డూప్లికేటుగాళ్ల ఆగడాలు..! | - | Sakshi
Sakshi News home page

డూప్లికేటుగాళ్ల ఆగడాలు..!

Jul 20 2026 1:08 AM | Updated on Jul 20 2026 1:08 AM

విచారణతోనే మరిన్ని విషయాలు వెలుగులోకి..

మంత్రి ఇలాకాలో నకిలీ డీఏపీ విక్రయాలు?

వనపర్తి: నకిలీ ఎరువులు, విత్తనాల కట్టడికి వ్యవసాయ, పోలీసు శాఖలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్రమార్కులు కొత్తదారులు వెదుక్కుంటున్నారు. మొన్న సూర్యాపేట.. నిన్న హైదరాబాద్‌.. నేడు వనపర్తి జిల్లాలో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కాగా.. ఫర్టిలైజర్‌ డీలర్లే అక్రమ దందాకు సూత్రదారులని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. హైదరాబాద్‌ కేంద్రంగా ఈ దందాకు బీజం పడినట్లు అఽధికారులు భావిస్తున్నారు. డీఏపీ కొరతను ఆసరాగా చేసుకొని అక్రమార్జనే లక్ష్యంగా ఈ దందాకు తెర తీశారు.

జిల్లాలోని చిన్నంబావి మండలంలో ఏటా వర్షాకాలంలో మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తారు. ఓ కంపెనీకి చెందిన డీఏపీ వాడితే అధిక దిగుబడులు వస్తాయని వ్యవసాయశాఖ అధికారుల సూచనల మేరకు ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు మొక్కజొన్న విత్తేందుకు సిద్ధం చేసుకున్నారు. డీఏపీ కొరత తలెత్తడంతో వెల్టూరుకు చెందిన ఓ వ్యక్తిని ఆశ్రయించారు. ఆయన రైతులకేదో మేలు చేసినట్లుగా తనకు పరిచయం ఉన్న పెబ్బేరు మండలం గుమ్మడంకు చెందిన ఒక డీలర్‌, గద్వాలకు చెందిన వంశీధర్‌రెడ్డి అనే మరో డీలర్లతో సంప్రదింపులు జరిపారు. గద్వాల డీలర్‌ హైదరాబాద్‌ ఆటోనగర్‌ నుంచి గద్వాలకు చెందిన డీసీఎంలో 200 బస్తాల అదె కంపెనీకి చెందిన డీఏపీని వెల్టూరుకు శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో తీసుకొచ్చారు. రైతులు వీరన్నగౌడ్‌ 60 బస్తాలు, ప్రవీణ్‌కు 20 బస్తాలు దించుకున్నారు. మార్కెట్‌లో కొరత కారణంగా ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.1,350 ఉండగా రూ.1,550కి విక్రయించేందుకు ప్రయత్నించారు. ధర ఎక్కువగా ఉంది.. నాణ్యత ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఆయా రైతులు వ్యవసాయశాఖ అఽధికారులను అడిగే ప్రయత్నం చేశారు. తమకు తెలియకుండా మండలానికి డీఏపీ రావడం ఏమిటని ఏఓ డాకేశ్వర్‌గౌడ్‌ వెల్టూరుకు వెళ్లి చూడగా అక్కడ గద్వాలకు చెందిన డీసీఎం డ్రైవర్‌ పరశురాముడు డీఏపీ విక్రయిస్తూ కనిపించాడు. వే బిల్స్‌, ప్రభుత్వ అనుమతి పత్రాలు చూపించాలని ప్రశ్నించగా.. గద్వాలకు చెందిన వంశీధర్‌రెడ్డి సూచన మేరకు హైదరాబాద్‌లో లోడ్‌ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చినట్లు వివరించారు. ఏఓ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి 120 బస్తాల డీఏపీతో పాటు డీసీఎంను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఏఓ ఫిర్యాదు మేరకు ఛీటింగ్‌ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పట్టుబడిన డీఏపీ నకిలీదా, అసలుదా పరీక్షించేందుకు ల్యాబ్‌కు పంపించనున్నట్లు అధికారులు చెప్పారు. రైతులు డీఏపీ నాణ్యత కోసం చేసిన ప్రయత్నం ఓ పెద్ద అక్రమార్కుల ముఠా గుట్టును రట్టుచేసినట్లు అయింది.

రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత నియోజకవర్గం, మండలంలో నకిలీ ఎరువుల విక్రయాల గుట్టురట్టు కావడంపై ఆయన సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నమోదవుతున్న నకిలీ డీఏపీ ఘటనలపై ప్రభుత్వం, అధికారులు చిత్తశుద్ధితో విచారణ జరిపితే మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

కొరతను ఆసరాగా చేసుకొని

అక్రమార్జనే ధ్యేయంగా..

స్థానికులను మచ్చిక చేసుకొని

ఇద్దరు డీలర్ల రహస్య దందా

నాణ్యతన పరిశీలనకు అధికారులను పిలవడంతో విషయం వెలుగులోకి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement