నారాయణపేట రూరల్: రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) జిల్లా ప్రధానకార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక భగత్సింగ్ భవన్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 30వ తేదీ వరకు మండల అధికారులు, కలెక్టర్, వ్యవసాయశాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేయాలని పిలుపునిచ్చారు. ఎరువులు, విత్తనాల కొరత, నకిలీ విత్తనాలు, పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు, పెరుగుతున్న పెట్టుబడితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో సమస్యలు మరింత తీవ్రతరం అవుతున్నాయన్నారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, యూరియాను యాప్ ద్వారా బుక్ చేసుకునే విధానాన్ని రద్దు చేసి అవసరమైనంత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ఎరువుల ధరలను నియంత్రించి రైతులకు అందుబాటు ధరలో సరఫరా చేయాలని కోరారు. రైతులు పండించిన అన్నిరకాల వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, కొనుగోళ్లపై పరిమితులు విధించవద్దని డిమాండ్ చేశారు. పంట మార్పిడీని ప్రోత్సహించాలంటే అన్ని పంటలకు కనీస మద్దతు ధరకు కొనుగోలు హామీ ఇవ్వాలని, అదనపు ప్రోత్సాహకాలు ప్రకటించాలని కోరారు. రైతాంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించించారు. సమావేశంలో నాయకులు చెన్నారెడ్డి, నారాయణ, తాయప్ప, మల్లేష్, కనకప్ప, ఆశప్ప తదితరులు పాల్గొన్నారు.


