నారాయణపేట రూరల్: ఛత్రపతి శివాజీ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు భావితరాలకు స్ఫూర్తిదాయకమని నేరెడుగాం మఠ పీఠాధిపతి సిద్ధిలింగేశ్వరస్వామి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎర్రగుట్ట వద్ద నిర్మించనున్న శివాజీ మహరాజ్ అశ్వారూఢ విగ్రహం, స్మృతివనం నిర్మాణానికి భూమిపూజ గురువారం వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. నారాయణపేటలో శివాజీ విగ్రహ ఏర్పాటుకు యువత ముందుకురావడం అభినందనీయమన్నారు. స్మృతివనం పూర్తయిన అనంతరం పేటకు కొత్త చారిత్రక గుర్తింపు లభిస్తుందని, పర్యాటక, సాంస్కృతిక రంగాలకు కూడా ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. శివాజీ పరాక్రమం, ధర్మరక్షణ, స్వరాజ్య స్ఫూర్తి భావితరాలకు చేరవేసే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం సమాజానికి ఆదర్శప్రాయమని కొనియాడారు. లోకాయపల్లి సంస్థానం మహారాణి లక్ష్మమ్మకు శివాజీ మహరాజ్ అందించిన సహకారం చారిత్రక ప్రాధాన్యం కలిగిన అంశమని పేర్కొంటూ, ఆ చరిత్రను నేటి తరానికి పరిచయం చేసే ప్రయత్నంగా స్మృతివనం నిలవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు చిట్టెం అభిజయ్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండా సత్యయాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మంజుల, మదన్మోహన్రెడ్డి, నందూనామాజీ, రఘువీర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


