ఇన్స్ట్రాగాం’ పేజీలో కళ్లకు కట్టినట్లు వీడియో తీసి పోస్టు చేయడంతో పెద్దఎత్తున స్పందన లభించింది. వందలాది మంది యువకులు ముందుకు వచ్చి వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి ‘సేవ్ గచ్చుబావి కమిటీ’ పేరిట చైతన్యం చేశారు. దీంతో గత 52 రోజులుగా శివాలయం మెట్ల బావి మరమ్మతు చేపట్టారు. మేముసైతం అంటూ మహిళలు శ్రమదానంలో పాల్గొని తమవంతు సహకారం అందించారు. అయితే బావి లోతు తీయడానికి ఇబ్బందిగా మారడంతో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం మరమ్మతుకు నిధులు మంజూరు చేయించి పెద్ద క్రేన్ ఏర్పాటు చేయించారు. దీంతో వేగంగా పనులు పూర్తి కావొస్తున్నాయి. శివరాత్రి నాటికి శివాలయం, గచ్చు బావికి పూర్వవైభవం తీసుకువచ్చేలా కృషిచేస్తున్నారు. శివాలయంలోని శివలింగానికి బావినీటితో అభిషేకం చేసేందుకు సేవ్ గచ్చుబావి కమిటీ సభ్యులు సంసిద్ధులు అవుతున్నారు. సేవ్ గచ్చుబావి పేరుతో మొదలుపెట్టిన కార్యక్రమం విజయవంతం కావడంతో యువకుల శ్రమ ఫలించనుంది. యువత తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించారు. ఇందుకు సామాజిక మాధ్యమాల ద్వారా చేసిన చైతన్యం కూడా గచ్చుబావి పూర్వవైభవానికి ఒక మెట్టులా ఉపయోగపడింది అనేది అక్షర సత్యం. -
30 పోలీస్ యాక్ట్ అమలు
నారాయణపేట: జిల్లాలో శాంతిభద్రతల దృష్ట్యా ఈ నెల 31వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని.. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు, బహిరంగ సభలు, ధర్నాలు వంటివి నిర్వహించరాదని ఎస్పీ డా.వినీత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతులు లేకుండా పై కార్యక్రమాలు నిర్వహిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించేందుకు దారితీసే సమావేశాలు, జన సమూహం చేయ డం పూర్తిగా నిషేధమని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అనవసరమైన విషయాలతో పాటు మతాల మధ్య చిచ్చుపెట్టే అంశాలను వ్యాప్తిచేసిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. చట్టపరంగా జారీ చేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ ప్రకారం శిక్షార్హులవుతారని తెలిపారు. అవాంతరాలు లేకుండా యూరియా సరఫరా నర్వ: యాసంగి పంటల సాగుకు అవసరమైన యూరియా సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సహకార సంఘం సీఈఓ ప్రసాద్రావు అన్నారు. శుక్రవారం నర్వ పీఏసీఎస్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు యూరియా స్టాక్ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యాసంగి పంటలకు సరిపడా యూరియాను రైతులకు సకాలంలో అందించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. రైతులకు యూరియా అందుబాటులో ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సీఈఓ వెంట అసిస్టెంట్ రిజిస్ట్రార్ సయ్యద్ రఫియొద్దీన్, జూనియర్ ఇన్స్పెక్టర్ షాకీర్ పాషా, పీఏసీఎస్ సీఈఓ ఉదయ్కుమార్, కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షుడు చెన్నయ్యసాగర్ ఉన్నారు. ఓపీ సేవలు ప్రారంభం నారాయణపేట: జిల్లా కేంద్రంలోని పాత ఏరియా ఆస్పత్రి భవనంలో ఏర్పాటుచేసిన అర్బన్ హెల్త్ సెంటర్లో శుక్రవారం ఓపీ సేవలను డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక ప్రజలకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓపీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. కాగా, స్థానిక ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి కృషితో అత్యవసర సేవల నిమిత్తం అంబులెన్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. వైద్యపరీక్షల కోసం ల్యాబ్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డీహెచ్సీ సభ్యులు కోర్వర్ కృష్ణ, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ కొణంగేరి హన్మంతు , ఆర్టీఏ మెంబర్ పోశల్ రాజేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శరణప్ప పాల్గొన్నారు. జోనల్ కిక్బాక్సింగ్ పోటీల్లో కాంస్య పతకం మహబూబ్నగర్ క్రీడలు: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో గత నెల 25 నుంచి 28వ తేదీ వరకు జరిగిన జోనల్ కిక్బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారిణి తన్షిత ప్రతిభ కనబరిచినట్లు స్పోర్ట్స్ కిక్బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు కె.రవికుమార్ తెలిపారు. ఈ పోటీల్లో తన్షిత–37 కేటగిరిలో పాయింట్ ఫైట్లో కాంస్య పతకం సాధించినట్లు వివరించారు. ఈ మేరకు శుక్రవారం తన్షితను డీఎస్పీ వెంకటేశ్వర్లు అభినందించి సన్మానించారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాస్టర్ రవికుమార్, సలహాదారులు విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. రేపు బీచుపల్లిలో సీతారాముల కల్యాణం ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా ఆదివారం సీతారాముల కల్యాణన్ని నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై రాములోరి కల్యాణ వేడుకను కనులారా తిలకించాలని ఆయన కోరారు. -
భవిష్యత్ రూపకర్తలు విద్యార్థులు
● కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలి ● ఇన్చార్జి కలెక్టర్ ప్రతీక్ జైన్ ● ఆకట్టుకున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నారాయణపేట రూరల్: విద్యార్థులు, యువత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త ఆవిష్కరణలకు నాంది పలికి.. ప్రపంచం గుర్తించే శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఇన్చార్జి కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నారాయణపేట మండలం జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సైన్స్ఫెయిర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో దోహదపడుతాయన్నారు. చిన్నతనం నుంచే ప్రయోగాలు రూపొందించాలని.. మొదట తప్పులు జరిగినా ఆ తర్వాత కొత్త ఆవిష్కరణలు విజయవంతం అవుతాయన్నారు. తనకు సైన్స్ అంటే ఎంతో ఇష్టమని.. భౌతికశాస్త్రంతోనే ఐఏఎస్ సీటు సాధించానని గర్వంగా చెప్పారు. త్వరలో జిల్లాలోని కోస్గికి బిర్లా ప్లాంటోరియం, వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్లో రోబోటిక్ లైబ్రరీ ఏర్పాటు కానున్నాయని.. విద్యార్థులకు సైన్స్ పరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యార్థులు డ్రగ్స్ వంటి మహమ్మారికి దూరంగా ఉండాలని, రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటించాలని సూచించారు. నిత్య జీవితంలో సైన్స్ ఒక భాగం.. జాతీయ సైన్స్ ఫిక్షన్ దినోత్సవం రోజున జిల్లాలో ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అదనపు కలెక్టర్ శ్రీను అన్నారు. జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభకనబరిచి.. కామారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్లోనూ ప్రతిభ చాటాలని సూచించారు. ఉపాధ్యాయుల చక్కటి బోధనతోనే విద్యార్థులు గొప్ప శాస్త్రవేత్తలుగా తయారు కాగలరని అన్నారు. మనిషి జీవితం సైన్స్తో ముడిపడి ఉందన్నారు. ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి స్వీయ మూల్యాంకనం, సరికొత్త అన్వేషణలు, ప్రయోగాలతో గొప్ప ఫలితాలను సాధించవచ్చని అన్నారు. విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. -
‘పీఎం ధన్ ధాన్య కృషి’ ప్రణాళికలు పక్కాగా అమలు
నారాయణపేట: పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం ప్రణాళికలను జిల్లాలో పక్కాగా అమలు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం కమిటీ సభ్యులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో పథకం అమలుకు సంబంధిత అధికారులు రూపొందించిన ప్రణాళికలు, వాటి అమలు తీరుపై ఆరా తీశారు. జిల్లాలో పంటసాగు విస్తీర్ణం, పండించే పంటల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. సహజ సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరించడం, రైతుల ఆదాయం పెంచడం, గ్రామీణ జీవనోపాధికి మద్దతుతో స్థిరమైన వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయాన్ని స్వీకరించడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. ఈ నెల 3, 4 తేదీల్లో పథకం ప్రణాళిక, అమలుపై సమీక్షించేందుకు సెంట్రల్ నోడల్ అధికారి రమణ్కుమార్ జిల్లా పర్యటనకు వస్తున్నారని తెలిపారు. 3న కలెక్టరేట్లో కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహిస్తారని.. 4న క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారన్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో సభ్యులు సిద్ధంగా ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీను, ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ ప్రణీత్, డీఏఓ జాన్ సుధాకర్, పథకం నోడల్ అధికారి సాయిబాబా, డీఆర్డీఓ మొగులప్ప, జిల్లా మత్స్యశాఖ అధికారి రహమాన్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఈశ్వర్రెడ్డి, నీటి పారుదలశాఖ ఈఈ బ్రహ్మానందరెడ్డి, డీపీఆర్ఓ రషీద్ ఉన్నారు. రోడ్డు భద్రత నియమాలు పాటించాలి.. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులు, పాదచారులు విధిగా రహదారి భద్రత నియమాలు పాటించాలని ఇన్చార్జి కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు. రోడ్డు భద్రత మాసోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆర్టీఓ మేఘాగాంధీతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం రహదారి భద్రత నియమాలు పాటిస్తామని అందరితో సామూహికంగా ప్రతిజ్ఞ చేయించారు. -
తాలు పేరిట.. నిలువు దోపిడీ
అన్నదాతలను రైస్ మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. మట్టి, తాలు పేరిట కోతలపై కోతలు పెడుతూ వారి కష్టాన్ని అప్పనంగా సొమ్ము చేసుకుంటున్నారు. అంగీకరించని రైతులను దారికి తెచ్చుకునే వరకూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇలా ఈ వానాకాలం సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటివరకు కోట్లాది రూపాయలు దండుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎవరూ దీని గురించి పట్టించుకోకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగిన దందాపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ కిలోకు రూ.24చొప్పున నష్టం.. వానాకాలం సీజన్కు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 1,049 ప్రభుత్వ కేంద్రాల్లో మొత్తంగా 13,24,145 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 6,16,398 మె.ట., కొనుగోలు చేశారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్కు మద్దతు ధర రూ.2,389 పలుకుతోంది. క్వింటాల్కు 3 కిలోల చొప్పున కోత పెడితే రైతుకు రూ.72 నష్టం వాటిల్లుతోంది. ఈ లెక్కన ఇప్పటి వరకు కొనుగోలు చేసిన 61,63,980 క్వింటాళ్ల ధాన్యానికి రూ.44.38 కోట్లు నష్టపోయారు. తక్కువలో తక్కువ 3 కిలోలు తీసుకుంటేనే ఈ పరిస్థితి ఉంది. సగటున 4 కిలోలు వేసుకున్నా.. మిల్లర్లు తాలు పేరిట దోచుకున్న ధాన్యం విలువ రూ.60 కోట్లు ఉంటుందని రైతు సంఘాల నాయకులు అంచనా వేస్తున్నారు. రైతులకు ఫోన్లు చేసి మరీ.. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్కు 3 నుంచి 4 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారు. ఈ ధాన్యాన్ని వాహనాల్లో మిల్లులకు తరలించగా.. అక్కడ మిల్లర్లు కొందరు మళ్లీ దోపిడీకి తెగబడ్డారు. ఆ వాహనంలో ఏయే రైతులకు సంబంధించిన ధాన్యం ఉందో.. వారికి ఫోన్లు చేస్తున్నారు. తాలు ఎక్కువగా ఉంది.. క్వింటాల్కు కిలో నుంచి రెండు కిలోల కోత తప్పదు.. అలా అయితేనే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. కొన్ని చోట్ల మిల్లుల్లో కోత పెట్టకుండా నేరుగా సెంటర్లలోనే క్వింటాల్కు4 నుంచి 5 కిలోల వరకు కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒక బస్తాలో 40.600 కిలోలు.. