జిల్లాలో రూ.115.86 కోట్ల వరి బోనస్ పెండింగ్
● రెండేళ్లుగా అన్నదాతల ఎదురుచూపులు
● గతేడాది 1.40 లక్షల మె.ట.
సన్నరకం వరి ధాన్యం కొనుగోలు
● ఈ ఏడాది 90,859 మెట్రిక్ టన్నులు
–8లో u
గతేడాది యాసంగిలో సన్నరకం వరి ధాన్యం విక్రయించగా రూ.20 వేల బోనస్ రావాల్సి ఉంది. ఈ ఏడాది కూడా యాసంగి ధాన్యానికి మరో రూ.25 వేల బోనస్ మొత్తం కలిపి రూ.45 వేలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఖాతాలో జమ కాలేదు. వెంటనే చెల్లించి ఆదుకోవాలి.
– నర్సింహులు, రైతు, మరికల్
బోనస్ డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. రైతులు ఆందోళన చెందొద్దు. రెండేళ్లకు సంబంధించిన బోనస్ నిధులు ప్రభుత్వం నుంచి విడుదలైన వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం.
– బాలరాజు,
జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి
నారాయణపేట: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే సన్నరకం వరి ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామన్న ప్రభుత్వ హామీ నమ్మి రెండేళ్లుగా యాసంగిలో సైతం రైతులు సాగు చేసి విక్రయించారు. 2025 యాసంగిలో రూ.460 కోట్లు, 2026 యాసంగి ధాన్యం డబ్బులు రూ.365 కోట్లు రైతుల ఖాతాలో జమచేసినా బోనస్ మాత్రం నేటికీ చెల్లించడం లేదు. గతేడాది యాసంగికి రూ.70.44 కోట్లు, ఈ ఏడాది యాసంగికి రూ.45.42 కోట్లు మొత్తం రూ.115.86 కోట్ల బోనస్ బకాయిలు పేరుకుపోవడంతో ఎప్పుడు చెల్లిస్తారా? అని రైతులు ఎదురుచూస్తున్నారు.
ఈ ఏడాది యాసంగిలో..
ఈ ఏడాది యాసంగిలోనూ జిల్లా రైతులు 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. సన్నరకం 1,81,998 మెట్రిక్ టన్నులు, దొడ్డురకం 62,815 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేసింది. జిల్లావ్యాప్తంగా 161 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి 22,769 మంది రైతుల నుంచి 1,53,076 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయగా.. అందులో 62,216 మె.ట. దొడ్డు రకం, 90,859 మె.ట. సన్నరకం వరి ధాన్యం కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి ధాన్యం డబ్బులు రూ.365 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేశారు. 2026 యాసంగి సన్నరకం వరిధాన్యానికి సంబంధించి రూ.45.42 కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ఖజానాలో నిధులు లేకపోవడంతోనే రైతులకు బోనస్ చెల్లింపుల్లో ఆలస్యమవుతోందనేది బహిరంగ రహస్యమే. వానాకాలం సీజన్ ప్రారంభమై నెలరోజులు అవుతోంది. పంటల సాగు కోసం పెట్టుబడులకు ఇబ్బందులు పడుతున్నమంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు బోనస్ బ్యాంకు ఖాతాలో జమకాకపోవడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు.
‘ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు కేశవరెడ్డి. మాగనూర్ మండలం వర్కూర్ గ్రామం. ప్రభుత్వం సన్నరకం వరి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తామని చెప్పడంతోనే సాగు చేశా. ధాన్యం అమ్మిన డబ్బులు వచ్చాయి.. కాని బోనస్ మాత్రం నేటికీ జమ కావడం లేదు. రెండేళ్ల బకాయిలు రూ.1.72 లక్షలు రావాల్సి ఉంది. ప్రభుత్వం బోనస్ డబ్బులు చెల్లిస్తే అప్పులు కొంతైనా తీరేవి.


