నూతన కార్యవర్గం ఎన్నిక..
బీసీ జాగృతిసేన నారాయణపేట నియోజకవర్గ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీకాంత్, ప్రధానకార్యదర్శిగా ప్రసాద్తోపాటు మరికొందరు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. వీరికి నియామక పత్రం అందించి ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కురుమయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్, నాయకులు హర్షవర్ధన్, శివానంద్, ఆంజనేయులు, లాలప్ప, చందు, సంతోష్ పాల్గొన్నారు.
నారాయణపేట రూరల్: వెనకబాటుకు గురవుతున్న బీసీ విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేయాలని బీసీ జాగృతిసేన రాష్ట్ర అధ్యక్షుడు బి.కృష్ణయాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బీసీ బాలుర వసతిగృహాన్ని ఆయన సందర్శించి విద్యార్థులతో సమావేశమయ్యారు. వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బీసీ బాలుర కళాశాలకు వసతిగృహాలు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అద్దె భవనాల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, నాణ్యమైన భోజనం, తాగునీరు అందక అనారోగ్యం బారిన పడిన ఘటనలు చాలా ఉన్నాయని వివరించారు. మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచాలని, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ పూర్తిస్థాయిలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న బీసీ విద్యార్థులకు శిక్షణ, వసతి, అభ్యసన సామగ్రి అందించాలని, ప్రతి హాస్టల్లో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బీసీ విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.