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు మట్టి, తాలు, తేమ శాతం అన్ని పరిశీలించి.. నిబంధనల ప్రకారం ఉంటేనే తూకం వేస్తున్నారు. లెక్క ప్రకారం బస్తాకు 40 కిలోల ధాన్యం నింపాలి. బస్తా బరువుతో కలిపి 40.600 కిలోలు తూకం వేయాలి. అయితే తాలు, మట్టి, బస్తా బరువు పేరిట ఇందుకు అదనంగా కిలో నుంచి రెండు కిలోల వరకు ధాన్యం తూకం వేసి మిల్లులకు పంపిస్తున్నారు. ఈ వ్యవహారం ఆయా జిల్లాల్లో ఒక్కోచోట ఒక్కోలా సాగుతోంది. ఖరీఫ్లో రైస్ మిల్లర్లఅక్రమార్జన రూ.45 కోట్లు క్వింటాల్కు 3 కిలోల కోత వేసుకుంటేనే ఈ విలువ ఒక్కో చోట 4, 5 కేజీల వరకు తరుగు తొలుత సెంటర్లలో.. ఆ తర్వాత మళ్లీ మిల్లుల్లో.. అంగీకరించకుంటే ధాన్యం లారీ వెనక్కే.. మిల్లుల నిర్వాహకులకే అధికారుల వత్తాసు -
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
మక్తల్: త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పట్టణంలో శుక్రవారం ఆయన నివాసంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించాలన్నారు. మక్తల్ మున్సిపాలిటీలోని 16 వార్డులలో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు తదితర అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు. మక్తల్, అమరచింత, ఆత్మకూ రు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలు ఇప్పటికీ నెరవేరలేదని ఆయన ఆరోపించారు. వార్డులలో ఓటర్ల జాబితాను పరిశీలించి దొంగ ఓట్లు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో మాజి మార్కెట్కమిటి చైర్మెన్ నర్సింహగౌడ్, పట్టణ అధ్యక్షులు చిన్నహనుమంతు తదితరులు పాల్గొన్నారు. -
‘తప్పుల తడకగా ఓటరు జాబితా’
అమరచింత: పురపాలిక ఎన్నికల సందర్భంగా గురువారం విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. పుర, తహసీల్దార్ కార్యాలయాల నోటీసు బోర్డులపై పది వార్డులకు సంబంధించిన ఓటరు జాబితాలను గురువారం ప్రదర్శించారు. శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఓటర్లు వార్డుల వారీగా పరిశీలించగా జాబితా పూర్తిగా తప్పుల తడకగా ఉందని చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో ఇలాంటి పరిస్థితి కనిపించలేదని.. ఇప్పుడు ఓటర్ల పేర్లు ఏకంగా వార్డుల వారీగా తారుమారు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పట్టణంలో పురుష ఓటర్లు 4,404, మహిళా ఓటర్లు 4,813, మొత్తం ఓటర్లు 9,217 మంది ఉన్నారని.. వీరంతా తమ తమ వార్డుల్లో ఓటు వేసేలా ఓటరు జాబితాను సవరించాలని కోరుతున్నారు. పుర కమిషనర్తో పాటు మేనేజర్, సిబ్బంది మద్య సఖ్యత లేక ఓటరు జాబితాలో తప్పిదాలు చోటు చేసుకున్నాయని వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. -
వైజ్ఞానిక మేళాకు వేళాయె..
నారాయణపేట రూరల్: విద్యార్థులలో మేధాసంపత్తి పెంపునకు.. నూతన ఆవిష్కరణలకు.. సృజనాత్మకతను వెలికి తీసేందుకు యేటా నిర్వహించే విద్యా వైజ్ఞానిక మేళా నిర్వహణకు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. శుక్రవారం నుంచి నారాయణపేట మండలంలోని జాజాపూర్ గ్రామ జెడ్పీ ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. పిల్లల్లో శాసీ్త్రయ ఆలోచనలు ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు విజ్ఞాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో భావిశాస్త్రవేత్తల ఎంపికకు ఈ వేదిక ప్రధాన భూమిక పోషించనుంది. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాల, కళాశాలలకు సంబంధించి 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులతో పాటు డీఎడ్, బీఎడ్ ట్రైనీ ఉపాధ్యాయులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయులు సైతం నూతన ఆవిష్కరణలతో బోధనా సామగ్రి ప్రదర్శనకు అవకాశం కల్పిస్తారు. 6 నుంచి 8వ తరగతి జూనియర్స్, 9నుంచి 12వ తరగతి సీనియర్స్ విభాగాలుగా విభజించి పోటీలు చేపట్టనున్నారు. ఒక పాఠశాల నుంచి ప్రతి ఉపాంశానికి ఒకటి చొప్పున ఐదు ప్రాజెక్టులు ప్రదర్శించే అవకాశం ఉంది. విద్యార్థులతోపాటు గైడ్ టీచర్ హాజరు కావాల్సి ఉంటుంది. ఉత్తమంగా నిలిచిన ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. ఇన్స్పైర్ ప్రాజెక్టులు సైతం 2024–2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన జిల్లా స్థాయి ఇన్స్పైర్ ప్రదర్శనలు సైతం ఈ వేదికపై కనిపించనున్నాయి. జిల్లావ్యాప్తంగా కేవలం 19 ప్రాజెక్టులు మాత్రమే ఎంపికయ్యాయి. వారు ఆన్లైన్లో వివరించిన ఆవిష్కరణల తయారీకి ఇప్పటికే సదరు విద్యార్థుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున నగదు జమ చేశారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా హాజరయ్యేలా విద్యాశాఖ అధికారులు సంబంధిత ప్రధాన ఉపాధ్యాయులకు మార్గ నిర్దేశం చేశారు. ఏర్పాట్లు పూర్తి జిల్లా ఏర్పాటు తర్వాత తొలిసారిగా గ్రామీణ ప్రాంతంలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహణకు జిల్లా విద్యాశాఖ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. నారాయణపేట మండలంలోని జాజాపూర్ గ్రామ జెడ్పీ ఉన్నత పాఠశాలలో వేదిక ఏర్పాటు చేశారు. శుక్ర, శనివారాలు రెండు రోజులపాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకుఈ ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి 150మంది ఉపాధ్యాయులతో 22 కమిటీలు ఏర్పా టు చేసి పర్యవేక్షిస్తున్నారు. హాజరయ్యే విద్యార్థులు ఉపాధ్యాయులకు