నారాయణపేట: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై అపోహలకు తావివ్వొద్దని.. అర్హులైన ప్రతి ఓటరు ఈ ప్రక్రియలో భాగస్వామి కావాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కోరారు. ఎస్ఐఆర్–2026 కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గురువారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన 2కే రన్ను ఆమె జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన ర్యాలీ సత్యనారాయణ చౌరస్తా వరకు సాగింది. అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు అధికసంఖ్యలో పాల్గొని ఓటరు చైతన్య సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ఉద్దేశం ఓటర్ల పేర్లు తొలగించడం కాదని, మృతిచెందిన, డబుల్ నమోదులను తొలగించి ఓటరు జాబితాను మరింత కచ్చితంగా, ప్రామాణికంగా రూపొందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. వచ్చే నెల 24 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని.. బీఎల్వోలు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తారని, ఓటర్లు ఆ ఫారాలను పూర్తిచేసి తిరిగి సమర్పించడంతో తమ పేరు ఓటరు జాబితాలో కొనసాగుతున్నట్లు నిర్ధారించుకోవాలని సూచించారు. నెలరోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. 2కే రన్లో పాల్గొన్న వారందరికీ ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్, జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీఎస్పీ నల్లపు లింగయ్య, కలెక్టరేట్ ఏవో అనిల్, డీవైఎస్ఓ వెంకటేష్శెట్టి, డీపీఆర్వో రషీద్, సీఐ శివశంకర్, తహసీల్దార్ అమరేంద్ర కృష్ణ, వివిధ శాఖల అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


