నారాయణపేట ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులు, విద్యార్థులు జీవ వైవిధ్యంపై అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యమని ఆర్జేడీ సోమిరెడ్డి అన్నారు. ఉపాధ్యాయ శిక్షణలో భాగంగా శనివారం జాజాపూర్ ఉన్నత పాఠశాలలో వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్ధులకు సాంఘికశాస్త్ర ఫోరం ఆలోచనతో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జీవవైవిధ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. సదాశివయ్య హాజరై ఉపాధ్యాయులు, విద్యార్ధులకు వేర్వేరుగా జీవ వైవిధ్యంలో పాముల పాత్ర సవివరంగా తెలియజేశారు. అదేవిధంగా వాటి ప్రాముఖ్యత.. ఏవి విషపూరితం, ఏవి విషరహితమైనవి, వాటి ప్రవర్తన, కాటు వేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర విషయాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆర్జేడీ మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు.