అవసరమైన వసతి, భోజనం ఏర్పాటు చేయనున్నారు. ఇదిలాఉండగా, రెండు నెలల ముందు నుంచే విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు సమయం ఉండగా జిల్లా విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఉపాధ్యాయ సంఘాలు విమ ర్శిస్తున్నాయి. ఈ నెల 5 నుంచి రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆదరాబాదరా చివరి నిమిషంలో తూతూ మంత్రంగా వైజ్ఞానిక ప్రదర్శన చేపట్టడం సరికాదని వాపోయారు. అటు మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో ఉండడం.. రెగ్యులర్ కలెక్టర్ సెలవులో ఉన్న సమయంలో నిర్వహణ చేపట్టడం సబబు కాదని బహిరంగంగా విమర్శలు వస్తున్నాయి. సమన్వయంతో విజయవంతం చేస్తాం జిల్లాస్థాయి వైజ్ఞానిక మేళా జయప్రదం చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రణాళికా ప్రకారం కమిటీలను వేసి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాం. ఉపాధ్యాయ సంఘాలు, మండల స్థాయి అధికారులు, ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు తమన్వయంతో విజయవంతంగా పూర్తి చేస్తాం. – గోవిందరాజు, డీఈఓ ప్రధాన అంశం..ఉప అంశాలు ఇవీ.. ఈ విద్యా సంవత్సరం విద్యా వైజ్ఞానిక సదస్సులో ప్రధాన అంశంగా అభివృద్ధి చెందిన, స్వయం సమృద్ధి భారతదేశ కోసం సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (స్టెమ్) గా నిర్ధారించారు. దీనికి తోడు ఏడు ఉప అంశాలను ఎంపిక చేశారు. సుస్థిర వ్యవసాయం, వ్యర్థ పదార్థాల నిర్వహణ, ప్రత్యామ్నాయ మొక్కలు, హరిత శక్తి (పునరుత్పాదక శక్తి), అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వినోదవరితమైన గణిత నమూనాలు, ఆరోగ్యం పరిశుభ్రత, నీటి సంరక్షణ నిర్వహణపై విద్యార్థులు ప్రాజెక్టులు తీసుకురావాల్సి ఉంటుంది. సెమినార్ నిర్వహణ రెండు రోజులపాటు జరిగే ప్రదర్శనలో విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత కోసం ప్రత్యేక సమినార్ను నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం అనే అంశంపై జూనియర్, సీనియర్ విభాగాల్లో ఒక్కో పాఠశాల నుంచి ఒక్కో విద్యార్థి పాల్గొనిందుకు అవకాశం ఉంటుంది. నేడు ప్రారంభంకానున్నసైన్స్ఫెయిర్ జిల్లా ఏర్పాటు తర్వాత తొలిసారిగా గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు జాజాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సర్వం సన్నద్ధం -
లక్ష్య సాధనకు కృషి చేయాలి
నారాయణపేట రూరల్: తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేరుస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు విద్యార్థులు కృషి చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీను అన్నారు. పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థినులతో మాట్లాడారు. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రతి పాఠ్యాంశాన్ని క్షుణ్ణంగా చదవాలని, అర్థం కాని విషయాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నారు. శీతాకాలం సందర్భంగా చలి నుంచి తట్టుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అనారోగ్య సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. అంతకుముందు పాఠశాలలో ని వసతులు, భోజనం తదితర అంశాలపై విద్యార్థులని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పరీక్ష ప్యాడ్, నోటు పుస్తకాలను అందించారు. కార్యక్రమంలో ఏవో శ్రీధర్, తహసీల్దార్, ప్రిన్సిపాల్ యాదమ్మ, ఎస్ఓ శ్వేతాజ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తెల్లకందులుక్వింటా రూ.7,866 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం తెల్ల కందులు క్వింటాల్కు గరిష్టంగా రూ.7,866 , కనిష్టంగా రూ.6,216 ధర పలికింది. అలాగే, ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,759, వడ్లు (సోన) గరిష్టంగా రూ.2,711, కనిష్టంగా రూ.2,260 ధర పలికాయి. రోడ్డు భద్రత నియమాలు పాటించాలి నారాయణపేట: రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి వాహనదారుడు, ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించినప్పుడే ప్రమాదాలను తగ్గించవచ్చని, నియమాలు పాటించాలని ఎస్పీ వినీత్ అన్నారు. గురువారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఏఎస్పీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, డిస్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మేగా గాంధీతో కలిసి ఎస్పీ పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. మాసోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు శాఖతో పాటు రవాణా శాఖ అధికారులు కలిసి నెల రోజుల పాటు రోడ్డు భద్రత నియమాలపై విద్యాసంస్థలు, గ్రామా లు, పట్టణాల్లో ప్రచార కార్యక్రమాలు హెల్మెట్, సీట్బెల్ట్ ప్రాముఖ్యతపై అవగాహన వంటివి నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
నారాయణపేట: గతేడాది పెండింగ్లో ఉన్న కేసులను తగ్గించేందుకు.. ఈ ఏడాది అందరూ సమన్వయంతో పనిచేసి నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ వినీత్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ కేక్ కట్ చేశారు. ప్రజలకు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. 2025 ఎన్నో చేదు, తీపి గుర్తులతో గడిచిపోయిందని, కొత్త ఏడాది జిల్లా జిల్లా పోలీసులు కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుని వాటిని సాధించడానికి అహర్నిశలు కృషి చేయాలని, నేరాలను తగ్గించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. పనితీరు మెరుగుపరుచుకుని అద్భుతమైన ఫలితాలు సాధించాలని, గతేడాది జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించినందుకు సిబ్బందిని అభినందించారు. సమస్యాత్మక కేసులను సాంకేతికతను ఉపయోగించి త్వరగా పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రియాజ్ హుల్హక్, డీఎస్పీ లింగయ్య, సిఐలు శివశంకర్, రాంలాల్, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
