నారాయణపేట: ఎన్యూమరేషన్ ఫారాల సేకరణలో అలసత్వం ప్రదర్శిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక హెచ్చరించారు. గురువారం జిల్లాకేంద్రంలోని కుమ్మరివాడ, పళ్ల జంగిడిగడ్డలో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలతో పోలిస్తే జిల్లాకేంద్రంలో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, సేకరణ చాలా వెనుకబడి ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి బీఎల్వో రోజుకు కనీసం 100 పత్రాలను ఓటర్లతో పూరించి స్వీకరించాలని ఆదేశించారు. పత్రాలు నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొనే ఓటర్లకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా సూపర్వైజర్లు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు. కొందరు సూపర్వైజర్ల పనితీరు సంతృప్తికరంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పట్టణంలోని అన్ని వార్డుల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆమె వెంట తహసీల్దార్ అమరేందర్కృష్ణ, పుర మేనేజర్ అజీం, వార్డు అధికారులు ఉన్నారు.
అవసరాలకు అనుగణంగా ప్రణాళికలు..
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాలోని గ్రామపంచాయతీల వనరులు, అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. గురువారం జిల్లాకేంద్రం సమీపంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో మక్తల్, కృష్ణా, మాగనూర్, నర్వ, మరికల్, ధన్వాడ మండలాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ నిర్వహించగా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన 99 రోజుల ప్రగతి ప్రణాళిక మాదిరిగానే గ్రామపంచాయతీల్లో వచ్చే మూడేళ్లలో ఏయే పనులు చేయాలో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. మాస్టర్ రిసోర్స్ పర్సన్లు గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడానికి నిర్ణీత నమూనాను వివరించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణన్, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీఆర్డీఓ వెంకట్రాములు, వివిధ మండలాల ఎంపీడీఓలు ఎంపీఓలు పాల్గొన్నారు.


