మరికల్: జిల్లాలో ఏటా వానాకాలం, యాసంగిలో వివిధ రకాల పంటల సాగుకు సంబంధించి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వ్యాపారం రూ.కోట్లలో సాగుతోంది. అయితే పలువురు డీలర్లు నిబంధనలను పట్టించుకోకుండా నాసిరకం విత్తనాలు, ఎరువులను ఎలాంటి రసీదులు లేకుండా రైతులకు అంటగడుతున్నారు. దీంతో వారికి పరిహారం దక్కని పరిస్థితి. ఈ క్రమంలోనే కేంద్రం కర్షకులను ఆదుకునేందుకు విత్తన చట్టాన్ని అమలు చేస్తోంది. కానీ ఎక్కడ కూడా ఇది సంక్రమంగా అమలు కావడం లేదు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు నామ్కేవస్తేగా తెల్ల కాగితంపై లెక్కవేసి చేతిలో పెడుతున్నారు. జిల్లాలో 200కు పైగా ఫర్టిలైజర్ దుకాణాలు ఉండగా.. ఒక్కో దుకాణంలో ఏటా సగటున రూ.15 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు వ్యాపారం సాగుతోందని అంచనా. కొందరు రైతులు నగదు, మరికొందరు ఉద్దెరపై కొనుగోలు చేస్తారు. ఈ లావాదేవీలు అత్యధికంగా రసీదు లేకుండానే సాగుతున్నాయి.
నిబంధనలు తప్పనిసరి..
విత్తన విక్రయ అధీకృత డీలరు స్టాక్ రిజిస్టర్లో ఎప్పటికప్పుడు నిల్వ చూపాలి. విత్తనాలు కొన్న సమయంలో సంబంధిత కంపెనీ, విత్తనం పేరు, లాట్ నంబరు, ధర రసీదులో రాసి రైతులకు తప్పనిసరిగా ఇవ్వాలి. సంచులపై ఉండే రంగుల వివరాలు పట్టిక ద్వారా తెలియజేయాలి.
చట్టం ఏం చెబుతుందంటే ..
కేంద్ర విత్తన చట్టం ప్రకారం డీలర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వ అధికారులకు ఉంటుంది. అడిగినప్పుడు నమూనాలు, ధ్రువీకరణ పత్రాలు చూపాల్సి ఉంటుంది. ప్రభుత్వం అనుమతి ఉన్నవి మాత్రమే విక్రయించాలి. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఎట్టి పరిస్థితుల్లో విక్రయించొద్దు. అట్టి విక్రయ దుకాణాలపై విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు.
రైతులు తీసుకోవాల్సినజాగ్రత్తలు..
అధీకృత డీలర్ వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలి.
పంట కాలం పూర్తయ్యే వరకు రసీదులు భద్రపర్చుకోవాలి.
ఏదైనా విత్తన సమస్య ఎదురైనప్పుడు వెంటనే వ్యవసాయాధికారులకు తెలియజేయాలి.
విత్తనాలు మొలకెత్తకపోయినా, పురుగు మందులు పనిచేయక పంట నష్టపోతే విత్తన రసీదు ఉంటే అది ఏ కంపెనీ, ఏ బ్యాచ్ అని గుర్తించి పరిహారం పొందే వీలుంటుంది.
ఒకవేళ నాసిరకం విత్తనాలతో రైతులు నష్టపోతే రసీదు ఆధారంగా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి పరిహారం పొందవచ్చు.
రసీదు ఇవ్వకుంటే వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగవేస్తున్నట్లు లెక్క.
విత్తనాలు, ఎరువుల కొనుగోలులో జాగ్రత్తలు తప్పనిసరి
విత్తన చట్టాన్ని తుంగలో తొక్కుతున్న డీలర్లు
జిల్లాలో 200కు పైగా పురుగు మందుల దుకాణాలు