‘సవాయిగూడెం’లో ఓటు చోరీ..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: వనపర్తి జిల్లాలో ఓటు చోరీకి సంబంధించిన ఓ కేసును జిల్లా కోర్టు విచారణకు స్వీకరించింది. వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలో ఓటర్ లిస్టులో చనిపోయిన వారు ఉన్నారని.. వలస వెళ్లిన వారు డబుల్ ఓటర్లుగా ఉన్నారని పలువురు గ్రామస్తులు జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్తో పాటు రాష్ట్ర, జాతీయ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. వారిని తొలగించాలని రెండేళ్ల నుంచి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన అధికారులు గ్రామంలోని 65 మంది పేర్లను ఓటర్ లిస్టు నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చారు. అయితే పంచాయతీ ఎన్నికలను పాత ఓటర్ లిస్టు ప్రకారమే నిర్వహించారు. దీనిపై గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు జిల్లా కోర్టులో పిల్ వేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు.. జిల్లా ఎన్నికల అధికారి, ఆర్డీఓ, ఆర్వో తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్, సామగ్రి అంతా కోర్టుకు సమర్పించాలని సూచించడం చర్చనీయాంశంగా మారింది. 5 ఓట్ల తేడాతో కాంగ్రెస్ మద్దతుదారు గెలుపు.. పంచాయతీ ఎన్నికల్లో అధికారులు వెల్లడించిన జాబితా ప్రకారం గ్రామంలో మొత్తం 2,201 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో రెండో విడతలో డిసెంబర్ 14న పోలింగ్ జరిగింది. మొత్తం 10 వార్డులు ఉన్నాయి. సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుదారు యామిని, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి శ్రీలత బరిలో నిలిచారు. శ్రీలతకు 913 ఓట్లు రాగా.. యామినికి 918 ఓట్లు వచ్చాయి. దీంతో యామిని ఐదు ఓట్లు తేడాతో గెలుపొందారు. మొత్తంగా 1,882 ఓట్లు పోల్ కాగా.. యామినికి 918, శ్రీలతకు 913, నోటాకు 12 రాగా.. 39 ఓట్ల చెల్లలేదు. వందకు పైగా దొంగ ఓట్లు వేయించారు.. గ్రామంలో వందకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని.. పోలింగ్ రోజు పేర్లు తొలగించిన వారి స్థానంలో పలువురు ఓటు వేసేందుకు రాగా అభ్యంతరం తెలిపినట్లు గ్రామస్తులు వెల్లడించారు. అయినా అధికార కాంగ్రెస్ నేతల అండదండలతో పోలీసులు బందోబస్తు మధ్య వారితో ఓటు వేయించారని చెబుతున్నారు. ఈ దొంగ ఓట్లతోనే తాము ఓటమి పాలైనట్లు సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన పలువురు తెలిపారు. ఇది ముమ్మాటికీ ఓటు చోరేనని.. ఓటు చోరీ గురించి గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ నేతలు దీనిపై ఏమంటారని ప్రశ్నిస్తున్నారు. దొంగ ఓట్లతో గెలిచిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని.. సవాయిగూడెం ఎన్నికలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఓటు చోరీకి సంబంధించి ఇది రాష్ట్రంలో నమోదైన మొదటి కేసు అని చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లోదొంగ ఓట్లు వేశారని పిల్ విచారణకు స్వీకరించిన వనపర్తి జిల్లా కోర్టు జిల్లా ఎన్నికల అధికారి, ఆర్డీఓ, ఆర్వోలకు నోటీసుల జారీ 8న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు బ్యాలెట్ బాక్స్, సామగ్రి సమర్పించాలని సూచన -
నయా సాల్.. ఫుల్ జోష్!
● రికార్డు స్థాయిలో రూ.5.50 కోట్ల మద్యం అమ్మకాలు ● కిటకిటలాడిన చికెన్, మటన్ దుకాణాలు ● జిల్లాలో 86 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నారాయణపేట: కొత్త సంవత్సర సంబరాలు మందుబాబుల్లో ఫుల్ జోష్ నింపాయి. ఒక్క రోజులోనే రూ.5.50 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. 2025కు వీడ్కోలు పలుకుతూ.. 2026కు గ్రాండ్ వెల్కమ్ పలికారు. జిల్లాలోని 33 వైన్స్ దుకాణాల్లో మద్యం ప్రియులు బీర్లు, వైన్ల కోసం బారులు తీరారు. నారాయణపేట సర్కిల్ పరిధిలో వైన్స్లతో పాటు బెల్డ్ దుకాణాల్లో రూ.3.50 కోట్లు.. సీఎం ఇలాఖాలోని 14 వైన్స్లు, ఒక బారు, బెల్ట్ దుకణాల్లో రూ.కోటిన్నర విక్రయాలు జరిగాయని ఎకై ్సజ్ శాఖ అంచనా వేస్తోంది. మద్యం ప్రియుల జేబులు గుల్ల అయినా.. ప్రభుత్వ ఖజానా మాత్రం గలగలలాడింది. ఇదిలాఉండగా, యువత హోటళ్లు, దాబాలు, రిసార్ట్స్కు వెళ్లి వేడుకలు జరుపుకొన్నారు. రాత్రి 12 అవగానే కేరింతలు కొడుతూ నూతన సంవత్సరానికి ఘన స్వాగతం తెలిపారు. హాపీ న్యూ ఇయర్ అంటూ గంతులేశారు. రెండు రోజుల ముందు నుంచే.. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మద్యం ప్రియుల అభిరుచులకు అనుగుణంగా వారికి కావాల్సిన బ్రాండ్లను వైన్స్ల్లో అందుబాటులో ఉంచారు. డిసెంబర్ 28 నుంచే అన్ని సాధారణ రోజుల కంటే 20 నుంచి 40 శాతం అధికంగా మద్యం స్టాక్ వైన్స్, బార్లకు చేరుకున్నాయి. ఒక వైన్స్లో 31న ఒక్కరోజు ఉన్న స్టాక్ మొత్తంలో 60శాతం వరకు మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. వీటికితోడు దాబాలు, హోటళ్లు కిటకిటలాడాయి. డిసెంబర్ 31 రాత్రి కేక్ కట్ చేయడం నుంచి మద్యం సేవించడం, భోజనాలకు ఏర్పాట్లు చేశారు. ఇక చికెన్, మటన్ విక్రయాలతో షాపులు పొద్దున్నుంచే కిటకిటలాడాయి. కాల్చిన కూర, చికెన్ ఫ్రై, చేపల ఫ్రై వద్ద జనం బారులు తీరి కనిపించారు. సాధారణ రోజులతో పోలిస్తే డిసెంబర్ 31న మాంసం విక్రయాలు జోరందుకున్నాయి. ముమ్మర తనిఖీలు.. 86 డ్రంకెన్ డ్రైవ్ కేసులు జిల్లాలో నూతన సంవత్సరం సందర్భంగా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 ఉదయం 6 గంటల వరకు జిల్లా పరిధిలోని 12 పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీలలో మొత్తం 86 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని పీఎస్ల వారీగా పరిశీలిస్తే నారాయణపేట టౌన్ 14, దామరగిద్ద 8, కోస్గి 5, మద్దూర్ 4, మరికల్ 7, ధన్వాడ 15, నర్వ 15, మక్తల్ 5, కృష్ణా 4, మాగనూర్ 8 నారాయణపేట రూరల్లో 1 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రాణాలకు ప్రమాదమని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించిన తరువాత వాహనం నడపకూడదని ఆయన సూచించారు. ప్రజల ప్రాణ భద్రతే పోలీస్ శాఖ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. -
