కనీస వేతనాలకు నోచుకోని కార్మికులు
● జూన్ 1 నుంచి అమలుపై ఆశ.. జూలైలోనూ రాక నిరాశ
● మూడు జోన్ల ప్రకటనతో అయోమయం
● ఏళ్లుగా మారని బతుకులు
–8లో u
నర్వ: కార్మికుల సంక్షేమానికి అనేక చట్టాలు తీసుకొచ్చామని ప్రభుత్వాలు ఊదరగొడుతున్నా.. నేటికీ సరిగా అమలుకావడం లేదు. మిషన్ భగీరథ, గ్రామపంచాయతీ, మున్సిపల్, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, వీబీకే, స్కీం వర్కర్స్ ఏళ్లుగా వెట్టిచాకిరీ చేస్తూ అభద్రతతో జీవితం గడుపుతున్నారు. కనీస వేతన చట్టం ప్రస్తుత కాలానికి అనుగుణంగా సవరించకపోవడంతో చాలా నష్టపోతున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణాలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వ్యవస్థ సమూలంగా తీసేస్తామన్న పాలకులు ప్రభుత్వాలు ఏర్పడ్డాక ఆ ఊసే ఎత్తకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేట్రంగాల్లోని కార్మికులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఏళ్లుగా దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ఇదిలా ఉండగా రెండునెలల కిందట రాష్ట్ర ప్రభుత్వం వేజ్కోడ్–2019కి అనుగుణంగా కొత్త కనీస వేతన చట్టాన్ని రూపొందిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 1 నాటికి సవరించిన వేతనాలు జులై వేతనంతో అందుకుంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నా.. నేటికీ ఏ ఒక్క రంగానికి పూర్తిస్థాయిలో వేతనాలు పెరగలేదు.
తాజాగా సవరించిన వేతనాలు..
తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వందల సంఖ్యలో ఉన్న పరిశ్రమలు వారి షెడ్యూళ్లను రద్దుచేసి నైపుణ్య స్థాయి, భౌగోళిక ప్రాంతాల ఆధారంగా ఏకీకృత వేతన వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతోపాటు వేతన చెల్లింపులో పారదర్శకత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నగదు చెల్లింపులను పూర్తిగా రద్దుచేసింది. ఇకపై కార్మికులకు నెలవారీ వేతనాలు బ్యాంకుల ద్వారా ఎలక్ట్రానిక్ బదిలీ లేదా చెక్కురూపంలో మాత్రమే అందిస్తారు. కొత్త విధానంలో నెలవారీ వేతనాల లెక్కింపును 26 రోజుల పనిదినాల ఆధారంగా నిర్ణయించారు. వారాంతపు సెలవుల కారణంగా కార్మికులకు వేతన నష్టం జరగకుండగా ప్రభుత్వం రక్షణ కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రోజుకు ఎనిమిది గంటలు పని చేయాలని.. అదనపు పనికి వేతనం రెట్టింపు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
మూడు జోన్లుగా..
రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించింది. మున్సిపల్ కార్పొరేషన్లు జోన్–1, మున్సిపాలిటీలు జోన్–2, ఇతర ప్రాంతాలు జోన్–3గా విభజించారు.