పుర పోరు.. కసరత్తు జోరు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఖరారుకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. అధికారులు కసరత్తు ప్రారంభించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి కాగా.. ముసాయిదా ఓటరు జాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో రాజకీయ పార్టీల్లోనూ హడావుడి మొదలైంది. కొందరు కౌన్సిలర్/కార్పొరేటర్ ఆశావహులు రిజర్వేషన్లపై అంచనాలు వేసుకుంటుండగా.. మరికొందరు అనుకూలంగా వస్తాయనే ధీమాతో బరిలో ఉంటున్నామనే సంకేతాలను పంపిస్తున్నారు. 2 మినహా మిగిలిన 19 మున్సిపాలిటీల్లో.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్తో కలుపుకుని మొత్తం 21 పురపాలికలు ఉన్నాయి. వీటిలో మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల, నాగర్కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీ మినహా మిగిలిన వాటికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు పురపాలికల పాలక వర్గాల పదవీకాలం ఈ ఏడాది మే వరకు ఉంది. 2021 ఏప్రిల్లో వీటికి ఎన్నికలు జరిగాయి. మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి 2020 జనవరి 22న ఎన్నికలు జరగ్గా.. అదే నెల 25న ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించారు. అదే నెల 28న పాలకవర్గాలు కొలువుదీరాయి. ఈ నేపథ్యంలో 2025 జనవరి 27తో వాటి పాలకవర్గాల కాలపరిమితి ముగియగా.. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. నేడు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 2023 అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితా ప్రమాణికంగానే పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ఆ ఏడాది అక్టోబర్ ఒకటి నాటికి ఉన్న ఓటర్ల జాబితా మేరకు కార్పొరేషన్/మున్సిపాలిటీల్లో అధికారులు వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. జనవరి ఒకటి (గురువారం)న వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఆయా పురపాలికల కార్యాలయాల్లో విడుదల చేయడంతోపాటు ప్రదర్శించనున్నారు. అదేరోజు నుంచి నాలుగో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఐదో తేదీన ఆయా మున్సిపాలిటీల పరిధిలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఆరున జిల్లా స్థాయిలో సమావేశం కానున్నారు. పదో తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. తొలిసారిగా కార్పొరేషన్లో.. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్నగర్ 2025 జనవరి 27న మున్సిపల్ కార్పొరేషన్గా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అప్గ్రేడ్ అయిన తర్వాత కార్పొరేషన్ పరిధిలో తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. గతంలో 49 వార్డులు ఉండగా.. 60 డివిజన్లు అయ్యాయి. ఈ క్రమంలో డివిజన్ల వారీగా పోలింగ్ కేంద్రాలను అధికారులు పునర్ వ్యవ్యస్థీకరించారు. అదేవిధంగా డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన పూర్తి చేశారు. కొత్తగా దేవరకద్ర.. మద్దూరు మహబూబ్నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్గా ఆవిర్భవించిన రోజే మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేట జిల్లాలోని మద్దూరు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీగా అవతరించాయి. మద్దూరు జీపీగా ఉన్న సమయంలో 14 వార్డులు ఉండగా.. ఐదు గ్రామాలను కలుపుకుని 16 వార్డులుగా విభజించారు. అదేవిధంగా దేవరకద్ర మేజర్ గ్రామ పంచాయతీలో 14 వార్డులు ఉండగా.. నాలుగు గ్రామాలను కలుపుకుని 12 వార్డులకు కుదించారు. జీపీల నుంచి మున్సిపాలిటీలుగా ఆవిర్భవించిన తర్వాత వీటికి తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్.. 20 మున్సిపాలిటీలు అచ్చంపేట, జడ్చర్ల పురపాలికలకు ముగియని పదవీ కాలం మిగిలిన 19 పురపాలికల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి ఓటర్ల జాబితా సైతం.. నేడు ముసాయిదా విడుదల రాజకీయ పార్టీల్లో హడావుడి షురూ -
నయా జోష్
● నూతనోత్సాహంతో కొత్త సంవత్సర వేడుకలు ● కేరింతలతో యువత, చిన్నారుల సందడి ● కిటకిటలాడిన బేకరీలు.. మద్యం దుకాణాలు ● జిల్లాలో పండుగ వాతావరణం చరిత్ర పుటల్లో మరో ఏడాది కరిగిపోయింది. ఎన్నో తీపి, చేదు జ్ఞాపకాలను మిగిల్చిన 2025 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోగా.. కోటి ఆశలతో 2026 సంవత్సరానికి జిల్లా ప్రజలు ఘనస్వాగతం పలికారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటలు దాటగానే హ్యాపీ న్యూఇయర్ అంటూ చిన్నారులు, పెద్దలు, యువత ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఎటుచూసినా నూతన సంవత్సర వేడుకలతో పండుగ వాతావరణం కనిపించింది. యువకులు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ సందడి చేశారు. నయా సాల్ జోష్ హోరెత్తింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలు, చర్చిలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. స్వీట్ షాపులు, బేకరీలు, మద్యం దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడాయి. – నారాయణపేట -
నీళ్లు, ఆరోగ్యం, ఉద్యోగ కల్పనే లక్ష్యం
నారాయణపేట: నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో జిల్లా ప్రజానీకానికి సాగు, తాగునీరు, మెరుగైన వైద్యం అందించడం.. రవాణా సౌకర్యం పెంచేందుకు రహదారుల విస్తరణ, పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తామని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సీవీఆర్ భవన్లో ఆయన మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో మాట్లాడారు. 2026, 2027 సంవత్సరాల్లోనే అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ఈ రెండేళ్లు పెద్ద టాస్క్తో సీఎం రేవంత్రెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు. 2028లో డీలిమిటేషన్ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని.. ఇప్పుడు ఉన్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు మూడు స్థానాలయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగే సమయంలో ఏ మండలం ఎక్కడ ఉండాలి.. ఏ మండలం ఏ నియోజకవర్గంలోకి వెళ్తుందో తెలియని గందరగోళ పరిస్థితులు వస్తాయన్నారు. 2028 వరకు నియోజకవర్గాల పునర్విభజనకే సమయం సరిపోతుందన్నారు. తమకు ఉన్నది రెండేళ్ల సమయమేనని.. జిల్లా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. ప్రభుత్వం రూ. 4,610 కోట్లతో చేపట్టిన పేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్లలో పూర్తిచేసి.. ప్రతి ఎకరాకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరా రూ. 20లక్షల చొప్పున పరిహారం అందించిన ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కిందన్నారు. నష్టపరిహారం పెంపునకు డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి చేసిన కృషి మరవలేనిదన్నారు. ఎన్నో దశాబ్ధాలుగా కలగా మారిన వికరాబాద్ – కృష్ణా రైల్వేలైన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా భూ సర్వేకు రూ. 430కోట్లు కేటాయించిందన్నారు. జిల్లా కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టులను చేపడుతున్నారంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని.. పచ్చకామేర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంటూ మంత్రి చురకలంటించారు. పేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా గోప్లాపూర్ వద్ద మినీ జురాల ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఇరు రాష్ట్రాల ఇరిగేషన్శాఖ మంత్రులు బోసు రాజు, ఉత్తమ్కుమార్రెడ్డి సమావేశమై చర్చించడం జరిగిందన్నారు. గోప్లాపూర్ వద్ద నీటిని ఎత్తిపోస్తూ భూత్పూర్, అక్కడి నుంచి ఊట్కూర్, జాయమ్మ చెరువు, కానుకుర్తి, దౌల్తాబాద్, బొంరాస్పేట, కొడంగల్ వరకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. చిట్చాట్లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు సుధాకర్, బండి వేణుగోపాల్, ఆర్టీఓ మెంబర్ పోశల్ రాజేశ్, డా.సాయిబాబా, సలీం, కతలప్ప ఉన్నారు. గోప్లాపూర్ వద్ద మినీ జూరాల ప్రాజెక్టు ఏర్పాటు దిశగా చర్యలు కమీషన్ల కోసం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం లేదు మీడియాతో చిట్చాట్లో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి -
అందుబాటులో సాగుకు సరిపడా యూరియా
నారాయణపేట: జిల్లాలో యాసంగి సాగుకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్ అన్నారు. బుధవారం జిల్లాలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా యూరియా నిల్వలను పరిశీలించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా ఎరువుల పంపిణీ జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నారాయణపేట మండలంలో 125.82 ఎంటీఎస్, దామరగిద్దలో 33.16, ధన్వాడలో 47.12, కోస్గిలో 83.84, కృష్ణాలో 99.82, మద్దూర్లో 38.43, మాగనూర్లో 74.88, మక్తల్లో 300.05, మరికల్లో 60.30, నర్వలో 31.73, ఊట్కూర్ మండలంలో 52.26 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. అన్ని సహకార సంఘాలు, ప్రైవేటు డీలర్ల వద్ద యూరియాతో సహా ఇతర అన్నిరకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎరువుల పంపిణీ కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి ప్రతి రైతుకు ఎరువులు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎక్కడైనా యూరి యా సరఫరాలో సమస్య ఏర్పడితే వెంటనే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలని రైతులకు సూచించారు. ఎవరైనా ఎరువుల కృత్రిమ కొరత సష్టించడం, అధిక ధరలకు విక్రయించడం, దారి మళ్లించడం వంటి అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
తగ్గిన నేరాలు!
నారాయణపేట: గతేడాది కంటే ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డా.వినీత్ వార్షిక క్రైం రిపోర్టును విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. 2024–25కు గాను రిపోర్టెడ్ కేసులు 10.5 శాతం పెరిగాయి. తీవ్రమైన నేరాలు 22 శాతం తగ్గగా.. కిడ్నాప్ కేసులు 4 శాతం పెరిగాయి. మహిళలపై జరిగే నేరాలు 12.5 శాతం, క్రైం అగనెస్ట్ ఉమెన్ 4శాతం, బాల్యవివాహాలు 40 శాతం తగ్గాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎంసీసీ వైలెన్స్ 12, పోల్ వైలెన్స్ 3, లిక్కర్ కేసులు 63, ఇతర కేసులు 2 నమోదయ్యాయి. సైబర్ నేరాలకు సంబంధించి 368 ఫిర్యాదులు అందగా.. 165 కేసులను పరిష్కరించారు. ఈ కేసుల్లో రూ. 43,74,618 గాను కోర్టు ఆదేశాల మేరకు రూ. 20.40 లక్షలు రికవరీ చేశారు. డయల్ 100కు 11,124 మంది సంప్రదించగా.. బ్లూ కోట్స్ పోలీసులు సత్వర సేవలు అందించారు. సీఈఐఆర్ ద్వారా రూ. 35.34లక్షల విలువైన మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. గంజాయికి సంబంధించి 20 మందిపై కేసులు నమోదు చేసి.. 12.675 కిలోలు సీజ్ చేశారు. అక్రమ మద్యం కేసులు 147 నమోదు కాగా.. 1526.57 లీటర్ల లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. 36 గేమింగ్, జూదం యాక్ట్లో 221 మందిపై కేసులు నమోదు చేశారు. నకిలీ విత్తనాలు అమ్మిన ఐదుగురిపై కేసులు నమోదు చేసి.. 300 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన 58 మందిపై కేసులు చేసి.. 612 క్వింటాళ్ల బియ్యం సీజ్ చేశారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 313 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో 169 ట్రాక్టర్లు, 73 టిప్పర్లు, 2 జేసీబీలు, 1 బొలేరో వాహనాలను సీజ్ చేశారు. పోలీసు సేవలకు పతకాలు.. ప్రజలు సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు గాను ఎస్పీ వినీత్ కొత్తగా డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతినెలా మొదటి వారంలో ప్రజలు 08506–281182 నంబర్ను సంప్రదించి సమస్యలను తెలియజేస్తున్నారు. జిల్లా పోలీసు సేవలను సంబంధితశాఖ గుర్తించి గోల్డ్, సిల్వర్, కాంస్య పతకాలను ప్రదానం చేసింది. సరికొత్త విధానాలతో ప్రజలకు పోలీసుశాఖ మరింత చేరువైందని ఎస్పీ వినీత్ చెప్పారు. 2026 నూతన సంవత్సరంలో డ్రగ్స్ నియంత్రణ, మహిళల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
‘వైకుంఠ’ శోభితం
నారాయణపేట ఎడ్యుకేషన్/మక్తల్: జిల్లావ్యాప్తంగా మంగళవారం వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం ఉత్తరద్వార దర్శనాలు కల్పించగా.. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఉత్తరద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని తన్మయం చెందారు. జిల్లా కేంద్రంలోని పళ్లవీధిలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయంతో పాటు సరాఫ్ బజార్ బాలాజీ మందిరం, సత్యనారాయణస్వామి ఆలయం, అశోక్నగర్ శ్రీమాత మల్లాంభిక ఆలయాలు భక్తులతో రద్దీగా కనిపించాయి. అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో మహా అభిషేకం, పుష్పాలంకరణ, తులసి అర్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మక్తల్ పట్టణంలోని నాగిరేశ్వరాలయంలో రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీపడమటి ఆంజనేయస్వామి, మల్లికార్జునస్వామి, కుంభేశ్వరుడు, నల్లజానమ్మ ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. -
అడిషనల్ కలెక్టర్గా ఉమాశంకర్ ప్రసాద్
నారాయణపేట: జిల్లా లోకల్బాడీ అడిషనల్ కలెక్టర్గా ఉమాశంకర్ ప్రసాద్ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల అడిషనల్ కలెక్టర్గా నియమించిన నారాయణ్ అమిత్ మలేంపాటి నియామకాన్ని రద్దు చేశారు. వికరాబాద్ జిల్లా తాండూర్లో సబ్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఉమాశంకర్ ప్రసాద్ను జిల్లా లోకల్బాడీ అడిషనల్ కలెక్టర్ (ఎఫ్ఏసీ)గా నియమించారు. హంసధాన్యం @ రూ.2,366 నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో మంగళవారం హంసధాన్యం క్వింటా గరిష్టంగా రూ. 2,366, కనిష్టంగా రూ. 2,005 ధర పలికింది. సోనధాన్యం గరిష్టంగా రూ. 2,735, కనిష్టంగా రూ. 1,801, ఎర్ర కందులు గరిష్టంగా రూ. 7,695, కనిష్టంగా రూ.5,411, తెల్లకందులు గరిష్టంగా రూ. 7,759, కనిష్టంగా రూ. 6,300 ధరలు వచ్చాయి. -
స్థానికం.. సంస్థాగతం!
నారాయణపేటపాలమూరులో కాంగ్రెస్కు కలిసొచ్చిన కాలం బుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 20253 జిల్లాల్లో ‘ఢీ’సీసీ.. ఈ ఏడాది తొలి నుంచి డీసీసీ అధ్యక్షుల ఎంపిక కసరత్తు కొనసాగింది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ఏఐసీసీ పరిశీలకులు అభిప్రాయాలు సేకరించారు. అనంతరం నవంబర్ 22న ఐదు జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించారు. నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో పాత నేతలు ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, ప్రశాంత్ కుమార్రెడ్డికి అవకాశం దక్కింది. మిగిలిన మూడు జిల్లాల్లోనూ డీసీసీ అధ్యక్షుల ఎంపిక చిచ్చు రేపింది. మహబూబ్నగర్లో సంజీవ్ ముదిరాజ్, వనపర్తిలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, గద్వాలలో రాజీవ్రెడ్డికి డీసీసీ పీఠం అప్పగించారు. కాంగ్రెస్: పై‘చేయి’.. అయినా డీలా.. మూడు విడతలుగా డిసెంబర్ 11, 14, 17న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అధిక సంఖ్యలో సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,678 సర్పంచ్ స్థానాలు ఉండగా.. ఏడు జీపీల్లో ఎన్నికలు జరగలేదు. మిగిలిన వాటిలో 964 మంది కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలుపొందారు. వనపర్తి, కొల్లాపూర్, జడ్చ ర్ల నియోజకవర్గాల్లో అధికార పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నాయకుల్లో నిరాశ అలుముకుంది. జడ్చర్ల, దేవరకద్ర, వనపర్తి ఎమ్మెల్యేలు అనిరుధ్రెడ్డి, మధుసూదన్రెడ్డి, మేఘారెడ్డికి తమతమ స్వగ్రామాల్లో ఎదురుదెబ్బ తగిలింది. పల్లె పోరులో పై‘చేయి’.. సత్తా చాటిన బీఆర్ఎస్ గతంతో పోలిస్తే పలు చోట్ల పుంజుకున్న బీజేపీ ‘హస్తం’లో చిచ్చు రేపిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉమ్మడి జిల్లాలో 10సార్లు పర్యటించిన సీఎం రేవంత్ వాకిటికి అమాత్య యోగం.. ముదిరాజుల్లో హర్షం పల్లె పోరులో పై‘చేయి’.. సత్తా చాటిన బీఆర్ఎస్ గతంతో పోలిస్తే పలు చోట్ల పుంజుకున్న బీజేపీ ‘హస్తం’లో చిచ్చు రేపిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉమ్మడి జిల్లాలో 10సార్లు పర్యటించిన సీఎం రేవంత్ వాకిటికి అమాత్య యోగం.. ముదిరాజుల్లో హర్షం గువ్వల బీజేపీకి జై.. బండ్లకు ఊరట


